22, ఆగస్టు 2020, శనివారం

యేసు కృష్ణీయము - ద్వ్యర్థి కావ్యము

  కావ్య పరిచయము 


కావ్యము పేరు: 

యేసు కృష్ణీయము 

( ద్వ్యర్థి కావ్యము)


కవి : కీ. శే. గాడేపల్లి కుక్కుటేశ్వర రావు,శతాధిక  అష్టావధాని, విశ్రాంత ప్రిన్సిపాల్, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, తణుకు,రాజమండ్రి(ఆం. ప్ర. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత). 


పరిచయ కర్త:వట్టెం వెంకట రమణ


నేనీరోజు, మన సమూహములో బహుశా, ఇంతవఱకు  సమీక్షించబడని ఒక విశేష కవన ప్రక్రియ "ద్వ్యర్థి కావ్యము" ను సమీక్షించబోతున్నాను. 


ఒకే కావ్యానికి రెండు అర్థములు వచ్చేలా రచించినట్లయితే, ఆ కావ్యాన్ని ద్వ్యర్థి కావ్యము అంటారు గదా !.ద్వ్యర్థి కావ్యము చాలా విలక్షణమైన, కష్టభరితమైన ప్రక్రియ. 

16 వ శతాబ్దంలో పింగళి సూరన రాసిన రాఘవ పాండవీయం(రామాయణ, మహాభారత అర్థములలో),అదే శతాబ్దంలో రచింపబడిన హరిశ్చంద్ర నలోపాఖ్యానము (రామ రాజ భూషణుడు).... అంతే..... ఈ కోవకి చెందినవి మిక్కిలి అరుదు. 

పింగళి సూరన గారే చెప్పుకున్నారు "రెండర్ధంబుల పద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబు గాకుండు" అని..దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ద్వ్యర్థి కావ్యరచన ఎంత కష్టమో..  


16 వ శతాబ్దం తరువాత, 20 వ శతాబ్దం వఱకు, నాకు తెలిసింతవఱకు, ఈ  క్లిష్టప్రక్రియతో  కావ్యం రానేలేదు. తెలుగు సాహితీ వినీలాకాశంలో మళ్ళీ తళుక్కుమన్న ఈ కావ్య ధృవతార 20 వ శతాబ్దంలోనే.... 1979 లో ఈ యేసు  కృష్ణీయము  ద్వ్యర్థి గా ... 21 వ శతాబ్దంలో కూడా నేటివఱకు ఇంకొక ద్వ్యర్థి కావ్యం ఆవిర్భవించిన ప్రమాణం కనిపించదు.


కవి పరిచయం:


సుకవి,స్వర్గీయ శ్రీ గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారు, తమ 16 వ ఏట మొదలుపెట్టి,  వందకు పైగా అవధానములు చేసారు, వీరి అవధాన గురువులు, కొప్పరపు జంట కవులలో ఒకరికి కుమారులైన శ్రీ కొప్పరపు సీతారామ వరప్రసాద్ కవి; కుక్కుటేశ్వర రావు గారు తిరుపతి వేంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి వేంకటేశ్వర కవీంద్రుని అన్నగారి కుమారులు దివాకర్ల  వేంకటావధాని గారికి అనుంగు ప్రత్యక్ష శిష్యులు, అంతేవాసి. 

వారి గురుపరంపరకి కవిగారి  నమస్సులు.. ఆయన పద్యం లోనే అవధరించండి. 


సీ. 

చర్ల బ్రహ్మయశాస్త్రి సన్నిధిం జదివిరి 


తిరుపతి వేంకటేశ్వర కవీంద్రు 


లవ్వారి సన్నిధి నధ్యయనించె బిం


గళి లక్ష్మి కాంతమన్ కవి వరుండు 


వారి సన్నిధిని దివాకర్ల శ్రీ వేంక


టావధాని మనీషి యభ్యసించె 


దన్మహామహు సన్నిధానంబునం జేరి 


యే బఠించితి గుక్కుటెశ్వరుండ.


ఇంకా, "రెండు చల్లని మాటలు" అని, తన గుఱించి వారి  గురుదేవులు డా. దివాకర్ల వేంకటావధాని గారు చెప్పిన ఆప్త వాక్యాన్ని, ఇలా విన్నవించుకున్నారు కవి :


కం.

"నా కొమరులెవ్వరిటువలె


శ్రీకరమగు కవిత జెప్పు చెన్నెరుగరు - నీ


వా  కొఱత దీర్చినాడవ


యా ! కుక్కుట నామధేయ !ఆర్య విధేయా !

(డా. దివాకర్ల వేంకటావధాని)

          🌹🙏🙏🙏🌹

***********


ఈ యేసు కృష్ణీయములోని పద్యములన్నీ, ప్రతీ పద్యమూ యేసు పరముగాను, శ్రీ కృష్ణ పరముగాను రెండు అర్థములు  వచ్చునట్లు రచింపఁ బడ్డాయి.

"అన్ని మతముల సారమూ ఒక్కటే;

ఈ రెండు మతముల ప్రజలు, పరమత సహనంతో,  సామరశ్యముతో మెలగాలి" అనేదే కవి సందేశం.  


ఈ ద్వ్యర్థి "నవ" పద్యప్రబంధము. (మొత్తము  తొమ్మిది పద్యములు)


1. తే.గీ.


యేసు పరముగా:


మరియ  లోలత నెలలు సమాప్తి నమర


జంతు సాక్షిక నిర్బంధ శాలలోన


దేవ   కీలాభ మూర్తియై దేవదేవు


డవని బ్రభవించె దైవజ్ఞు లాత్మ నలర.



అర్థము: మరియ =మరియమ్మ యను కన్య, లోలతన్ =ఆందోళనతో,  నెలలు సమాప్తిన్ =గర్భవతియై నెలలు నిండుటచే,  అమర = ఒప్పియుండగా, 

జంతు సాక్షిక = పశువులు నిల్చి చూచుచున్న, నిర్బంధ శాలలోన= ఆ పశువులు బంధింపబడిన పాకయందు, దేవ = దైవ సంబంధమైన,కీలా = అగ్ని తేజస్సుతో, ఆభ = సమానమైన,మూర్తియై = ఆకారము కలవాడై, దేవదేవుడు = దేవతలకే దేవుడని చెప్పబడిన క్రీస్తు,అవనిన్ = భూమిపై,  దైవజ్ఞులు = దివ్య నక్షత్రము ననుసరించి వచ్చిన మువ్వురు తూర్పుదేశజ్ఞానులు, ఆత్మన్ = వారి వారి మనస్సులందు, అలర = సంతోషింపగా, 

ప్రభవించెన్ = జన్మించెను. 


తాత్పర్యము:

మరియమ్మ ఆందోళన చెందుచుండగా, నెలలు నిండినవి.అగ్ని తేజస్సుగల దేవదేవుడయిన యేసు పశువుల పాకలో ఆమె కడుపున జనించెను. ప్రభు జననమునకు తూర్పుదేశ  జ్ఞానులు సంతోషించిరి. 


కృష్ణ పరముగా:


తే.గీ.

మరి  యలోలత నెలలు సమాప్తి నమర


జంతు సాక్షిక నిర్బంధ శాలలోన


దేవకీ  లాభమూర్తియై దేవదేవు


డవని బ్రభవించె దైవజ్ఞు లాత్మ నలర.



అర్థము: నెలలు = తొమ్మిది మాసములు, మరి + ఆలోలతన్ = ఏమాత్రము భంగపాటు లేకుండ,   సమాప్తిన్ = నిండుటచే,అమర = ఒప్పియుండగా, 

జంతు-సాక్షిక = వసుదేవుడు కాళ్ళు పట్టుకొనిన గాడిద నిల్చి  చూచుచున్న, నిర్బంధ శాలలోన = చెఱసాలయందు, దేవకీ = దేవకీ దేవికి,లాభమూర్తియై = లభించినవాడై, దేవదేవుడు = దేవతలకే దేవుడైన విష్ణువు,అవనిన్ = భూమిపై,  దైవజ్ఞులు = దైవతత్త్వము నెఱిగిన అక్రూరుడు మొదలగువారు, ఆత్మన్ = వారి వారి మనస్సులందు,  అలర = సంతోషింపగా, 

ప్రభవించెన్ = జన్మించెను. 


తాత్పర్యము:

గర్భ విషయమున, నెట్టి తొట్రుపాటు లేకుండ నెలలు నిండినవి.ఎట్టెదుట గాడిద నిల్చి చూచుచున్న చెఱసాలయందు, విష్ణువు దేవకీదేవికి జన్మించెను. కృష్ణతత్త్వము నెఱిగిన అక్రూరాదులు సంతోషించిరి.


***********

2. .తే. గీ.


యేసు పరముగా:


హె హె ! హెరైదుడు, భూజాని, హేయబుద్ధి,


మాతులుడు, రేగి  శిశు పరంపరను దునిమె;


దైవమగు పట్టి మర్త్యుడౌ తద్విరోధి


కన్నులం గప్పి పితతోడఁ గదలి చనియె.


అర్థము:


హె హె ! = హి హీ !(పరిహాస వాచకము)

హెరైదుడు =హెరోదు అనునతడు, భూజాని =ఆ దేశపు రాజు, హేయబుద్ధి = నీచబుద్ధి గలవాడు 


మా + అతులుడు =లక్ష్మి చే (సంపదచే) సాటిలేనివాడు, రేగి = విజృంభించి, శిశు పరంపరను = (రెండేండ్ల వయస్సుకు లోబడియున్న) బిడ్డల నెల్లరను,  తునిమెన్ = చంపించెను, 


దైవము +అగు = దేవుడైన, పట్టి = శిశువు (యేసు), మర్త్యుడౌ = మరణ శీలుడై, కేవలము నరుడైన,  తత్ + విరోధి = ఆ శత్రువు యొక్క (హేరోదు యొక్క), 


కన్నులన్ +కప్పి = కన్నులకు మాయ కల్పించి, పితతోడన్ = తండ్రితో (జోసెఫుతో),

కదలి చనియెన్ = వెడలిపోయెను. 


తాత్పర్యము:

హేరోదు రాజు నీచబుద్ధి గలవాడు, సాటిలేని సంపద గలవాడు.అప్పటికి రెండేండ్ల వయస్సునకు లోబడియున్న బిడ్డల నెల్లరను జంపించెను. కానీ, యేసు దైవము, విరోధి - - మానవమాత్రుడు. కావున హేరోద్ రాజు కన్నులుగప్పి,యేసు, తండ్రి వెంటఁ గదలి ఎటకో వెడలిపోయెను. 


2. .తే. గీ.


కృష్ణ పరముగా:


హె హె హె ! రైదుడు, భూజాని, హేయబుద్ధి,


మాతులుడు, రేగి  శిశు పరంపరను దునిమె;


దైవమగు పట్టి మర్త్యుడౌ తద్విరోధి


కన్నులం గప్పి పితతోడఁ గదలి చనియె.


అర్థము:


హె హె హె = హి హి హీ !(పరిహాస వాచకము)

రైదుడు = (ఆస్రితులకు) ధనముల నిచ్చువాడు,భూజాని = రాజు, హేయబుద్ధి = నీచబుద్ధి గలవాడు 

మాతులుడు = కృష్ణుని మేనమామయైన కంసుడు, రేగి = విజృంభించి, శిశు పరంపరను = దేవకీదేవి బిడ్డల నెల్లరను,  తునిమెన్ = ఖండించెను, 

దైవము+అగు = దేవుడైన, పట్టి = శిశువు (కృష్ణుడు), మర్త్యుడౌ = మరణశీలుడైన, తత్ + విరోధి = ఆ శత్రువైన కంసునియొక్క, 

కన్నులన్ +కప్పి = కన్నులకు మాయ కల్పించి, పితతోడన్ = తండ్రియైన వసుదేవునితో,

కదలి-చనియెన్ = వెడలిపోయెను. 


తాత్పర్యము:

ఆస్రితులకు ధనములనిచ్చు రాజును, మేనమామయునైన కంసుడు నీచబుద్ధి గలవాడు.దేవకీ దేవి బిడ్డలను వరుసగా ఖండించెను. కానీ, దైవమైన శ్రీకృష్ణుడు మరణశీలియైన  కంసుని కన్నులకు మాయ కల్పించి, తండ్రియైన వసుదేవునితోఁ గదలి తప్పించుకొని పోయెను. 

***********

3. తే.గీ.


యేసు పరముగా:


ఆతడానంద జనకత  నల్ల పెరిగి,


యేసు జనరక్షకఖ్యాతి నెసఁగి, గొల్ల


డై   నిజాధీన పశువుల నరసి కాచి


కొనుచు విహరించెఁ గొండల గోనలందు.


అర్థము:


ఆతడు = ఆ బిడ్డడు,ఆనంద జనకతన్ = ఆనందము చేకూర్చువాడగుచు, అల్లన్ = క్రమముగా,  పెరిగి = ఎదిగి, 

యేసు = యేసు అను పేరుచే   జనరక్షక - ఖ్యాతిన్ = జనులకు "రక్షకుడు" అను కీర్తిచేత,   ఎసఁగి = ఒప్పి, గొల్లడై = గొల్లవారి వృత్తి నవలంబించినట్టివాడై, నిజ +  అధీన = తన వశమైయున్న,  పశువులన్ = గొర్రెలను, అరసి = జాగ్రత్తగా జూచి,కాచి కొనుచు = కాపాడుకొనుచు,కొండల గోనలందు = కొండ కోనలలో, విహరించెన్ = సంచరించెను.


తాత్పర్యము:

ఆ బిడ్డడు ఎల్లరకు ఆనందము చేకూర్చుచు పెరిగెను.యేసు అను పేరుగల్గి, జన రక్షకుడను కీర్తిని గడించి, గొల్లవానివలె గొఱ్ఱెలను కాచుకొనుచు కొండలలో కోనలలో విహరించెను.


3. తే.గీ.


కృష్ణ పరముగా:


ఆత   డా   నందజనకత  నల్ల పెరిగి,


యే,  సుజన రక్షక  ఖ్యాతి నెసఁగి, గొల్ల


డై   నిజాధీన పశువుల నరసి కాచి


కొనుచు విహరించెఁ గొండల గోనలందు.


అర్థము:


ఆతడు = ఆ బిడ్డడు, ఆ = ఆ విధముగా, నంద జనకతన్ = నందుడే జనకుడుగా గల్గియుండి (అనగా నందునకు కుమారుడై), అల్లన్ = క్రమముగా,పెరిగియే = ఎదిగిన వాడగుచునే, 

సుజనరక్షకఖ్యాతిన్ = సుజనులను రక్షింపగలడను కీర్తిచే,   ఎసఁగి = ఒప్పి, గొల్లడై = గొల్లవాడై, నిజ + అధీన = తన వశము నందుండు,  పశువులన్ = ఆవులను, అరసి = జాగ్రత్తగా జూచి,కాచికొనుచున్ = త్రోలి  కాపాడుకొనుచు, కొండల గోనలందు = కొండ కోనలలో, విహరించెన్ = సంచరించెను.


తాత్పర్యము:

ఆ బిడ్డడు నందుడే తండ్రిగా పెరిగెను.సుజన రక్షకుడను కీర్తిని గడించి, ఆవులను కాచుకొనుచు కొండలలో కోనలలో విహరించెను.


***********


4. కందము


యేసు పరముగా:



శ్రీకలిత విశ్వరూప


ప్రాకట దర్శనము గ్రుడ్డివానికి నిడె  సు


శ్లోకుండు, బాపురె ! యహో


వా  కన్నయ్యకు సముండు ప్రభుడు గలండే !


అర్థము:

సుశ్లోకుండు = మిక్కిలి కీర్తింప దగినవాడు, 

శ్రీకలిత = శోభావంతమైన,  విశ్వ = ఈ ప్రపంచము యొక్క, రూప = ఆకారమును, 

ప్రాకట -దర్శనము = చక్కగా దర్శింపగల చూపును, గ్రుడ్డివానికిన్ + ఇడె = ఒకానొక అంధునకిచ్చెను,   

బాపురె ! = ఔరా !, 

యహోవా - కన్నయ్యకు = యెహోవా కుమారుడైన యేసునకు,

సముండు = సాటియైనవాడు, 

ప్రభుడు = దైవము, కలండే != ఎక్కడైననున్నాడా !(లేడనుట).


తాత్పర్యము:

మిక్కిలిగా కీర్తింపదగిన యేసు, ఒకానొక అంధునకు ప్రపంచమును  దర్శించు నిమిత్తము చూపునొసంగెను.ఆహా ! యెహోవా కుమారుడైన యేసునకు సాటి వచ్చు దైవమే లేడు. 


4. కందము


కృష్ణ పరముగా:



శ్రీకలిత విశ్వరూప


ప్రాకట దర్శనము గ్రుడ్డివానికి నిడె  సు


శ్లోకుండు, బాపురె ! యహో !


వా ! కన్నయ్యకు సముండు ప్రభుడు గలండే !


అర్థము:

సుశ్లోకుండు = మిక్కిలి కీర్తింప దగినవాడు, 

శ్రీకలిత = శోభావంతమైన,  విశ్వరూప = (తనయందలి) విశ్వరూపము యొక్క,

ప్రాకట -దర్శనము = చక్కగా దర్శింపగల చూపును, గ్రుడ్డివానికిన్ + ఇడె = ధృతరాష్ట్రునకు ప్రసాదించెను,   

బాపురె ! = ఔరా !, 

అహో ! = ఆహా !, 

వా ! = వహ్వా !(ఈ మూడును ప్రశంసా వాచకములు),

కన్నయ్యకు - సముడు = కృష్ణునకు సాటి యైనవాడు,

ప్రభుడు  కలండే != దైవము కలడా !(లేదనుట).


తాత్పర్యము:

కీర్తింప దగిన శ్రీకృష్ణుడు మహా శోభావంతమైన తన విశ్వరూపమును ధృతరాష్ట్రునకు జూపెను. ఆహా ! కృష్ణునకు సాటియైన దైవము మఱొకడు లేడు కదా !


***********


తక్కిన ఐదు ద్వ్యర్థి పద్యములను,సమూహ ప్రణాళికానుగుణముగా, వచ్చే శని, ఆది వారములలో మీతో పంచుకుంటాను.

(సమూహ నిర్వాహకులు అనుమతిస్తే,రేపు పంచుకోడానికి ప్రయత్నించగలను)


మీ అమూల్యమైన సలహాలను, సూచనలను తెలియజేయవలసినదిగా ప్రార్ధన. మన సమూహములో, ఇదే నా మొట్టమొదటి కావ్య సమీక్ష.


చివరిగా,ఈ కవిగారు, నాకు స్వయానా మేనమామ, నా శ్రీమతికి నాన్నగారు అని సవినయంగా, సగర్వంగా తెలియఁ జేసుకుంటున్నాను.


        వట్టెం వెంకట రమణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...