"ఆముక్తమాల్యద"
ఈ పేరే ఎంతో అందంగా, హుందాగా ఆసక్తిగా వినిపించేది ఎప్పుడూ
"ఆ ..ముక్త... మాల్యద" అంటే ఏమిటి ??
"ఆముక్త" = అలంకరించుకోబడిన
"మాల్య" = పూలదండ
"ద" = ఇచ్చినది
"ప్రబంధం" - వివరణ
"ప్రబంధం" అంటే ఏమిటో తెలిసినవారు ఈ చిరు వ్యాసం చదవక్కరలేదు
మామూలు కావ్యాలకి, ప్రబంధాలకి ఉన్న వ్యత్యాసం ఏమిటి కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను
అద్భుతమైన పద బంధంతో ఉన్న రచనను ప్రబంధం అంటారు. కావ్యాలలో ప్రబంధం స్థాయి వేరు.
పురాణేతిహాసాల నుంచి ఒక చిన్న కథను గ్రహించి, కవుల మహత్తరమైన కల్పనలతో స్వతంత్ర కావ్యం అన్నట్లుగా భావింపచేయడమే ఈ ప్రబంధము.
"ఏకనాయకాశ్రయత్వం", "అష్టాదశ వర్ణనలు" ఉండాలి, శృంగారం రసరాజంగా ఉండే కావ్యాలు ప్రబంధాలు. అలంకారికమైన శైలి ఉండాలి, సజీవ పాత్ర చిత్రణ ఉండాలి.
కాని అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే అనువాదం కాకుండా, స్వతంత్ర రచన అన్నట్లు ఉండాలి. అందుకని మూల కావ్యాల్లో లేని రసరమ్యమైన వర్ణనలు కనిపిస్తాయి.
నవరసాలతో కూడిన అష్టాదశ వర్ణనలు అంశాలు ఇవి :
పుర, గిరి, వన, నది, సముద్రము, ద్యూతము, వివాహము, విరహం, యుద్ధము, ఋతువులు, ప్రాతః సంధ్యా కాలాలు, సూర్యోదయ సూర్యాస్తమాన, మధుపానం, రాయబారం, స్త్రీ పురుషుల వర్ణనలు, చతురంగ సైన్యాలు, వేదాంతం ఇత్యాది విషయాలు తెలిపే వర్ణనలు ప్రబంధాలు
కాబట్టి, పరిచయం చేయబోయే పద్యాలలో ఆ వివరణాలన్నీ వస్తున్నాయో లేదో మీరు గమనిస్తూ ఉండగలరు.
"ఆముక్తమాల్యద" – మొదటిభాగం
ఒక భక్తురాలు తాను ధరించిన పూలదండను తరువాత భగవంతుని మెడలో వేసిన సందర్భములోని కథ.
భక్తి ఎంత స్వచ్ఛమైనదో, అమాయకమైనదో చెప్పే అందమైన కథ ఆముక్తమాల్యద ...
శబరి స్వామికి ఎంగిలి పండ్లు ఇచ్చింది కదా...
అటువంటి పవిత్రమైన భక్తి. నిష్కల్మషమైన అనురక్తి
శ్రీ కృష్ణదేవరాయలు 1474 ప్రాంతాల్లో పుట్టి, 1509లో చక్రవర్తి అయ్యారు, ఎన్నో దిగ్విజయాలు అనంతరం, 1516 లో బందరు సమీపంలోని కృష్ణాతీరంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని సేవించారు
ఏకాదశీ వ్రతం చేస్తున్న సందర్భం (ఈ శ్రీకాకుళం విశాఖపట్టణం దగ్గరిది కాదు, బందరు దగ్గర మోపిదేవి క్షేత్రానికీ, కూచిపూడి దగ్గరలోని గుడి).
ఆ పుణ్యదినాన, రాత్రి నాలుగో జామున ఆ “ఆంధ్ర జలజాక్షుడు” అతని కల్లో ప్రత్యక్షమయ్యారని రాయల వారు చెబుతూ అవతారికలో రెండు సీసములు మరియు ఒక అందమైన ఉత్పలమాలలో మహాద్భుతంగా చెబుతారు
సీ.
నీలమేఘముడాలు డీలు సేయఁగఁ జాలు మెఱుఁగుఁ జామనచాయ మేనితోడ
నరవిందములకచ్చు లడఁగించు జిగి హెచ్చు నాయతం బగు కన్నుదోయి తోడఁ
బులుఁగురాయనిచట్టుపలవన్నె నొరవెట్టు హోంబట్టుజిలుఁగు రెంటెంబుతోడ
నుదయార్కబింబంబు నొఱపు విడంబంబు దొరలంగనాడు కౌస్తుభముతోడఁ
తే.
దమ్మికే లుండఁ బెఱకేల దండ యిచ్చు
లేము లుడిపెడు లేఁజూపు లేమతోడఁ
దొలఁకు దయఁ దెల్పు చిఱునవ్వుతోడఁ గలఁ ద
దంధ్ర జలజాక్షుఁ డిట్లని యాన తిచ్చె.
తే
మఱియు రసమంజరీ ముఖ్య మధుర కావ్య
రచన మెప్పించుకొంటి గీర్వాణ భాష
ఆంధ్రభాష యసాధ్యంబె యందు నొక్క
కృతి వినిర్మింపు మిక మాకుఁ బ్రియము గాగ.
అలా కలలోకి వచ్చిన ఆంధ్రవిష్ణువు ఏమని ఆనతినిచ్చాడంటే - మదాలస చరిత్ర, సత్యావధూ ప్రీణనము, సకల కథాసార సంగ్రము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన ఎన్నో మధుర కావ్యాలని సంస్కృత భాషలో రచించి మెప్పించావు.
అలాంటి నీకు ఆంధ్రభాష అసాధ్యమా? ఆ భాషలో కూడా ఒక కృతి నిర్మించి మాకు సంతోషాన్ని కలిగించు
ఉ ll
ఎన్నిను గూర్తునన్న విను మే మును దాల్చిన మాల్య మిచ్చున
ప్పిన్నది రంగంమం దయిన పెండిలి సెప్పుము మున్ను గొంటి నే
వన్ననదండ యొక్క మగవాడిడ, నేను దెలుంగు రాయడన్
గన్నడ రాయ! యక్కొదువ గప్పు ప్రియా పరిభుక్త భాక్కథన్ !
ఓ కన్నడరాయా! నా సంతోషం కోసం నా కథతో తెలుగులో ఒక కృతిని రచించుము. నా గురించి ఉన్న ఎన్నో కథలలో దేని గురించి రాయాలంటావా? తాను ముందు ధరించిన పూలమాలలను నాకు సమర్పించిన "చూడికుడుత్త నాంచారి" అని పిలువబడిన చిన్నారి గోదాదేవితో నా పరిణయం గురించి చెప్పు.
పూర్వము ఒక మగవాడిచ్చిన పూలదండ ఏవగింపుతో తీసుకున్నాను. ఆ కొఱత తీరునట్టుగా నా ప్రియురాలు గోదాదేవి చేత విడువబడిన మాలను నేను పొందిన వైనము వివరింపుము. నేనేమో తెలుగు రాయణ్ణి, నువ్వేమో కన్నడ రాయడివి. అంచేత నువ్వే ఆపని చెయ్యడానికి తగినవాడవు. అని కోరాడు. ఇక్కడ ఆ మగవాడెవడో, ఆ కథ ఏమిటో నాకు తెలియదు
ఆ తరువాత తెలుగు భాష ఔన్నత్యం వర్ణించే మూడు అందమైన పద్యాలు కనిపిస్తాయి వాటిల్లోనే మొదటిదైన ఈ పద్యం తెలియని తెలుగువాడు ఉండరు కదా
తెలుగదేల యన్న, దేశంబు తెలుగేను
దెలుగు వల్లభుండ దెలుగొకండ
యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు దెలుగు లెస్స
ఇక్కడితో అవతారిక మాత్రమే పూర్తి అయ్యింది ఇక తరువాతి భాగాల్లో కదా సంగ్రహం, విలుబుత్తూరు లోని....
****************
మొత్తం కావ్యం నిండా ఏడు ఆశ్వాసములు , ""877 అందమైన పద్యాలు"
ఆముక్తమాల్యద - రెండవభాగం
మొదటి ఆశ్వాశంలోని ముఖ్యమైన వర్ణనలు
ఆముక్తమాల్యద కథ పాండ్యదేశంలోని విల్లిపుత్తూరు (ప్రస్తుత తమిళనాడు) పట్టణంలో జరుగుతుంది / ప్రారంభమవుతుంది
ఈ కావ్యం ప్రథమాశ్వాసం విల్లిపుత్తూరు పట్టణ వర్ణనంతో, అందులో నివసించే విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుని పరిచయంతో మొదలౌతుంది.
ఆముక్తమాల్యద కథ పాండ్యదేశంలోని విల్లిపుత్తూరు పట్టణంలో జరుగుతుంది.
ఈ కావ్యం ప్రథమాశ్వాసం విల్లిపుత్తూరు పట్టణ వర్ణనంతో, అందులో నివసించే విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుని పరిచయంతో మొదలౌతుంది. విల్లిపుత్తూరు పట్టణ వర్ణనతో మొదలుపెట్టాడు. ముందుగా ఆ పట్టణంలోని సౌధాలు ఈ విధంగా ఉన్నాయి.
మ
లలితోద్యాన పరంపరా పిక శుకాలాప ప్రతిధ్వానము
ల్వలభీ నీల హరి న్మణీ పికశుక స్వానభ్రమం బూన్ప మి
న్నులతో రాయు సువర్ణ సౌధముల నెందుం జూడఁ జెన్నొంది శ్రీ
విలుబుత్తూరు సెలంగుఁ బాండ్య నగరోర్వీ రత్నసీమంతమై
భావము
ఉద్యానవనాల లో కనిపించే అందమైన చిలుకలు, కోయిలలూ, ఆకాశాన్ని అంటే బంగారు మేడలు.. ఆ శుక పికాలాపాలతో ఆ హర్మ్యాలు ప్రతిధ్వనిస్తున్నాయి
ఆ ద్వనులకు ఆ వీధులవెంట నడిచేవాళ్లు తలలెత్తి చూస్తే ఆ మేడలలో అలంకారానికి అమర్చిన నీలములతో చెక్కిన కోయిలలు, పచ్చలతో చెక్కబడిన చిలుకలే కూస్తున్నట్టుగా భ్రమ కూడా కలుగుతుంది ... ఈ విల్లిపుత్తూరు పట్టణం పాండ్యదేశమందు భూమి అనే స్త్రీ పెట్టుకున్న పాపిట బొట్టులా ప్రకాశిస్తుంది ఎంత అందమైన ఊహ ...
ప్రబంధ సాహిత్య సంప్రదాయమైన ఋతువర్ణన ఆముక్తమాల్యదలో కూడా ఈ ఆశ్వాసంలో కనిపిస్తుంది.
అయితే, మిగిలిన కవులకు భిన్నంగా రాయల వర్ణనలో సామాన్యమైన విషయాలు, సామాన్య జనుల జీవితాలలో కనబడే చిన్న చిన్న సంగతులు చోటుచేసుకుంటాయి.
విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే సద్బ్రాహ్మణుడు తన న్యాయార్జితమైన సంపదతో ఏడాది పొడవునా అన్నదానం చేసి ఆదరించేవారు .
శ్రీ కృష్ణదేవరాయలు వారు ఆ వైభవం స్వయంగా చూశారా అన్న రీతిలో మహత్తరమైన పద్యాలు కనిపిస్తాయి. ఈ పద్యం జాగ్రత్తగా చదవగలరు
చం
గగనము నీరుబుగ్గ కెనగా జడివట్టిననాళ్లు భార్య కన్
బొగ సొరకుండ నారికెడంపుంబొఱియల్దవిలించి వండ న
య్యగపల ముంచిపెట్టుఁ గలమాన్నము నొల్చినప్రప్పు నాలు గే
న్పొగపినకూరలున్ వడియముల్ వరుగుల్ పెరుగున్ ఘృతప్లుతిన్
భావము
వానాకాలం కదా; ఆకాశం నీటి ఊటలాగా (నీరుబుగ్గ) లాగా మారి ముసురుపట్టింది .
ఈ కాలంలో ఎండు కట్టెలు దొరకడం చాలా కష్టం. అలాటి వాతావరణంలో తడిసిన కట్టెలతో వంట చేస్తే తన భార్యకు కళ్ళలో పొగ చేరుతుందని, (ఇక్కడ భార్య మీద ఎంత ప్రేమ వర్ణించే సంఘటనో కదా అనిపిస్తుంది .... సిసలైన Romance ఇది)
విష్ణుచిత్తుడు నీరు తీసేసి ఎండబెట్టిన కొబ్బరికాయల చిప్పలతో పొయ్యి వెలిగిస్తాడు.
ఆతడి సహధర్మచారిణి వివిధ రకములైన శాకములు తయారు చేస్తుంది. కొబ్బరికాయ చిప్పలనే గరిటలుగా వరి అన్నము, పొట్టు తీసిన పప్పు బద్దలతో వండిన పప్పు, నాలుగైదు తాళింపుకూరలు, వడియాలు, వరుగులు (ఎండబెట్టిన కూరలు) , పెరుగు, నెయ్యితో (ఘృతప్లుతి ఎంత గొప్ప చమత్కారమో కదా)
ఈవన్నీ కలిపి అతిథులకు వడ్డిస్తాడు.
***********
ఆముక్తమాల్యద - మూడవ భాగము
(ద్వితీయాశ్వాసము-మొదటిభాగం )
అంశములు :
ముధురా నగరి వైభవము, పుష్పలావికల వయ్యారాలు, ప్రజల ధరమ నిరతి, గ్రీష్మఋతువు వర్ణన, పాండ్య రాజు దగ్గరకు విష్ణుచిత్తుని ఆగమనం ఇత్యాది అంశాలు
ప్రబంధాలలో అష్టాదశ వర్ణనలు గురించి తెలిసిన విషయమే... మరి ఒక మహారాజు ఒక నగరం వైభవం, ఆకాశ హర్మ్యాలు, అందమైన సౌధాలు వర్ణిస్తే ఎలా ఉంటుందో అన్న ఉత్సుకత సహజమే
ద్వితీయాశ్వాసంలో ఒక పది వర్ణనలు కనిపించినా, కొన్ని పద్యాలు మాత్రమే మీకు పరిచయం చేయబోతున్నాను
చ.
అడుగున నుండియు నృదిలమై చద లంటెడుకోట నొప్పు ప్రో
ల్చెడనికడంక దంచనపుఁ జేతుల గంగను కాసెఁ దూఱంగా
నడుమన యున్కిఁజేసి యల నాకపురిన్ సరికై పెనంగి లా
వెడలఁగఁ బట్టివ్రేయుటకు నెత్తైనన న్జను మల్లుపోరునన్.
భావము
మధురాపురంలోని కోట పునాదులనుండి ప్రాకారాల వరకు మిక్కిలి బలిష్టంగా నిర్మించబడింది. దాని ప్రాకారాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. ఆకాశగంగ స్వర్గాన్ని చుట్టుకుని వలయాకారంగా ఉంటుంది. అది ఎలా కనిపిస్తుందంటే స్వర్గమనే యోధుడు గంగను "కాసెగా" (నడుముకు చుట్టుకునే వస్త్రం) చుట్టుకున్నట్టుగా ఉంది.
ఇక కోట ప్రాకారం పైన ఉన్న పొడవైన ఫిరంగులు (దంచనము) మధురాపురమనే మల్లయోధుడి దీర్ఘబాహువులుగా ఉన్నాయి. సాధారణంగా మల్లయుద్ధంలో బలిష్టుడైన యోధుడు వైరియోధుడి నడుముకు ఉన్న కాసెను పట్టుకుని ఎత్తి పడవేస్తారు. అదే విధంగా మధురాపురమనే యోధుడు స్వర్గమనే వైరియోధుడి నడుముకు కాసెగా ఉన్న గంగను పట్టుకుని ఎత్తి పడవేయడానికి చాచిన చేతుల్లా ఉన్నాయట ఆ దంచనాలు
( గొప్ప పొడవైన ఆయుధ విశేషం..ఫిరంగి లాగా ). కోట ప్రాకారాలు స్వర్గాన్ని తాకుతాయి అని చెప్పడం వేరు... ఇంత మహత్తరంగా వివరించడం వేరు .
ఇక్కడ ఇద్దరు యోధులను గురించి ప్రస్తావిస్తారు రాయల వారు. గంగను కాసెగా (గోచీ లాగా) చుట్టుకున్న స్వర్గం లో ఒకడు, మధురాపురమనే జెట్టి ఇంకొకడు. కోట ప్రాకారాలు ఎంత పొడవైనవో మాత్రమే కాక, మధురాపురంలోని కోట ఎంత శత్రుదుర్భేధ్యంగా ఉన్నదో కూడా చెప్పే విశేషాలంకారాలు ప్రయోగం అద్భుతం .
ఇటువంటి వర్ణనే ఇంకొకటి చూద్దాము
తే. గీ
తరుణశైవాల జలజపత్రముల వొదువ
మరకతచ్చాయ బొల్చు తత్పరిఖ జలము
కోట బంగారు పేయుట కొఱకు మున్ను
బ్రహ్మ పిడిచిన మందాకు పస రసంగ
ఇంకా కొద్దిగా ప్రౌఢమనోహర వర్ణనలు
ఉదుటుగుబ్బల గల తల్పుటురము సూచి
గందపట్టెల సూచి, బంగారు సూచి
వీటి వాకిట చోటనే విడువఁకెపుడు
సూట్లు వెట్టుచూ సుందర సోమరవులు
ఈ వర్ణన చదువుతుంటే మీకు అన్నమయ్య కీర్తన ఉదుటు గుబ్బల సరము లుయ్యాలలూగ పదిరి కంకణరవము బహుగతులమ్రోగ వొదిగి చెంపల కొప్పు లొక్కింత లీగ గుర్తు రావడం అత్యంత సహజము
పుర వర్ణనలు తో అలరారే ఈ పద్యాల వైభవం చూడండి... పద్యంలోని చమత్కృతి గమనిస్తే ఆహా అని అనిపించక మానదు
మ ll
స్థిరసౌధాగ్రవిహారి యౌవతరతిచ్చిన్నాచ్ఛహారస్ఫుర
ద్గురుముక్తావళిఁజేటిక ల్విరులతోఁ గూడంగఁ ద్రోయ, న్నిజో
దరలగ్నం బగుదాని, నెమ్మొగి లదస్థ్సంబై తఱిన్ రాల్ప, నా
కర మభ్రం బని యండ్రుగా కుదధిఁ దక్క న్బుట్టునే ముత్తెముల్
భావము
పుర వర్ణన అంటే మేడలు ఆకాశ హర్మ్యాలు అని చెబితే సరిపోదు... ఆ నగరంలో విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుందో కూడా చెప్పే పద్యం ఇది ఆ ఆకాశ హర్మ్యాలలో స్త్రీల కేళీ విహారాలలో, అనురాగ డోలికలలో ఉన్నప్పుడు వారి హారాల నుండి తెగిన ముత్యాలు క్రిందకు రాలిపోయాయిఉదయం శుభ్రం చేసే పరిచారికలు... మళ్ళీ ఆ ముత్యాలని ఆకాశం వైపు .. మేఘాలపైపు విసిరేస్తే, వర్షాకాలంలో మళ్ళీ మేఘాల లోనుండి క్రింద పడినప్పుడు ముత్యాలు సముద్రంలోనే కాదు, మేఘాల నుండి కూడా క్రిందకు రాలతాయి అని ఊహ.
ఇక్కడితో మధురానగరారీలోసౌధాల వర్ణన అయిపోతుంది....
ఇక పుష్పలావికల వయ్యారాలు చెప్పుకోవాలి.
*********
ఆముక్తమాల్యద – నాల్గవ భాగము
(ద్వితీయాశ్వాసం - రెండవభాగం)
పుష్పలావికల వయ్యారం
ఈ పుష్పలావికల వయ్యారాలు గురించి రాయల వారు మొత్తం పదిహేను పద్యాల లో వర్ణిస్తారు
ఈ పద్యాలన్నిటిలో ఐదు సీస పద్యాలు లో వారి సంభాషణా చాతుర్యం కూడా చూపిస్తారు
మధురానగరిలో బోలెడు మంది పుష్పలావికలు ఉన్నారు (పూలు అమ్మీ స్త్రీలు).
వీరందరికీ రోజూ అక్కడి జులాయివాళ్ళతో బోలెడంత ఇబ్బందులు ఉండేవి... వీళ్ళు కూడా గట్టిగానే సమాధానాలు చెప్పేవారు
ఈ సంభాషణలన్నీ సీసపద్యాలలో కనిపిస్తాయి
ఆ సన్నివేశంలో కనిపించే ఒక చక్కని పద్యం
చం
సరసులనర్మ మింపుల నొసంగఁ గదంబపుదండఁ గట్టుచో
గరఁగుటఁ దెల్పుదృక్తరళకాంతులు నుత్తరమిచ్చునంతరాం
తరముల నవ్వులున్ గలువతండము మొల్లలు నంచు మిన్ను గ్రు
చ్చి రహిని రిత్తనూ లొసఁగి సిగ్గు వహింతురు పుష్పలావికల్ !
భావము
జులాయి వారైనా, సరసులైన ఆ మగవాళ్ల మాటలు వాళ్లకి నచ్చి, కడిమి పూల మాలని కడుతూ - ఆ మాటలు తమ మనసులని కరిగించాయని చెబుతున్నారా అనే విధంగా తమ కళ్లలో కాంతులు చిమ్ముతూ, ఆ మాటలకి బదులు చెబుతున్నారా అన్నట్లుగా తీయగా నవ్వుతున్నారట ఆ స్త్రీలు.
ఇక్కడ కవిసమయం పరిశీలించాలి. ఆ పుష్పలావికల కళ్లు కలువపూలలా ఉన్నాయిట.
అలాగే వాళ్ల నవ్వులు మొల్లలలా ఉన్నాయి. ఊహల్లో తేలుతూ ఆ అమ్మాయిలు తమ చూపులని కలువలుగానూ, నవ్వులని మొల్లలుగానూ భ్రమించి, వాటిని ఆకాశంలోనే దండగా అల్లినట్టు అభినయం చేసి, అందమైన పూలమాలలు అందిస్తూ, చాలా ఉత్సాహంతో తమ ప్రియుడి చేతిలో పూలులేని ఒక మామూలు దారాన్ని పెడుతున్నారట. వెంటనే తమ పొరపాటు తామే తెలుసుకుని సిగ్గుపడుతున్నారట!
ఉ.
పై ననిశంబు సల్లుకొను పాంసువుపై ఖగతుండఖండితా
లానమహామహీరుహఫలచ్యుత బీజము లుత్క్షిపత్కరాం
భోనిబిడాఫ్లుతి న్మొలవఁ బొల్చు నగమ్యతఁ దూలుచు న్బురో
ద్యానముల న్మదేభములు ప్రాణముతోడినగంబులో యనన్ !
భావము
మధురానగరిలో ఏనుగుల సౌందర్యం వర్ణించే పద్యమిది... ఏనుగులు ప్రాణములున్న పర్వతాల వలె ఉన్నాయి అని చెప్పడం ఉద్దేశంఎప్పుడూ వాటి పైన దుమ్ము ని (పాంసువు) జల్లుకోవడం అలవాటు కదా... ఆ మట్టిలో అలా పక్షులు తిని పడేసిన ఫలాల విత్తనాలు, మత్తేభములు తొండముతో తమపై చల్లుకొను నీటివల్ల తడిసి మొక్కలు వచ్చి చెట్లుగా మారాయి అని కవి ఉద్దేశం
మదగంధతారతమ్యము యామ్యకరికిఁ దత్కరులకుం గనబలెఁ గటము లొరసి,సురతశ్రమజ మౌటఁ జూపోపకయుబలె? గామినీ మృదుగండఘర్మ ముడిపి
అంటూ సాగే ఈ సీస పద్యంలో మధురానగరిలో వీచే గాలిని కూడా అత్యద్భుతంగా వర్ణిస్తారు రాయల వారు కంటికి కనపడని అందాలు కూడా కవికి మాత్రమే కకనిపిస్తాయి అనడానికి చక్కని దృష్టాంతం ఈ చక్కని . మలయానిలమంటే మలయ పర్వతంనుండి వచ్చే గాలి....
కొండపై గంధపుతోపులు గురించి, ఆ తోపులనుండి వాసనలను గ్రహించి వచ్చిన గాలి నగరంలో నెమ్మదిగా ఎలా ప్రసరిస్తున్నది అందించే పద్యాలన్నీ అద్భుతమే.
ఇంకొక వర్ణన
చం
కలమపుటెండుగుల్ద్రవిడకన్యలు ముంగిటఁ గాచుచుండి, త
జ్జలరుహనాభగేహ రురుశాబము సారెకు బొక్కులాడఁ, గొం
డెలపయి కమ్మ గ్రామ్యతరుణీతతి డించిన పేఁపగంపలం
దల మగుచున్న చెంగలువ దండలఁ దోలుదు రప్పురంబునన్
శ్రీ కృష్ణదేవరాయల వారు విల్లిపుత్తూరులోని ఉద్యానవనాలు, పురవీధుల్లో వర్ణనలే కాదు అక్కడ వీచే గాలిని కూడా అత్యంత మనోహరంగా వర్ణించారు. ఆ వాయువులు కృష్ణుని వక్షస్థలమందలి తులసీమాలల మీదుగా వీచడం వాళ్ళ వాటి పవిత్రతను, పరిమళాన్ని, ఆలయంలోని భక్ష్యాలు మొదలైనవాటి మీదుగా వీచుట వలన పుణ్య సౌరభము, "నాగవాసము" అనే ఆ వృత్తికి (ఆ కాలంలో ఇది సాధారణమైన విషయంగా చూడాలి... ఆ కోలాహలానికి సిద్ధమవుతున్న వారకాంతల కొప్పులలోని జారిన చెంగలువలను తాకి, వాటిని కదిలిస్తూ సుగంధభరితమై ఎల్లెడలా సంచరిస్తుంది ఆ గాలి ఎంత అందంగా ఉందో ఈ పద్యంలో గమనించగలరు
ఇంకొక అందమైన ఊహ... వర్ణన
నాకు బాగా నచ్చిన పద్యాలలో ఇది ఒకటి
ఇంకా అలా ఊరి బయటకు వెళితే, పంట పొలాల లో బద్ధకంగా పడుకునే బాతులని కూడా వదిలిపెట్టలేదు రాయలవారు
అలా పశుపక్షాదులు, పళ్ళు పూల తోటలను కూడా అత్యంత రమణీయంగా వర్ణించే ఈ పద్యం చూడండి.
కవియైనవాడికి తాను చూచినా ప్రతీ వస్తువు అందంగానే కనిపిస్తుంది. నిజంగా కవులందరూ తెలుసుకోవలసిన, పరిశీలించవలసిన సత్యం ఇది అనిపించక మానదు
మ ll
తలఁబక్షచ్చట గ్రుచ్చి బాతువులు కేదారంపుఁ గుల్యాంతర
స్థలి నిద్రింపఁగఁ జూచి యారెకు లుష స్స్నాతప్రయాతద్విజా
వలి పిండీకృత శాటిక ల్సవి దదావాసంబుఁ జేర్పంగ రే
వుల డిగ్గ న్వెస బాఱువానిఁ గని నవ్వు న్శాలిగోప్యోఘముల్ !
భావము
ఇక్కడ "తలఁబక్షచ్చట గ్రుచ్చి బాతువులు" అన్నదే ఒక మనోహరమైన ఉపమానం .. పంటకాలువలలో బాతులు హాయిగా తలలు రెక్కలలో దూర్చికొని మరీ నిద్రిస్తున్నాయి... ఆ దృశం చూసి అటుగా వెళుతున్…
ఇవి మొదటి రెండు ఆశ్వాశాలలో ముఖ్యమైన అనడం కన్నా / నాకు బాగా నచ్చిన పద్యాలు.
ఇక నిమ్మదిగా .. కొంచెం Fast forward mode లో కథ చెప్పే పరిచయం చేస్తాను తరువాతి భాగాలలో
ఈ లోపల భోజనాలు చేస్తూ విష్ణుచిత్తుడు భార్యకు ఎలా సహాయం చేశాడో చూశారు కదా..
ఈ ఐదు పద్యాలూ మీ మధ్యాహ్నం భోజనం తో పాటు ఆస్వాదించండి
తరువాతి భాగాల్లో మధురానగర వర్ణన, పుష్పలావికల వయ్యారాలు పరిశీలిద్దాము.
**********
ఆముక్తమాల్యద - ఐదవ భాగం
(ద్వితీయాశ్వాసము - మూడవ భాగం)
"మత్స్యధ్వజుని వైభవం"
ఇప్పటి వరకు అందమైన మధురానగరి వైభవం, పుష్పలావికల వయ్యారముల గురించి తెలుసుకున్నాము కదా. మరి ఈ రాజ్యానికి రాజైన మత్స్యధ్వజుని వైభవం ఎలా ఉంటుందో ఇంకా చూద్దాము ద్వితీయాశ్వాసంలోని ఈ అంకంలో మధురానగరి రాజైన మత్స్యధ్వజుని వైభవం గురించి వర్ణించే 8 పద్యాలు కనిపిస్తాయి
సీ ll
ద్విద్వయోపాయ ధీవిద్వద్వతంసంబు, షాడ్గుణ్యచాతురీ చక్రవర్తి
క్రీడాచలీకృత శ్రీఖండగిరిరాజు, కనకాద్రిముద్రణ గ్రంథకర్త
యందూనిబద్ధాబ్దబృంద వేదండాళి, వననిధి స్తంభ నాధునికరఘువు
తామ్రపర్ణ్యమలపాథః కేళిహంసంబు, లంకేశమైత్రీ ప్రియంకరుండు
తే.
స్వస్తికృద్వాస్తవస్తుత్యగస్తి, మఘవ
మకుటమోటన శతకోటి మంత్రభృత్య
భూతభూతాత్తశాంభవ భూమికుండు
దత్పురం బేలుఁ బాండ్య మత్స్యధ్వజుండు.
మలయపర్వతముపై మత్యధ్వజుడు ఎన్నో విలాస యాత్రలు చేసేవాడు. బంగారుకొండపై తన బిరుదును ప్రకటించుకున్నవాడు.
ఏనుగులను కట్టినట్టు మేఘాలను బంధించినవాడనీ, ఆ రఘురాముడితో పోలుస్తూ ఉపమానాలు చేస్తారు రాయలు వారు మొదటి పద్యంలోనే తమిళ సింహళ దేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయి కనుక అతను కూడా రామునిలా వారధి నిర్మించి ఉండాలి. మేఘాలను బంధించడం అన్నది విచిత్ర విషయం.
మంత్రశక్తితో కావలసినప్పుడు వానలు కురిపించే శక్తి ఈ మహారాజుకు ఉండడం అనేది బహుశా రాయల వారి చమత్కృతి . తామ్రపర్ణి నదిలో విహరించే హంస. విభీషణునితో చెలిమి చేసినవాడు. రామాయణంలో ఈ రాజు గురించి వచ్చిన ప్రస్తావనల ఆధారంగా చేసిన వర్ణనలు ఎన్నో కనిపిస్తాయి ఈ పద్యాలలో
అందమైన పద్యం పరికించండి
ఉ.
ఇందుకులావతంస మతఁ డేతఱి నేతరిగాఁ; డరిం బ్రజ
ల్కందఁ గొనం; డొరుం డొరుతల న్వినిపించినమాట డెందముం
జెంద ముదంబు దక్కి చెడఁ జేయఁ డొరు; న్వినతాస్యుఁ డౌ నుతిం
పం దనుఁ; బందనుం గొఱత వల్కఁడు శూరతఁ దానుమించియున్.
భావము
చంద్రవంశభూషణుడగు (ఇందుకులావతంసుడు) అతడే మత్స్యధ్వజుడు . ఈ రాజు ఎప్పుడూ నీతి తప్పనివాడు, ధీరుడు, ఉదాత్తుడు,
వినయశీలి, చెప్పుడు మాటలు విని జనులను బాధపెట్టడు, తనను ఎంతగా పొగిడినా పొంగిపోక, పరాక్రమముచేత గర్వముతో ఎవ్వరినీ తక్కువ చేయనివాడు. ఇటువంటి సద్గుణాలుకలిగిన ఆ మహారాజు మధురా నగరి ప్రభువైన మత్స్యధ్వజుడు అని చెబుతారు రాయలవారు.
*****
ఆముక్తమాల్యద - ఆరవ భాగం
(ద్వితీయాశ్వాసము - నాల్గవ భాగం)
"గ్రీష్మ ఋతు వర్ణన"
వసంతాన్ని, శరదృతువునీ, హేమంతాన్ని వర్ణించిన కవులు ఎందరో ఉన్నారు కానీ, గ్రీష్మ ఋతువు ని 30 పద్యాలలో వర్ణించడం బహుశా రాయల వారికే చెల్లింది అని నా నమ్మకం. మనం 30 పద్యాలు చర్చించలేము కాబట్టి, ముఖ్యమైన (అంటే నాకు నచ్చిన పద్యాలని) చెప్పుకుందాము
తే ll
మెండుమీఱిన పతఘి బీఱెండ దాఁకి
యొల్లఁబోయిన లేబొండుమల్లెపొదల
తుదలఁ జప్పటలై కడుదొడ్డ లగుచుఁ
బొడమె మొగ్గలగము లగ్గిబొబ్బలట్లు
గ్రీష్మం అనగానే లలనలకే కాదు, మహారాజులకు కూడా మల్లెపూవులు గుర్తొచ్చాయి. మండువేసవిలొని వేడికి బొండుమల్లెల పొదల చివళ్ళు వాడి అణిగిపోయి ఉన్నాయి. ఆ కొనలనున్న పెద్ద పెద్ద మల్లె మొగ్గలు అగ్గి బొబ్బల్లాగా కనిపిస్తున్నాయి అని సుకుమారమైన మల్లెపూవులు కూడా వాడిపోతున్నాయి అని బాధ పడ్డారు కవి.
ఆ తరువాత పద్యాలలో అందమైన వెన్నెల గురించి వర్ణిస్తూ, వేడిగా ఉన్న భూమాతని వెన్నెలమ్మ ఎలా చల్లబరుస్తోందో వర్ణించే పద్యాలు కనిపిస్తాయి
"ప్రాతర్వేళల నట్టివెట్ట సొగసై" అన్న పద్యంలో సొగసు గమనించగలరు...
తెల్లవారుఘామున ఉండే పొందికైన వేడి సొగసు ఎందుకో జాగ్రత్తగా గమనించండి
శా ll
ప్రాతర్వేళల నట్టివెట్ట సొగసై పాటిల్లెఁ గుంభోంభనో
ద్భూతాంబుధ్వని వాద్యమై మరుదధఃపుంజీభవత్పాటల
వ్రాతామ్రేడితసిక్తభూసురభిళారామాంబుకుల్యాబహు
స్రోతస్సంధుల నంధుయంత్రనతికృత్ప్రోద్గీత గేయౌఘముల్
ఎందువలనా ఈ సొగసు అంటే "గుంభోంభనోద్భూతాంబుధ్వని వాద్యమై" అంటే ఏతాముకు కట్టిన కుండలు నీళ్ళలో మునిగినప్పుడు చేస్తున్న ధ్వనియే ఆ మద్దెలధ్వని!
"పుంజీభవత్పాటలవ్రాతామ్రేడితసిక్త" పాటలీ కుసుమాల చేత నెల అంతా తీరైన వరుసల్లో అమర్చబడి ఉంది...
వేసవి ఉదయకాలాలలో వీచే గాలి వేణువు ఉండనే ఉన్నది. ఆ గాలికి రాలిపడిన పూలచేత వర్ణశోభ, ఆ పూల సౌరభము, ఉద్యానవనములలోని ఇతర సుగంధములచేత దివ్యమైన పరిమళము, ఆ ఉద్యానవనములలోని చెట్లకు నీళ్ళు పెట్టడంకోసం ఏతం ఎత్తుతూ తోటమాలులు సాగిస్తున్న గానలహరికి ఆ నీటి కడవలు చేస్తున్న ధ్వని పక్కవాయిద్యంలా తోడై, అంతటి తీవ్రమైన వేసవికాలంలో కూడా కన్నులవిందుగా, వీనులవిందుగా ఉన్నది ఆ నగరములోని ప్రకృతిశోభ!
ప్రకృతి మాత్రమే కాక, దక్షిణ భారతంలో, మరీ ముఖ్యంగా మధురానగరిలో అప్పటి ప్రజల ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో, ఉన్నాయో వర్ణించే మరొక పద్యం గమనించగలరు
శా.
తారుణ్యాతిగ చూతనూత్న ఫలయుక్ తైలాభిఘూర స్వన
ద్ధారా ధూపిత శుష్యదంబుహృత మాత్స్యచ్చేద పాకోద్గతో
ద్గారంపుంగన రార్చు భోగులకు సంధ్యావేళలం గేళికాం
తారాభ్యంతర వాలుకాస్థిత హిమాంత ర్నారికే ళాంబువు
భావము
వేసవి కాలంలో తినవలసిన ఆహారం గురించి తెలియజెప్పే పద్యం ఇది... వేసవిలో అప్పుడే పచ్చిదనం పోతున్న మామిడికాయ ముక్కలని (చూతనూత్న) , చేపలతో (మాత్స్యచ్చేద పాకోద్గతోద్గారంపుంగ) కలిపి కూర వండుకుని తిన్నారు. ఆ కూరలో నూనెతో తిరగమోత పెట్టారు. ఆ తిరగమోతకి అందులో నీరు చుయ్యిమంటూ పొగ చిమ్ముతూ ఇగిరిపోయింది. అలాంటి కూరను వాళ్ళు తినడం వల్ల అది వేడి చెసి త్రేపులు మొదలయ్యాయి. ఆ అవస్థ నుండి తప్పించుకోవడానికి వాళ్లు సాయంకాలసమయంలో తోటల్లో ఇసుకలో పాతిపెట్టిన చల్లని కొబ్బరిబొండాలని కొట్టుకొని తాగుతున్నారు.
******
రెండవ ఆశ్వాసం - సింహావలోకనం
రెండవ ఆశ్వాసం పాండ్యదేశానికి రాజధాని అయిన మధుర గురించిన అద్భుతమైన వర్ణనలతో మొదలౌతుంది. ఈ దేశాన్ని పాలించే మత్స్యధ్వజుడనే రాజు సర్వ సద్గుణ సంపన్నుడు. గొప్ప దాత. ఏ బాధల్లేకుండా జనరంజకంగా ప్రజాపాలన చేస్తుంటాడు.
వేసవికాలాన గ్రీష్మతాపాన్ని, పల్లె జీవన సౌందర్యాన్ని, వెన్నెల విహారాలనీ ఆస్వాదిస్తూ ....ఒకనాడు అరుగుమీద పడుకున్న బ్రాహ్మణులు పరలోకం గురించి చేస్తున్న సంభాషణ విని తాను తన రాజ్యాన్ని త్యజించాలని నిర్ణయించుకొన్నట్లు ప్రకటిస్తాడు. ఇక్కడ మత్స్య ధ్వజునకు కలిగిన వైరాగ్యం గురించి చక్కని పద్యాలు వివరిస్తారు
మచ్చుకు ఒక పద్యం
ఉ
ఎక్కడి రాజ్యవైభవము? లెక్కడి భోగము? లేటి సంభ్రమం?
బక్కట! బుద్బుద ప్రతిమమైన శరీరము నమ్మి మోక్షపుం
జక్కి గణింపకుంటి; యుగసంధుల నిల్చియు గాలు చేతి బల్
త్రొక్కుల నమ్మనుప్రభృతులున్ దుద రూపఱకుండ నేర్చిరే!
ఈ రాజ్యవైభవాలేమిటి? ఈ భోగాలేమిటి? వీటికోసం ఇంత ఆరాటమేమిటి? ఇదంతా నీటి బుడగలాంటి శరీరం కోసమే కదా! యుగాంతాల దాకా, రెండు యుగాల మధ్యన కూడా బతికిన మనువులాంటి వారు కూడా యముని దెబ్బకు రూపురేఖలు లేకుండా పోయారే!
కం
ఉన్నట్లయుండు నద్దరి
కిన్నరులను నావ చేర్చు క్రియ వెసదా బో
కున్నట్ల యుండి కాలం
బున్నరులకు వయసుబుచ్చి మోసము దెచ్చున్
సర్వమత సిద్ధాంతులను రావించి మోక్షసాధనకు ఉత్తమమైన మార్గమేమిటో నిర్ణయించమని వాదాన్ని ఏర్పాటు చేస్తాడు.
వైకుంఠంలోని విష్ణువు, తనను విల్లిపుత్తూరులో సేవించే విష్ణుచిత్తుణ్ణి మధురలో జరుగుతున్న వాదాలలో పాల్గొని తన మహత్వాన్ని స్థాపించి రాజును వైష్ణవుని చెయ్యమని కోరుతాడు. విష్ణుచిత్తుడు మధురకు జరిపే ప్రయాణ వర్ణనతో రెండవ ఆశ్వాసం ముగుస్తుంది.
**************
ఆముక్తమాల్యద - ఆరవ భాగం
(తృతీయాశ్వాసము - మొదటి భాగము)
మత్స్యధ్వజునకు వైరాగ్యభాగం అంకురించిన తరువాత పండితులందరినీ సమావేశపరచి పరమాత్మ తత్త్వాన్ని గురించిన శాస్త్రచర్చ ఆరంభిస్తారు
విల్లూవుత్తూరులో ఉన్న విష్ణుచిత్తునికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై, పాండ్యరాజు సభకి వెళ్ళి అక్కడ శ్రీవైష్ణవాన్ని స్థాపించమని పురమాయిస్తాడు.
విష్ణుచిత్తుడు పాండ్యరాజ సభలో చేసిన వాదము, విశిష్టాద్వైత మతస్థాపనం తృతీయాశ్వాసంలోని ముఖ్యాంశాలు. అందులో భాగంగానే ఖాండిక్య కేశిధ్వజుల కథ వచ్చింది. ఈ మూడవ ఆశ్వాసంలో భారతీయ తత్త్వచింతన, ఉపనిషత్తుల సారం అందిస్తారు రాయలవారు. కేవలం ఎక్కువ లోతుకి వెళ్లకుండా కేవలం పద్యాల భావాలు మాత్రమే అందించే ప్రయత్నం చేస్తాను
మొదటి అంకం :
విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువుకు వెళ్లడం
శా ll
నిత్యంబుబ్రతిహారి వాద మగుటన్ విజ్ఞప్తి లే కంపఁ, దా
నత్యూర్జస్వలుఁ డౌట భూపతియు సభ్యవ్రాతమున్ శంకమైఁ
బ్రత్యుత్థానముఁ జేసి మ్రొక్కఁగ, సభాభాగంబు సొత్తెంచి యౌ
న్నత్యప్రోజ్వల రాజదత్త వరరత్న స్వర్ణపీఠస్థుఁడై !
పాండ్యరాజ్యంలోకి ప్రవేశించిన విష్ణుచిత్తుడు రాజదర్శనం కోసం వెళ్ళేటప్పుడు కాపలావానిని (ప్రతిహారి) అస్సలు పట్టించుకోడు. ఆ విష్ణువు ఆనతి ఉంది ఈ రాజుని కలిసేందుకు, ఇంకా ఈ కాపలా వాని అనుమతి ఎందుకు అని నమ్మకం అన్నమాట ఆయన Confidence, Body Language ఊహించుకోండి)
ఆతడి ఉత్సాహము చూసి, తేజస్సు చూసి (తానత్యూర్జస్వలుఁడౌట) వలన మహారాజు, సభలోని పండితులందరూ లేచి నిల్చుని నమస్కరించారు విష్ణుదత్తుడు అక్కడ కేటాయింపబడిన రత్న సింహాసనంలో ఆశీనుడయ్యాడు (రాజదత్త వరరత్న స్వర్ణపీఠస్థుఁడై )
తరువాత విష్ణుచిత్తుడు రాజ్యంలో ఉన్న పండితుల వాదోపవాదాలు శ్రద్దగా విని నువ్వుకుంటాడు ఆలోచిస్తాడు విష్ణుచిత్తుని వాడ ప్రతిభ గురించి వర్ణించే చక్కని పద్యం ఒకటి తారసపడుతుంది. ఈ పద్యాన్ని వర్ణించడానికి రాయల వారు సీసము ఎంచుకున్నారు ఆ పద్యం గమనించండి
సీ.
అందులో నొకమేటి కభిముఖుండై యాతఁ డనిన వన్నియును మున్ననువదించి;
తొడఁగి యన్నిటి కన్ని దూషణంబులు వేగపడక తత్సభ యొడఁబడఁగఁ బల్కి
ప్రక్కమాటల నెన్న కొక్కొకమాటనెనిగ్రహస్థాన మనుగ్రహించి;
క్రందుగా రేఁగినం గలఁగ కందఱఁ దీర్చినిలిపి; యమ్మొదలి వానికినె మగిడి;
తే.
మఱి శ్రుతి స్మృతి సూత్ర సమాజమునకు
నైక కంఠ్యంబు గల్పించి, యాత్మమతము
జగ మెఱుంగఁగ రాద్ధాంతముగ నొనర్చి;
విజితుఁగావించి దయ వాని విడిచి పెట్టి
నిజానికి ఈ పద్యం గమనిస్తే, ఒక మహారాజు మాత్రమే ఇంత ఔచితీయమైన వర్ణనలు చేయగలడని స్పష్టం అవుతుంది ఈ రోజున ఎన్నో సభల్లో ఎన్నో వాదోపవాదాలు జరుగుతాయి ... కానీ వాదమంటే ఎలా జరపాలో చక్కగా వివరించే పద్యమిది! ఇప్పటికీ ఆచరణీయమైన పద్యమే ఇది విష్ణుచిత్తుని అంతరంగ అవలోకిద్దాము
విష్ణుచిత్తుడు ముందుగా అక్కడి పండితులలో మేటి యనిపించిన ఓ పండితుడి వైపు తిరిగి అతని వాదమును మొత్తం అనువాదము చేసి (నొకమేటి కభిముఖుండై యాతఁడనిన వన్నియును మున్ననువదించి) ఆ వాక్యాలలోని దోషాలను ఒక్కటొక్కటిగా ఎత్తి చూపుతూ సభలోనివారందరూ అంగీకరించి మెచ్చుకొను విధంగా వాటిని ఖండించాడు. ఆ క్రమంలో ప్రక్కనున్న పండితులు పలికే వితండ వాదాన్ని పట్టించుకొనక ఒక్కో మాటతోనే క్లుప్తంగా వారి పరాజయ హేతువును నర్మగర్భంగా సూచించాడు. తమ పరాజయాన్ని తట్టుకోలేని పండితులు మూకుమ్మడిగా తనతో వాదానికి దిగినా ఏమాత్రం జంకకుండా అందరినీ సమాధానపరిచాడు.
ఆ తరువాత తనతో వాదమునకు దిగిన మొదటి పండితుని వైపు తిరిగి వేదాలు (శ్రుతి) , బ్రహ్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు (స్మృతి) వీటన్నిటి పరమార్ధం ఒక్కటే అని చాటి అందరి చేతా ఏకగ్రీవంగా ఆమోదం పొందాడు ఆయన స్వమతము అనగా శ్రీవైష్ణవమే విశిష్టమైనదని లోకానికి ఈ వాదం ద్వారా స్పష్టం చేసాడు.
**********
ఆముక్తమాల్యద - ఏడవ భాగం
(తృతీయాశ్వాసం - రెండవ భాగం)
ఆ తరువాత విష్ణుచిత్తుడు పరమత నిరసనము గురించి తెలిపే పద్యాలు కనిపిస్తాయి రెండే పద్యాలు (వైష్ణవం కానివన్నీ అన్య మతాలే అన్న భావన శతాబ్దంలో )
ఇక్కడ విశిష్ఠాద్వైతస్థాపనము గురించి విష్ణుచిత్తుడు సాధికారకంగా చెప్పే పద్యం ఒకటి పరిశీలిద్దాము
విశిష్టాద్వైత మతస్థాపనము
ఈ అంకంలో కనిపించే మొదటి పద్యము. మొత్తం మూడు పద్యాలు... మొదటిది మాత్రమే మీకు పరిచయం చేస్తున్నాను
ఈ పద్యాన్ని వైష్ణవ సంప్రదాయంగా ఆలోచించండి, కవితా హృదయంతో ఆస్వాదించండి...
చాలా సులభమైన సీసము... భావము వ్రాయవలసిన అవసరం లేదు..
సీ ll
ఆదినారాయణుండాయె నొక్కఁడ, బ్రహ్మ లేఁడు, మహేశుండు లేఁడు, లేదు
రోదసి, లేఁడు సూర్యుఁఢు, లేఁడు చంద్రుండు, లేవు నక్షత్రముల్, లేవు నీళ్లు,
లే దగ్ని; యట్లుండ 'లీల నేకాకిత చనదు; పెక్కయ్యెద ననుచు నయ్యెఁ
జిదచిద్ద్వయంబు సొచ్చి' యని ఛాందోగ్యంబు దెలిపెడు; నంతరాదిత్యవిద్య
తే.
నర్కులోఁ బుండరీకాక్షుఁ డతఁడ యగుట
కక్షిణీయని యష్టదృక్ త్ర్యక్ష దశ శ
తాక్ష విధి రుద్ర శక్రాదులందు నొకఁడు
కామి కాశ్రుతియే విలక్షణతఁ దెలిపె
సూర్యునిలో ఉన్న పుండరీకాక్షుడతడే అంటూ, అంతే కాక ఎనిమిది కన్నులున్న బ్రహ్మ, త్రినేత్రుడైన రుద్రుడు, సహస్రాక్షుడైన ఇంద్రుడు - వీరందరిలో ఒకడు కాడు, వారికంటే అతీతుడు
శ్రుతి విష్ణువే పరమదైవమని చెపుతున్నదని శ్రీవైష్ణవ మతాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తారు
అదే సందర్భాల్లో వచ్చే ఈ ఆఖరి పద్యంలో ఈ అంకం ముగుస్తుంది
శా ll
విద్వద్వందితుఁడాత డిట్లు సుఖ సంవిత్తత్వబోధైక చుం
చుద్వైపాయనసూత్రసచ్ఛ్రుతుల నీశున్ మున్ నిరూపించి, పైఁ
దద్విష్ణుత్వము దాని కన్య దివిషద్వ్యావర్తనంబున్ విశి
ష్టాద్వైతంబును దేటగాఁ దెలుప మాటాడెన్ బ్రమాణంబులన్
ఈ విధంగా విష్ణుచిత్తుడు విశ్వవ్యాపకమైన పరమేశ్వరుని తత్వాన్ని ఆవిష్కరించి, తత్వములు, ద్వైపాయన సూత్రములు,
"తద్విష్ణుత్వము దాని కన్య దివిషద్వ్యావర్తనంబున్ విశిష్టాద్వైతంబును దేటగాఁ దెలుప" అన్న పాదంలో ఆ పరమాత్మ యొక్క విష్ణుత్వమునూ, పరమాత్మకు ఇతర దేవతలకీ ఉన్న భేదమునూ తద్వారా విశిష్టాద్వైతమునూ ప్రమాణ పూర్వకంగా స్పష్టముగా భోధించారని రాయల వారి పద్యం.
ముందు అన్య మత నిరసనం చేసి తరువాత స్వమత స్థాపన చేసాడు అని అర్ధం చేసుకోవాలి ఆ తరువాత విష్ణుచిత్తుడు ఈ రాజ్యానికి వచ్చిన అత్యంత ముఖ్యమైన కార్యం విశిష్టాద్వైతముని విశ్వవ్యాప్తం చేయడం
ఆ తరువాతి అంకము
ఖాండిక్య కేశిధ్వవుజుల సంవాదము
విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులో పండితులను తన వాదంతో ఓడించి నారాయణుని తత్వాన్ని విశదీకరించి అతని సాక్షాత్కారాన్ని ఉపకరించే మరో ఉపనిషత్ కథ ఖాండిక్య కేశీధ్వజ సంవాదాన్ని చెప్పడం ప్రారంభించాడు.
ఈ ఖాండిక్య కేశిధ్వజుల వ్యాఖ్యానం విష్ణుపురాణం లో కూడా కనబడుతుంది
పూర్వం ధర్మధ్వజుడనే రాజుకు మితధ్వజుడు, కృతధ్వజుడు అనే పుత్రులిద్దరు ధ్యానతత్పరులై చరించేవారుండేవారు.
మ.
జనకాఖ్యాఖిలరాజ మొప్పు నిమివంశం; బందు ధర్మధ్వజుం
డను భూజాని మితధ్వజాఖ్య వసుధాధ్యక్షుం జగద్రక్షణా
వనజాతాక్షు గృతధ్వజాఖ్యుఁ గనియె; న్వారిద్దఱు న్గర్మఠున్
ఘనవిజ్ఞానుఁ గ్రమంబునం గనిరి తత్ఖాండిక్యుఁ గేశీధ్వజున్..
నిమి వంశంలో జన్మించిన ధర్మధ్వజుడనే మహారాజుకు మితధ్వజుడు, కృతధ్వజుడనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో మితధ్వజుడికి కర్మశూరుడైన ఖాండిక్యుడు, కృతధ్వజునికి బ్రహ్మజ్ఞాని అయిన కేశీధ్వజుడు జన్మించారు.
వీరిలో మితధ్వజుని పుత్రుడే ఖాండిక్యుడు. కృతధ్వజుని తనయుడు కేశిధ్వజుడు... వీరిరువురూ బంధుత్వరీత్యా సోదరులు. వీరిలో కేశిధ్వజుడు ఆత్మవిద్యావిశారదుడు. ఖాండిక్యుడు కర్మాచారపరాయణుడు. ఇద్దరూ ఒకర్నొకరు గెలవాలనుకున్నారు. జ్ఞాతివైరం కారణంగా, యుద్ధం జరిగి అందులో ఖాండిక్యుడు ఓడాడు. కేశిధ్వజుడు అతడ్ని రాజ్యం నుంచి తరిమేశాడు. ఖాండిక్యుడు మంత్రి సామంత ఆప్తవర్గాలతో అడవుల్లోకి పారిపోయి కొన్నాళ్లక్కడే తలదాచుకొని యజ్ఞయాగాదులు ప్రారంభించాడు. ఎన్నెన్నో యాగకర్మలు చేసి, మృత్యువును నివారించాలని ఆకాంక్షించాడు.
క.
వారివురు దమలోపల
వేరము గొని, రాజ్యకాంక్ష విజిగీషువు లై
హోరాహోరిగఁ బోరిరి
బారాదిదినంబు లవని ప్రజలు దలంకన్.
కొంతకాలం తరువాత, యోగనిష్ఠాగరిష్టుడైన కేశిధ్వజుడు కూడ ఒక యాగాన్ని సంకల్పించగా, దీక్షలో ఉన్న సమయాన, ధర్మధేనువును ఒక పులి పొట్టన పెట్టుకుంది. అందుకు ప్రాయశ్చిత్తమేమిటని ఋత్విజుల్ని సంప్రదించాడా రాజు. వారు సూచించిన ప్రకారం రాజు ప్రాయశ్చిత్త కాండ తెలుసుకోవడానికి ఎందరెందరినో కలుసుకున్నాడు. చివరకు శునకుని సలహామీద, కేశిధ్వజుని ధర్మ సందేహం తీర్చగలవాడు ఖాండిక్యుడొక్కడే నని కేశిధ్వజునికి బోధపడింది. కాని అతడు శత్రుపక్షంలోనివాడు. పైగా తనచే పరాజితుడు. అయినప్పటికీ సందేహ నివృత్తి కోసం అతడు శత్రువునైనా సంప్రదించదలచి, సాత్త్వికమైన మౌని వేషధారణతో అరణ్యాన ఉన్న ఖాండిక్యుని సమీపించ బోయాడు.
******
ఆముక్తమాల్యద - ఎనిమిదవ భాగం
(తృతీయాశ్వాసం - మూడవ భాగం)
శా. (పద్దెనిమిదవ పద్యము)
ఆ కేశీధ్వజుఁ డంత నా నృపుని రాజ్యం బెల్లఁ జేర, న్ఫలం
బాకాంక్షింపక "గెల్తు మృత్యువు నవిద్య న్బుట్టకుందుం దుద
న్జాకుందు న్వడి" నంచు యోగ నియతిం జ్ఞానాశ్రయుం డై మఖా
నీకంబుల్ రచియించు చం దొకటికిం దీక్షించి తా నున్న చోన్
గురుదక్షిణగా రక్తపాతరహిత రాజ్యాన్ని కోరుకోమని అంతరంగికులంతా ఖాండిక్యునికి సలహా చెప్పారు. కాని అందరూ నివ్వెరపోయేలా "కేశిధ్వజా! నేను కర్మాచరణలో సాధించినదానికంటే ముముక్షుమార్గంలో నీ సాధన గొప్పది. నీ వెరగని పరతత్త్వ రహస్యాలు లేవు. ఆ యోగ విద్యనాకు ప్రసాదించు" అన్నాడు ఖాండిక్యుడు."రాజ్యం కోరక ఇదడిగావేం" అన్నాడు కేశిధ్వజుడు. "నా స్వార్జితం కానిది నేను కోరను" అనడంతో, కేశిధ్వజుడు తన సోదరుని అంతరంగాన్ని గ్రహించి సంప్రీతుడై ఇలా అన్నాడు..
"అవిద్య అంటే మిథ్యాజ్ఞానం". పంచభూతాత్మకమైన ఈ దేహాన్ని ఆత్మగా భ్రమించి, మోహంచెందే అవివేకులు చిత్తవిభ్రాంతి పొందుతారు. ఇది శాశ్వత భోగమని, ఇదే తనదనీ భావిస్తారు. ఈ దేహ సంయోగజనిత పుత్రపౌత్రాదులమీద మమకారాన్నిపెంచుకుంటారు. మనుషులు చేసే కర్మలన్నీ దేహోపభోగ్యమైన సుఖాలకు ప్రేరణకలిగించేవి మాత్రమే! వీటివల్ల బంధమోచనం కలుగదు.
చ ll (24 వ పద్యము )
నరపతి పల్కె 'మౌని వర, నారిపు నిష్కృతి వేఁడఁబోయిన
న్ధర హతుఁ జేసెనేని సవనంపు ఫలం బొడఁగూడుఁ; గా కమ
త్సరగతిఁ జెప్పె నేని మఖతంత్ర మతంత్రముఁ గాక పూర్ణ మౌ
నిరుదెఱఁగు న్మదీప్సితమె, యేఁగెద" నంచు రథాధిరూఢుడై !
అప్పుడా శునకునితో కేశిధ్వజుడు ఇలా అన్నాడు, "మునివర్యా! అలాగే తప్పకుండా వెళ్ళి అడుగుతాను. ప్రాయశ్చితాన్ని అడగడానికి వెళ్లినప్పుడు నా శత్రువైన ఖాండిక్యుడు పూర్వ వైరంతో నన్ను చంపినచో యజ్ఞం మధ్యలో ప్రాణాలు వీడుటచేత యజ్ఞఫలము నాకే లభించును. లేదా మాత్సర్యాన్ని వదిలి ప్రాయశ్చితం చెప్పినచో యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తి అవుతుంది. కావున రెండు విధాలు నాకు లాభం చేకూరుస్తాయి. ఏది జరిగినా నాకు సమ్మతమే", అని చెప్పి రధమును ఎక్కి బయలుదేరాడు.
ఆనాటి రాజుల స్వభావాలు ఈ కథలో చాలా అందంగా చిత్రించబడ్డాయి. ఇక్కడ కేశిధ్వజుడు ప్రాణాలను పణంగా పెట్టి ఖాండిక్యుని దగ్గరకి వెళుతున్నాడు. అతనికి యజ్ఞం పూర్తికావాలన్న తపనే కాని ప్రాణభీతి లేదు. పైగా తనవల్ల అడవులు పట్టినవాడి దగ్గరకు వెళ్ళడం ఎంత సాహసం! "ఏగెదనంచు రథాధిరూఢుడై" - వెళతాను అంటూనే రథం ఎక్కేసాడన్న మాట. అంటే యాగాన్ని పూర్తి చెయ్యాలని అంత ఆతృత!
ఆ తరువాత ఈ ఇరువురు అన్నదమ్ముల బిడ్డలు మోక్షం ఎలా సాధించారన్నది కథ ...
ఖాండిక్య కేశిధ్వజుల కథ - సింహావలోకనం (Restrospection)
ఖాండిక్య, కేశిధ్వజులు అన్నదమ్ముల బిడ్డలు.
ఖాండిక్యుడు కర్మయోగి. వైదిక కర్మకాండల గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.
కేశిధ్వజుడు జ్ఞానయోగి. పెద్దవారయాక ఇరువురికి రాజ్యకాంక్ష పెరిగింది.
కేశిధ్వజుడు యుద్ధంలో సోదరున్ని జయించాడు. ఖాండిక్యుడు భటులతో, హితులతో అడవులకు పోయాడు. కేశిధ్వజుడు తన విజయానికి సూచనగా మహాయజ్ఞం చేస్తాడు. అయితే, ఆ యజ్ఞానికి బలిపశువుగా నియోగింపబడ్డ ఆవును ఒక పులి తినేస్తుంది. యజ్ఞం నిర్విఘ్నంగా జరగడానికి చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటని మునులను అడుగుతాడు. వారు తమకు తెలియదని, అరణ్యవాసం చేస్తున్న ఖాండిక్యుడే చెప్పగలడని అంటారు.
అరణ్యానికి వచ్చిన కేశిధ్వజునికి ధర్మసూక్ష్మం చెప్పవద్దని ఖాండిక్యుని మంత్రులంటారు. ఖాండిక్యుడు వారి మాటలు వినక ప్రాయశ్చిత్తాన్ని తెలియజేస్తాడు. కేశిధ్వజుడు యజ్ఞం పూర్తి చేసి ఖాండిక్యునికి గురుదక్షిణగా రాజ్యాన్ని ఇవ్వబోతాడు. ఖాండిక్యుడు వద్దంటాడు.
కేశిధ్వజుడు కూడా అప్పుడు తన రాజ్యాన్ని త్యజించి మోక్ష సాధనకు విష్ణువే పర దైవమని తన కొడుక్కి పట్టభిషేకం చేస్తాడు.
యజ్ఞయాగాదుల తాత్త్విక విశ్లేషణ, వానప్రస్థ ఆశ్రమవాసులకి ఉపయుక్తమైన ఆరణ్యకాలు, ఉపనిషత్తుల సారం అన్నీ ఈ అన్నదమ్ముల ద్వారా మత్స్యధ్వజునకు విష్ణుచిత్తుడు చెబుతాడు.
ఆముక్తమాల్యద - తొమ్మిదవ భాగం
(చతుర్దాశ్వాసం - మొదటి భాగం)
ఇప్పటి వరకు (తృతీయాశ్వాసంలో) మనం విష్ణుచిత్తుడు పండితులని ఎలా ఓడించింది, అష్టాక్షరీ మంత్రాన్ని ఎలా ఉపదేశించినదీ, పాండ్యరాజుకు చక్కని కథ రూపంలో ఖాండిక్య కేశిధ్వజుల వృత్తాంతం ఎలా వినిపించాడో తెలుసుకున్నాము
చతుర్దాశ్వాసం లో మొదటి పద్యం చూద్దాము
మ ll
బలిమిన్ ద్రెంపఁగఁ బోలెఁ బాయవడుచుం బర్యాయభంగంబుగాఁ
గల నూలెల్లను నంటుమోవఁ దెగి రాగా, గొంతసే పుండి, తాఁ
బెలుచ న్గంటు పుటుక్కునం దునిసి వే పృధ్విం బడె న్జాలె, మి
న్నుల మ్రోసెన్ సురదుందుభుల్, గురిసె బెన్సోనై విరుల్బోరునన్
ఈ పద్యంలో "పర్యాయభంగములుగా" వంటి చక్కని అర్ధాలంకారాలు కనిపిస్తాయి బలంగా తెంపినట్లుగా ఉన్నాయట ?? ఏమిటవి "పాయపడు" పర్యాయభంగములుగా అక్కడి వ్రేలాడదీసిన వరహాలమూటని బలవంతంగా త్రెంచినట్లుగా విడిపోయాయి ...
ఒక్క నూలు బయటకు తీస్తే, లోపలి వరహాలన్నీ ఒక్కొక్కటిగా ఎలా బయటకి వస్తాయో, అలా ఉంది అక్కడి పండితుల పరిస్థితి
అది చూసిన దేవతలు సంతోషంగా దుందుభులు మ్రోగించి పుష్పవర్షం కురిపించారు.
"బలిమిన్ ద్రెంపఁగఁ బోలె" అనడంలో ఏదో అదృశ్యశక్తి చేత అలా జరిగిందని ధ్వనిస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే, ఈ వర్ణనలో, అజ్ఞానంలో ఉన్న వ్యక్తులు వాదోపవాదాలకైనా సిద్ధమే కానీ, నిజాన్ని గ్రహించడానికి మాత్రం వెనుకాడతారు అన్న సత్యాన్ని కూడా రాయల వారు చెబుతున్నారు అనిపిస్తుంది.
భవబంధాలు ఒకొటొకటీ తెగి జీవుడు మోక్షాన్ని పొందే విధానం స్ఫురిస్తుంది. విష్ణుభక్తే ఆ అదృశ్యశక్తి. విష్ణుచిత్తుని ఉపదేశాన్ని పొందిన పాండ్యరాజుకి అతను కోరుకున్న ముక్తి లభించిందనే ధ్వని ఇందులో ఉంది.
ఈ విధంగా విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులోని పండితులను జయించి వేదవేద్యమైన విష్ణుతత్త్వాన్ని రాజుకు తెలియజెప్పి భగవంతునికి శరణాగతిచేసి లోకానికి హితం కూర్చాడు.
"విష్ణుచిత్తుని భగవత్సాక్షాత్కారము"
పాండ్యరాజు అయిన మత్స్యధ్వజుడు విష్ణుచిత్తుని రత్నాలు, ఆభరణాలు, పట్టువస్త్రాలతో సత్కరించి, అటుపిమ్మట ఊరేగించడానికి గజారూఢుని చేసాడు. రాకుమారులను పిలిచి ఈ మహాత్ముని ఊరేగించి విల్లిపుత్తూరు వరకు చేర్పించి రమ్మని పంపాడు.
ఉ ll
ఇంగిలికంబునన్ దడిపి యెత్తు కసీసపు రెంటెమో యనన్
నింగి గరుత్ప్రంపరల నిగ్గున లేఁదొగ రెక్కె; నంత వీ
చెం గలశాబ్ధిమీఁగడల జి డ్డెఱిఁగించెడు కమ్మగాడ్పు; నిం
డెన్ గడు మ్రోఁత; పెన్దిరువడిం గని రా ఖగరాజు మూఁపునన్
ఇంగిలికము = Bright colour, సింధూరం వంటిది
ఆ ఇంగిలికములో ముంచి తీసిన నల్లని నేతవస్త్రం ఎలా ఉంటుందో, ఆకాశంలో ఎగురుతున్న గరుత్మంతుని రెక్కల వేగంతో కాంతివంతమై అంతా కనిపిస్తోందట... ఇక్కడ ఇంకో ముఖ్య విషయం...
గరుత్మంతుడు ఎక్కడి నుండి వస్తున్నాడు. వైకుంఠం నుండి కదా
వైకుంఠంలోని పాలమీగడల సేద తీరిన వారి రెక్కల మీద మరి కలశాబ్ధి మీగడలు (పాల మీగడల) జిడ్డు ఉంటుంది కదా... ఆ రెక్కల విదిలిస్తుంటే ఆ వేగానికి ఆ పాలమీగడల తీరంలో అప్పటివరకు సేద తీరిన గరుత్మంతుని రెక్కలలోని పాలజిడ్డు అంతా కమ్మని వాసనలు చిందుతున్నాయట ఆ రెక్కల ధ్వనితో ఆకాశం అంతా నిండిపోయి వినిపిస్తోంది.
అప్పుడు, అటువంటి ఖగరాజు మూపుపై శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడై కనిపించాడు విష్ణుచిత్తునికి సాక్షాత్కరించాడు అన్నమాట
ఈ రెండవ పద్యాన్ని పూర్తిగా రెండు / మూడు సార్లు చదువుకోండి .. వీలయితే గట్టిగా / బిగ్గరగా చదవండి..
విష్ణుమూర్తి రూపాన్ని వర్ణించే ముందు ఆ గరుత్మంతుని వేగం, వేగంగా వస్తున్నప్పుడు ఆ రెక్కల విన్యాసం మీ హృదయాల్లో నిక్షిప్తమవడం ఖాయం
Christopher Nolan, Cameron Watson సినిమాలు, మన Rajamouli బాహుబలి సినిమాలోని గ్రాఫిక్స్కు ఎంతమాత్రమూ తక్కువ కాదు ఈ పద్యాలు ...
అది కూడా అక్షరాలలో మాత్రమే చూపించడం ఎంత గొప్ప విన్యాసం ...
ప్రతి పాదాన్ని అనుభూతితో చదువుకోమని విన్నపం
ఆముక్తమాల్యద - 10 భాగము
(చతుర్దాశ్వాసము - రెండవ భాగము)
అలా విష్ణుమూర్తిని చూసిన విష్ణుచిత్తునకు ఆయన రూపం ఎలా కనిపించిందీ అంటే ..
ఈ సీసము జాగ్రత్తగా గమనించండి
భక్తునికొరకు ఆ దివినుండి భువికి దిగివచ్చిన శ్రీహరి ముగ్ధమోహనమైన రూపంతో అలరించాడేమో అన్న భావన. ఆ రూపాన్ని రాయలవారీ పద్యంలో వర్ణిస్తున్నారు.
సీ ll
చివురుబొట్లపుదోయి జెందమ్ము లనఁ దార్క్ష్య హస్తోదరముల దివ్యాంఘ్ర లమర
నునుఁగప్పుమేనఁ దోఁచిన తదూర్ధ్వచ్చాయ లీల దాల్చుపసిండిచేల మెఱయ
వ్రాలిన యోగివర్గము నిర్మలాంతఃక రణములువోలె హారములు దనర,
సిరికిఁ బుట్టింటినెచ్చెలు లౌట మనవికి డాసె నా మకరకుండలము లమర
శ్రిత సితచ్ఛద వాత్యాభిహత పరాగ
వలయమండిత కల్పశాఖలొ యనంగ
శంఖచక్రాంచితోరుహస్తములు దనర
దోచె గమలేక్షణుండు చతుర్భుజుండు !
ప్రఖ్యాత కవులూ, వాగ్గేయకారులూ భగవంతుని రూపాన్ని వర్ణించాలంటే పాదాల వర్ణనతోనే మొదలుపెడతారు...
ఇక్కడ కూడా అలాగే ఆ విష్ణుమూర్తి పాదాల వర్ణన తో మొదటి పాదం కనిపిస్తుంది ముందుగా స్వామి వారి పాదాల వర్ణన, ఆ పాదాలు ఎలా ఉన్నాయి అంటే, చిగురాకుల పొట్లంలా ఉన్న ఎర్రని తామరపువ్వుల్లాగా స్వామి పాదాలు కనిపిస్తున్నాయట
ముందు పద్యంలో ఇంగిలికము వర్ణన చూశాము కదా. అందువలన ఆ కెంజాయి రంగులలో రెక్కలు కనిపిస్తున్నాయి. అవి చిగురాకుల వలె మనసులని అలరిస్తున్నాయి
ఇంక విష్ణు మూర్తి రూపం ఎలా ఉంది అంటే, స్నిగ్ధ నీలవర్ణం కనిపిస్తోంది, దాని చుట్టుకొని పీతాంబరమున్నది. అది ఎలా ఉందంటే, గరుత్మంతుని బంగారు శరీరచ్చాయ పైకి ప్రసరించినదేమో అన్నట్టుగా ఉందటఆ మెడలోని ముత్యాలహారాలు వ్రేలాడుతున్నాయి. నిరతము తనను ధ్యానించే యోగివర్యుల నిష్కళంకములైన అంతఃకరణములవలె ప్రకాశిస్తున్నాయట అవి. ఎంత గొప్ప భావన. ఆయన హృదయాన్ని ఆవిష్కరించే గొప్ప ప్రయత్నం కదా
విష్ణుమూర్తి చెవులకు మకరకుండలాలున్నాయి. అవి సిరికి (లక్ష్మి దేవి) పుట్టింటి చెలికత్తెలు కావడంతో చనువుకొద్ది ఆయనతో ఏదో మనవిచేసుకోడానికి దగ్గరకి వచ్చినట్టుగా ఉన్నాయట
ఆ చేతులలో శంఖ చక్రాలు అమరి ఉన్నాయి. ఆ చేతులు కల్పవృక్ష శాఖలు. ఒక కొమ్మమీద తెల్లని హంస వాలినట్టుగా ఒక చేతిలో శంఖమున్నది. పూల పుప్పొడి సుడిగాలికి లేచి వలయంగా ఏర్పడినట్టుగా మరొక చేతిలో చక్రం అలరారుతోంది. ఆ స్వామి భక్తుల పాలిట కల్పతరువు!
శ్రిత సితచ్ఛద వాత్యాభిహత పరాగ వలయమండిత కల్పశాఖలొ అన్న వర్ణన మళ్ళీ మళ్ళీ చదువుకోండి
తే.గీ
అట్లు ప్రత్యక్షమైనపద్మాక్షు నంత
రిక్షమునఁ గాంచి ముని ప్రమోదాక్షిజలము
నిగుడఁ బులకించి, కరటిఘంటికలె తాళ
ములుగ నిట్లని యమ్మహాత్ముని నుతించె.
ఆ సమ్మోహనమైన రూపాన్ని దర్శించుకుని విష్ణుచిత్తుడు ఆకాశంలో తనకోసం ప్రత్యక్షమైన పద్మాక్షుడిని చూసి నిలువెల్లా పులకించిపోయాడు. కళ్ళనుండి ఆనందబాష్ఫాలు (ప్రమోదాక్షిజలములు అన్నారు రాయల వారు) ఉబికిరాగా, తాను ఊరేగుతున్న ఏనుగుకు కట్టిన గంటల మ్రోతలే తాళధ్వనులుగా ఆ స్వామిని స్తుతించాడు.
ఆ తరువాత చతుర్థాశ్వాసంలో దశావతార వర్ణనలు విష్ణుచిత్తుడు సన్నుతి చేసే అత్యద్భుతమైన 19 పద్యాలు కనిపిస్తాయి ఈ పద్యాలని ఇక్కడ ఉదహరించడం లేదు
చతుర్థాశ్వాసంలోని, తరువాతి అంకంలో యమునాచార్యుని చరిత్ర, పాండ్యప్రభుని వీరశైవము, వర్షాకాలం, శరదృతు వర్ణనలు, రాజనీతికి సంబంధించిన అతి ముఖ్యమైన పద్యాలు మరికొన్ని కొన్ని పరిచయం చేస్తాను.
ఆముక్తమాల్యద - 11 భాగము
(చతుర్దాశ్వాసము - ఆఖరి భాగము)
ఇప్పటి చతుర్థాశ్వాసంలో వరకు విష్ణుమూర్తిని సాక్షాత్కరించుకున్న విష్ణుచిత్తుని వర్ణనలు (రాయలవారివి అనుకోండి) అన్నీ తెలుసుకున్నాము
నేడు ముఖ్యముగా యమునాచార్యుని చరిత్ర తెలుసుకుని ఈ ఆశ్వాసం ముగిద్దాము.
శ్రీవైష్ణవమతంలో ఆచార్యుల పరంపర తెలిసిన విషయమే కదా.
అందులో యామునాచార్యుడు ఒక ప్రధానాచార్యుడు. ఇతనురామానుజాచార్యుని కన్నా ముందువాడు, క్రీ.శ. 10వ శతాబ్దానికి చెందినవాడు. ఈ కథ చెప్పబోతున్నది విష్ణుమూర్తి. చెపుతున్నది లక్ష్మీదేవితో.
ఒకనాడు మధ్యాహ్న వేళ విష్ణుచిత్తుడు స్వామికి పుష్పమాలికను సమర్పించి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు అతన్ని అదృశ్యంగా గమనిస్తున్న విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవితో యిలా అంటున్నాడు:
తే.
యామునాచార్యుఁ డొక్కఁడు నీమహాత్ముఁ
డొక్కఁడును గాదె దర్శనం బుద్ధరించి
రస్మదీయకృపాతిశయమున ననిన
నిందిరాదేవి తన భర్త కిట్టు లనియె.
తే.
అతఁడు చిఱుతనాఁడె యాచార్యకులమున
వేదశాస్త్రముఖ్య విద్య లభ్యసించుచుండ,
నపుడు చెలువ, యిప్పటి పాండ్య
నృపతి పూర్వవంశ్యుడే యొకండు
ఈ యమునాచార్యుడు చిన్నవయసునుండే గురుకులంలో ఉండి వేదశాస్త్రాలను అభ్యసించాడు. ఆ కాలంలో ఇప్పటి పాండ్య రాజు పూర్వ వంశస్థుడైనవాడే రాజుగా ఉండేవాడు. ఇక్కడ తెలుస్తుంది, యామునా చార్యుడే విష్ణుమూర్తికి ఎందుకు గుర్తుకువచ్చాడో. యామునాచార్యుని కాలంలో, అతనుండే దేశాన్ని కూడా పాండ్య వంశానికి చెందిన రాజే పరిపాలన చేస్తూండేవాడు. అయితే ఈ రాజుకీ ఆ రాజుకీ తేడా ఉంది.
యామునాచార్యుని కాలంలోని రాజు, యమునాచార్యుని కాలంలో ఉండే వీరశైవుడు.. ఆ వెఱ్ఱి ముదరడం వల్ల ఆ రాజు విష్ణు కీర్తిని, స్తుతిని సహించలేకపోయేవాడు. అంతేగాక తన రాజ్యంలోని వారెవరూ విష్ణువిగ్రహారాధన కూడా చేయరాదని కట్టడి చేసాడు. వైష్ణవాలయాలలో జరిగే ఉత్సవాలు చూసి అసహ్యించుకుంటూ శివుడే పరబ్రహ్మమని అంటూ తన స్నేహితులతో అదే విధంగా ఉండేవాడు. ఇక్కడ ఆ వీరశైవాన్నే వెఱ్ఱిశైవంగా పేర్కొన్నాడని మనం భావించాలి.
ఎందుకంటే, మతం ఎప్పుడైనా పరమత సహనం కలిగినంత కాలం బాగానే ఉంటుంది. అది కోల్పోయినప్పుడే అది వెఱ్ఱిగా మారుతుంది. రాయలవారు ఎంతటి శ్రీవైష్ణవ మతావలంబి అయినా, శైవుల పట్లగాని, ఇతర మతాలవారి పట్లగాని అనాదరం చూపించలేదు, మనకు తెలిసినంతలో. శ్రీవైష్ణవులలోనే కొందరు వీరవైష్ణవులు ఆ పని చేసారు. వారిది కూడా వెఱ్ఱే అవుతుంది.
రాయలవారిక్కడ ఆ వెఱ్ఱి శైవం ఎలా ఉందో వర్ణిస్తారు. అది వేదాలను నమ్మదు. వేదపండితులను గౌరవించకుండా కేవలం జంగములనే పూజిస్తారు. ఇంటి ఇలవేల్పులను పట్టించుకోరు. కేవలం వీరభద్రుడినే కొలుస్తారు. ప్రాచీనాలయాలు శిథిలమైపోతున్నా, వాటి గురించి పట్టించుకోక కేవలం జంగములకు మఠాలను మాత్రమే స్థాపిస్తున్నాడు రాజు. మతం రాజకీయంలోకి, రాజ్యపాలనలోకి ప్రవేశిస్తే ఏర్పడే అవస్థ యిక్కడ వర్ణిస్తున్నారు రాయలు వారు .
స్థూలంగా మత్స్యధ్వజుని దగ్గర విష్ణుచిత్తుడు ఎలా అయితే విజయం సాధించి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్తాపంచగలుగుతాడో, యమునాచార్యుని చరిత్ర కూడా ఇంచుమించు అటువంటి కధయేఅయితే మనం యమునాచార్యుడి రాజనీతి పద్యాలు ఒక రెండు పరిశీలిద్దాము
యమునాచార్యుని రాజనీతి బోధనలు
(మరీ ముఖ్యంగా Leadership roles పదవులలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ అంకం చదవవలసిందే). ఇందులో 84 పద్యాలు ఉంటే, నేను కేవలం 8-10 పద్యాలు మాత్రమే ఉదాహరిస్తున్నాను
తే.గీ.
రాష్ట్రవర్ధనమెదఁ గోరు రాజు మేలు
రాష్ట్రమును గోరు; దానఁ గార్యమె యనంగ
రాదు; బ్రహ్మోత్తరములైన ప్రజల యేక
ముఖపుఁ గోర్కి దదంతరాత్ముండొసఁగడె?
ప్రజాభివృద్ధిని కాంక్షించే రాజు గురించి చెప్తున్నారు రాయల వారు యమునాచార్యుని ద్వారా .
తన ప్రజల మేలు తనకు కూడా మేలు చేస్తుంది అని కోరుకునే రాజు యొక్క మేలును, అభివృద్ధినీ కోరుకునే ఆలోచనను
ఆ భగవతుండు ప్రజలకూ, బ్రాహ్మణోత్తములకూ ఇస్తాడు అని భావము.
పరబ్రహ్మస్వరూపులైన ప్రజలు ముక్తకంఠంతో రాజు మేలు కోరినయంతనే ఆ పరమాత్ముడు తప్పకుండా తీరుస్తాడు.
కం.
దుర్గములాప్త ద్విజవర
వర్గమునకె యిమ్ము; దుర్గవత్తత్తతి క
త్యర్గళ ధరాధిరాజ్య వి
నిర్గత సాధ్వసత పొడమ నిలుపకు కొలఁదిన్ !
రాజా! నీకు ఆప్తులైన బ్రాహ్మణులను దుర్గములకు అధిపతులుగా నియమించు. అయితే, ఈ దుర్గాలను కాపాడుకోవడానికి ఎంత అవసరమో వారికి అంత సైన్యాన్ని మాత్రమే ఇవ్వు.
నివారింప శక్యము గాని సైన్యాధిపత్యం వారికి ఇవ్వటం కూడా మంచిది కాదు. దానివలన క్రమంగా వారు నీ పట్ల భయము లేకుండా మసలే అవకాశం ఉంది.ఎంత చక్కని సూటి భావన.
చం.
చదివి యధర్మభీతి నృపశాస్త్రవిధిజ్ఞతల న్వయస్సు డె
బ్బదిటికి లోను నేఁబదికి బాహ్యము నై యరుజన్వపూర్వులై
మదమఱి రాజు ప్రార్థన నమాత్యతఁ గైకొని తీర్చు పాఱువా
రొదవిన నంగముల్మిగులనూర్జిత మౌటకుఁ బూఁట సాలదే !
ఒక రాజు దగ్గర మంత్రి పదవికి ఎవరు అర్హులో ఈ పద్యంలో తెలియజేస్తున్నారు రాయల వారు.
శాస్త్రాలన్ని చదివి, అధర్మము పట్ల భీతితో రాజశాసనాన్ని విధిగా అనుసరించేవాడు, వయస్సు 50-70 మధ్య ఉండి, వంశపారంపర్యంగా వచ్చే రోగాలు లేనివాడై, నిగర్వియైనవాడు, రాజు ప్రార్థిస్తేనే అమాత్యపదవిని ఒప్పుకునే బ్రాహ్మణుడు లభిస్తే అతని ద్వారా రాజ్యాంగాలను బలిష్టం చెయ్యడానికి ఒక్కపూట చాలదా ??
(డెబ్బదిటికి లోను నేఁబదికి బాహ్యము నై యరుజన్వపూర్వులై ఉండాలి)
ఒకవేళ అటువంటి మంత్రివర్గము దొరకకపోతే, నీతిని తానే యోచించి అమలుపరచాలి. తనకంటే గొప్పవాడు కదా అని ఎవడినో ఒకడిని నియమిస్తే, గుమ్మడికాయంత ముత్యాన్ని ధరించిన వాడు మోయలేక బాధ పడినట్లు తాను బాధ పడక తప్పదు.
వారి పూర్వీకులనుండి వంశపారంపర్యంగా ఏ రోగములు సంక్రమించియుండక, పదవియందు మాత్సర్యాదులు లేకుండా ఉండి, రాజు ఆహ్వానం మీదనే అమాత్య పదవి స్వీకరించే విప్రుడు లభిస్తే... ఆ రాజ్యం సర్వతోముఖాభి వృద్ధి చెందుతుంది అని అంటారు రాయలవారు.
ఈ పద్యాన్ని చదువుతున్నప్పుడు మన దేశంలో ఉన్న మంత్రులు చదివితే ఎంత బాగుంటుందో కదా అనిపించక మానదు.
(242 వ పద్యము)
మన MBA పాఠాలలో / Political sciences Syllabus లో ఈ పద్యాలు ఎందుకు లేవో అర్ధం కావడం లేదు
ఉ.
అక్షర పక్షపాతమున నర్థము నూళ్ళ నొసంగి, నుబ్బునన్
భిక్షుజటాధరాదికులు భిన్న నిజవ్రతులౌదు; రైన దు
ర్భిక్షరుజా శిశుచ్యుతులు పెక్కగు; భక్తియు చాలు, దానఁ ద
త్ప్రక్షుభితత్వ మేయఘముఁ దార్పదు, శంకఁ దలంగు మియ్యెడన్ !
అక్షర పక్షపాతముతో ధనాన్ని, ఊళ్ళను ఇస్తే పొగరుతో ఉబ్బిపోయి భిక్షువులు, జటాధరులు నియమాలు పాటించని వారౌతారు.
అలా కావడంతో దుర్భిక్షము, వ్యాధులు, బాలారిష్టాలు పెరుగుతాయి. కాబట్టి వారి పట్ల భక్తి చాలు. వారు క్షోభపడుటవలన ఏ పాపము కలుగదు. సందేహపడకు.
పై పద్యం ముఖ్యంగా అప్పట్లోనే రాయల వారి ఆస్థానంలో మఠాధిపతులను దృష్టిలో ఉంచుకొని రాసినట్టుగా అనిపిస్తుంది. ఈ పద్యం పదిహేను-పదహారవ శతాబ్దపు కాలంలో మఠాధిపతులకు, రాచరిక వ్యవస్థకు మధ్య ఉన్న ఘర్షణను ఎత్తిచూపుతుంది
ఇంతే కాక, ఆముక్తమాల్యద కావ్యంలో విస్తరిస్తున్న విజయనగర సామ్రాజ్యాన్ని సూచించే పద్యాలు మనకు కనిపిస్తాయి.
(245 వ పద్యము)
శా.
రేవుల్మావు మతంగజంబును మణిశ్రీఖండముక్తాదియున్
రా, వాణిజ్యము పెంచి యేలఁగ నగు; న్వర్షంపు టెవ్వన్ రుజన్
హావళ్ళిన్ దిగు నన్యభూప్రజల రా జాయాయిజాత్యౌచితిన్
బ్రోవంగాఁదగుఁ; దోఁట దొడ్డి గను లాప్తుల్చూడఁ బంపందగున్
కొత్త ప్రాంతాలను, ప్రజలను తన రాజ్యంలో కలుపుకోవటంలో ఉండే సాధకబాధకాలను రాయలు కొన్ని పద్యాల ద్వారా మనకు సూచిస్తాడు. ఈ సామ్రాజ్య విస్తరణతో పాటు ఇతర రాజ్యాలతో, దేశాలతో ఆర్థిక సంబంధాలు, సరకుల ఎగుమతి, దిగుమతితో కూడిన వాణిజ్య సంబంధాలు పెరిగాయని చెప్పవచ్చు.
అందుకే ఒక పద్యంలో పొరుగుదేశాల వర్తకులను గౌరవంగా చూసుకోవాలని, ఓడరేవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి
పొరుగుదేశాలవారితో సముద్ర వర్తకమంటే భయపడే ఇతర రాజ్యాలకు భిన్నంగా విజయనగర రాజులు సముద్ర వ్యాపారం చేసేవారని పోర్చుగీసు ఆధారాల ద్వారా మనం ధ్రువపరుచుకోవచ్చు.
(262 వ పద్యము)
కం.
ఎచ్చో గజఘోటక్రయ
తచ్చర్వణసుభటజీవి తద్విజసురపూ
జోచ్చనిజభోగముల కగు
వెచ్చము వెచ్చంబు గాదు విత్తంబునకున్
ఏనుగులు, గుర్రాలను కొనుటకు, వాటిని మేపుటకు అయ్యే ఖర్చు, మంచి భటుల జీతాలకు, బ్రాహ్మణులకు, దేవతల పూజలకు, రాజుల ఉన్నతమైన భోగాలకు అయ్యే ఖర్చు దుర్వ్యయమని తలపరాదు.
రాజుల జీవితంలో భక్తి, వైరాగ్యాలకు కూడా ప్రాధాన్యత ఉంది కాని, అది సరైన సమయంలో ఆచరించవలసిన ఆశ్రమ ధర్మం. రాజ సింహాసనం అధిష్టించి, రాజ్యపాలన జరిపే సమయంలో రాచరికపు భోగాలను త్యజించాలనుకోవడం అర్థం లేని పని. ఈ రకమైన దృక్పథం శ్రీవైష్ణవ మతం బోధించే వాస్తవిక తత్త్వ ప్రభావమే. ప్రజలు ముఖ్య అనుభోక్తగా భావించే రాజే రాజ్యసుఖాలను అనుభవించకపోతే ఇక ఆ ప్రజలు ఏ రకంగా సుఖానురక్తులై ఉండగలరు?
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి