5, డిసెంబర్ 2020, శనివారం

ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు, 03.12.2020

 



03 - 12 - 2020; గురువారము

చిత్రానికి పద్యం - 70

శీర్షిక : ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు

రాయల వారి కీర్తినివైభవాన్ని వర్ణించే పద్యం / కవిత్వం  అందించగలరు

 

 

. వె.

దేశ భాష లందు తెలుగు లెస్స !!యనె నీ

యాంధ్ర భోజుడపుడు . అష్ట దిగ్గ

జముల చేయు మేటి సాహితీ చర్చల

తెలుగు భాష మిగుల తేజ రిల్లె

 

రమ,కంకిపాడు.

 

తే.

సాహితీ సమరాంగణ చక్రవర్తి

కృష్ణదేవరాయలు తెల్గు కృతులు వ్రాసి

ప్రాభవముగ వెలిగి, "దేశభాషలందు

తెలుగు లెస్స" యని తెలిపి, ధీరుని వలె

శత్రుదుర్భేద్యముగ తన శక్తి తోడ

విజయనగర సామ్రాజ్యమున్ విజయ పథము

నందు నిలిపి తెలుగు వారి కాద్యుడయ్యె

 

వెంకట్.సి హెచ్

 

తే.

ఆంధ్రభోజుడు ఘనముగా నాదరించె

అష్టదిగ్గజకవులనుత్సాహబరచి 

భువనవిజయమను సభను భువిన నిలిపి

తెలుగు భాషలో దీపిని దెలియ జేసె

హేమలత

 

 

తెలుగు భాష, పద్యం, ప్రబంధం, సమస్యా పూరణం వంటి విశిష్టమైన ప్రక్రియలు భువనవిజయంలో ప్రాణం పోసుకున్నాయంటే, పరిపుష్ఠమ్ ఆయాయంటే  ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదండీ. . .

 

కం

విద్యామృత సారంబులు

వేద్యము "భువనవిజయమున" పీయూషములౌ      

పద్యాబ్ది సుధలతో భా

వద్యుతులు తెలుగు వికాస భాష్యములాయెన్ !

కస్తూరి శివశంకర్

 

 

భువన విజయం సభామండపం వైభవం వర్ణించిన, స్మరించిన మనమంతా ధన్యులము కదా . . . మరి ఆ భువన విజయం కవులని, కృతులనీ ఒక్కొక్కరినీ నిమ్మదిగా స్మరించుకుందాము                   

 

.

ఆ ఘనమైన ప్రాంగణవిహారములన్ మధురోహలౌ కృతుల్        

గోఘృత మాధురుల్ కవనకూజితరాగము మ్రోగుచుండఁగన్ 

లాఘవమైన పద్యపు విలాసపు  మాధురులద్దినట్లుగన్      

"వైఘ" పురంబు కావ్యమున  ప్రౌఢిమముల్ వలపుల్ మనోజ్ఞమై     

కస్తూరి శివశంకర్

 

వచన కవిత

కరవాలముల , ఘంటముల,

పదనున  కదను తొక్కించగ

అంగళ్ళ రతనాలు ముత్యాలు

కొల్లలుగ రాశులుగ అమ్మించగ

తెలుగు కావ్యాలకున్ కవులకున్

ఘన కీర్తి ప్రాభవముల్  కల్పించగ

అమరుడైనాడు  ఆంధ్రభోజుడుగ

మహావీరుడు శ్రీకృష్ణ దేవరాయలు

ఆ రాయలన్ మదిన నిలిపెదము

ఆ స్ఫూర్తి సతము వహించెదము.

 

CA కె మల్లికార్జునరావు

 

వచన కవిత,

నేటి అంశం శ్రీకృష్ణ దేవరాయలు,

తుళు  మాతృభాషైన శ్రీకృష్ణ దేవరాయలు,

దేశభాష లందు తెలుగు లెస్స అని శ్లాఘించే

తెలుగు మాతృభాషైన నేటి పాలకులు,

తెలుగు కన్నా ఆంగ్లమే మెఱుగు అంటున్నారు...

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

అహో !

ఒకటి రెండు కాదు ఆంధ్రభోజుని ఘనకీర్తులు బహుళములని

వివరించి, వర్ణించిన తల్లిదండ్రులను ,

గురువులను గమనించి, గ్రహించి రెందరో  పిల్లలు .

వారే వారి ఉన్నత పదవులు సేవలతో గురుతు చేయుచుండిరి ఆ మహారాజుని

 

అహో శ్రీ కృష్ణ దేవరాయ

ఆంధ్రభోజుని చదివిన కొలదీ తెలియు గతమంత

ఘనమని,దేవరాయల కీర్తులు బహుళ ములని

తిరిగిరాని ఆ చరితము చదివి సృష్టించిగలరు యువత .

 

జి మురళీ మోహన్ రావు

 

 

ముందుగా మన శ్రీకృష్ణదేవరాయల ప్రభువులకు సభక్తికమైన గజారోహణం. .

తెలుగేలెస్సర దేశభాషల యశః దివ్యోపదేశమ్ము నీ

వలనన్ వింటిమి కృష్ణరాయ ప్రభు ! సంప్రాప్తంబగున్ సంపదల్

లలికావ్యంబుల భవ్యమై వెలయుఁగా రంజిల్లు భాగ్యమ్మదే

లలితంబౌ భువనంబు మోహనములై లాస్యమ్ములై కావ్యముల్

కస్తూరి శివశంకర్

 

కోడాలి వెంకటసుబ్బారావు గారి హంపీక్షేత్రం కావ్యం లోని (గుండెను పిండే) ఒక  పద్యం.

శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణము  లైనవి తుంగభద్ర లో

పల గుడిగోపురంబులు సభాస్థలు లైనవి కొండముచ్చుగుం

పులకు చరిత్రలో మునిగిపోయిన దాంధ్ర వసుంధరాధిపో

జ్జ్వల విజయప్రతాపరభసంబొక స్వప్న కథా విశేషమై

 

విష్ణుచిత్తీయమును భక్తిగా వ్రాసి

తెలుగువల్లభుడై ఇలను ఏలినాడు

భువనవిజయమతని సభపేరు

అష్టదిగ్గజముల ఖ్యాతి పెంచినాడు

రాజులందు కలికితురాయి వారు

రాయలింటి రతనమీ హంపీ రేడు

సాహితీ సమరాంగణ సార్వభౌమ

శ్రీకృష్ణదేవరాయలు దొరవారు

విష్ణుప్రియ

 

 

సీ.

తుళు మాతృ భా షైన తళుకు తెలుంగుకు పట్టమ్ము గట్టిన భవ్యుడెవరు

" భువన విజయము" ను బుధులతో పూరించి కళలను పోషించు గణ్యు డెవరు

అష్టదిగ్గజ కవులిష్ఠమై కీర్తింప " ఆంధ్ర భోజుం" డైన ఆప్తుడెవరు?

" ఆముక్త మాల్యద" యను దివ్య మౌ ప్రబం ధమ్మును నుడివిన ధన్యు డెవరు?

 

తే.గీ.

తిమ్మరుసు ప్రేమ వెల్గిన తేజ మెవరు?

" సాహితీ సమరాంగణ సార్వభౌమ"

అనగ బిరుదమ్ము పొందిన అనఘు డెవరు?

రామ! ఎవరయ్య?" శ్రీ కృష్ణ రాయ" నృపు డె!

 

ధొం తా భక్తుని రామ నాగేశ్వరరావు.

 

 

మత్తేభం లో ప్రయత్నం

 

కృతులెన్నో రచియించి తా  ప్రతిభతో కీర్తిన్ గడించెన్ పురో

గతి నందున్ తన రాజ్యమున్నిలిపి  సౌకర్యంబులెన్నో బిగిం

చి తుళువ్వంశపు గారమున్ బెనిచె సుశ్రేష్టంబుగన్, వైరులు

ద్ధృతి నుగ్గాడగ రాయలోరి  కథ శ్రీకృష్ణుండుగా నిల్చినే

 

వెంకట్.సి హెచ్

 

 

సీ"

కరవీరపు పదును కలమునకు నలమె

వెల్లువల్లె  కవన విఫణియందు

బాసనెక్కించెను బసిడి సింగపుపీట

భారతిన్ మురిపించె భాగ్యసాలి

ప్రగతి బాట నడుప ప్రజలబంధువు దాను

విస్తరించ పరిది  విజ్ఞుడితడు

కదన రంగమునందు కడ్గము ఝళిపించి

కమనీయ రీతులన్ కలము ద్రిప్పె

ఆముక్తమాల్యద నాంధ్రుల కందించి

యక్కునచేర్చుకొ నాఫ్తుడయ్యె

అష్ట దిగ్గజముల యౌచిత్య మెరిగించి

పూజలందె పరచి పూలబాట

 

తే

వాఙ్మయంబును బోషించి వాసికెక్కె

తెలుగు లెస్సని యవనికి తెలియచెప్పె

రాయపుంగవ కవికుల రాజసింహ

కృష్ణదేవరాయునికిదె కేలుమోడ్పు

 

వాణిశ్రీ నైనాల, విజయవాడ

 

 

 

దేశభాషలందు తెలుగు లెస్సన్నారు శ్రీ కృష్ణ దేవరాయలు..

కళామతల్లి వోలకబోసింది ఆయన కాలంలో హొయలు...

వెన్నెల రాజు  రాజు కాగా పూచెను కవితా కలువలు....

రాయలనే భాస్కర కిరాణాల్లో వికసించెను లలితకళా కమలములు....

ఆచంద్రార్కం వెదజల్లును సుగంధమును ఈయన కీర్తి సుమములు.

 

రాయలేలిన కాలమున లేకపోతిని,

రాయలేలిన నేలన కాలము గడిపితిని,

రాయల పేరు తలచినంత తెలియని  గర్వం తో మైమరిచితిని.

మా రతనాలసీమ రాయలేలిన సీమ కదా అని మురుసితిని....

ఉష.

 

 

చిన్న ప్రయత్నం

తల్లి నాగలాంబ, తండ్రి నరసా నాయకుడు ముద్దుల కోమరుడు గా జన్మించెను. తుళువ వంశాన్ని వాసి కెక్కించిన దేవ రాయలు స్వర్ణ పాలన జేసీ , తిమ్మరుసు ను ఆమాత్యులుగా చేసుకొని  ఒక సుకావిగా,  ప్రబందకవి గా తెలుగు సాహితీ నీ సేద్యం చేసిన  సార్వభౌముడు .

 

శ్రీ కాకుల ఆంధ్ర మహా విష్ణువును దర్శించి  వారిని ప్రసన్నించుటకై  తెలుగు సాహిత్యానికి అమూల్యమైన ఆముక్తమాల్యద నీ కానుకగా అందించి తెలుగు వారి గుండెల్లో కలకాలం  నిలిచి పోయిన రాయా ల వారు మళ్ళీ తెలుగు నేల పై పుట్టాలని ఆశిస్తూ ......

మంజూష, నిజామాబాద్

 

 

ఉ.మా....

పౌషమునందు ఛండుడయి ప్రద్విషులన్ దునుమాడు‌ వీరుడే

భాషకు జేసెసేవకవి పండిత శ్రేష్ఠుల గారవించుచున్

భాషలలోన తెల్గుమన భాషయె మేటియటంచు చెప్పుచున్

బోషణ జేసెనంట కవి పుంగవులన్ ఘనుడాతడు కృష్ణ రాయలే

ఆత్రేయ

 

 

కృష్ణదేవరాయలు మహా సామ్రాజ్యానికి పాలించిన మహా చక్రవర్తి .

మీదు మిక్కిలి మహా కవి . సాహిత్య సమరాంగణ సార్వభౌముడు .

తాను స్వయంగా కవి . వీరు ఆముక్త మాల్యద మదాలసా చరిత్ర, సకల కథా సంగ్రహం ,రాసమంజరి , జ్ఞాన చింతామణి మొ . కావ్యాలు, ఉషా పరిణయం , జాంబవతీ కళ్యాణ0 మొ . నాటకాలు వ్రాశారు .

వీటిలో తెలుగులో రాసిన ఆముక్త మాల్యద ప్రబంధం , గీర్వాణం లో రాసిన జాంబవతి కళ్యాణం మాత్రం లభిస్తున్నాయి .   

రాయలవారు రాసిన గ్రంధాలలో ఆముక్తమాల్యద ఒక విశిష్ట ప్రబంధం . తెలుగు కావ్యాలలో ఒక అనర్గ రత్నం . తెలుగులోగల పంచ కావ్యాలలో ఆముక్త మాల్యద ఒక శ్రేష్ట రచన .

రాయల పౌడ కవి . వారి కవితా గరిమ ఆముక్తమాల్యద ప్రబందంలో ప్రతి పద్యంలో కనిపిస్తుంది . ప్రత్యేకించి మాలదాసరి కథలో బహుభాషా శబ్ధ ప్రయోగం, సర్వ శాస్త్ర పాండిత్యం , శాస్త్ర పరిశీలన రాయలవారిని, మహా పండితుల కోవలో నిలుపుతాయి.                  

రాయలవారు 1513 ఫిబ్రవరి 10 న తిరుమల వెళ్ళి స్వామి వారిని నవరత్న ఖచితమైన కిరీటం తయారుచేయించి ఇచ్చారు . తిరుమల అభివృద్దికి రాయలవారే మూల కారకులు. 

దేశభాషలందు తెలుగు లెస్స ".                             

స్వేచ్చా సమర్పణ  - రామ్ మోహన్, నిజామాబాద్

 

 

తేటగీతి మాలికలో

 

 కన్నడ పలుకు మదిమెచ్చు కస్తురి పసి

యనుచు,తేనెలూరు తెలుగు నలరజేసి

అష్ట దిగ్గజ కవులసమాదరించి

యాంధ్ర భోజుడై  వెలిగెను యవనిలోన

 

సాహితీ సమరాంగణ సార్వభౌమ

నీదు  యాముక్త మాల్యద  నివ్వటిల్లి

జగతికి మధుర కావ్యమ్ము జతను చేసి

ధర్మ నిరతి పాలించిన  ధన్యజీవి

 

విజయనగర సామ్రాజ్యమున్ విస్తరించి

ముష్కర తురుష్కులనడచి, ముప్పు తొలగ

రాయ లేలిన సీమయే రత్నగర్భ

యన చిరయశము పొందిన యమరజీవి

 

ధృతిమతియననీ కీర్తియే కృష్ణ రాయ

దశదిశలు వ్యాప్తి నొందగ ద్రవిడరాజ్య

మేలి ప్రజల నాదరముగ పాలనమొన

రించిన ప్రభువన్యులెవరు లేరు గదర

అవళూరు సీత


 

సీసంలో...

 

కవులను పోషించి కవి పోషకునిగా వె

లసితివి భువిలోన లక్షణముగ

 

ఆంధ్రము గొప్పదనాముక్త మాల్యద

నాంధ్రులకందించి యాదరించి

 

చెన్న కేశవునికి చెలువముగ నిలిపి

తివి కోవెల ప్రజల శివము కోరి

 

భువన విజయమున కవనము పోషించి

గర్వించి నిలచిన సార్వభౌమ

 

ఆటవెలది

రాజు యనగ నెవరు రాయలే యను రీతి

నింగి జేరెను గద నీదు కీర్తి

కులము మతము లేదు పలుకు జెలియె రాణి

యనుచు సేవజేసి నాంధ్ర భోజ

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

కన్న డాంధ్ర భాషలు యిరు కన్నులుగను

సాహితీ సేవ జేసిన సార్వ భౌమ

భువన విజయము నెరపిన భూధరుండు

దేశ భాష లందున లెస్స తెలుగ నియడి

సాహితీ సమ రాంగణ చక్రవర్తి

 

 

తేటగీతలు

నాగ లాంబకు జన్మించె నందనుడుగ

విజయ నగరసా మ్రాజ్యము విస్తరించి

యాంధ్ర భోజుడు గాఖ్యాతి యశముబొంది

రాజ నీతిజ్ఞుడుగనేలె రాజ్య మంత

 

తిమ్మరుసుమంత్రి  తీరుగా తీర్చిదిద్ది

అడ్డు వచ్చిన యన్నల నడ్డగించి

పట్టమునుగట్టి రాజుగా పటుతరముగ

తండ్రి గానాదరణపొందె తత్తరించి

 

తెలుగు సాహిత్య మంతయు తేజరిల్ల

అష్ట దిగ్గజ కవులను నాదరించి

సార్వభౌముడై వెలిగెను సాటిలేక

భువన విజయమం దునతాను భూపతిగను

గీతాశైలజ

 

 

శ్రీ కృష్ణదేవరాయలు

 

వైభవోపేతమై వరలిన తెలుగును స్వర్ణ ఛత్రంబున సత్కరించె

మత్తేభ ములపైన నెత్తుగా నెక్కించి నష్ట దిగ్గజములఁ నాదరించె

యాముక్త మాల్యద నామోద యోగ్యమై కావ్యరాజంబుగా ఘనతఁగాంచ

కావ్యాలు రచియించె కవులను పోషించె తెలుగు తల్లికి నిండు వెలుగునిచ్చె

సాహితీ సమరాన సార్వభౌ ముండుగా  ఘనకీర్తి గాంచెను గరిమ మీర

సరసగంభీర రసాస్వాద సరసుడై సరసిజా క్షులయెద లరసిజూసె

అరివీర మత్తేభ యవనీశు లదరగా మృగరాజ స్వప్నమై మిన్ను ముట్టె

 

 అతడె యాంధ్రుల కారాధ్య యపర కృష్ణు

డాతడె తెలుగు తేజమ్ము నన్నిదిశల

వ్యాప్తిఁ జేసిన కవిరాజు ప్రాప్త యశుడు

కృష్ణదేవరా యలపర విష్ణు వతడు

ఆదిభట్ల సత్యనారాయణ

 

రాజు గానుకా కకవిగా రచన చేసె

ఆంధ్ర భోజుడై నిత్యము ఆంధ్ర భాష

సేవ చేసేటి ఘనుడరా దేవ రాయ

తెలుగు తల్లిమె చ్చినదిరా తెలుగు బిడ్డ

లలితారెడ్డి

 

 

తుళువవంశ రాయ శ్రీకృష్ణదేవరాయ

భువనవిజయ సాహితీ మకుటరాయ

తెలుగుకన్నడ భాషల పోషకరాయ

నాగలాంబ ముద్దుల తనయుడు

ఇరువది వర్షములకే చక్రవర్తి ఇతడు

విజయనగర సామ్రాజ్య కిరీటి ఇతడు

స్పూటకపు మచ్చలున్నను తేజస్సు కలవాడు

ఎత్తు భువికి ఐదు అడుగుల రేడు

దక్షిణ భారత సామ్రాజ్య దిగ్గజం అష్టదిగ్గజముల

సాహిత్య కవన కిరీటి  హంపి పురవీధుల

పసిడి మెరిపించినవాడు 

తుంగభద్రానదీ నీటి తీరువా సాగించినవాడు

శ్రీకాకుళేశ్వర ప్రీతిపాత్రుడు విష్ణుచిత్తీయడు

ఆంధ్రభోజుడ సమరాంగణమున సింహబలుడు

కోవూరి

 

 

1. తేటగీతి...( శ్రీకృష్ణదేవరాయలు )

విష్ణుచిత్తీయ మందించ విదురుడితడు

భువన విజయము శోభించ భూమి సుతుడు

వ్రాసె నాముక్త మాల్యద రక్తి గట్ట

ఆంధ్ర భోజుడయ్యె ధరణి హంపిరాయ..

 

2. ఆటవెలది..( అష్ట దిగ్గజాలు )

అష్ట దిగ్గజాలు నష్ట దిక్కులనంగ

పెద్ద నార్యు డయ్యె పెద్ద దిక్కు

కృష్ణ దేవరాయ కృపయును మెండుగా

గ్రంధ రచన జేసె గ్రాంధికముగ.....

 

3. ఆటవెలది ( అల్లసాని పెద్దన )

అల్లసాని వారు ఆప్త మిత్రుండయె

మను చరిత వ్రాసె మరులు గొలుప

గండపెండెరంబు ఘనమైన గౌరవం

రాచ కార్య మందు రాటుదేలె....

 

4. ఆటవెలది ( తెనాలి రామకృష్ణుడు )

రామకృష్ణు డనగ రాయల వారికి

చెప్పలేని ప్రేమ జెప్ప లేము,

కష్ట నష్ట మన్న గాచుకొనునెపుడు

వికటకవిగ బిలువ విప్రుడితడు....

 

5. ఆటవెలది ( తిమ్మరుసు )

తిమ్మరసుల వారి తియ్యని సలహాలు

దేవరాయలకును తేనె పట్టు

తండ్రి లాంటి మాట తప్పక వినుచుండె

కన్న తండ్రి లాగ గాపుగాయ...

 

6. ఆటవెలది   ( తెలుగు భాషా మాధుర్యం )

తెలుగు తేనె ఝల్లు తెల్లార్లు గురవంగ

తెలుగు ప్రాభవంబు దిరుగు లేదు

భాష యనగ నెపుడు భాసిలు చుండెగా

తేనె పట్టు లాంటి తెలుగు లెస్స.....

 

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

అష్టదిగ్గజ ముల స్థాపించి

అష్ట దిక్కులకు తెలుగు

కవితా సౌరభాల వ్యాపించగ

జయలక్ష్మి ని కావ్య లక్ష్మిని

నిరుపమానం గా ఏలిన

రాజు రారాజు అనగా రాయలే...

మీరు ఆంధ్ర భోజుని తగురీతిలో స్తుతించారు...

 

****************************


 

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా....

ఆ.వె

కార్యసాధనమున కడగండ్లనెదిరించు !

ధైర్యసాహసములు స్థైర్యములను

దీధితులన వెల్గు ధీరవరేణ్యుకున్

అవిటితనము నెపుడు అడ్డురాదు

 

తే.గీ  

వెలయు "స్టీఫెనుహాకింగు" విభవమెఱిగి  

శాస్త్రసంపద గరిమనుశాసనమ్ము 

జేసి, సాంకేతిక ప్రభావజీవనమ్ము !

కార్య సాధకుల విభాత కాంతులందు   

అవిటిదనమది కారాదు అడ్డగింత !

 

కస్తూరి శివశంకర్

 

 

తరగతి గది లోనే పెళ్లి చేసుకున్న మైనర్లు

వింత కాదు విచిత్రం అంతకంటే కాదు

పక్కాగా చెప్పాలంటే "చిత్రం" సినిమా

హద్దు అదుపు లేని సోషల్ మీడియా

సెన్సార్ లేని సినిమాల అడ్డగోలు మాయ

జవాబుదారీ లేని తల్లితండ్రీ వ్యవహారం

గురువు అంటే భక్తి లేని శిష్యుల పరంపర

జీవితం అంటే సరదా తెంపరితనం ఇంకా....

రామాయణ సారం చెపితే వినే యువత ఏక్కడ

భారత సారాంశం వివరిస్తే వినే యువత ఏక్కడ?

కాగడా పెట్టి వెతుకు వెలుగు వెనుక చీకటి తప్ప

మారదు కాలం మారవు ఋతువులు

మారుతుంది మనుషులు మాత్రమే

మారకండి సంప్రదాయాలు మార్చకండి

ఆలోచనలు మాత్రమే మార్చండి

మంచి అనే దృష్టికోణంలో చూడండి

 

కోవూరి

 

 

మధ్య తరగతి మనో "గతం"

(ఎవరో తస్కరించి వాట్సాప్ లో పెట్టేరు .. మన కోసం .)

 

ఎవరో ఈల వేసి పిలిచినట్టు సెల్ ఫోను

మోగగానేఆయనకేసి చూశాను

జాపుకున్న కాళ్ళకి పతంజలి నూని రాసుకుంటూ...

"పార్వతీ ! నీ కొడుకు నీ అకౌంటకి 2000 డాలర్లు పంపాడట ,

వ్వాట్సాప్ లో చెబుతున్నాడు" అన్నారు

మావారు శంకర ప్రసాదు గారు.

"డాలర్లలో చెప్పకండి, నాకర్ధమయ్యేట్టు రూపాయల్లో చెప్పండి" అన్నాను విసుగ్గా.

"2000 ని 74 తో గుణించు... రూపాయల్లో వస్తుంది " అన్నారు విద్యార్థికి లెక్క ఇస్తున్నట్టుగా

"ఆ గుణకారాలేవో మీరే చెయ్యండి,

లెక్కల మాష్టారు కదా ?" అన్నాను తెలివిగా .

"లక్షా నలభై ఎనిమిది వేలవుతుంది" అని చెప్పేసి వ్వాట్సాప్ లోకి దూరిపోయారు యధాలాపంగా.

 

చెప్పొద్దూ... అమెరికా వెళ్ళినప్పుడల్లా ఏ మాల్ కి వెళ్లినా ధరలు చూసి వెంటనే 70 తో గుడించేదాన్ని,  నాకు ఏడో ఏకం బాగానే వచ్చు .

 

రూపాయిల్లోకి మార్చాక గుండె గుభేల్మనేది .

"ఇక్కడ రూపాయల్లో ఆలోచించ కూడదమ్మా"

అనేవారు పిల్లలు.

పుట్టుకతో వచ్చింది ఊరికినే పోతుందా ?

 

కరివేపాకు కట్ట 70 రూపాయలట !

అందుకే.. కూరల్లో,చారులో కొంచం తగ్గించే వేసేదాన్ని.

ఎప్పుడు ఏ సంఘటన జరిగినా ... ఎందుకో పాత జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి.

ఈయన మూడేళ్ళ కిందట రిటైర్ అయ్యాక మరీను !

 

ఇప్పుడు నా రెండో కొడుకు ప్రత్యేకం జ్ఞాపకంపెట్టుకుని,

నాపుట్టిన రోజుకి ఏదైనా కొనుక్కోమని లక్ష చిల్లర డబ్బులు పంపిస్తే ఆనందమే ....కానీ....

అప్పట్లో మా మావయ్య నాపుట్టిన రోజుకని ఇచ్చిన యాభై రూపాయలకి ఎంత సంబర పడిపోయానో....  ఎంత మందితో చెప్పుకున్నానో !

అంత సంతోషించడానికి కారణం ఆ వయసా ?  అప్పటి పరిస్థితులా ? లేక అవసరాలా? ఏమో!

 

ఇప్పుడు ఖరీదైన 4 బెడ్ రూముల అపార్టుమెంటు,

ఏసీలు,సోఫా సెట్లు,కింగ్ సైజు మంచాలు, అమెరికా పరుపులు, పేద్ధ టీవీ, ఖరీదైన కారు ...అన్నీ ఉన్నా....

 

ఎందుకో.. ఆ మూడు వరస గదుల అద్దె ఇంట్లో మా అత్త గారు,మేవిద్దరం,ముగ్గురు పిల్లల్తో ఉన్నా ఎంతో ఆనందంగా, కళ కళ్ళాడుతూ ఉండేది !

ఇరుకు అనిపించేదే కాదు.

 

సెకండు హ్యాండు స్కూటర్ మీద ఆయన అలా ...  గోదారి గట్టు మీదకి తీసుకెడితే ...

ఆ ‘ఇదే’ వేరు ! ఫ్రిజ్ కూడా లేదు, నలుపు, తెలుపు టీవీ లో చిత్ర లహరి చూస్తుంటే ఏమి ఆనందించాం !

 

మా ఆడపడుచులు వస్తే అందరం బరకం పరుచుకుని, పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే.. నిద్రే వచ్చేదికాదు !

మా అత్త గారు కూడా మధ్యలో కబుర్లు కలుపుతూ, కునికి పాట్లుపడుతూ,

"ఇంక చాలు, పడుక్కోండి, తెల్లారి పోతోంది, మళ్ళీ పెందలాడే లేవాలి" అనేవారు.

 

మా కబుర్ల కంటే నవ్వులే ఎక్కువగా ఉండేవి,… ఎవర్నీ నిద్దరోనీకుండా.

మా ఆడపడుచులు ఎంతో మంచివాళ్ళు,  ఇప్పటి టీవీ, సినిమా ఆడపడుచుల్లా కాదు.

 

అప్పట్లో ఈయన పినతల్లి కొడుకు పెళ్లికి వెళ్ళాలంటే మంచి పట్టు చీరలే ఉండేవి కావు.

 

ఇప్పుడు మూడు బీరువాల నిండా ఎవరెవరో పెట్టినవి, పెట్టించుకున్నవి,కొనుక్కున్నవి చాలా ఉన్నాయి.

పట్టు చీరలైతే లెక్కే లేదు…. ఫాన్సీ చీరలు ఉన్నా ...  ఏం కట్టుకుంటాం ?

 

అటూ, ఇటూ అందరి పెళ్ళిళ్ళూ అయిపోయాయి.

అందరి కుటుంబాల నించీ ఒక్కళ్ళైనా అమెరికాయో, లండనో చెక్కేశారు.

మా రోజుల్లో కొంపకి ఒక్కళ్లు హైదరాబాద్ వెడితే ...  అబ్బో’ అనుకునే వాళ్ళం.

శ్రావణ మాసం పేరంటంలో ఎవరైనా "మావాడు హైడ్రాబాడ్ లో చార్మినారు,ట్యాంకు బండూ చూపించాడు" అంటే,

మనం ఎప్పుడు చూస్తామో అనుకునే వాళ్ళం.

 

ప్రస్తుతం మా పిల్లలు, ఇద్దరబ్బాయిలూ,

ఒకమ్మాయి అమెరికా లో స్థిరపడ్డారు...

"శతమానం భవతి" సినిమాలో లాగ. నేనూ,ఈయనా ఇక్కడే భాగ్య నగరంలోనే ఉండిపోయాం... జయ సుధా, ప్రకాష్ రాజుల్లాగా.

 

కొడుకులు ఫోను చేసినప్పుడల్లా "గ్రీన్ కార్డు" అంటూవుంటారు....

స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ మాటిమాటికి

"నా ఉజ్జోగం?" అన్నట్టు!

 

ఎందుకో అమెరికా వెళ్లాలంటే ఇంకా మనసు రావడం లేదు,

 

ఇక్కడే పాత స్నేహితులు,చుట్టాలతో వాట్సాప్, ఫోనులతో కాలక్షేపం చేయడమే ఇష్టం. తరవాత్తరవాత భగవంతుడెలా నిర్ణయిస్తాడో మరి!

నాకు మాత్రం, ఆ టీవీ సీరియళ్లు, చాగంటి వారి ప్రవచనాలు చూసుకుంటూ వేళకి ఇంత ఉడకేసిపడేస్తే హాయిగా గడిచిపోతుంది.

అన్నట్టు మొన్న వేసంకాలం మా అమ్మాయి, పెద్ద మనవరాలు, మనవడు వచ్చినపుడు వేలకి వేలు తగలేసి నాకోసం ట స్మార్టు ఫోను,టాబ్ కొన్నారు.-....చెప్పాచెయ్యకుండా .

వాటిల్లో వాట్సాప్, యూట్యూబు పెట్టి నన్ను చూసుకోమన్నారు.

మా పెద్ద మనవరాలు మా హై స్కూల్ సైన్సు మాష్టారి లాగ అన్నీ నేర్పించి వెళ్ళింది.

 

ఈయన నేర్పితే రాదుకానీ... అది నేర్పితే బాగానే అలవడ్డాయి నాకు.

 

నిజంచెప్పొద్దూ... అవన్నీ నేర్చుకున్నాక,

రోజూ పిల్లలందరి మెసేజీలు, ఫోటోలు, వీడియోలు,

రక రకాల విశేషాలు చూస్తుంటే ...మాటాడుతుంటే…

టైమే తెలియడంలేదు.

 

ఈమధ్య ‘భావుక’ మిత్ర బృందం తో చేరాక చిన్నప్పటి నా క్లాసు మేట్లు అందరూ కట్టగట్టుకుని వచ్చినట్టుంది.

 

పిల్లలు ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్నారనే భావమే రావడంలేదు.

 

అదే నా పెళ్ళైన కొత్తలో నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న మా అమ్మ కోసం ఎంత బెంగెట్టుకునేదాన్నో!

ఏమాటకామాటే చెప్పుకోవాలి, పాపం ఈయన వారానికి రెండుసార్లు పుట్టింటికి పంపించేవారు.  బడ్జెట్ ఇబ్బందులున్నా !

 

తనికెళ్ళ భరణి తీసిన "మిధునం" చూస్తుంటే మా కధే తీసినట్టు అనిపిస్తుంది.

కాకపోతే లక్ష్మి, బాలు గార్లు పల్లెటూళ్ళో ఉంటారంతే.

 

మా పిల్లలు వారానికి రెండు మూడు సార్లు వీడియో కాల్సు చేస్తే వంట డ్యూటీ తనదేనని పాపం శంకర ప్రసాద్ గారికి తెలుసు.

 

ఆయనక్కూడా వాట్సాప్, యూట్యూబు,ఫేసు బుక్కు ఉన్నా,ఆయన రూటే ...సెపరేటు.

ఎప్పుడూ రాజకీయాల గొడవే !  "వాడలా అన్నాడు, వీడిలా అన్నాడు "

అని ఆవేశపడిపోతూ ఉంటారు.

 

ఆ ఫేసు బుక్కులో వ్యాసాలకి వ్యాసాలు రాసేస్తుంటారు,

తానే సమాజాన్ని మార్చెయ్యాలన్నట్టు !

 

ఇంక టీవీ చూడ్డం మొదలెడితే స్నానమవదు, అన్నానికి లేవరు.

పొద్దుకుంగే దాకా ఆ దిక్కుమాలిన ఛానళ్ళ లో వాదనలే వింటుంటారు.

 

పది మందీ కలిసి ఒక్క సారే అరిచేస్తుంటారు,

ఒకడు చెప్పీది ఇంకోడు వినిపించుకోడు.

ఈయన,"నువ్వునోరుముయ్యరా" అని అరిచేస్తుంటారు !

రోజూ ఇదో ప్రహసనం !

 

నేను మాత్రం, నా గది లోకి వెళ్లి, ఏసీ వేసుకుని,

సుమ ఆడవాళ్ళ చేత ఆడించే ఆటలు చూస్తూ,

వాళ్ళు కట్టుకున్న పట్టుచీరలు, నగలు చూస్తూ,

ఈటీవీ లో 'అభిరుచి' లోని రక రకాల వంటల కార్యక్రమాలని ఎంజాయ్ చేస్తుంటాను.

 

ఆయనకి ఇవేమీ నచ్చవు.

ఎప్పుడూ రాజకీయాలు, వార్తలు, ట్రంపు, మోడీ,

చంద్రబాబు,కేసీయారు, జగన్ను,పవన్ను......  లేక పోతే

ఆ జంతువులు ఒకదాన్నొకటి పీక్కుతినే 'విజ్ఞాన' చానళ్ళు ట.... అవే చూస్తుంటారు.

 

మా దాంపత్య జీవితం లో నగలు, చీరల కోసం ఎన్నడూ ఆయన్ని వేధించలేదు కానీ..   చిన్న టీవీ ఉన్నప్పుడు మాత్రం, సీరియళ్ల టైముకి ఛానల్ మారిస్తే మాత్రం గొడవలే.

 

అందుకే మొన్నామధ్య మా చిన్నబ్బాయి వచ్చినపుడు, రాజీమార్గం గా

నా కోసం ఒకటి, వాళ్ళ నాన్నకి ఒక పేద్ధ టీవీ కొని పారేశాక, కొంపలో శాంతి నెలకొంది... శ్రీలంక లో లాగ..

 

అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది,  ముగ్గురు పిల్లలు, నేను, మా ఆయన, మా అత్త గారు ఉన్నపుడు ఇల్లు ఇరుకనిపించ లేదు, డబ్బు లేదనిపించలేదు.

(ఈయన జీతం ఏ నెల్లో ఎంత వచ్చేదో నేను ఎప్పుడైనా పట్టించుకుంటేగా!)

 

చుట్టాలు, పక్కాలు వచ్చి మూడు,నాలుగు రోజులుండి పోయినా ఇబ్బందనిపించేది కాదు.

ఎన్నిసార్లు డికాషన్ తీసేదాన్నో..  ఎన్నిసార్లు కుక్కర్ పెట్టేదాన్నో !

సమయానికి గ్యాస్ అయిపోతే, పక్క వాటా వాళ్ళ సిలిండెర్ ఉమ్మడి ఆస్తి అయిపోయేది.

 

ఫ్రిజ్ లేని రోజుల్లో అధాట్టుగా ఎవరైనా వస్తే, పాలు, పంచదార,కాఫీ పొడికి పక్కింటి

రాధమ్మ గారే మాకు క్రెడిట్ కార్డు.

 

ఇప్పుడేమో లంకంత కొంపలో బిక్కు బిక్కుమంటూ మేమిద్దరమే….

అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయిలాగ.  ఎవరి ఫోన్లు, డెబిట్ కార్డులు, బాంక్ అకౌంట్లు,  ఫేసుబుక్ అకౌంట్ లు వాళ్లవే.  పిల్లలు వారంలో ఐదారు సార్లు ఫోను చేసినా ఆయనతో మాట్లాడేది తక్కువే .

ఎప్పుడైనా ఆయన ఫోను తీస్తే, "ఎలా ఉన్నార్రా ?"  అంతే. మాటలే ఉండవు.

అదే మాకయితే డైలీ సీరియళ్ళే !

 

మా చిన్న కోడలు ఫోను చేసిందంటే బీబీసీ దగ్గరినించీ అన్ని చానళ్ల న్యూస్ చెప్పాక,

మా బుల్లి మనవడి బొమ్మల టెంటు లోకి తీసుకెళ్లి వాడితో మాట్లాడించే లోపు

వాడు "నానమ్మ, బాయ్" అంటాడు.  వాడు బాయ్ ఎంత బాగా చెప్తాడో !

 

మాపెద్ద కోడలైతే వీకెండ్ లోనే మాట్లాడుతుంది,  ఉద్యోగ భారం కారణంగా .

ఈ లోగా మా పెద్దాడు వచ్చి,  "అమ్మా,గ్రీన్ కార్డు విషయం ఏంచేశారు?"అంటాడు

సినిమా మధ్యలో వాణిజ్య ప్రకటన లాగ.

 

"మీ నాన్ననడుగు" అని ఆయన మీదకి తోసేస్తాను. ఆయనతో ఈ విషయం మాట్లాడ్డానికి వాడికెందుకో  చాలా 'ఇది'.

 

మా అమ్మాయి అయితే ఈటీవీ జబర్దస్తు లెవెల్లో జోకులు వేస్తూనే ఉంటుంది.

ఈ లోగా మా పెద్ద మనవడు, మనవరాలు వచ్చి, వాళ్ళకొచ్చిన గిఫ్టులు,సర్టిఫికెట్లు చూపించేస్తారు.

 

అంతసేపు మాట్లాడ్డానికి ఏముంటాయి?"  అంటారీయన.!

ఈయనకేంతెలుసు, పిల్లల్తో మాట్లాడాక నాకు టానిక్ తాగినట్టుంటుందని ?

 

మా అబ్బాయిలు "అమ్మా, వచ్చే సమ్మర్ కి మీరు ఇక్కడికి రావడానికి టికెట్లు బుక్ చేస్తున్నాం " అంటే "మీ నాన్న తో చెప్పండి" అని ముక్తాయిస్తా .

 

వాళ్ళ నాన్నని అడిగితే "మొన్ననే కదరా వచ్చాం" అంటారని వాళ్లకి తెలుసు.

ఎందుకో రాను రాను అమెరికా ప్రయాణాలు బోరు కొడుతున్నాయి .

 

అదే చిన్నప్పుడు విమానం శబ్దం వినిపిస్తే చాలు, బయటికి పరుగెత్తి,

విమానం కనుమరుగయ్యేదాకా చూస్తే ఎంత బాగుండేదో !

 

అదే ఇప్పుడు ..ఎయిరిండియాలూ, లుఫ్తాన్సాలు, ఎతిహాద్ లు ఆనట్లేదు.

 

చిన్నప్పుడు పిల్లల్తో ఎర్ర బస్సెక్కి పుట్టింటికి వెడుతుంటే ...

కిటికీ లోంచి ఆ పచ్చటి పొలాలు,కాలువలు,చెట్లు ఎంత అందంగా ఉండేవని !

(అప్పట్లో ఈయన జోకు... నేను పుట్టింటికెళ్లేటప్పుడు ఎర్ర బస్సు వికార పెట్టదుట

అదే బస్సు తిరుగు ప్రయాణంలో ఎంత వికార పెడుతుందోట!)

 

ఇప్పుడేంటి ?

హాంగ్ కాంగు, దుబాయి, ఫ్రాంక్ ఫర్టు,అబుదాబీ లు మామూలుగానే కనిపిస్తున్నాయి?

 

పుట్టింటినుంచి వచ్చేస్తుంటే అమ్మ కొన్న చుక్కల కాటన్ చీర ఎంత బాగుండేది !

(ఇప్పటికీ దాచుకున్నా)

 

ఇప్పుడు ఈయన, పిల్లలు ఎన్ని వేలో పోసి కొన్న పట్టు చీరలు ఎందుకు అంత గ్లామరస్ గా అనిపించట్లేదు?

 

ఇలా చెప్పుకుంటూ పోతే.... ఎన్నో,ఎన్నెన్నో!

 

మా చిన్నాడి పెళ్లికి మొదలయిన టీవీ సీరియల్,

"జిగట కాంభోజి రాగాలు" ఇప్పటికీ మలుపుల మీద మలుపులు తిరుగుతూ పోతున్నట్టు, ఎప్పటికీ పూర్తి కాదు.

 

నా ఈ మధ్య తరగతి మనోగతం లోని కొన్నిఅనుభవాలు.


**************** 

 

 

 

 

 

 

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...