3, డిసెంబర్ 2020, గురువారం

వారాంతపు పుస్తక సమీక్షలు, శనివారము, 28.11.2020

 


వారాంతపు  పుస్తక సమీక్షలు,  

శనివారము,  28.11.2020

పోతన పద్య రత్నాలు.

పోతన గారి భాగవతంలోని ద్వితీయ స్కందంలో నాకు బాగా ఇష్టమైన ఒకటి రెండు పద్యాలని నేడు మీతో పంచుకుంటాను.

భగవంతుని భక్తి తత్వాన్ని విరాట్స్వరూపమునీ తెలుపుట

2-18-సీ.II

కలలోనజీవుండు కౌతూహలంబునఁ   బెక్కు దేహంబులఁ బేరువడసి,

యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు నీక్షించి మఱి తన్ను నెఱుఁగు కరణి,

నఖిలాంతరాత్మకుఁడగు పరమేశ్వరుఁ డఖిల జీవుల హృదయముల నుండి

బుద్ధి వృత్తుల నెల్ల బోద్ధ యై వీక్షించు బద్ధుండు గాఁడు ప్రాభవము వలన,

 

2-18.1-తే.II

సత్యుఁ డానంద బహుళ విజ్ఞానమూర్తి

యతని సేవింప నగుఁగాకయన్యసేవఁ

గలుగనేరవు కైవల్య గౌరవములు

పాయ దెన్నఁడు సంసారబంధ మధిప!

 

భావము:

రాజా! కలలు కనేటప్పుడు జీవుడు ఉబలాటంతో పలు శరీరాలు తాలుస్తాడు. పలుపేర్లతో వ్యవహరింప బడతాడు. ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గమనిస్తాడు. పిమ్మట మెళకువ వచ్చిన తరువాత, తన్ను తాను తెలుసుకుంటాడు. ఇలాగే సమస్తానికి అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు, సర్వ ప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధివ్యాపారా లన్నింటినీ పరిశీలిస్తుంటాడు.

తానే అన్నిటికీ ప్రభువు కాబట్టి, దేనికీ బద్ధుడు కాడు. తాను సత్యస్వరూపుడు. ఆనదంతో నిండిన విజ్ఞానమూర్తి. ఆయన సేవ వల్లే మోక్షం సిద్ధిస్తుంది. ఇతరులను కొలిస్తే మోక్షం లభించదు. సంసార బంధం వదలదు.

 

పోతనపద్య రత్నాలలో "ద్వితీయ స్కంధములో" కనిపించే ఇంకొక సీసము ఆస్వాదించగలరు

 

"పద్య రచన" నిరంతరం చేసే వారు కూడా ఈ అందమైన, సహజమైన యతి ప్రాసల వైభవాన్ని, సౌరభాన్ని ఆస్వాదించగలరు, పరిశీలించగలరు 

 

2-21 సీ.II

కమనీయభూమిభాగములు లేకున్నవే పడియుండుటకు దూదిపఱుపు లేల?

సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజనభాజనపుంజ మేల?

వల్కలాజినకుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘంబు లేల?

కొనకొని వసియింప గుహలు లేకున్నవే ప్రాసాదసౌధాది పటల మేల?

 

2-21.1 తే.II

ఫలరసాదులు గురియవే పాదపములు;

స్వాదుజలముల నుండవే సకల నదులు;

పొసఁగ భిక్షము వెట్టరే పుణ్యసతులు;

ధనమదాంధుల కొలువేల తాపసులకు?

 

భావము:

బుద్ధిమంతులు భావనలు ఇలా ఉంటాయి. “పడుకోడానికి చక్కటి నేల ఉండగా, దూది పరుపు లెందుకు? పుట్టుకతో వచ్చిన చేతులు ఉండగా, ఇంకా కంచాలు గరిటలు ఎందుకు? నారచీరలు జింకచర్మాలు ధర్భచాపలు ఉండగా, ఇంకా పట్టుబట్టలు అవి ఎందుకు? చక్కగా ఉండటానికి గుహలు ఉండగా, మేడలు భవనాలు ఎందుకు? చక్కగా రసవంతమైన పళ్ళు కాసే చెట్లు, తియ్యటి మంచి నీటిని యిచ్చే నదులు, పుష్కలంగా భిక్ష పెట్టే పుణ్యస్త్రీలు ఉండగా, హాయిగా తపస్సులు చేసుకొనేవానికి, ధనమదంతో కన్నుమిన్ను కానని వాళ్ళని పోయి ఎందుకు సేవించటం?”

 

ముక్తికోరుతున్న పరీక్షిత్తుకు అవధూతోత్తముడు శుకబ్రహ్మ విరక్తి మార్గం చేపట్టి, తపస్సు చేసుకొనే జ్ఞానవంతుల ఆలోచనా సరళి జీవనవిధానాన్ని ఇలా వివరించాడు.

*****

 

 

 భాగవతంలోని ప్రధమ స్కందములోనిపద్యం 28వ పుట లోనిది.  భాగవతాన్నిశ్రీహరికి అంకితమివ్వవలెనని  పోతనగారు నిర్ణయించు కున్నపుడు రాసిన పద్యం,

.II

ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులువాహనంబులన్

సొమ్ములు గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరమువాసి, కాలుచే

సమ్మెటవ్రేటులంబడక  సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పెనీ

బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.

 

భావము:

విశ్వ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొనివి రచించిన భాగవతాన్ని భగవంతునికి తప్ప, చిల్లర మల్లర ప్రభువులకు అంకితమివ్వటానికి నా అంతరంగం అంగీకరించుటలేదు. ఎందుకంటె, రాజులిచ్చే అగ్రహారాలు, హారాలు, వస్తువాహనాలు పుచ్చుకొని మైకంలో మైమరచి లోకంలో సుఖం అనుభవించినను, లోకంలో అడుగు పెట్టినపిమ్మటఁ పూర్వంచేసిన తప్పిదాలకు యమధర్మరాజు చేతిలో సమ్మెటపోట్లు తప్పవు, అందుకే బమ్మెర పోతరాజు  చక్కగా ఆలోచించి భాగవతమును భగవంతుడైన శ్రీహరికే  మర్పించటానికినిశ్చయించుకున్నాడు.

*******

 

పోతన మనకందించిన అమృతఫలం, సుధాభాండం... ఆంధ్ర భాగవతం గుఱించి..ముందుగా రెండు మాటలు..

పండి మగ్గిన వ్యాస భాగవతము అనే ఫలం, పోతన్న వంటి తెలుగు చిలుకకు లభించడం దైవ నియోగం. ఆంధ్ర రసికుల అదృష్ట యోగం :

ఆ.వె.II

వేద కల్ప వృక్ష విగళితమై సుక

ముఖ సుధా ద్రవమున మొనసియున్న

భాగవత పురాణ ఫల రసాస్వాదన

పదవి గనుడు రసిక భావవిదులు.

భాగవత పురాణం ఎలా అవతరించిందో, ఎలా వ్యాపించిందో సుమధుర రూపకంగా పొదిగి చూపిన పద్యమిది. భాగవతం ఒక ఫలం.. . అది, వేదమనే కల్పవృక్షం నుంచి జారి పడిందిట... నేలమీద కాదు.. శుకముఖం లో... సుధాద్రవంతో సురుచిరంగా భాసించే ఫల రసాన్ని ఆస్వాదించే పదవి రసిక భావ విదులదట.కావ్యాస్వాదనకు రసికత్వం, భావుకత్వం అనే సుగుణాలు  (పదవులు)... ఆవస్య గుణాలు. పురాణ ఫలం.. పదవి గల అధికారులకే నిర్దేశింపబడింది.

 

పోతన కూర్చిన రూపమాలికలో "శుక ముఖం" అనే సమాసం, శ్లేషావాసం..

శుకయోగితోపాటు, చిలుక తళుకులొలకడం పద్యంలో సరిక్రొత్త రుచులు చిలక డం.

 

(సినారే వారి వ్యాఖ్యానం కొంత తీసికొన్నాను)

ఇక,నేను నాడు, భాగవత దశమ స్కందము లోని...  గోపబాలకులతో, ఒకనిగా కలసిపోయి, సామాన్య బాలకునిలా, వారి ఆత్మీయునిలా  ప్రవర్తిల్లే జగన్నాధుని  ""చల్ది తినెడి ఘట్టాన్ని"" గూర్చి పంచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

ఇది, పోతన గారి భాగవతంలో నాకు ఇష్టమైన అనేకానేక ఘట్టాలలో ఒకటి.

సీ.II

మాటిమాటికి వ్రేలు మడిచి నూరు  గాయలు దిను చుండు నొక్క;

డొకని కంచములోని  దొడిసి చయ్యన మ్రింగి చూడు లేదని నోరు సూపు నొక్క;

డేగు రార్గుర చల్దు లెలమిఁ  బన్నిదమాడి  కూర్కొని కూర్కొని  కుడుచు నొక్క;

డిన్నియు దగ బంచి యిడుట నెచ్చెలితన మనుచు బంతెనగుండు లాడు నొకడు.

 

.వె. II

కృష్ణుఁ జూడు మనుచు గికురించి పరు మ్రోలి,

మేలి భక్ష్యరాశి మెసఁగు నొకడు;

నవ్వు నొకడు సఖుల నవ్వించు నొక్కఁడు;

ముచ్చటాడు నొకఁడు మురియు నొకఁడు.

 

సీ.II

కడుపున దిండుగాఁ  గట్టిన వలువలో లాలిత వంశనాళంబుఁ  జొనిపి

విమల శృంగంబును వేత్రదండంబును జాఱిరానీక  డా చంక నిఱికి

మీగడ పెరుఁగుతో మేళవించిన చల్దిముద్ద  డాపలిచేత మొనయ నునిచి

చెలరేఁగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి

 

.వె.II

సంగడీల నడుమఁ జక్కన గూర్చుండి

నర్మ భాషణముల నగవు నెఱపి

యాగ భోక్త కృష్ణుఁ డమరులు వెఱగంద

శైశవంబు మెఱసి చల్ది గుడిచె.

 

(లాలిత వంశ నాళము = లేలేత వెదురు పిల్లన గ్రోవి, మోహన వంశి)

(వేత్రదండము =బెత్తము, చేతి కఱ్ఱ)

 

చుట్టూ గోపాల బాలురు కూర్చున్నారు.. మధ్యలో బాల కృష్ణుడున్నాడు. అందరూ కలసి నవ్వుతూ, తుళ్ళుతూ, ఇకిలిస్తూ, కికురిస్తూ తెచ్చుకొన్న చల్దులు తింటున్నారు.. తినే తీరును, కుఱ్ఱవాళ్ళ హుషారును అప్పటికీ, ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లు మనసు అనే కాన్వాస్  మీద చిత్రించాడు పోతన్న. ప్రతి పలుకుబడినీ తూచి, తూచి వేసాడు. వ్రేలు మడిచి ఊరించడం, ఊరగాయలు నంచుకుని తినడం, ఒకరి కంచం లోనిది మఱొకడు గబుక్కున మింగి "చూడు లే"దని నోరు చూపడం, పందెం కాచి, ఐదారుగురు తినవలసిన చద్ది బువ్వను పట్టించి, దట్టించి ఒక్కడే తినేయడం.. ! ఎన్నెన్ని సరదా చేష్టలు ! ఎంతటి స్వాభావిక చిత్రణం !!

ఇప్పటి పిక్నిక్ వాతావరణాన్ని, ఎప్పుడో బొమ్మకట్టి చూపించేసాడు గొప్ప సహజ కవి... పుట్టుకవి.

అందుకే పోతన్న 'ఇజం' ఎరుగని ప్రజాకవి. తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకొని, తెలుగువాడి రసనపై (నాలుకపై).. చిరంజీవిగా, ఎప్పటికీ  తాండవిస్తూనే ఉంటాడు మన అందఱివాడు  పోతన..

 

వట్టెం వెంకట రమణ

 

******

 

ఇష్టపది.....( కాలమహిమ )

శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు, ప్రసిద్ద చింతామణి నాటకంలోని  "కాలమహిమ " గురించి చెప్పిన అద్భుతమైన పద్యం యిక్కడ ప్రస్థావిస్తున్నాను, దయచేసి గమనించండి.

తెలుగు నాటక రంగంలో తనదైన ముద్ర వేసిన శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఎంతో శ్రావ్యంగా పాడిన పద్యం వీడియో కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.....

దాదాపు వంద సంవత్సరాల క్రితం వ్రాసిన సాహిత్యం అప్పటికి, ఇప్పటికి మరి ఎప్పటికీ అన్ని కాలాలకు తప్పకుండా వర్తిస్తుంది...

( నాకు గుర్తున్న పద్యం అలాగే వ్రాస్తున్నాను, ఛందోబద్దమైన సాహిత్యం సమయానికి అందుబాటులో లేదు)

 

పద్యం.

ఘనుని హరిశ్చంద్రు కాటికాపరి జేసె

మురసుతు సార్వభౌమునిగ సలిపె

అల రంతిదేవు నల్లాదురుగ జేసె

పేద కుచేలు కుబేరు జేసె

ధర్మాత్ము బలిని పాతాలమునకుంద్రొక్కె

కలుషాత్ము నగుషు స్వర్గమునకెత్తె

విప్రనారాయణు విటునిగా ఒనరించె

వడగునంబిని భక్తియుతు జేసె

కాలమన యిట్టి మహిమంబులు గలది  

యగుట మానవుడు మేను విడిచిన

మరుదినమున గాక సుగుణ

దుర్గుణంబులు, కలిమిలేమియు

లెల్లరావని వచియింతురెల్ల బుధులు..

నాకు స్పురించిన భావం యిక్కడ సమర్పిస్తున్నాను.

మహా చక్రవర్తులు, రాజులు, పండితులు, దానశీలురు, పరమనిష్టాగరిష్టులు, నిష్టదరిద్రులు, కలుషాత్ములు, ఖలులు.. ఎవ్వరయినా సరే తప్పక కాలప్రభావానికి లోను కావాల్సిందే .

వారి వారి గతకృత్యముల ప్రభావములచే, సుగుణ దుర్గుణముల ఫలితంగా, కాల మహిమను తప్పించు కొనుట అసాధ్యం....కావున అందరూ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుంటారని భావిస్తున్నాను.

 

పి.ఎల్.నాగేశ్వరరావు

*******

 


సుమతీ శతకము నుండి కొన్ని పద్యాల పరిచయం

కవి: బద్దెనార్యులు

 

అందరికీ సుపరిచితమైన సుమతీ శతకం నించి కొన్ని పద్యాలు మిత్రులతో పంచుకుంటాను.

1260 ప్రాంతంలో సుమతీ శత కాన్ని బద్దెన గారు వ్రాసారు. ఈయన తిక్కనకు సమకాలికులు. కమలాశన బిరుదాంకితులు.

అలతి పదాలతో చక్కని ఉపమానాలతో, లోకొక్తులతో, గంభీరమైన సత్యాలను పామరులు సైతం వల్లేవేసే విధంగా సరళంగా చెప్పడం వల్ల ప్రజల నాల్కలపై చిరస్థాయిగా నిలిచి పోయాయి పద్యాలు.

సుమతీ శతకము పద్యాలన్నీ కంద ఛందస్సులో ఉంటాయి వీటిలో చాలా పద్యాలు పాటశాల స్థాయిలో అందరూ చదువుకున్నవే కావడం గమనార్హం.

సుమతీ! అనే మూడక్షరాల మకుటంతో అన్ని పద్యాలు వ్రాయడం జరిగింది. సుమతీ అంటే మంచి బుద్ధి కలవాడా! అని వినువారిని సంబోధిస్తూ అనన్యమైన బుద్ధిని బోధిస్తాయి. మచ్చుకు కొన్ని పద్యాలు చూద్దాం.

1.

అడిగిన జీతం బియ్యని

మిడిమేలపు దొరను గొల్చి మిదుకుట కంటెన్

వడిగల యెద్దులు గట్టక

మడి దున్నుకు బ్రతకవచ్చు మహిలో సుమతీ!

మిదిమేలపు=గొప్పలు చెప్పు కొనెడి; దొర=యజమాని; మిడుకుట=బాధపడుట; వడిగల=సామర్ధ్యం గల; మడి=పొలము, మహి=భూమి.

 

భావము:

ఒప్పుకున్న జీతం ఇవ్వకుండా గొప్ప కబుర్లు చెప్పే యజమాని దగ్గర పనిచేస్తూ పైకి అతనిని పొగుడుతూ లోపల బాధప డుతూ ఉండే కంటే మంచి మేలైన ఎద్దుల సాయంతో పొలం దున్నుకుని బ్రతకడం మేలు అని నీతిని చెపుతున్నారు బద్దెన గారు.

 

2.

ఆకొన్న గూడె యమృతము

తాకొంకక యిచ్చువాడె దాత ధరిత్రిన్

సోకోర్చువాడె మనుజుడు

తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ!

 

ఆకొన్న=ఆకలితో ఉన్న; కూడు=ఆహారం; తాకొంకక=వెనుకాడక; సోకోర్చు=కష్టమునకు ఓర్చుకున్నవాడు; తేకువ =ధైర్యం

భావము:

ఆకలితో ఉన్నప్పుడు అన్నమే అమృతం అయి ప్రాణాలు నిలుపుతుంది. అడిగినవారికి లేదనకుండా ఇచ్చిన వాడే దాత అనిపించుకుంటాడు. కష్టములను ఓర్చుకున్నవాడే పూర్ణ పురుషుడు అవుతాడు. ధైర్యం కలవాడే ధీరుడై వంశం పేరు నిలబెడతాడు అని భావం.

 

3.

ఇచ్చునదె విద్య, రణమున

జొచ్చునదే మగతనంబు, సుకవీస్వరులున్

మెచ్చునదె నేర్పు, వాదుకు

వచ్చినదే కీడుసుమ్ము వసుధను సుమతీ!

 

రణం=యుద్ధం; మగతనం=వీరత్వం; నేర్పు=చాతుర్యం; వాదు=గొడవ, తగాదా

 

నలుగురికీ పంచితెనే నిజమైన పాడిత్యం. అలాంటి విద్యకే విలువ. యుద్ధ రంగంలో నికి ప్రవేశించి పోరు సల్పిన వాడే వీరుడవుతాడు. అదేవిధంగా మహా కవులు గొప్ప పాండిత్యం ఉన్నవారు మెచ్చుకుంటేనే సామర్ధ్యం ఉన్నట్టు కానీ ఏమి తెలియని వారు ఆహా! ఓహో! అంటే అదెలా పాండిత్యం అవుతుంది.

అలాగే వాదనకి లేదా గొడవకి వచ్చినదే ముప్పు తెస్తుంది అంటారు కవి.

4.

ఏరకుమీ కసుగాయలు

దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ

పారకుమీ రణమందున

మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!

కసుగాయలు=పక్వానికి రాని పళ్ళు, పిందెలు; పారకు=పారీపోకు; మీరకు=జవ దాటకు; మేదిని=భూలోకంలో

పక్వానికి రాని పళ్ళు ఎంచుకోకు, అవి ఎందుకూ కొరగావు. బంధువుల దోషాలు ఎంచవద్దు. యుద్ధం మధ్యలో పారిపోవద్దు. అదేవిధంగా గురువులు, పెద్దవారి మాట జవదాట వద్దు. ఇవి భువిలో చేయకూడని పనులు అని చెప్తారు బద్దె నార్యులు.

5.

గడన గల మగని జూచిన

అడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలో

గడ నుడుగ మగని జూచిన

నడ పీనుగు వచ్చెననుచు నగుదురు సుమతీ!

 

గడన=సంపాదన; మడుగులిడుట=బట్ట పరచుట అతివలు=స్త్రీలు; గడనుడుగ=సంపాదన లేకపోతే; నడ ఫీనుగు=నడుస్తున్న శవం; నగుదురు=నవ్వుతారు

భావము:

లోకం తీరు ఇలా ఉంది బాగా సంపాదించే భర్తకు అడుగులకు మడుగు లొత్తుతారు ఆడవారు. రెడ్ కార్పెట్ పరుస్తారనమాట. అదే సంపాదన లేని భర్త అయితే  నడిచి వచ్చే శవాన్ని చూసినట్టుగా పరిహాసం చేస్తారట. అందుకే మరి ఉద్యోగం పురుషలక్షణం అంటారు. ఇక్కడ ఉద్యోగమో ఊడిగమో మొత్తానికి  సంపాదించడం అని. అలాగే వండిపెట్టని భార్యకు కూడా విలువ ఉండదు కదా!

వాణిశ్రీ నైనాల, విజయవాడ

 

 

వేమన శతక పద్యాలు

చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు

కొంచమైన నదియు గొదవుగాదు

విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత

విశ్వదాభిరామ! వినురవేమ!

 

భావం: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!

 

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల

భాండశుద్ధి లేని పాకమేల?

చిత్తశుద్దిలేని శివపూజలేలరా?

విశ్వదాభిరామ! వినుర వేమ!

 

భావము:

మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.

 

గంగిగోవుపాలు గరిటెడైనను చాలు

కడివెడైన నేమి ఖరము పాలు

భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు

విశ్వదాభిరామ! వినుర వేమ!

 

భావం: కడివెడు గాడిదపాలకంటె గరిటెడు ఆవుపాలు మేలును కలిగించును. భక్తితో పెట్టిన కూడు పట్టెడు అయినప్పటికి తృప్తిని కలిగిస్తుంది.

 

నిక్క మైన మంచినీల మొక్కటి చాల

తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?

చాటుపద్యములను చాలదా ఒక్కటి

విశ్వదాభిరామ! వినుర వేమ!

 

భావము:

తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది.

 

మిరపగింజచూడ మీద నల్లగనుండు

కొరికిచూడు లోనచురుకు మనును

సజ్జను లగునారి సారమిట్లుండురా

విశ్వదాభిరామ! వినురవేమ!

 

భావము:

మిరియపుగింజ మీద నల్లగానుప్పటికి దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధముగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది.

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి



 

వంశీ మధుర కథల కంచీ మధురభావాల విపంచీ కథా సుధా విరించీ

బాపూ-రమణ

వంశీ సినిమాలకి , రచనలకి అభిమానైన  నేను ఆయన వ్రాసి పబ్లిష్ చేసిన పుస్తకాలు కొనేసి ఏకబిగిన చదివేస్తూ ఉంటాను...ఆయనది మా పక్కూరే అని గర్వం వల్లనైతేనేమి(చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు) , ఆయన కథల్లో మనుషులు, వాళ్ళ పేర్లు మనకు తెలిసినవాళ్ళలాగే ఉండటం వల్లనైతేనేమి..మన ముళ్ళపూడి పెద్దాయన చెప్పే కబుర్లు మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్నట్టుంటే , ఈయన కథలు ఊర్లో వాళ్ళతో మాట్లాడినట్టుటుంది.. అవునంటారా ? కాదంటారా ?

(పెద్దాయన ప్రస్తావన లేకుండా ముందు కెళ్ళడం నా....వల్ల....కాని పని, క్షమించండి)

ఇహ... నస ఆపేసి పాయింటుకొస్తాను...

ఈసారి సిం'ఫుల్'గా తేల్చేస్తా...

ఈరోజు నేను పరిచయం చేయబోయే కథలు "మా పసలపూడి కథలు" నుంచి

జక్కం వీరన్న (పీజీ 37) మరియు

అచ్చుతానిది అమృత హస్తం (పేజీ 299)

 

స్టోరీ ఆఫ్ మిష్టర్ .జక్కం:

మా ఏరియాలో వడ్రంగి మేస్త్రీ జక్కం వీరన్నకి మంచి పేరుంది , అతని చేత మంచాలు, బల్లలు లాంటి ఆషామాషీ పనులు కాకుండా ద్వారాబంధాలకి నెమళ్లు, పందిరిమంచాలకి లతలు వంటి నగిషీపనులు చేయించుకుంటూ ఉండేవారు.

మంచి నిష్ఠాగరిష్టుడైన వీరన్న  , వత్సవాయి వెంకట్రాఘవరాజు గారు/ ఉర్ఫ్ కుక్కలరాజుగారి కొత్త భవనం పనులకు వెళ్తాడు, అతను ద్వారం మీద చెక్కిన , ఏనుగుబొమ్మలు , నిజం నెమలికూడా భ్రమలో పడిపోయేలా పందిరిమంచానికి చెక్కిన నెమళ్ళని చూసి రాత్రికి విందుకి వీరన్నని పిలుస్తాడు, దేవుని పూజ-పని తప్ప, మందు-మాంసం ముట్టనని, రాజుగారి కోపాన్ని కూడా పట్టించుకోకుండా వీరన్న తిరస్కరిస్తాడు!!

మరలా కొన్నాళ్ళకి రాజుగారి రాజహంస లాంచీమీద అందంగా చెక్కిన హంసల్ని  చూడటానికి వచ్చిన మిత్రులందరికీ విందు ఏర్పాటుచేసిన రాజుగారు, వీరన్న ముందు వినయంగా డైలాగ్ వేసేసరికి కరిగిపోయిన వీరన్న నెమ్మదిగా మందు- మాంసం కి లొంగిపోతాడు...

కొన్నాళ్ళకి బుద్ధి వచ్చి మందు మానేద్దామని మా ద్రాక్షారం భీమన్న నుంచి కోటిపల్లి ఈశన్న వరకూ ఒట్లు వేసినా కూడా మారలేకపోతాడు.

ఆఖరుకు .... ఎక్కడా అతుకు లేకుండా చేసిన ఏక చెక్క గొలుసు జనాలకి చూపించి సారా డబ్బులకి అడుక్కునే స్థితికి చేరుకున్నాడు జక్కం వీరన్న.

హ్మ్మ్....పాపం కదా, అంతే అంతే , పెద్ద పెద్దోళ్ళే బయటపడలేకపోయారు బక్కోడు పాపం జక్కం లెక్ఖా ? ..

 

ఇహ రెండో కథ...

అచ్చుతమ్ chef :

అందమైన కోటిపల్లి రేవుని ఆనుకుని ఉంటుంది... అచ్చుతమ్ కాఫీ హోటల్ ..స్వహస్తాలతో పిండిరుబ్బి , రుచికరమైన నేతి పెసరట్లు వేయడం లో అచ్చుతమ్ ఫేమస్ , అమోఘమైన వంటలు చేస్తాడని ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి పెళ్ళి వంటలకి పిలుస్తూ ఉంటారు. ఒకసారి ఒకరికి మాటిచ్చాక ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా రెండో వారికి ఒప్పుకునే రకం కాదు అచ్చుతమ్ , మాటంటే మాటే.

అతను వండేవన్నీ సాధారణ వంటలే అయినా చెయి తిరిగిన మహామహులు చేసే బిర్యానీలు , పులావ్ లు కూడా వదిలేసి , అచ్చుతమ్ వంటల్నే పిసరంత కూడా మిగల్చకుండా తినేసేవారు , ఇతను చేసిన గరికగడ్డి పచ్చడి కూడా అమృతంలా ఉంటుంది మరి!!

అకస్మాత్తుగా ఓరోజు వీపు భాగాన వెన్నుపూసలో తేడా వచ్చి అచ్చుతం రెండు చేతులు పడిపోయాయి , అయినా సరే అతని డిమాండ్ తగ్గలేదు, కూడా ఉండి మరీ తీసుకెళ్ళేవారు, పక్క కూర్చుని అసిస్టెంట్లతో ఉప్పు, కారం పాళ్ళు , పోపులు నోటితో చెప్పి చేయించేవాడు.. వంటల్ని కూడా అమోఘం , అద్భుతం అని అందరూ మెచ్చుకుని తినేవారు.

అయినా తృప్తి కలగని అచ్చుతమ్ ,నేను చేయించడం నేరం , పాపం అని తన పనికి శాశ్వతంగా సెలవు పెట్టేసి... పెట్టె బేడా సర్దుకుని పసలపూడి లో ఉన్న కూతురింటికి వచ్చేసాడు.

పుస్తకంలో 72 కథలున్నాయి , అందులో బాగా నచ్చినవి ఇవి రెండుతో పాటు... ఆరానిపొయ్యి, తెలుకులరవణ, దేవాంగులమణి, డా.గుంటూరు శాస్త్రి , మలబార్ కాఫీ హోటల్, కోరి రావులు గారి కండక్టర్... ఒహటేమిటి లెండి అన్నీ ఆణిముత్యాలే...

నా కథా పరిచయం చదివి , మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపుతారని, నే పరిచయం చేసిన కథలు వివరంగా చదువుతారని ఆశిస్తున్నాను.

విష్ణుప్రియ

******

 

 

యండమూరి గారి పుస్తకాల్లో కొన్ని మంచి ముత్యాలు మీకు అందిస్తున్నాను

విజయానికి ఆరో మెట్టు

వరస గెలుపుల సముదాయమే విజయం. గెలుపుని ఒక వ్యసనంగా చేసుకుంటే , అలవాటు .... విజయంగా మారుతుంది.

 

"పుస్తకం" ముందు పాఠం చెప్పి తరువాత పరీక్ష పెడుతుంది.

"అనుభవం" ముందు పరీక్ష పెట్టి ,  దాని ద్వారా పాఠం నేర్పుతుంది.

 

నీకొక సమస్య వచ్చింది అంటే ఒక యుద్ధం చేసే అవకాశం వచ్చిందన్నమాట. నీకోసం అప్రయత్నంగా ఒక తలుపు తెరుచుకున్నది. గెలిస్తే అది ఒక విజయం.

ఓడితే అది ఒక అనుభవం.

రెండూ మంచిదే కదా!!

 

చేసిన ప్రతి సాయాన్నీ మర్చిపో...              బదులుకోరక!!

వచ్చిన ప్రతి పొగడ్తనీ మర్చిపో...                దాన్ని గెలుచుకున్నాక!!

చేసిన ప్రతి వాగ్దానాన్నీ మర్చిపో...              నెరవేర్చాక!!

తీసుకున్న అప్పు గురించి మర్చిపో...        తీర్చాక!!

 

"ఆత్మ విమర్శ"               మనలో మనం చూసుకునేది

"వ్యక్తిత్వం"                      మనలో బయటవారు చూసేది

"గౌరవం"                         అవతలివాళ్ళు మనకిచ్చేది

వీటన్నిటికీ పునాది "గుణం"  మనలో ఉన్నది.

 

విజయానికి అయిదు మెట్లు

భగవంతుడా ఆశలని మెదడులో నింపకు , ఆశలని హృదయంలో ఉంచి అవి నెరవేరే ఆలోచనల్ని మెదడు లో నింపు.

 

మంచి ముత్యాలు

నా కలలకి కధా వస్తువా ! నీకెలా చెప్పను ? నీ ముంగురుల కదలికలో నాకు ప్రపంచం కనబడుతుందని, నీ కనురెప్పల చప్పుళ్లలో నాకు వేదం వినబడుతుంది అని.

 

కన్నీరా క్రిందికి జారకే ! ఋతువు కాని ఋతువులో గోదారికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే.

ఆనందోబ్రహ్మ

 

మగవాడంటే గుండెలోతుల్లో ఏముందో బయటపడకుండా  చిరునవ్వే తప్ప చిరాకుగానీ, బాధ కానీ బయటపడకుండా హిమాలయాల వలే, కొదమ సింహం లా ఉండాలి

అష్టావక్ర

 

హిమశిఖరం నుంచి కరిగిన నీహారికా బిందు సందోహం నీటి చుక్కై కొండ ప్రక్క శిథిలమైన గుడిని ఆనుకొని ఉన్న కోనేట్లో కలువపూల రేకుల మీద చేరినంత నిర్మలంగా ఉంటుంది నీతో స్నేహం.

రుద్రనేత్ర

వెన్నెల మాట్లాడినట్టు , సెలయేరు

పెదవి విప్పినట్టు, పుప్పొడి పలకరించి నట్టు ,

మహనీయుడు మంత్ర పుష్పం చదివినట్టు -

నీ నవ్వు

ప్రియురాలు పిలిచె

 

రమ,కంకిపాడు

*******

 

 



కం.II 1

చక్కని మోహన రూపము

మిక్కిలి సంతసము నింపు నీరజ నేత్రా!

తక్కువ గాదే లాంతరు

నిక్కము నీ కాంతి యెదుట  నిలువగ దగునా?

 

కం.II 2

నగుమోమున చిరునవ్వులు

ధగ ధగ మని మెరయు కాంత తనదౌ రీతిన్

తగిలెను లాంతరు తోడుగ

పగలాయెను చూడ రేయి పరిపరి విధముల్!!

 

తే.గీ.II

భీకరాకారమందున విశ్వమంత

రోగమొక్కటి వచ్చియు రూపుమార్చె

వాక్సినొచ్చెడి వేళయు పాలుపోక

"భానుడుదయించె, చీకటుల్ వ్యాప్తిజెందె"

 

తే.గీ.II

వరుణ దేవుడుప్పొంగగ వరద వచ్చె

మబ్బులన్నియు జేరిట మాయజేసి

నాకసమ్మున మెండుగ నలముకొనగ

"భానుడుదయించె చీకటుల్ వ్యాప్తిజెందె"

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

ఆ చల్లని తొలి రేయి

మల్లెలు విరబూసిన రాతిరి

వెచ్చని ఊపిరి నేనొదిలిన ప్రతిసారి

నీ కనులలో నే కదలాడిన ప్రతి క్షణమూ

విల్లులా ఒంగిన నీ నడుఒంపు

శరములా దిగిన నీ చూపు

నడచి వచ్చు నాకు

దారి చూపు నీ లాంతరు

వెలుగున దాగిన నీ పసిడి మోము

నవ్విన నీ నవ్వు విచ్చిన మొగలి రేకు

ముక్కున కుట్టిన ముక్కెర కెంత అదృష్టం

పెదవులకంటిన రంగు కెంత గర్వం

కనురెప్పలుకు దిద్దిన కాటుక కెంత సోయగం

మెడ దిగిన బంగారు వంకీ

మోజేతుల నిండిన గాజుల సవ్వడి

నుదిటిన దిద్దిన సింధూరం

పడమటి సంధ్యారాగం

పిలిచిన పలికిన తూరుపు ఉదయపు కిరణం

 

కోవూరి

 

( మనిషి జీవనం )  .వె.II

బాల్యమంత మనకు బంగారు గంతులే

ఉపనయనము దెలుప నోర్పు, నిలవి

వాహబంధ మెల్లగ జూడ గౌరవంబు,

మోక్ష మార్గ మయ్యె ముసలిదనము....

 

( మందలో  లేగ దూడలు )  .వె.II

 

ఈల పాట వినుచు వీనుల విందుగా

పాల గోల లేక పండుకొనగ

కూన లందరికొక గోశాల యున్నచో

ఆడు పాడు నచటె నాల మంద..

 

పద్యములపై పద్యం... .వె.II

 

ఆటవెలది యన్న అరిసలు బూరెలే

తేటగీతి పలుకు తేనె లొలుకు

మాల లెన్నియున్న మత్త కోకిల వేరు

జిలుగు పసిడి వెలుగు సీస మయ్యె....

 

పి. ఎల్. నాగేశ్వరరావు

 

 

రోజు శలవు దినం కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులతో హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా ఇంట్లోనే గడపండి కరోనా సమయంలో బయటి food తినవద్దు, మన ఆరోగ్యం మన చేతిలోనే మరి..

 

అలిసే వరకు ఆడితేనే, దాన్ని ఆట అంటారు.

గెలిచే వరకు చేస్తేనే, దాన్ని యుద్ధం అంటారు.

చచ్చేంత వరకు బ్రతికితేనే, దాన్ని జీవితం అంటారు.

చచ్చినా కూడా బ్రతికితే, దాన్ని నీ (గొప్ప) మంచితనం అంటారు

 

మిత్రులారా! ఏదైనా మన చేతుల్లోనే ఉంది.

సర్వే జనా సుఖినోభవంతు!

 

తే.గీ.II

దేవరాయలు మెచ్చిన దివ్య భాష

భారతంబు నందించిన భాగ్యరేఖ

మామిడి రసాలె పోతన భాగవతము

తేనియల్ చిందు నా భాష తెలుగు భాష......

 

పి. ఎల్. నాగేశ్వరరావు

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...