10, డిసెంబర్ 2020, గురువారం

వారాంతపు పుస్తక సమీక్షలు, శనివారము, 05.12.2020

 


శనివారం ప్రణాళిక  (05-12-2020)


ప్రముఖుల / మహాకవుల పద్యాలు మీకు బాగా ఇష్టమైనవి మాత్రమే పరిచయం చేయండి . పంచుకోండి...

సాహితీ సమీక్షలతో భాగంగా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి కధలలో మొత్తం 23 కధలు వంశీ గారి పసలపూడి కధలలో మొత్తం 72 కథలు 

వీటన్నిటిలో మీకు నచ్చిన ఒకటో రెండో కధలు వారాంతం లో పరిచయం చేయండి

ఇవి కాకుండా మీకు నచ్చిన పుస్తకం / కావ్యం పరిచయం సమీక్ష చేస్తే కూడా సంతోషమే

* * * * * *

ఆధునిక శతాబ్దపు నవీనేతిహాసం అని కొనియాడబడిన అద్భుత వాస్తవికతకు దర్పణమైన గొప్ప నవల "హంపీ నుండి హరప్పా దాకా".

మొత్తం 60 కి పైగా వ్యాసాలూ, కధా సంపుటాలు కనిపిస్తాయి. నేడు నేను పరిచయం చేయాలనుకున్న కథ    

 

"పాపం పన్నారాజు" 

 

(మూల కథ : శ్రీ తిరుమల రామచంద్ర గారి స్వీయ అనుభవాల సంగ్రహం హంపీ నుంచి హరప్పా దాకా లోని ఒక గాధ) 

 

కష్టం ఖలు మూర్ఖత్వం 

కష్టం ఖలు యౌవనేషు దారిద్య్రమ్ 

కష్టాదపి కష్టతరం

పర గృహ వాసః పరాన్నంచ  

 

మూర్ఖత్వం చాలా నష్టం కలిగించే విషయం  యౌవనంలో దారిద్య్రం అంటే ఏమిటి ? కోరికలను అదుపు చేసుకోలేకపోవడం, వాటిని తీర్చుకోవాలంటే  డబ్బు కావాలి. లేకపోతే కోరికలు తీరవు, ..అన్నిటికన్నా పెద్ద కష్టం పరుల పంచన ఉండడం 

 

పరులు పెట్టింది తినడం... ఇలాంటి వారికి స్వాతంత్య్రం ఉండదు అన్నిటికీ నిర్బంధమే ఇంకా ఏమి అనుభవిస్తారు 

 

పన్నా అని మధ్య పరగణాలలో (సెంట్రల్ ప్రావిన్స్) లో ఒక చిన్న సంస్థానం 

పన్నా అంటే పచ్చ మరకతం అన్నమాట అక్కడ వర్షాకాలంలో వరదలలో బయటకొచ్చి మురిపించే, మెరిసే పచ్చలు మరింత ఆకర్షించేవి 

 

ఇంతకీ పన్నా ఎక్కడిదో చెప్పలేదు కదూ.. ఒకప్పుడు మన విజయనగరం సామ్రాజ్యం లాగా (లాగా, అంత వైభోగం ఉందొ లేదో సందేహమే) బుందేల్ ఖండ్ రాజైన ఛత్రపాల్  పట్టణాన్ని క్రీస్తుశకం 1675 లో తన రాజ్యానికి రాజధానికేగా చేసుకున్నాడు. అప్పటి నుండి నగరానికి ప్రాముఖ్యత పెరిగింది 

 

ఛత్రపాల మహారాజు కాలం (చిత్రశాల మహారాజు రూపాంతరం)  నుండి ఇది పారిశ్రామికంగాను, పంటల దృష్టిలోనూ గొప్ప కేంద్రమైంది 

 

ఇంక అక్కడి "ప్రాణనాధ్ ఆలయం" , "బలదేవ్ మందిరం" ముఖ్యమైనవి. అలాగే  18 శతాబ్దంలో నిర్మించిన "అవధేశ్ విశ్వవిద్యాలయం" కూడా ప్రఖ్యాతమైనది. లక్షలాది ఎకరాలు సేద్యం చేస్తూ, మధ్య భారతం లోని ప్రాతాల్లో సుక్షేత్రం గా పేరు తెచ్చుకుంది.

కారణం పన్నా రాజుల చక్కటి ప్రణాళికలే. వ్యవసాయానికి, వాణిజ్యానికి వారికున్న ముందుచూపే             

 

చండేలా రాజులు, రాజపుట్ లు, మొఘల్, మారాఠా రాజుల తరువాత ఆకాహారి రాజులు బుందేల్ ఖండ్ రాజులు (ఇది చరిత్ర అనుకోండి, అసలు విషయము చెబుతాను)  

    

అంత ప్రఖ్యాతమైన సంస్థానం రాజులు, రాజులు ఎంత బాధ్యతగా ఉండాలి. 

కానీ, నాటి సంస్థానం రాజకుమారుడు, పినతండ్రితో మాటా మాటా పెరిగి, రివాల్వర్ తో కాల్చాడు. ఇదే అవకాశంగా అప్పటి బ్రిటిష్ ప్రభువులు  18 శతాబ్దం చివరలో, మన యువరాజా వారిని దేశ బహిష్కరణ శిక్ష విధించారు రెండు దశాబ్దాల పాటు 

 

ఒక మహారాజు కు (యవ్వనంలో ఆవేశంలో చేసిన ఒక పొరపాటు వలన) రెండు దశాబ్దాల పాటు వేరే ప్రాంతంలో బ్రతకడం కన్నా పెద్ద శిక్ష ఏముంటుంది చెప్పండి  తదనంతరం ఆయన మన విజయనగర సామ్రాజ్యమైన హంపి దఃగ్గరకు వచ్చారు.. అక్కడి ప్రజలతో 20 సంవత్సరాల పాటు సహజీవనం చేశారు 

 

క్షణికోద్రేకం వలన చేసిన ఒక చిన్న పొరపాటు జీవితాలను, రాజ్యాలని, సంస్థానాలని, ఎలా నాశనం అవుతాయో చెప్పే చిన్న గాథ 

 

తరువాత ఆయన ప్రేమమూర్తిగా ఎలా అయ్యారు అనేది  దృష్టాంతము అనుకోండి ...

కానీ నేర్చుకోవలసింది చాలా ఉంది. పూర్తిగా కధ చదివి తెలుసుకోవలసిందే

 

"సరసాభ్యరణం రూపం" 

"రూపస్యాభరణం గుణః" 

"గుణస్యాభరణం జ్ఞానం" 

"జ్ఞానస్యాభరణం క్షమా"  

 

 

కస్తూరి శివశంకర్

 

 

నాన్నారి దత్తుడు

 

ఆరోజు ఆదివారం..

 

లేట్ గా లేద్దామంటే పెద్దవాళ్ళ మాటలు తూచా తప్పక పాటించే మా తమ్ముడు , అక్కని లేపరా అనే ఒక్క మాటకి

చచ్చేదాకా దోషిని ఉరేసినట్టు, లేచేదాకా పీకనొక్కి లేపి టాస్క్ కంప్లీట్ అయిన రోబోలా అక్క లేచింది , అని పక్కకి పోయాడు!!

 

స్నానం చేస్తేనే టిఫిన్ పథకమ్ మీద..

హాస్టల్ తిండి తిని చవిచచ్చిపోయిన నోటికి అమ్మపెట్టిన వేడి వేడి ఇడ్డెన్లు చూడగానే జీవం వచ్చి , నోరు కాలుతుంది చూసుకోమంటున్న అమ్మ మాటలేవి చెవిని చేరలేదు, ఆత్రంగా పొళ్ళు, పచ్చళ్ళతో లాగించి, హమ్మయ్యా అనుకుంటూ అరుగుమీద వేసి ఉన్న పడకకుర్చీలో నడుం వాల్చాను, ఏఁవే అక్కా , తినడం అయితే మొదలెడదామా అంటూ అష్టా చెమ్మా బోర్డు పట్టుకుని పండుగాడు వచ్చాడు , ఏరా కాసేపు ఊపిరితీసుకోనివ్వవా ? , సర్సర్లే, పద , వెంకటలక్ష్మి వస్తుందేమో పిలు అని గోడకి అనుకుని కూర్చున్నా !!

లోన ,మేష్టారుగారున్నారాండీ ? అంటూ దీక్షగా ఆడుతున్న మా ఆటను భగ్నం చేస్తూ ఒక ఆకారం గేటు తీసుకుని లోపలికి వచ్చింది !

నోరు తెరిచి సమాధానం చెప్పేలోగా... ఏఁ బాబూ పెద్ద మేట్టారున్నారా? అని అడిగాడు మళ్ళీ !!

చెట్టంత మనిషిని నేను కనిపించలేదా? అనుకున్నాను!

తెల్లబట్టలేసుకుని ,వెల్లగోడకి కూర్చోకే , దెయ్యమనుకుంటారన్నానా ? మనసులో మాట కనిపెట్టినట్టన్నాడు మా తమ్ముడు !!

 

 

ఇంతకీ ఏం పని ? మాచారం కొట్టునుంచి వచ్చావా ? మధ్య మా ఇంట్లో ఆడవాళ్ళు షాపింగ్ చేయలేదు ? అప్పారావు గారి కాంపౌండర్వా కొంపదీసి, ఇంజీషనెవరికీ? ఏఁవే , ఎగ్జామ్స్ లేవుగా , నూగానీ టెన్షను టాబ్లెట్స్ అడిగావా? యూనిట్ టెస్ట్ పేపర్ కొచ్చన్లన్నీ అడిగేసాడు మా బాబాయ్!!

 

కొంచం గ్యాప్ ఇస్తే... నసుగుతూ ఇస్త్రీబట్టల ఇన్షర్ట్ సరిచేసుకున్నాడు !!

ఆఁ... గ్యాప్ ఇచ్చాడు బాబాయ్!!

 

మీలోన డ్రైవర్ కావాలన్నారట, మురళీ గారి డ్రైవర్చెప్పాడు..

డ్రైవరా ? అసలా కారే అవసరమా అంటుంటే...ఐనా నాకెందుకు ? అన్నయ్యోవ్... ఎవరో నీకోసం వచ్చారు చూడు అని పిలిచాడు!!

 

మా గందరగోళం ఆల్రెడీ విన్న మా సదరు నాన్నగారు బయటకొచ్చి బేరసారాలేమి ఆడకుండా, రేపటినుండి రా... ఇంతకీ నీ పేరు? అదికూడా అడక్కపోతే బాగోదన్నట్టు అడిగారు..

 

జీతం ఇస్తారోలేదో కానీ, జీవితమిచ్చారన్నట్టు ముచ్చటగా చూస్తూ "ఆఁయ్, పెహాదండి" అన్నాడు!!

 

సర్సర్లే.. రేపటినుండి కాస్త మామూలు బట్టలేసుకునిరా, పెళ్ళి ముస్తాబై రాకు , బాబాయ్ ఆర్డరేసాడు!!

 

అప్పటినుంచి మా పెహాదూ అనబడే ప్రసాదు రోజూ ఉదయాన్నే రావడం మా అన్నారంతో , పళ్ళాలు తో కాసేపు కబుర్లాడడం, మాతో అష్టా-చెమ్మా ఆడడం, మధ్యాహ్నమైతే చూరునీడ అరుగు వైశాల్యం కొలవడం, కారు నడపడం మర్చిపోతానేమోనని ఎప్పుడైనా కార్ స్టీరింగ్ అటీటూ తిప్పడం, పేరుకి డ్రైవరే కానీ ఇంట్లో ఇంకో మనిషయ్యాడు.. !!

 

 

వేసవి సెలవులొచ్చి,  మా బాబాయికి తీరికొచ్చి పెహాదుగారి ఆర్మీ ట్రైనింగ్ మొదలైంది... కొబ్బరి బొండాలు కొట్టడం, మొక్కలు నాటడం, పూజకి పూలు కోయడం, కూరలు తేవడం, బేరలాడడం(మా వూర్లో డ్రైవరంటే పెద్ద పాలేరుతో సమానం)...నెల తిరిగేసరికి... పెసాదూ!!! చెయ్యెయ్యి , అంటే సెయ్యండి ? అని అడిగేవాడు, మీరు పక్కుండండి శీనుగారూ ,  నే చేత్తా, మీ వల్లకాదు .. బిల్డప్పులెక్కువ .... అనే స్టేజికొచ్చాడు... వాడు డ్రైవర్రా , వాడికి పని చెప్పకండి అని మా నాన్న అడ్డుకున్నా , పర్లేదండి ఖాళీగా ఉండి తోచట్లేదండి... ముప్పొద్దులా మీకూడు, నెలతిరిగేసరికి జీతం .. ఫ్రీగా కూసోలేను కదా నాన్నారూ , మీరేం మాహాడకండి అనేవాడు!

 

ఎక్కడికైనా బయటకి వెళ్తే "అమ్ములు గారూ దగ్గర్లో మాంచి ఓటేలు ఉందండీ " , పెసరట్లు, మైసూర్ బజ్జీలు బావుంటాయట లాగిద్దాం పదండి , అని టేస్ట్ బడ్స్ కి పనిపెట్టేవాడు, కొత్త పాటలొచ్చాయ్ విందామండి అని ఏవేవో ఆడియో కేసెట్లు పెట్టేవాడు, పెద్దవాళ్ళు ఎక్కితే పాత పాటలు పెట్టి ఏవో కబుర్లు చెప్పేవాడు!

 

యాండీ...పనిపాటా లేకుండా తిరుగుతుంటే.. ఎవరో చెప్పారు 'మెతక మడిసాయన" నీ బద్ధకానికి సరిగ్గా సరిపోతుందంటే సరదాగా వచ్చానండి మీ ఇంటికి,  ముప్పొద్దులా  పందెం కోడిని మేపినట్టు మేపుతున్నారు , టంచను 4 అయితే చాలు మూలున్నా వెతుక్కుంటూ వచ్చి చేతిలో టీ గ్లాసెట్టి ప్రేమగా కబుర్లు చెప్తూ ఉంటాడు.. అమ్మ తర్వాత నా ఆకలి కనిపెట్టిన మనిషమ్మా నాన్నారు🙏, ఏఁవిచ్చినా తక్కువే అనేవాడు!

 

 అల్లుడరికం అలవాటయింది మూడొంతులు ఊళ్ళోనే ఉండను కదా, కారు వేస్టని నా పెళ్ళయిన కొన్నాళ్ళకే.. నాన్న తన కారు తెలిసినవాళ్ళకి అమ్మేసారు, అయ్యో పాపం ప్రసాదు అనుకున్నామంతా!!

మునుపైతే పనిపోతే భయముండేదండీ , ఇప్పుడలా లేందండీ, కూలి పని దొరికినా హాయిగా చేసే ధైర్నం వచ్చింది, ఏఁవన్నా కావాలంటే మా నాన్నారున్నారు అని నవ్వేసాడు, అలానే కొన్నాళ్ళు ఎక్కడెక్కడో చేసాడు, కానీ కుదర్లేదు , మళ్ళీ దారి తప్పేలా ఉన్నాడని ఇంట్లో వాళ్ళు భయపడితే నాన్న మందలించి సొంతంగా కారు కొనుక్కునేలా చేసారు ,ఇప్పుడు కాస్త నిలదొక్కుకున్నాడనే అనాలి!!

 

జీవితం నాన్నరిదేనండి అంటాడు, పిల్లలిద్దరికీ నాన్న-అమ్మ పేరు కలిసేలా పెట్టుకున్నాడు, మేం పిలిస్తే బేరాలొదులుకుని వస్తాడు, నా పనెప్పుడూ ఉండేదే మీపనేంటో సెప్పండి ముందు అంటాడు, రారా అల్లుడా అని.. మా వాడితో కూర్చుని అష్టాచెమ్మ ఆడతాడు , బేరాలు పోతాయి , వెళ్ళన్నాకూడా...మీరూరుకోండే, వాళ్ళకి వేరే బెత్తాయించాలెండి అంటాడు, అయ్యగారి కీర్తి ఎంతలా పాకిందంటే , మాచుట్టుపక్కల చుట్టాలు ఎక్కడికైనా వెళ్ళాలంటే .. పెద్దన్నాయాళ్ల దత్తుడ్ని పిలుద్దాం, జార్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు అంటారు!!

 

హాస్టల్ అయినా, అత్తారిల్లయినా ...అర్థరాత్రి - అపరాత్రి టైమ్ అయినా.. నన్ను తీసుకురావడం, సాగనంపడం తన హక్కు అంతే... వేరే ఎవర్నైనా పిలిస్తే... ఏఁటండీ, అన్యాయం.. నాకు-అల్లుడుగారికి మధ్య డిస్పూట్ పెట్టేలా ఉన్నారే, మీరిట్టా అభాసు పనులు చేస్తే నాన్నారికి మాటొత్తది... అని మామీదే కోప్పడిపోతాడు!!

 

మా నాన్న ఎక్కడికి వెళ్లినా మనిషితోడు మా పెహాదే 🙂 ...

 

 విష్ణుప్రియ

 

 

 

అందరికీ నమస్సులు

ఈరోజు సాహితీ సమీక్ష లో భాగంగా ముళ్ళపూడివారి సాహితీ సర్వస్వం లో కధారమణీయం-2 లోని చుట్టాలొచ్చారు కధ.

 

కధ పేరు :: చుట్టాలొచ్చారు

 

రచయిత ::

శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ

 

ముఖ్య పాత్రలు :: రాధ , గోపాలం ( అలా పేరుకే ముఖ్య పాత్రలు అన్నాకానీ , 

ముళ్ళపూడి వారి కధలు చదువుతుంటే అది ఒక కధాలా అనిపించదు. మనం ఆ పాత్రలతో కలసిపోయి అక్కడే ఉంది చూసిన అనుభూతి కలుగుతుంది)  

 

ఇక కధ విషయానికొస్తే మన కధానాయకుడు గోపాలం  ఆఫీసు నుండి ఇంటికొచ్చేటప్పటికి ఇల్లంతా తెలియని మనుషులతో నిండిపోయి ఉంటుంది.

వంట యింట్లో వేపుళ్ళ కాంపిటీషన్ జరుగుతున్నట్టు పోటీలు పడి వేపుతూ కనబడిన వాళ్ళని చూసి ఎవరు వీళ్ళు అంటే మీ చుట్టలే అనుకున్నాం అంటారు

గోపాలం భార్య రాధ కొడుకు శంకరం. రాధ వంట గది కిటికీ లోనుండి చూపిస్తూ

 పెద్ద బాండిలో కంద ముక్కలు వేయించే ఆవిడ సోం పేట దొడ్డమ్మగారు , 

ఆ పక్కన బంగాళా దుంపలు వేయించే ఆవిడ బుచ్చి కక్కి గారు , పెరట్లో పడక కుర్చీలో ఉన్న ఆయన బుచ్చికక్కి గారి భర్త ఆయన కొడుకు కోడలు అంటూ రాధ తనకి తెలిసిన పరిచయాలు చేస్తుంది.

 

వంట ఇంట్లో ఉన్నవాళ్ల ముఖాలు తనకి తెలియనివి కావడం తో గోపాలం

కంగారు పడి తెగ హైరానా పడిపోతాడు.

 

మన గోపాలనికి తనకి అసలే బొల్డు లోక జ్నానం ఎక్కువ అని గట్టి నమ్మకం తో బాటు రాధకి బయట ప్రంపంచం ఎలా ఉందో అసలు తెలియదు అని కూడా గట్టి నమ్మకం అన్నమాట. ఇలా తెలియని వాళ్ళని  ఎలా ఇంట్లోకి రానిస్తావ్ వాళ్ళు దొంగలెమో సరుకులు అయ్యేవరకు అన్నీ వండుకు తిని వెళ్తూ వెళ్తూ దొరికిన సామాను పట్టూకుపోతారు అని జోస్యం కూడా చెప్పేస్తాడు.

 

అయ్యో వాళ్ళని అలా అనడానికి మనసేలా ఒప్పింది ఆండీ ( సగటు సత్తెకాలపు ఇల్లాలు) అయినా వాళ్ళకి మీ ఉప్పు పప్పు ఏం అవసరం లేదు.

 వాళ్లే తెచ్చుకున్నారు అని రాధ చెబుతున్నా గోపాలం స్థిమిత పడడు .

ఖాళీ అయిపోతున్న వంట గదిలో సరుకుల్ని చూసి నానా హైరానా పడతాడు

 ( జీతం రాళ్ళతో బ్రతికే మధ్య తరగతి జీవి)

 

నాకు తెలియదు నేను లోపల ఉన్నాను మీ సుపుత్రుడే వాళ్ళని ఇంట్లోకి పిలిచి కూచోబెట్టాడు కనుక వాడినే అడగండి అంటుంది రాధ. ఇవన్నీ ఇక్కడ మాట్లాడితే బాగోదు అని  రెండిళ్ళ అవతల మీసాలరావు ఊరు వెళ్తూ తాళాలు ఇచ్చాడుకదా అక్కడ మాట్లాడు కుందాం ( ఆ  కాలపు మర్యాద మన్నన)

ఇప్పుడైతే వచ్చినవాళ్ళముందే గరిటలు రిమోట్లతో కొట్టేసుకుంటాం ఇంచక్కా)

అని భార్య కొడుకుని తీసుకుని మీసాల్రావ్ ఇంటికే వెళ్తాడు . ఇప్పుడు చెప్పారా ఎందుకు పిలిచావ్ వాళ్ళని అంటే శంకరం నేను బయట ఆడుకుంటుంటే గోపాల్రావ్ ఇల్లు ఇదేనా అని అడిగారు ఇదే అని రండి కూర్చోండి అని మంచినీళ్లు ఇచ్చి కాఫీ తాగుతారా ఓవల్టిన్ తాగుతారా అని మీరు చెప్పినట్టే చేశాను నాన్నా అప్పుడు ఆ పెద్దావిడ నన్నట్టుకుని మా బాబే అంటూ ముద్దులాడింది నాన్నా అంటాడు అమాయకంగా.

 

చిట్టెమ్మగారని ఆవిడకి మీరు బాగా తెలుసు అంట  కదా ఆవిడ కి వీళ్ళు బాగా కావల్సిన వాళ్ళట. తిరుపతి వెళ్తూ ఇక్కడ ఒక పని ఉండి దిగారట సోంపేట దొడ్డమ్మగారి అమ్మాయిని బుచ్చికక్కి గారి అబ్బాయికి ఇచ్చి పెళ్లిచేశారట. ఇప్పుడు ఆ అబ్బాయికి ఇక్కడ ఇంజనీరు గారితో చెప్పి ఉద్యోగం వేయించాలట ఆ పని మీదే  ఆవిడ రైలు  దిగి అటునుండి అటే  సదరు ఇంజనీర్ గారిని  కలవడానికి వెళ్తూ వీళ్ళకి అడ్రెస్ చెప్పి ఇటు పంపారట. అనగానే అయ్యో చిట్టెమ్మగారా ధ్వళేశ్వరం లో మా పక్క వాటాలోనే ఉండేవారు ఆవిడ అని హడావిడిగా ఇంటికి పదండి అంటూ ఇంటికి వచ్చేసరికి చిట్టెమ్మ గారు కనిపించి ఎంతవాడవు అయ్యవురా వెర్రినాగన్నా  అంటూ గోపాలన్నీ నిమిరి లక్ష్మి దేవిలాంటి భార్య దొరికిందిరా నీకు అని గోపాలం కొడుకు శంకరాన్ని చూసి చిన్నప్పుడు మీ నాన్న కూడా ఇలాగే ఉండేవాడు రా అంటూ ఆవిడ ఇల్లంతా సందడి నింపేస్తుంది. రాత్రి గోపాలన్నీ ఒక పక్క శంకరాన్ని ఒకపక్కా కూర్చొబెట్టుకుని కీలుగుర్రం కధ చెబుతారు చిట్టెమ్మ గారు.

 

 ఇక

పొద్దున్నే చిట్టెమ్మ గారు అడ్డేడు అన్నం గిన్ని అవలీలగా దించి పక్కన పెట్టేసి. రెండు వీసెల  వంకాయలు కారం పెట్టి మువ్వోంకాయ కూర వండేస్తారు ఆవిడ చేసిన పప్పు పులుసు ఘుమ ఘుమలు వీధి అంతా వ్యాపించాయి.

 

కాసేపు కాలక్షేపానికి బయటకు వెళ్ళిన గోపాలం స్నేహితుడితో అనుకోకుండా ఇంజనీరు గారింటికి వెళ్తాడు.అక్కడ చిట్టెమ్మగారు నెత్తిమీద ఆవకాయ కుండ,

చేతిలో టిఫిన్ కేరెజి పట్టుకుని నిండుగా నవ్వుతూ కనిపిస్తారు. ఇంజనీరు

బాబుగారు  అంటూ ఆప్యాయం గా పిలిచిన చిట్టెమ్మగారిని చూసి ఎవరమ్మా ఆంటే నన్ను మీరెరుగరు బాబు మీ నాన్నగారు మా పొరుగింట్లో ఉండేవారు ఆయనది గొప్ప హృదయం నాయనా అంటూనే ఇంజనీరుగారి హృదయాన్ని సగం గెలిచేశారు చిట్టెమ్మ గారు .

 

ఇక ఆవకాయరుచి

మువ్వోంకాయ ఘుమ ఘుమ లతో ఆవిడ ఆప్యాయతతో ఇంజనీరు గారి మనసుని పూర్తిగా గెలిచేశారు. అమ్మా భోంచేసి వెళ్ళండి అంటే  ఒక రోజు భిక్ష కాదు బాబు నా చెల్లెలి కొడుక్కి ఉద్యోగం వేయించి వాడి జీవితం నిలబెట్టండి అని అడగ్గానే అలాగే అమ్మా కుర్రవాడిని రేపు పంపించండి అని హామీ ఇచ్చేయటమూ ఒకేసారి జరిగాయి. ఇంచక్కా ఆనందంగా చుట్టాలంతా  తిరుపతి యాత్ర కోసం రైలెక్కేసారు.

 

ఈ కథలో బాగా నచ్చినవి

గోపాలం కొడుకు ఇంటికి వచ్చినవాళ్ళని లోపలికి పిలిచి కూర్చో  బెట్టి మర్యాదలు చేయడం చిట్టెమ్మగారి కార్య దక్షత.

చుట్టాలు వెళ్ళాక గోపాలం ఇగో పక్కన పెట్టి మనుషుల్ని అర్ధం చేసుకోవడం లో తాను వెనుకబడే ఉన్నానని ఒప్పుకునిరాధకు సారీ చెప్పడం లాంటివి.

 

గోపాలం కొడుకుని చూశాక ఈ తరం పిల్లలు గుర్తొచ్చి కాస్త దిగులుగా కూడా అనిపించింది. ఇప్పటి పిల్లలు మర్యాదల సంగతి పక్కన పెడితే కనీసం ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించడానికి కూడా ఇష్టపడటం లేదు.

మన తల్లితండ్రుల పెంపకానికి మన పెంపకానికి ఎంత తేడా వచ్చేసిందో కదా !!!

అప్పట్లో ఇంటికి చుట్టాలు వచ్చారు అంటే అదొక గొప్పగా ఉండేది స్నేహితులకు చెప్పుకోడానికి. వచ్చిన అతిధులు కూడా అలాగే ఉండేవారు. అమ్మతో కలసిపోయి ఇంటి పనులు చేస్తూ కబుర్లు కలబోసుకునే వారు. ఒకరికి రాని పనులు ఒకరు చేసిపెట్టి ఆనందం పొందేవారు. కానీ ఇప్పుడు వచ్చేవారికీ పనులు చేసే ఓపిక లేదు గృహస్తులకీ చేసిపెట్టే ఓపిక లేదు ఏమి కావాలో చెప్పండి అని ఆన్లైన్ ఆర్డర్ పెట్టడమే. ఈ మధ్య ఇంకో కధ చదివాను మన ఇంటికి అతిథులుగా వచ్చేవాళ్లే వాళ్ళకి కావాల్సినవి కొని తెచ్చుకుని గృహస్థు కి బిల్ ఇచ్చేస్తారంట . ఇలాంటి వారికి చిట్టెమ్మ గారినిదొడ్డమ్మగారిని , బుచ్చి కక్కి గారిని చూపించాలి అని నాకు మరీ మరీ అనిపించింది.     

 

ముళ్ళపూడివారి శైలి లో ప్రతి అక్షరాన్ని ఆస్వాదించాలి అంటే మాత్రం కధని ఒకసారి చదివెయ్యండి మరి.

రమ, కంకిపాడు

 

 

నేడు మీకు పరిచయం చేయాలనుకునే నవల శ్రీ దాశరధి రంగాచార్య గారి   "చిల్లర దేవుళ్ళు" 

        

(కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన నవల)

 

 కస్తూరి శివశంకర్

 

తెలంగాణా ప్రాంతానికి (మహబూబ్ నగర్) చెందిన ప్రఖ్యాత రచయిత, కవి

శ్రీ దాశరథి రంగాచార్యులు గారి అన్నయ్య కవి, సాయుధపొరాట యోధుడు శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు

 

తెలంగాణా సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను శ్రీ దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలల్లో చక్కగా చిత్రించారు. 

 

1964 లో వ్రాసిన   నవల కథాకాలం రెండు మూడు దశాబ్దాల క్రితం వేదన. నిజాం ప్రభుత్వాల పై ప్రజలు ఎందుకు తిరగబడ్డారో, నిజాం ప్రభువులు చేసిన దాష్టీకాలుదేవుడిని, మతాన్ని, నమ్మకాన్ని కూడా ఎలా ప్రభుత్వాలు పరిహాసించాయి అనేది స్థూలఇతివృత్తం    

 

"చిల్లరదేవుళ్లు" : నవలలోని ముఖ్యమైన పాత్రలు ఏమిటి ?

సారంగపాణి - కథానాయకుడు; విజయవాడ నుంచి బతుకుతెరువుకై తెలంగాణా కుగ్రామానికి వచ్చిన సంగీతోపాధ్యాయుడు.

మంజరి; రామారెడ్డి; వెంకట్రావు; వనజ; తాయారు; మాడపాటి హనుమంతరావు గారు పూర్వపు నైజాం ప్రాంతంలోని తెలంగాణ పల్లెలో తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు కాలంలో కధ ప్రారంభమవుతుంది  

 

కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను సవివరంగా దాశరథి రంగాచార్యులు రచించిన నవలల్లో "చిల్లర దేవుళ్లు" మొదటి నవల.

నవలా పరంపరలో తొలి నవలగా 1942  వరకూ ఉన్న స్థితిగతులు "చిల్లర దేవుళ్లు"లో కనిపిస్తాయి.

 

నాణానికి మరోవైపు చూస్తే తెలంగాణ పోరాటం ముగిసిన దశాబ్దికి కొందరు నిజాం రాజును మహనీయునిగా, నిజాం రాజ్యస్థితిగతులను ఆదర్శరాజ్యానికి నమూనాగా పలు రాజకీయ కారణాల నేపథ్యంలో కీర్తించారనీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుని, ప్రాణాన్ని లెక్కచేయక నిజాంను ఎదిరించిన తమకు ఆనాటి దుర్భర స్థితిగతుల్ని ఇలా అభివర్ణిస్తూంటే ఆవేశం వచ్చేదని రంగాచార్య ఒక సందర్భంలో పేర్కొన్నారు.

 

నిజాం రాజ్యంలో బానిసల్లా జీవించిన ప్రజల స్థితిగతులను, మానప్రాణాలను దొరలు కబళించిన తీరును నేపథ్యంలో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా సాగిన తెలంగాణా సాయుధపోరాటం, పోరాటానంతర స్థితిగతులు వంటివి భావితరాలకై అక్షరరూపంగా భద్రపరచదలిచిన ఆవశ్యకతతో అందించిన ఇతివృత్తం

 

కథాకాలం : 1936-42 ప్రాంతంలోనిది.

కథాస్థలం : తెలంగాణాలోని చిన్న పల్లెటూరు.

నవల ప్రారంభంలో సారంగపాణి అనే సంగీత ఉపాధ్యాయుడు బతుకుతెరువు కోసం విజయవాడ నుంచి ఊరికి వస్తాడు. 

ఊరి నడుమ దేశ్‌ముఖ్ రామారెడ్డి గడీ ఉంటుంది. అది ఊరి మొత్తానికీ ఏకైక భవంతి కాగా కరణం వెంకట్రావుతో పాటుగా మరికొందరికి మాదిరి ఇళ్ళు ఉంటాయి. మిగతా ఊరందరివీ గుడిసెలు. నిజాం పాలనలో లభించిన విపరీతమైన అధికారాలతో దొర, కరణం ఊరిని పరిపాలిస్తూ ఉంటారు. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న దొర పాణికి తన గడీలో ఆశ్రయమిస్తాడు. రోజూ పాణి పాట వింటూ, అతనికి ఊళ్ళో కరణం కూతురు తాయారుతో పాటుగా రెండు మూడు సంగీత పాఠాలు ఏర్పాటుచేస్తాడు.

 

పాణికి పోనుపోనూ ఊళ్ళో దొరది ఎదురులేని శాసనమని తెలుస్తుంది. చిన్న చిన్న తప్పులు చేసినా, తన అధికారాన్ని ఏమాత్రం తక్కువచేసినా దొర ఎలాంటి కఠినశిక్షలు విధిస్తాడో తెలుస్తూంటుంది. దొరకీ కరణానికి వైరం ఉన్నా జనాన్ని అణచివేయాల్సి వస్తే మాత్రం ఏకమైపోవడం కూడా చూస్తాడు. గడీలో ఆడబాపగా పనిచేస్తున్న వనజది వేశ్య కన్నా దారుణమైన జీవితం. ఐతే ఆమె సారంగపాణిని ప్రేమిస్తుంది. దొర కూతురు మంజరి, మరోవైపు కరణం కూతురు తాయారు కూడా అతనిపై మనసుపడతారు. తాయారు మరో అడుగు ముందుకువేసి తనను పెళ్ళిచేసుకుంటే తండ్రి కరణీకం ఇప్పిస్తాననీ, లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనీ హెచ్చరిస్తుంది.

 

నిజాం ప్రభుత్వంలో  జరిగే భూతగాదాల్లో లంబాడీలను కరణం మోసం చేయగా ఆదుకోవాల్సిన పోలీసులు కరణానికి మద్దతుగా ప్రజలపైనే కాల్పులు జరుపుతారు.  లంబాడీ స్త్రీ పై  అత్యాచారం చేయబోగా ఆత్మగౌరవంతో ప్రయత్నం నుంచి కాపాడుకునేందుకు పోలీసు అధికారిని చంపుతుంది. వెంటనే తానూ ఆత్మహత్య చేసుకుంటుంది. నిజాం మనుషులు కూలీలను బలవంతంగా ముస్లిం మతంలోకి మారిస్తే, తర్వాత అటు హిందువులూ కాలేక, ఇటు ముస్లిములుగానూ మనలేక పడే బాధలూ కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు. దొర బండి రోడ్డుపై వెళ్తూన్న సమయంలో బండికి ముందు మనిషి తప్పుకోమని అరుస్తూ పరుగులు పెట్టడం వంటివి ఎంత వేదనాభూయిష్టమో తెలిపే గాథ.

 

నిజాం పాలనలో దెబ్బ తింటున్న తెలుగు భాషా సంస్కృతుల సముద్ధరణకు కంకణం కట్టిన మాడపాటి హనుమంతరావు కృషిని పాణి తెలుసుకోవడమూ నవలలో ఉంటుంది. నేపథ్యంలో కథ ఎలా మలుపులు తిరిగి చివరకు ఏమైందనేది మిగిలిన ఇతివృత్తం.

 

ఒకప్పటి సమాజం స్థితి గతులు, వెట్టి చాకిరీ వంటి వ్యవస్థలనీ, చిల్లర దేవుళ్ళు నవలలో కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు... అయితే కధ కన్నా కధనం ముఖ్యం   

 

కొసమెరుపు : 

"కలువకు చంద్రుడు ఎంతో దూరం.... కమలానికి సూర్యుడు మరీ దూరం" లాంటి ప్రఖ్యాతమైన పాటలు ఉన్న సినిమా "చిల్లరదేవుళ్లు" (1977) కూడా నవల ఆధారంగానే చిత్రీకరించారు 

 

కస్తూరి శివశంకర్

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...