వేమన పద్య మకుటాలు
వేమన పద్యాలలో అధికం ఆటవెలదులు. వాటికి మకుటం విశ్వదాభిరామ వినురవేమ..
ఈమకుటమే కాకుండా ఇతర మకుటాలు కూడా వేమన పద్యాలలో ఉన్నాయి. అవి ఏవి అంటే
1. విమల గుణ రాజా యోగీంద్ర వేమనార్య.
2. రాజయోగి వేమా
3. వివిధ విద్యా కళా త్రాణ వివరి వేమ
4.వేమ
5.విశ్వదాభిరామ ఇదియు వినురవేమ
పై మకుటములలో మూడింటికి ఉదాహరణలు కింద ఇవ్వబడినాయి
1. కందము-
సద్గురు కృప జ్ఞానంబున
సద్గతి దీపింపుచున్న చాలా చదువుల్
సద్గతి గలుగగ జేయును
సద్గురువే దైవ మనుచు జాటర వేమ
అర్థం-
సద్గురు కృప లేక జ్ఞానము కలుగదు.సద్గురు
కృప వలన శిష్యునికి జ్ఞానము కలిగి అభివృద్ధి చెంది సద్గతిని పొందుతాడు . ఆ శిష్యునికి ఇంకా చదవవలసిన చదువులు ఉండవు . కనుక శిష్యునికి సద్గతిని కలుగజేసేది సద్గురువే దైవము..
2. తేటగీతి-
హరిహరాదుల కైన నయ్యాత్మ విద్య
గురు కటాక్షము బొందక నెరుక పడదు
పరమ పరిపూర్ణ భావంబు బయలు గాదె
విశ్వదాభిరామ ఇదియు వినురవేమ
అర్థం-
బ్రహ్మ విద్య సామాన్యమైన విద్యకాదు. గురువులేని కుండా సాధించ బడనిది. కనుక అట్టి ఆత్మ విద్య హరిహరాదులకునూ గురు కటాక్షం లేక తెలియ పడదు. ఆ ఆత్మ విద్య కు మించినది పరవిద్య. ఆత్మ విద్య కే గురువు అవసరమైనప్పుడు ఆ పర విద్యకు గురువు అత్యంత అవసరమ ని అన్నాడు వేమన..
3. తేటగీతి
గురు పరంపర నీ విద్య గూడ మెఱిగి
పరమ పరిపూర్ణ మందుట పరవశంబు
నిరుపమానంద సుఖకేలి నెరుపవలెను
విమలగుణ రాజయోగీంద్ర వేమనార్య.
అర్థం-
గురువు లేని విద్య గుడ్డి విద్య. కనుక సాంప్రదాయక గురుపరంపర గా వచ్చుచున్న గురువులను చేరి వారి నుండి నిగూఢమైన బ్రహ్మతత్వం ఆ పిదప పరిపూర్ణ బ్రహ్మమును తెలుసుకొనవలెను . ఈ విధముగా తెలుసుకున్నవాడు అన్ని వేళల తన మనసును అఖండ రూప బ్రహ్మ మందు లీనం చేసి ఉండును.
వేమన పద్యాలలో సీసములు కూడా ఉన్నాయి ఇందుకు ఒక ఉదాహరణ
సీసము -
తమ తలంపుల లోనున్న తత్వ శిఖామణి
దలచిన వారెల్ల తత్వ విధులు
ఘనమైన నిబిడాంద కారంబులో జ్యోతి
సనువుతో జూచిన యత డే యోగి
శివుని లో జీవుని జీవుని లో శివు
నేనేరా తెల్పిన వాడు యోగ దృక్కు
సాంఖ్య యోగంబున సర్వంబు శివుడని
నిశ్చయించిన వాడు నిర్మ లుండు .
ఆ. వె
ఇట్టి జాడ గాక యందరైనను నేమి
గుట్టుగాను శివుని బట్టగలరే?
పొట్ట జీవు బాసి పోయి తా నుబ్బునా? విశ్వదాభిరామ వినురవేమ
అర్థం-
వేదాంత తత్వమునకు చివరిది అన్నింటికీ ప్రకాశం ఇచ్చు మణి గా ఉన్నది ఆత్మ. ఆ ఆత్మ తత్వమును తమ తలంపుల లో తలచిన వారందరు తత్వ కోవిదులే. ఆకాశమే ఘనమైన నిభిడాంద కారము.. ఆకాశాన్ని కన్నా సూక్ష్మంగా ఉన్నది ఆత్మ జ్యోతి. దానిని చూసిన వాడే యోగి.. ఆత్మ యందు జీవుడిని జీవుడి యందు ఆత్మను గాంచిన వాడే యోగదృష్టి కలవాడు. ఇలా సర్వము ఆత్మ మయమని సాంఖ్య యోగము ద్వారా నిర్ణయించిన వాడే నిర్మలుడు... మరణించిన వారి శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతుంది అని అందరూ అంటారు అది నిజం కాదని వేమన చెబుతున్నాడు. ఒకవేళ ఆత్మ చైతన్యం శరీరం నుండి వెళ్లిపోయిన చో శవమ్ ఎలా ఉబ్బుతుంది అని ఆయన ప్రశ్నించారు..
కె మల్లికార్జునరావు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి