అందరికీ నమస్కారం🙏
కథ వైకుంఠంలో వైరసు రభస
ఫుల్లీ కవర్డ్ పి.పి.ఈ సూట్లో గధను బుజాన వేసుకుని సూట్ జేబులో ఉన్న సానిటైజర్ తడిమి చూసుకుంటూ పాముకోళ్ళు టకటక లాడిస్తూ వడివడిగా అటుగా వస్తున్న వ్యక్తిని దూరంగా ఉండగానే చేతిలో ఉన్న బళ్లాలను ముందుకు చాపి, అడ్డగించారు వైకుంఠ ద్వారపాలకులు.
"యముండ! యమలోక పరిపాలకుండ!" అని మోర పైకెత్తి గాంభీరంగా చెప్పాడు యముడు.
దానికి వాళ్ళు "నరకం నించి వచ్చారు !! మీకు అస్సలు ప్రవేశం నిషిద్దం దయఉంచి తక్షణం దయచేయండి ప్రభూ!" అన్నారు గజగజ వణకిపోతూ ద్వారపాలకులు.
యమధర్మ రాజు గధ ఝలిపిస్తూ "ఎవరిని పోమ్మనుచున్నారు" అని గద్దించాడు కానీ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు 'గట్టిగా మాట్లాడితే విష్ణుమూర్తికి తెలియకుండా ఇటు నుంచి ఇటే పంపించేసేలా వున్నారు పని పూర్తవ్వాలంటే కాస్త తగ్గడమే మంచిది' అనుకుని వారితో ఇలా అన్నాడు "అత్యవసరంగా స్వామితో మాట్లాడాలి ఒక్క నిమిషం మాత్రమే వుంటాను భౌతిక దూరం పాటిస్తాను , నేను వచ్చాను అని కబురు పంపండి " అని కాస్త బతిమాలుడు దోరణిలో అన్నాడు.
ద్వారపాలకులు ఒకరి మొఖాలు ఒకరు చూసకుని లోనికి పంపారు. ఒకడు వచ్చి ఆయన్ని ఒక గదిలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆపాదమస్తకం ఒక యంత్రంతో స్ప్రే చేయబడింది ఉక్కిరి బిక్కిరి అయిన యమధర్మ రాజు బైటకి వచ్చి " ఇది ఏమిటి" అని అడిగాడు .
"సూక్ష్మజీవి రహిత (డిజెర్మ్ ఛాంబర్ ) గది. దీనిలోకి ఒకసారి వెళ్తే శరీరమ్మీద వున్న సూక్ష్మ క్రిములు అన్నీ నశిస్తాయి . వైకుంఠ రక్షణ కోసం మా స్వామి దీన్ని ఏర్పాటు చేశారు . బైటనుంచి ఎవరు వచ్చిన ముందుగా ఈ గదిలోకి వెళ్ళి రావాల్సిందే" అన్నాడు .
'మంచి ఆలోచన యమలోకంలో కూడా తక్షణం ఇలాంటి ఏర్పాటు చేయాలి ' అని మనసులో అనుకుంటూ లోపలికి ప్రవేశించాడు . నిత్యం సలహాలు సంప్రదింపులతో వచ్చే పోయే వారితో నిండుపున్నమి చంద్రుడు, నక్షత్రాలతో కళకళలాడుతున్న ఆకాశంలా వుండే విష్ణుమూర్తి సభా ప్రాంగణం నిర్మానుష్యంగా, నిస్తేజంగా వుంది ఉచితాసనాలు కూడా దూరం దూరంగా అమర్చి బడి వున్నాయి. ఇంతలో ఒకడు వచ్చి ఒక మూలగా వున్న ఆసనం చూపించి యముడిని ఆశీనులు కమ్మని నమస్కరించి వెళ్ళిపోయాడు.
అంతలో చిడతలు వాయిస్తూ నారాయణ! నారాయణ! అంటూ నారదుడు వచ్చాడు. ఆయన పి.పి.ఈ సూట్ మరీ పగడ్ బందీగా వుంది నారాయణ నామ స్మరణ లేకపోతే నారదుడు అనే ఎవరికి తెలియని విధంగా నఖశిఖ పర్యంతం కప్పబడి వున్నాడు.
నారదుడు యముని చూచి ఒకడుగు వెనక్కి వేసి "యమధర్మ రాజా! మీరేమిటిక్కడ యమలోకంలో అంతా క్షేమమే కదా?" అని పలకరించాడు. దానికి యముడు "ఏమి చెప్పమందువు నారదా! ఇప్పుడు భూలోకం పరిస్థితి నీకు తెలియనిది కాదు, ఇక యమలోకం పరిస్థితి నీవూహించలేవు" అన్నాడు దిగాలుగా.
"అవునవును నేను మేఘాల్లోంచి పరికించడం తప్ప భూలోకం వెళ్ళే సాహసం చేయడం లేదు.
నరకలోకానికి మరీ ట్రాఫిక్ జాం పెరిగింది ఈ మధ్య. మీ లోకంలో జాగ్రత్తలు పాటిస్తున్నారా? పాపులను వేయించే నూనెను తరచూ మారుస్తున్నారా? డిస్పోజబుల్ కొరడాలు వాడుతున్నారా? ఇంకా మామాయి వంట పాత్రల మాటేమిటి అన్నీ సానిటైజ్ చేస్తున్నారా?" అంటూ ప్రశ్నలు సంధించాడు నారదుడు.
దానికి యముడు "అదేకదా మునీశ్వరా !... కింకరులు తమకి వర్క్ ఫ్రమ్ హోం కావాలని గొడవ చేస్తున్నారు. ఇటు పాపులు వరదలా పోటెత్తుతుంటే అటు కింకరులు భయపడి పనిచేయలేక చేతులెత్తేశారు. ఏమి చేయాలో పాలుపోక ఇటొచ్చాను." అంటుండగానే విష్ణుమూర్తి వేంచేస్తున్నారహో! అని కబురు, ఆ వెనుకే స్వామి అరుదెంచారు. ఇద్దరినీ చూసి చిరుమందహాసం విసిరారు పలకరింపుగా.
నారాయణ స్మరణ చేస్తూ తాతగారికి దూరం నుంచే పాదనమస్కారం చేశాడు నారదుడు.
యమధర్మరాజు రెండడుగులు ముందుకు వేసి శిరసు వంచి ప్రణామాలు చేసి తన గోడు వెళ్ళబోసుకోవడం మొదలు పెట్టాడు.
వింటున్న స్వామికి క్రమేపీ మందహాసం దూరమై విషణ్ణవదనుడయ్యాడు.
యముడు చెప్తున్నాడు " స్వామీ! పాపులు తండోతండాలుగా యమలోకానికి పయనం కట్టారు. ఏదో ఒకటీ అరా పుణ్యలోకానికి పోతున్నారు అంతే. అడుగు మోపడానికి కాళీ లేదు, శిక్షా ప్రాంగణాలు, అతిధి గృహాలు, డార్మెట్రీలు ఇదీ అదీ అనిలేదు అన్నీ నిండిపోయాయి. చిత్రగుప్తుడు చిట్టా చదవడానికి చిర్రుబుర్రులాడుతున్నాడు. అక్కడికీ పదిమంది అసిస్టెంట్స్ ని ఇచ్చాను. చెప్పుకుంటే చేసిన పాపం పోతుంది. ఏ శిక్షా సరిగా అమలు చేయలేక నాలుగు కొరడా దెబ్బలు కొట్టి వదిలేస్తున్నాం. కొట్టడానికి కూడా జబ్బలు సలిపేస్తున్నాయని కింకరులు గోల పెడుతున్నారు. వారికంటుకుంటుందని భయపడి చస్తున్నారు. పాపులను మాస్కులు వేసుకోమంటె అక్కడ వేసుకోక చచ్చాం... ఇక్కడ అసలు వేసుకోం అని మొండికేస్తున్నారు.
ఇక మా ఇంట్లో వాళ్లంతా బిక్కు బిక్కుమంటూ... నా కంచం వేరు నా మంచం వేరు నన్నొక పాపిని చూసినట్టు చూస్తున్నారు." అని తల పట్టుకున్నాడు.
విష్ణమూర్తి కాసేపు కళ్ళు మూసుకుని నెమ్మదిగా తెరిచి చెప్పనారంబించాడు. " యమధర్మ రాజా! ఇది నిజంగానే పరీక్షా సమయం. నువ్వు కాస్త నెమ్మదించుము. తీసుకోవలసిన అత్యవసర చర్యలన్నీ తీసుకుందాం. ఇంకొన్నా ళ్లు ఈ దుస్థితి తప్పదు. ఈ మహమ్మారికి మందు (vaccine) కనిపెట్ట బడుతుంది. ఈ లోపు వ్యాధి సోకినా కానీ మరణాలు సంభవించని విధంగా(low death rate) మందులు అందుబాటులోకి వస్తాయి."
అంటూండగానే యముడు "అదిచాలు స్వామి" అంటూ దొరకబుచ్చకున్నాడు. వెంటనే తమాయించుకుని కంటిన్యూ చెయ్యమన్నట్టు స్వామి వంక చూసి తలదించుకున్నాడు.
స్వామి మరల చెప్పడం మొదలు పెట్టాడు.
"నువ్వు మరీ రాద్దాంతం చేయకు. ఇప్పుడు శివుడు మరుభూమిలో లయ కార్యక్రమాల్లోనూ, బ్రహ్మ ఆత్మలను వేరే జీవుల్లో ప్రవేశపెట్టే పనిలోనూ బిజీగా ఉండి వారికి ఐడియా వచ్చి ఉండదు. ఇప్పుడు నన్ను మళ్లీ అవతారం ఎత్తమంటే కష్టం. ఈ పరిస్థితుల్లో భూలోకమంటే లక్ష్మి అసలొప్పు కోదు. తనే వెళ్లనని మొరాయించింది అందుకే ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది.
నా అవతారాలు ఏదో ఒకరూపంలో ఉన్న రాక్షస సంహారం కోసం జరిగేవి. ఈ కరోనా క్రిమికి ఒక ఆకారం లేదు ఒకచోట ఉండదు, నన్ను మించి సర్వ వ్యాప్త మైంది. ఏ ఆయుధం వాడాలి ఎక్కడని వెతకాలి. భోళా శంకరునీ, బ్రహ్మని కూడా కనుక్కున్నా ను ఏమైనా వరాలిచ్చి కొంపముంచారా అని." అన్నాడు స్వామి.
నారదుడు కనుబొమ్మలు ముడిచి విష్ణుమూర్తి వైపు అనుమానంగా చూస్తూ " అంటే ఈ కరోనా జీవి రహస్యం మీకూ తెలియదా అంతర్యామి!" అన్నాడు అయోమయంగా.
దానికి స్వామి చిరుమందాహాసంతో సృష్టిలోని అనంత జీవరాశులలో తానూ ఒక భాగమని మరచి మానవుడు పంచభూతాలనే శాసించాలనే అత్యాశతో తన ఉనికికే ముప్పు తెచ్చుకుంటున్నా డు. సంఘ జీవనం( social life) కోసం, ప్రకృతి సమతుల్యత(natural equilibrium) కోసం ఒకప్పుడు తనకు తానే పెట్టుకున్న నిభబందనలు, అలవర్చుకున్న పద్దతులు మంటకలుపుతున్నాడు. స్వధర్మాన్ని మరచి వింతపోకడలకు ఆకర్షితుడవుతున్నాడు." చెప్తున్నాడు స్వామి.
మేం ఎన్నో రకాలుగా శిక్షిస్తూనే ఉన్నాం కదా! అయినా ఇన్ని పాపాలు ఎలా జరుగుతున్నాయి?" అన్నాడు యమధర్మ రాజు.
నారదుడు యముని అమాయకత్వాననికి చిన్నగా నవ్వుతూ "ఇప్పుడు మానవులు చేసేవన్నీ మీ చిట్టాలోనికి రాని నేరాలు. వైట్ కాలర్ అఫెన్స్ లు యమరాజా!
స్వామికి చిట్టలోకి మాత్రమే వస్తాయి." అన్నాడు స్వామిని ఓరగా చూస్తూ. నిశ్శబ్దాన్ని చీలుస్తూ మళ్లీ ఆయనే ఇలా అడిగారు.
"సహజవనరులను ఉపయోగించుకుని హాయిగా బ్రతకడం ప్రకృతి ధర్మమే కదా స్వామీ!" అని సందేహం వెలిబుచ్చాడు నారదుడు.
స్వామి మళ్లీ....
" అవును మనిషిని ప్రకృతి ఎప్పుడూ ఆదరిస్తుంది. కానీ ఆ సమన్వయం దెబ్బతిన్నప్పుడు ఆ ప్రకృతే ఆగ్రహిస్తుంది. ఇప్పుడు జరిగిందీ అదే. గాలి, నీరు, తినే తిండి చివరికి వారి మనసులు కూడా కలుషితం చేసుకుంటున్నారు. అందుకే వారికి శుచి శుభ్రత లను నేర్పి ప్రకృతిలో ప్రతి జీవికి, ప్రతి వర్గానికి, ప్రతి అంశానికి కల విశిష్టతను, ఆయా ఉనికికి
ఉన్న పరమార్థాన్ని తెలియ చేయడానికి పుట్టింది కోవిడ్ 19. దానివల్లే మనిషి... ప్రాణం విలువను, సాటి మనిషి కష్టసుఖాలను, సమైక్య జీవన సౌందర్యాన్ని అతి దగ్గరగా చూడ గలుగుతున్నాడు.
మనిషి తాను ఎన్నో యంత్రాలను కనిపెట్టాను, ఎంతో అభివృద్ది సాధించాను, ఎన్నో రహస్యాలను ఛేదించాను, పక్కవాడి వినాశనం కోసం జీవాయుధాల్ని కూడా సృష్టిస్తాను, దేవుని సృష్టికి ప్రతి సృష్టి చేయగలను అని విర్రవీగుతున్నాడు. అంత గొప్పమనిషిని కనీసం ఏక కణ జీవి కూడా కాని ఒక అత్యల్ప ఆయుధంతో మట్టి కరిపించ గలనని ప్రకృతి నిరూపించింది."
మళ్లీ అయోమయం లో పడ్డారు వింటున్న నారదుడు, యముడు "మరి దీనికి పరిష్కారం!!!" అని అడిగారు.
విష్ణుమూర్తి తలపంకించి గంభీరంగా "ఖచ్చితంగా మనిషి చేతుల్లోనే ఉంది. అన్ని జీవరాశులలోనూ మానవ జన్మ పరమో త్కృష్టమైనది, దాని సార్థకతను గుర్తుచేయడమే ఈ పరిస్తితి పరమోద్దేశం. మనిషి తప్పక తన తప్పులు తెలుసుకుంటాడు.
ఈ మారణ హోమాన్ని అరికడతాడు. ఎప్పటిలానే విజయం సాధిస్తాడు. అన్నాడు విష్ణుమూర్తి. నారదుడు, యమధర్మరాజులతో పాటు ముక్కోటి దేవతలు తధాస్తు పలికారు. సర్వేజనా సుఖినోభవంతు.
రచన: వాణిశ్రీ నైనాల
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి