14, ఆగస్టు 2020, శుక్రవారం

12.07.2020 పుస్తక సమీక్ష

 

 

మహాకవి కాళిదాసు

 

కధను పరిచయం చేస్తున్న వారు :  నాగమణి

మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి"దాహంగా ఉంది,నీళ్లు ఇవ్వండి"అని అడుగుతాడు....

గుడిస లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి  ‘మీరెవరు?ఎక్కడనుండి వస్తున్నారు?'అంటుంది....

కాళిదాసు"నేను ఎవరో తెలియకపోవడం ఏంటి?నేను ఓ పెద్ద పండితుడను.ఎవరిని అడిగినా చెబుతారు"అని అంటాడు....

ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి..'మీరు అసత్యమాడుతున్నారు.మీరంత గొప్పవారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి’అంటుంది....

కాళిదాసు కాసేపు ఆలోచించి"నాకు తెలియదు.గొంతు ఎండి పోతుంది,ముందు నీళ్లు ఇవ్వండి"అని బతిమాలుకుంటాడు...

"ఆ ఇద్దరు బలవంతులు ఆకలి, దాహం.ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?"అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....

ఈసారి ‘నేను బాటసారి’ని అంటాడు కాళిదాసు....

అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరూ అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ....

తెల్ల ముఖం పెట్టి మాతా!"నీళ్ళు ఇవ్వండి.లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను" అంటూ ప్రాదేయపడతాడు కాళీదాసు....

వాళ్ళు సూర్యచంద్రులు’అని తెలిపి"మరి మీరెవరో సెలవివ్వండి.నీళ్లిస్తాను" అంటుంది ముసలావిడ....

కాళిదాసు దీనంగా"నేను అతిథిని"అని బదులిస్తాడు....

"మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు.ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే.ఒకటి ధనం, రెండోది యవ్వనం.అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు"అంటుంది ముసలావిడ....

కాళిదాసు"నా సహన పరీక్ష  తరువాత చేద్దురు.ముందు నీళ్లు ఇవ్వండి"అని వేడుకుంటాడు....

"ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు.వారెవరో శెలవివ్వ గలరా" అంటూ...బిక్కమొహం వేసిన కాళీదాసుతో"ఒకటి భూమి,రెండోది వృక్షం"అని భోద పరచి"ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు?"అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....

ఓపిక నశించిన కాళిదాసు"నేను మూర్ఖుడను.ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి"అని సాగిల పడతాడు....

ఆ అవ్వ నవ్వుతూ"ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు"అని అంటుంది....

ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు....

ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది.‘నాయనా! విద్యతో వినయం వృద్ధి చెందాలి,అహంకారం కాదు.కీర్తి,ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి చేయటానికే ఈ పరీక్ష’ అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది.

విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి.

 

*****


 పుస్తకం పేరు: అమరావతి కధలు

రచయిత:  సత్యం శంకరమంచి

కధ : ఆగనిఉయ్యాల

కధను పరిచయం చేస్తున్న వారు :  రమ

 

అలనాడు తిక్కన శ్రీనాధుడు రాయలు

 ఇలనాడు శ్రీపాద, మల్లాది శంకరమంచి ...

చాలు తెలుగుభాషకి ప్రాణప్రతిష్ట చేయడానికి తెలుగునాడి దర్సించడానికి తెలుగు వాడి ప్రదర్శించడానికి  అమరావతి తెలుగునాడు శంకరమంచి క్షేత్రపాలకుడు అంటారు ఎమ్వీ యల్ గారు అమరావతి కధలగురించి.

 ఇంతకముందు ఒకసారి అట్లతద్ది ప్రస్తావన వచ్చింది మన సమూహం లో

 తిలక్  అమృతం కురిసిన రాత్రి గురించి సమీక్షించినప్పుడు. 

నా అక్షరాలు ఎన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్న తిలక్ గారి మాటలు చెప్పుకున్నప్పుడు.

ఇప్పుడు ఆగని ఉయ్యాల కధ నేపద్యం కూడా అట్లతద్ది తో ముడిపడిఉన్నదే.  ఇక కథలోకి వెళితే ……

గౌరి అట్లతద్దినాడు చింత చెట్టుకు కట్టిన నిలువెత్తు ఉయ్యాల వదిలిపెట్టిరాదు వాన వచ్చినా వరద వచ్చినా ఉయ్యాల దిగదు.తల్లి వేళ కి ఒక ముద్దవన్నం పెడితే తింటుందో తినదో తనలో తానే నవ్వు కుంటుంది భూమి బద్దలయినట్టు భళ్లు భళ్లు ఏడుస్తుంది. గ్రుడ్ల నీరు కక్కుకుని నిలువెత్తు ఉయ్యాల మీద నుండి ఆకాశంలోకి  చుక్కలవైపు చూస్తుంది. చూపు రంగడికోసం ఎవరైనా ఓదార్చినా బుజ్జగించినా లోపలి బాధ చెప్పుకోడానికి మాటలు రావయే గౌరి కన్నీళ్లు !! కలువపూల కళ్ళు దుఃఖసముద్రాలై పొంగుతుంటే   ఊరివాళ్ళ గండెలు చెరువులవుతాయి. అని మొదలు పెడతారు శంకరమంచివారు.

అట్లతద్దెనాడు తెల్లవారురుఝామున అందరికంటే ముందు నిద్ర లేచింది గౌరి మాటలొచ్చిన తోటి కన్నెపిల్లలు గల గల మాట్లాడుతుంటే మాటలేల ? అన్నట్టు గల గలా నవ్వేది   నవ్వుతోనే తోటి పిలల్ని నిద్రలేపేది,

 ఒకరా ఇద్దరా ?

వీధి వీధి అంతా  తెలివెన్నలలో కన్నెపిల్లల నవ్వులు. తలంటు స్నానాలు చేసిన జడలానిండా చేమంతి పులదండలు తిలకాలు దిద్దుకున్న ముఖల్లో చిరుగంటల నవ్వులు

లాంటి వర్ణనలు చదువుతుంటే వెన్నెల్లో అమరావతి, ఆడుకునే అందమైన ఆడపిల్లలు  వాళ్ళ నవ్వులు మన కళ్ళముందు సజీవ చిత్రాలుగా కదలక మానవు. 

తెల్లవారకుండానే పులిహోర, గోంగూర పచ్చడి, పెరుగన్నం తో ఆకలైనంత మట్టుకు తిన్నారు అసలు అన్నం మీద ధ్యాస ఎవరికి ? ఏదో పెద్దవాళ్ళ పోరుమీద తినడమే కానీ. అందరి ఉత్సాహం ఉయ్యాలమీదే. అందరూ పరుగులు పెడుతుంటే పట్టుపరికిణి

రెప రెపలు జరీ ఒణీలు  గాలిలో ఎగురుతుంటే అట్లతద్దోయ్ అరట్లోయ్  అంటూ చెమ్మచెక్కలు మోగుతుంటే సూరీడు   సంబరం చూడ్డానికేమో అన్నట్టు రోజుకంటే ముందే భూమ్మీద వాలాడు  లాంటి వర్ణనల తో  తెలుగుతనాన్ని పట్టి తెచ్చి చూపిస్తారు శంకరమంచి గారు.

 ఉయ్యాల ఊగుతూ పైనుండి పడబోయిన గౌరిని రంగడు కాపాడటమే కాక మూగపిల్ల అయినా ముద్దబంతిలా ఉంది అని ముచ్టపడి మనువాడాడు. మరుసటి ఏడు గౌరి ముత్తైదువ గా అట్లతద్ది ఉయ్యాల ఊగటానికి వచ్చింది రంగడే స్వయంగా ఉయ్యాల కట్టి తానే ఉయ్యాల ఉపాడు. కొంతసేపటికి కొమ్మకున్న మోకు పక్కకి జరిగిందని సరిజేయ్యటానికి చింతచెట్టు ఎక్కిన రంగడు కాలుజారి పైనుండి పడి చనిపోతాడు.

పసుముద్ద పగిలిపోయింది .

సామీ పిలవలేని గౌరి తనగోడు మాటల్లో చెప్పుకోలేని గౌరి ఆనాటి నుండి ఉయ్యాల దిగి రాలేదు.గుండె పగులునో

కొండలు కరుగునో అన్నట్టు కన్నీటిధారలు..... ఉయ్యాల ఊగుతూనే ఉంది సామీ సామీ రంగా రంగా అంటూ రాత్రనకా పగలనకా వానలో వరదలో ఊగుతూనే ఉంది గౌరి చెక్కిళ్లపైన కన్నీరు రాలుతూనే ఉంది. 

 *****

ఇదియె!  పరిమళ యెలదోట యింపుకల్గు

తెలుగు తేనియ తెట్టువిదియె! మధువును

పంచు విజ్ఞానమెరిగిన పండితులకు

నిలయమిదియె! సాహిత్యపువిలువనెరిగి

దినదినము నూతనంబుగా దీప్తినిచ్చు

దివ్యమందిరమిదె గద!  తెలుగు వెలుగు

క్షేత్రమిదియె!  సభ్యులకిది కీర్తి తెచ్చు.

-        వెంకట్

 

 ఒక అతి చిన్న కథ

కధను పరిచయం చేస్తున్న వారు : కె. మల్లికార్జున రావు

 "ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు.  మరి స్త్రీ విజయం వెనుక ఎవరు ఉంటారు?

మీ విజయం వెనుక ఎవరున్నారు? "

'ఉత్తమ మహిళ పారిశ్రామిక వేత్త, అవార్డు  అందుకున్న సందర్భంగా మీడియా ఆమెను ప్రశ్నించింది.

 "నా విజయం వెనుక ఎవరు ఉన్నారో మీరే చూడండి"......  అని

 కొద్దిగా పక్కకి జరిగింది ఆమె..

వెనకాల అద్దం.. అద్దంలోనూ  ఆమే

*****­­­­ 

అపార్థం ( కథ)

కధను పరిచయం చేస్తున్న వారు : చల్లా దేవిక

 

      "బాగున్నావా!బుజ్జమ్మా...!"బస్టాప్ లో నిలబడి పది నిమిషాలైనా,బస్ రాలేదని విసుగ్గా ఎదురు చూస్తున్న నీలిమకు అపరిచిత స్వరంలో ధ్వనించిన ఆప్యాయత మరింత చిరాకును తెప్పించింది.దాంతో చివాలున తలతిప్పి , తనవైపే అభిమానంగా చూస్తూ,నవ్వుతూ నిలబడివున్న ఇంచుమించు అరవై ఏళ్ల వయసున్న ఆ స్త్రీని తేరిపారచూసింది.,ఎవరో గుర్తుకు రాకపోయినా, "ఆ...బాగున్నాను" అని ముక్తసరిగా జవాబిచ్చి, మళ్ళీ బస్ కోసం ఎదురుచూస్తూ చూపుల్ని దూరంగా సారించింది నీలిమ. 

        "నన్ను గుర్తుపట్టలేదా..!బుజ్జమ్మా!"మళ్ళీ ఆమె సంధించిన ప్రశ్నకు అమాంతం కోపం ముంచు కొచ్చినా, తనెవరో గుర్తు చేయడానికి ఎంత సుదీర్ఘమైన కథ చెప్తుందోననే ఆలోచన మనసులో రావడంతో,"ఎందుకు గుర్తులేవూ..!" అంటూ అలవోకగా అబద్ధమాడేసింది నీలిమ.ఆ మాట అన్నదో,లేదో  వెంటనే అందుకొని,"మా ఇంటాయన ఈ మధ్య జబ్బుచేసి చచ్చిపోయాడమ్మా!అందుకే ఏ పనికీ పోవడం లేదు.ఓ ఇరవై రూపాయలియ్యమ్మా,అవసరమొచ్చింది" ఆమె కాస్త అధికారికంగానే ఆడిగినట్లుగా నీలిమకు అనిపించింది.'ఓహో..! డబ్బు కోసమా!ఈ తెచ్చిపెట్టుకున్న పరిచయం!పోనీలే.. పెద్దది కదా!'అని మనసులో అనుకుంది నీలిమ.అయిష్టంగానే భుజానికున్న హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఇరవై రూపాయలు తీసి, ఆమె చేతిలో పెట్టి,దూరంనుండి బస్ వస్తూ కనబడడంతో,గబగబా ముందుకు అడుగేసింది నీలిమ. 

       ఆ తర్వాత నెలరోజుల వ్యవధిలో నీలిమ స్కూలుకు వెళ్ళడానికి బస్ కోసం ఎదురుచూస్తూ అక్కడ నిలబడినప్పుడు  ఆమె మరో రెండుసార్లు కనబడి, ఏవో నాలుగు మాటలు చెప్పి,మరో యాభై రూపాయలు ఇప్పించుకుంది.

     "అసలు ఆమె ఎవరోకూడా నాకు తెలీదు.అయినా కనబడ్డప్పుడల్లా ఏవో మాయమాటలు చెప్పి డబ్బులు గుంజుతుంది. మోసం చేయడంలో ఇదొక మార్గమేమోనండీ" అని నెలరోజుల తర్వాత భర్త సాగర్ తో మాటల సందర్భంలో నీలిమ అన్నది."పోనీలే నీలూ..!నువ్వేమీ వందలూ, వేలూ ఇచ్చి మోసపోలేదు కదా..!ఆమెకు ఏమవసరం వుండి అబద్ధమాడిందో..!మనసులో పెట్టుకోకు"అని ఎప్పటిలాగే తన పాజిటివ్ థింకింగ్ తో సలహా ఇచ్చి నవ్వేశాడు సాగర్.కానీ నీలిమ మాత్రం ఈసారి ఆమె కనబడితే ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తెగేసి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంది.

              "బుజ్జమ్మా..!"పరిచితమైన ఆ పిలుపుకు,ఆదివారం సాయంత్రం హాల్లో కూర్చుని,టీవీ చూస్తున్న  నీలిమ ఉలిక్కిపడి వాకిలి వైపు చూసింది.  "ఆమే..!అమ్మో..! ఏకంగా ఇంటికే వచ్చేసింది" నీలిమకు కోపంతో ముఖం ఎర్రబారడంతో విసురుగా లేచి, ఆమె వైపుగా నడిచింది."ఏం లేదమ్మా..! మా పెరట్లో అరటిచెట్టు గెలేసింది.మొదటి గెల మీకే ఇవ్వాలని తెచ్చానమ్మా..!"పక్కనే నిలబెట్టివున్న అరటిగెలను చూపిస్తూ అంది.భుజాన పెట్టుకొని మోసుకొని వచ్చిందేమో..సన్నగా రొప్పుతుంది కానీ,ఆ గొంతులో అదే అభిమానం!

        ఎవరో మీద నీళ్లు చిలకరించినట్లు నీలిమ కోపం చప్పున చల్లారిపోయి,అయోమయంగా చూస్తుంటే..,లోపల్నుండి ఎప్పుడు వచ్చాడో కానీ, వెనుక నుండి సాగర్ "లోపలికి రా పెద్దమ్మా.."అని పిలుస్తూ, " "నీలూ..!మన పాత ఇంటి పక్కన వుండేది శేషమ్మ పెద్దమ్మ .. నీకు గుర్తు లేదూ..!" అంటున్నాడు.సాగర్ ముఖంలోకి సూటిగా చూడలేక, ముఖం తిప్పుకొని శేషమ్మ గారివైపు అభిమానంగా చూస్తూ,ఆప్యాయంగా ఆమె చెయ్యి పట్టుకొని,ఇంట్లోకి దారితీసింది నీలిమ.

*****

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...