కావ్యఖండిక పేరు: “ఆంధ్రుడను”
కవి పేరు: గుఱ్ఱం జాషువా గారు
కావ్య నేపథ్యము:
తెలుగునేల మట్టి వాసన ను నలుదిశలా వెదజల్లిన కవి జాషువా. అందులో ఆయన తాదాత్మ్యం చెందినట్లు అనిపిస్తుంది. ఆయనలో తెలుగుదనం సర్వదా ఉట్టిపడుతుంది. తెలుగు వారి వైభవాన్ని సందర్భోచితంగా తన పద్యాల్లో ప్రస్తుతించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు వెలుగు, తెలుగు తల్లి, తెలుగు తేజం, ఆంధ్రుడను మొదలైన ఖండికలను రచించారు.
వీటిలో బహు సుందరంగా, పురాణ ఇతిహాసాలనాధారము చేసుకొని తెలుగు రూపమును చొప్పించారు. అలా ప్రస్తుత ఆంధ్రుడను కావ్య ఖండిక లో జాతి బహుముఖపు ఔన్నత్యాన్ని చాటి చెప్పారు.
కావ్యఖండిక పరిచయము:
జాషువా గారు “ఆంధ్రుడను” ఖండిక నైదు సీస పద్యాలతో రచించారు. ఐదు పద్యాలు తెలుగు వారు తప్పకుండా చదివి ఆనందానుభూతిని పొందవలసినదే.
మొదటి పద్యములో – అనేక దేశాల్లో పేరు గాంచిన మీసము సవరించే భారత ఖండము నా పాఠశాల, గాన సాహిత్యము గలిగిన తెలుగు భాషా వధూటి నా పంతులమ్మ, సాందీపని సమక్షములో విద్య అభ్యసించే వనమాలి నా సహ పాఠకుడు, భక్తి వైరాగ్య భావములకు నిలయమైన భాగవతము నా బాలశిక్ష ; మోహనాక్షరములు ప్రతిబింబించెడి మహోన్నత విభూతి ఫాల భాగమును వ్రాసికొని ఘనత కెక్కిన ఆంధ్ర పుత్రుడును నేను అని జాషువా ఆంధ్రుడి గొప్పతనమును ఎంత వైభవముగా తెలిపారో చూడండి.
రెండవ పద్యములో.. దేవర్షి, వ్యాసుడు మా ఆస్థాన పండితులని , భూదేవి సుతకు భర్తైన రాముడు మా పొరుగు వారని, భీముడు మా వూరి సాముగాడని, త్యాగయ్య మా యింటి గాయకుడని, మంచుకొండ మీద ఆసీనుడై అద్భుతమైన పద్యాలు చదివి విజయ ఢంకా మ్రోగించుకొనే మడమ తిప్పని ఆంద్రుడను నేను అని చెప్పడంలో జాషువా గారికి పూర్వ కవుల మీద పురాణాల మీద ఎంత గౌరవము, తెలుగు జాతి మీద ఎంత అభిమానం ఉందో అర్థం అవుతుంది.
మూడవ పద్యములో....మా శిల్ప నైపుణ్య మహిమ తాజమహల్ ( తాజమహల్ నిర్మాణంలో తెలుగు వారి పాత్ర ఉందని, మచిలీపట్నం నుండి శిల్పివర్యులు ప్రాతినిధ్యము వహించారు. ఇది చదివి మన సమూహములోని బందరు వాసుల ఆనందాన్ని పట్టగలమా😃😃) మా కవిత్వ విలాస మార్దవంబు చిందు తిక్కన కవిని చూపి, గాండీవి పేరు జెప్పి,శీల సంపదకు సావిత్రి మాంగల్య చరిత్ర చెప్పి గగన మండలి మారుమ్రోగునట్లు కంఠమెత్తి ప్రపంచమందు పందెము కాసె ఆంధ్ర రాజుని నేను అని జాషువా గారు ఆంధ్రుడుకెవరు సాటి లేరని గట్టిగా ప్రతి ఆంధ్రుడు గర్వ పడేలా చెబుతున్నారు.
నాల్గవ పద్యములో… సర్వభూముల కహింస సూక్తి బోధించు నా మనసు అద్దాల మేడ, కరుణకు నా గుండె పురిటిల్లు, మకరందము యుప్పొంగు కవితకు నా నాలుక కల్పతరువు, కమ్ముకొని వచ్చు కీర్తి మేఘముల మీద నిర్మల మైన సంతోష విమానాల నెక్కి అహర్నిశలు హాయిగా సంచరించు ధనవంతుడిని అని జాషువా గారు ఎంత యొడలు పులకితమైనట్లుగా చెపుతున్నాడో..!
ఐదవ పద్యములో …. శ్రీ కృష్ణ దేవ రాయుల ప్రతాపము, రాజ రాజ నరేంద్రుని రమణీయ కీర్తి, బొబ్బిలి వారి శౌర్యము, సహజ కవచములు మాకు, విలసితమైన గొప్ప గ్రంథములు రచించి వలపు టంగడులు తీర్చి వర్తకము చేయు రమణీయ ఆంధ్ర వర్తకుడిని నేను అని జాషువా చెప్పడము చదువుతుంటే ఆంధ్రుడైన ప్రతి యొక్కరికి మేని యందున ప్రతి అణువు పులకితమై మనసు గర్వంతో ఉప్పొంగుతుందనుట ఎంత మాత్రము అతిశయము గాదు.
ముగింపు:
ఈ కావ్య ఖండికలో నున్న వైదు సీస పద్యము లయినప్పటికీ, ప్రతి పద్యము ఒక ఆంధ్ర రత్నము వలె ధగ ధగ మెరుస్తూ ఆంధ్రుల కీర్తిని భరత మాత ప్రతిష్టను ద్విగుణీకృతము కాదండోయి బహుణీకృతము చేస్తున్నట్లుగా ఉంటుంది. మనోహర పదజాలంతో సుమనోహర పద్యాలు చదువుతుంటే పురాణ యితిహాసాలకు ఆంధ్రులకు గొప్ప అవినాభావ సంబంధ ముందనిపిస్తుంది. ఇంత ప్రశస్త్యముగా జాషువా గారు మాత్రమే రాయగలరని అనుట ఆయన కవన వైభవాన్ని కొనియాడుతున్నాని తెలియ పరుస్తున్నాను.
ప్రతి ఆంధ్రుడు చదవవలసిన పద్యాలని, చదివిన తర్వాత పఠితులు సగర్వంగా తల యెత్తుకొని తెలుగు వారి ఘనతకు పరవశించగలరని తెలియ పరుస్తూ…
జాషువా గారి పద్యాలని పరిచయము చేయు అవకాశానికి నేను మురిసిపోతూ….
మరో కావ్య ఖండిక తో సిద్ధంగా ఉండగలనని నమస్సులతో…..
వెంకట్.సిహెచ్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి