22, ఆగస్టు 2020, శనివారం

09 - 08 - 2020; ఆదివారం ప్రత్యేకం - సాహితీ ప్రశ్నావళి

 


🍁🍁 తెలుగు తేనియలు 🍁🍁

09 - 08 - 2020; ఆదివారం ప్రత్యేకం - సాహితీ ప్రశ్నావళి 

అంశం : ఆధునిక నవలా సాహిత్యం 

1. నాగావళి నుండి మంజీర వరకు అనే పుస్తకాన్ని 2015 లో వ్రాసిన ప్రఖ్యాత రచయిత ఎవరు ? ఆ పుస్తకం విశిష్టత ఏమిటి     


జవాబు) ఈ రచన చేసింది శ్రీ రావికొండలరావుగారు. 2015 లో ఆయన ఆత్మకథగా అందించిన నవల. కళింగాంధ్ర నాగావళి తీరం నుంచి తెలంగాణలోని  మంజీర తీరం వరకూ తన ప్రస్థానంలో తారసపడిన అనుభవాల సమాహారమే ఈ పుస్తకం.

 

కొన్ని వందల కథలు వ్రాసిన అనుభవంతో చేయి తిరిగిన కలం కనుక ఒక నదీ ప్రవాహం లాగా నడిపిస్తారు తెలుగు సినీ మాయాలోకంలో మాత్రమే కాదు, జీవితంలో కూడా ఓడలు బండ్లూ, బండ్లు ఓడలూ అయిన సంఘటనలను ప్రత్యక్షసాక్షిగా ఆయన వివరించడం పాఠకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది  


2. అందమైన జీవితం నవల రచించిన ప్రఖ్యాత రచయిత ఎవరు. ఈ పుస్తకంలో నాయకుడి పాత్ర పేరు చెప్పగలరు ?


జవాబు : మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు. ఈ నవలలో కథా నాయకుడి పేరు ప్రియతమ్. మల్లాది వారి అత్యద్భుతమైన మొదటి ఐదు పుస్తకాల్లో ఈ పుస్తకం ఉంటుంది. రాయప్రోలు వారి తృణ కంకణం ఆధారంగా ప్రేమికులు స్నేహితులుగా ఎలా ఉండవచ్చో చెప్పే అందమైన నవల, చక్కని కథ     


స్త్రీ పురుషుల మధ్య మహత్తరమైన స్నేహసుధ సాధ్యమని నిరూపించే నవల *అందమైన జీవితం*. 

అందరూ తప్పక చదవవలసిన నవల   


3. 1992 లో *పద్మ విభూషణ్* పొందిన ప్రఖ్యాత తెలుగు రచయిత / కవి ఎవరు ? 


జవాబు) *కాళోజీ నారాయణరావుగారు* . 1992 లో పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత అయిన తెలుగు కవి కేవలం కాళోజీ నారాయణరావుగారు మాత్రమే 


అదే సంవత్సరంలో తెలంగాణా ఉద్యమ నాయకుడు శ్రీ రావి నారాయణరెడ్డి గారికి కూడా లభించింది. కొంతమంది డా సి . నా. రె గారి పేరు ప్రస్తావించారు.


4. *దుప్పట్లో మిన్నాగు* నవల ఎవరి ప్రఖ్యాత రచన ? ఆ నవల కథ ఏ విమానాశ్రయంలో మొదలవుతుంది ?


జవాబు) ఈ నవలా రచన *యండమూరి* *వీరేంద్రనాధ్* గారిది. 

కథ ఐదుగురి స్నేహితులతో గౌహతి విమానాశ్రయంలో మొదలవుతుంది.   


యండమూరి వారి రచనా శైలితో ఆద్యంతం ఉత్కంఠత కలిగించే కథల సమాహారంగా వెలువడిన నవల దుప్పట్లో మిన్నాగు. నవలలోని పతాక సన్నివేశం అత్యద్భుతం 


5. "మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి"

ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్పిన విషయాలు  ?  నవల పేరు తెలుపగలరు ?


జవాబు) యండమూరి వీరేంద్రనాధ్ గారి ప్రఖ్యాతమైన వెన్నెల్లో ఆడపిల్ల నవలలోనివి ఈ మాటలు.  

కథ చివర్లో నాయిక రమ్య చనిపోతోందని తెలిసీ, గ్రాండ్ మాస్టర్ రేవంత్ కు వ్రాసే ఉత్తరంలో మాటలు  



6. భానుమతి, గుర్నాధం, శేషయ్య పాత్రలు ముళ్ళపూడి వారి ఏ ప్రఖ్యాత రచనలో కనిపిస్తాయి. ఆ నవల ప్రత్యేకత ఏమిటి ?


జవాబు) ముళ్ళపూడి వారి *ఋణానందలహరి* పుస్తకం లోని పాత్రలు.  


ఋణానందలహరి కధలు ఆద్యంతం అద్భుతమే.  విష్ణుశర్మ గారి పంచతంత్రం  ఆధారంగా పరవస్తు చిన్నయసూరి తెలుగు వారికి పంచతంత్రం యధావిధిగా అందించారు కదా.  అన్ని కధలూ జంతువుల నేపథ్యంలో, మనుష్యుల కోసం నీతి కధలు ఎలా వ్రాసారో, ముళ్ళపూడి వారు సరదాగా జంతువుల కోసం పనికొచ్చే మనుష్యుల పాత్రలతో కధలు వ్రాశారు. 


పిల్లలకి చదివి వినిపించవలసిన కధలు. 

ఆద్యంత హాస్యం. అంతకన్నా అజరామరమైన నీతి కూడా  🙏

 


౭. *గులాబీ అత్తరు* ఎవరి ప్రఖ్యాత రచన ? ఆ కథలో ఉదాహరించే సంస్థానం ఎవరిదీ ? 


జవాబు) *గులాబీఅత్తరు* కథ *శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి* గారు రచించిన చాలా ఆసక్తి కరమైన, అందమైన కథ  

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు సిసలైన తెలుగు కథకు, తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం. సహజత్వంతో నిండిన చక్కటి వర్ణనలతో పాఠకులను అట్టే ఆకట్టుకుంటాయి వారి కథలు. 

చిన్నచిన్న సంభాషణలతో కథను రక్తి కట్టించగల నేర్పరి శ్రీపాద వారు. ఏ కథని చదివినా, తెలుగు పలుకుబడులు, నుడికారాలు, సామెతలు, జాతీయాలు వీరి కథల నిండా అందంగా నగిషీలతో పొదిగి ఉంటాయి. ఏ కథ కి ఆ కథ ఆణిముత్యమే గులాబీ అత్తరు కథ రాజుల కింద పనిచేసే దివానుల కర్కశమైన మనసుకు కళాకారులు బలై పోయిన విధానాన్ని వివరిస్తుంది.  

ఈ కథా నేపధ్యం అంతా పెద్దాపురం ఆస్థానానికి సంబంధించిన కథ. అప్పట్లో ఒక సంస్థానంలో దీవానులు ఎంత అహంకారంగా ఉండేవారో, వారి ఆగ్రహావేశాలకు కళాకారులు ఎలా బాలయ్యేవారో, వేదన చెందేవారో చెప్పే అద్భుతమైన కథ    

8.  *చారిత్రక నవలా చక్రవర్తి* గా ప్రసిద్ధి గాంచిన నవలా రచయిత, చరిత్ర కారుడు ఎవరు ? ఆయన ముఖ్య రచనలు ఒక రెండు తెలియచేయగలరు ? 


జవాబు)  *చారిత్రక నవలా చక్రవర్తి* బిరుదాంకితులు *డా* *ముదిగొండ* *శివప్రసాద్* గారు. తెలుగు సాహితీ లోకం గర్వపడే అత్యుత్తమ నవలాకారుడు శ్రీ ముదిగొండ వారు. 

చారిత్రక నవలలు చదవడం అంటే వేల సంవత్సరాల నాటి కాలమాన పరిస్థితుల్లోకి మనం పయనించడమే అని విశ్వసించేవారు ఆయన. ఒక రకంగా మన ఆయుష్షు వేల సంవత్సరాలకు విస్తరించడమే. వేల సంవత్సరాల నుంచి ఈ రోజు దాకా జీవించడమే. మన చరిత్ర, మన పూర్తవీకుల జీవన విధానం తెలుసుకోవడమే    

వీరు 110 పైగా నవలలు వ్రాశారు (వీరిపై wiki లో ఉన్న సమాచారం పూర్తిగా వాస్తవం కాదు)

వీరి నవలల్లో అన్నీ ఆణిముత్యాలే. శ్రీలేఖ, శ్రావణి, ఆవాహన, తంజావూరు విజయం వంటి ఎన్నో అత్యంత ప్రజాదరణ పొందిన నవలలు వీరు రచించారు 


కేవలం ఆంధ్రుల చరిత్ర పైన, శాతవాహనుల దగ్గర నుండి పదమూడో శతాబ్దం వరకు  పాలించిన అనేక రాజ్యాల గురించి, అప్పటి పరిస్థితుల గురించి 20 కి పైగా నవలలు వ్రాశారు. మరీ ముఖ్యంగా శ్రీలేఖ, శ్రావణి, ఆవాహన చదవవలసిన నవలలు. 


అన్ని bookstores లో, ఆన్లైన్ లో కూడా  దొరుకుతాయి.       

   


9. అత్తగారి కధలు రచన డా భానుమతి రామకృష్ణ గారిని 1966 లోనే పద్మశ్రీ తో సత్కరించిన కేంద్ర ప్రభుత్వం, 1994 లో ఏ ప్రఖ్యాత రచనకు  రచనకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గౌరవం లభించింది ? 


జవాబు) ఈ ప్రశ్నకు జవాబు కూడా *అత్తగారి కధలు*. 

ఒకే నవలకు 1966 లోనే సంపాదించిన డా భానుమతి రామకృష్ణగారు, 1994 లో సైతం అదే నవలకు మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం లభించడం గొప్ప విశేషం  


అదే సంవత్సరంలో గుంటూరు శేషేంద్రశర్మ గారికి *కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం* లభించడం వలన మీలో కొంత మంది ఆయన పేరు వ్రాశారు 



10. గురజాడ వారి కన్యాశుల్కము బీభత్స రస ప్రధానమైన విషాదాంతము అన్న ప్రఖ్యాత కవి /. రచయిత ఎవరు ? 


జవాబు) శ్రీశ్రీ 


కన్యాశుల్కము నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహితంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదు అంటూ "కన్యాశుల్కము బీభత్స రస ప్రధానమైన విషాదాంతమూ" అంటారు శ్రీశ్రీ 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...