22, ఆగస్టు 2020, శనివారం

అమరావతి కధలు - ఆగనిఉయ్యాల

 పుస్తకం పేరు: అమరావతి కధలు 

రచయిత:  సత్యం శంకరమంచి 

కధ : ఆగనిఉయ్యాల 

తెలుగు తేనియలు  సమూహ మిత్రులకు నమస్సులు. ఈ ఆదివారం నేను అమరావతి కధలు లోని ఆగని ఉయ్యాల కధను పరిచయం చేస్తున్నాను. 

అలనాడు తిక్కన శ్రీనాధుడు రాయలు

ఇలనాడు శ్రీపాద, మల్లాది శంకరమంచి ...

చాలు తెలుగుభాషకి ప్రాణప్రతిష్ట చేయడానికి తెలుగునాడి దర్సించడానికి తెలుగు వాడి ప్రదర్శించడానికి  అమరావతి తెలుగునాడు శంకరమంచి క్షేత్రపాలకుడు అంటారు ఎమ్వీ యల్ గారు అమరావతి కధలగురించి.

ఇంతకముందు ఒకసారి అట్లతద్ది ప్రస్తావన వచ్చింది మన సమూహం లో తిలక్  అమృతం కురిసిన రాత్రి గురించి సమీక్షించినప్పుడు.  

“నా అక్షరాలు ఎన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు “ అన్న తిలక్ గారి మాటలు చెప్పుకున్నప్పుడు.

ఇప్పుడు ఆగని ఉయ్యాల కధ నేపద్యం కూడా అట్లతద్ది తో ముడిపడిఉన్నదే.  ఇక కథలోకి వెళితే

గౌరి అట్లతద్దినాడు చింత చెట్టుకు కట్టిన నిలువెత్తు ఉయ్యాల వదిలిపెట్టిరాదు వాన వచ్చినా వరద వచ్చినా ఉయ్యాల దిగదు.తల్లి వేళ కి ఒక ముద్దవన్నం పెడితే తింటుందో తినదో తనలో తానే నవ్వు కుంటుంది భూమి బద్దలయినట్టు భళ్లు భళ్లు న ఏడుస్తుంది. గ్రుడ్ల నీరు కక్కుకుని నిలువెత్తు ఉయ్యాల మీద నుండి ఆకాశంలోకి  చుక్కలవైపు చూస్తుంది. ఆ చూపు రంగడికోసం ఎవరైనా ఓదార్చినా బుజ్జగించినా లోపలి బాధ చెప్పుకోడానికి మాటలు రావయే గౌరి కన్నీళ్లు !! కలువపూల కళ్ళు దుఃఖసముద్రాలై పొంగుతుంటే   ఊరివాళ్ళ గండెలు చెరువులవుతాయి. అని మొదలు పెడతారు శంకరమంచివారు.


అట్లతద్దెనాడు తెల్లవారురుఝామున అందరికంటే ముందు నిద్ర లేచింది గౌరి మాటలొచ్చిన తోటి కన్నెపిల్లలు గల గల మాట్లాడుతుంటే మాటలేల ? అన్నట్టు గల గలా నవ్వేది

 ఆ నవ్వుతోనే తోటి పిలల్ని నిద్రలేపేది,

 ఒకరా ఇద్దరా ? 

వీధి వీధి అంతా  తెలివెన్నలలో కన్నెపిల్లల నవ్వులు. తలంటు స్నానాలు చేసిన జడలానిండా చేమంతి పులదండలు తిలకాలు దిద్దుకున్న ముఖల్లో చిరుగంటల నవ్వులు 

లాంటి వర్ణనలు చదువుతుంటే వెన్నెల్లో అమరావతి, ఆడుకునే అందమైన ఆడపిల్లలు

 వాళ్ళ నవ్వులు మన కళ్ళముందు 

సజీవ చిత్రాలుగా కదలక మానవు.  


తెల్లవారకుండానే పులిహోర, గోంగూర పచ్చడి, పెరుగన్నం తో ఆకలైనంత మట్టుకు తిన్నారు అసలు అన్నం మీద ధ్యాస ఎవరికి ? ఏదో పెద్దవాళ్ళ పోరుమీద తినడమే కానీ. అందరి ఉత్సాహం ఉయ్యాలమీదే. అందరూ పరుగులు పెడుతుంటే పట్టుపరికిణి 

రెప రెపలు 

జరీ ఒణీ లు 

గాలిలో ఎగురుతుంటే అట్లతద్దోయ్ అరట్లోయ్  అంటూ చెమ్మచెక్కలు మోగుతుంటే సూరీడు

 ఈ సంబరం చూడ్డానికేమో అన్నట్టు రోజుకంటే ముందే భూమ్మీద వాలాడు  లాంటి వర్ణనల తో  తెలుగుతనాన్ని పట్టి తెచ్చి చూపిస్తారు శంకరమంచి గారు.


ఉయ్యాల ఊగుతూ పైనుండి పడబోయిన గౌరిని రంగడు కాపాడటమే కాక మూగపిల్ల అయినా ముద్దబంతిలా ఉంది అని ముచ్టపడి మనువాడాడు. మరుసటి ఏడు 

గౌరి ముత్తైదువ గా అట్లతద్ది ఉయ్యాల ఊగటానికి వచ్చింది రంగడే స్వయంగా ఉయ్యాల కట్టి తానే ఉయ్యాల ఉపాడు. కొంతసేపటికి కొమ్మకున్న మోకు పక్కకి జరిగిందని సరిజేయ్యటానికి చింతచెట్టు ఎక్కిన రంగడు కాలుజారి పైనుండి పడి చనిపోతాడు.

పసుముద్ద పగిలిపోయింది .

సామీ పిలవలేని గౌరి తనగోడు మాటల్లో చెప్పుకోలేని గౌరి ఆనాటి నుండి ఉయ్యాల దిగి రాలేదు.గుండె పగులునో 

కొండలు కరుగునో అన్నట్టు కన్నీటిధారలు..... ఉయ్యాల ఊగుతూనే ఉంది సామీ సామీ రంగా రంగా అంటూ రాత్రనకా పగలనకా వానలో వరదలో ఊగుతూనే ఉంది గౌరి చెక్కిళ్లపైన కన్నీరు రాలుతూనే ఉంది.   


✍️ రమ, కంకిపాడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...