30, ఆగస్టు 2020, ఆదివారం

పుస్తక సమీక్ష 30.08.2020

 


గ్రంథము పేరు: పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయ కథ

 

కవి పేరు: ఆధునికాంధ్ర కవితా వైతాళికుడు స్వర్గీయ గురజాడ అప్పారావు (1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30)

 

కవి పరిచయము:

  

రచయిత, సంఘ సంస్కర్త, సాహితీకారుడు, హేతువాది, అభ్యుదయ కవి కవి శేఖరుడైన గురజాడ అప్పారావు గారి జాడ ఎరుగని తెలుగువారు ఉండరేమో అనుట అత్యంత సహశయమని నా భావన. అనేక సాంఘిక దురాచారలతో కుంటుపడుతున్న సమాజంలో పరివర్తన తెచ్చెడి మహత్తర ఆశయంతో, పండితులు చదువుకునే గ్రంథములకు పరిమితమైన  తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నము చేసెడి గొప్ప కార్యదీక్షత తో రచనలు చేసిన గురజాడ వారు సృష్టించిన పాత్రలు గిరీశమ్, మధురవాణి, రామప్ప పంతులు తెలుగు నాట సుపరిచితమే.

 

వ్యవహారిక భాషోద్యమంలో గురజాడ అప్పారావు తన సహాధ్యాయి గిడుగు రామమూర్తి పంతులుతో కలిసి పోరాటం సలిపారు.

 

గురజాడ రచనల్లో కన్యాశుల్కము (నాటకం) అగ్రగణ్యమైనది. కన్యాశుల్కము దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన నాటకం భారతీయ భాషల్లో వెలువడిన ఉత్తమోత్తమమైన రచనలలో ఒకటి. తను సృష్టించిన ముత్యాల సరాలు ఛందస్సు తో అనేక రచనలను వ్యవహారిక భాషలో చేసి సగటు పాఠకుల హృదయాలను దోచుకున్నారు. దేశమును ప్రేమించుమన్నా అని రచించిన దేశభక్తి గేయము, కన్యాశుల్కము ఇతివృత్తముతో రచించిన అత్యంత కరుణ రసము వొలిగించెడి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ తెలుగునాట అత్యంత ప్రాచుర్యము పొందాయి.

 

 సారంగధర ఇంగ్లీషు పద్య కావ్యం-ఇండియన్ లీజర్ అవర్ (విజయనగరం) లోనూ రీస్ అండ్ రయ్యత్ (బెంగాల్) పత్రిక లోనూ ప్రచురించబడింది. అనేక రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని అగ్రస్ఠానంలో నిలబెట్టిన గురజాడ వారు తెలుగు సాహిత్య చరితలో ధృవతార వలె వెలుగొందుతూ సాహిత్య కాంతులు వెదజల్లుతు ఉంటారని సాహితీ లోక ప్రగాఢ విశ్వాసము.

 

గేయ కథా నేపథ్యము/ఇతివృత్తము:

 

కన్యాశుల్కమనెడి సాంఘిక దురాచారమును ఇతివృత్తముగా తీసుకొని ఒక పేద బాపడు హేయమైన ధనాభిలాషతో తన ముక్కుపచ్చలారని బాలికను ముదుసలికిచ్చి కట్టపెట్టిన వైనము ఆధారంగా  అటువంటి చిన్నారి బాలికల తరపున వాకల్తా పుచ్చుకున్న ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి  కథనాత్మకంగా, అత్యంత కరుణరసము స్రవించెడి  గేయంగా పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కథ పేరుతో రచన చేసారు గురజాడ. “పుత్తడిబొమ్మా పూర్ణమ్మాఅంటూ యవ్వనములోకి అడుగిడుతున్న ముగ్ధమనోహరమైన అందాల రాశి సమాజములో నున్న దురాచారానికి బలయిన తీరును కథలో తనకే సొంతమైన సరళ వ్యవహార భాషా పదాలతో గేయకథగా గురజాడ వారు వివరించారు.

 

గేయకథా పరిచయము

 

మేలిమి బంగరు మెలతల్లారా !

కలువల కన్నుల కన్నెల్లారా !

తల్లులగన్నా పిల్లల్లారా !

విన్నారమ్మా ఈ కథను ?

ఆటల పాటల పేటికలారా !

కమ్మని మాటల కొమ్మల్లారా

అమ్మలగన్నా అమ్మల్లారా !

విన్నారమ్మా మీరీ కథను ?

అని గేయము ప్రారంభమవుతుంది. స్వచ్ఛమైన బంగారు లావణ్యము గల మహిళలారా ! కలువల వలె కన్ను గవ గల కన్నెల్లారా! పిల్లల్లారా ! ఆటల పాటలతో సంతోషముగా కమ్మగా మాటలు చెప్పెడి అమ్మాయిలను కొమ్మలారా అని సంభోదిస్తూ  విన్నారా ఈ కథను అని రచయిత కథను చెప్పుటకు సిద్ధమవుతున్నారు.

 

కొండల నడుమను కోనొకటున్నది !

కోనకి నడుమా కొలనొకటుంది !

కొలని గట్టునా కోవెల లోపల

వెలసెను బంగరు దుర్గమ్మ.

 

పూజారింటను పుట్టెను చిన్నది

పుత్తడి బొమ్మా పూర్ణమ్మా,

అన్నల తమ్ముల కనుగై దుర్గకు

పూజలు పువ్వులు కోసేది.

 

తాను చెప్పబోతున్న కథలోని ప్రధాన పాత్ర కు సంబంధించిన ప్రదేశ వర్ణనను ఈ విధంగా ఆరంభిస్తారు. కొండల నడుమలో ఒక వనము ఉంది. వనము నడుమన కొలను, ఆ కొలను గట్టున గుడి, ఆ గుడిలో వెలసిన బంగారు దుర్గమ్మ. ఆ గుడిలో పూజ చేసె పూజరి యింటిలో పుట్టిన చిన్నది. ఆమే బంగారు బొమ్మ లాగా అందమైన పూర్ణమ్మ. దుర్గ పూజకు పువ్వులు కోసేది అని గేయ కథానాయికను పరిచయము చేస్తారు రచయిత.

 

 

ఏయే వేళల పూసే పువ్వుల

ఆయా వేళల అందించి

బంగరు దుర్గను భక్తితొ కొలిచెను

పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

 

ఏయే ఋతువుల పండే పళ్ళను

ఆయా ఋతువుల అందించి

బంగరు దుర్గను భక్తితొ కొలిచెను

పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

 

ఉదయము వేళలో పూచే పువ్వులతో ఉదయము, సాయంత్రము వేళలో పూచే పువ్వులతో సాయంత్రము, ఋతువుల బట్టి పండే పళ్ళను దుర్గకు అర్పించి భక్తితో బంగరు దుర్గను నిత్యము పూర్ణమ్మ కొలుస్తుందని రచయిత చెప్పడము కోవెలలో జరిగే పూజావిధానమును తెలియజేస్తుంది. ఇది చదువుతున్న పాఠకులకు ఆ కోవెల , కొలను, దుర్గ దేవి కనుల ముందు సాక్షాత్కరింపక ఉండదు.

 

పళ్ళను మీరిన తీపుల నడలును

పువ్వుల మీరిన పోడుములున్

అంగము లందున అమరెను పూర్ణకు

సౌరులు మించెను నానాటన్.

 

ఆ పూర్ణమ్మ సమర్పించే పండ్లలోని తియ్యదనము, పువ్వులలోని సౌందర్యమంతయు పూర్ణమ్మకు ప్రతి అవయము నందు సమకూరి యవ్వనవతి అవుతుందని ఎంత గొప్పగా చెపుతారు. అలాంటి పూర్ణమ్మకు యోగ్యుడైన ఉత్తమునికిచ్చి వివాహము చేయవలసిన బాధ్యత తండ్రికి ఉంది. అయితే ఆ గొప్ప తండ్రి డబ్బుకు ఆశ పడి ధర్మాన్ని మరచిపోయి బంగారు బొమ్మ లా ఉన్న పూర్ణమ్మను ఒక ముదుసలికిచ్చి వివాహము చేయడము జరుగుతుంది.

 

కాసుకు లోనై తల్లీ తండ్రీ

నెనరూ న్యాయం విడనాడి

పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక

ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ.

 

ఆమని రాగా దుర్గ కొలనులో

కలకల నవ్వెను తామరలు

ఆమని రాగా దుర్గ వనములో

కిలకిల పలికెను కీరములు.

 

వసంత కాలం వచ్చాగా దుర్గ కొలనులో తామరలు విరపూచాయి. పక్షుల కిలకిల ధ్వనులు వసంత కాలమాగమనాన్ని తెలియజేస్తుంది. దీనిని వర్ణన చేయడంలో కవి ఆంతర్యాన్ని గమనిస్తే ఆనాటి సమాజంలో బాల్యవివాహము జరిగితే ఆ అమ్మాయి యౌవనంలోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే భర్త యింటికి వెళుతుంది. ఈ వర్ణన బట్టి వసంత కాలము వచ్చినప్పుడు ప్రకృతి ఎంత సౌందర్యాన్ని సంత రించుకుంటుందో అలాగే మన గేయ కథానాయిక అంత అందచందాలను కూర్చుకుని రమణీయంగా ఉందని భావము.

 

ముద్దు నవ్వులూ మురిపెములూ మరి

పెనిమిటి గాంచిన నిమిషమున  

బాసెను కన్నియ ముఖ కమలమ్మున

కన్నుల గ్రమ్మెను కన్నీరు.

ఆటల పాటల తోటి కన్నియలు

మొగుడు తాత యని కేలించ,

ఆటల పాటల కలియక పూర్ణిమ

దుర్గను చేరీ దుక్కించె

కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను

పుత్తడి బొమ్మను పూర్ణమను

చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను

పుత్తడి బొమ్మకు పూర్ణమకు.

 

అలా వసంత కాలము ఆహ్లాదము నంత తనలో యిముడ్చుకొని సంతోషంగా ఉన్న పూర్ణమ్మకు పెనిమిటిని తలచుకొనగా ఆ కన్నెయ ముఖములో తేజస్సు అంతా పోయి కళ్ళల్లో నీరు వచ్చింది. ఆటపాటలాడెడి తరుణములో తోటి స్నేహితురాళ్ళు నీ మొగుడు తాత అని –ఎగతాళి చేస్తుంటే వారితో కలవకుండా దుర్గను చేరి దుఃఖిస్తూ ఉంది. కొన్నాళ్ళకు పూర్ణమ్మను తీసుకొని వెళ్ళుటకు చీరెలు, సొమ్ములు చాలా పట్టుకొచ్చాడు.

 

పసుపు రాసిరి బంగరు మేనికి

జలకము లాడెను పూర్ణమ్మ

వదినెలు పూర్ణకు పరిపరి విధముల

నేర్పులు మెరసీ కై చేస్రీ.

ఆ పూర్ణమ్మ బంగారు దేహానికి పసుపు రాసి స్నానాలు చేయించి వదెనలు పలువిధములుగా మెట్టినింట మెల్గవలసిన మెలకువలను తెలిపారు.

పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ

తల్లీ తండ్రీ దీవించ్రీ

దీవన వింటూ పక్కున నవ్వెను

పుత్తడి బొమ్మా పూర్ణమ్మ !

 

చిన్నల నందర కౌగిట చేర్చుకు

కంటను బెట్టెను కన్నీరూ !

అన్నల తమ్ముల నప్పుడు పలికెను

పుత్తడి బొమ్మా పూర్ణమ్మా.

 

అపుడు పెద్దలకు మొక్కుతుంటే తల్లి దండ్రి దీవెనలు ఇస్తుంటే పూర్ణమ్మ పక్కున నవ్విందనుటలో ఆంతర్యము పరిశిలిస్తే, సాధారణంగా మెట్టినింటికి వెళ్ళబోతున్న వధువును దీర్ఘసుమంగళి భవ అని దీవిస్తారు. కానీ ఇక్కడ ముసలి భర్త త్వరలోనే కాటికి చెరతాడు. మరి దీవెనలు ఎలా యిస్తారు అని భావన.

 

"అన్నల్లారా తమ్ముల్లారా !

అమ్మను అయ్యను కానండీ

బంగరు దుర్గను భక్తితొ కొలవం

డమ్మల కమ్మా దుర్గమ్మ.

 

 

"ఆయా వేళల పూసే పువ్వుల

ఆయా ఋతువుల పళ్ళన్నీ,

భక్తిని తెచ్చీ శక్తికి యివ్వం

డమ్మల కమ్మా దుర్గమ్మ

 

నలుగురు కూచుని నవ్వే వేళల

నా పేరొక తరి తలవండి

మీమీ కన్న బిడ్డల నొకతెకు

ప్రేమను నా పేరివ్వండి.".

 

బలబల కన్నుల కన్నీరొలికెను

పుత్తడి బొమ్మకు పూర్ణమకు

కన్నులు తుడుచుకు కలకల నవ్వెను

పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

 

అన్నల్లారా, తమ్ముల్లారా అమ్మను, అయ్యను చూసుకుంటూ పూలను,పండ్లను సమర్పిస్తూ శక్తి గల మహాతల్లి దుర్గను భక్తితో కొలవండి. మీరు నలుగురు కూర్చొని ముచ్చటలాడు సమయంలో నన్ను తలుచుకొండి. మీ కన్న బిద్దలల్లో ఒకరికి నా పేరు పెట్టండి అని పూర్ణమ్మ కంటనీరు పెట్టుకుంది. ఆ కన్నీరును తుడుచుకొని గలగల నవ్వులు చిందించింది పూర్ణమ్మ.

 

వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు

తల్లియు కంటను తడిబెట్టన్

కాసుకు లోనై అల్లుని చూసుకు

ఆనందించెను అయ్యొకడె.

 

వదిన లు, తమ్ముళ్లు పూర్ణమ్మ కు జరిగిన అన్యాయానికి బాధ పడుతున్నారు. తల్లి కన్నీరు పెట్టుకుంటోంది. కానీ డబ్బు ఆశకు లోనైన తండ్రి అల్లుణ్ణి చూసుకొని ఆనందిస్తున్నాడు.

 

యెప్పటి యట్టుల సాయంత్రమ్మున

యేరిన పువ్వులు సరిగూర్చి

సంతోషమ్మున దుర్గను కొలవను

వొంటిగ పోయెను పూర్ణమ్మ.

 

ఆవులు పెయ్యలు మందలు జేరెను

పిట్టలు చెట్లను గుమిగూడెన్

మింటను చుక్కలు మెరయుచు పొడమెను

యింటికి పూర్ణమ రాదాయె.

 

చీకటి నిండెను కొండల కోనల

మేతకు మెకములు మెసల జనెన్

దుర్గకు మెడలో హారము లమరెను

పూర్ణమ యింటికి రాదాయె.

 

ఎప్పటి లాగానే సాయంత్రం పూలు ఏరుకొని దండను కట్టి సంతోషముతో దుర్గను పూజించడానికి ఒంటరిగా పూర్ణమ్మ వెళ్ళింది. అలా వెళ్లిన పూర్ణమ్మ తిరిగి రాలేదని రవయిత ఆనాటి సమాజంలో చీకటి పడటానికి చిహ్నాలను తెలపడం కనిపిస్తుంది. ఆవులు దూడలను చేరాయి, బిడ్డల ఆహారం కోసము వెళ్ళిన పక్షి తల్లులు గూటికి చేరాయి. నింగిలో చుక్కలు మెరుస్తూ వస్తున్నాయి. కానీ పూర్ణమ్మ యింటికి రాదేమి.కొండల కోనల్లో చీకటి నిండింది. మృగములు మేతకు వెళ్ళుచున్నాయి. దుర్గ మెడలో పూర్ణమ్మ అల్లిన పూదండలు చేరాయి. కానీ పూర్ణమ్మ యింటికి రాదేమీ.... ఇక్కడ ఈ పంక్తులు చదువుతుంటే ఒక్కసారిగా పాఠకుల్లో ఆందోళన కనిపించక మానదు.

 

కన్నుల కాంతులు కలవల చేరెను

మేలిమి జేరెను మేని పసల్ !

హంసల జేరెను నడకల బెడగులు

దుర్గను జేరెను పూర్ణమ్మ.

 

ఆ కొలను లోని కలువలకు పూర్ణమ్మ కనుల్లో ఉన్న కాంతి వచ్చింది. ఆ బంగారానికి వచ్చిన వన్నె పూర్ణమ్మ శరీరము నుండి వచ్చింది. అంత చక్కగా హొయలు పోతూ హంసలు నడుస్తున్నాయి అంటే పూర్ణమ్మ నడకల అందం హంసలకు వచ్చింది. అట్లా దుర్గను చేరింది పూర్ణమ్మ అని రచయిత పూర్ణమ్మ ఆత్మాహుతి తో గేయం ముగించడం ఎంతటి కఠిన పాషాణ హృదయము గల వారికైనా కన్నీరు తెప్పించకుండా ఉండదు..

 

ముగింపు

 

ఇంతటి గొప్ప కరుణ రసముతో అభిషేకించి రచించిన గేయ కావ్యము ఆనాటికి ఈనాటికి సమాజ దురాచారాలను ఎత్తి చూపుతుంది. ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిని తలదించుకుని సిగ్గుతో క్షమాపణలు వేడుకునెలా చేస్తుంది. గేయము ను ఘంటసాల వారు పాడడం మరింత ఆకట్టుకుంటుంది. స్త్రీ జనోద్దరణ కోసం రచనలు చేసిన గురజాడ వారి భావాలు నిండుగా ఈ గేయంలో కనిపిస్తాయి. తెలుగు సాహిత్యము ఉన్నంత వరకు ఇలాంటి గేయాలు నిలిచి ఉంటాయి. తెలుగు వారి గుండెల్లో ఈ కవిశేఖరుడు చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని తెలుపు కుంటూ...

 

ఈ గేయమును పరిచయం చేసినందుకు సంతోషిస్తూ ....

 

ధన్యవాదాలతో...

 

వెంకట్. సిహెచ్

 

గేయమును కూడా కలిపి వ్రాయడం వలన విషయము చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ నేను వ్రాసిన వివరణ కంటే గురజాడ వారి గేయమును పఠించాలనెడి సంకల్పంతో గేయమును సమీక్షలో యిమడ్చడం జరిగింది. పూర్తిగా చదివి ఆస్వాదించ గలరని ఆశిస్తున్నాను.

***************************************** 

 

నేటి వ్యాసం

కవి లో యోగి:

 

మనకు చరిత్రలో కవులు  కనిపిస్తారు లేక యోగులు  కనిపిస్తారు.. కవిత్వాన్ని ఆత్మ తత్వాన్ని సమానంగా బోధించిన వారు చాలా అరుదు.. వేమన ఆ కోవకు చెందినవారు..

 

వేమన కవిగా బహుళ ప్రజాదరణ పొందిన వాడు... కానీ యోగిగా అతని ప్రజాదరణ పరిమితమే.. కారణం వేమనను ఏ సిద్ధాంతం వాళ్లు ఏ తత్వం వాళ్ళు తమ వాడు అని దృఢంగా చెప్పలేకపోయారు.. పరిశోధన గ్రంథాల వల్ల, వేమన పద్యాలను వివరంగా అర్థం పరిశీలించడం వల్ల,  మనము వేమన తత్వాన్ని అర్థం చేసుకోవాలి..

 

వేమన కథ నుండి వెలువడిన వేలపద్యాలలో దొరికిన దాదాపు ఆరు వేల పద్యాలు నీతి, యోగ ,భక్తి ,వైరాగ్య, జ్ఞాన సంబంధమైన వై ఉండి కలగాపులగంగా ఉండుటచే వేమన తత్వ శాస్త్రము ఎవరికి అంతుపట్టలేదు..

 

వేమన తత్వం నిర్ణయ నిర్ధారణకు  వేమన పద్యా లే మచ్చుతునక. తత్వ నిర్ణయం తెలిసినవాడే ఉత్త ముడని అని వేమన అభిప్రాయం.. అయితే వేమన ఏ మతానికి చెందినవాడు? అంటే  కొందరు అద్వైతం అని , మరికొందరు శివాద్వైతం అని, ఇంకొందరు నాస్తికుడని తమ ఇష్టానుసారం తిప్పుకున్నారు. నిజానికి వేమన మతాలకు అతీతుడు .. మతాలకు అందని భావాన్ని బోధించాడు . వేదాతీతుడు వేమన సుమ్మీ అని చెప్పుకున్నాడు వేమన.

 

వేమన ప్రకారం వేదాల వల్ల సామాన్య మానవుడు సత్యాన్ని తెలుసుకోవడం కష్టం. ఎందుకనగా వేదాలు అనేక ఋషుల ప్రోక్తము. అందువల్ల వేదాలలో అనేక వాదాలు  కనిపిస్తాయి . అందుకే వేమన వేదాల  గురించి

ఈ క్రింది విధంగా చెప్పినాడు..


 ఆటవెలది

వెర్రి నక్కల వలె వేదముల్ జదివేరు

యాశయంబు లెరుగ రయ్యవార్లు

వేద సారమంత  వేమన ఎరుగును విశ్వదాభిరామ వినురవేమ

 

వేమన తన గురువు అంబికా శివయోగి  నుండి వేమన రాజయోగం గ్రహించాడు. ఈ రాజయోగాన్ని అచల తత్వం అని , పరిపూర్ణ రాజయోగ మని కూడా అంటారు .

 వేమన ప్రబోధించిన అచల తత్వ మందు గురువే దైవము , గురువుకే పూజ ఉంటుంది , ఇతర దేవతల పూజలు ఉండవు ..వేమన తన పద్యాలలో ఎక్కడా  దేవతల స్తుతి చేయ నేలేదు.వేమన అచల తత్వము బోధించినాడు అనుటకు క్రింది పద్యములు నిదర్శనం..

 

సీసము

మనసు నిల్పినవాడు మరి  సర్వసమమందు

ననుభవంబును గోరి యచులుడగును.  నిగమాంత వేద్యుడై నిత్య ప్రకాశుండై

పరమ పరిపూర్ణము గోరి పట్టు విడడు.

అరయంగరానిది యల పరబ్రహ్మంబు

తానని తెలిసియు దలపు విడడు.

నిరతమాత్మ నుతించి నిర్గుణంబును జెంది నిశ్చల బ్రహ్మమౌ నియతి విడడు.

 

తేటగీతి

సగుణ మెప్పుడు తాగాక సత్య మనెడు

నిర్గుణ బ్రహ్మమే నని నిశ్చయించి

తాను తనలోన పూర్ణుడై తలగకుండు

విమల గుణ రాజా యోగీంద్ర వేమనార్య

 

అర్థం  :-

చంచలమైన మనస్సును కట్టడి చేసి నిశ్చలముగా చేసినవాడు సుఖదుఃఖముల యెడ సమదృష్టి కలవాడై భగవంతుని పరిపూర్ణ తత్వం తెలుసుకొను పట్టుదలతో ఉంటాడు.. తాను స్వయం పరబ్రహ్మ రూపం అని తెలిసి కూడా పరమాత్మ తలంపులో ఉంటాడు. సగుణ రూప బ్రహ్మము కన్నా నిర్గుణ బ్రహ్మమే నిత్యమైన సత్యమైనదనీ  ఎరిగి తనలో పూర్ణత్వం నింపుకొని ఉంటాడు..

 

యోగి వేమన తత్త్వం గురించి పై నాలుగు మాటలు చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది..

 

కె మల్లికార్జునరావు

 

**********************************************

 ఒక చిన్న నీతి కథ-

 

"ఏకాగ్రత"

 

ఒక తండ్రి తన చిన్న కూతురు తో కలిసి దేవాలయానికి వెళ్ళాడు . భగవంతుని దర్శనం పూర్తి చేసుకొని వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో కూతురు ఇక మీదట  ఆలయానికి రాను అంది.. తండ్రి ఎందుకు అని  అడిగాడు.

కూతురు  ఏమందంటే  " భగవంతునికి భక్తి తో సేవ చేయడానికి మనం ఇక్కడకు వస్తారు., ఐతే  ఇక్కడ అందరూ బూటకపు భక్తులే కనిపిస్తున్నారు. ఇక్కడికి  వచ్చి కూడా చాలా మంది తమ దృష్టి , మనసు మొత్తం సెల్ ఫోన్ మీదనే ఉంచుతున్నారు.. వీరిని  చూసి నేను కూడా అలా అవుతానని  భయపడుతున్నాను.  అందుకే నేను భవిష్యత్తులో  ఆలయానికి రాదలచుకోవడం లేదు" .

తండ్రి  విని  ఒక నిముషం ఆలోచించి  అన్నాడు "సరే ... నీ నిర్ణయానికి నేను అడ్డు రాను.. కానీ ,  తీసుకునే ముందు ఒక చిన్న పని చేస్తావా?" కూతురు అందుకు సరే నని అన్నది.

తండ్రి అన్నాడు:- "ఒక గాజు గ్లాసులో  నిండా నీరు పోసుకుని ఆలయం చుట్టూ ఒక సారి  నడిచి రావాలి .  నీళ్ళు  ఏమాత్రం క్రింద పడకుండా రావాలి."  సరే నంది కూతురు..

 అప్పుడు కూతురు తండ్రి చెప్పినట్లు ఆలయము  చుట్టూ తిరిగి వచ్చి ఇలా అంది..  "చూశారా! ఒక్క చుక్క నీరు కూడా క్రింద పడలేదు. నేను గెలిచాను"అప్పుడు తండ్రి కూతురి ని అభినందించి,  ఈ ప్రశ్నలు అడిగాడు:

 

1. ఆలయం చుట్టూ నడిచి నప్పుడు  ఎవరినైనా  ఫోన్ తో మాట్లాడుతుండగా  నీవు  చూశావా?

2.  నీకు ఎవరైనా కపట భక్తులుగా కనిపిస్తున్నారా ?

 

 

కూతురు అన్నది  " నా దృష్టి  గ్లాసు మరియు దానిలోని నీటిపైనే నిలిపాను, నీళ్ళు ఒక్క చుక్క కూడా పోలేదు. అందుకని ఎవరినీ గమనించలేదు "

 

అందుకు తండ్రి అన్నాడు : "నీవు ఆలయానికి వచ్చినప్పుడు సరిగ్గా ఇలాగే  చేయాలి.  కేవలం భగవంతునిపై దృష్టి ఉంచి , ఆయన పైనే  ధ్యాస, ఆలోచన నిలపాలి . అలా చేస్తే ఇతరులేవరూ  నీ దృష్టికి రారు. అదే కాక  నిన్ను చూసి ఇతరులు కూడా క్రమంగా మారవచ్చు.* నిశ్చలమైన భక్తి,  ఏకాగ్రతా,  సాధనా *, మాత్రమే మనల్ని భగవంతుని సమీపానికి  చేరుస్తాయి;  మనల్ని  ఉన్నతపథంలో నడిపిస్తాయి" .....

 

ఇదండీ ఏకాగ్రత విశిష్టత..

 

కె మల్లికార్జునరావు

 

*********************************************************


సమాప్తం  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...