కావ్య ఖండిక పేరు : గిజిగాడు
కవి పేరు :
గుఱ్ఱం జాషువా గారు
నేటి
పుస్తక సమీక్షలో భాగంగా నవయుగకవిచక్రవర్తి కవిదిగ్గజ గుఱ్ఱం జాషువా గారి గిజిగాడు కావ్య ఖండికను సమీక్ష చేయుచున్నాను.. (పరిచయం అని కాకుండా సమీక్ష అని చెప్పుటలో ఆ పద్యాల విశిష్టతను పూర్తిగా అవగాహన చేసుకున్నాననే ఆత్మవిశ్వాసము)
కవిపరిచయం ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేకుండా
ఇలా చెపుతున్నాను. జాషువా గారు స్పృశించని తెలుగు కవిత్వపు పార్శ్వములు లేవంటే అతిశయోక్తి
కాదు.
కావ్య నేపథ్యము:
ప్రకృతిని సునిశితంగా పరిశీలించి విధాత సృష్టిని
విశ్లేషణ చేసి చెప్పుటలో మేటైన కవీశ్వరుడు జాషువా గారు. జీవుల జీవన విధానాన్ని వాటి
నైపుణ్యతను వర్ణించుటకు జాషువా కలములోని సిరా ప్రవాహం మధురక్షరాల వెల్లువలా మధువులొలికెడి
సుమధుర భావరూపమిచ్చుటకు సదా సిద్దంగా ఉంటుంది. ఆ వర్ణనలో భాగంగా విశ్వామిత్రుడి త్రిశంకుస్వర్గమును
తలపించు రీతిలో గొప్ప నైపుణ్యము గల ఇంజనీరు నిర్మించిన భవన నిర్మాణము వలె తనకే సాధ్యమైన
ప్రత్యేక గూడు నిర్మాణ కౌశలం కలిగిన గిజిగాడు గురించి చెప్పు ప్రయత్నమే కావ్య ఖండిక
నేపథ్యం. అత్యంత రమణీయమైన 5 పద్యాలలో జాషువా గారు గిజిగాడు
గురించి మనసు పులకించి పరవశించునట్లుగా తెలియజేశారు.
కావ్య ఖండిక
సమీక్ష:
జాషువా హృదయ కవాటాల
లోని భావములకు అక్షర రూపమిచ్చి అనేక జీవుల జీవనశైలిని అత్యంత మనోహరంగా, చక్కని
పదజాలంతో పద్యములల్లి తన కావ్యములందు ఆ జీవులకు విశిష్టస్థానము కల్పించారు. అందరూ ఎవగించుకొనే
గబ్బిలముకు గొప్ప కీర్తిని తెచ్చి పెట్టారు. గిజిగాడు, సాలీడు,
తుమ్మెద, నెమలి వంటి జీవుల మీద చక్కని పద్యాలు
రాశారు. ప్రస్తుత గిజిగాడు కావ్య ఖండిక లో 5 అణిముత్యాలు లాంటి
పద్యలున్నాయి.
గిజిగాడు పిచ్చుక వలె
చిన్ని పక్షి. ఈ చిన్న పక్షి తన గూడుని నిర్మించుకునే నైపుణ్యత పలువురిని అబ్బుర పరుస్తుంది. పల్లెటూళ్ళలో, చెరువుల చెంత,
వరిమళ్ళ మధ్య సన్నని చెట్ల కొమ్మలకు మగ పక్షి తేలికపాటి గడ్డిపోచలను, ఈత ఆకులను తెచ్చి వాటిని ఒకదానికొకటి ముడివేసి అల్లుతూ గొప్పగా గూడును నిర్మించి,
తన దివ్య సౌధానికి ఆడ పక్షిని ఆహ్వానిస్తుంది.
అయితే మన కవికోకిల వీటి గురించి రాస్తూ...
చిన్ని బంగారు రంగుల
పూలగుత్తి సొమ్ములు గల తుమ్మకొమ్మలకు నీవు నీ సతీరత్నము ఊయల ఇల్లును తగిలించి వాటిలో
జీవనం చేస్తుంటే... పిల్ల గాలులు ఆ దివ్యసౌధాన్ని ఊపుతూ ఊడిగం చేస్తాయి. వాటి గూడు
గాలికి ఊగుతూ ఉంటుంది.
వర్షం వచ్చినా, తుపాన్లు వచ్చినా ఏమి
కాదు. కేవలం గూడు ఉన్న కొమ్మ విరిగితే తప్ప వాటికి ఏమి కాదు. దీనిని పిల్ల గాలులు ఊడిగం
చేస్తాయి అని చెప్పడం జాషువా కవితా నైపుణ్యతను తెలియజేస్తుంది.
మానవులకు సాధ్యం కాని
చక్కని గదులతో అంతఃపురము నిర్మించుకున్న పక్షిని రాజుతో పోల్చడం జాషువాకే చెల్లుతుంది.
బంగారు వన్నె గల దుస్తులు
ధరించి( మగ పక్షికి పొట్ట మీద పసుపు రంగు ఉంటుంది) బిడ్డలను, భార్యను
పొదివి పట్టుకొని నీవు నీ గృహంలో నిదురిస్తుంటే కన్నెగాలులు గూడును ఊపుతూ ఉంటే నీవు
హాయిగా ఏ భయము లేకుండా సుఖంగా ఉంటావు. అలాంటి జీవనం మానవులకు ఎక్కడ ఉంది. ఏ రాజుకు
కూడా నీ వైభవం లేదే అని చెప్పడంలో కవి నరులు ప్రశాంత జీవనాన్ని పొందలేక అనేకానేక మానసిక
ఒత్తిడులకు గురిఅవుతూ నిత్యం ప్రశాంతతకు దూరమవుతున్నారని తెలియజేస్తాడు.
నీలా అందంగా ఇల్లు కట్టే
వాడు లేడు. నీ వైభవము దేవతలకు కూడా లేదు మొనగాడా అని చెప్పడం గిజిగాడు యొక్క గొప్పతనానికి
అద్దం పడుతుంది.
ఈ భూమి మీద ఉన్న మానవ
కోటికి నీవు చేసే ఇంటి నిర్మాణంలో నీ తెలివి, నీ
అందం ముద్దు గొల్పుతుంది. నీకు భయము వలదు. దేవుడు లేరని వాగే నాస్తికులు కూడా నీ గూటిని
చూసి తలదించుకుని దైవాన్ని మొక్కుతారని చెప్పుటలో కవి గొప్పతనం తెలుస్తుంది. నరుడు
ఎంత గర్వంతో విర్రవీగినా దైవసృష్టికి ప్రణమిల్లవలసినదే.
ముగింపు
గిజిగాడు గురించి జాషువా
గారు 5 పద్యాలు మాత్రమే రాసినా వాటిలోనే ఆ పక్షుల గొప్పతనాన్ని అత్యంత వైభవంగా తెలియజేశారు.
వీటిలో కవిగా ప్రకృతిని ఎంత సునిశితంగా పరిశీలించాలి అనే విషయం పాఠకులకు అవగాహన అవుతుంది.
ఒక విషయము గురించి తెలుసుకునేటప్పుడు ఎంత లోతుగా
అధ్యయనం చేయాలనేది గిజిగాడు ద్వారా కవి మనకు
తెలియజేస్తారు.
జాషువా కావ్య ఖండిక
లను పఠిస్తే నిజజీవితంలో మనిషి స్వార్ధమును వీడి పరోపకార దృష్టితో జీవితంలో ఎదురయ్యే
కష్టనష్టాలను ఆస్వాదిస్తూ ఆనందకర జీవనం పొందగలరనుటలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
- వెంకట్.
గిజిగాడు గురించి జాషువా గారు వ్రాసిన 5 పద్యాలు
1.
జిలుగుం బంగరు
రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ
మ్ములు గీలించిన
తుమ్మకొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ
యెల గీమున్
దగిలించి రే బవలు హాయిం దూగరా గాడ్పు బి
డ్డలు మీ కూడిగ
మాచరింప,
గిజిగాడా నీకు దీర్ఘాయవౌ!
2.
తేలిక గడ్డిపోచలను
దెచ్చి,
రచించెదవీవు తూగుటు
య్యేల గృహంబు,
మానవులకేరికి సాధ్యముగాదు, దానిలో
జాలరు,
లందులో జిలుగు శయ్యలు నంతిపురంబులొప్పగా
మేలు భళీ!
పులుంగుటెకిమీడవురా గిజిగాడ! నీడజా!
3.
కులుకు
పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి
డ్డలను,
బడంతి నీ పొదిగిట న్ని దురింపగ గన్నెగాడ్పు లూ
యెల సదనంబు నూచ,
భయమింత ఎరుంగక కన్నుమూయు నీ
యలఘు సుఖంబు మాకు
గలదా! గిజిగా?యొక రేని కున్నదా?
4.
అందమున నీకు నీడగు
నందగాడు
గృహవినిర్మాణమున
నిన్ను గెలుచు వాడు
వైభవంబున బోలు
దేవతల రేడు
లేడురా
గిజిగా! మొనగాడ వోయి
5.
నీ గిజిగాని నామకము,
నీ తెలివిం బ్రకటించు గూడు, నీ
మై గల సోయగం బవని
మానవ కోటికి ముద్దు సేయు నో
యీ! గిజిగాడ! భీతిలకు!
నీవు ధరా తలి నున్న బిట్టుగా
వాగెడు
నాస్తికుల్తలలు వంతు రనంతుని చెంత ఖిన్నులై
*********
నేడు మీకు పరిచయం చేయాలనుకున్న సాహిత్యం కొడవగంటి
కుటుంబరావు గారి "కులం లేని మనిషి" (నవల కూడా జత చేస్తున్నాను) దయచేసి
పూర్తిగా ఈ వ్యాసం చదవగలరు
కొడవగంటి కుటుంబరావు గారు అనగానే మీలో అందరికీ చదువు నవల గుర్తు రావడం సహజం.
ఇరవయో శతాబ్ది
తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార శ్రీ కొడవటిగంటి కుటుంబరావు
ఎన్నో నవలలు,
కధలు, నాటిక, గల్పిక
వంటి సృజనాత్మక ప్రక్రియలు, శాస్త్రం.. చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం,
రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో
విశ్లేషనాత్మక రచనలు, ఇవి
మాత్రమే కాక
అనువాదాలు, వందలాది.ఆయన నవలల్లో కొన్ని చురుకైన భావాలని మాత్రం మీకు పరిచయం చేస్తాను. తద్వారా ఆయన అందించిన సాహిత్యం సమాజానికి ఏ విదంగా ఉపయోగపడుతుందో ఆయనే చెబుతారు
కొడవగంటి వారి
రచనల్లో ఒక విలక్షణత ఆయన రచనల్లో కనపడే నిత్య నూతన అభ్యుదయ దృక్పథం. కొకు గారి
రచనలు ఆలోచనలను రేకెత్తిస్తాయి. రచయిత సమాజాన్ని కుక్క కాపలా కాయటం కష్టమే అనే
కొకు గారి వాక్యాల వెనుక ఎంతో ఆలోచన ఉంది.
1930, 40
దశాబ్దాల్లో తెలుగు మధ్య తరగతి కుటుంబాలని నిశితంగా పరిశీలించి వాటికి సంబంధించి
ఎన్నో ఇతివృత్తాలను తన కథల్లోకి కొకు తీసుకొన్నాడు. ఉదాహరణకి జాతకాలు – వాటి
ప్రభావాలు, మత పరమైన మూఢ విశ్వాసాలు, పిల్లల్ని
పెంచటంలో పెద్దవాళ్ళ మూర్ఖత్వాలు, సామాజిక స్పృహ లేని
వ్యక్తులు, మధ్య తరగతి మానవ సంబంధాలు, వాటిల్లో
ముఖ్యంగా స్త్రీ – పురుష సంబంధాలు, అందులో దాంపత్యేతర
సంబంధాలు కొకు రచనల్లో వస్తువులు.
సాహిత్యం నుండి
ప్రజల్నీ,
రాజకీయాల నుండి సాహిత్యాన్నీ, ప్రజల నుండి
రాజకీయాలనీ రక్షించే ప్రయత్నాలు చూస్తూంటే నాకు నవ్వొస్తుంది అంటారు. సాహిత్యాన్ని
విస్మరించిన ఏ సంఘం అయినా, నాగరికత నేర్చుకున్న సమాజం అయినా
అభివృద్ధి సాధించలేదు అనేది నిర్వివాదాంశం అని
ఆయన లాగానే నేనూ నమ్ముతాను
నియంతల మీదా,
నిరుద్యోగమ్మీదా, లాకౌట్ల మీదా, యుద్ధాల మీదా గొంతెత్తేందుకు కళాకారులకు హక్కు లేదు.., అది రాజకీయులకే ఉందనడం మూర్ఖత్వం అంటారు ఒక చోట. ఎంత సత్యం అనిపిస్తుంది
ప్రకృతి రహస్యాలను
వివరించలేనిది శాస్త్రం కాదు, అది అత్యుత్తమ
సాహిత్యం కూడా అనిపించుకోదు
జీవితంలోని
కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని
ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు
అలాగే మారుతున్న
కాలానికి అనుగుణంగా సాహిత్యమూ మారాలి … పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి
ఉండడమంటే మోసం చెయ్యడమే
కులం మిథ్య,
మతం మిథ్య, ధనమొకటే నిజం (పేదవాడైన
అగ్రకులస్తుని కంటే డబ్బున్న దళితునికే ఎక్కువ పేరు ఉంటుంది. ఈ వ్యవస్థని ఉద్దేశించి
అన్న వాక్యం)
ఇలా ఆయన అందించిన
ఎన్నో ఆణిముత్యాలు ఈ సంకలనం లో కనిపిస్తాయి.
-
కస్తూరి శివశంకర్
*****
అమందానందాన్ని పంచే
అందరి అనుభూతుల కవనాలను
భావ కవితా సుమాలను
అంతరంగంలోనే ఆస్వాదిస్తూ..
పరవశంతో మైమరచిపోతూ..
మధురానుభూతులను
మదిలోనే పదిలం చేసుకుంటూ..
తీయ తేనియల కవనామృతాన్ని
గ్రోలే తేటినయ్యాను..
మీ అందరి ప్రజ్ఞాశీలతకు,
సహృదయ స్పందనలకు..
చాలా బాగుంది అనే
చిన్నమాటతో సరిపుచ్చలేక..
అర్హమైన ప్రశంసలను
అందించలేకపోతున్నాననే అలజడిలో
మౌన వీక్షకురాలినయ్యాను..
డా. నాగులపల్లి వారి పల్కులతో
మొదలైన శుభోదయం..
మైనేని మురళి గారి సుందర సంచికతో అలంకృతమై..
గురువర్యుల శుభోదయ పద్యంతో శోభించి ..
రమణమూర్తి గారి చిత్రంతో,
సబర్మతి వ్యాసంతో వెల్గులీని..
వెంకట్ గారి గిజిగాడు సమీక్షతో,
పద్య పఠనంతో పరిఢవిల్లి..
అశ్వనీ కుమార్ గారి అలంకారాల వివరణతో
అంచితమై..
గీతా శైలజ గారి ఛందోవివరణతో సుందరమై..
రాఘవేందర్ గారు నేటి తరానికి కల్పించిన
అవగాహనతో అమూల్యమై..
గురువర్యుల, జైకరుల
ముక్తపదగ్రస్తాలతో మోదమ్మును పంచి..
శివశంకర్ గారి కులంలేని మనిషి పరిచయంతో
ఘనతరమై..
మల్లికార్జునరావు గారి రవీంద్రుని కథతో
రమ్యతను గూర్చి...
స్పందన, ప్రతిస్పందనల
సహృదయ సమాహారమై..
కొనసాగిన నేటి కార్యక్రమ హేల..
సాహితీ పరిమళభరితమై,
మనోరంజకంగా కొనసాగింది..
అన్నిటినీ మించి...
అందరికీ విజ్ఞతతో,సాహితీ విభతో, సహృదయతతో, సంయమనంతో..
మధురవాక్కుల కస్తూరి పరిమళాన్ని పంచిన శివ
గారిని మించిన స్పందన మరెవరు అందించగలరు..!!
కొందరందుకే
నాలాగే
మధురానుభూతుల ఆస్వాదకులు..కానీ
మౌనవీక్షకులు..
ఔనంటారా..కాదంటారా..!!
అందరికీ శుభాభినందనలు, ధన్యవాదాలతో...
చల్లా దేవిక.
అమ్మ కష్టాల కధ
సేకరణ : K. రాఘవేందర్
అమ్మకు సాయం చేయండి.
ఆ కాలంలో అంటే మా బామ్మ ,అమ్మమ్మ ,
తాతమ్మ తరంలో మనిషోకో రకం ఐటమ్ వండటం లేదు .
ఒక కూర ,
పప్పు ,
పచ్చడి ,
రసము లేదా పులుసు ( పెరుగు లేదా మజ్జిగ సిద్ధం చేసి ) ఒకేసారి వండేసి ,
దేవతార్చన చేసుకుని ,
వాళ్ళ వరకు విడిగా మడిగా తీసుకుని వంట గదిలో నుండి బయటకు వచ్చేసేవారు .
రాత్రికి అల్పాహారము ఏ ఉప్పు పిండో ,
దిబ్బరొట్టో వేసుకుని తినేసేవారు.
ఎవరైనా రాత్రి భోజనము చేసేవారుంటే ,
వారే వేడిగా ఏ కూర ముక్కో వేయించుకుని ,
పొద్దున తినగా మిగిలిన పదార్ధాలు వేసుకుని వాటితో తినేసేవారు.
మరి ఈ కాలంలో మనిషికో రకం. భర్త తినేది పిల్లలు తినరు. అత్త గారు తినేది భర్త తినడు . పిల్లలు తినేది భర్త ,
అత్తగారు వేలేసి ముట్టుకోరు . వంట చేయడమంటే ఈ రోజుల్లో అంటే మహా యజ్ఞం చేసినట్లే.
ముఖ్యంగా పిల్లలు చాలామంది ఇళ్ళల్లో భోజనము చేయడానికి చాలా పేచీ పెడుతున్నారు .
చచ్చి చెడీ మనిషో కో రకం చేసినా ,
తీరా భోజన సమయానికి పీజాలు ,
పానీ పూరీలు ,
కుర్ కురేలు లాంటి జంక్ ఫుడ్స్ బయట తినేసి ఇంటికి వస్తారు .
అమ్మ భోంచేయ మానగానే ,
నాకాకలిగా లేదు . అన్నం వద్దని మారాం చేస్తారు . ఈ మారానికి ఆడ మగ తేడా అనేదే లేదు .
పిల్లలంటే ఏ పదేళ్ళ లోపు వారంటే మీరు పప్పులో కాలేసినట్లే.
ఇంజనీరింగ్ ,
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ,
డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకునే యువతీ యువకులు కూడా ఇందులో ఏమీ మినహాయింపు కాదు.
వాళ్ళమ్మలకు తిండి దగ్గర ఎంత వరకు నరకం చూపించాలో అంత వరకు చూపిస్తారు .
రాత్రి 11 దాటినా అన్నం తినరు .
వండిన కూరలు అన్నం చూసుకుని తల్లి దిగులుపడి తినమని బ్రతిమలాడితే అమ్మ మీద దయ తలచి "అయితే మాకు ముద్దలు కలిపి పెట్టు. అలా పెడితేనే తింటాం " అని అమ్మకు కండిషన్ పెడతారు.
పగలల్లా గొడ్డులా ఇంటి చాకిరీ సమస్తం చేసి ,
అర్ధరాత్రి డస్సిపోయి నిద్ర కళ్ళతో తూగుతూ అమ్మ ఈ పిల్లలకు ముద్దలు కలిపి నోట్లో పెట్టాలి .
ఈ ముద్దలు కలిపే ప్రహసనం రాత్రే కాదు ఉదయం కూడా . ఒక డిష్ లో కలిపిన అన్నం తీసుకుని , అమ్మ పిల్లల వెనక పిల్లలు స్కూల్ కు ,
కాలేజీ కి బయల్దేరే దాకా వారి వెనకాల పరిగెత్తుతూనే ఉంటుంది .
వాస్తవానికి భోజనము చేయడానికి ఎంత సేపు పడుతుంది ?
చాలా విశ్రాంతిగా తిన్నా 20 నిముషాలు మించి పట్టదు .
రోజు మొత్తములోని 24 గంటలలో 20 నిముషాలు భోజనము చేయడానికి సమయం పిల్లలకు దొరకదా ?
వారు ఆ 20 నిముషాల సమయాన్ని కూడా తమంతట తాము తినడానికి కేటాయించ లేరా ?
సమయం దొరకక పోవడానికి ప్రధాన కారణం , రాత్రి పది లోపు పడుకుని ఉదయం 5 గంటలకు లేవ వలసిన పిల్లలు ,
రాత్రి ఒంటి గంట దాకా T.V.
లో నానా చెత్త ప్రోగ్రాం లు చూసి అప్పుడు పడుకుని ఉదయం 8 గంటలు దాటాక లేచి ,
ఉరుకులు పరుగులు పెడుతూ " టిఫిన్ వద్దు ,
భోజనము వద్దు ,
లంచ్ బాక్స్ వద్దు టైం లేదు "
అని నానా హడావుడి చేసి అమ్మను నానా హైరాన పెట్టేస్తారు .
తర్వాత వీళ్ళకు పెళ్ళిళై ,
ఉద్యోగాలకు పరిగెత్తుతూ, పిల్లల్ని కని అమ్మ నెత్తిన పడేసి , తమ సంతానానికి కూడా చాకిరీ చేసే అయాగా అమ్మను చేసేస్తారు.
మళ్ళీ అమ్మ కష్టాల కధ ప్రారంభం .
అప్పటికే ఆ తల్లులకు 60 దాటి
పోయి వయస్సు పై బడి ,
శరీరంలో ఓపిక నశించి ,
కాళ్ళ నెప్పులు ,
కీళ్ళ నెప్పులు ,
బి .పి . , షుగర్ ,
ఆయాసం ,
నీరసం ,
గుండె దడ వంటి వ్యాధులతో పీడించబడి బాధపడుతూ చాకిరీ చేయలేక, చేయడానికి ఓపిక లేదని ఎవరికీ చెప్పుకోలేక తమ లో తామే నా జీవితం ఇంతేనా ?
ఈ చాకిరీకి అంతం లేదా ?
దేవుడా !! ఏం పాపం చేసాను ?
అని శోకించిన తల్లుల గురించి కూడా నాకు తెలుసు. అలాంటి వారిని నేను ప్రత్యక్షంగా చూసాను. వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళని చాకిరీ చేస్తారు ?
ఈ బాధలు చాలవన్నట్లు , భర్త ఆఫీసు నుంచి లేటుగా విసుగ్గా వచ్చి అడుగుతాడు భార్యను " పిల్లలు భోంచేసారా ?
" అని.
" ఇంకా
తినలేదండీ " అనగానే కారణం దొరికింది కనుక " పిల్లలకు అన్నాలు కూడా పెట్టకుండా ఇంతవరకు నువ్వు వెలగబెడుతున్న రాచకార్యమేమిటి ?"
అని భార్య మీద ఇంతెత్తున ఎగిరి పడతాడు. ఆ సమయానికి ఆ ఇల్లాలు అప్పుడే తీరుబడై ఏ T.V . నో చూస్తూ కూచుని ఉందనుకోండి ,
ఇక ఆయన ఉగ్ర నరసింహావతారం దాలుస్తాడు.
అంటే వేళకి భోజనము చేయని పిల్లల వల్ల మాటలు పడుతోంది మీ అమ్మ గారు. గ్రహించారా ?
మరి దీనికి పరిష్కారం -
తన తల్లి పడుతున్న కష్టాన్ని సంతానమైన అబ్బాయి కాని అమ్మాయి కాని గ్రహించాలి. అర్ధం చేసుకోవాలి.
తల్లికి సాయంచేసే విషయంలో ప్రతి బిడ్డా భాగం పంచుకోవాలి . వంటలో సాయం చేసే మాట దేవునికి ఎరుక. కనీసం మీ తిండి అయినా మీరు తినక పోతే ఎలా ?
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి