రైలు వలే సాగాలి మన జీవితం
రమ్యమైన గమ్యం వైపు
రైలులో ప్రయాణీకుల వలే
రోజూ వచ్చే కష్ణాలన్నీ కలిసిపోవాలి
రైలు పొగ గాలిలో కలిసినట్లు గ
రైలు నుంచి కన్పించే అందాల దృశ్యం లా
రోజులన్నీ ఇవ్వాలి మనకు
రమణీయమయమైన బ్రతుకును.
(వ్యాకరణ పరిధి లోకి రాని వచన కవిత..)
ఆర్.వి.రమణమూర్తి
చంపకమాల
అలిబిలి ఆకృతుల్ మెరిసి అచ్చెరువొందగ మేటిచిత్రమైజిలుగుల భావమే మరి సజీవములై సుమపారవశ్యమై
చెలువములైన భావములు, జీవనయానములీ ప్రయాణముల్
కస్తూరి శివశంకర్
తేటగీతి
ఆహ ! ఘనమైన వర్ణంపు యాకృతులవి
జూచి పరవశించెను రైలు చొక్కములను
పయనమాయెను మనసులు రయముగాను
సొగసు జిత్రాల కమనీయ సొబగు గాంచి
శ్రీదేవి
నల్లని మబ్బులే మెరుపుల హొయలే ఒలకంగా
నీలాకాశం మెరుపుల వెలుగున మునగంగా
కరుణతో వరుణుడు చినుకు గంగ కురవంగా
డబ డబ డబ డబ డబ డబ కురిసిన తొలకరి జల్లుల
పుడమి తల్లి పులకలు వేయంగా
మెచ్చిన మనసున వెచ్చని భావనలు
పురులు విప్పంగా చికు బుకు చికు బుకు మంటూ
వచ్చిన రైలే కూత ఒకటి కూయంగా
పయనపు బాటలు పట్టిన జనులే అటునిటు ఇటునటు
పయనపు పరుగులు పెట్టంగా దేశపు నేతే జన సామాన్యమున
కలిసి మెలిసి నడవంగా మెచ్చిన
మబ్బులే మెరుపులమాలికలల్లంగ
తుంటరి తుంపర జల్లుల పువ్వులే కురిపించేను
అవళూరు సీత
రైలు ప్రయాణం ఎప్పుడూ రమణీయమే.
మనతో పరుగులు తీసే తరువులు
చెరువులు దూరపుకొండలు అన్నీ చూసి
మురిసే ఆ నాటి ఆ పసివయసు నుండి
జీవనయానం లో కలిసిన ప్రతి బంధం
రైలులో సహప్రయాణీకుడిలా
తమ తమ గమ్యం రాగానే దిగేస్తారు
అనే వేదాంత ధోరణిలో ఉన్న నేటివరకు.
చిరుజల్లులలో గజిబిజిగా
తిరుగాడుతున్న ప్రయాణీకుల పాటు
నిరాడంబరతకు నిలువెత్తు సాక్ష్యం లాంటి
దేశాధినేతను కూడా కలిపి చిత్రించిన
మరో బ్రహ్మ లాంటి ఈ చిత్రకారుని
నైపుణ్యం కడు మనోహరం.
రమ
తేటగీతి
నీలి వర్ణమున్ మేఘాలు నింగి నుండ
ధూమ శకటము ధనధన దొనిని జేయ
చికుచికుమనికూత పెడుతూ జేరె రైలు
స్టేషనుకు,తుంపరచినుకు జేర భువికి
మనుజులుతమ నెలవులకు మాయమయ్యె.
సామాన్యుల ప్రయాణ సాధనాలు బస్సులు రైళ్లు,
ఇప్పుడు ప్రయాణమంటే పరుగులెత్తె గుండెల్లో రైళ్లు,
పాత జ్ఞాపకాలు కదలాడే కళ్ళముందు సినిమా రీళ్లు,
ఎప్పుడు, ఎన్నాళ్లకు వస్తాయో ఆరోజులు మళ్ళీ...
( ఛందోబద్ధంకాదు )
గాంగేయ శాస్త్రి
భారత దేశ జీవన గమనం
అనంత పుష్పక రైలు రథం
అచటచట స్టేషన్లలో ఆగుతూ
చివరి మజిలంటు లేక సాగుతూ
యుగాల నాటిది దీని ప్రస్థానం
అడ్డు రాదు దీనికే కాల ప్రవాహం
కలవాడని లేనివాడని తేడా లేదు
మతమని కులమని భేదం లేదు
తనపర జాతివివక్ష అసలే లేదు
అందరి భారం మోస్తూ
కోరిన తీరం చేరుస్తూ
శ్రమించడం దీని నైజం
సమస్యల సుడిగుండాల్లో
మనోమాంద్యం తుఫానుల్లో
ఆత్మాభిమానం కోలుపోయి
దేశ ప్రజలు చిక్కు కుండగా
ఆదైవం మానవ రూపంలో
ఈ రైలు బండి దిగినాడు
సుధీర నాయకుడు మోడీ
చుట్టుముట్టు ఆపదలను
సై అంటూ ఢీ కొట్టినాడు
విజయం సాధించి నాడు
భారతీయుల ఆకాంక్షల
ఊపిరికి జీవం పోసినాడు..
కె మల్లికార్జున రావు
రైలు ప్రయాణము రమణీయ మెప్పుడు,
స్టేషనుకున్ రైలు చేరు చుండ
దిగువారు కొందరై తే నెక్కు వారుకొం
దరెపుడు,ముచ్చట్లు పరిచయాలు,
సరస సంభాషణల్ జరుపు కొనుచు సాగు
రైలు ప్రయాణము రంజు నిడును,
నాదు స్టేషను వచ్చెనని మన యెదుటి మ
ణిషి దిగుచుండగ నీరసముగ
వీడ్కోలు పలుకుచు వేదన పొందెద
రుగ కొంత సమయము, దిగులు నాపి
యెదుట వానిని గాంచి ముదముతో మాటలు
కలపుచు చేతురు చెలిమి తిరిగి
నిదుర లేచి కనగ నెదుట ముదముతోడ
క్రొత్త వాడొక్కడు కూరుచుండు,
దిగిపోయె నెల్లరు దిగులును జూపగ
వారి స్టేషను లందు వాలి పోయె
మనిషి జీ వితమును ఘనమైన రైలు ప్ర
యాణమ్ము సతతమీ యవని లోన
భార్య ,బిడ్డలు, మిత్రులె వరును రారు
చివరి వరకు మనిషివెంట, స్టేషనొచ్చె
ననుచు వెడలు చునుండుగా తనువు విడచి
పూర్తి సత్య మిదియె గాదె పూసపాటి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
ఉత్పలమాల
ఏమది గాంచగా నిచట నెవ్వరు దీసిరి చిత్రమున్ నహో
మామది పొంగెనే దలఁచి మాయగ నివ్విధి మేఘమాలలన్
కోమల మైన నాకశము కొంతయు సేదను దీరకుండగా
మోమున నీటిచుక్కలను మోహము తోడుగ చిల్కరించునా
మేమును నీదు తోడుయని మెచ్చెగ జేరెను మోదియే నిటన్
కందము
వానయు, మేఘము, రైలును
కానగ నే నివ్విధంబు కనులే తరియిం
చేనుగ మోదీ నిచ్చట
తా నడుచుచు తరలగ నిక ధరణకి శుభమౌ!!
కందము
హత్తుకు బోయెడి చిత్రము
చిత్తములో నిలుచునెపుడు చిరునవ్వులతో
క్రొత్తగ నున్నది గాంచగ
నత్తేరీ, కనులకింక నద్భుత భాగ్యం!!
కళ్యాణ్ చక్రవర్తి , ముంబయి
కాలం విచిత్రమైనది
రంగుల కాన్వాయ్ పై దిద్దిన చిత్రమది
ప్రకృతి శోభయమానమై కనువిందైనది
సాగే జీవనంలో మలుపులెన్నో
పుట్టుక మొదలు ప్రయాణం కదులు
చేరాల్సిన తీరాలెన్నో దాటాల్సిన దారులెన్నో
గమ్యం ఆనంతమైనప్పుడు
విరామపు మజిలీలు ఎన్నో
టీ కప్పులో తుఫాను
అనంత విశ్వంలో పెనుమార్పులు
పట్టాలపై ప్రయాణపు జీవన
రూపురేఖల సంధానం
ప్రస్థానం మొదలైంది
ఒంటరి చెట్టు సాక్షిగా
నాటి టీవాలా - నేటి ప్రధాని
ప్రపంచము గుర్తెరిగిన నేత మోడీ
కోవూరి
సీసము
కారుమేఘములు గగనమందు ముమ్మర
ముగ కమ్ముకొని మదిమురియు వేళ
తొలకరి చినుకుల పలకరింత నడుమ
ప్రకృతి పులకరించు పగటివేళ
వర్షము వెలిసినా వదనములందు నం
దన పరవళ్ళు కనబడువేళ
రైలు నిలయమందు రభసముగ జనులు
రైలెక్కుటకు సల్పు రవళినడుమ
తేటగీతి
భరత దేశాధిపతి మోడి పాదచారి
యై, కరమున ఛత్రముబూని యచ్చెరువుగ
రైలునెక్కుటకొచ్చుట రమ్యము గదె!
భరతభూమి విశిష్టత పయనమిదియె!
అత్యంత రమణీయంగా చిత్రముకు సొగసు లద్దిన కళాకారుడికి నమస్సులతో..
తేటగీతి,
అతిమనోహర చిత్రము నద్భుతముగ
జీవముట్టిపడెడి వన్నె చిన్నెలద్ది
మనసుపులకించునటుల సుమధుర భావ
రూపములనద్ది దైవస్వరూప కళను
కరమునందిముడ్చుకొనిన కళల సృష్టి
చేయు ఘన కళాకారుని జిల్గులుకని
వందనంబులర్పింతుమ…
వెంకట్ . సిహెచ్
కరిమబ్బు గగనాన్ని కబళించి కరుగగా
వర్షించ ధర పరవశము నొందె
తరువులు వానకు తడిసి ముద్దగమారి
సేదతీరగ నీరు చిలకరించె
రయమున వచ్చియు రైలుబండాగగా
సంతసా నదిగిరి సంచులంది
దిగెడి ఊరురాక దెసలుజూచు కొందరు
గమ్యంబు కోసమై కాచినారు
మోడి యొకడెయైన జోడీగ యెవరైన
సమము నీకనుచునే సాగురైలు
కలతలన్ మరికొందరు కలలతోను
సాగిపోవుచు నుంటిరి సంతసమున
పయన మెటకైన దనకు పట్టనట్లు
పరుగుతీసె రైలు మనసు బరువుతోను!
ఓలేటి ఉమా సరస్వతి
చిత్రము చూడగ నా మది
చిత్తడి తో పులకరించె
మేఘమాల కమ్మిన నాకశము
గమ్యాలను చేర్చు రమ్యమైన రైలు
తొలకరి వర్షపు చుక్కల చక్కిలిగింతలో
నా
నీలి కనులు కనుగొనె ఓ నిధి
నడయాడే మన అంతర్జాతీయ మోది
వామహస్తమున ఛత్రమును చేబూని
నాటి
టీ వాలా దినము లను తల్వగా
నేటి
ప్రధాని పదవితో నిగర్విగా నడయాడుచూ
అబ్బుర పరిచె చిత్ర లేఖనం చిత్ర వి చిత్రముగా
వి.వి.శ్రీనివాస్
సీసము
చుకుబుకు రైలెక్కి చుట్టివద్దము రారె
నాగిన చోటల్ల నతిధి లెక్కు
కులమత మెరుగక కురిపించు కరుణను
పేద
గొప్పలనిన పేర్మి జూపు
పెళ్లికి,
చావుకు పిల్లపాపలతోడ
గమ్యము జేర్చును కష్టమోర్చి
చిటపట చినుకుల చిత్తడి నేలయె
చిందెను సొబగులు చిత్రమందు
తేటగీతి
సంచి నొకచేత, ఛత్రము చంకనెట్టి
మోడి
నడచివచ్చునటుల ముదము తోడ
చిత్ర రాజంబు నభిమాన చిహ్నమిదియె
కనుల
విందు జేసెడి యిట్టి కళకు జోత
వాణిశ్రీ నైనాల
జీవన
ప్రయాణం చేరుకో లేని
తీరాలకు ఆశల పల్లకి లాంటి రైలు
బండిలో ఎక్కి అనుబంధాల తడిసి పెనవేసుకొన్న
మేను
బంధాలను పట్టుకొని సాగు గమ్యంలో
జీవితం చాలా చిన్నది ఓపిక ఉండగానే
సార్ధకమైన పనులు చేయాలంటూ రొమ్ము విరిచి
పంచభూతలనైనా ఎదిరించి నిలిచే స్ధ్తైర్ధ్యం
తరువులు మోడులైనా వర్షాధారానికి చిగురు కేలు కొమ్మ
సాగిన విధంగా మోడీ జీవన పయనమే అందరికీ ఆదర్శం.
ఒంటరి పయనమే ఓటమెరుగని ధీరుడు
జీవన
గమ్యంనకు సాగు పయనంలో
ఎన్నెన్నో మజిలీలు వర్షం పడుతున్నా
తడిసిన తనువుకు తరువు గొడగై
నిలుచున్నా ఆగని నడక అపర
భగీరథుని వలె సాగు పయనం
బంధాల భాద్యతల చిక్కుకొనక ఒంటరై సాగే పయనం
సర్వమానవ సౌభ్రాతృత్వం సుమ పరిమళాల వెదజల్లుతూ
మోడైనా తాను లేచి చిగురించి తరువు వలే గురువుగా
అందరికీ నీడనిచ్చుటకై వసుధైక కుటుంబ భావనలో
అడుగు కదుపుతూ సాగెను మోడీ బాటసారియై
గీతాశైలజ
తేటగీతి
చుకుబుకుమను వచ్చెడి రైలు చుట్టి జగము
పరవశంబున జనులెల్ల పయన మాయె
పరుగు లెచటికో దెలియక పగలు రేయి
బ్రతుకు బండి సాగరమున భార మాయె
గమ్య
మెరుగని ద్రారులు గడిచి ప్రోవు
చివరి మజిలి నెక్కడ జేర్చు జిక్కు ముడులు
విప్పగ నిజీవుల తరమా వింత గొలుపు
ఎం.పద్మలత
అచ్చెరువు నొందితి చిత్రము చూచి
సుందర మనోహర దృశ్యం కంటికింపుగా తోచి రాసి తిని ఈ కవితను
ఆకశము మేఘావృతము కాగా
కరి
మబ్బులు చిటపట మంటూ వాన జల్లు కురియగా
ధరణి
పులకరించ పుడమి తల్లి సువాసనలు వెదజల్ల
కూ
చుకు చుకు అంటూ రైలుబండి గమ్యానికి చేరగా
జనులు దిగి మట్టి వాసనలను ఆఘృనిస్తూ
వానకు తడుస్తూ బిరబిర మంటూ తరువుల నీడ చేరగా
అతి
సామాన్యుడి వలె దేశాధినేత జననేతగా సంచి చేతబట్టి వడివడిగా కదల
వాన
చినుకులు ముత్యాల జల్లుగా కురవగా రతనాల మెరుపులు మెరవగ
అద్భుతమది యేదియో జరుగునని దేశ మాత తలచే
జనావళి ఎదురుచూసే ఆ శుభ ఘడియకై.
డి. నాగమణి
తేటగీతి
కుంచె జేయు నద్భుతములు గురుత గాంచి
వర్ణభరితమై వెలుగొందు వాసిగాను;
చూడ
చక్కనై గాన్పడ చూపరులకు
చిత్రలేఖనమను కళ చెలగె నిటను!
కందము
పలువురు జనులిత్తరినిట
విలసితముగ నిర్గమించు విధి చిత్తరువున్;
తొలకరి జల్లులె కురియగ
నలరారెడు ప్రకృతి శోభననువుగ దీర్చెన్!
కందము
నిరతము జనాళి గొనిపో
వ
రయమ్మున రైలుబండి వాహకమగుచున్;
పిరిగొని గమ్యంబునకున్
తరుణమునకు జేరుచుంద్రు తగువిధి సుమ్మీ!
కందము
కదిలే దృశ్యములను గాం
చి
దొరకొని ప్రయాణమునట
చేయుదురెపుడున్
కొదువయె లేకను ప్రజలే
యుదిలకొనగ రైలు నందునుల్లాసముగా !
చల్లా దేవిక
నీలి మేఘాలు నీలాకాశంలో పరుగులు పెడుతుంటే.
భువిపైన భగ భగ మని కారుమొబ్బులు కక్కుతూ...
పట్టాలెక్కి పరుగులు వర్షపు చినుకుల చిటపటలతో...
పరుగుపందెం భువికి, నింగికి....
మధ్యలో మనమందరం ఆటబొమ్మలం అంతే...
ఆడించేవాడేవడు... ఆడేది ఇంకెవరు....
బ్రతుకు బండిని లాగాడానికై ఉరుకులు....
ఉరుముతూ... పరుగులు... పట్టాలతో.... ఆగిందంటే గమ్యం...
ఆడేదంత టక టక... టక టక... శబ్దం.
ఉయ్యాల ఊపుతూ నీ ప్రయాణం సుగమం....
మధ్య
మజిలీ అంతా నాటకం...
కాసేపయినా కొత్తపలకరింపుల కోలాహలం....
రైలులో ప్రయాణం......
సూర్య తాడిపూడి
చుక్
చుక్ మనుచు పరిగెత్తె రైలు పట్టాలపై
కదలుచుండె నల్లని మబ్బులు కప్పు చుండె
నీలి
ఆకాశాన్ని
హయి
గొలుపుచుండె .మేనును తాకుచుండగ
చల్లని గాలులు వింజామరులై విసురుచుండ
పచ్చని చెట్లు పచ్చిక బైళ్ళు పంట పొలాలు
పిల్ల కాలువలలోని కమలపువ్వులు
సుందర దృశ్యాలు కన్నులకు కనువిందు సేయగ
కిటికీ దగ్గర కూర్చుని అమ్మ తెచ్చిన పులిహొర లాగిస్తు,చందమామ చేతబట్టి
మధురానుభూతిని మరొక్కసిరి పొందాలని
మరొక్కసారి రైలు లో ప్రయాణించాలని ఉంది!
డా. లలితా దీక్షిత్
సమాప్తం
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి