25, ఆగస్టు 2020, మంగళవారం

23.08.2020, ఆదివారం ప్రత్యేకం - సాహితీ ప్రశ్నావళి అంశం : ప్రబంధ తెలుగు సాహిత్యం

1.      మన తెలుగు కావ్యాలలో శృంగారప్రబంధము అని ఏ కావ్యం పిలువబడుతుంది ? రచించిన కవి ఎవరు ?

జవాబు

తెలుగు కావ్యాల్లో శృంగార ప్రబంధంగా పిలువబడే కావ్యం వసుచరిత్ర. వేదవ్యాసుని భారతమూనన్నయగారి భారతంలోని 45 పద్యాల ఆధారంగా చేసుకుని అందించిన తొలి పూర్తి శృంగార ప్రబంధం వసుచరిత్ర. 

మిత్రులు కొంత మంది తొలి తెలుగు శృంగార ప్రబంధం అన్న ప్రశ్నకు మనుచరిత్ర అని వ్రాశారు . మను చరిత్ర తోలి తెలుగు ప్రబంధ కావ్యం కా ఖ్యాతి చెందింది. కానీ పూర్తిగా శృంగార ప్రబంధం గా పిలవబడిన కావ్యం వసు చరిత్ర (కందుకూరి వారి ఆంధ్రుల కవుల చరిత్ర, మల్లపల్లి వారి అధ్యయనం ఆధారం)     

మీలో చాలా మందికి తెలిసినట్లు ఈ కావ్య రచన చేసిన  రామరాజ భూషణుడు    

వసు చరిత్ర  మహాభారతంలో భారతములోని ఉపరిచర వసువు కథ, ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామ రాజ భూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంథంగా మలిచారు,  

ఉపరిచర వసువు, మహా తపస్సు చేస్తాడు, ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పుడూ తన లోకానికి రమ్మన మంటాడు, దీనికి ప్రతిగా ఉపరిచర వసువు తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడూ, అధిష్ఠాన పురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. కోలాహలుడు అనే పర్వతము, శుక్తిమతి అనే నది ప్రేమలో పడతారు. కోలహలునికి, శుక్తి మతికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. కూతురి పేరు గిరిక, కొడుకు వసుపదుడు. గిరికను వసు మహారాజు చూసి తనను గాంధర్వ విధిన వివాహం చేసుకుంటాడు. వసుపదుని సేనాధిపతిగా నియమిస్తాడు. ఇదీ కావ్యం వృత్తాంతం.

శృంగార శాకుంతలం కొంత వరకూ సరైన జవాబు, కానీ శ్రీనాధ శృంగార నైషధం సరైన జావాబు కాదు. సహజంగా ప్రతి ప్రబంధంలో శృంగార వర్ణనలు ఉంటాయి    

అద్భుతమైన పద బంధంతో ఉన్న రచనను ప్రబంధం అంటారు. పురాణేతిహాసాల నుంచి ఒక చిన్న కథను గ్రహించి, కవుల కల్పనలతో స్వతంత్ర కావ్యం అన్నట్లుగా భాషింపజేయడాన్ని ప్రబంధం అంటారు. అష్టాదశ వర్ణనలున్న కావ్యాన్ని ప్రబంధం అంటారు. దీన్నే మహాకావ్యం అని కూడా పిలుస్తారు.

 

2️.  నీతిశాస్త్రముక్తావళి కావ్యం అందించిన ప్రఖ్యాత కవి ఎవరు ? ఆయన వ్రాసిన శతకం తెలుపగలరు ?

జవాబు

 మనందరికీ సుపరిచయమై, చిరకాలంగా మన నాల్కల మీద  నానుచూ మన  అంతశ్చేతనలో భాగంగా కరిగిపొయిన సుమతీ శతకము పద్యాలతో పాటు,

సరసమూ, సరళమూ, సామాన్యులకు సైతం సూటిగా, సులభంగా అర్థమయ్యే శైలిలో రాసిన గొప్ప పద్యకారుడు బద్దెన. బద్దెన కాకతీయులకు సామంత రాజు కూడా  

వీరు రచించిన 162 పద్యాలు గల మరో అత్యుద్భుతమైన లఘుకృతి నీతిశాస్త్ర ముక్తావళి

 

3️.  చిన్నారిపొన్నారి చిరుతకూకటినాడు రచయించితి మరుత్తరాట్చరిత్ర అన్న కవి ఎవరు ? ఈ పద్యం ఈ కావ్యంలో కనిపిస్తుంది ? (302)

జవాబు

ఈ పద్య రచన చేసిన వారు శ్రీనాధుడు. కాశీఖండం అవతారికలో కనిపిస్తుంది. ఇదే పద్యం భీమ ఖండం అవతారిక ఇప్పుడు ఎమెస్కో వాళ్ళు అందిస్తున్నారు.   

 చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు

                   రచియించితిమరుత్తరాట్చరిత్ర.

నూనుగు మీసాల నూత్న యౌవనమున

                    శాలివాహన సప్తశతి నుడివితి.

సంతరించితి నిండు జవ్వనంబునయందు

                    హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ

బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని

                     యాడితి భీమనాయకుని మహిమ

ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ

గాశికాఖండ మను మహాగ్రంథ మేను

తెనుఁగు జేసెదఁ గర్ణాటదేశ కటక

పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని.

 

4️.  పద్మసంభవ వైకుంఠ భర్గసభలు సాముగరిడీలు మాకు" .. అన్న ప్రఖ్యాతమైన పద్యం ఎవరు ఎవరితో చెప్పే గొప్పగా చెప్పే పద్యం ? కవి తెలుపగలరు

 జవాబు

 అల్లసాని వారి మనుచరిత్ర లోని అందమైన పద్యం ఇది.

మీలో చాలా మంది చెప్పినట్లు ప్రవరాఖ్యుడు తనని విస్మరిస్తున్నడని అర్థమయి తట్టుకోలేక తానెవరో, ఎక్కడి నుండీ వచ్చినదో చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది వరూధిని తానో గంధర్వ కాంతననీ, అత్యద్భుతమైన అప్సరస అని చెప్పుకునే ప్రయత్నం.  

పెద్దనగారి ప్రౌఢిమ ఏ పాటిదో తెలిపే వందలాది పద్యాల్లో ఇదొకటి 

వెన్నెలకందు అంటే చంద్రుడు, చిన్నివెన్నెలకందు అంటే జాబిలి అన్నమాట, పెద్దన చిలిపి ప్రయోగం.చంద్రుడి వెన్ను తన్ని, అంటే చంద్రుడిని వెన్నంటి పాలసముద్రంలో జన్మించిన శ్రీలక్ష్మి మాకు తోబుట్టువు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ముందు హాలాహలం, తర్వాత వరుసగా కామధేనువు, ఉఛ్ఛైశ్రవము,ఐరావతము, కల్పవృక్షము, అప్సరలు, చంద్రుడు, శ్రీమహాలక్ష్మి జన్మించారు. 

తనను తను గొప్పగా పరిచయంచేసుకోవాలి ముందు,

కనుక శ్రీమహాలక్ష్మి నాకు తోబుట్టువు, మేము సామాన్య అప్సరాకాంతలం కాము, అని చెప్పుకోవడం, ఇంత గొప్పదాన్ని నిన్నుకోరాను, దరిచేరాను నన్నేలుకో అని అడగడం అద్భుతమైన భావం

 

 5️.  సంపెగపూవుని ముక్కుతో పోల్చిన మొట్టమొదటి కవి ఎవరు ? ఆ పద్యం ఏమిటో ఒక పాదం  తెలుపగలరు ?  

జవాబు

సాధారణంగా ఈ ప్రశ్న వేయగానే చాలా మందికి పారిజాతాపహరణం వ్రాసిన ముక్కు తిమ్మన గారు, "నానా సూన వితాన" అన్న పద్యం వ్రాసిన రామరాజ భూషణుడు గుర్తుకు వస్తారు.

 కానీ వీరందరికన్నా ముందుగా ఈ అద్భుతమైన ప్రయోగం చేసినవారు నన్నచోడుడు 

ముక్కును సంపెంగతో పోల్చటం వీరందరి కన్నా శతాబ్దాలకు ముందే నన్నెచోడుడు చేసాడు కుమారసంభవంలో

సరైన జవాబు అందించిన @venkatcjmm వెంకట్ గారికి ప్రత్యేకమైన అభినందనలు.

కుమారసంభవంలోని నన్నెచోడుని  పద్యం

చంపకమాల

జలజము సావి కోకములు షట్పదముల్ పఱతెంచి తద్దయున్

నలి వినుతాస్యమండలము నాసికయున్ శశిబింబ చంపకం

బులు సవి డాయనొల్ల కతి మోహమునం బెడఁబాయనోప కా

కులమతి నున్న భంగిఁ గుచకుంతలవక్త్రము లొప్పు గౌరికిన్

భావము 

పార్వతీదేవి ముఖాన్ని చూచి పద్మం అని భ్రమించి చక్రవాకపక్షులూ తుమ్మెదలూ దగ్గరకు వస్తున్నాయట.  దగ్గరకు రాగానే వాటికి అమ్మ ముఖకాంతి వెన్నెలలాగానూ అమ్మ నాసిక చంపకపుష్పం లాగానూ కనిపించిందట, సరిసరి ఈ చక్రవాకాలకు వెన్నెల నచ్చదు. ఆ తుమ్మెదలకు సంపంగి అంటే కిట్టదు. పద్మమని చేరాలో మానాలో తేల్చుకోలేక గడబిడ పడుతున్నాయట అవి.  

అమ్మవారిని నవచంపకపుష్పాభ నాసాదండవిరాజితా అంటారు కదా


 6️.  దేశ భాషలందు తెలుగు లెస్స అన్న మొదటి కవి ఎవరు ? ఈ పద్యం ఈ కావ్యంలో కనిపిస్తుంది ?

జవాబు

 ఈ పద్యం మొట్టమొదటి సారి పద్నాల్గవ శతాబ్దంలో రచించిన క్రీడాభిరామం లో కనిపిస్తుంది. ఆముక్తమాల్యద లోని పద్యం కన్నా సుమారు వంద సంవత్సరాల పాత పద్యం.ఈ కావ్య రచనలో శ్రీనాధుడు లేక కేతన కూడా వినుకొండ వల్లభరాయుడు కి సహాయం చేశారని  చెబుతారు      

జనని సంస్కృతంబు సకల భాషలకును

దేశ భాషలందు తెలుగు లెస్స,

జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద

మెచ్చుటాడుబిడ్డ మేలు గాదె?

 

7️.  రాజయోగసారము అను ద్విపద కావ్యం రచించిన వారు ఎవరు

జవాబు

ఈ కావ్య రచన చేసినవారు  తరిగొండ వెంగమాంబ

 

8️.  నీలాసుందరి పరిణయము ప్రౌఢకావ్యం రచించిన కవి ఎవరు ? ఈ కావ్యం ఇతివృత్తం తెలుపగలరు ?

 జవాబు

నీలాసుందరి పరిణయము కావ్యాన్ని తెలుగు జాతికి అందించిన వారు కూచిమంచి తిమ్మకవి

ఈ కావ్యం నిండా అచ్చమైన జాను తెలుగు పద సొగసులు, వర్ణనలుతో మనోహరమైన పద బంధంలో ఏ పద్యం చూసినా కనిపిస్తుంది సంస్కృత సమాసాలనూ, పదాలనూ అచ్చ తెలుగులో సుందరంగా ఒదిగించి, పద్యాల్లో అనుప్రాసవిన్యాసాలతో, చాతుర్మాత్రా  గణాలతో, అచ్చ తెలుగు సీస పద్యాలతో  అందమైన, అద్భుతమైన, ఆహ్లాదకరమైన వర్ణనలు చేస్తారు కావ్యం నిండా. 

ఇతర ప్రబంధాల్లోలాగే నీలాసుందరీ పరిణయము లో కూడా వర్ణనలూ, నాయికా నాయకుల శృంగార, విరహ, ఉపాలంభనలూ కోకొల్లలుగా కనిపిస్తాయి  .  

శ్రీకృషుడి అష్టభార్యల్లో ఆయన  మేనమామ కూతురైన నీలాదేవి ఒకరు .. 

శ్రీకృష్ణుడు నీలాసుందరిని ఎలా పెళ్లి చేసుకున్నాడనేది కావ్యం ఇతివృత్తం  .

 

9️.  విజయవిలాసము అను ప్రబంధ కావ్య రచన ఎవరిది  ? కావ్యంలో ముఖ్యమైన నాయిక / లు ఎవరు ?   

జవాబు

 విజయవిలాసం కావ్యాన్ని చేమకూర వెంకటకవి రచించారు.   

విజయుడు అంటే అర్జనుడు అని తెలిసిన విషయమే. అందువలన ఈ కావ్యంలో నాయకుడు అర్జునుడు. అర్జునుడి విజయగాధను తెలిపే కావ్యం కనుక విజయవిలాసం అయినది. ఈ  కావ్యంలో కావ్యనాయికలుఉలూచిచిత్రాంగదసుభద్రలు గా కనిపిస్తారు.

 

1️0. విష్ణుచిత్తీయం అని తెలుగు కావ్యాల్లో ప్రఖ్యాతి గాంచిన రచన ఏది ? ఈ కావ్యాన్ని రచించిన కవి ఎవరు ?

జవాబు

 ఆముక్తమాల్యద కావ్యానికి మరో పేరు విష్ణుచిత్తీయం, శ్రీకృష్ణదేవరాయలు విరచితం.   

ఆముక్తమాల్యద ఏడు ఆశ్వాసాల ప్రబంధం. తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలులో ఒకటిగా ప్రసిద్ధిచెందిన కావ్యం

****** 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...