14, ఆగస్టు 2020, శుక్రవారం

11.07.2020 ప్రశ్నల ప్రహేళిక

 

తెలుగు సాహిత్యం - ప్రశ్నల ప్రహేళిక  

క్రమసంఖ్య తో పాటు మీ సమాధానములు తెలియచేయగలరు  (దయచేసి మీకు తెలిసిన అన్ని సమాధానములు ఒకేసారి పంపగలరు)  మిత్రులకు సాహితీ అభినివేశం,  విస్తృతిఉత్సాహం ద్విగుణీకృతం చేయుటకు మాత్రమే ఈ చిన్న ప్రయత్నం.  

తెలుగు తేనియలు వేదికలో నేడు అందించిన ప్రశ్నలకు సరైన సమాధానములు పంచుతున్నాము 

 

1.      కవిరాజ మనోరంజనము రచన ఎవరిది. కావ్యంలో నాయకుడు ఎవరు ?  

.           కవిరాజ మనోరంజనము అను ప్రబంధ కావ్యాన్ని రచించినవారు కనుపర్తి అబ్బయామాత్యుడు. ఈ కావ్యం ఇతివృత్తం ఊర్వశీపురూరవుల చరిత్ర మాత్రమే కాకనారద మహర్షి పురూరవునికి చేసిన రాజనీతివేదాంత సారము సమాజానికి తెలియచేయడం ముఖోద్దేశం.   

 

2.      కందుకూరి వీరేశలింగం గారు రచించిన ప్రబంధ కావ్యం తెలుపగలరు ?

.           కందుకూరి వీరేశలింగం పంతులు గారు అందించిన  హాస్య ప్రబంధం అభాగ్యోపాఖ్యానము. ప్రబంధ కవుల కీర్తినివారి శైలిని వర్ణిస్తూ ఆధునిక సమాజానికి పరిచయం చేసిన పద్య కావ్యం. మనుచరిత్రవసుచరిత్రవిజయవిలాసం తదితర ప్రబంధాల్లోని పద్యాల పోలికలు కూడా జోడించడం విశేషం 

అంతకన్నా ముందు కందుకూరి వారు (1870 లో) రచించిన రసికజన రంజనం ఆయనకూ సైతం నచ్చలేదని ఆయనే చెబుతారు. అందువలన అభాగ్యోపాఖ్యానము ఎక్కువ ఖ్యాతి గాంచిన కావ్యం.

 

3.      కోయకుమీ సొరకాయలు ..  వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్‌ అని వ్యావహారిక పదాలతో కంద పద్యం ఎవరు వ్రాశారు?

ఏ ప్రఖ్యాత పద్యానికి పేరడీ (వ్యంగ్యానుకరణం) గా ఈ పద్యం వ్రాశారు ?

.           శ్రీశ్రీ గారి సిప్రాలి లోని పద్యం ఇది. సుమతీ శతకం లోని పద్యాలకు చేసిన పేరడీ (వ్యంగ్యం) కనిపిస్తుంది ఈ పద్యంలో   

 

కోయకుమీ సొరకాయలు 

వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్‌ 

డాయకుమీ అరవఫిలిం 

చేయకుమీ చేబదుళ్లు సిరిసిరిమువ్వా  

 

ఇది బద్దెన కవి పద్యము

 ఏరకుమీ కసుగాయలు 

దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ 

పారకుమీ రణమందున

మీరకు మీగురువు లాజ్ఞ మేదిని సుమతీ  

 

తాత్పర్యము: భూమిపై... పచ్చికాయలు ఏరి తినకు. చుట్టాలను ఎప్పుడూ దూషించకు. యుద్ధం నుంచి వెనుతిరిగి పారిపోకు. పెద్దల ఆజ్ఞలను జవదాటకు సుమా!

 

4.      రక్షోనాయకులారా ! నిర్జరవర వ్రాతంబు చేతన్ సుధా భిక్షా పాత్రము పోయె అన్న ప్రఖ్యాత కవి ఎవరు ?  

 

.             శ్రీనాధకవి భీమ ఖండం లో చెప్పిన పఖ్యాతమైన పద్యం ఇది..

శార్దూలం లో పద్యం.

రక్షోనాయకులార ! నిర్జరవర వ్రాతంబుచేతన్ సుధా

భిక్షాపాత్రము పోయె నంచు మదిలో బెగ్గిల్లఁగా నేటికిన్ ?

రక్షార్థంబు భజింప రాదె యభవుంద్రైలోక్య కుక్షింభరున్

దాక్షారామపురాధినాధుని సుధాధామార్థచూడామణిన్ !

5.      కూచిమంచి తిమ్మకవి అందించిన రెండు ప్రఖ్యాత కావ్యములు తెలుపగలరు ?

.           నీలాసుందరీ పరిణయము 

రసికజన మనోభిరామము 

శివలీలా విలాసము 

సర్వలక్షణసార సంగ్రహము 

మొదలైన కావ్యాలు ఆయన ప్రఖ్యాత రచనలు. ఇప్పడు లభిస్తున్న కావ్యాలు మొత్తం 15 కావ్యాలు.

 

6.      ఉత్తరహరిశ్చంద్రోపాఖ్యానము  అందించిన కవి ఎవరు ?

.           ఈ కావ్య రచయిత తక్కెళ్ళపాటి లింగనామాత్యడు (తక్కెళ్ళపాటి లింగ కవి) 

 

7.      కవిరాజమనోరంజనము ఎవరి రచన కావ్యం ఇతివృత్తం ఏమిటి ?

.    క్షమించాలి.. ఈ ప్రశ్న రెండవ సారి వచ్చింది  (1 వ ప్రశ్న సమాధానమే ఈ ప్రశ్నకు సైతం)

కవిరాజ మనోరంజనము అను ప్రబంధ కావ్యాన్ని రచించినవారు కనుపర్తి అబ్బయామాత్యుడు. 

ఈ కావ్యం ఇతివృత్తం ఊర్వశీపురూరవుల చరిత్ర మాత్రమే కాకనారద మహర్షి పురూరవునికి చేసిన రాజనీతివేదాంత సారము సమాజానికి తెలియచేయడం ముఖోద్దేశం.

 

8.      కాళహస్తి మహత్యం రచించిన ప్రఖ్యాత ప్రబంధ కవి ఎవరు ?

.           మహాకవి ధూర్జటి 

9.      జేబుదొంగలు నవల రచించిన ప్రఖ్యాత కవి ఎవరు ?

.    కవిసామ్రాట్ విశ్వనాధ వారి మనోవైజ్ఞానిక శాస్త్రపాండిత్యానికి దర్పణం "జేబుదొంగలు" నవల.

ఆ మహా కవి వ్రాసిన 57 నవలలు, 38 పద్య కావ్యాలలో అన్నీ అద్భుత రచనలే. ఇవి కాక ఎన్నో నాటకాలుసాహితీ విశ్లేషణలువిమర్శలు చేసిన మహా కవి శ్రీ విశ్వనాధ సత్యనారాయణ.

 

10.  చౌడేశ్వరీ విలాసము  అందించిన మహా కవి ఎవరో తెలియచేయగలరు

.    ఈ కావ్యానికి మరొక పేరు (చాముండికా విలాసము). ఇది "ఆదికవి నన్నయ"  వ్రాసిన 125 పద్యములు కలిగిన చిన్న కావ్యం..

ఈ విషయాన్నే ఇది శ్రీసకల భాషావాగను శాసన శ్రీ నన్నయభట్ట విరచితంబైన అని కందుకూరి వారు ఆంధ్రకవుల చరిత్ర లో కూడా తెలియచేస్తారు.

 

11.  జైమిని భారతము మూల గ్రంధం ఎవరి రచన. ఈ కావ్యాన్ని తెనుగించిన కవి ఎవరు ?   

.    జైమిని భారతం వ్యాసుని శిష్యుడైన జైమిని మహర్షి చేత రచించబడింది. కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం గురించి అశ్వం దేశం నలుమూల తిరుగునప్పుడు అర్జునుడుశ్రీకృష్ణుడు ఏవిధంగా అశ్వాన్ని రక్షించి అశ్వమేధ యాగం సమాప్తి చేయించిన విశేషాలు ఈ కావ్యములో పొందుపరచబడ్డాయి. 

జైమిని మహర్షి జనమేజయునికి చెప్పిన విషయం ఈ కావ్యం ఇతివృత్తం. 

వ్యాస మహాభారతంలో కనిపించని ఉపాఖ్యానాలు - కుశలవోపాఖ్యానంచంద్రహాస చరిత్రప్రమీలార్జునీయంఉద్దాలకుని చరిత్ర వంటివి జైమిని భారతంలో కనిపిస్తాయి.   

ఈ కావ్యాన్ని 8 ఆశ్వాసాల ప్రభందంగా తెలుగుగించినది "పిల్లలమఱ్ఱి పిన వీరభద్రుడు".

12.   భీమేశ్వర పురాణం రచించిన కవి ఎవరు. ఈ కావ్యం ఇతివృత్తం ఏమిటి ?

.           భీమేశ్వర పురాణం కావ్యం శ్రీనాధ మహాకవి విరచితం.

కవి సార్వభౌముడు ద్రాక్షారామం లోని 26 అడుగుల ఎత్తు ఉన్న భీమేశ్వరుడి క్షేత్ర మహత్యాన్ని తెలియచేస్తూ వ్రాసిన కావ్యం భీమేశ్వర పురాణం / భీమ ఖండం.

శ్రీనాధ కవిసార్వభౌముని పద్య కావ్యాల్లో అత్యంత అద్భుతమైన కావ్యాలలో భీమఖండం మొదటి వరుసలో ఉంటుంది.

 

13.    అనంతం రచన ఎవరిది. ఈ రచన ఇతివృత్తం తెలుపగలరు ?

.    మహాకవి శ్రీశ్రీ గారి ఆత్మకథ అనంతం. శ్రీశ్రీ కవిత్వంతో చేతన పొందిన ప్రతి ఒక్కరూ చదవవలసిన రచన.

ఆయన ఒక మహాకవి కావడానికి ఎందరి కవిత్వం అధ్యయనం చేయవలసి వచ్చిందో క్షుణ్ణంగా చెబుతారు.. 

 

ఇది శ్రీశ్రీ ఆత్మకథ మాత్రమే కాదు. తెలుగు సాహిత్య ప్రపంచం చరిత్ర. తిక్కన సోమయాజి నుండి విశ్వనాథ వరకు ఆయన పై ఎలా ప్రభావం చూపారోఆయన సమకాలీకులు అయిన రావిశాస్త్రితాపీ ధర్మారావుచెళ్ళపిళ్ళఆరుద్రనారాయణబాబువిరసం సభ్యులు- ఇలా ఎన్నో పేర్లూవీరందరితో శ్రీశ్రీ జీవితంతో ఉన్న సంబంధం చదువుతూఈ రచన కేవలం ఆత్మకథ మాత్రమే కాదుతెలుగు భాష సాహితీ వైభవం గుర్తు చేస్తుంది.

 

14.    విజయవిలాసము ఎవరి రచన. ఈ కావ్యములో ప్రఖ్యాత నాయకుడు ఎవరు ?

.           విజయవిలాసం కావ్యాన్ని చేమకూర వెంకటకవి రచించారు.   

విజయుడు అంటే అర్జనుడు అని తెలిసిన విషయమే. అందువలన ఈ కావ్యంలో నాయకుడు అర్జునుడు. అర్జునుడి విజయగాధను తెలిపే కావ్యం కనుక విజయవిలాసం అయినది.

ఈ కావ్యంలో కావ్యనాయికలుఉలూచిచిత్రాంగదసుభద్రలు గా కనిపిస్తారు.

 

15.    దానము జేయగోరిన వదాన్యు కీయగ శక్తి లేనిచోనైన పరోపకారమునకై యొక దిక్కున అనే ప్రఖ్యాత  పద్యం ఏ శతకం లోనిది ?

.           మారద వెంకయ్య కవి  రచించిన భాస్కరశతకం లోని పద్యం ఇది  

దానము జేయగోరిన వదాన్యునకీయగ శక్తి లేనిచో

నైన పరోపకారమునకై యొక దిక్కున తెచ్చి యైననీ

బూనును మేఘడంబుధికి పోయి జలంబుల తెచ్చి రుూయడే

వాన సమస్త జీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా!  

 

పూర్తి భావం .. వ్యాఖ్య

మేఘం సముద్రపు నీరు సేకరించి లోకానికి వర్షం కురిపించినట్లుగా తమ వద్ద లేకున్నా మంచి మనసున్న వారు ఎక్కడినుండైనా సంపాదించి మరీ దానం చేస్తారుపాత్రుడైన వ్యక్తి వద్దకు వెళ్లి ఇచ్చే దానం ఉత్తమం. యోగ్యుని తన వద్దకు రప్పించుకుని ఇచ్చే దానం మధ్యమం. యాచకునికి ఇచ్చే దానం అధమం. సేవకు ప్రతిఫలంగా ఇచ్చేదానం నిష్ప్రయోజనం. ఇంకా చెప్పాలంటే మన దగ్గర మిగిలిన వస్తువును దానం చేయడం అధమం అని తెలియచేసే అద్భుత సారాంశం.

మనకోసం దాచుకోకుండా సర్వస్వాన్ని దానం జేయడం మధ్యమం. మన దగ్గర లేకపోయినా సంపాదించి మరీ దానం చేయడం ఉత్తమం. అలాంటి గొప్పవారు మేఘముల వంటివారు అని తెలియచేయడం ముఖ్యోద్దేశం.

*****

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...