కావ్యఖండిక : ఇంటిగుట్టు
కవి: గుఱ్ఱం జాషువా గారు
కవి పరిచయము
కవి గురించి ప్రత్యేక పరిచయ మవసరము లేదని నా భావన. నవయుగకవి చక్రవర్తి శ్రీ గుఱ్ఱం జాషువా గారు తెలుగు సాహితీ వనమునందు నికాసైన అక్షర బీజాలు నాటి, సుక్షేత్రము నుండి పండించిన మన్నికైన ధాన్యపు గింజల వలె దిటవు గల కావ్య ఖండికల నెన్నో సాహితీ ప్రియుల కందించారు.
కావ్య నేపథ్యం/ ఇతివృత్తము
సమాజంలో నున్న రెండు సామాజిక వర్గాల మధ్య నుండెడి స్పర్థల నాధారము చేసుకొని వాడైన వ్యంగ్యాస్త్రాలు సంధించి ఐక్యతావశ్యకతను తెలియపరచెడి ఇతివృత్తము ను తీసుకొని జాషువా గారు ఈ ఇంటిగుట్టు కావ్య ఖండిక ను రచించారు.
పామరులకు, పండితులకు ఒకే అస్త్రాన్ని సంధించగల నేర్పరిగా పేరొందిన కవి జాషువా గారు అనుటకు ఈ ఇంటి గుట్టు ఖండిక సాక్షీభూతంగా నిలుస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం.
📓📔📕📗📘📙📚
ఇంటి గుట్టు కావ్య పరిచయము
*******
ఈ ఖండికలో (1 తేటగీతి+ 9 ఆటవెలది) 10 పద్యాలున్నవి.
ఇక కావ్యంలో విషయం గురించి పరికిస్తే.....
పంచములమైన మాదిగవడినైన నేను మాలవడతడు, ఉభయములము క్రైస్తవ మతము నందు ఒదిగినా, మాకు సోదర భావము గిట్టదు అనే వాడైన వ్యంగ్యాస్త్రాలతో ఖండిక మొదలవుతుంది.
జాషువా గారి కలము కున్న పదును ముందు ఎవరైనా తల దించవలసినదే.
మాట వరుసకొక మతమే, ఒక దేవుడే, ఒక దేశమే అందుము కానీ మాకు దేవాలయాలు, తెగలు రెండు; సమస్య వద్ద కుమ్ముకుంటాము. మాకు సంధి చేయు మాట ఎత్తని మతము నేమి మేము మానము. వాడు వీడు అని ఇతరు లెవరన్న మాకు పట్టింపు లేదు. మాల యేసు మాదిగలకు కాడు, మాదిగేసు మాకు కాడు. ఒకడు జలము చిలకరించు, ఒకడు స్నానమాచరించు. ఇర్వురు ఏకమగుట కేది దారి.
వాని గుడిసె మీద వాలిన కాకి నా గుడిసె మీద వాలకూడదు. మా మధ్య ఉన్న విరోధాన్ని మాలకాకి, మాదిగ కాకి యని రుజువు చేస్తోంది. ఇంట నుండే మురికిని చూడకుండా హిందువులను చూచి ఎగతాళి చేస్తాము. ఇతరులు చేసే తప్పు లోర్చుకొలేము. సొంత తప్పులు మాకు పట్టవు. మతములో నొకింత మాట కుదురును కానీ మాకు పొత్తు కుదరదు. హెచ్చు తగ్గుల కోసం సిగ్గువిడిచి తన్నుకొనుటలో మాకు తప్పు లేదు.. ఇంత విశ్లేషణాత్మకంగా రెండు సామాజిక వర్గాల మధ్య ఉన్న స్పర్థలను ఎత్తి చూపు జాషువా కలము నిజముగా విక్రమార్కుని చేతిలో నున్న ఖడ్గమే.
చదువుల వల్ల పగలు సర్దుబాటగునని సీమ దొరలు చదువు చెపితే కచేరీల కెక్కి గబ్బు గబ్బైనాము. చదువు కంటే జాతి ముఖ్యము మాకు.
అంటరానితనం బురదలో బొరలాడు పేదవారమైన మమ్ము మా కులాల గొడవ మాకుంచి, మీలో కలుపుకోండి సుగుణులారా.
మమ్ము చూసి మాట పొందిక, నడక చూసి ఎవరు గొప్ప ఎవరు తగ్గువో తెలుపండి పండితులారా అని జాషువా గారు కావ్యాన్ని ముగిస్తారు.
ముగింపు
*****
కవి కలము నుండి జాలువారిన కావ్యము సమాజోపయోగమై, తత్కవన ప్రయోజనము సమాజ మార్పుకు నాంది కావాలనే అమిత గుణశ్రేష్ఠుల పలుకుల కద్దము పట్టే రచన ఈ ఇంటిగుట్టు.
సమాజంలో నున్న సమస్యల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించి తప్పులను తన పదునైన కవన ఖడ్గము తో తునా తునకలు చేసి నవసమాజ నిర్మాణానికి ఆచరణ సూత్రాన్ని చెప్పడంలో కవిదిగ్గజుడైన జాషువా అందె వేసిన చెయ్యి.
ఇంటిగుట్టు ఖండికలో ఇరు సామాజిక వర్గాల మధ్య నుండెడి స్పర్థలను ఎంత చక్కగా తనకే సాధ్యమైన వ్యంగ్యములతో చెప్పాడో ఎంతటి గుండె ధైర్యంతో రచన చేశారో ననిపిస్తుంది.
రచన పఠించిన తద్వర్గ పండిత పామరులు వారి తప్పులు తెలుసుకొని పశ్చాతాప ధోరణిలో యోచన చేసి ఐక్యంగా ఉండాలనే భావన ఈ ఇంటిగుట్టు కావ్య ఖండిక అంతరార్థము.
ఇలాంటి సమాజోపయోగ ఖండిక ను పరిచయం చేసే అవకాశం కలిగినందుకు ఆనందిస్తూ.... మరొక ఖండిక పరిచయంతో కలుస్తానని.....
ధన్యవాదాలతో ...
వెంకట్. సిహెచ్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి