శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు
1. రాయలసీమ కవి తిలకము, మహాకవి, పద్మశ్రీ, సరస్వతీపుత్ర, డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు సాహితీ విద్యుత్తు కలిగిన శక్తి స్వరూపుడు. గొప్ప కవి, మహాపండితుడు, సాహిత్య విమర్శకుడు, మంచి సంగీత కళాకారుడు. ఇన్ని ప్రత్యేకతలు ఒకే వ్యక్తిలో ఉండటం అసాధ్యం. ఆంధ్రము, సంస్కృతము, ప్రాకృత భాషలు, కన్నడ, తమిళ, మలయాళము, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ మొదలగు 14 భాషలలో పాండిత్యం కలిగి ఉండటం వీరి ఘనత .
2. దైవాన్ని నమ్మినా సంప్రదాయాలను గుడ్డిగా అనుకరించిన వా డు. ''దైవంతో పాటూ నాకు మానవుడు కూడా కావలెను'' అని అనగల్గిన మహామానవతావాది.
3. తన గురించి పుట్టపర్తి ఒక పద్యంలో....
''ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖ
రంబైన యభయహస్తంబుమాది!
ఒకనాడు గీర్దేవతా కమ్రకంకణ
స్వనమైన మాధురీ ప్రతిభమాది!
ఒకనాడు రామానుజ కుశాగ్ర బుద్ధికే
చదువు నేర్పినది వంశమ్ము మాది!
ఒకనాటి సకల శోభకు తానకంబైన
దండిపురంబు పెన్గొండ మాది
తల్లిదండ్రుల మేధ విద్యానిషధ్య
పాండితీ శోభ పదునాల్గు భాషలందు
బ్రదుకునకు బడిపంతులు భాగ్యములకు
చీడపట్టిన రాయలసీమ మాది''
తన వంశ గౌరవాన్ని తన దుర్భర ఆర్థిక స్థితిని ఏ సంకోచమూ లేకుండా చెప్పగలిగిన వారు పుట్టపర్తి.
4. పువ్వు పుట్టగానే పరిమళి స్తుందన్నట్లుగా తన 14వ యేట" 'పెనుగొండ లక్ష్మి" అనే కావ్యాన్ని రాశారు. అందులో ఒక పద్యం....
''ఉలిలో తేనెల సోనలన్జిలికె
యి యొయ్యారి చిత్రించు, వే -
ళల నాశిల్పికి గన్ను గోనలను
ధారల్గట్టేనేమో జలం -
బులు, జేదోయి సెమర్చి యుండు
ననుకొందున్, భావనావేశ, భం-
గులు పైపై జెలరేగ ముద్దుగొని
యుండున్ ప్రేమ విభ్రాంతుడై''
ఈ కావ్యాన్ని తొలిసారిగా రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు చూచి, ఈ కవికి మంచి భవిష్యత్తు లభిస్తాయని జ్యోస్యం చెప్పారు.
5. ఏ కవి జీవితంలో జరగని అద్భుత ఘటన వీరి జీవితంలో జరిగింది... తన 19వ ఏట పుట్టపర్తి తిరుపతిలో విద్వాన్ చదువుకుంటున్న రోజులలో, తాను రాసిన ''పెనుగొండ లక్ష్మి'' కావ్యమే పాఠ్యపుస్తకంగా ఉంది. ఆ సందర్భంగా జరిగిన పరీక్షలో తన కావ్యం గురించి అడిగిన ప్రశ్నకు జవాబు రాయాల్సి వచ్చింది. జవాబు 40పేజీలకు మించి రాశారు. పరీక్ష తప్పారు. కారణం 2మార్కుల ప్రశ్నకు 40పేజీల జవాబు రాయడమేనని తర్వాత తెల్సుకున్నారు. ఆ తరువాత విద్వాన్ పూర్తి చేశారు.
6. దాదాపు 140 గ్రంథాలు పుట్టపర్తి వారు వ్రాసారు. వాటిలో పెనుగొండలక్ష్మి మేఘదూతము, శివతాండవము, షాజీ, పాద్యము, జనప్రియ రామాయణము, పండరీ భాగవతము, శ్రీనివాస ప్రబంధము మొదలగునవి.
7. వీరి రచనలలో శివతాండవానికి వచ్చినంత కీర్తి ఇతర గ్రంథాలకు లభించకపోవడం గమనార్హం. ప్రొద్దుటూరులో పుట్టపర్తిగారు నివసించే ఆ రోజులలో ప్రతిదినం స్థానికంగా ఉన్న అగస్తేశ్వర ఆలయానికి వెళ్ళేవారు. ఒకరోజు శివాలయంలో అలౌకికమైన అనుభూతి కవితావేశం కలగడము. ఏకధాటిగా శివతాండవ రచన కావించడం జరిగింది. వైష్ణవుడైన పుట్టపర్తిగారు - శివుని గురించి, శివతాండవ రచన చేయడం పట్ల ఎందరో ఆశ్చర్యానందాలు ప్రకటించారు. శివతాండవం కథావస్తువు శివపార్వతుల నృత్యము.
8. ఒకరోజు ప్రకృతి తనను ఒక వేదికగా అలకరించుకొంటోంది. కారణం పరమేశ్వ రుని శివతాండవము జరుగుతుందని, ఆ ప్రకృతి వేదికగా తనను తాను ఎలా సుందరతరం చేసుకుంటున్నదో కవి చూశారు. చూడగానే, భావం రసస్నిగ్థ కవితా ప్రవాహమైంది. శివతాండవం పద్యాలలో లో వీరసం ప్రధానమైనది మరియు సంగీత నృత్య కళలకు అనుగుణంగా ఉన్నాయి
''తలపైని చదలేటి యలలు తాండవమాడ
నలలత్రోపుడుల గ్రొన్నెల పూవు గదలాడ
మొనసిఫాలముపైని ముంగురులు చెరలాడ
గనుబడొమ్మలో మధురగమనములు నడయాడ
గనుపాపలో గౌరి కసినవ్వు బింబింప
గనుబొమ్మలను తరుణ కౌతుకము చుంబింప
కడగి మూడవకంట గటిక నిప్పులురాల
గడుపేర్చి పెదవిపై గటిక నవ్వులు వ్రేల
ధిమిధిమి ధ్వని సరిద్గిరి గర్భముల దూగ
నమిత సంరంభ హాహా కారములురేగ
ఆడెనమ్మా! శివుడు / పాడెనమ్మా! భవుడు''
శివతాండవం రచన పుట్టపర్తి గారికి ఎనలేని యశస్సు నిచ్చింది. సంగీత, సాహిత్య, నృత్య కళారీతులు మూడు తెలిసిన వారికే ఈ కావ్యం పూర్తిగ అవగతం కాగలదు. ఆనందానుభూతి పారమ్యాన్ని చూపగలదు.
9. ఒకనాడు 1955లో రాజమండ్రిలో మహాకవి
శ్రీ పాదకృష్ణమూర్తి శాస్త్రిగారిని చూద్దామని పుట్టపర్తి వెళ్ళారు. అప్పుడు శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రిగారు శిష్యులతో ముచ్చటిస్తున్నారు. విషయం రాయలసీమ కక్షలకు కార్పణ్యాలకే కానీ, కళలకు మృగ్యమని అనుకుంటున్నారు. ఆ మాటలు పుట్టపర్తి చెవిన పడనేపడినాయి.కాసేపటికి శాస్త్రిగారు పుట్టపర్తిని చూచి, " కవిత్వ మేమైనామేమైనా రాశావా'' అని ప్రశ్నించారు. సీమవాసి అయిన పుట్టపర్తి వెంటనే ధారాపాత ఆశుకవిత్వాన్ని ఛందోబద్ధంగా ఇలా వినిపించారు.
''హేరాళంబిదేనాదు భాగ్యమని నీ
వెంతెంతో ఘోషింతు, నీ వారిన్
జూచితి లెమ్ము చెప్పకుము
గొప్పల్ విప్పుగా గౌతమీ,
ధారవర్థిత గోస్తనీరస
సముద్యత్తుంగ భద్రానదీ
స్వారస్వంబుల ముందు తావక
పయఃపానంబు శోభించునా
అని చెప్పేసరికి, శాస్త్రిగారు అబ్బురపడి, రాయలసీమ కవితిలకుడైన పుట్టపర్తిని అలింగనము చేసుకున్నారు.
10. పుట్టపర్తిగారి వ్యక్తిత్వం చిత్రమైనది. ఎదుటి వ్యక్తి తనను గొప్పవాడంటే, అలాంటిదేం లేదు; ''నా అహం పండితః'' అంటారు. మీకు విషయ పరిజ్ఞానం పెద్దగా తెలిసినట్టులేదే అంటే ఫణీఫణమై తన సారస్వత విశ్వరూపాన్ని చూపుతారు.
11. రిషికేశ్ లో అతని పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి గారు వీరికి "సరస్వతీపుత్ర "అన్న బిరుదు ఇచ్చారు. ఈ బిరుదు పుట్టపర్తి వారికి అత్యంత ప్రియము..
12. "కవిత్వాన్ని పాండిత్యాన్నీ కలగలిపి ఔపోశన పట్టిన అగస్త్యుడు ఈ మహనీయుడు అని " సినారే గారు అన్నది అక్షర సత్యం.
13. *కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు శ్రీ విశ్వనాథ వారి "ఏకవీర" ను మలయాళంలోకి అనువదించారు..
ఒక సారి విజయవాడలో శ్రీ విశ్వనాథ వారి సమక్షంలో పుట్టపర్తి వారు శివతాండవ కావ్యాన్ని ఆలపిస్తూ నాట్యం చేశారు. ఆ అద్భుత దృశ్యానికి పరవశించిన కవిసామ్రాట్ ఈ సరస్వతీ పుత్రుణ్ణి తన భుజాలమీద ఎక్కించుకొని ఆనందపడి పోయినారు.*
14. వీరు చాలా కాలము ప్రొద్దుటూరులో లో నివసించారు.. ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు.. వీరి భార్య పుట్టపర్తి కనకమ్మ కూడా ప్రముఖ సంస్కృతాంధ్ర కవయిత్రి.
15. ఆయన ఒక చిత్ర సారస్వత పురుషుడు. జ్ఞానపీఠ అవార్డుకు పుట్టపర్తిగారు అన్ని విధాల తగినవాడని విజ్ఞులు భావించినా, అవార్డు వచ్చినట్లే కనిపించి, రాకుండా పోయింది. రాజకీయ పలుకుబడి లేని పుట్టపర్తికి అవార్డు రాకపోవడంతో డాక్టర్ గజ్జెల మల్లారెడ్డి ఇలా రాశారు.
''జ్ఞానపీఠ' రాలేదని
గ్లాని చెందిన ఫలమేమి?
'పట్టు' విద్యలో తెరుగని
బాధవల్ల లాభమేమి?
పైరవీలు లేనిది చిరుపదవి రాదు మహాకవీ! సామర్థ్యానికి నూకలు
చెల్లినాయి కళారవీ!''
నిజమే. జ్ఞానపీఠం ఆయనకు రానేలేదు.
16. 1990 సెప్టెంబరు 1న కడపలో కన్నుమూశారు. ఇప్పుడు ఆయన భౌతికంగాలేరు. కానీ అభౌతికంగా ప్రజాహృదయ పీఠాలలో పదిలంగా ఉన్నారు.
17. శ్రీ పుట్టపర్తి వారు మా ప్రాంతం వారని చెప్పడం చాలా గర్వంగా ఉంది.. 1969లో వారు మా స్కూలు ఫంక్షన్కు కు చీఫ్ గెస్ట్ గా వచ్చారు.. అప్పటి నుంచి ఆయనకు అభిమానిని నేను.
సేకరణ
కె మల్లికార్జునరావు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి