16-8-20
నేటి సమీక్ష- ఒక పోతన పద్యం:
మందార మకరంద మాధుర్యమునఁ దేలు-
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు-
రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు-
కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక-
మరుగునే సాంద్ర నీహారములకు?
నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?"
ప్రతి పదార్థం:
మందార = మందారము యొక్క; మకరంద = పూతేనె యొక్క; మాధుర్యమునన్ = తీయదనము నందు; తేలు = ఓలలాడెడి; మధుపంబు = తుమ్మెద; పోవునే = వెళుతుందా; మదనముల = ఉమ్మెత్తపూల; కున్ = కు; నిర్మల = స్వచ్ఛమైన; మందాకినీ = గంగానది యొక్క; వీచికలన్ = తరంగము లందు; తూగు = ఊగెడి; రాయంచ = రాజ హంస; చనునె = పోవునా; తరంగిణుల్ = (సాధారణ) ఏరుల; కున్ = కు; లలిత = చక్కటి; రసాల = మామిడి; పల్లవ = చిగుర్లను; ఖాది = తినునది; ఐ = అయ్యుండి; చొక్కు = మైమరచెడి; కోయిల = కోయిల; చేరునే = దగ్గరకు వచ్చునా ఏమి; కుటజముల = కొండమల్లె, కొడిసెచెట్ల; కున్ = కు; పూర్ణేందు = నిండుజాబిల్లి; చంద్రికా = వెన్నల; స్పురిత = స్పందించెడి; చకోరకము = వెన్నెలపులుగు; అరుగునే = వెళ్లునా ఏమి; సాంద్ర = దట్టమైన; నీహారముల్ = మంచుతెరల; కున్ = కు; అంబుజోదర = నారాయణుని {అంబుజోదరుడు - అంబుజము (పద్మము) ఉదరుడు (పొట్టన గలవాడు), విష్ణువు}.
దివ్య = దివ్యమైన; పాద = పాదము లనెడి; అరవింద = పద్మముల; చింతనా = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; పాన = తాగుటచే; విశేష = మిక్కిలిగా; మత్త = మత్తెక్కిన; చిత్తము = మనసు; ఏ = ఏ; రీతిన్ = విధముగ; ఇతరము = వేరొంటిని; చేరన్ = చేరుటను; నేర్చున్ = చేయగలదా ఏమి; వినుత = స్తుతింపదగిన; గుణ = సుగుణములు గల; శీల = వర్తన గలవాడ; మాటలు = మాటలు చెప్పుట; వేయున్ = అనేకము; ఏలన్ = ఎందులకు.
భావము:
సుగుణాలతో సంచరించే ఓ గురూత్తమా! మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద, ఉమ్మెత్త పూల కేసి పోతుందా? రాజహంస స్వచ్ఛమైన ఆకాశగంగా నదీ తరంగాలపై విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా? తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది కాని దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా? చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. వెయ్యి మాటలు ఎందుకు లెండి, హరిపాదాయత్త మైన నా చిత్తం ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు.”
పద్య విశేషత:
ఈ పద్య రత్నం అమూలకం; సహజ కవి స్వకీయం; అంటే మూల వ్యాస భాగవతంలో లేనిది; పోతన స్వంత కృతి మరియు పరమ భాగవతులు ప్రహ్లాదుని, పోతన కవీంద్రుని మనోభావాల్ని, నమ్మిన భక్తి సిద్ధాంతాల్ని కలగలిపిన పద్యరత్నమిది. ఇలా ఈ ఘట్టంలో అనేక సందర్భాలలో, బమ్మెర వారు అమృతాన్ని సీసాల నిండా నింపి తెలుగులకు అందించారు.
కె మల్లికార్జునరావు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి