భగవంతుని మీద పగ - కథా పరిచయం
నవాన్ విశేషాన్ లాతి గృహ్ణతీతి నవలా
---- కస్తూరి శివశంకర్
"భగవంతుని మీద పగ"నవలలో ఆంధ్రదేశ చరిత్రను గూర్చి, ఆంధ్రుల ప్రాచీనతని గూర్చి వివరించటం జరిగింది. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొట్ట మొదటి రాజులు క్రీ.పూ. 200 ప్రాంతం నాటి శాతవాహనులవి ఆధునిక చరిత్రకారుల ఉవాచ
మహాభారత యుద్ధ సమయంలో సింధు దేశపు రాజయిన జయద్రథుడు (సైంధవుడు) అర్జునుడి చేతిలో మరణిస్తాడు. దానికి సంబంధించిన పథక రచన అంతా శ్రీకృష్ణుడిది. అయితే ఈ విషయంగా సైంధవుని భార్య అయిన దుస్సలకి గాని, ఆమె కొడుకుకి కాని పగ లేదు.. ఇక్కడి నుంచి కథ మొదలయి ఆంధ్ర రాజుల చరిత్ర అయిన రోమపాదుడి వరకు, అతడి తరువాత రోమపాదుడి కొడుకు శ్రీముఖుడు పట్టాభిషేకం వరకు జరిగిన గాధ, అత్యంత అందమైన గాధ
జనమేజయుని ఆంధ్రదేశ అమరావతీ నగర పర్యటనం, దాన శాసన సమర్పణం జరిగింది. క్రీ. పూ. 3013 వ సంవత్సరంలో జరిగినదని మన ప్రాచీన పురావస్తు అధికారులు సైతం నిర్ధారించారు
ఇక ముఖ్యమైన కథలో, ముఖ్య పాత్రలు ఆంధ్ర రాజు రోమపాదుడు, ఆయన ముగ్గురు కొడుకులు – శ్రీముఖుడు, విజయసింహుడు, నాగార్జునుడు. యువరాజు శ్రీముఖుడు.
భారతయుద్ధం క్రీ.పూ. 3139వ సంవత్సరంలో జరిగినట్లు ఎన్నో ఉపనిషత్తులు చెబుతున్నాయి. భారత యుద్ధానంతరం రాజ్యానధిష్టించిన ధర్మజుడు ఇంచుమించు ముప్ఫైఆరేళ్ళు హస్తినని రాజధానిగా చేసికొని పాలించాడు. ముప్ఫైఆరోయేట కలి ప్రవేశ లక్షణాలు, శ్రీకృష్ణ నిర్యాణం జరిగినట్లు మహాభారతం, విష్ణుపురాణం, మత్స్యపురాణం, భాగవతం కూడా స్పష్టంగా తెలియచేస్తాయి అని కూడా చెబుతారు.
కలి ప్రవేశించిన వెంటనే ధర్మజుడు రాజ్యపరిత్యాగమొనర్చి పరీక్షిత్తుని పట్టాభిషిక్తుని కావించాడు. పరీక్షిత్తు పాలనాకాలం అరవై ఏళ్ళు. తరువాత అతని కుమారుడు జనమేజయుడు క్రీ.పూ. 3013వ ఆంధ్రదేశంలో పర్యటించి సీతారామాలయానికి దానశాసనం సమర్పించాడు. అప్పుడు ఆంధ్రదేశాన్ని పాలిస్తున్న రాజు రోమపాదుడు. నాడు ఆంధ్రదేశానికి రాజధాని ధాన్యకటకం. ఇది అప్పటి కధ, ఆ చరిత్ర.
రోమపాదునికి ముగ్గురు కుమారులు అని చెప్పుకున్నాము కదా. వారు వరుసగా శ్రీముఖుడు, విజయసింహుడు, నాగార్జునుడు.
పెద్దవాడైన శ్రీముఖుని పట్టాభిషేక మహోత్సవం దర్శించాలనే ఉత్సుకతో దక్షిణాపథానికేతించిన జనమేజయ చక్రవర్తి తుంగాభద్రానదీ తీరాన గల సీతారామాలయానికి నిత్యపూజా నిమిత్తమైన దానశాసనాన్ని సమర్పించి, ధాన్యకటకానికి విచ్చేస్తాడు. జయద్రధుడు చేసిన దేశద్రోహామేమిటీ , అతడికి మరణదండన ఎలా విధిస్తారు అనేది చరిత్ర.
కురుక్షేత్రంలో సైంధవుడు అర్జునుడి చేతిలో మరణిస్తాడు. అయితే ఈ విషయంగా సైంధవుని భార్య అయిన దుస్సలకి గాని, ఆమె కొడుకుకి కాని పగ లేదు.
కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు అశ్వమేధయాగం చేసిన సందర్భంలో అర్జునుడు దిగ్విజయం చేయడానికి వెళ్ళినపుడు దుస్సల తన చిన్నకొడుకుని తెచ్చి అర్జునుడి పాదాల మీద వుంచి ప్రాణదానం కోరుతుందట.. ఆ తరువాత సైంధవుడు మనుమడు కూడా రాజ్యాన్ని పాలిస్తారు
వారెవ్వరికీ లేని పగ సైంధవుడి మేనల్లుడయిన కనకసింహుడికి వుంటుంది. ఆ కనక సింహుడికి ఒక కూతురు వుంది. ఆమెకు తన మేనమామ భార్య అయిన దుస్సల పేరు పెడతాడతను. మ్లేచ్ఛ సంఘాచారములందు అతనికి పరమాభిమానము. వైదిక ధర్మము మీద పగ.అతడు తన కూతురయిన దుస్సలకి ఆ పగ సాధించడమే జీవిత పరమావధిగా నిర్ణయిస్తాడు. అతడు చేసిన నిర్ణయమేమిటంటే తన కూతురయిన దుస్సల, ఆమె సంతానము వైదిక మతాన్ని వదిలిపెట్టరు. అందులోనే వుండి లోపలినుంచి ఆ మతానికి ఎంత అపకారం చేయాలో అదంతా చేస్తారు. ఆ కనకసింహుని కూతురయిన దుస్సల భర్త పేరు రామఠుడు. పగ తీర్చుకోవడానికి వాళ్ళు ఒక సంప్రదాయమేర్పరుస్తారు. రామఠుడికీ, దుస్సలకీ ఒక కొడుకు పుడతాడు. వాడి పేరు జయద్రథుడు. వాడు పెళ్ళి చేసుకుంటాడు. ఆ పెళ్ళి చేసుకున్న స్త్రీ పేరుని దుస్సల గా మారుస్తారు. ఆ దుస్సలకి ఒక కొడుకు పుడితే వాడి పేరు మళ్ళీ జయద్రథుడే. వాడి భార్య పేరు మళ్ళీ దుస్సలే. ఇలా పగ కొనసాగుతుంది.
కథాకాలం నాటికి అలాంటి దుస్సలా జయద్రథుల తరాలు మూడు గడిచి వుంటాయి. ఈ కథలోని జయద్రథుడు మూడవవాడు. ఇతనికీ భార్య, కొడుకు (నాల్గవ తరము జయద్రథుడు) వుంటారు. భార్యని ఆమె పుట్టింటిలోనే వుంచి జయద్రథుడు, అతని తల్లి దుస్సలా ఆంధ్ర రాజ్యం చేరతారు. దుస్సల అంతఃపురంలోకి ప్రవేశించి మొదట నీలనీ, ఆమె సహాయంతో యువరాజు భార్య అయిన కాళిందినీ తనకి అనుకూలంగా మార్చుకోవాలనీ, తన లక్ష్యసాధనకు ఉపయోగించుకోవాలనీ ప్రయత్నిస్తుంది. మరొక ప్రక్కన జయద్రథుడు రాజకుమారులయిన శ్రీముఖునితో, నాగార్జునుడితో రహస్యంగా స్నేహం చేయడం ద్వారా వాళ్ళని ప్రభావితులను చేస్తుంటాడు.
ఈ నవలలో ఆకట్టుకునే అంశాలు, విశ్లేషణలు చాలా వున్నాయి.
నాగార్జునుడి (రోమపాదుడు మూడవ కుమారుడు) భార్య అయిన నీల స్వభావాన్ని, శ్రీముఖుడి (రోమపాదుడి మొదటి సంతానం, యువరాజు) భార్య అయిన కాళింది స్వభావాన్ని వారిద్దరి మధ్య జరిగే సన్నివేశాలని వర్ణించే తీరు చాలా ఆకట్టుకుంటుంది.
పురాణవైర గ్రంథమాల లో మిగిలిన పుస్తకాలలో కూడా ఈ జయద్రధుడు, దుస్సల వంశస్థులు కనిపిస్తారు
జయద్రధుడు చేసిన దేశద్రోహానికి మరణదండన, విధింపబడగా, జయద్రధుని తల్లి దుస్సల మనుమడైన జయద్రధునితో ఆ దేశాన్ని వీడి, మ్లేచ్చదేశాలకి పారిపోతుంది. కుమార జయద్రధుడు తండ్రి పగ తాను తీరుస్తానని ప్రతిన పూనుతాడు. ఆ ప్రతిజ్ఞే “భగవంతుని మీద పగ”.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి