6, అక్టోబర్ 2020, మంగళవారం

మహాత్మా గాంధీ గారి 151, లాల్ బహదూర్ శాస్త్రి గారి 116 వ జయంతి

 


మహాత్మా గాంధీ 116 వ జయంతి సందర్భంగా....

లాల్ బహదూర్ శాస్త్రి గారి 116 వ జయంతి సందర్భంగా....

 

మహాత్మా గాంధీ గారి గురించి, శ్రీ లాల్ బాహదూర్ శాస్త్రి గారి గురించి, 50 వాక్యాలకు మించకుండా మీ ఆలోచనలను బృందంలో ఒక వ్యాసంలా తీసుకురమ్మని ఆహ్వానము, విన్నపము

 

వ్యక్తిగతంగా చిన్న ఆత్మీయ సూచన....అంతర్జాల సేకరణలు మాత్రమే కాకుండా, గాంధీ గారి గురించి, వారితో మీకూ వున్న అనుబంధం గురించి, వారి గురించి మీ ఆలోచనలను వ్రాయండి. * వారితో తరానికేమి అనుబంధం అనకండి. మన మనీపర్సుల్లో, ఆలోచనల్లో, సత్యాగ్రహాల్లో, స్వచ్ఛ భారతంలో, అహింసావాదంలో... ఇలా ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా ఆయన ప్రభావం మనపై ఉంది కదా    

 

ప్రక్రియకు భాషా నియమము లేదు.

తెలుగు లో వ్రాయడానికి ఇబ్బంది పడేవారు తెలుగు మరియు ఇంగ్లీష్ లో కూడా రాయవచ్చు. తెలుగును ఇంగ్లీషులో రాయటం కాదు... ఆంగ్ల వాక్యాలనే నేరుగా అవసరం మేరకు వ్రాయగలరు. 

తెలుగు టైపు చేయలేమనుకునే వారికోసం వెసులుబాటు.

కాబట్టి అందరూ ప్రయత్నించండి, వీలయితే  మీ పిల్లలతో కూడా రాయించండి.

అందరితో మీకు తెలిసిన, అర్ధమయిన గాంధేయవాదం పంచుకోండి

 

తెలుగు తేనియలు

 


 

 

సమస్య :

గాంధీ తన జీవితమున కల్లలె పలికెన్

ఇచ్చిన పాదము కందము

నా పూరణ సీసములో

 

జరిపెగా నెన్నియో సత్యాగ్ర హములను జీవిత మంతయు ,చేసెను పలు

మార్లు శాంతి యుతపు  మంతనములు,తన దేశప్రజలకై,విదేశ వస్తు

వులు వాడ వలదని తెలుపుచు భరత ప్రజలకు పిలుపునిచ్చె సత్యమేవ

చించె గాంధీ తన జీవితమున,కల్లలె పలికెననుచు తెలియక మాట‌

లాడగ వలదు స్వాతంత్ర లక్ష్య సాధ

కొరకు తన జీవితమును నష్ట పెట్టి

ఘను డాతడు, మ్రొక్కుము నమ్మ కముగ

ననుచు పలికె నొకడు తన వనిత తోడ

పూసపాటి తెలుగు తేనియలు

 

 

చండి! పార్వతీ! భగవతీ! జగముతల్లి!

అంబ! భద్రకాళి! భవాని! అభయమిచ్చి

మమ్ము కాపాడ వోయమ్మ మాత! దుర్గ!

ప్రణతులివియే మహేశ్వరి! వందనంబు.

వెంకట్ సి.హెచ్ తెలుగు తేనియలు


 

 

ఐదేళ్ళ క్రితం సబర్మతి తీరంలో నేనెవరినో తెలుసుకోలేని సందిగ్ధంలో పడగా... ... ...

 

*నేనెవరినో?!?*

 

సబర్మతిలో మతిపోయేలా

గాంధీ కోసం వెతికాను.

వెతికి వెతికి వేసారి

దూలం పైన వాలిపోయి

పిచ్చి చూపులు చూస్తూండిపోయాను.

అడుగడుగునా గాంధీ ఆనవాళ్ళే!

మరి గాంధీ లేడే?

ఏడీ ...ఏడీ నా గాంధీ??

ఇంతలో దూలమే

నన్ను ఓదార్చింది నేనే గాంధీనంది.

నువ్వా అన్నాను, కాదు నువ్వే అంది.

?!?!?!?!??!!?

మిత్రమా! నువ్వైనా చెప్పు...

నాలో కనిపిస్తున్నాడా గాంధీ?

... అరే.. అదేంటి మిత్రమా!

నేను నిన్ను అడుగుతూంటే.. 

నువ్వే గాంధీలా కనిపిస్తున్నావే!!

అరే! వాడు కూడా!...! వీడు కూడా!

 

అందరికందరూ!?!?

చిత్రం! నా నేస్తాలందరూ

గాంధీలాగే కనిపిస్తున్నారే!

బాబోయ్! గాడ్సే కూడా గాంధీలాగే ఉన్నాడే?!?!

ఇంతకీ ఎవరు గాంధీ? ఎవరు గాడ్సే??

ఇంతకీ నేను...

గాంధీనా?

గాడ్సేనా??

గాడ్సేనైతే ఇప్పుడే ఛస్తా

గాంధీనై మళ్ళీ పుడతా.  

----.----

అత్తిలి అనంతు తెలుగు తేనియలు

 

 

 

 


 

#అక్టోబరు రెండు

 

నాకు ఒకటే ఎప్పుడూ అనిపించేది....

 పెద్దకఱ్ర చేతిలో ఉంచుకుని రెండు నడ్డిమీద వేసుంటే వెంటనే పారిపోయే వాళ్ళు కదా తెల్లవాళ్ళని....

మా మామ్మ గాంధీ కధలు భలే ముచ్చటేసేవి... చిన్నప్పుడే అబద్ధం ఆడి దొంగతనం చేసి తర్వాత ప్రాయశ్చిత్తం తో తండ్రికి చెప్పలేక ఉత్తరం వ్రాయడం...ఆయన ఏమనకుండా ఏడవడం...గాంధీలో వచ్చిన మార్పు....ఒక విధంగా ప్రేరణ ఇచ్చేవి...

అలాగే చాలా విషయాలు... అంతే పెద్ద బారిష్టరూ చాలా సాధారణంగా గొప్పలకూ పోకుండా ఎలా ఉండేవాడో ...ఏం ధక్కామొక్కీలు తిన్నాడో దక్షిణాఫ్రికా రైలుబండిలోంచి నల్లగా ఉన్నాడని ఎలా తోసేసారో....

ఇలాంటి ఎన్నో కథలు....ఎన్నో ఉదాహరణలు....ఆవిడ మాకు కథలు చెప్పే సమయానికి ఆయన వ్రాసిన "సత్యశోధన" గురించి మా మామ్మకూ తెలియదు....నాకైతే హైస్కూల్ లో పెద్దక్లాసులకి వచ్చేదాకా తెలియదు...

నేననుకోవడం "ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్"  మా మామ్మ చెప్పిన కథలవలన ఇంకా బాగా అర్థమై ఉంటుందని......

ఏం విధమైన మీడియా లేని రోజులలో దేశం నలుమూలలోనూ జనాల నరనరాలలోనూ ఆయన భావం ప్రాకింది అంటే...ఆయన ప్రభావం ఎంత బలమైనదో తెలుస్తుంది...

 

లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పిన కథలలో....

ఆయన దగ్గర చిన్నతనం లో పడవకు డబ్బులు లేక గంగానదిని తలకు పుస్తకాలసంచి చుట్టుకుని ఈదుకొని దాటేవారట...

తండ్రి చిన్నప్పుడే పోతే వేరేపంచన ఉంటే వచ్చే కష్టాలు అలాంటివి...

మెత్తగా ఉన్నా గట్టిగా నిలబడిన ఆసామి ఆయన... పాకిస్థాన్ యుద్ధవిరమణ ఒప్పందానికి తాష్కెంట్ వెళ్ళి సంతకం పెట్టి మరణించారు.... మరణం వెనుక కూడా ఏదో మతలబుందని మా మామ్మ అనేది...అమెరికావాడో రష్యావాడో ఏదో చేసారని వివరాలైతే ఎవరికీ తెలియకుండా అంతా కానిచ్చేసారని చెప్పేది....

 

ఏది ఏమైనా.... మనిషిని రూపం బట్టి అంచనా వేయకూడదనీ

ఎంత ఒదిగి ఎంత ఓర్పుగా ఎంత సాధారణంగా సౌమ్యంగా ఉండాలనేది మా మామ్మ చెప్పిన ఇద్దరు మహానుభావుల కథల సారం...

 

కాకపోతే ఒకటే నాకు జీర్ణం కాని విషయం.... అక్టోబర్ రెండు ఒకాయన పుట్టిన రోజు గా మాత్రమే గుర్తుండేది...బాఁగా పెద్దయ్యాక వికీపీడియా లో చూసిన తర్వాత మాత్రమే రెండో ఆయన జన్మదినం కూడా అదే రోజని తెలుసుకోవడం...

ఆలస్యం ఐనా కాని ఇద్దరు మహానుభావులని ఒకే రోజు గుర్తు చేసుకుంటున్నాం...

 

జై జవాన్ జై కిసాన్ జై భారత్

 

కన్నాజీరావు తెలుగు తేనియలు

 

 


 

మహాత్మ

 

బక్కపలచని వ్యక్తి

అజేయమైన శక్తి

సమ్మోహన ఆకర్షణ

హింసా వికర్షణ

సూదంటురాయి చూపు

ఉత్తేజితులను చేసే ఊపు

తెల్లజాతి పీచమణిచి

నల్లజాతి విముక్తి కలిగించి

దండి యాత్రతో దండెత్తి

క్విట్ ఇండియా తో గళమెత్తి

నాది దేశం

విముక్త భారతం కోసం

కటకటాలు లెక్కించి

విభజన కల్లోలం లో

విభ్రాంతి చెంది

సాధించిన స్వరాజ్యం నకు

ప్రతిఫలం గుండెను చీల్చిన

తుపాకీ గుండ్లు

చివరికి పలికిన స్వరం హేరామ్!

 

కోవూరి తెలుగు తేనియలు

 

 

మహాత్ముని స్మృతిలో ....

( గాంధీ జయంతి శుభాకాంక్షలు)

 

మత్తేభము

చిరకాలమ్ము పరాయి పాలనమున్ ఛీత్కారముల్ బొందగా

భరతక్షోణిని దాస్య శృంఖలములే బాధింపగా నత్తరిన్

కరుణామూర్తిగ శాంతి సంయమనముల్ కార్యాను వర్తమ్ముగా

వరమై గాంధియె జాతి నాదుకొన తా వైతాళికుండాయెనే!

 

శార్ధూలము

సత్యౌన్నత్యమునే జనాళికిని యాజన్మాంతమున్ దెల్పుచూ

సత్యాహింసలె యాయుధమ్ములుగ స్వేచ్ఛా భారతిన్ గోరి తా

నత్యావశ్యకమంచు పోరి తరుమంగారాతి వర్గంబునే

నిత్యమ్మై తన కీర్తి సుస్థిరముగా నిక్షిప్తమాయే నిటన్!

 

ఉత్పలమాల

మక్కువ మీర శాంతినిడు మానిత వాక్కుల బోసినవ్వుకున్

చిక్కిన కాయమందునను చేతన నిండిన మానసంబుకున్

దిక్కెవరన్న భారతికి దీధితి తెచ్చిన శాంతికాముకున్

మ్రొక్కుదు దాస్యమున్తొలగ ముక్తి నొసంగిన యా మహాత్ముకున్!

 


 

సీసము

శాత్రవాంగ్లేయుల సామ్రాజ్యమును తాను  కూకటి వేళ్ళతో కూల్చివేయ

శాంతియహింసలు సంయమనము తోడ  నీతి నియమముల ఖ్యాతి గాంచి

దీక్ష తోడను సల్పి తీక్షణ రణమునే  నవభారతముకై యనవరతమ్ము

నవహితుడై పోరి యాంగ్లేయుల దరిమి సత్యాగ్రహబలమ్ము చాటి చెప్పె!

 

సీసము

ఉప్పుకల్లును మార్చి నిప్పు కణికగాను దీపశిఖగ తాను దీప్తి నొందె

అణగారిన బడుగులార్తుల వెతలకై కలతజెందుచు పోరె కడవరకును

ఆడంబరమ్ముల కామడ దూరమై అస్పృశ్యతయె జాతికవగుణమనె

గ్రామ స్వరాజ్యమ్మె కాంక్షించి సతమును స్వచ్ఛభారతముకై శ్రమను జేసె!

 

తేటగీతి

సర్వమత సారమే త్యాగ సంవిధాన

మనియు నదియే పరమ ధర్మమని తలంచె;

మంచినే బెంచు సతతము మతమనునది

యని జనాళికెల్లను దెల్పె నంచితముగ!

 

సీసము

సంకల్ప బలమున్న లెంకగా పోరగ గాంధీ యనగ జాతి కర్మఠుండు

సూనృత వాక్కుల స్ఫూర్తి ప్రదాతయై సత్కృతి నొందిన సానువతడు

కడగి బోధించగ కర్తవ్య మానాడు జగతి వెల్గుచునుండె జాతిపితగ

తాలిమికిని తాను తార్కాణమై నిల్చి అనుపమానముగ మహాత్ముడాయె!

 

తేటగీతి

వ్యక్తిగా జనించిన యట్టి శక్తి గాన

పుణ్య చరితుడితండె బాపూజి యనుచు

తనదు రూపు నిల్పి సతము తలపులందు

భక్తి తోడ సేయుదునిట ప్రణతులివియె!

 

చల్లా దేవిక తెలుగు తేనియలు

 


మాకోసం మళ్ళీ జన్మించు బాపూ.........

మాకోసం మళ్ళీ జన్మించు బాపూ,

మాలో అడుగంటిన మానవత నిద్ర లేపు,

సమతాభావం తిరిగి మాలో రేపు,

సన్మార్గం మరలా మాకు చూపు 

నీవు చూపిన శాంతి మార్గం,                         

ఆరోజులకది అభేద్య దుర్గం,

సత్యాగ్రహం ఆనాడది  మహాఖడ్గం,

ఈనాడది పనికిరాదంటుంది వర్గం...

హద్దుమీరుతున్న హింసావాదం నిర్జించు,

అవినీతి లంచగొండి తనం అంతమొందించు,

కులమత రక్కసి కోరలు పెకలించు,

కపట నేతల ముసుగులు తొలగించు,

 


 

 

అందుకే మాలో ఒకడిగా మళ్ళీ జన్మించు,

సన్మార్గంలో జాతిని నడిపించు.....

 

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి తెలుగు తేనియలు

 

 

 


బాపూ శాస్త్రీయం

మిత్రులారా!!

 

మీరంతా ఇప్పటికే గాంధీ గారి గురించి, శాస్త్రి గారి గురించి చకచకా రాయడానికి సన్నద్ధమై టకాటకా రాసేస్తున్నారని నాకు తెలుసు.  అందుకే కేవలం సరదాకి నేను విభిన్నమైన కోణం ఆవిష్కరించదలిచి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా.  సరదాగా మాత్రమే సుమండీ.

 

దయచేసి ఎవరూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లోని సమంతలు కాకండి.  అదేనండి, నేను హర్ట్ అయ్యాను,బుంగమూతి పెట్టుకున్నాను అనొద్దండి.

 

ఇక విషయానికి వస్తే

 

* ఒక మగాను భావుకుడు చదివిన స్కూల్ పేరు తెలుసా: గాంధీ విద్యా లయ , మచిలీపట్నం.

 గాంధీ గారు పుట్టింది 1869 , ఈయన పుట్టింది 1969 .

 ఆయన పుట్టింది పోరుబందరు . ఈయన పుట్టింది మామూలు బందరు .

 ఇప్పుడు ఉంటోంది ఘోడ్బందరు రోడ్డు.

 

* గాంధీజీ మచిలీపట్టణం లోని ఆంధ్ర జాతీయ కళాశాలకు విచ్చేశారని చెప్పబడుతుంది.  ఆయనే గనక ఇప్పుడు ఉండి ఉంటే మన మాస్టర్ ఆయన్ని తె తే లోకి ఆహ్వానించేసుండేవారు.

 

* అంతే కాక ఆయనతో గాంధీ కందం అని రాయించేసుండేవారు.

 

* ఈరోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది. అదే ఆదివారమో అయ్యుంటే ఆయనకే తెలియని కొన్ని ప్రశ్నలతో ఆయనకే ప్రహేళిక పెట్టేసుండేవారు.

 

* ఉదా : 1. గాంధీ గారి చేతి కర్ర కు ఎన్ని గణుపులున్నాయో చెప్పగలరా

2. ఆయన వాడే కిర్రు చెప్పులు సంవత్సరంలో కుట్టారు / కుట్టించారు?

3. గాంధీ గారు గడియారం ఎక్కడ పెట్టుకునే వారు, దానిలో ఇప్పుడు టైం ఎంత అయ్యుంటుంది?

 

* ఆయన అంటే అస్సలు గౌరవం లేని వ్యక్తి, post man. ఆయన మొహం పై ఠపీ ఠపీ మని అన్ని ముద్దర్లు గుద్దేస్తుంటాడు కదండీ మరి.

 

* భారతీయులందరికీ ఆయనంటే మహా గౌరవం. ఆయన బొమ్మ ఉన్న నోట్లు కింద పడితే కళ్ళకద్దుకొని మరీ జేబులో దోపేస్తారు అది వాళ్ళది కాక పోయినా సరే..

 

* ఆయన విగ్రహం మీద కాకులు వాలవు. ఎందుకంటే ఆయన చేతిలో కర్ర ఉంటుంది కదా..కానీ ముంబై పావురాలు మాత్రం మహా గడుసు. ఆయన తల పైన కూర్చొని 'ఓహ్ షిట్' అని డిస్కస్ చేసుకొని తెల్లటి పెయింటింగ్ వేసేస్తుంటాయి.


* గాంధీ నగర్ గాని, గాంధీ రోడ్ గాని లేని ఊరు ఉండదుఅలాగే విరివిగా లిక్కర్ షాపులు లేని గాంధీ రోడ్ ఉండదు.

 

* గాంధీజీ లోని గాంధీ, ఇందిరా గాంధీ లోని గాంధీ ఒకటి కాదు, వేరు.

 

* గాంధీ గారు వెళ్లి పోయారు కాబట్టి బ్రతికి పోయారు, లేకపోతె ఇప్పుడు కరోనాను వెళ్లగొట్టడానికి సత్యాగ్రహం వర్క్ ఫ్రొం హోమ్ చెయ్యాల్సి వచ్చేది, అది కూడ ఆన్ లైన్ సత్యాగ్రహం.

 

* ఇక శాస్త్రి గారి విషయానికొస్తే పొట్టి వారైనా చాలా గట్టి వారు.

 

* ఆయన ఇచ్చిన నినాదం లో సగం నా పేరు ఉందండోయ్..

 

* ఆయన పేరు లో ఉన్న లాల్ కు whtsapp lo తరచూకనపడే లోల్ కు సంబంధంలేదు.

 

* ఆయన పేరు లో లాల్ ఉన్నా కూడా ఆయన ఎర్రగా ఉండే వారు కాదు.

 

* ఆయన పేరు బహదూర్, ఆయన చెడు వ్యసనాలకు బహు దూర్

 

* నిన్న రాత్రి లేటుగా ప్రశ్న పత్రం లీక్ అయినా కూడా శాస్త్రి గారి గురించి రాయాలన్నది అవుట్ అఫ్ సిలబస్ కాబట్టి ఎక్కువ రాయలేక పోతున్నా.

 

* సమూహం లోని పెద్దక్కలకు, పెద్దన్నలు కోపమొచ్చింది అని నాకు అర్ధం అయ్యింది, అది కాస్త దావనలం అయ్యిందంటే ఇక తంటా. అందుకే ఇక ఉంటా.

 

ఇట్లు

Jaikar తెలుగు తేనియలు 

 



పాట

శాంతిసహన జగజ్జేత

సాధువర్తన పునీత

చేతిని భగవద్గీత

అతనే గాంధీతాత!

 

1 చరణం

ఒక్కడితను దేశానికి దక్కినట్టి పసిడినేత

ఒక్కడితను స్వాతంత్ర్యం

సాధించిన కలలసేత

ఒక్కడే.., మహాత్ముడుగ

దిక్కులందు నినదించె

ఒక్కడే భరతమాత కీర్తిఘనత వినిపించె!

 

2 చరణం

ఆతని చూపినబాటన

చేతనత్వమే విరిసె

ఆతను పలికిన మాటల

ఆత్మశక్తియె మురిసె

ఆతనొకడె... కదిలేటి మహాసైన్య సమమాయె

ఆతనికై ప్రజలగుండె

ఆదరణాసంద్రమాయె...

 

 

3చరణం

 

అహింసకు మారుపేరు

ఆతను కనగి

సత్యానికి సమరూపం

అతనిని వినగా

పూర్వపుణ్యఫలమొ

ఆతని వారసులమవుట

అతని మార్గమందు నడువ

అవియే ఘన నివాళులట!....

 

గాలి రాంమోహన్, నిజామాబాద్ తెలుగు తేనియలు

 

కందము

 

చూడగ వచ్చిన నేమౌ

తోడుగ నుండిన బలమిక తొలగును గదరా

వేడుక చేసెడి సంస్కృతి

నేడిచ్చట లేదనునది నెరుగర గాంధీ!!

 

కళ్యాణ్ చక్రవర్తి  - తెలుగు తేనియలు

 

వ్యాసం

యుగానికొక్కడు-మహాత్మాగాంధీ

 

మహాత్మా గాంధీ ని తెలుసుకోవాలంటే ఆయన  వ్యక్తిగత జీవితం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. వారి వ్యక్తిగత జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు, పాటించిన ఎన్నో ధర్మాలు, నమ్మిన సిద్ధాంతాలుమనను తీవ్ర ప్రభావితం చేస్తాయి. ఇటువంటి సంఘటనలు నాకు తెలిసినవి కొన్ని మీతో పంచుకుంటున్నాను.

 

1)  ఆయన శాంతి అవతారం

ఆనాడు భారతదేశంలో మహాత్మా గాంధీ ప్రజాదరణ రోజురోజుకు పెరిగిపోతుండటంతో  ప్రపంచ క్రిస్టియానిటీ పెద్ద అయిన పోప్ ప్రభుత్వం  మహాత్మా గాంధీని తమ మతంలోకి మార్చాలని ఒక ఆలోచన చేసింది. అప్పుడు పోపు దగ్గర్నుండి  ఒక బృందం మహాత్మాగాంధీ ని సందర్శించి ఆయనతో సుదీర్ఘ సంభాషణ చేసింది .. తర్వాత బృందం ఒక నివేదిక తయారుచేసి పోపు కు సమర్పించింది.. నివేదిక సారాంశం ఇలా ఉన్నది.

 

"మహాత్మా గాంధీ గారి  ఆలోచనలు,   జీవన విధానంప్రేమ మార్గంఅహింసా తత్వం, సత్యా చరణ  , ఆధ్యాత్మికత మొదలగు అనేక విషయాలు విశ్లేషించిన తర్వాత మా దృఢమైన అభిప్రాయం ఏమంటే ఆయన స్వయానా యేసుక్రీస్తు స్వరూపమే, అందుకని ఆయన్ను క్రిస్టియానిటీ కి మార్చాల్సిన అవసరం లేదు".

 

పై సంఘటన జరిగిన తర్వాతనే ఆంగ్లేయుల లో మార్పు వచ్చింది , గాంధీజీ స్వతంత్ర ఉద్యమం మీద వాళ్లకు సదభిప్రాయము ఆరంభమైనది.. అని కొందరి విశ్లేషణ.

 

2) ఆత్మ బలమే ఆయన శక్తి

ఆయుధం ధరించకుండా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని జయించాడు మహాత్మా గాంధీ. ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఇలా అహింసా మార్గంతో హింసను ఎదుర్కొన్న నాయకుడు ఇంతవరకు పుట్టలేదు ఇకముందు పుట్టబోడు. ఆత్మబలమే శక్తిగా మహోద్యమాన్ని నడిపిన వాడు గాంధీజీ. శతాబ్దానికి అత్యుత్తమైన శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఏమన్నాడంటే- "భవిష్యత్తులో గాంధీజీ లాంటి ఒక వ్యక్తి భూమి మీద నడయాడి నాడంటే ఎవరు నమ్మలేరు". ఒక్క వాక్యం చాలు మహాత్మా గాంధీ మహోన్నతను వర్ణించడానికి..

 

3) ఆయన విశ్వ నాయకుడు

గాంధీజీ తప్ప ఇతర రాజకీయ నాయకుడు తన దేశ క్షేమం తో పాటు సకల ప్రపంచం గురించి ఆలోచించలేదు . ప్రపంచ శాంతి కై గాంధీజీ చేసిన ప్రతిపాదన ఏమంటే--

ద్వేషం అనే ప్రేలుడు పదార్థం వల్లనే యుద్ధం వస్తుంది . ద్వేషం నాశనం చేయండిఅప్పుడు భూమి మీద శాంతి సుస్థిరంగా ఉంటుంది. పాశ్చాత్య సోదరులు తమ  భౌతిక సామర్థ్యంతో ప్రాచ్య సోదరులను గెలుస్తూ ఉండాలి అలాగే ప్రాచ్య సోదరులు తమ ప్రేమతో పాశ్చాత్య సోదరులను గెలుస్తూనే ఉండాలి . అప్పుడు తూర్పు పశ్చిమ ప్రజలందరూ భౌతికంగా ఆధ్యాత్మికంగా సమానమైన అభివృద్ధి సాధిస్తారు.

 

4) సత్యమే ఆయన సందేశం

తన జీవితమే ఒక సందేశం అన్నాడు మహాత్మా గాంధీ. అందుకు అనుగుణంగా జీవించాడు కూడా . ఆయన ఆత్మ కథ చదివితే  మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆత్మ కథ రాసుకున్న వాళ్ళు తమ బలహీనతలను కప్పు పుచ్చుతారు. కానీ గాంధీజీ  తన బలహీన క్షణాలను కూడా ఆత్మకథలో  ప్రస్తావించారు . సందర్భంగా  ఒక చిన్న ఉదాహరణ . ఆయన  లండన్ లో ఉండగ తండ్రికి ఆరోగ్యం విషమించిందని కబురు వస్తుంది. వెంటనే బయలుదేరి ఇంటికి వస్తాడు. రాగానే తండ్రి వద్దకు వెళతాడు. తండ్రి ఆరోగ్యం గురించి విషయాలు తెలుసుకున్న గాంధీజీ, కొంత సమయం తర్వాత, ఆయన ఆలోచనలు మళ్ళి, తను ఎప్పుడు కస్తూరిబాయి కలుసుకొనగలడు? ఆమెతో ఎలా రొమాన్స్ చేయాలిఅనే విషయాలు ఆయన మస్తిష్కంలో తిరుగుతాయి .. ఆలోచన సాధారణంగా తప్పు కాకపోయినా ఒక గొప్ప వ్యక్తిని విధంగా ఊహించుకోలేము . కానీ గాంధీజీ నిజాయితీగా   సందర్భంలో తన మానసిక పరిస్థితిని ఉన్నదున్నట్టు  వ్రాసారు.

 

అంతటి మహనీయుడు మన భారతదేశంలో జన్మించాడు అంటే మనకెంతో గర్వకారణం...

వారు చూపిన దారిలో కొంతవరకైనా పయనిద్దాం.

 

కె మల్లికార్జునరావు. తెలుగు తేనియలు

 

కె మల్లికార్జున రావు బెంగళూరు

బాపు అంటే   బోసినవ్వు

బాపు అంటే చేతి కర్ర

బాపు అంటే రోజూ మన దైనందిక జీవితం లో వాడే పచ్చ నోటుమీద చూసే  ఒక చిత్రం. ఇవి మాత్రమే

కాదు గాంధీ అంటే!!

నోటు మీద అంకెలు

మారగానే ఆయన విలువ మారుతుందా??

నోటు మీద ఉండి గాంధీ ఏమి చెప్పారు?

నల్లధనం దాచుకోమనా!!

సాటివాడిని దోచుకోమనా!!

సంకల్పమొక్కటే చాలు

ఎంత వారినైనా ఎదిరించి

గెలువ వచ్చు అని చెప్పినట్టు

అనిపించడం లేదా?

వందేమాతరం అంటూ

దేశమంతటిని ఒక్కత్రాటిమీద

నడిపిన నాయకుడు

గుర్తురావడం లేదా?

స్వేచ్ఛ విలువ తెలియక

వెర్రిపోకడలు పోయే తరంవారికి

అహింస అర్ధం మరచి

హింసను పోషించే

పెద్దలకి గాంధీ బొమ్మ

ఉన్న నోటు వాడే అర్హత ఉంటుందా??

ఇది చాలా కాలంగా

నాకు జవాబు దొరకని ప్రశ్న

 

కె మల్లికార్జునరావు తెలుగు తేనియలు

 

 

శాస్త్రి అంటే

అది కూడా లాల్ బహదూర్ గారి పేరే అనుకున్నా.. మధ్యనే తెలిసింది. అది ఆయన విద్యకు దక్కిన గౌరవం అని.

నాలాగే ఇంకా ఎవరైనా తెలియని వారి కోసం.

 

  1921 ఫిబ్రవరి 10 బెనారస్ లో ఉన్నత విద్యా సంస్థ (కాశీ విద్యా పీఠ్) స్థాపించబడి గాంధీచే ప్రారంభించబడినది. 1925 లో విద్యాపీఠ్ లోని మొదటి బ్యాచ్ విద్యార్థులలో లాల్ బాహదూర్ గారు తత్త్వ శాస్త్రం,

 నీతి శాస్త్రాలలో మొదటి శ్రేణిలో గ్రాడ్యుయేషన్ చేసారు. అతనికి "శాస్త్రి"

(పండితుడు) అనే బిరుదునిచ్చారు.

బిరుదును బ్యాచిలర్స్ డిగ్రీ అందజేసే విద్యాపీఠ్ ఇస్తుంది కానీ ఇది అతని పేరులో స్థిరపడిపోయింది.

 

ఇద్దరు మహోన్నత వ్యక్తులను ఓకే స్మరించుకోవడం మన అదృష్టం.

బాపూ, శాస్త్రి గార్లకు అంజలి ఘటిస్తూ

 

రమ, కంకిపాడు తెలుగు తేనియలు




 మహాత్మా గాంధీజీ 151 జయంతి సందర్భంగా

మా మది దైవం

పల్లవి:

మా ప్రియ నేత వు నీవే నయ్యా! మోహన్ దాసు గాంధీజీ

తరములు ఎన్నో గడచిన నీవు అమరుడవయ్యా బాపూజీ!

నీ మాటే వేదంలా నీ బాటే సాగెదము

 

చరణం:

శాంతి అహింస లె ముద్దన్నావు- పగయు ద్వేషం వలదన్నా వు

ఒక చెంప కొడితే వేరొక చెంప చూపి

శత్రుల గెలిచా వు- మా మది దైవం అయ్యావు.

 

చరణం:

కులమత ద్వేషం వలదన్నా వు- సేవాభావం మేలన్నా వు

చెడు వినక,కనక,పలుకక నీవు

బ్రతికి చూపా వు- విశ్వ శాంతిని కోరావు

 

చరణం:

సత్యా గ్రహము చేపట్టావు - స్వాతంత్ర్యము ను తెచ్చావు

బలవంతులైన ఆంగ్లేయుల పై

జయమే పొందావు - జాతికి ప్రాణం పోసా వు

 

 

చరణం :

మద్యపానము కీడన్నావు - శాకాహారం భేషన్నావు

పరదేశ దాస్యం హృదయాల త్రుంచి

స్వదేశ భక్తి పెంచావు - దేశ గౌరవం కాపాడావు

 

చరణం :

ఇంటితో పాటు మరుగు దొడ్లను శుభ్రం చేయాలన్నా వు

మన తనువు, మనసుల శుభ్రత తోనే

ఆరోగ్య మన్నావు - స్వచ్ఛ భారతం కాంక్షించావు.

 

డి.రామ నాగేశ్వరరావు, భీమవరం తెలుగు తేనియలు

 

మహాత్మా గాంధీ జీ 151 జయంతి సందర్భంగా

సీ.సత్యమ్ము,మరి యహింస లె ఆయుధాలుగా

సమరాన్ని సాగించె సజ్జనుండు

రక్తపు బొట్టు ను రిక్తమ్ము కానీక

స్వాతంత్ర్య ఫలమిచ్చె సజ్జనుండు

బోసి నవ్వుల తోడ భువనాల నవలీల

శాంతిని స్థాపిం చె సజ్జనుండు

కండలు లేకున్న ఘనమైన విజయాలు

సాధిం చె  బ్రతుకులో సజ్జ నుండు

తే.గీతి.చెడు ననుట, వినుట, కను   చేటు తెచ్చు

నంచు బోధించి,తానాచరించి చూపి,

స్వచ్ఛ భారతమును మనసార కో రె

తరములు గడచినను గాంధి శరణు మనకు.

 

డి.రామ నాగేశ్వరరావు, భీమవరం తెలుగు తేనియలు

 

గాంధీజీ స్మృతిపధం

 

నా స్మృతి పధంలో కూడా గాంధీ గారి ప్రభావం అంతో ఇంతో  ఉంది .. అది కొంతవరకూ మీతో పంచుకుందామని చిన్న ఆలోచన 

 

నా చిన్నతనం, ప్రాధమిక విద్య అంతా బందరులోనే. బందరులోని వివేకానంద మందిరంలో ప్రతి వేసవికాలం పట్టణంలోని పురప్రముఖుల, మహానుభావుల ప్రోద్బలంతో ఉచిత శిక్షణా శిబిరాలుఅభ్యాసం వంటివి జరిగేది. ప్రఖ్యాత చిత్రకారులు ఎన్నో మెళుకువలు నేర్పించారు.. నేను అభ్యాసం సరిగా చేయలేదనుకోండి, అది వేరే విషయం  

 

కొద్దిగా బొమ్మలు అభ్యాసం చేస్తున్నప్పుడేబాపూజీ బొమ్మ గీయడానికి ఎంతో ఆసక్తి చూపించవాడిని..ఆయన ఆహార్యం, దరహాసం, కళ్ళజోడు ఎంతో ఆకట్టుకునేవి

నేను 6 తరగతి లో ఉన్నప్పుడు అని గుర్తు, Town Hall లో గాంధీ జయంతి కి ఒక వారం ముందు  వ్యాసరచన పోటీలు నిరవహించేవారు. గాంధీ జయంతి రోజున భమిటి ప్రధానోత్సవాలు జరిగేవి అలా వ్యాసరచన పోటీలకు వెళ్లడం అలవాటుగా మారింది. నిమ్మదిగా కొన్ని వకృత్వ పోటీల్లో పాల్గొనడం అలవాటు. ఇంగ్లిష్ మీడియం లో చదువుకోవడం వలన, తెలుగులో చాలా తప్పులు వ్రాసేవాడిని.. మా తెలుగు మాష్టారు జోసెఫ్ గారి దిద్దించిన తెలుగు అక్షరాలూ ఎప్పటికీ మరచిపోలేను    

 

నిమ్మదిగా మహాత్ముని గురించి మరింత తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మా నాన్నగారు కొన్న పుస్తకం My Experiments with Truth చదవడం మొదలుపెట్టాను.

 

నేను జీవితంలో చదివిన మొట్టమొదటి ఆత్మకథ పుస్తకమే. మహాత్మ, జాతిపిత  అని అందరిచే అని పిలవబడుతూ, కోట్లాది ప్రజల అభిమానం, లక్షలాది దేశభక్తులను స్వాతంత్య్ర సమరంలో స్వచ్చందంగా దేశ సేవకై వెళ్లారంటే ఒక నాయకుడిగా ఆయన ప్రభావం ఎంత గొప్పదో కదా అనిపించేది    

 

మహాత్మ, జాతిపిత వంటి గొప్ప బిరుదుల కన్నా ఆయనలోని సత్సంకల్పం, ఉప్పుసత్యాగ్రహం అనే వినూత్నమైన ఆలోచన, విదేశీవస్తు బహిష్కరణ, సత్యదీక్ష వంటి మహత్తరమైన ఆలోచనలు చూస్తే ఆయన లోని నాయకుడిని, కోట్లాది మంది ప్రజలపై శాశ్వతంగా ఆయన సృష్టించిన ప్రభావం, ఆయన సిద్ధాంతాలవైపు ఆకర్షితులవ్వడం ఎప్పటికీ అద్భుతంగా గోచరిస్తుంది 

 

కస్తూరి శివశంకర్ తెలుగు తేనియలు

 

తాతా! వింటున్నావా ?

తాతా!

మా ఊరి సెంటర్లో నీ బొమ్మ చెయ్యి విరిగి

చాన్నాళ్లయింది..!

కాలు చిట్లి ఎన్నేళ్ళయిందో..

చెవు ఎప్పుడు  తెగిపడిందో ఏమో

తల మీద రెట్టలు పడి ఏళ్ళయింది..

కాలి వేళ్ళ గురించి ఆరా తీసేదేవరని?

ఛిద్రం కాకుండా భద్రంగా వున్న

చేతిలో కర్ర మాత్రం

పార్టీల జెండాలు మోయడానికి

నెలవయ్యిందిప్పుడు..

 

మన్నించు తాతా!

ఉపయోగపడే వాటికే విలువిక్కడ..

పనిచేయని వాటిని

పనికిరాని వారిని

లెక్క జేయరిక్కడ..!

 

నువ్వైనా..నేనైనా

సొమ్ముల్లేని ఎవరైనా!

    

వసుధ తెలుగు తేనియలు

 

 

 జాతిపిత:

 

ఆయన ఆయుధం సత్యాగ్రహం, ఆయన మంత్రం అహింస, ఆయన మార్గం సత్యం!!

 

మనది ,.మన సొంతం అయినది పొందడం కోసం మనిషిని కొట్టక్కర్లేదు దేశం మాదహో అని గోల గోల చేస్తే చాలు...స్వాతిముత్యం లో శివయ్యలా "నా ఉద్యోగం " అని వెంటపడేసరికి .. ఇదిగోనయ్యా బాబూ 'నీదేశం' జార్తగా చూసుకో అని మనచేతుల్లో పెట్టి వెనక్కి తిరిగిచూడకుండా పారిపోయారు!!

 

ఒక్కడే కదా, మహా బక్కగా ఉన్నాడు , ఏం జేస్తాడులే అనుకున్నారు పాపం, పెద్దాయన మహా శక్తి అవుతాడని ఊహించలేదు , ఎన్నాళ్లులే వాళ్ళే వెనక్కి తగ్గుతారు అనుకున్నవాళ్ళకి చుక్కలు చూపించారంతే .

 

ఆయన నుంచి తెలిసినదేమయ్యా అంటే...

1. ఉద్యమాలు చేయడానికి డ్రెస్ కోడ్ అక్కర్లేదు.

2. ఆహారానికి నియమాలు కాదు ఆహార నియమాలు పాటిస్తే చాలు.

3. మనం మాత్రమే శుభ్రంగా ఉంటే చాలదు, మనసు శుభ్రంగా ఉండాలి. అంటే నిజం లోపల దయచేసిబయటకి '' ని వదలకూడదు.

4. అహింసని మించిన హింస లేదు, మౌనాన్ని మించిన ఆయుధం లేదు.

ఎక్కడైకైనా బయటకి వెళ్లినపుడో, ఏదైనా ఊరు వెళ్లినపుడో ఆయన విగ్రహం కనిపించినపుడల్లా నేను ఒక నిముషం ఆగి 'పెద్దాయన' మామూలోడు కాదు అని దణ్ణం పెట్టుకునేదాన్ని !

 

అప్పుడెప్పుడో సెలవులకు వెళ్ళినపుడు జెనీవా లో unices చుట్టుపక్కల తిరుగుతుంటే , దూరంగా ఒక విగ్రహం కనిపించింది, చూస్తుంటే మనోడిలానే ఉన్నారే అని దగ్గరికి వెళ్తే , ఆయనే ప్రశాంతంగా కూర్చుని పుస్తకం చదువుకుంటున్నారు ,ఎందుకో తెలియదు కంటినుంచి ఒక నీటి చుక్క పడి అప్పుడే కురుస్తున్న వర్షంలో తడిసిపోయింది...  హమ్మయ్యా మనవాళ్ళు ఒకరు కనిపించారు అనిపించింది !!

 

I have nothing new to teach to the world.

Truth and non violence are as old as hills

 

M.K.Gandhi

 

దేశనేత

 

గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణ చేస్తే , మహామూర్తి కుల వారసత్వాన్ని తెలిపే తన ఇంటిపేరు ' శ్రీవాస్తవ ' ని వదులుకున్నారు లాల్ 'బహదుర్' గారు, ఆయన చదువుకున్న డిగ్రీతో వచ్చిన 'శాస్త్రి' పట్టా ఆయనతో ఉండిపోయింది . గాంధీ, వివేకానంద ,అనిబిసెంట్ సేవలు చూసి ప్రభావితమైగాంధీగారి ప్రసంగం విని పదవతరగతి పరీక్షకు 3 నెలల ముందే గాంధీగారిని కలిసి మనం మనం దేశంకోసం అన్నారు!!

 

అంటరానితనం నిర్మూలన ,హరిజనుల అభివృద్ధి ఈయన ధ్యేయం , ఉత్సాహవంతమైన వారిని ఎన్నుకుని మాతృభూమి కి సేవచేయడానికి తర్ఫీదునిచ్చే Servants of the people society (lok sevak mandal)  కి ప్రెసిడెంట్ గా చేసారు, SOPS ని స్థాపించినది శ్రీ లాలాలజపతి రాయ్ గారు .

 

మన దేశంలో పాల ఉత్పత్తులు పెంచడం కోసం కురియన్ మొదలుపెట్టిన ఉద్యమం OPeration flood ని శాస్త్రి గారు ప్రోత్సహించారు. .. రైతుల మధ్య దళారి వ్యవస్థ పోయి వాళ్ళు తయారుచేసుకునే ఉత్పత్తుల మీద వారికి అధికారం ఉండాలనేది ఉద్యమం ముఖ్యోద్దేశం , ఇది national dairy development board వారి ప్రాజెక్ట్ , ఇప్పుడు ప్రపంచంలోనే అధిక పాల ఉత్పత్తి దేశంగా మన భారతదేశము మొదటిస్థానంలో ఉంది. అదే ఇప్పుడు శ్వేత విప్లవం(white revolution) All this was achieved not merely by mass production, but by production by the masses!! 

 

హరితవిప్లవం(green revolution) ని కూడా శాస్త్రిగారు ప్రోత్సహించడం వల్ల పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఆహారాధాన్యాల ఉత్పత్తి పెరిగింది.

 

మహానుభావులు పుడుతూనే గొప్పవారు కాలేదు, వీరి జీవన విధానం, వీరు ఎన్నుకున్న సేవా మార్గం  , మనకేం ఏం లాభం అనుకోకుండా, మనవల్ల ఏం లాభం ? అనే దృక్పథం వారిని గొప్పవారిని చేసింది.

 

వారిని గౌరవించడం అంటే వారిలా మనం ఉద్యమాలు చేయనవసరం లేదు , వారిచ్చిన పవిత్ర భారతమాత ని జాగ్రత్తగా స్వచ్ఛంగా ,అచ్చంగా మన బిడ్డలా చూసుకుంటే చాలు!

 

The preservation of freedom , is Not the task of soldiers alone....

The whole nation has to be strong

      

LalBahadur Sastry

 

నీ ధర్మం.. నీ సంఘం.. నీ దేశం.. నువు మరవద్దు

జాతిని నడిపి.. నీతిని నిలిపిన.. మహనీయులనే మరవద్దు

 

విష్ణుప్రియ తెలుగు తేనియలు



 

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ!

మన నేతాజీ...

స్వరాజ్య దేశంలో నీతిగా ఉండమన్నాడు.

కానీ అవినీతి రాజ్యమేలుతోంది....

ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్నాడు.

కానీ మన బ్రతుకులమీద, కడుపులమీద కొడుతున్న దేశమైపోయింది...

ఒక స్త్రీ నిర్భయంగా భద్రత లేకుండా అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై నడిచే రోజు అసలైన స్వతంత్రం అన్నాడు.

కాని స్త్రిమూర్తికే రక్షణ లేకుండా పోయింది...

గాంధీ కలలుగన్న నా దేశం కల్లోలం ఐయిపోయింది..

కలంకంతో మైలుపడిపోయింది...

డబ్బుకట్టలపై ఉండే గాంధీని చూస్తున్నారు తప్ప గాంధీ ఆశయాలు ఎవరు పాటిస్తున్నారు.

ఇప్పుడు గాంధీ ఉండి ఉంటే గళ్లపెట్టెల్లో  దాచిన డబ్బును తెరుస్తాడు

అవినీతి చేసే వాడి గుండెల్లో నిద్రపోతాడు.

అసలైన స్వరాజ్యం కోసం తిరుగుబాటు చేస్తాడు.

కామాంధుల కళ్ళుపీకి న్యాయ దేవత కళ్ళు తెరిపిస్తాడు.

స్త్రీ మూర్తికి అండగా దొడ్డు కర్ర పట్టుకుని తనతో నడిపిస్తాడు...

అలాంటి గాంధీ మళ్ళీ పుట్టాలని కోరుకుంటూ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ. . .

మీ సూర్య తాడిపూడి తెలుగు తేనియలు

 


అక్టోబర్ 2

1869 లో మహాత్మా గాంధీ ( మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ) గారు సత్యం,

ధర్మం, ఆహింస అంటూ  1904 లో లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్, జై కిసాన్ అంటూ జన్మించారా అనిపిస్తుంది .

 

సందర్భం గా మనల్ని మనం అడగాలి ఇలా :

1.బద్ధకం విడిచి పొద్దున్నే నిద్రలేస్తున్నామా .

2.ప్రార్ధన ,యోగ ,నడకల లాంటి వ్యాయామాలు చేస్తున్నామా .

3.కొన్ని వందల మందికి మంచి పనులు , విషయాలు అందజేస్తున్నామా .

4.మనతో స్నేహితులు ఉండేందుకు మనస్పర్ధలు లేకుండా వుంటున్నామా .

5.యుద్ధాలు ,తగాదాలు రాకుండా, లేకుండా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామా .

6.ఇంటినీ, పరిసరాల్ని శుభ్రం గా వుంచుతున్నామా .

7.విదేశీ వస్తువులను కొనకుండా వుంటున్నామా .

 

మురళి మోహన్  

 

 

మహాత్మా గాంధీ గారికి నివాళితో

 

అహింసయే నీ మతము

శాంతియే నీ స్వరము

తెల్లవారిపై జరిపితివి  పోరాటం

అలుపెరుగని ఆశల ఆరాటం

శబ్దం రాని శక్తి నీ ఆయుధం

సహాయ నిరాకరణోద్యమం

దండి  ఉప్పు సత్యాగ్రహం

తెప్పించె తెల్లవారికి ఆగ్రహం

చేసితివి కారాగార వాసం

అయినను నీ మనోబలం

అనిర్వచనీయం  అజరామరం

ఆచరణే అనందం అంటూ వడికావు రాట్నం

ఎల్లరకు అయ్యావు స్ఫూర్తి దాయకం

నీ బాటే మాకు అనుసరణీయం

నీవు కాదా మాకొక వరం

 

 లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళితో

 

లాలబహదూర్  శాస్త్రీజీ

మీపేరులోనే వుంది బహదూరి

పొట్టివాడైనను గట్టివాడేనని

చెప్పడానికి ఉదాహరణం  మీరే మరి

జై జవాన్ జైకిసాన్ నినాదాన్ని

ప్రతిధ్వనింపచేసిన స్ఫూర్తి ప్రదాతవు

చైనా ముష్కరులకు పాఠం చెప్పి

అమర లోకాలకు పయనమయ్యావు

జై జవాన్ జై కిసాన్

 

అవళూరు సీత తెలుగు తేనియలు

 

 

శాస్త్రి గాంధీ గార్ల జన్మదినం

సనాతన దేశంలో సంస్కృతీ నిలయంలో

పరపాలన పీడనలో దుష్టపాలకులనెల్ల

పారద్రోలిన పరమాత్మలు శాస్త్రీజీ, శాంతిదూత

ఆత్మబలమే ఆయుధముగా అవతరించిన

బక్కపల్చని రూపాలు బాహుప్రజ్ఞా శాలులు

జై జవాన్ జై కిసాన్ రూపకర్త బహదూర్

అహింసావాదమే ఆయుధంగా కదలిన మహాత్ముడు

మీ విలక్షణా శైలితో సాధించిన స్వాతంత్రం

స్వేచ్చా వాయువు పీల్చే స్వాతంత్ర్య దేశం

స్వాతంత్ర్య పోరాట యోధుల్లారా

స్వరాజ్య స్థాపకుల్లారా దివిలో నిల్చిన దివ్వెల్లారా

జగత్తున జన్మదిన శుభాకాంక్షలు

వి. వి. శ్రీనివాస్ – తెలుగు తేనియలు



గాంధీ జయంతికి ఓకవిత పేరు: కలం-కులం!

కలాలెన్నో కులాల గుఱించే వ్రాస్తున్నాయి,

కలకలాన్ని రేపేస్తున్నాయ్!

ఇల, సమసమాజం బాపూజీ కన్నకల!

కలానికీ కులకాలుష్యమంటితే,

కల నిజమయ్యేదెలా?

చమత్కార కవి – తెలుగు తేనియలు

 

మహాత్మా గాంధీ గారి 151 జయంతి ,లాల్ బహదూర్ శాస్త్రిగారి జయంతి సందర్భంగా

 

గాంధీజీ గురించి

పోరుబందరులో పుట్టిన పోరాట యోధుడు. భారత మాతకి ముద్దుబిడ్డడు. తల్లిదండ్రుల మాటకి విలువనిచ్చినవారు మన గాంధీజీ.చిన్న వయసులోనే భారత,భాగవత,రామాయణాలను ఔపోసన పట్టినారు.

బాల్యము నుండి సత్యవాక్య పరిపాలకుడు.శ్రవణ కుమారుని కథ తన జీవితముపై అత్యంత ప్రభావాన్ని చూపించింది. సత్యహరిశ్చంద్ర నాటకము చూసి జీవితములో ఎన్నడూ అబద్దాన్ని కూడా ఆడలేదు. బారిష్టర్ చదువు చదివినా,ఏరోజు ఆడంబరాలకు పోలేదు. మద్యం, మాంసం, మగువను ముట్టనని తల్లికి వాగ్దానం చేసినారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోశారు.బ్రిటిష్ వారి గుండెల్లో సింహ స్వప్నమయ్యారు. క్విటీ ఇండియా ఉద్యమాన్ని చేపట్టినారు. సత్యము,అహింసలే ఆయుధాలుగా బ్రిటిష్ వారిని తరిమికొట్టారు. విదేశీ వస్తు బహిష్కరణ చేశారు.స్వదేశీ వస్తువులను అందరిచే కొనిపించారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమముతో దండి యాత్రను దండయాత్రగా మలిచారు. అంటరానితనాన్ని నిరసించసారు.బడుగు,బలహీనులను ఆదరించారు.స్వార్ధమన్నది లేకుండా దేశ సేవ చేసిన మహానుభావుడు మన బాపూజీ. బోసి నవ్వులతో  మనందరి మనసుల్లో కొలువుదీరిన గాంధీజీ.నూలు వడికి ఖద్దరు వస్త్ర ధారణ చేసినారు. రవి అస్తమించని  బ్రిటిష్ వారి సామ్రాజ్యం పునాదులను కదిలించినవారు. జాతిపితగా మనందరి మనసుల్లో కొలువైనాడు. మహాత్మగా మదిలో నిలిచారు. గ్రామస్వరాజ్యము రావాలని కోరుకున్నారు.దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని భావించారుస్వాతంత్ర్యము కోసము అహర్నిశలు కృషి చేసి చిరస్మరణీయుడయ్యాడు.

లలితా రెడ్డి – తెలుగు తేనియలు

 

 

తేట గీతి

కంపు గొనకయ కల్ప వృక్షముల పుష్ప

సౌరభం బిట్టిదని చెప్పజాలువారు

ఎందుఁజూచినధాత్రి లో హృదయదృష్టి

కవులుగానని మర్మంబు గలదె జగతి !

రచన కేతన, ఈయన తిక్కన పెద తండ్రి.

 

మా సురెష్ – తెలుగు తేనియలు

 

 

చిన్న కవితలు

గాంధీ తాత:

 

మహాత్మాగాంధీ అనగా ఎవరు

ఒక నాయకుడా, ఒక యోధుడా,

ఒక తత్వవేత్తా, ఒక సద్గురువా,

కాదు కాదు , అతనొక బ్రహ్మర్షి,

గీతను ఆచరించిన అర్జునుడు,

విశ్వము నేలిన అపర బుద్ధుడు.

 

లాల్ బహదూర్:

 

పొట్టి వాడని పెదవి విరిచారంత

రాజకీయ సహచరులు , శత్రులు,

రణం ముందున్నా  భయమొందక,

జై జవాన్ జై కిసానని నినదించాడు,

గట్టివాడినని రుజువు చేసి చూపాడు,

అతడే మన లాల్ బహుదూర్ శాస్త్రి.

 

కె మల్లికార్జునరావు

 

 

లాల్ బహుదూర్ శాస్త్రి విశిష్ట వ్యక్తిత్వం

అప్పట్లో……

ఆయన నెల జీతం ₹50/-

ఒకసారి చాలా అవసరంగా ₹100/-కావల్సి వచ్చాయి.

ఎక్కడ ప్రయత్నించినా డబ్బు సమకూడలేదు.

ఆయన పరిస్థితి గమనించిన ఆయన భార్య" నా దగ్గర వున్నాయి" అని ₹100/-ఇచ్చింది.

"ఎక్కడి"వని ఆశ్చర్యపోయి అడిగాడు.

"మీ జీతం నెలనెలా ₹50/-నాకు ఇస్తారు కదా, జాగ్రత్తగా వాడి నెలకి ₹5/- మిగిల్చేదాన్ని.అలా పోగు చేశాను" అని చెప్పింది భార్య.

వంద రూపాయలు తీసుకున్నాడాయన. అవసరం తీరింది.

మర్నాడు ఆయన పనిచేస్తున్న సంస్థకు" అయ్యా.. మీరు

నాకు ఇస్తున్న ₹50/-జీతం నాకు ఎక్కువ. నెల నుండీ

₹45/-ఇవ్వండి చాలు"అని ఉత్తరం రాశాడు.

సంస్థ పేరు కాంగ్రెస్ పార్టీ.

ఉత్తరం రాసిన మహానుభావుడు తర్వాత భారత ప్రధాని అయిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు.

అలాంటి నాయకులు వుండే వారు అని చెప్తే ఇప్పటి తరం వాళ్ళు నమ్ముతారా?

జైహింద్ !

ఇలాంటి వ్యక్తులు ప్రపంచంలో అరుదుగా జన్మిస్తారు..

 

కె మల్లికార్జునరావు – తెలుగు తేనియలు

 

 

గాంధీజీ వ్యక్తిత్వం

 

ఒక జ్ఞాన తపస్వి

ఒక ఇంద్రియ విజేత

ఒక త్రికరణశుద్ధి కర్త

ఒక గీతా అధ్యయత

ఒక మహా త్యాగశీలి

ఒక ఋజు వర్తనుడు

ఒక అహింసా యోధ

ఒక శాంతి స్వరూపుడు

ఒక ధర్మ పాలకుడు

ఒక మత సహనశీలి

ఒక సమయ పాలకుడు

ఒక సత్య శోధకుడు

ఒక మానవతా వాది

ఒక దీన జన హితుడు

ఒక గతపు అద్భుతం

 

కె మల్లికార్జునరావు – తెలుగు తేనియలు

 

అందాలకు మెరుగులు కాదు చెల్లీ                        

ఆపదలో పోరాడే    ఆత్మస్థైర్యం నేటి అవసరం
 ఉరికొయ్యలకు వేళ్ళాడిన పీనుగులు  
మృగాలుగా పెరిగిన మగాళ్లని మార్చలేవు  


కత్తి పట్టిన ఝాన్సీ, రుద్రమల నేలిది.   
కాని పనికాదు నీకు కామాంధుల వధ   


చేవ చచ్చిన లోకం  చోద్యం చూస్తోంది..    
ఇక్కడ నీ యుద్ధం నీదే  విజయమూ నీదే.  


డా. నాగులపల్లి – తెలుగు తేనియలు

 

2 కామెంట్‌లు:

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...