15, అక్టోబర్ 2020, గురువారం

11.10.2020 పుస్తక సమీక్ష & రచనలు

 


తెలుగు తేనియలు

పుస్తక సమీక్ష & రచనలు

11.10.2020, ఆది వారము
***************** 

 1️. అమరావతి కథలు - మాయ 

 

సుబ్బయ్యశెట్టి అనేది అచ్చ తెలుగు పేరేమో.....మా  చిన్నతనంలో ఇంటి ఎదురుగా గట్టి పకోడీలు, పప్పు చేగోడీలు,జంతికలు, రోజా పూవు చేగోడీలు వేడి వేడిగా తయారు చేసి ఇచ్చే వాళ్ళు.  అతగాడిని నేను సుబ్బయ్య శెట్టి అని పిలిస్తే మహా చిరాగ్గా సుబ్బారావు అని పిలూ అనే వాడు.

ఇప్పుడు త్రాసులు మారినా, రాళ్లు మధ్యలో పెట్టకుండాచివ్వరకంటా పెట్టి ఎదో జిమ్మిక్కులు చెయ్యడం అమ్మే వాళ్ళకే తెలుసు.  కాశీ తువ్వాలు లేని సుబ్బయ్య శెట్టిని గళ్ళ పెట్టి లేని సుబ్బయ్య కొట్టుని ఊహించగలమా... ఇలాంటి సుబ్బయ్య శెట్టిలు ఏ MBA చదవక పోయినా వాళ్లకు తెలియని management లేదు, వాళ్లకు రాని అకౌంటన్సీలేదు అంటే నమ్మండి.

 

కష్టాన్ని నమ్ముకున్న సుబ్బయ్య గాలి భోంచేసి డబ్బు నీళ్లలా ఖర్చుపెట్టకుండా ఆస్తి కూడ బెట్టాడు.  అంతా మాయ అనుకుంటూ మాయా సంసారం విడిచాడీ సుబ్బయ్య.  లోభికి రెట్టింపు సెలవు అని ఊరికినే అన్నారా.....

 

జయహో అమరలింగేశ్వరా...జయహో సత్యం గారు....

 


 

2️అమరావతి కథలు -  నివేదన 

 

నమ్ముకున్న అమరలింగేశ్వరుడు కరుణించక పోతే ఎంతటి వారైనా కోటిలింగం వలే దిగాలు పడవలసిందే కదా.  శివరాత్రిలో ఎంతమంది కోటి లింగాలు మొక్కు తీర్చుకోవడానికి వస్తారో...

నిజమేనేమో ఆ శివయ్య లీలలు ఎవరి కెరుక కోటిలింగాన్ని ఉపోషం ఉంచడానికి ఆలా చేసాడేమో.. ఆహా ఏమి వర్ణన. శివయ్య ని చూడాలనే తపన, దాని కోసం కోటిలింగం పడే పాట్లు, చివరకు శివయ్య సన్నిధిలో మోక్షం ఎంతమందికి ఆ అదృష్టం.

 

జయహో అమరలింగేశ్వరా...జయహో సత్యం గారు....

 

3️అమరావతి కథలు -ధర్మపాలుడు

 

మునసబు హనుమయ్య వర్ణన తోనే హడలెత్తించారు. ఏడు అడుగుల విగ్రహం అంటేనే భయమేస్తుంది. ఇక ఆయన హయాంలో శిస్తు బకాయి ఏమి ఉంటుంది? పెద్దవాళ్ళను వాళ్లకు తగ్గ రీతిన, అలాగే రైతులను వాళ్ళ కు తగ్గ రీతిలో మాట్లాడి శిస్తు వసూలు చేసేవాడు హనుమయ్య. చక్కటి ధర్మ పాలన.  చీవాట్లు,శిక్ష అలాగే మళ్ళీ జాలి కలగలిపిన వ్యక్తిత్వం హనుమయ్యది.  అంతటి ధర్మపాలుడు కాబట్టే, సర్కారు వారి మనసు కరిగింది.

 

జయహో అమరలింగేశ్వరా...జయహో సత్యం గారు....


 

 

4️అమరావతి కథలు -నాన్న-నది

 

సీతయ్య చిన్న వాడు కాక పోయినప్పటికీ, ఎంతటి వాడికైనా, తల్లి, తండ్రి చనిపోవడం తట్టుకోలేని సంఘటనే కదా జీవితంలో.  నాన్నతో జ్ఞాపకాలు ఎంత చెప్పుకున్నా తనివి తీరుతుందా?

నిజమే అప్పుడు ఒక్క సారి ముసలితనం వచ్చి పెద్ద వాళ్లమైపోయామనిపిస్తుంది.  పోయినోళ్ళు ఎప్పటికీ అదృష్టవంతులే కదా..సీతయ్య లాంటి ఎన్ని జీవితాలు కృష్ణ తో ముడి పడి ఉన్నాయో కదా..  ఇదే జీవితం ఇదే బాధ్యత, కర్తవ్యమ్ గుర్తు చేసే తత్త్వం.

 

జయహో అమరలింగేశ్వరా...జయహో సత్యం గారు....

 

5️అమరావతి కథలు -కీలుగుర్రం

కీలుగుఱ్ఱం ఉత్సవం చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు. ఐదడుగుల ఎత్తున్న కంచు విగ్రహమంటే ఎంత గంభీరంగా ఉంటుంది. ఆ స్వామిని అలంకరించితే ఎంత ఠీవిగా ఉంటారో కదా. స్వామి వారి అలంకరణ వర్ణన చదివి తీర వలసిందే తనివి తీరా చూడ వలసిందే.  దేహ దారుడ్యo గల నలుగురు ఉంటె కానీ ఆ ఉత్సవం పూర్తి కాదు.  వారు అలసి పొతే చేయి మార్చు కోడానికి ఇంకో నలుగురు కావాలి. 

ఆలా అందరూ ఉత్సాహంగా కోలాహలంగా ఉత్సవానికి సన్నాహాలు చెస్తూ హర హర మహా దేవా అని స్వామికి ఉత్సవం జరిపించారు....

 

జయహో అమరలింగేశ్వరా...జయహో సత్యం గారు....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

తెలుగు తేనియలు


 

తెలుగు తేనియల ప్రణాళిక అంశమైన పుస్తక సమీక్షలో భాగంగా తెలుగు సాహిత్యానికి విస్తృత సేవలందించిన మహోన్నత మహాకవుల పాదాలకు వందనము చేస్తూ విశ్వనాథ వారి నవలను పరిచయం చేయబోయే ప్రయత్నం.

గ్రంథం పేరు: హాహా హూహూ

రచయిత : కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ

 

కవి పరిచయం: జగద్విఖ్యాత కవి సమ్రాట్ బిరుదాంకిత విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి తెలియని తెలుగు పాఠకుడు ఉంటాడా!  ఒకవేళ పరిచయం మొదలెడితే కనీసం పది పేజీల  పరిచయ నివేదికను పాఠకుడి కందించాలని తెలుపు కుంటూ ప్రధాన అంశం గురించి పరిచయం చేస్తున్నాను.

 

 ఇతివృత్తం/ నేపథ్యం: ఆకాశంలో ఎగురుతూ ఉన్న ఒక గంధర్వుడు స్పృహ తప్పి పోయి లండన్ నందు పడిపోయిన సందర్భంలో తత్పరిణామాలను తెలియజేసే అద్భుతమైన ఊహాజనిత, సృజనాత్మకత మేథోవికాస సన్నివేశాల కల్పనతో రూపొందించిన కథ

 

 నవల పరిచయము

 

 ఆకాశంలో ఎగురుతూ ఆ గంధర్వుడు స్పృహ తప్పి లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో పడిపోతాడు.   అదేదో వింత జంతువు అనుకొని చుట్టూ జనం మూగుతారు. ఆ జంతువు మెడ వరకు మనిషి, తల మాత్రము గుఱ్ఱపు తల, జూలు, నిక్కిన చెవులు కలిగి నుదుటిన నిలువు బొట్టు ఉంది. రత్నపు బంగారు ఆభరణాల తో ఉన్న వింత జీవిని చూసి అది ఏమిటై ఉంటుందా అని మూగిన జనము తర్కించుకుంటారు. ఆ తర్వాత రక్షక భటులు వచ్చి, ఆ వింతజీవి ఎవరికీ హాని చేయకుండా చుట్టూ ఒక పెద్ద బోను నిర్మిస్తారు. కొన్ని రోజులకు ఆ వింత జీవిగా కనిపించే గంధర్వుడు మేలుకొని ప్రాకృతంలో మాట్లాడటం ప్రారంభిస్తాడు.

 

 ఆయన ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అంతు పట్టదు. దగ్గరగా వింటే ఏదో పెద్ద సవ్వడిగా జంతువు అరుపుగా వినిపిస్తూ దూరానికి ఏవో మాటలు గా వినిపించడం గమనించి  లండన్ విశ్వవిద్యాలయం లోని సంస్కృత పండితులు ద్వారా  ఆ భాష సంస్కృతానికి దగ్గరగా ఉన్నదని కనిపెడతారు.

 

ఆ వింత జీవి మాట్లాడే భాషను అర్థం చేసుకుని దానికి కావలసిన ఏర్పాట్లు చేయడం మొదలెడతారు. ఆ జీవి స్నానమాచరించి,  పండ్లు తిని ధ్యానం లోకి వెళుతుంది. రాత్రంతా ధ్యానంలో ఉంటుంది. ఈ వింత అంతా పత్రికల్లో అబ్బుర పరిచే వార్తగా ప్రచురితం అవడంతో రోజు అనేక మంది వింత చూడడానికి వస్తారు. యూరప్ దేశాల నుంచి మేధావులు, పండితులు, శాస్త్రవేత్తలు వచ్చి దాని విషయం పరిశోధన చేయాలని లండన్ కు వస్తారు. పండితులు ఆ మృగం తో సంస్కృతం లో మాట్లాడడం వివరాల సేకరణ చేయడం జరుగుతుంది. ఒక పండితుడు నీ పేరు హా హా హూ హూ కదా అంటాడు. దానికి ఆ గంధర్వుడు విచిత్ర ఆహాభావాలు వ్యక్తం చేయగా అప్పటి నుండి ఆ గంధర్వు ని పేరు హా హా హూ హూ గా పెట్టబడింది.

 ఇక నిత్యం దానితో పండితులు తర్కముగా మాట్లాడడం ప్రతి అంశమునకు గంధర్వుని వితార్కపు సమాధానం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఈ విషయాలన్నీ గొప్ప ఊహాజనితంగా హిందూ దేశ సంస్కృతిని ఉన్నతంగా చూపించే విధంగా విశ్వనాథ వారు వ్రాయడం అబ్బురము కలిగించక మానదు. జంతు శాస్త్రవేత్తలకు పండితులకు గంధర్వుడు చేసే సంవాదం మానవుని కంటే ఉన్నతమైన నాగరికత గల వాడుగా ఆ వింత జీవి అనిపించడం సర్వ మానవ జాతిని ఆలోచింప చేస్తుంది.

 

మృగరూపంలో ఉన్న మనిషి ధ్యానం మరియు తపశ్శక్తి తో పక్షిగా మారడం, పండితులను మేధావుల ను ఆలోచింప చేసే సమాధానాలు చెప్పడం అదేదో దేవ లోకం నుండి వచ్చిన జీవి అనిపిస్తుంది. చివరిలో సంగీతం ఆలపించే వారిని అనుకరించి తాను శ్రావ్యమైన  సంగీతం ఆలపించి అదృశ్యం అవ్వడం మేఘాల్లో మెడలో తంబురతో ఆ గంధర్వుడు వెళ్ళడం చూసి పండితులు అందరూ ఆశ్చర్య పోవడంతో నవల ముగుస్తుంది.

 

ముగింపు

 

గొప్ప కల్పనలతో పురాణ విషయాలను తీసుకొని తన సృజనాత్మక శక్తి తో నవలా శిల్పం చెక్కడం విశ్వనాథ వారికి వెన్నతో పెట్టిన విద్య. నవల ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. మానవుని స్వభావం, దైవ సంబంధ మైన అనేక అంశాలు నవల అంతర్లీనంగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. వాద ప్రతివాద సంవాదములతో వైవిధ్య భరితమైన కథగా రచించిన విశ్వనాథ వారి ప్రతిభకు నిదర్శనం ఈ నవల.

విశ్వనాథ వారి నవలల్లో కనిపించే గొప్ప వర్ణనలు, లోకసంబంధమైన అనేక కల్పనలు, విస్తృతమైన విజ్ఞానము ఈ నవలలో అంతగా కనిపించనివ్వకుండా కేవలం కథకు అనుగుణంగా తక్కువ వర్ణనలతో రచించడం గొప్పగా కనిపిస్తుంది. అందరూ చదివి అనుభూతి పొందవలసిన నవలగా "హాహాహూహూ" ఉంటుందని విన్నవించుకుంటూ... తెలుగు సాహిత్యములో గొప్ప పేరొందిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ కళాప్రపూర్ణ కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారి నవలను పరిచయం చేసినందుకు ఆనందానుభూతి ని పొందుతూ....

 

వెంకట్.సిహెచ్.

తెలుగు తేనియలు

 

ఒక కథ

 దేవున్ని మోసం చేయలేము

 

రాజు పదవ తరగతి విద్యార్థి.  కష్టపడతాడు మరియు తెలివైనవాడు కూడా. ఫైనల్ పరీక్షలు దగ్గరకు వచ్చాయి. స్కూల్ ఫస్ట్ రావాలని అతని ఆశ. అతనికి వీక్ సబ్జెక్ట్ లెక్కలు . అందుకని అనుకున్నది సాధించాలంటే తన కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటే ప్రమాదమని దేవుని సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

దగ్గర ఉన్న గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకుని ,  "లెక్కల పరీక్షలో  అన్ని ప్రశ్నలు తనకు తెలిసినవే రావాలని,  అలా వస్తే దేవుడికి ప్రత్యేకమైన పూజ చేయించి  కొంత మొత్తం హుండీలో సమర్పిస్తానని " అని వాగ్దానం చేశాడు.  దేవుడు పలికిన పలకక పోయినా తన వైపు నుండి ఒప్పందం కుదుర్చుకున్నాడు రాజు.

 

పరీక్షలు మొదలయ్యాయి. లెక్కల పరీక్ష రోజు రానే వచ్చింది.. ఆ రోజు పొద్దున మళ్లీ ఒకసారి దేవుడికి తన విన్నపం గుర్తు చేశి దండం పెట్టుకొని పరీక్ష హాలుకు వెళ్ళాడు రాజు . పరీక్షలు హాలు లో ఇన్విజిలేటర్ ప్రశ్నాపత్రం అందరు విద్యార్థులకు అందజేశాడు. మన రాజు  ఇంకొకసారి మళ్లీ దేవుని తలుచుకొని ప్రశ్నాపత్రం చదవడం ప్రారంభించాడు. రాజుకు  ఆశ్చర్యమే ఆశ్చర్యం..  కారణం, అన్ని ప్రశ్నలు అతనికి తెలిసినవే.. మనసులో దేవునికి ధన్యవాదాలు తెలుపుతూ అన్ని ప్రశ్నలకు జవాబులు చక్కగా వ్రాశాడు. తెలిసిన ప్రశ్నలు కావడం వల్ల  నిర్ణీత సమయానికంటే ముందుగానే పూర్తి చేశాడు. ఇంకా ఒక గంట మిగిలి ఉంది.

 

జవాబు పత్రాలు ఇచ్చి వెంటనే వెళ్లి పోదామను కున్నాడు, కానీ రకరకాల కారణాలు అలా అతడిని వెళ్ళనివ్వలేదు. అందుకని మిగిలిన ఆ గంట సమయం పరీక్షలు లోనే ఉందామని నిశ్చయించుకున్నాడు.  ఈ లోపల అతనికి మెరుపులా ఒక ఐడియా తట్టింది. ఎలాగూ ఒక గంట సమయం మిగిలి ఉంది, అందుకని, ఈ కాస్త సమయం లో, తనకు సాయం చేసిన దేవుడికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే ప్రణాళిక తయారు చేసుకోవాలని అనుకుని, ఇన్విజిలేటర్ దగ్గరనుండి ఓ నాలుగు  కాగితాలు తీసుకున్నాడు.

 

ప్రణాళిక వ్రాయడం మొదలు పెట్టాడు. ఏ పూజ చేయాలి అని అనుకున్నాడో దానికి సంబంధించిన ఖర్చుల పట్టిక తయారు చేశాడు . పూజా ద్రవ్యాలు,  పంతుల దక్షిణ వగైరా మీద ఖర్చు అంచనా వేస్తే చాలా మొత్తము  వచ్చింది , అది రాజుకు ఎక్కువ అనిపించింది.. ఆలోచించి ఆ పట్టికలోని కొన్ని వస్తువులు/ అంశాలు తీసివేసి  రెండో ప్రణాళిక తయారు చేశాడు.  ఈ రెండో ప్రణాళిక ఖర్చు కూడా ఎక్కువ అనిపించింది. ఇంకొక ప్రణాళిక తయారు చేయడానికి సిద్ధపడ్డాడు . ఇలాగా నాలుగైదు ప్రణాళికలు తయారు చేశాడు ఖర్చు అంచనాలు తక్కువ చేస్తూ తక్కువ చేస్తూ... ఈ క్రమంలో అతనికి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది ఇలా అనుకున్నాడు -" నా పిచ్చి గానీ దేవుడు ఏమైనా ఫలానా పూజ కావాలని , హుండీలో డబ్బులు వేయాలని అడిగాడా ? ఆయనకు  కావాల్సింది మనము ఇవ్వాల్సింది నిర్మలమైన మనస్సు.  అందుకని గుడికి వెళ్లి మనస్పూర్తిగా మొక్కుకుని ధన్యవాదాలు తెలుపుకుంటాను , సరిపోతుంది " అని.  ఎన్నో ప్రణాళికల తర్వాత ఒక తృప్తికరమైన  నిర్ణయం వచ్చిందని సంతోషింఛాడు.. ఇంతలో గంట మోగింది..  పరుగున వెళ్లి ఇన్విజిలేటర్ కు పత్రాలు ఇచ్చి , తనతో పాటు తీసుకెళ్లాల్సిన పత్రాలు వెంట తీసుకుని పరీక్ష హాలు నుండి బయటపడ్డాడు రాజు.. ఆనందంలో తేలుతూ ఇంటికి వెళ్లిపోయాడు.

 

తను సంపాదించ బోయే మార్కులు తలుచుకుంటూ సంతోష పడుతూ కొన్నాళ్లు గడిపాడు రాజు .  ఈ లోగా పరీక్ష ఫలితాలు వచ్చాయి .   రాజు  ప్రకారము తన ఫలితం లాంఛనమే, అయినా వెళ్లాలి కాబట్టి స్కూలు కెల్లాడు . ఫలితాలు చూసి షాక్ అయ్యాడు. కారణం అతను ఫెయిల్ అయ్యాడు.. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి రాజుకు చాలా సమయమే పట్టింది.. తమాయించుకుని ఉద్వేగంగా  వెళ్లి హెచ్ఎం ను కలిసి తన బాధ చెప్పుకున్నాడు. హెచ్ఎం గారు రికార్డు పరీక్షించి  చేసి చూస్తే అతనూ షాక్ అయాడు . కారణం  రాజు కు వచ్చిన మార్కులు 0 . రాజుకు ఐది రెండో షాక్... బాధను దిగమింగుకుని  హెచ్ ఎం ను సలహా అడిగాడు ఏం చేయాలి అని.  హెచ్ఎం సలహా మేరకు సుబ్బారావు రీ - కరెక్షన్ కు దరఖాస్తు   చేసాడు.

 

అది మొదలు క్షణమొక యుగంగా గడిపాడు రాజు . కొద్దీ రోజులకు రీ -కరెక్షన్ ఫలితం వచ్చింది..స్కూల్ కి వెళ్ళాడు. టెన్షన్ టెన్షన్.. పాపం రాజు కు మూడవ షాక్,  అతని మార్కులు 0 గ మళ్లీ నిర్ధారణ అయింది.. మళ్లీ భోరున  ఏడ్చాడు. కాసేపైన పిమ్మట  ఆలోచించగా ఆలోచించగా  తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలిసొచ్చింది  రాజుకు  . పరీక్ష హాలులో అతను ఇన్విజిలేటర్ కు ఇచ్చినవి దేవుని పూజల గురించి తయారుచేసిన  ప్రణాళికల పత్రాలు, తన వెంట ఇంటికి తీసుకెళ్లినవి జవాబు పత్రాలు. తన తప్పు బోధపడి మళ్లీమళ్లీ ఏడ్చాడు ఏడ్చాడు ఏం లాభం?  తప్పు జరిగిపోయింది. దేవునికి  వాగ్దానం చేసి  మోసం చేయాలని ప్రయత్నించి నందుకు మంచి శిక్ష పడిందని పశ్చాత్తాప పడ్డాడు సుబ్బారావు...

 


 

 

నీతి:

ఒక సామెత ఉంది. "ఓడ దాటే ముందు ఓడ మల్లన్న ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అని". అలాగే ఏదైనా  పని ప్రారంభించేందుకు  ముందు  ఎన్నో దృఢమైన  వాగ్దానాలు చేస్తారు- దేవుడికైనా లేక తోటి మనుషుల కైనా. పని అయిపోయిన తర్వాత చేసిన వాగ్దానాలు  మరిచిపోతారు .  ఇది  ఎవరికో చేసే ద్రోహం కాదు తమకు తాము చేసుకునే ద్రోహం.

 

కె మల్లికార్జున రావు.

తెలుగు తేనియలు


సమాప్తం  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...