11, అక్టోబర్ 2020, ఆదివారం

10.10.2020 పుస్తక సమీక్ష

 10. 10. 2020 - శనివారము


తెలుగు తేనియలు

పుస్తక సమీక్ష & రచనలు 

 

నేటి వ్యాసం

జింక జీవితం చేయు బోధ

 

1. మృగ తృష్ణ

(ఆనందము బాహ్యమున లేకున్నది)

 

'మృగ తృష్ణఅనగా 'జింకలకు కనిపించే ఎండ మావి' అని అర్థం. ఎడారిలో వేడి ఇసుక మీద సూర్య కిరణాల పరావర్తనం వల్ల అక్కడ నీరు ఉన్నదనే భ్రాంతి జింకకు కలుగుతుంది. అక్కడ నీరు ఉందనుకుని దాహం తీర్చుకోవడానికి పరుగెడుతుందికానీదగ్గరికి వెళ్లే కొద్దీ ఎండమావి దూరమవుతుందిఅజ్ఞానం వల్ల తను ఒక భ్రాంతి వైపు పరుగిడుతున్నట్టు తెలుసోకోలేదు. ఆవిధంగా  జింక, లేని నీటి కోసం పరుగులు తీస్తూ చివరికి నీరసంతో ఎడారి ఇసుక పై మరణిస్తుంది.

 

అలాగే  , మనుషులు కూడా భౌతిక శక్తి అయిన 'మాయఅనే భ్రాంతి  వైపు ఇంద్రియ దాహాన్ని తీర్చుకోవడానికి  పరుగులు పెడుతున్నారుఎంత ప్రయత్నించినా  వారి దాహం తీరదు . మనస్సుని ఇంద్రియ ప్రలోభముల నుండి మరల్చడం  తెలిసికొని  ప్రవర్తించు వ్యక్తి, తన ఆత్మ లోని  శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తాడు.

 

గరుడ పురాణం

 

అంశంపై గరుడ పురాణం ఇలా అంటుంది.

చక్రధరోఽపి సురత్వం సురత్వలాభే సకలసురపతిత్వం

భవ్తిరుం సురపతిరూర్ధ్వగతిత్వం తథాపి ననివర్తతే తృష్ణ (2.12.14)

 

"ఒక రాజు, ప్రపంచం మొత్తానికే చక్రవర్తి అవ్వాలని కోరుకుంటాడు; చక్రవర్తి ఒక దేవత అవ్వాలని కోరుకుంటాడు; ఒక దేవత, స్వర్గాధిపతి ఇంద్రుడు అవ్వాలని కోరుకుంటాడు. ఇంద్రుడు, సృష్టికర్త బ్రహ్మ దేవుడు అవ్వాలని కోరుకుంటాడు. అయినా, భౌతిక భోగముల కొరకు ఉన్న  తృప్తితీరదు"

 

2. కస్తూరి మృగం

(ఆనందము అంతస్సుననే యున్నది)

 

పైన చెప్పిన ఆత్మ తత్వం తెలిపేలా

వేదాంతంలో కస్తూరీమృగం దృష్టాంతం చెబుతారు .    సీజన్ వచ్చినపుడు కస్తూరి జింక బొడ్డు నుంచి కస్తూరి అనే ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది . అది  తీవ్రమైన పరిమళంగా ఉంటుంది పరిమళం ఎక్కణ్ణించి వస్తున్నదా అని జింక వెదకడం మొదలు పెట్టి , పరిమళం  తనవద్ద నుంచే వస్తున్నదని  గ్రహించక  అడవంతా గాలిస్తు  చివరికి ఏదో ఒక పులి నోట్లో  పడి ప్రాణాలు కోల్పోతుంది.

 

మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోక లోకమంతా  తిరుగుతాడు. పుణ్యక్షేత్రాలనీ తీర్ధయాత్రలనీ అనవసరంగా తిరుగుతూ డబ్బునీ సమయాన్ని  వృధా చేసుకుంటాడు

 

ముగింపు

 

మనిషి  పరమాత్మను తన అంతరంగంలోనే

వెతకాలి, ఆత్మ శక్తిని సాధించాలి

 

కె మల్లికార్జునరావు

తెలుగు తేనియలు

 

 

కందము

అంతయు నీవనుచును నే

నెంతయొ నమ్మితి మనమున నిమ్మగు భక్తిన్;

పంతము జూపక నాపై

చింతను దీర్చి నను బ్రోచు చిన్మయ రూపా!

 

తేటగీతి మాలిక

భాగవతులు జూపినటుల భవ్యమైన/

బాట యుండగ మనమేల భయపడవలె/

భక్తి శ్రద్దల తో బాటు వాక్కు, మనసు,/

కర్మ లేకముజేయుచు క్షణము గూడ/

మరువకుండ ప్రహ్లాదులమైన యడల/

పరమపదము బొందుట యగు బహుసులభము

 

వారణాశి శ్రీలేఖ

తెలుగు తేనియలు

 

 

ఇది నా  పాత దృశ్య శ్రవణ కవిత.

సరిగ్గా రెండు నిమిషాల కవిత.

Video : https://youtu.be/asi7F3I76AU

గాలిపటం కోసం మోట బావిలో  పడి ప్రాణాలు

పోగొట్టుకున్న నా బాల్య స్నేహితుని

చేదు గురుతులు నన్ను యాభై ఏళ్లపాటూ

వెంటాడడంతో.... కలత చెందిన నా యెద

కవితై   గళమెత్తింది.

మర్యాదగానే, ఆత్మీయంగానే,

 ప్రతి భారతీయునికి వ్రాసిన

సరదారుని లేఖ గా

రూపుదిద్దుకుంది.

నా దృశ్య కవితను తిలకించిన తరువాత

ఆహ్లాదంగా ఉన్న మీ మనస్సు కలత చెందితే

దయచేసి నన్ను మన్నించండి.

ఇట్లు

---.---

అత్తిలి అనంతు

తెలుగు తేనియలు

 

 

ఒక చిన్న కోతికొమ్మచ్చి ఖద 

కస్తూరి శివశంకర్

నేను కూడా ఉత్తరాల మీద చిన్న "కథ" చెప్పేయాలి..     

 

అణగనగంగా బందరులో ఉన్నప్పడు ... 

గేటు దగ్గరే వసారాలో కాఫీ గ్లాసుతో మా తాతారు కూర్చోవడం, ఉత్తరాల కోసం ఆత్రుతగా ఎదురు చూడడం

కాస్త పోస్టుమేన్ రావడం లేటయితే, వాడు రాగానే, ఏమయ్యా గుర్నాధం ఇలా లేటుగా వస్తే ఎలా అంటూ ప్రయివేటు చెప్పేయడం వెంటనే, అలసిపోయిన మా గుర్నాధం గారు  చెలిలొంచి పెన్సిల్ తీసి చేతి రుమాలు తో మొహం తుడుచుకుంటూ "పంతులుగారు, మాంఛి కాఫీ కొట్టించండి" అనడం.. ఇలా మా ఇంట్లో ఒక ఆత్మీయ బంధువు అయిపోయాడు. 

రోజూ వచ్చే ఉత్తరాలకి  మా మావయ్యో, బాబాయో, పెద్దమ్మో ఉత్తరం వ్రాయడం. వచ్చిన వుత్తరాలు ఒక్కొక్కటిగా మా బామ్మ, తాతారు చదవడం. 

మా తాతారు, నాన్నారు  ఇద్దరూ కూర్చుని కూడబలుక్కుని జవాబులు జాగర్తగా వ్రాయడం..   మధ్యలో నా  అవుడియాలకి వేల్యూ ఇవ్వకపోవడంతో కొంత ఇగో హార్ట్ కూడా అయ్యేది. 

అన్నట్లు శనివారం మధ్యాహ్నం మాత్రం మా తాతయ్యతో మ్యాట్నీ కంపల్సరీ..  ఉత్తరాలు చదివి ఒక్కోసారిఒరేయ్ రాముడూ పదరా.. అని తాతారు నాన్నారికి చెప్పడం,

 

వేం ఠనే.. మా  తాతారు,  నానారు గుంటూరు, రాజమండ్రి, రాజోలు వెళ్తూంటే, సారో ప్ఫదిసార్లో మేమూ నానారి వెనకాలే చొక్కా పట్టుకుని వెళ్లిపోవడం భలే గుర్తు సెలవుల్లో. . .

  

ఇంట్లో ఏమైనా విషయాలు చర్చించేటప్పుడుఅసలు పెద్దోళ్ళు అనబడే వాళ్లకి ఇలాటప్పుడు  అవుడియాలు రావు అని నా నిశ్చితాభిప్రాయం. మనం చెప్తే కాదులేరా అంటారు  ...

ఎందుకూ అని అడిగితే "ఏడిశావ్" అని జెల్లకాయ ఖొట్టేయడం అలవాటే కదా  

వెంఠనే రిక్షా కట్టించుకుని ష్టేషన్ కి వెళ్లడం... స్టేషన్ లో ఇంకా వింజన్ డైవర్ వేల వేయకపోతే (అప్పట్లో ప్యాసింజర్ రైళ్ళే కదా) నిమ్మదిగా పిల్లిలాగా హగ్గిన్ బోథమ్స్ కి వెళ్లిపోవడం... నిమ్మదిగా ఒక్కో పుస్తకం బొమ్మలు, అచ్చరాలు చూడడం,.. బోలెడంత హాశ్చర్యపోవడం బాగా గుర్తు    

 

మా ఇంట్లో కూడా అందరూ (చిన్నమావయ్య, నాన్నారు..మా బాబాయ్) అందరూ బుక్స్  మాత్రమే సాస్వితం అని చెప్పడం... నిమ్మాది నిమ్మదిగా బుర్రలో అలా నిక్షేపంగా నిక్షిప్తమయిపోవడం బాగా గుర్తు..  మొన్న 2019 లో కూడా డిసెంబర్లో WBT వాళ్ళ పుస్తకాల జాతరకు కూడా వెళ్లి ఒక పెట్టె నిండా బోలెడు పుస్తకాలు కొనుక్కున్నాను...    

 

అప్పుడప్పుడూ మా నాన్నారు, తాతారు  మాట్లాడే భాష, చూపించే తెగువ మాకు విద్యాభ్యాసం. గురజాడ వారిలా చెప్పాలంటే అసలు అదే ఎడ్యుకేషన్ అనిపించక మానదు  అలా తెలుగు బడుల పలుకుబడులు ఆత్మీయమైన ఒరవడులతో  అప్పుడుడప్పుడూ బుడుగు...  అప్పారావు, గుర్నాధం, గోపాలం ... ఇంకా ముత్యాలముగ్గు కంట్రాక్టరు భాష (అంటే తెలుసు కదా రావ్గోపాల్రావ్ అన్న మాట) కొద్ది కొద్దిగా నచ్చేయడం మొదలుపెట్టింది 

 

వేసంకాలం పండుగలప్పుడు (రామనవమి మా ఇంట్లో పెద్ద పండగ.. బోల్డంత కోలాహలం)  ఆవకాయ పెట్టేటప్పుడు, మా తాతగారు పడక్కుర్చీలో కూర్చుని తీక్షణంగా ఇన్స్పెక్షన్ చేసేసేవాళ్ళు నన్ను పిలిచి.. "ఒరేయ్ శివుడూ మనమెంత అదృష్టవంతులమో కదా !" "రాజాధిరాజులకు దొరకని భాగ్యం మనకి దొరుకుతోంది" అని చెప్పేవారు..

 

ఊరగాయలు మనం అసలు ఇన్వెంట్ చేసింది ఒక మూడొందల ఏళ్ల క్రితమే కదా.. అందుకని శాతవాహనుల నుండి రాయలు వరకు ఎన్ని రాజ్యాలు ఎలినా, ఆవకాయనీ , కాఫీ ని వాళ్ళు కోల్పోయారురా అనేవాళ్ళు .. ఒకప్పుడు అంతా  తొక్కుడు పచ్చళ్ళే అని వాళ్ళ చెప్పేవాళ్లట... ఇలా ఊరగాయలతో నోరూరించే రుచులకు నోచుకోని అభాగ్యులే  

 

మళ్ళీ కోతి కొమ్మచ్చి కథలాగా అలా అల్లా ముళ్ళపూడి వారి ఖదఃలు చదువుతూ,అప్పుడపుడు వడియాలు తింటిన్నప్పుడు ఐడియాలు, జనజీవన స్రవంతి లోనే కాక భో-జన జీవనయాన స్రవంతిలోనూ రుచుల కోలాహలం .. 

 

నిమ్మదిగా మొత్తానికి తెలుగుని అటకెక్కించేసి, ఐంస్టీన్, ఆర్కిమిడీస్.. గెలీలియో.. న్యూటన్ .. ఇలా ఇంకా పేద్ద లిస్ట్ ఉన్నారండీ. వీళ్ళందరూ అప్పట్లో ఎం ప్రయివేటు చెప్పారో నేర్చుకోవడానికి కాలేజీకి వెళ్ళేవాళ్ళం 

అక్కడా మళ్ళీ ముళ్ళపూడి వారు విజిల్ వేసి పిలిచేవారు     

"సూర్యుడు సముద్రం నించీ నీళ్లు అప్పుగా తీసుకుని మళ్లీ వర్షంగా భూదేవికి అప్పిస్తున్నాడు" అని తేల్చేశారు కదా  ముళ్లపూడి గారి అప్పారావు. అందుకే అప్పారావు గారి స్పూర్తితో ఒకప్పుడు ...   ఇంజనీరింగ్ కాలేజీ రోజుల్లో అన్ని చోట్లా తెగ ఖాతాలు కూడా పెట్టేసేవాళ్ళం   

 

ఇలా ఉత్తరాల నుండి ఆవకాయలు, ఊరగాయలు , రాములోరి కళ్యాణమప్పుడు భోజనాలు, చలువతాటాకు పందిళ్లు, అప్పుల ప్రహసనం ఇదే ఒక చిన్న కోతికొమ్మచ్చి ఖద     

 

ఇంకోసారి మరికొన్ని జ్ఞాపకాల సమాహారాలు పంచుకుంటాను 

 

కస్తూరి శివశంకర్

తెలుగు తేనియలు


 

ఇది డా.ముదిగొండ శివ ప్రసాద్ గారిచే రచించబడిన చారిత్రాత్మక నవల.

 

ఒకప్పుడు ఇది పత్రిక లో ధారావాహికగా ప్రచురించబడిన బడినది. నవలలో ముదిగొండ గారు అప్పటి రాజుల జీవన శైలి, ఆహార విహారాలు, మనదేశం లో రాజుల మధ్య సంబంధాలు, విదేశీయులతో సంబంధాలు ఎలా ఉండేవి, గ్రామీణ వాతావరణం వారి జీవనశైలి తో పాటు బౌద్ధ, హిందు మతాల మధ్య కనపడని యుద్ధం ఎలా జరిగేది, బౌద్ధ మత స్థాపన జరిగినప్పటినుంది నవలా కాలానికి మతంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుని పరిస్థిరీ లో ఉన్నది అని విషయాలి చక్క గా వివరించారు. పరిపాలనా వ్యవస్థ, యుద్ధ నీతి, రీతి ఆకాలం లో ఎలా ఉండేవో వివరించారు.అంటే కాదు ఇంకా చాలా విషయాలు పొందుపరిచారు.

 

కథ క్లుప్తంగా :-  ఆనాటి ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకుని పారిపాలనచేస్తున్న శాతవాహన రాజు శ్రీశాతకర్ణి. ఆయన భార్య నాగవరద. వారి పుత్రుడు యువరాజు పూర్ణోత్సున్గుడు. వారి సేనాని ( రాజు,రాణి లకు పెంపుడు కొడుకు లాంటివాడు) విజయదత్తుడు. ఆనాటి కళింగరాజ్యాధిపతి ఖారవేలుడు కౄరుడు. అతని భార్య కాళింది. ఒకానొక బౌద్ధ సన్యాసికి యుద్ధం లో క్షతగాత్రుల సేవ చేయటానికి వెళ్ళినపుడు శ్రీలేఖ పసిబిడ్డ గా దొరుకుతుంది. ఆమెను ఆయనే పెంచిపెద్దచేస్తాడు. శ్రీలేఖ ఆయనే తనకన్నతండ్రి అనుకుంటూ బౌధాభిక్షుకి గా మారి యుక్తవయసుకి వచ్చి సేవాకార్యక్రమనిర్వహణ చూసుకుంటూ ఉంటూ, పూర్ణసన్యాసదీక్ష తీసుకునే ఉద్దేశ్యం లో ఉంటుంది. ప్రస్తుతం పెంచిన తండ్రి శాతవాహన రాజ్యం లో ఒక ఆశ్రమానికి పెద్దదిక్కుగా ఉంటున్నాడు. నిత్య, నైమిత్తిక కర్మలు యజ్ఞ యాగాదులు క్రతువులు చక్కగా నిర్వర్తిస్తూ రాజ్యసంక్షేమానికి అహర్నిశలు పాటుపడేవారు శాతకర్నిదంపతులు. యువరాజు పూర్ణోత్సున్గుడు మాత్రం చెడుఅలవాట్లకు లోనై ఆలోచన ప్రక్క దోవ పట్టడంవల్ల తన రాజ్యానికి, కన్నతల్లిదండ్రులకి హాని తలపెట్టి తాను రాజవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదంతా ఖారవేలుని పధకం ప్రకారం  జరుగుతూ ఉంటుంది. ఇలా ఉండగా విజయదత్తుడు బౌద్ధమతస్తులు తమ రాజ్యంలో పాటుకుపోయి కనపడకుండా రాజకీయాలు ఛేస్తున్నారన్న అనుమానం తో గూఢచర్యం చేస్తున్న దశ లో , శ్రీలేఖ రాజులు, రాజ్యాలు, యుద్దాలు.... ఇదంతా క్రూరమైన చర్య అని , విజయదత్తుడు కౄరుడని, అతనిలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం లో ఉండగా ఇద్దరూ ఒకరికొకరు తారసపడతారు. కొన్ని పరిణామాల అనంతరం విజయదత్తుడు, శ్రీలేఖ ఒకరినొకరు ఇష్టపడతారు. ఇలా ఉండగా ఖారవేలుడు, పూర్ణోత్సున్గుడు, బౌద్ధులు కలసి శాతకర్ని మీద కుట్ర చేస్తున్న సమయంలో, విదేశీ రాజు డెమెట్రియస్ భారతదేశం మీదకి దండెత్తి వచ్చే ఉద్దేశ్యం లో ఉన్నట్లు శాతకర్ని తెలుసుకుని మారువేషం లో రాజ్యం లొనే ఉంటూ రాణి నాగవరదాయిని తో పరిపాలన చేయిస్తూ, విజయ దత్తుడు, శ్రీలేఖ, పతంజలి మహర్షి ( అన్నట్లు గుర్తు ) సహాయంతో అటు ఖారవేలుని లోను ఇటు పూర్ణోత్సున్గుడి లోను మార్పు తెచ్చి దేశ రక్షణ నిమిత్తం అందరూ కలిసి యుద్ధంచేసి డెమెట్రియస్ మీద గెలుస్తాడు. విజయదత్తుడు, శ్రీలేఖ వివాహం తో నవల పూర్తవుతుంది.

 

నేను చదివి చాలా కాలం అవ్వటం వల్ల నాకు గుర్తున్నంతలో వ్రాసాను.

శ్రీలేఖ

తెలుగు తేనియలు

 

 

చుట్టూ కాలువగట్టూ

ఊరు పూజా పీఠం లా వింది.

ఊరు మొదట్లో వేపచెట్టూ, వేదం  చదువతున్నట్టూ ఉంది . గాలి పెదవులు

నీటి అలలను  సుతారంగా  ముద్దాడుతుంటే, సిగ్గుతో వయ్యారంగా  మెలికలు

తిరిగిన పిల్ల  కాలువ, ఆడపిల్ల నడుము చుట్టూ తిరిగిన  ఓణీలా వుంది .

కాలువ అంచునే  నీటిపైకి వంగిన కొబ్బరి చెట్లు , పనులు ముగించుకుని గంపలెత్తుకుని  ఇంటికి వెళ్తున్న కూలీలు లా ఉన్నాయి

సంజె కింజాయి రంగు  ఎరుపుదనాన్ని  తగ్గించడానికి  గోధూళి పైకి

ఎగురుతోంది . చీకట్లు  ఇంకా బలాన్ని సంతరించుకోలేదు  .

సరిగ్గా సమయానికి ఒక ఎద్దుల బండి ఊరిలో ప్రవేశించింది

దాని  మువ్వల శబ్దపు లయకు నీటిలో వంగిన కొబ్బరాకు పరవశించి  జలతరంగిణి మ్రోగించినట్టు  కదిలింది .

పెరడు అందానికి ముచ్చటపడింది సంహిత  అలానే క్షణం నిలబడిపోయింది.

 

పెరట్లో ముగ్గులు రాబోయే సంక్రాంతి లక్ష్మి నవ్వుల మొగ్గలు

అక్కడ గోబ్బెమ్మలు లచ్చిమి కలికి పచ్చ  తురాయి నిగ్గులు

బాదం చెట్టు పక్కనే నిద్రగన్నేరు ...... క్రింద  పూలు రాలిన నేల

 

నేల ఎలా ఉన్నది ? పన్నాకు విస్తళ్ళ భోగంపు పెట్ట పసుపు కుంకుమాకు పళ్ళాన బోసినట్టుఊరి చివర ఇల్లు ఎలా ఉంది? గొబ్బిళ్ళ కోన నిల్చిన గుమ్మడి పువ్వులా ఉంది

 

బావిలో నీటి తళ తళ ఎలా ఉంది ?

పంట కళ్ళమ్ము చూసిన రైతు కళ్ళ లో సంతోషం లా ఉంది.

అసలా మాటకొస్తే ఇల్లే అందమైన అమ్మాయి లా ఉంది.

ఇంటిముందు వరుసగా ఉన్న బంతి చెట్ల మధ్య సన్నటి దారి, అమ్మాయి  నుదిటి నడుమ పాపిడ..... ఇంటి ముందు ఎర్ర మందారం చెట్టు ఆమె నుదిటి బొట్టు...... గవాక్షాలు విశాలాక్షాలు .... వంట ఇంటి ఆటకపై చూరునంటిన నలుపు అమ్మాయి కంటి కొసల చెదిరిన కాటుక.

 

నూతి గట్టు ఆమె కాలి పటడ! గట్టుఅంచున తడిసిన ఎర్రమట్టి ఆమె కాలి పారాణి....గిలకపైన నులకతాడు, ముద్ద చేమంతి పూలు ముడిచిన ముద్దరాలి ముప్పేట జడలా ఉంది.

 

పరుచుకున్న పచ్చగడ్డి పెరడు అమ్మాయి పరికిణి అయితే, దడి అంచున పాకిన పొగమంచు పూలచెట్లు దాని అంచులు

 

రమ

తెలుగు తేనియలు

 

 

తేటగీతి

విశ్వరూపుడా! వనమాలి! వినతు లివియె

మమ్ము గాంచి రక్షించెడి మాధవుండ!

వందనంబు ముకుందుడా!బహుళముగను

వేడుకొందుము శోభిత విద్యలిమ్ము


శ్రీ కృష్ణదేవరాయలు  ఆయన పాలన, రాజ్యం గురించి చిన్న వివరం తెలిసినా తెలుగువారు ఉప్పొంగి చదివే సాహిత్యం లోనేను చదివిన ఒక  నవల

 

నవల పేరు :గర్భాలయం -

రచయితనండూరి శ్రీనివాస్

 

ఇక పరిచయం

 

హంపి (ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఓపెన్ ఎయిర్ మ్యూజియం)

 

కృష్ణదేవరాయల కళాతృష్ణకి, తురుష్కుల పైశాచికత్వానికి సాక్ష్యం గా నిలిచిన చారిత్రిక ప్రదేశం హంపిప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన ఆలయాలతో, కట్టడాలతో, ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్న ఒక అద్భుత యాత్రా ప్రదేశంఆలయాల వర్ణన అద్భుతం

 

రాజు ఒక అనాధ. హంపి లో టూరిస్ట్ గైడ్ గా పనిచేస్తున్నాడు. తెలుగు వారు ఎవ్వరు వచ్చినా రాజు కావాలనే అడుగుతారు అక్కడున్న ట్రావెలర్ బ్రోకర్స్. నంజుడ స్వామి తీసుకొచ్చిన ఒక టూరిస్ట్ బ్యాచ్ ని హంపిలో తిప్పుతున్నప్పుడు అతని వాన్ లో మూడేళ్ళ చిన్న పిల్లవాడు దొరుకుతాడు. అతని గురించి చుట్టుపక్కల వాకబు చేస్తాడు రాజు. ఎటువంటి ఆచూకీ దొరకదు. పిల్లవాడు రాజు మనస్సుకు దగ్గర అవుతాడు.

హంపిలోకి ఎక్కడికి తీసుకెళ్లిన ప్రాంతం తనకు తెలిసినట్టుగా ఉంటున్నాడు బాలుడు. గైడ్ లకు కూడా తెలియని విషయాలు బాలుడికి తెలుసు అని గ్రహిస్తాడు. రాజు ని చేసుకోబోయే మల్లి కి కూడా దగ్గరవుతాడు బాలుడు. మల్లి కూడా ఒక అనాధ. హంపి లోనే మల్లెపూల దుకాణం నడుపుతుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అక్కడ ఉన్న అందరికి తెలుసు.

 

బాలున్ని ఎవరో ఎత్తుకు పోవడానికి చూస్తున్నారని, చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకుంటాడు రాజు. అసలు బాలుడు ఎవరు అనే విషయమై అరా తీస్తుండగా వాడి పేరు పవన్ అని

వాడికి తనకు ఋణం తీర్చుకోలేని సంబంధం ఉందని తెలుస్తుంది.

 

పవన్ అనాథ కావడానికి కారణం తెలుసుకుని

వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రాజు చేసే ప్రయత్నం, అలాగే హంపీ లో అందాలు మన

కళ్ళకు కట్టినట్లు వ్రాసాడు రచయిత

 పుస్తకం చదువుతున్నంత సేపు పవన్ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, హంపి లోని విశేషాల గురించి రచయితా ఇంకా ఏమి వివరిస్తాడో  అన్న ఆసక్తి కూడా ముఖ్యంగా

మనల్ని పుస్తకం వదలకుండా చదివిస్తుంది.

 

సతీష్

తెలుగు తేనియలు

 

మేలుపలుకుల మేలుకొలుపులు 

(తిరుప్పావై - దివ్యప్రబంధం)

సృషించిన వారు : ముళ్ళపూడి రమణ - బాపు  

 

పరిచయం వ్యాస్యం : కస్తూరి శివశంకర్

 

నా అనుభూతి - మొదటి భాగం

 

దివ్య ప్రబంధం తెరవగానే ముళ్ళపూడి రమణ గారి రమణీయాక్షరాల మనోహరాకృతులతో  బాపు బొమ్మలుగా మారతాయి.

మళ్ళీ వెంటనే బాపు గారి బొమ్మలు అక్షరాకృతిదాల్చి రమణగారి గేయాలుగా మారాయి.

గోదాదేవి తన్మయంగా, అమాయకంగా పాడిన పాటలు తిరుప్పావై దివ్యభక్తికి సంకేతం దివ్య ప్రబంధం.

 

తమిళంలో తిరుప్పావై దివ్యప్రబంధంగా వెలుగొందుతున్న గోదమ్మపాటలకు బాపు గీసిన బొమ్మలు రమణగారిని కదిలించాయి. వెంటనే, ఆయన అచ్చతెలుగులో గోదమ్మ పాటల్ని పాడుకోవడం ప్రారంభించారు. తానే గోదాదేవై తిరుప్పావైని తెలుగు గీతాలుగా కూర్చారు తిరుప్పావై  దివ్య ప్రబంధంమేలుపలుకులు మేలుకొలుపులు 

 

తిరుప్పావై అనేది ముప్పై పాశురాల చిన్న పుస్తకం. తమిళుల వేదమయిన నాలాయర ప్రబంధంలో అత్యంత విశిష్టమైనది తిరుప్పావై నాలుగు వేదాలు, నూటఎనిమిది ఉపనిషత్తులు, షట్ దర్శనాల సారం అంతా ప్రబంధంలో దాగి ఉన్నదని అక్కడి పండితులూ, జ్ఞానుల నమ్మకం 

 

అర్ధంకాకపోయినా వీటిని చదివితే చాలు బోలెడంత జ్ఞానం సిద్ధిస్తుంది అని చెబుతారు , నమ్ముతారు.

ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వైష్ణవ  దేవాలయంలో , తిరుమలలోనూ తెల్లవారుఝామున చాలా గంభీరమైన వేదం మంత్రాల వలె చదువుతారుచదువుతున్నప్పుడు అదేదో వేదం లాగా, మంత్రంలా, స్వామి వారి కైకర్యం అన్నట్లు అర్చకస్వాములంతా చదువుతారు  

 

ఇక్కడే ఉంది గమ్మత్తు అంతామన ముళ్ళపూడి వారు ఒక డజను తమిళ పండితుల శిక్షణలో  సలక్షణంగా అర్ధం చేసుకున్నారు తిరుప్పావై మొత్తం.. 

అసలు వారికి అర్ధమయినదానికి, పాశురాలని గుళ్ళలో పఠించే తీరుకి ఎక్కడా పొంతన కనబడలేదు అంటారు. 

పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా కూడా అందించారు.  

కలియుగంలోని శ్రీ విల్లిపుత్తూరు గోదాదేవి ద్వాపరయుగంలో రేపల్లె భామగా తనని తాను భావించుకుంది 

గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏయే అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది.

 

తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణుడిని పగలంతా చూస్తున్న సంతోషం, రాత్రి వేళన చూడలేని తాపం తెల్లవారగానే చూడాలన్న తపన, ఆత్రం కలబోసిన భావరాగలమాల దివ్యప్రబంధం  ప్రతి పాశురంలో.

 

రెండవ భాగం

 

అయితే   గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏయే అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది.  

 

30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి.

 

మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ప్రబోధాలు సూచిస్తాయి.

 

ప్రతి పాశురంలోనూ ఇలాంటి సదాచరణే అంతర్లీనంగా ఉంటుంది.  

 

స్వచ్ఛత మాత్రమే ప్రమాణంగా పొంగిన ముళ్ళపూడి వారి కవితావేశంమేలుపలుకుల మేలుకొలుపులుగా రూపుదాల్చింది.

 

అజరామర కళాఖండమై మన ముందు నిలిచింది.

ఇక్కడే భక్తి తత్వాన్ని చాలా సులభంగా.. సరళంగా వివరిస్తారు ముళ్ళపూడి వారు. సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రయత్నం చేశారు 

 

మేలుపలుకుల మేలుకొలుపులు ఏమిటి  ?

 

ఇందులో పాటలు గోపకాంతులు (కన్నెపిల్లలు) నోము పట్టడం, తెల్లవారుఝామున నోములు పట్టడం, తలుపులు తట్టి తోటి నేస్తాలని లేపడం, వాళ్ళు చలికి భయపడి దొంగనిద్ర నటించడం.. అంతలో గోదాదేవి ఆటపట్టిస్తూ, చిన్న చిన్న గమ్మత్తులు చేస్తూ వాళ్ళని బయటకు రప్పించడం, అందరూ యమునలో జలకాలాడడం, లోకాలనేలే విష్ణుమూర్తిని కూడా సరదాగా అల్లరి చేస్తూ వీధిలోకి రప్పించడం ముచ్చటాగా ఉంటుంది.   

 

నిర్మలమైన భక్తి అంటే ఇదేకోరికలనే కోరని భక్తి   

కొండత దేముడికి గోరంత పత్రీ చాలు - అది భక్తితో ఇస్తేనే 

వేదవేదాంతాలు, అర్ధ పరమార్ధాలు, మంత్రతంత్రాలు తెలిసిన ఎంత జ్ఞాని అయినా భక్తి లేకుండా కొండంత పత్రీ స్వామికి ఇస్తే, వాటికి గోరంత కూడా చేరవు, పైగా స్వామికి నచ్చవు కూడా 

 

భక్తి అంటే ఏమిటి

భక్తి అంటే నిర్మలమైనది భక్తి.... అంటే స్వచ్ఛమైనది 

 

కుచేలుడి అటుకుల వంటిది 

శబరి ఎంగిలి చేసిన పళ్ళ వంటిది 

శివయ్య మూడోకంటికి

కాలిజోడుతో తొక్కిన కన్నప్ప స్వచ్ఛమైన ప్రేమ లాంటిది 

 

శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిసాగరంలో మునిగితేలినవారినిఆళ్వారులుఅంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తిసంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాళ్ అని చెప్తారు. జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణుచిత్తులవారు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికింది.

 

భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకదాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ భూదేవి అంశయే అన్న సంగతి అర్ధమౌతుందిఇలా గోదాదేవితో కలిసి స్వచ్ఛమైన మనసులతో కన్నెపిల్లలు చేసే సిరినోము (తిరుప్పావై) అన్నమాట 

ఇవే మేలుపలుకుల మేలుకొలుపులు.

అసలు మేలుకొలుపులు ఎవరికీ ?

ఇది మరీ రహస్యం

 

నీలాతుంగస్తనగిరి సానువులలో నిదురించే (నిదురనే నటించే భువనైక మోహనుడు ) కృష్ణయ్యకా ? ఎంతమాత్రమూ కాదు..

 

ధనుర్మాసం లో ముప్ఫైరోజులూ చేసే కాత్యాయనీ వ్రతం శ్రద్ధగా చేస్తూ పాటలు పాడుకోవడమే మేలుపలుకుల మేలుకొలుపులు

 

గొల్లభామలు దేశాలనేలే రాజులానే కాదు లోకాలనేలే దేవుడిని కూడా మేలమాడగల, వెక్కిరించగల వాళ్ళు  అల్లరిపిల్లలు.  

 

వారి ఆటపాటల్లో, మాటల్లో గూడార్ధాలుండవు. సరదాలు, సరసాలు, ప్రేమ మాత్రమే   అందమైన ఆటలనీ, పాటలనీ అలాగే పాడుకోవాలనీ, కాపాడుకోవాలనీ పండితులు మాత్రమే కాదు పామరులు కూడా అందమైన పాటలు హాయిగా రుచి చూడాలనీ ముళ్ళపూడి వారి ఆశ. 

ఇలా వ్రాసి మనకి బహుమానం ఇచ్చేసి ముళ్ళపూడి వారు, బాపు గారు కిష్టయ్య దగ్గరకు వెళ్లిపోయారు 

 

బాపు రమణల దివ్య ప్రబంధం మాత్రం మనమంతా కళ్ళకద్దుకొని, గుండెలకు హత్తుకోవాలి అనిపించేటట్టు ఉంటుంది    

సృష్టించిన వారు - ముళ్ళపూడి రమణ / బాపు

పరిచయ వ్యాసం : కస్తూరి శివశంకర్

తెలుగు తేనియలు



ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా..

(1-10-2020)

కందము

ప్రక్షాళన జేయని యెడ

శిక్ష యదే నపరిశుద్ధ చింతన మెపుడున్;

రక్షయగు మనో మాలి

న్య క్షయ మొనరింపగాను నైర్మల్యముగా!

 

కందము

హసిత మెపుడు వదనంబున

ఇసుమంతయు చెదరనీక ఈరసమె విడన్

వసుధను చింతలె జని సం

తసమది చేకూరునెపుడు తదనుగుణముగన్!

 

కందము

వసివాడు చింత  తోడను

పసగర గొనగా నసూయ పైకొన జనులన్ ;

పొసగును శుభంబు లెపుడున్

వసుధైక కుటుంబ భావ పరిణతి నొందన్!

 

కందము

అసమర్థులైన వారలె

ముసురు కొనెడి చింతలగని బుయిలోడు ధరన్;

మిసిమి దరుగ దెన్నడు తా

ము సమర్థత తోడ కష్టము లెదుర్కొనగాన్!

 

కందము

భోగములను గోరక యను

రాగము జూపుచు ననిశము రమణీయముగన్

వేగమె పనులను జేయుచు

త్యాగనిరతి యుండ చింత దరిజేరదుగా !

 

చల్లా దేవిక

తెలుగు తేనియలు

 

 

ప్రభాత కవిత:

మనిషీ! ఏమిటిలా?! మనం ఎందుకిలా?!

కోడిపుంజులా ఉదయాన్నే లేవాలి..

పక్షిలా స్వేచ్ఛగా ఉండాలి..

చిలకలా చక్కగా మాట్లాడాలి..

ఆవులా పరిమితంగా తినాలి..

కుక్కలా విశ్వాసం చూపాలి..

దున్నలా రోజంతా పనిచేయాలి..

చీమలా పొదుపు చేయాలి..

సాలీడులా ఇంటిని ఉంచుకోవాలి..

పక్షి జంటలా అన్యోన్యంగా ఉండాలి

కోడిపెట్టలా పిల్లలని సాకాలి..

గొర్రెల్లా కలసి మెలిసి ఉండాలి..

పావురాల్లా ఐక్యత చూపాలి..

కొంగలా మౌన ముద్రలో ఉండాలి..

కాకుల్లా చేయూత నివ్వాలి..

 

ఇన్నీ విడిచి..అన్నీ మరిచి..

ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నాం!

అవకాశపు అంచులు పట్టుకుని

గబ్బిలాల్లా వ్రేళ్లాడుతున్నాం..

గోడమీద పిల్లిలా నిలబడి

ఆత్రంగా దిక్కులు చూస్తున్నాం!

మానవత్వపు వలువలను ఒక్కొక్కటిగా విప్పేస్తూ..

రాక్షసతత్వపు పూతలను రోజూ

ఒళ్ళంతా పూసుకుంటూ

క్రమంగా రాబందులకు బంధువులవుతున్నాం!

 

కుట్రలు కుతంత్రాలును ముప్పొద్దులా భోంచేస్తూ

క్రూరమృగాలకి చేరువవుతున్నాం..!

 

అమ్మపాలు తాగి పెరిగిన మనం

విషాన్ని అనుక్షణంఆవాహన చేసుకుంటూ

కాలక్రమేణా కాల సర్పంలా మారిపోతున్నాం..!

 

ఇదేమిరా మనిషీ!

ఏమిటిలా ?! మనమెందుకిలా?!

 

వసుధ

తెలుగు తేనియలు 


సమాప్తం  


 


  




 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...