ముళ్ళపూడి సాహితీ స్వర్వస్వం - మూడవ భాగం
27.09.2020 సాహితీ ప్రశ్నావళి - సమాధానములు
సమాధానములన్నీ ఒక సరణి లో అందిస్తున్నాను. సమాధానములు పూరిగా అందించిన తరువాత విజేతల వివరాలు తెలియచేస్తాను.
1.
ముళ్ళపూడి వారు వ్రాసిన గిరీశం లెక్చెర్స్ లో మొత్తం ఎన్ని వ్యాసాలు కనిపిస్తాయి
జవాబు
ముళ్ళపూడి వారి గిరీశం లెక్చర్స్ 27 సుదీర్ఘమైన వ్యాసాలు కనిపిస్తాయి.
గిరీశం అనగానే అందరికీ గురజాడ వారి కన్యాశుల్కంలో బోలెడు (అవ) లక్షణమైన ఐడియాలతో, ఆలోచనలతో కనిపించే ప్రబుద్ధుడు దర్శనం ఇస్తాడు. ఈ సదరు గురజాడ వారి పాత్ర "గిరీశం" వైచిత్రి ఏమిటో పూర్తిగా తెలియాలంటే గురజాడ వారి కన్యాశుల్కం చదవవలసిందే
గిరీశం తనదైన వ్యంగ్యమైన శైలిని గురజాడ వారి గిరీశాన్ని గుర్తుచేస్తూనే, ముళ్ళపూడి వారు తనదైన ముద్రతో సమాజంలో ఉండే రకరకాల అవలక్షణాలని ఏకిపడేశారు మొట్టమొదటి వ్యాసమే "మైగాడ్, పుస్తకాలు కొనడమా !!! బార్బేరియస్" అన్న వ్యాసాన్ని అందిస్తారు. పుస్తకాలు కొనకుండా అవతలి వారి దగ్గర నుంచి తీసుకుపోవడమో లాంటివి చేసేవారి గురించి ... ఇలా రకరకాల అంశాలతో మొత్తం 27 వ్యాసాలు కనిపిస్తాయి
అలాగే కళాఖండాల లోగుట్టు, సినిమాల నీతిచంద్రికలు వంటి సమాజ దర్పణం లాంటి వ్యాసాలెన్నో..
2.
కృష్ణుని వేణు గానాన్ని వింటూ పరవశించిపోతూ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రభోదించే అత్యుత్తమ కథ గా, రమణ గారు ఉత్కృష్ట స్థానాన్ని అందించిన కథ ఏది
జవాబు
ఈ కథ పేరు "కానుక"
1963లో ప్రచురితౖమైన అత్యద్భుతమైన కథ "కానుక" . పరిపూర్ణత కోసం పాటుపడే పడే ఒక కళాకారుడి తపననూ, అదే సమయంలో భగవంతుడికి పరిపూర్ణంగా లొంగిపోయే భక్తినీ అత్యద్భుతమైన భావుకతతో ఆవిష్కరించిన అత్యుత్తమ కథ
వేణువులు తయారుచేసే ఒక చిన్న కళాకారుడి అంతర్మధనం, కధలోని ప్రతి అక్షరంలోనూ భక్తిరసాన్ని అంతే గాఢంగా,ఉదాత్తంగా పండించిన మహాద్భుతమైన కధ “కానుక”.
3.
ఆనందరావు నాయకుడుగా కనిపించే అత్యంత ప్రజాదరణ పొందిన కథ ఏది ?
జవాబు:
ఆకలీ ఆనందరావు
1945లో "బాల" పత్రికలో రమణ గారి మొదటి కథ "అమ్మ మాట వినకపోతే"కానీ ఆయన వ్రాసిన మొదటి కథ మాత్రం వేరు
ఆయన వ్రాసిన మొదటి కథ మాత్రం ఆకలీ ఆనందరావు. ఈ కథ మొట్టమొదటి సారి బాపు గారి బొమ్మలతో సహా ప్రచురింపబడింది ఆంధ్ర ప్రభలో
ఈ కథలు చూసి ఇడ్లీ కన్నా చట్నీ బాగుందోయ్ అంటూ బాపు గారి బొమ్మలకు కూడా మొట్టమొదటి సారి ముళ్ళపూడి వారి రచనలు ద్వారా ప్రశంస లభించింది.
4.
బ్రహ్మ దేవుడు తయారుచేసిన కొనదేలిన ముక్కు ఇతివృత్తంగా భావుకతతో కవితాత్మకంగా పరిమళించే ముళ్ళపూడి వారి కథ ఏది ?
జవాబు.
ఈ కథ పేరు " లహరి "
తిలక్ గారి పలుకుల్లో రూపుదిద్దుకున్న వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలై హృదయ పారావతాలై అమృతాన్ని కురిపించాయి
ఆ కవితా ప్రేరణతో రాధా గోపాలం ప్రణయ గోదావరి నేపధ్యంగా "లహరి" కథ, కవితా ధారా అందించారు ముళ్ళపూడి వారు
కథ ఆసాంతం కథ ఒక అందమైన ముక్కు తయారు చేసిన బ్రహ్మ దేవుడు, ఆ ముక్కుకి సరిపడా అందమైన రాధ ని తయారు చేసారంటూ వర్ణించే కధనంతో కథ మొదలవుతుంది
దీపకళిక వంటి సింధూరతిలకం ఉంచడానికి అనువుగా ఆమె కోలముఖంలో బహుళ పక్షపు నవమి చంద్రుడు వంటి నుదురు తీర్చిదిద్దాడు బ్రహ్మదేవుడు చిన్న వంపుతో సన్నగా ఉండే అరుణాధారం హాసించినపుడు కనిపించే అందమైన సొట్టలు ... ఇలా సాగిపోతుంది కథ.
5.
‘హై నూన్’ సినిమాలో కౌబాయ్ పాత్ర ఆధారంగా వ్రాసిన నవల ఏమిటి ? ఆ కథ ఆధారంగా తీసిన సినిమా ?
జవాబు:
ఈ కధానిక / నవల పేరు సాక్షి
సాక్షి చిత్రకథను చాలావరకూ ఆ సాక్షి కథనే ఆధారంగా చేసుకుని తయారుచేసుకున్నారు.
ఈ సినిమా మూలకథాంశంపై హైనూన్ ప్రభావం ఉందని విశ్లేషకుల నమ్మకం.
కానీ కధానాయకుడి పాత్రౌచిత్యం, చిత్రీకరణ సాక్షిలో అన్నీ ప్రత్యేకమే.
తెలుగుదనాన్నీ, సంస్కృతినీ ప్రతిబింబిస్తూ చిత్రాలను కొత్త ప్రయోగాలకు వేదికలుగా మలచిన దర్శకుడు బాపు సినీయానంలో తొలి మెట్టు ‘సాక్షి’.
ముళ్లపూడి వెంకటరమణ అప్పటికే రచయితగా ఓ పది సినిమాలకు పనిచేసి పరిశ్రమలో కొంత పట్టు సాధించి ఉన్నారు. చేతిలో పాతిక వేల రూపాయలు మాత్రమే ఉన్నా స్నేహితుడిని దర్శకుడిగా పరిచయం చేయడం కోసం సాహసం చేసి సాక్షి తీశారు.
6.
ముళ్ళపూడి వారి "బుడుగు" మొట్టమొదటిసారి ఏ వార పత్రికలో కనబడ్డాడు ? ఏ సంవత్సరంలో
జవాబు:
బుడుగు మొట్టమొదటిసారి ఆంధ్ర వారపత్రికలో ధారావాహికగా నవంబర్ 1956 నుండి ఏప్రిల్ 1957 వరకు ఆరునెలలు వారు ప్రతివారం తెలుగు ఇళ్లలో గిలిగింతలు పెట్టింది.
మొదట్లో ఆ ధారావాహికల్లో ముళ్ళపూడి వారు "రచయితగా" తన పేరు కూడా వేసుకోలేదు... బొమ్మలు బాపు వారివి అని మాత్రం అర్ధం అయింది..
చివరికి అందరి బలవంతం వలన రాసి పెట్టినవాడు ఫలానా, బొమ్మలు వేసి పెట్టినవాడు ఫలానా అని వేశారు .. ఆఖరి సంచికలో
1962 నుండి బుడుగు ఎన్నో ముద్రణలు..
బుడుగు సృష్టిలో ముళ్ళపూడి వారి అక్షరం ఎంత అలరించిందో, బాపు గారి బొమ్మ కూడా అంతే అలరించింది అనడం లో ఎంత మాత్రమూ సందేహం లేదు..
అప్పట్లోనే బుడుగు కార్టూన్ scripts విడుదల చేశారు.. బుడుగుని వామనుడు లాగా, గురజాడ వారి గిరీశం లాగా, రాముడిలాగా , కృష్ణుడిలాగా.. మీసాల డిటెక్టివ్ లాగా ఇలా ఎన్నో కళారూపాలకు బాపు జీవం పోశారు.
7.
"విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా"... అన్న మకుటంతో ముళ్ళపూడి వారి మీద అభిమానంతో శతకం వ్రాసినవారు ఎవరు ?
జవాబు:
అబ్బూరి రామకృష్ణారావు గారు
అబ్బూరి రామకృష్ణారావు గారు ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి మార్గదర్శకులు. బహుముఖ ప్రజ్ఞాశాలి.
తెలుగు భావకవి, పండితుడు, నవలా రచయత, నాటక కర్త, సాహితీవేత్త, విమర్శకుడు, అభ్యుదయ భావాలున్నవాడు, మానవతావాది, గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడు, గ్రంథాలయాధికారి.
ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణారావులను కవిత్రయమని పేర్కొంటారు
ఇటువంటి మహనీయుడు ముళ్ళపూడి వారి మీద శతకం వ్రాయడం మహత్తరమైన విషయం. దుదృష్టవశాత్తూ ఆ పద్యాలన్నీ అలభ్యం.
8.
భానుమతి, గుర్నాధం, శేషయ్య పాత్రలు ముళ్ళపూడి వారి ఏ ప్రఖ్యాత రచనలో కనిపిస్తాయి. ఆ నవల ప్రత్యేకత ఏమిటి
జవాబు:
ముళ్ళపూడి వారి ఋణానందలహరి లోని మొదటి మూడు కధల్లోని లోని ముఖ్యమైన పాత్రలు.
ఋణానందలహరి కధలు ఆద్యంతం అద్భుతమే. విష్ణుశర్మ గారి పంచతంత్రం ఆధారంగా పరవస్తు చిన్నయసూరి తెలుగు వారికి పంచతంత్రం యధావిధిగా అందించారు కదా. అన్ని కధలూ జంతువుల నేపథ్యంలో, మనుష్యుల కోసం నీతి కధలు ఎలా వ్రాసారో, ముళ్ళపూడి వారు సరదాగా జంతువుల కోసం పనికొచ్చే మనుష్యుల పాత్రలతో కధలు వ్రాశారు.
పిల్లలకి చదివి వినిపించవలసిన కధలు. ఆద్యంత హాస్యం. అంతకన్నా అజరామరమైన నీతి కూడా . . .
9.
బుడుగు కు Dennis the Menace అని కొంత మంది నమ్మకం... సీగానంబ పెసూనాంబ పాత్రకు inspiration ఎవరు ?
జవాబు:
బుడుగు రచనకు inspiration.... "Dennis the Menace" అని ముళ్ళపూడి వారు సరదాగా చెబుతారు
బుడుగు స్వరూప స్వభావాలు, భాష, ఆలోచనా సరళి తెలుగు నాట బాగా నాటుకుపోయాయి. నిస్సందేహంగా బుడుగు ఆలోచనా పరిధి, విస్కృతి డెన్నిస్ కంటే చాలా చాలా ఎక్కువ
సీ.గా.న పెసూనాంబ పాత్రకి "మార్గరెట్" ని పాత్రని పోలినది కొంతవరకు. అయితే మార్గరెట్ కు ఉండే అహంభావం ఎంతమాత్రమూ కనిపించని పాత్ర. నిష్కల్మషమైన పాత్ర గా తీర్చిదిద్దారు. బుడుగులో ఉండే గడుసుదనం ఈ పాత్రలో మాత్రం కనిపించదు.
10.
బుడుగు : ఏమి చెప్పాలో "గ్నాపకం" రాకపోతే ____ అంటారు
జవాబు:
బుడుగు : ఏమి చెప్పాలో "గ్నాపకం" రాకపోతే "ఏడిశావ్ అంటారు.
సమాప్తం
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి