25, అక్టోబర్ 2020, ఆదివారం

సాహితీ ప్రశ్నావళి - 28, అంశం : ఆధునిక కవులు

 

సాహితీ ప్రశ్నావళి - 28 (18-10-2020)
అంశం : ఆధునిక కవులు , మూడవ భాగం 




1️⃣ జాషువా గారి అత్యంత ప్రఖ్యాతమైన శ్మశానవాటి ఖండికలో మొత్తం ఎన్ని పద్యాలు కనిపిస్తాయి ? నాటకాలలో తరచుగా వినిపించే పద్యాలు ఎన్ని ?

జవాబు) 

జాషువా గారి శ్మశానవాటిక  మొత్తం 8 పద్యాలు (సీసము + ఎత్తుగీతి ఒకటే పద్యం లాగా గణించాము). 

ఈ ప్రఖ్యాత నాటకంలో బలిజేపల్లి వారి పద్యాలతో పాటు జాషువా గారి పద్యాలు – కేవలం శ్మశానాన్ని వర్ణించేవి మాత్రమే కావడం చేత కాటిసీను అన్న శీర్షికతో ప్రఖ్యాతి చెందాయి. 

జన సామాన్యంలో కూడా ఈ ఖండికలోని మూడు పద్యాలు అత్యంత ప్రజాదరణ పొందాయి 

నటులు, గాయకులు తద్వారా జాషువా సాహితం పై మరింత ఆసక్తి పెంచుకున్నారు  .. 1962 తరువాత అన్ని నాటకాల్లో ఒక నాలుగు పాడటం పరిపాటి అయింది. 

జాషువా గారి పద్యాలు లేని హరిశ్చంద్ర కాటి సీను ఊహించలేనంతగా జనంలోకి చొచ్చుకుపోయిన పద్యాలవి


2️⃣ మంచి మాగాణములన్‌ సృజించి   ఎముకల్‌ నుసిజేసి పొలాలు దున్ని, భోషాణములన్‌ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే

అని ధైర్యంగా ఎలుగెత్తి చాటిన కవి ఎవరు ?

జవాబు)

దాశరధి కృష్ణమాచార్య  అగ్నిధార లోని రైతుదే ఖండిక లోని పద్యం   


ప్రాణము లొడ్డి ఘోర గహనాటవులన్‌ బడగొట్టి, మంచి మా

గాణములన్‌ సృజించి, ఎముకల్‌ నుసిజేసి పొలాలు దున్ని, భో

షాణములన్‌ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే, తెలం

గాణము రైతుదే; ముసలి నక్కకు రాచరికంబు దక్కునే?


ఓ నిజాము పిశాచమా! కానరాడు

నినుబోలిన రాజు మా కెన్నడేని;

తీగెలను తెంపి అగ్నిలో దింపినావు

నా తెలంగాణ, కోటి రత్నాలవీణ. 


3️⃣ విశ్వేశ్వరుని హస్తజలజ యుగ్మమున విశ్వమే హాయిగా విశ్రాంతి చెందె అని ఆశించిన కవి ఎవరు ?

జవాబు)

కృష్ణపక్షంలోని దేవులపల్లి వారి విశ్రాంతి లోని పద్యం. ఈ పద్యాన్ని ఆంగ్లంలోకి కూడా అనువదించారు 


నీలాభ్రసరసిలో నిండు జాబిల్లి 

రాయంచవలె నిహారము సల్పుచుండె 

కమ్మతెమ్మరలు శాఖా పత్రములనొ 

కల్లోలినీ తరంగములనో దాగె 

నాట్యంబు మధుర గానంబును మరచి 

గాటంపు నిద్దురగాంచె శైవలిని 

సర్వేశ్వరుని హస్త జలజయుగ్మమున 

విశ్వమే హాయిగా విశ్రాంతి జెందె !! 



4️⃣ ఉడిపి శ్రీ కృష్ణ విలాస్ లో అటు... ఇటు  చూస్తే  ఏమేమి కనిపిస్తాయి శ్రీశ్రీ గారికి ?

జవాబు) 

మహాప్రస్థానం లోని  సంధ్యా సమస్యలు -  శీర్షికలో పంక్తులు 

ఉడిపీ శ్రీకృష్ణవిలాస్‌లో.....

 అటు చూస్తే బాదం హల్వా,. 

ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ! 

ఎంచుకొనే సమస్య కలిగిందొక ఉద్యోగికి 


5️⃣ అమృతం కురిసిన రాత్రి ఖండికలో తిలక్ గారి పోస్టు మాన్ (తపాలా బంట్రోతు) ఎవరి సలహా మేరకు రచన చేశారు  ? 

జవాబు)

శ్రీ తంగిరాల సుబ్బారావు గారు. అప్పట్లో సుబ్బారావు గారి వయసు 20 మాత్రమే తణుకు లో తిలక్ గారి పక్కింట్లో ఉండే కుర్రవాడు ఆయన.  

1959లో తంగిరాల వెంకట సుబ్బారావు అనే మిత్రుడు జిల్లా తపాలా శాఖ జరుపుకొనే వార్సికోత్సవానికి పోస్టు మాన్ మీద యేదైన కవిత వ్రాయమని కోరి నప్పుడు తిలక్ రచించిన గేయం ఈ కవితా ఖండిక.

ఇప్పుడు శ్రీ సుబ్బారావు గారు చాలా ప్రఖ్యాత విశ్రాంత ఆచార్యులు. శ్రీకృష్ణదేవరాయ సాహితీ సమాఖ్య అధ్యక్షులు 


6️⃣ ముత్యాల సరాలు అను ఆధునిక గేయ ఛందస్సు గురజాడ వారు ఏ సంవత్సరంలో సృష్టించారు ?   

జవాబు)

1910 సంవత్సరంలో 


7️⃣ మహాప్రస్థానం కావ్యం  లోని శ్రీశ్రీ గారి  అత్యంత ప్రకటి పొందిన బాటసారి కవిత్వానికి (కూటి కోసం ..కూలి కోసం.. ) ప్రేరణ ఏ కావ్యం 


జవాబు)

నిజానికి మీలో కొంతమంది స్పిన్బర్గ్ కవి అని చెప్పినా... ఆయన అనంతంలోని వాక్యాలనే నేను ఊటంకిస్తున్నాను 

 గురజాడ వారి పుత్తడి బొమ్మ.. పూర్ణమ్మ నుండి ప్రేరణ పొంది బాటసారి వ్రాసాను అని చెప్పుకున్నారు శ్రీశ్రీ  

కన్నుల కాంతులు కలువల చేరెను

మేలిమి జేరెను మేనిపసల్

హంసల జేరెను నడకల బెడగులు

దుర్గను జేరెను పూర్ణమ్మపూర్ణమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందన్న విషయం పైకి చెప్పకుండా గురజాడ ఒక గోప్యత పాటించారు. బాటసారి కూడా ఎవరికీ తెలియకుండా ఎక్కడో చనిపోతాడు. అతను చనిపోయిన వార్త అతని తల్లిదండ్రులకు చేరుతుందా అన్నది సందేహమే. అందువల్ల, అటువంటి గోప్యతను పాటించే అవకాశం ఇక్కడ ఉన్నా శ్రీశ్రీ దానిని పాటించలేదు. “బాటసారి కళేబరంతో / శీతవాయువు ఆడుకుంటోంది” అన్న వాక్యం ఒక్కటి తొలగిస్తే అటువంటి ప్రభావం వచ్చే అవకాశం ఉందిగాని, ఎందువల్లనో శ్రీశ్రీ దానిని స్పష్టంగా చెప్పటానికే మొగ్గు చూపించారు. 


 8️⃣. కవిత్వానికి నీ ఆదర్శాలతో కానీ నీ మత భేదాలతో లేదా నీ వైషమ్యాలతో ఎంతమాత్రమూ పనిలేదు. నీవు నీ యిష్టము వచ్చినట్టు రాసుకో.... అది కవిత్వమైతే నాకానందమిస్తున్నది అని ప్రకటించిన ఆధునిక యుగం మహా కవి ఎవరు ?

జవాబు)

కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ


9️⃣ రుద్రమాంబా, భద్రకాళి.. లోచనోజ్జ్వల రోచులేవి.... ఖడ్గ తిక్కన కదన కాహళ కహకహ ధ్వనులెక్కడమ్మా? 

అంటూ  వేడుకున్న కవి ఎవరు ?  ఏ కావ్యంలో 

జవాబు)

ఖడ్గసృష్టి లోని ఏవి తల్లి అన్న ఖండికలోని పంక్తులు

మహాప్రస్థానం తరువాత అంటే ఎక్కువగా ప్[రాజాధారణం పొందిన పద్యం సంకలనం ఇది.. మరీ ముఖ్యంగా 

చక్రవర్తిఅశోకుడెచ్చట ?

జగద్గురు శంకరుడెచ్చట ?

ఏవితల్లీ: నిరుడు కురిసిన

హిమ సమూహములు ?

కాళిదాసు మహా కవీంద్రుని

కవనవాహినిలో కరంగిన

ఉజ్జయినినేడెక్కడమ్మాఉంది? చూపించు ? 


1️⃣0️⃣. చిల్లర దేవుళ్ళు నవలా సంకలనం అందించిన ప్రఖ్యాత  కవి, తెలంగాణా సాయుధ యోధుడు ఎవరు ?

జవాబు)

శ్రీ దాశరథి రంగాచార్య గారు 


 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...