11, అక్టోబర్ 2020, ఆదివారం

చిత్రం పై పద్యం - 54, 08.10.2020

 


 

కందము

 

శ్రీ రాముని విజయముకై

వారధి నిర్మించిరపుడు వానరులెల్లన్

కారణ జన్ముడు హనుమయె

సారథిగా నెదురు నిలిచి సాధ్యము జేసెన్!!

 

తేటగీతి

 

రామ చంద్రుని తోడుగ లక్ష్మణుండు

లంక కేగెను సీతకు రక్షకొరకు

వానరులపుడు గట్టిరి వారదొకటి

రావణుని వధియించెను లంకలోన

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

తెలుగు తేనియలు

 

 తేటగీతి

మహిమ జూపంగ వెలసిన మాన్వితుండ

షిర్డి సాయినాథ! ప్రభు! మా చింత దీర్చి

స్వస్థతన్ గూర్చ రావయ్య సాయిదేవ!

సద్గురుడ సర్వమత స్వామి! సౌఖ్యమివ్వు

 

 


 సమస్య.

నిదురం దోగెడి వేళ శీర్ష మహహా  నేలన్ బడెన్ దైవమా

ఇచ్చిన పాదము  మత్తేభము

నా పూరణ సీసములో


హయగ్రీవ చరిత్ర  సందర్భంలో

 

శ్రీ హరి విరామము లేక రక్కసులతో యుద్ద ము  చేసి అలసి పోతాడు   అలసి  అతని ధనువు పైనే నిదుర కొన్ని యుగాల పాటు పోతాడు  అప్పుడు  దేవతలు శ్రీ హరిని ఎలా నిదుర లేపాల అని తర్జన భర్జన పడుచుండగా  శివుడు  అలా నిదుర పోతున్న వారిని లేపరాదు అది మహా పాపము‌  అని  చెప్పి  ఒక చెద పురుగును సృష్టించిన అది వింటి నారి కొరుకు తుంది అప్పుడు  విల్లు వంగి శ్రీ హరి నిదుర లేస్తాడు అని సలహా చెపుతాడు  అప్పుడు చెద పురుగును బ్రహ్మ పంపగా అది వింటి నారిని కొరకుతుంది  ఒక్క సారిగా వింటి నారి తెగి భీకర శబ్దం తో పైకి యెగసి శ్రీహరి తలను నరుకుతుంది

 

ఊహించని పరిణామము గాంచి దేవతలు దిగ్భ్రాంతి చెంది దేవిని ప్రార్థన చేస్తారు  ఆమె హయగ్రీవుడను రాక్షసుని మరణము కోరి శ్రీవారి తల తెగి పడి నది  ఒక గుర్రము తలను అతికించమని ఆనతి ఇస్తుంది అప్పుడు అశ్వము తలను తెచ్చి అతికించగా  చక్రి  హయ గ్రీవ నామము బడసి  హయగ్రీవుడు అను రాక్షసుని సంహరిస్తాడు

 

 సీసము

రక్కసులను బట్టి  రణము విరామము నెరుగక తాచేసి నిదుర రాగ

ధనువుపై ముదముగ తలనుంచి నిదురించె శౌరి కడుయుగముల్,నారి నొక్క

చెదపురుగు కొరుకన్ శీఘ్రగతిని నిద్ర మేల్కొను నని పల్కె మిత్తి గొంగ,

వమ్రిక‌ నొక్కటి పంకజ జన్ముడు కోర నా ధనువును కొరికెనుగ,

పి నిదురం దోగెడి వేళ శీర్ష మహహా నేలన్ బడెన్ దైవమా లిఖిత మి

 

ది గద తరచి చూడగ నని దివిజు లెల్ల

వేదన బడసి దేవిని వేడె,నామె

యానతి బడసి నతికించ యయువు తలను,

విధు డపుడు హయ గ్రీవుడై వెలుగు నొందె

 

యయువు  =  గుర్రము,  వమ్రిక.    = చెద పురుగు, 

మిత్తిగొంగ.  = శివుడు,  కపి= హరి

పూసపాటి

తెలుగు తేనియలు

 

గేయ రచన,

ఒడలు మరచి పనులు సలిపెడి కష్ట జీవికి,

రైలు ప్రయాణములో అతి కష్టము పై కూర్చొను

సీటు దొరక సుంత సమయమునకు నిద్ర పట్టి,

నిద్రించెడి వేళ శిరము నేలను కూలెన్....

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

తెలుగు తేనియలు


 

 సముద్రాన్నె దాటినారు

స్వర్ణలంక ఒక లెక్కా?

ధర్మనిరతి చాటినారు

రావణవధ జరుగును పక్కా!

ఆంజనేయుడే తోడుగ

సుగ్రీవుడె ఘననీడగ

జాంబవంతుడనుభవమ్ము

నలనీలుల భుజబలమ్ము

లక్ష్శణుని శౌర్యతేజము

వెంట రాగ .. వెడలె రాముడు!

ఆతని చూపులె బాణము

ఆతని పిలుపుయె ఖడ్గము

ఆతని నడకయె సైన్యము

ఆతని ధర్మప్రయాణం

శ్రీమద్రామాయణం!.........

 

రాంమోహన్, నిజామాబాద్

తెలుగు తేనియలు

 

 

రామాయ , రామచంద్రాయ

శ్రీ రామ చంద్రుని ధ్యానిస్తూ  , హనుమను ప్రార్ధిస్తూ

భయములు , అనుమానములు , బద్ధకములు తరిమికొడుతూ

మంచి ఆలోచనలతో తగిన వారి సలహాలు , సహాయములు తీసికొనుచూ

ధైర్యముగా ఎటువంటి కఠిన కార్యముననైనను

సఫలీకృతము చేసుకొనుచూ జయములు పొందవచ్చు గదా !


మురళి మోహన్ 

తెలుగు తేనియలు

 

 

తేటగీతి మాలిక

శ్రీ మహావిష్ణు వవతార స్వీకరణ మొ/

నర్ప శ్రీరాముడై తోడ నంతు డాయె/

లక్ష్మణునిగ సాయముకై పురంధరుండు/

వచ్చె తోటి దేవతలతో వానరాది/

రూపముల దాల్చి. రాము డరుణు డవగ /

ముద్రు డరుదెంచె. నిర్మాణము జరిపించి/

సేతువున్ దాటె రాముడు సేన తోడ./

రావణ వధ కేవల మిక లాంఛనంబు

 

వారణాశి శ్రీలేఖ

తెలుగు తేనియలు

 


 

సీతను గనుగొని సీరియ తిరువడి జాడను తెలిపెను సంతసముగ

దశరధ సుతునకు, దశకంఠుని పురము జేరగ తలచుచు మోరమొకపు

తతులతో రాముడు తరిషము దాటగ మ్రొక్కె వినయముగ మొసలి పట్టు .

దొరను పురము జేఱ ద్రోవను జూపమ     వినని నీరథి    నాధు  పొగరు

కాంచి శరమును సంథించగ  పరుగిడి శరణము జొచ్చియా సంద్రమందు

సేతువు కట్టగ శ్రేయ స్కరమనుచు తెలిపి వెడలను  నా  ధేనపు నధి

పతి, నలుడు ముదమున్ ప్లవగ భల్లూక సమూహములు సహాయము నిడుచుండ

 

కట్టె నొక ఘన వారధిన్ కడలి పైన

రాముడు, సుమిత్ర సుతుడు వారధిని కాంచి

సంతసించి సుగ్రీవుని సచివు లెల్ల

వెంట రాగ దశముఖుని వీడు జేరె

 

సీరియ తిరువడి  =  హనుమంతుడు,

మోరమొకపు తతులు=  వానర సమూహము

తరిషము ,మొసలిపట్టు,నీరధీ,ధేనము   =  సముద్రము

ప్లవగము = కోతి

వీడు  = పురము

 

పూసపాటి

తెలుగు తేనియలు

 

 

తేటగీతి

వార్ధి పై వారధిని గట్టు వానరు లదె

నాకు నండగ నుండ దానవ పతిని

మరము నందున నవలీల మరణ మొంద

జేతు చెర నుండి విడిపించి సీత( దెత్తు.

 

తేటగీతి

అన్ని ఇంద్రియముల యందు కన్ను ముఖ్య

మోయి! శ్రద్ధగ కాపాడు మోయి! ఆకు

కూరలు, మరి క్యారెట్లను కూర్మి తినుము

జీవితాంతము వెలుగులు చిందు నటుల.

 

డి.రామ నాగేశ్వరరావు

తెలుగు తేనియలు

 

 

కందము

బెదురుచు పరీక్ష కొరకని

కదలక మెదలక ఘనముగ కంటిని నిలుపన్

చదువగ నే నిశిరాతిరి

"నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్"!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

తెలుగు తేనియలు

 

 

చిత్రానికి కవిత

సాకేత పురరాజు

సౌమిత్రునితోబోయి

సీతమ్మను జేకొనుటకు

సేతువును జేర

 

వాయుపుత్రునితోడ

వానర రాజును గూడి

వానర సైన్యముతో

వారధిని నిర్మింప

 

రామచంద్రుడపుడు

రావణుని జంప

రణరంగమునకు

రయముగ వెడలె.

 

డి. వి. హేమలత

తెలుగు తేనియలు

 


 

వారధి నిర్మాణంలో శ్రీరాముని ధర్మదీక్షా గరిమని తెలియచెప్పే చిన్న ప్రయత్నం.

శార్ధూలము - 1

తాపోద్పాదక దీక్ష ధర్మనిరతిన్

ధ్యానించగా సంద్రమున్

సోపానంబు విభావ మార్గములతో

స్తోత్రమ్ములన్ దీక్షగా

కూపారంబున రాళ్ళవేయు,

జలజాక్షుం సంతసించంగనే

స్థాపింపన్ కపి వీరశౌర్య

గరిమల్ సంస్థాపనౌ ధర్మమున్

 

 శ్రీరాముని తో ఉన్న వానరవీరుల అంతరంగము

శార్ధూలము -2

శ్రీరామా ! కృపతోడు సంద్రములనే

శ్రీఘ్రంబుగా దాటుచూ

భారమ్మీవె యటంచు నమ్మి నడిచెన్

భాస్వంతమౌ స్తైర్యముల్

వీరాగ్రేశర వానరుల్ ప్రభవమౌ

విక్రాంత తేజంబులై

శ్రీరామా ! కరుణాకటాక్షములనే

స్థేమంబులన్ రక్షతో

 

కస్తూరి శివశంకర్

తెలుగు తేనియలు

 

కారణ జన్ముడైన రామునికి సాయపడిన పరిజనము గురించి తెలుపు ప్రయత్నం సీసం లో

సీసము

వారధి నిర్మించె వానర సేనయే

దైవ తలంబిది తరచి జూడ

పరమ పావనునికి వానర, భల్లూక

సేన సాయము జేసె శ్రీకరముగ

కారణజన్ముని ఘనత యిదియె గదా

రావణు నోడించు ప్రకృతి నందు

లక్షల ప్రాణులు లంఘించి తోడ్పాటు

నందించుటయె మిగులబ్బురంబు

 

తేటగీతి

రామునికి సాయపడెడి వరండకమ్ము

జేసికొన్న యదృష్ఠంబు జెప్పతరమ!

రావణుని పీచమణచుటే రామదండు

లక్ష్యముగ పోరు సలిపి ధర్మము నిలిపిరె

 

వెంకట్. సిహెచ్

తెలుగు తేనియలు

 వరండకమ్ము= సమూహం


 

సీసము

వారధి దాటెను వానర మూకతో కోదండ పాణియే కొలువు దీరి

లంకను జేరెను లక్ష్మణ సుగ్రీవ యాంజనేయుల తోడ నరిని దునుమ

వీరులన్ జూడరే వీరత్వ మొలికించు మొనగాండ్ల పోలిన మోము జూడ

వైరిని గెలిచెడి వైవిధ్యమౌ వారి పోరాట పటిమయు పొంచి యుండ

 

ఆటవెలది

విభుని రాక కొరకు వేచియున్న సాధ్వి

తెలిసి కొనెను వారి తెగువ గూర్చి

మూడు లోకములను ముచ్చట గొలిపెడి

రామ కథకు నాంది రమణి బలికె

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, మహారాష్ట్ర

తెలుగు తేనియలు

 

 

విజయోస్తు

శ్రీ రాముడు హనుమతో మరి వారి పరివారముతో

కలసి కట్టుగా చర్చించుకుంటూ , పద్దతిగా ఆలోచిస్తూ

ఆలోచించిన రీతిలో సంఘటిత శ్రమ చేసుకుంటూ

ఘాన విజయం పొందినట్లే ఎందరో మహానుభావులు

రామచంద్రుని తలచుకొంటూ, హనుమ అండతో

బృహత్తర మహత్తర ఫలితములు పొందిన విధముగా

యువత కూడా విజయములను సాధించ వలెను

 

మురళి మోహన్ 

తెలుగు తేనియలు

 

 

ఒక  అద్భుత సంస్కృత  శ్లోకం  .


శ్లో||అమంత్రం అక్షరం నాస్తి

నాస్తి మూలం అనౌషధం

అయోగ్యః పురుషో నాస్తి

యోజకా తత్ర దుర్లభా||


అర్థం: 

మంత్రం కాని అక్షరం లేదు. ఔషధం కాని చెట్టు వేరు లేదు. పనికి రాని మనిషీ లేడు. వీటిని ఉపయోగించుకునేవాడే లభించటం లేదు.

వ్యాఖ్యానం:

అక్షరాలు అన్నీ మంత్రాలే . సామాన్య మైన 

" రామ" అనే మంత్రాన్నిజపించి బోయవాడు వాల్మీకి మహర్షి గా మారాడు. మాటలలో మహత్తరమైన శక్తి ఉంది. ఒక మంచి మాట వింటేమనస్సు ఆనంద పడుతుంది. ఇంకొక చెడ్డ మాట వింటే మనస్సుకు బాధ కలుగుతుంది. మాటతో జీవితం మారుతుంది. మాట తేడాతో యుద్ధాలు జరుగుతాయి. మామూలు గా కనిపించే మాటనే మంత్రం గా సాధన చేసి ఫలితాన్ని పొందవచ్చు. ఇక బీజాక్షర సంయుక్తం అయిన మహా మంత్రముల మహిమ వేరే చెప్ప వలసిన పని లేదు. 


ఇక చెట్ల ఈ విషయంలో, ప్రతి మొక్కలోనూ ఔషధ లక్షణాలు ఉన్నాయి.  చరకుని గురించి కూడా ఒక కథ చెప్తారు. వైద్య శాస్త్రాన్ని బాగా అభ్యసించిన తరువాత ఈయనకు గురువు గారు ఒక పరీక్ష పెట్టారు. ఒక ఏడాది పాటు దేశమంతా తిరిగి అన్ని మొక్కలనూ పరిశీలించి, వైద్యానికి పనికి రాని మొక్కను ఒక దాన్ని కనుగొని దాన్ని తెచ్చి ఇమ్మని గురువు చెబుతాడు. చరకుడు అలాగే సంవత్సరం పాటు పరిశీలించి తిరిగి ఉత్త చేతులతో వస్తాడు. ప్రశ్నార్థకం గా చూచిన గురువుతో- వైద్యానికి పనికి రాని మొక్క తనకు కనిపించలేదని చెబుతాడు. అప్పుడు మాత్రమె ఆయనకు వైద్య శాస్త్రం లో పరిపూర్ణత కలిగినట్లు గురువు భావించి ఇక నీవు వైద్యం చెయ్యటం ప్రారంభం చేయ వచ్చు అని అనుమతి ఇస్తాడు. 


అదే విధం గా పనికి రాని మనిషి కూడా ఈ ప్రపంచం లో ఉండడు. కొందరిలో తెలివి తేటలు తక్కువగా ఉండొచ్చు. కాని వారు కూడా పరిశ్రమ తో గొప్ప వారు కాగలరు. ప్రకృతి అన్నింటినీ మనిషికి ఇచ్చింది. ఒక్క బద్ధకాన్ని, సోమరి తనాన్నిఒదిలించుకో గలిగితే, ధైర్యాన్ని పుంజుకో గలిగితే మనిషి సాధించలేనిది లేదు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, అది అందరికీ తెలిసిందే కదా. యోగ వాశిష్టం లో ఒక గొప్ప శ్లోకం ఉంది. "దైవం నిహత్య కురు పౌరుష మాత్మశక్త్యా" అని శ్రీ రామునికి గురువైన వశిష్ట మహర్షిచెబుతాడు. ఓ శ్రీ రామా, పురుష ప్రయత్నానికిమించిన ఉపాయం లేదు. కావున పౌరుషం తోనూ, ఆత్మ శక్తి తోనూ విధిని జయించు. అని ప్రబోధిస్తాడు. 

ఈ విధం గా ఉత్సాహంతో ప్రయత్నం చేసే వారికి ప్రకృతిలో అన్నీలభిస్తాయి. 

ఆఖరి విషయం - మాటలను కానీ, మనుషులను కానీ, మొక్కలను కానీ, వాటి వాటి యోగ్యతను బట్టి ఉపయోగించుకోవాలి.. ఇదే వివేకుల లక్ష్యం..

కె మల్లికార్జునరావు 


 

సర్వశక్తిమంతుడు ధీర వీర శూరుడు

కదిలినాడు భీషణ కోదండ రాముడు

రావణు ఖండనకై శ్రీకారం చుట్టినాడు

అదిశేషు సౌమిత్రిగ  జతకూడి నాడు

 

రుద్రుడు హనుమగ తోడు చేరినాడు

సూర్యపుత్రు సేనతో వెంట వచ్చినాడు

జలపతి భయపడి దారి నొసగినాడు

అగస్త్యుడూ సాయానికి  సిద్ధమైనాడు

 

ఎదురా మా రఘుపతికి నీవు రావణా

తపములశక్తి నమ్మిన  వెర్రి రావణా

హరువరము నమ్మి హరికి వైరివైనావు

బ్రహ్మవరముతో రణమున కురికినావు

 

తప్పదు నీ సంక్షయము కులక్షయము

రయమున చేరుము రాము శరణము.

 

కె మల్లికార్జునరావు

తెలుగు తేనియలు

  

 

మరి రాక్షస భీకరులతో యుద్ధమేమి?

రాముని వైపు ఒక పట్టాన కుదురుగా ఉండని వానర సేన, భల్లూక సేన లుండి రావణ వధ చేయడం ఏమిటి..  అంతా జగన్నాటక సూత్రధారి లీలలు కదా..

దైవ లీలలివి సతము తన్మయత్వ

మిచ్చెడి పురాణ పురుషుని యిచ్ఛనందు

యుద్భవించెడి లీలల యొరపులివియె

వందనంబు జనార్థనా! పావనుండ!

 

వెంకట్ సి. హెచ్

తెలుగు తేనియలు

  

 

సీసము

రాఘవుండర్ధించ రాళ్ళు తేలునటుల

దారిడె నంబుధి ధార్మికముగ

వానరాదులు గట్టె వారధి స్వామిభ

క్తిని చాటితిరిలకు కేలుమోడ్చి

యుడుత పొర్లి నిసుక నొడ్డుకేసి జగతి

నిల్చె రామ కృపకు నిత్య స్ఫూర్తి

సీతమ్మ రక్షణ శ్రీకరమ్మందల్చి

సాగె స్వామికి తోడు సాదు జనులు

 

 తేటగీతి

 మానవాకృతిన్దాల్చె నమలిన శక్తి

నరుని రూపంబున యిలకు నడచి వచ్చి

మచ్చు జూపె పరగువిధ మ్మనుష తతికి

ధర్మవర్తన సత్యమౌ దారిచూప

 

వాణిశ్రీ నైనాల

తెలుగు తేనియలు

 

 

కందము

కానల కేగిన రాముని

వీనుల విందగు పలుకులె  విస్ఫారితమై

యూనికగ చెలిమి గూర్చగ

వానర సైన్యమ్ము తోడ వార్ధిని దాటెన్!

 

చంపకమాల

బలిమిగ నిల్చి సోదరుడె భవ్య శుభమ్ములు గూర్చ; వానరుల్

విలసిత మైత్రి జూపగను వీకను తామె కుతూహలమ్మునన్

ఎలమి విభీషణుండె చెలిమిన్ దరి చేరగ తాను దోడుగా

నలఘు బలమ్మె రామునికి నండగ నుండగ నివ్విధమ్ము దో

హలమున రాఘవుండు దనుజాధిపు జంపెను సంగరంబునన్!

 

చల్లా దేవిక.

తెలుగు తేనియలు

 

 

కవిత

రాజీవ నేత్రుడు రమణి సీత కొరకై

రావణు తోడను రణము తలచి

వానర  యోధులు పావని వెంటన

డువ లక్ష్మణ సహితుడుగ కడలిని

దాపించ యుత్తుంగ తరగల వారాశి

నెటుల దాటవలెనని దురపిల్లె

వారాశి  బోలిన వానర సైన్యము

వారాశిని కడచ పాలిగట్ట

 

నలుడు  వానరులనుకూడి శిలలు పేర్చి

వారధిని గట్ట  దాటిరి  వానరములు

యబ్ది రామ లక్ష్మణులను హనుమ మోయ

లంక  చేరి సిద్ధపడిరి  రణము  చేయ

 

అవళూరు సీత

తెలుగు తేనియలు


 

తేటగీతి

హనుమ జెప్పెను చూసితి యతివ సీత

ననుచు. రాముడాదరముగ నదుముకొనెను

సందిటన్.  నోర్మితో కట్టె సాగరమున

వార దొక్కటి. జానకి ప్రతిన దీర్చ

రాఘవుండు తరలివెళ్ళ లంక దరికి

రణము జేసెను ధీరుడై . లక్ష్మణుడును

దాశరధి పూని గెలిపించె ధర్మమమును

 

రమ, కంకిపాడు

తెలుగు తేనియలు

 


ఎదురీత

కాలప్రవాహం లో

నిత్యం ఎదురీత..

విధిరాసిన తలరాత

ప్రవాహానికి ఏదోరోజు

అలుపొస్తుంది ..

నీకు దారిచ్చి తీరుతుంది

ఎదురొడ్డి కడదాకా

నిలిచిన వాడే

అంతిమ విజేత!

 

వసుధ

తెలుగు తేనియలు


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...