7, సెప్టెంబర్ 2020, సోమవారం

ఆదివారం అందరిదీ . . . .

 


ఆదివారం కవిత

ఈవ్ టీజింగ్..!


మెల్లగా రోడ్ పక్కగా

నడిచి పోతోంది.. మేక

భౌ భౌ మంటూ వెంటాడుతూ

బలిసిన కుక్క..!


పెరటిలో కో కో కో మంటూ

తిరుగుతూ కోడి..

ఒక్క ఉదుటున దూకి

మెడ పట్టిన మరో కుక్క..!


గోడవారగా భయంతో పరుగెడుతూ ఎలుక

అమాంతం పైబడి నోట కరిచిన పిల్లి..!


రాత్రి పగలు తేడా తెలీక  

వెలుగుతున్న దీపాన్ని లెక్క చేయక

స్వేచ్ఛగా ఇంట్లో తిరిగే సీతాకోక చిలుక

గోడమీద ఆనీ ఆనగానే

దానిమీదకు దూకి పీక కొరికిన బల్లి!


దగ్గరనుంచి ఈ దృశ్యాలు చూస్తున్న నాలో

ఏదో సంశయం!

ఈ రావణ, కీచక, దుశ్శాసన సంస్కృతి..


మృగం నుంచి మనిషిలోకి ప్రవేశించిందా..!?

మనిషి నుంచి మృగానికి దాపురించిందా అని


కాలాలు మారుతున్నా..మారని ఈ దుస్థితికి

ఏ కాలంలోనైనా ఈ ఘాతుకాలకు 

తెరపడుతుందా అని.!


 వసుధ

*************** 


ఎస్పీయం

 ఏంటయ్యా నీకూ నాకూ ఉన్న సంబంధం?

ఏ అనుబంధం ఉంది గనక!
ఏ రక్త సంబంధం ఉంది గనక!
అసలు నువ్వు నాకు ఏమవుతావు గనక... 
నన్నింతగా లొంగదీసుకుంటున్నావ్!?!
అసలు ఎవరివయ్యా నువ్వు??? 
అమ్మ చేతి కమ్మని  గోరు ముద్దవా... కాదే!
పసిపాపల్లో కనిపించే దైవానివా...కాదే !
నెచ్చెలి వెచ్చని కౌగిలింతవా.... కాదే !
తొలకరి పలకరింపులోని పులకరింతవా ... కాదే!
వెన్నెల గుత్తివా 
మల్లెల మత్తువా 
చిక్కని చుక్కవా 
చక్కని చుక్కవా 
ఎవరివయ్యా నీవసలు? 
ఏంటయ్యా నీ వేషాలు?
నువ్వదా నువ్విదా 
నువ్వందులో ఉన్నావా 
ఇందులో ఉన్నావా అని 
నిన్ను నిలదీయలేనుకానీ...
అన్నింటా నువ్వే ఉన్నావయ్యా!
అవును... అమ్మ తోడు.  
ఈ వయసులో అమ్మే గనక నాకు జోల పాడితే 
"ఆపవే నీ గోల'' అంటానేమో!!
మరి నువ్వు పాడితే....  
నా ఉనికినే మరచిపోతున్నానయ్యా! 
ఈ వయసులోనూ నన్ను పసిపాపను చేసి 
అమ్మనే మరిపిస్తున్నావయ్యా  ఎస్పీ!
అమ్మనే మరపిస్తున్నావ్. 
ఇంక నువ్వలా నీలో నువ్వు పాడుకోకు 
బైటికొచ్చి కాస్త గట్టిగా పాడు... 
నూరేళ్లపాటూ... నిండు నూరేళ్లపాటూ
ప్లీజ్...

 

----అ.అ----
అత్తిలి అనంతు,  ముంబాయి

********************************************

 

సేకరణ మాత్రమే సరదాకి

ఇంట్లో ఎవరూ ప్రయత్నించ వద్దు..


అన్యోన్య దాంపత్యాలు - చతురోక్తులు 
ఓ మారు మునిమాణిక్యం నరసింహారావు గారు  తల్లావజ్జుల శివశంకరస్వామిగారిని ఇలా కదిపారు.

 

   "అన్నగారూ! నాకు మా ఆవిడతో ఒక నిమిషం పడదు. నిత్యం దెబ్బలాడుకుంటూంటాం. ఒక్క నేనేనా? ఇతరులు కూడా అలాగేవుంటారా?" 
తల్లావజ్జులవారు నవ్వుతూ "మనవాళ్ల అన్యోన్య దాంపత్యా ల గురించి చెబుతాను విను"  అని ఇలా కొనసాగించారు.

 

"★ ముందుగా చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గురించి చూద్దాం. ఆయన ఎప్పుడూ ఇంట్లో వుండరు. నానా రాజసందర్శనం అంటూ ఎప్పుడూ దేశాలమ్మట తిరగడమే! ఇక ఇంట్లో వుండేదెప్పుడు? దెబ్బలాడుకొనేదెప్పుడు ? కాబట్టి వీరిది అన్యోన్య దాంపత్యం.

 

  ★అలాగే గిడుగు రామమూర్తి. ఆయనకు బ్రహ్మచెవుడు. ఆవిడ తిట్టే తిట్లు ఆయనకు వినిపించవు. అందువల్ల ఇరువురి మధ్యా కజ్జాల్లేవు. కాబట్టి వీరిరువురిదీ అన్యోన్య దాంపత్యమే!

 

 ★ఇక జమ్ములమడక మాధవరామశర్మ సంగతి. ఈయన దీ ఆదర్శ జీవితమే. ఏమంటారా? ఆయన సంస్క్రతంలో తప్ప మాట్లాడరు. మరి ఆమెకేమో సంస్కృతం రాదు. భాషాభేదం కారణంగా ఇద్దరిలోనూ పొరపొచ్చాలు లేవు.

 

 ★ఇంకా విను. మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారేమో, ఎప్పుడూ ఊహాలోకంలో వుంటాడు. భార్యతో దెబ్బలాడ డానికి ఆయన ఎప్పుడైనా వాస్తవ జీవితంలోకి వస్తే కదా ?

 

  ★ఇక నా గురించి అంటావా, తీరా దెబ్బలాడడానికి సిద్ధం అయ్యేటప్పటికి మా ఆవిడేమో చనిపోయింది మరి. కాబట్టి ఏతావాతా చెప్పేదేమంటే మనందరివీ అన్యోన్య దాంపత్యాలే!" ఏమంటావ్! అంటూ బోసినోటితో పకపకా నవ్వారు మన శివశంకరులు. 


*************************


పదమాయాపథం


మూడు పదాలను , వాటి అక్షరక్రమంలో  నిలువుగాను, అడ్డంగాను చదివి చూడండి. రెండు రకాలుగా  చదివినా అవే పదాలు అబ్బురంగా! 


స మ త

మ జ్జి గ

త గ ము


కం చ ము

చ క్కె ర

ము ర ళి


క్షీ ర ము

ర వ్వ లు

ము లు కు


కా ను పు

ను వ్వు లు

పు లు లు


కా ర ము

ర గ డ

ము డ త


స మ త

మ ర ల

త ల పు


త మ కం

మ ర్యా ద

కం ద కం


పొ ల ము

ల లి త

ము త క


ధ న ము

న వ్య త

ము త క


వ ర స

ర వి క

స క లం


హి మ జ

మ న ము

జ ము న


క వి త

వి న ల

త ల క


కో వె ల

వె న్నె ల

ల ల న


మ న సు

న య నం

సు నం ద


ది న ము

న గ రి

ము రి కి


టో క రా

క వ్వ ము

రా ము డు


ప్ర వే శం

వే ది  క

శం క రం 


********************************


అమేయమైన పదసంపద గల్గిన భాషాభిమానులకూ, విశిష్ట రంగాల్లో సేవ చేస్తున్న వారికీ, ఉపాధ్యాయులకూ, వైద్యులకూ, ఆర్ధిక నిపుణులకూ, శాస్త్రవేత్తలకూ స్వాగతం.


చంపకమాల

సురుచిర జ్ఞానసంపదల సూరవరేణ్యులు, సత్కవీశ్వరుల్; 

నిరుపమ సారసంపదలు నిండిన సత్కవితామృతంబులన్

పరిచయమీయు మేటి పదవల్లరులెన్నియొ పంచుకోవలెన్ 

వరములు తోడు తేనియల పల్లవులై సరదాల సందడై  ! 


శివశంకర్ కస్తూరి  

 ***********************

 

సేకరణ . . . . . . 

ఆదివారం నా ఆలోచన


ఒంటరివాడయ్యాడు.....
అవును....
ఉపాధ్యాయుడు ఒంటరై పోయాడు.
నిరాశ, నిస్పృహలు
అధికారుల బెదిరింపులు,
అనధికారుల ఒత్తిళ్లు,
ప్రజా ప్రతినిధుల పెత్తనాలు,
బడి బాధ్యతలు,
కుటుంబ బరువులు,
ఆరోగ్యం పై భయాలు,
పై పెచ్చు ప్రభుత్వ సాచివేత ధోరణి తో..
ఉపాధ్యాయుడు ఒంటరి వాడయ్యాడు.
సమాజం ఇచ్చే గౌరవం ఉపాధ్యాయ దినోత్సవ ఉపన్యాసాల్లో మాత్రమే కనపడుతోంది. ఎవరైనా కూడా, ఉపాధ్యాయుల జీతాల గురించి మాట్లాడే మొనగాడే......... పోలీసుల, రెవెన్యూ, మునిసిపాలిటీ, వైద్య, పంచాయతీ రాజ్, రిజిస్ట్రేషన్, అబ్కారీ, ఎక్సైజ్, ఇరిగేషన్, విద్యుత్తు మొదలగు ఎన్నో డిపార్ట్మెంట్ లు ఉన్నా, వాళ్ళ జీతాలగురించి, భత్యాల గురించి మాట్లాడరు.  ఎందుకంటే, వాళ్ళఅందరితో అవసరం. వారిపై కామెంట్స్ చేస్తే పనులు సాగవు ఆగిపోతాయి. అదే, ఉపాధ్యాయులతో అవసరం లేదు. వీళ్ళతో ఒరిగేదేమీ లేదనే నీచపు భావనతో చాలా మంది ఉండడం శోచనీయం. కాబట్టే నోటికొచ్చిన మాటలు రాయడం, పోస్ట్ చేయడం. ఇవి చూసి నోట మాట రాక ఉపాధ్యాయుడు ఒంటరై పోయాడు.
ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇరువురు ప్రభుత్వ సేవకులే అనే భావన లేదు. జీతం పెరిగితే ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ పెరుగుతుంది. ఒక్క ఉపాధ్యాయులకు మాత్రమే కాదు అనే కామన్ సెన్స్ కూడా లేకుండా కొందరు కామెంట్స్ చేయడం నన్ను చాలా బాధిస్తోంది. కరువు భత్యాలు లేవు, వేతనాల పెంపుదల లేదు. కనీసం మధ్యంతర భృతి లేదు. సగం జీతాలతో సగటు ఉపాధ్యాయుడు పడే బాధలు ఎవరికి తెలుసు. పంతులు కాబట్టి, సమాజం నాకు ఇంకా విలువను ఇస్తుంది అని గుడ్డిగా నమ్మే అమాయకుడు కాబట్టి, లోపల చినిగిన బనీను వేసుకున్నా, పైకి తన వృత్తికి హుందాతనం ఇవ్వడానికి తెల్లబట్టలు వేసుకుని దుఃఖాన్ని దిగమింగే బతుకలేని బడిపంతుళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. పాపం ఇక ప్రయివేట్ ఉపాధ్యాయుల వెతలు సీతమ్మ వారికష్టాలకంటే ఎక్కువే. ఇవి దిగమింగలేక, పిచ్చిగా దిక్కులు చూస్తూ ఉపాధ్యాయుడు ఒంటరి వాడయ్యాడు.
తన తో పాటే ఇతర డిపార్ట్మెంట్ లలో చేరినవారు పదోన్నతులు పొంది ఉన్నత స్థానాలను అలంకరిస్తున్నా, బిక్కమొకం వేసుకొని, గొంతు చించుకొని అరుస్తూ, విద్యార్థుల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఉపాధ్యాయుడు ఒంటరి వాడయ్యాడు.
ప్రభుత్వం, సమాజం ఉపాధ్యాయులను చిన్న చూపు చూస్తున్నది. పోనీ విద్యాశాఖ అధికారులైనా..... మన డిపార్ట్మెంట్ వారేకదా అని  సానుకూల వైఖరిని ప్రదర్శిస్తారా... అదీ లేదు. MEO మెసేజ్ పెట్టి, అర్జెంట్ ఒక్క గంటలో రిపోర్టు ఇవ్వాలంటారు. ఏదైనా వెసులుబాటు అడుగుదామంటే, DEO గారి ఆర్డర్ అంటారు. కరోనా లోకమంతా ఉంది, భయంతో వణుకిపోతున్నామని అరచినా, మా ఆరోగ్యాలకు రక్షణేది అని బతిమాలినా, మొర వినే నాధుడే లేడు. పై పెచ్చు, ఇల్లిల్లు తిరిగి క్లాసులు చూస్తున్నారా, నోటు పుస్తకం లో రాసుకుంటున్నారా, TV లేని విద్యార్థులు ఉన్న వాళ్ళింట్లో కూర్చుని చూస్తున్నారా, ఇవన్నీ రిజిస్టర్ లో నమోదు, పైకి రోజురోజు నివేదిక అందించడం. మూలిగే నక్క మీద తాటిపండన్నట్టు గౌరవ అధికారుల మెమోలు, షోకాజ్ నోటీసులు. ఇవి చాలు మహాప్రభో... అనుకున్న సమయంలో విజిటింగ్ టీములు. వారికి సంతృప్తి కై చకోర పక్షి వాననీటికై చూసినట్టు చూడడం. మెచ్చుకోలుగా ఒక చూపు చూస్తే చాలు అంతే, పొంగిపోవడం. ఇంతే తెలుసు. పాపం ఉపాధ్యాయులు అల్పసంతోషులు. కాదు.... కాదు....... అత్యల్ప సంతోషులు. CRP ల నుండి CM దాకా అందరికీ ఉపాధ్యాయుడు లోకువే. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఆన్లైన్ క్లాసులు ప్రభుత్వ ఉపాధ్యాయుల చావుకొచ్చింది. ఏం చెయ్యాలో పాలుపోక ఉపాధ్యాయుడు ఒంటరి వాడయ్యాడు.
రాస్తే రామాయణం, చెబితే భారతం. మనసు రాయి చేసుకుని, హృదయాంతరాళాల నుండి వస్తున్న ఆవేదన, ఆందోళన, అభద్రతా భావం అనుభవిస్తూ, చుట్టూ అందరూ ఉన్నా ఎవరికీ మనసు విప్పి చెప్పుకోలేక, కనీసం సానుభూతి చూపే వారు కూడా కరువై............. సమూహంలో, సమాజంలో ఉన్నా, ఉపాధ్యాయుడు ఒంటరి వాడయ్యాడు.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా తోటి ఉపాధ్యాయులు అందరికీ అన్యమనస్కంగా, భారంగా శుభాకాంక్షలు చెబుతున్నాను.

 

A.V.R.చార్యులు, 

 

సేకరణ

జి. రామ్మోహన్  

*********************************** 

 

గోదారమ్మ దగ్గర నుండి ఒడిలోకి.. ఒరవడిలోకి  వచ్చేసారు.


తేటగీతి  

కృష్ణవేణి  పొంగించుగా హృద్యమౌను   

విజయవాడలో వెలయు మీ విభవమందు      

ఘనఘనాఘన రవముచే గంధమలది       

సుంద రమయమై సంభ్రమ స్ఫురణ దనర     

సైకతంబుల సీమలో సంచరించి


 

 శివశంకర్ కస్తూరి  

***********************


అంశం. జాలరి జీవనం, 
గేయ కవిత. 
               బతుకు నావ... 

 


బతుకు నావ బయలుసాగెనే, 
సంద్రంలోకి...నడి సంద్రంలోకి,     " బతుకు నావ "
చద్దిమూట గట్టి, తెడ్డు చేత బట్టి, 
వలను చంకన పెట్టి, బుట్ట నెత్తి నెట్టి, 
బీడీలు జేబునకుక్కి, వెళ్తూనే "సాయి "కిమొక్కి, 
ఇల్లాలు సాగనంప, పెద్ద పిల్లాడు తోడు రాగా.... 
ఇసురు గాను నీ చేయి.. వలను విసిరేయి, 
దొరికిందా సేపా, దొరక్కుంటే శాపం, 
కమ్మేను కారుమబ్బు, పొంచుంది పెను తుపాను, 
దాపు లోనే సుడిగుండం, అదే నీకు ప్రాణ గండం.. 
గండాలు గట్టెక్కి, తీరం చేరుకుంటే, 
షావుకారు మనుషులొచ్చి సరుకు లాక్కు పోయె, 
వడ్డీలు తీరకుండే, అసలు  ఊసు లేదాయె, 
బతుకంతా అప్పులపాలు, కష్టమంతా గంగపాలు... 
ఉన్నాడు చూడవోయి, ఆపదలు గాచు "సాయి "
ఆ సాయి కి మొక్కవోయి, ఇక్కట్లు తీరునోయి 
అద్దరికి చేరవోయి.. నిను దరికి చేర్చునొయి, 
నీ కష్టాలు తీరునోయి, ఇక బతుకంతా హాయి,హాయి. 
ఇది నా స్వంత రచన. దేనికి అనుకరణ అనుసరణ కాదు. 

 

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి, 

*****************************************************


 

 


 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...