15, సెప్టెంబర్ 2020, మంగళవారం

తెలుగు సాహితీ ప్రశ్నావళి 13 - 08 - 2020 , అంశం : *కవి సమ్రాట్ విశ్వనాథ, ముళ్ళపూడి సాహిత్యం *

 


 

1️⃣ ముళ్ళపూడి వారి "బుడుగు" మొట్టమొదటిసారి ఏ వార పత్రికలో కనబడ్డాడు ? ఏ సంవత్సరంలో ?


జవాబు:

బుడుగు మొట్టమొదటిసారి ఆంధ్ర వారపత్రికలో ధారావాహికగా నవంబర్ 1956 నుండి ఏప్రిల్ 1957 వరకు ఆరునెలలు వారు ప్రతివారం తెలుగు ఇళ్లలో గిలిగింతలు పెట్టింది. 


మొదట్లో ఆ ధారావాహికల్లో ముళ్ళపూడి వారు "రచయితగా" తన పేరు కూడా వేసుకోలేదు... బొమ్మలు బాపు వారివి అని మాత్రం అర్ధం అయింది.. 


చివరికి అందరి బలవంతం వలన రాసి పెట్టినవాడు ఫలానా, బొమ్మలు వేసి పెట్టినవాడు ఫలానా అని వేశారు .. ఆఖరి సంచికలో       


1962 నుండి బుడుగు ఎన్నో ముద్రణలు.. 

బుడుగు సృష్టిలో ముళ్ళపూడి వారి అక్షరం ఎంత అలరించిందో, బాపు గారి బొమ్మ కూడా అంతే అలరించింది అనడం లో ఎంత మాత్రమూ సందేహం లేదు.. 


అప్పట్లోనే బుడుగు కార్టూన్ scripts విడుదల చేశారు.. బుడుగుని వామనుడు లాగా, గురజాడ వారి గిరీశం లాగా, రాముడిలాగా , కృష్ణుడిలాగా.. మీసాల డిటెక్టివ్ లాగా ఇలా ఎన్నో కళారూపాలకు బాపు జీవం పోశారు.


2️⃣ విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నవల మొట్టమొదటి సారిగా ఏ పత్రికలో కనిపించింది ? 


జవాబు:

మొట్టమొదటిసారి విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు కృష్ణాపత్రిక లో ధారావాహికగా ముట్నూరి కృష్ణారావుగారి ప్రోద్బలంతో వచ్చింది. 


అత్యంత ప్రజాదరణ పొందిన తరువాతే  "విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు " పుస్తకం 1961లో పుస్తకరూపంలో వచ్చింది. 


3️⃣ హాహా హూహూ నవలలో గంధర్వుడు మైకం వచ్చి భూలోకంలో ఏ ప్రాంతంలో పడిపోతాడు ?


జవాబు:

 విశ్వనాథ వారి హాస్య ప్రధా నవలల్లో  "హాహా -హూహూ" ఒకటి 


"హాహా -హూహూ" ఒక గంధర్వుడి కథ. గంధర్వులు అర్థ దివ్యులు అన్న అర్ధంతో సన్నివేశాలు వ్రాసుకున్నారు రచయిత  

వాళ్ళకి గుర్రం తలా మనిషి శరీరమూ రెక్కలూ ఉంటాయి అన్న ఊహతో వ్రాసినది. 


ఆకాశంలో ఎగురుతూ ఆ గంధర్వుడు స్పృహ తప్పి లండన్ లోని  "ట్రఫాల్గర్ స్క్వేర్‌" లో పడిపోతాడు. అదేదో వింత జంతువు అనుకొని చుట్టూ జనం మూగుతారు. 

అది ఏమిటై ఉంటుందా అని తర్కించుకుంటారు. ఆ తర్వాత రక్షక భటులు వచ్చి, గంధర్వుడు ఎవరికీ హాని చేయకుండా చుట్టూ ఒక బోను నిర్మిస్తారు. గంధర్వుడు మేలుకొని ప్రాకృతంలో మాట్లాడటం ప్రారంభిస్తాడు.


4️⃣ విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నవలలో విష్ణుశర్మ ఏ కాలం వాడు ? ఆయన కాక ఇంకా ముఖ్య పాత్రలు ఏమిటి  ?


జవాబు: 

నవల మొత్తంలో పంచతంత్ర కర్త విష్ణుశర్మ ఏ కాలం వాడో ఎక్కడా చెప్పలేదు,  పైగా విష్ణుశర్మ కి తిక్కన నేను 12 వ శతాబ్దం వాడిని అంటే, ఈ శతాబ్దం ఏమిటి అంటూ అడగడం, మీరు Before christ వారని విశ్వనాధ వారు చెప్పడం చాలా హాస్య భరితంగా ఉంటుంది    


విష్ణుశర్మ, తిక్కన ముందుగా రచయిత కలలోకి, ఆపై నిజ జీవితంలోకీ వస్తారు. స్వర్గవాసులైన వారు కారణాంతరాల వల్ల రచయితను ఇంగ్లీషు నేర్పమని కోరగా ఆయన అంగీకరిస్తారు. ఈ క్రమంలో విష్ణుశర్మ, తిక్కనలు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. 


తిక్కన ప్రసంగాల వల్ల ధనం కూడబెట్టి, విష్ణుశర్మ వండిపెట్టగా హాయిగా తింటూ కాలం గడుపుతున్న రచయితను ఇంగ్లీషు నేర్పమని వారిద్దరూ గట్టిగా నిలదీస్తారు. తప్పనిసరై ఆంగ్లాన్ని నేర్పబోగా ఎదురైన అడ్డంకులు, చదువుతున్న విష్ణుశర్మ, తిక్కనలు ఆంగ్లాన్ని, సంస్కృతాంధ్ర భాషలతో పోల్చి చేసే వ్యంగ్య హాస్య భరిత వ్యాఖ్యలు చాలా ఆసక్తికరం.


5️⃣ తెలుగు సాహిత్యంలో నక్షత్రకుడు పాత్రని కౌంటర్ చేసే పాత్ర సృషించినది ఎవరు ? ఆ పాత్ర పేరు ఏమిటి ?


జవాబు:

నక్షత్రకుడు పాత్ర సృష్టికర్త  మహాకవి గౌరన.. ఆ పాత్రకి వన్నె తీసుకువచ్చిన వారు, ఆసాంతం గంభీరమైన సత్య  హరిశ్చంద్ర నాటకంలో మరింత  హాస్యం జోడించిన శ్రీ బలిజేపల్లి లక్ష్మి కాంతం గారి ప్రియమైన పాత్ర అని కూడా చెప్పుకుంటారు 


ముళ్ళపూడి వారి  ఋణానందలహరి లో పంచభూతాలు కూడా ఒకరి నుండి ఒకరు అప్పు తీసుకుంటాయి అని చెబుతారు ముళ్ళపూడి.. 

లేకపోతె వానలు ఎలా కురుస్తాయి.. పైగా కవిత్రయానికి తెలియని గొప్ప రహస్యం చెబుతారు.... అదేమిటంటే కర్ణుడు దుర్యోధనుడు దగ్గర అప్పు తీసుకుని దానాలు చేసేవాడట      

అసలు హరిశ్చంద్రుడుకి ఇరుగు పొరుగు చక్రవర్తుల దగ్గర అప్పు చేయాలన్న ఆలోచన (అవిడియా) లేక నక్షత్రకుడు అన్ని అన్ని ఇబ్బందులు పడ్డారు అని చెబుతారు  

అందువలన "ఋణానందలహరి"  - అప్పారావు పాత్రతో నక్షత్రకుడి పాత్రకి counter వేస్తారు ముళ్ళపూడి వారు


6️⃣ "పాపాయి కోపం కథ" చెప్పిన వారు ఎవరు ? వ్రాసిన వారు ఎవరు ?      


జవాబు:

బుడుగు లో కనిపించే పాపాయి "ఖద"చెప్పేది బుడుగు (of course ముళ్ళపూడి వారి లాగా) వ్రాసిన వారి నండూరి రామ్ మోహనరావు గారు


7️⃣ మన భారతీయ భాషల్లో Human Metamorphosis theme తో వచ్చిన మొట్టమొదటి నవల ఏది ? రచన ఇతివృత్తం ఏమిటి?   


జవాబు:

విశ్వనాథ సత్యనారాయణ గారి "పురాణవైర గ్రంథమాల" లోని పన్నెండు నవలల్లో ఒకటి పులిమ్రుగ్గు  

ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి "థ్రిల్లర్" అని కూడా భావించే వారు ఉన్నారు    


మగధసామ్రాజ్య సేనాధిపతి శ్రీముఖ శాతకర్ణీ, అతడికి  పరిచయస్తుడైన తోహారు అనే ఒక ఆటవికుడూ కలిసి, సగం మనిషీ సగం పులి గా మారిన ఒక ప్రాణి కోసం అన్వేషణ సాగిస్తూ ఒక కారడవి లో పయనించడం తో  "పులిమ్రుగ్గు" మొదలౌతుంది. 


నిజానికి వాళ్ళు అన్వేషిస్తున్న వ్యక్తి వెనుక కాళ్ళు మనిషి కాళ్ళు గా ఉంటాయి తప్ప మిగతా మొత్తం పులిగా మారగలడు. మరి కొంత సాధన మిగిలి పోయి వెనుక కాళ్ళు మాత్రం మనిషి కాళ్ళుగానే ఉండి  పోయిన మనిషి  .అంటే మనిషీ పులీ కలగల్సిన ఒక వింత వ్యక్తి కోసం వాళ్ల అన్వేషణ


8️⃣ వైగై నది ఎక్కడ ఉంది ? ఈ నది ప్రస్తావన ఏ నవలలో కనబడుతుంది  ? ఆ పదానికి ఉన్న అర్ధం తెలుపగలరు? 


జవాబు:

వైగై నది తమిళనాడు లోని మధుర ప్రాతం లో  ఉంది. 

విశ్వనాధ వారి ఏకవీర నవలలో ఈ నది ప్రస్తావన ఉంది  


వైగై అంటే ద్రవిడ భాష లో చేయిపట్టు అని కూడా  అర్థం. గంగ నేలకు ఉరికే వేగం గాలి కంటే అధికం. అందుకే, గంగ వైగై అయింది.


ఏకవీర లోని మొట్టమొదటి పేజీలోని నది వర్ణన ఉంటుంది. ఆ తరువాత అన్ని అధ్యాయాలలో కూడా నది విశేషాలు కనిపిస్తాయి


9️⃣ ముళ్ళపూడి వెంకటరావు వ్రాసిన శతకం పేరు ఏమిటి ?


జవాబు:

బాల శతకం; 1945 లో ముళ్ళపూడి వారి నాల్గవ ఫారంలో ఉన్నప్పుడు వ్రాసిన శతకం (కోతి కొమ్మచ్చి మొదటి భాగంలో ఆ సంగతులు చెబుతారు  

 


1️⃣0️⃣ వేయి పడగలు నవలలో ధర్మారావుని గారిని పిలిచి భాగవతం ఎవరు చదివించుకునేవారు ? ఈ నవలలో మూడు ముఖ్య పాత్రలు తెలుపగలరు ?


జవాబు:

వేయి పడగలు నవలలో నాయకుడైన ధర్మారావుని పిలిచి రుక్మిణమ్మారావు గారు భాగవతం చదివించుకునేవారు. 


ఈ నవల లోని ముఖ్య పాత్రలు ధర్మారావు, గిరిక, జమిందారు రంగారావు, గణాచారి.

 

1️⃣1️⃣ కవి సమ్రాట్ విశ్వనాధ వారు, ముళ్ళపూడి రమణ గారి కలిసి నటించిన నాటకం తెలుపగలరు  ?


జవాబు:

కవి సమ్రాట్ విశ్వనాథ వారు, ముళ్ళపూడి వారు కలిసి నటించిన రేడియో నాటకం "వేద హరిశ్చంద్ర"


ఈ నాటకంలో విశ్వనాథ వారు హరిశ్చంద్ర గా నటిస్తే, ముళ్ళపూడి వారి లోహితాస్యుడు గా నటించారు ఈ నాటకం విషయాలన్నీ, 

వేయి పడగలపై ముళ్ళపూడి వారి అభిప్రాయాలు, భక్తి తో  కూలంకుషంగా వ్రాస్తారు ముళ్ళపూడి వారు 


ఈ విషయాలు అన్నీ కోతి కొమ్మచ్చి మొదటి భాగంలో కనిపిస్తాయి

******************************************



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...