20, సెప్టెంబర్ 2020, ఆదివారం

కథలు - కథానికలు 20.09.2020, ఆదివారము

 


తెలుగు తేనియలు - కథా తోరణం 🖋

 నియమాలు 

 

1. ప్రతి కథ కనీసం 250 పదముల కూర్పు తో ఉండాలి...  400 పదములు మించకుండా చూసుకోవాలి

 

2. కథా నేపథ్యం ఏదైనా మీరు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు

(పల్లె, బాల్యం, పాఠశాల .. కళాశాల లాంటి అంశాలనైనా, మీ అనుభూతులకు అందమైన కధలో అక్షర రూపం ఇచ్చినా సరే)

 

3. ప్రతి ఒక్కరూ వారి వారి కథలని నేరుగా ఇక్కడ రేపు సాయంకాలం వరకు ఎప్పుడైనా సమర్పించవచ్చు.

ప్రస్తుతానికి పోటీ కాదు కాబట్టిన్యాయనిర్ణేతలు, పెద్దలు అనుభవజ్ఞులైన కథకులు వారి ఆత్మీయ సూచనలు అందించవలసిందిగా విన్నపం  

 

4. మీరు ఇప్పటి వరకు వ్రాసిన కథ అయినా, కొత్త కథ అయినా సరే, మీ స్వీయ రచన అయ్యుంటే చాలు. అన్ని కధలూ మన బ్లాగ్ లో ప్రచురిస్తాము.

************************************


 అందాల రాముడు..........

 

అతణ్ణి అందాల రాముడు అనేకన్నా,

బహు బుద్ధి మంతుడు అంటేనే బావుంటుంది,

 

అతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి,

బాల్యంలో పడరాని బీదల పాట్లు అన్నీ పడి,

బ్రతుకు తెరువు కై నాటక రంగంలో స్త్రీ పాత్రలు పెక్కు

పోషించి నటన నే ఆరాధన చేసి, ఆత్మబలంతో

చిత్ర రంగం ప్రవేశించి ఆత్మగౌరవంతో ముందుకు

అడుగులిడి జీవన పాఠశాలలో బహుదూరపు బాటసారి గా పయనించి జీవన పాఠాలు నేర్పే గురుబ్రహ్మఐ కళాశాల నిర్మించిన కాలేజీ బుల్లోడు.

 

ప్రేమ పాత్రలకు పెట్టింది పేరు గా నిల్చి,

దేవదాసు గా జీవించి పలు ప్రేమాభిషేకములు,

జరిపించిన  మంచివాడు, శ్రీమంతుడు.

 

అందుకే అక్కినేని జయంతి రోజు న మనం,

అంతా ఆ మరపురాని మనిషిని మహాత్ముడుని

ఒక్కసారి తలుచుకొని స్ఫూర్తి ని పొందుదాం....

 

రచన. గాంగేయ శాస్త్రి చెరుకుపల్లి, రాజమండ్రి,

 

 ******************************************


 నేను నడుస్తున్నాను

ఎవరో అనుసరిస్తున్న భావన

వెనక్కి తిరిగి పరికించాను

నా వెనకే దాక్కుంది ......నీడ

 

ఒంటరిగా బెంచీపై నేను

ఎవరో పిలిచిన శబ్దం

మనసు పొరల్లో కదలాడిన రూపం

నా కనులలోనే నిలిచి పిలిచింది......ప్రేయసి

 

ఆకాశం వైపు నేను

విశ్వం గురించిన ఆలోచన

నిల్చున్న చోట అవని కదిలిన ప్రకంపన

నానుండి దూరంగా జరిగింది......ఊహ

 

నాలుగు చేతులు కలిశాయి

నాలుగు కాళ్ళు దగ్గరయ్యాయి

మనసుని చదివిన కళ్ళు

నా అవసరాన్ని తీర్చాయి........స్నేహం

 

చిన్నప్పుడు ఆడిన ఏనుగాట

నడవలేనప్పుడు భుజాలపై సేద

అవసరాన్ని గుర్తించి తీర్చే దొడ్డ మనస్సు

డిక్చూచి లా మార్గనిర్ధేశకుడు.......నాన్న

 

నాకు జన్మ తనకు పునర్జన్మ

నుదిటిపై పట్టిన స్వేదం తనకిష్టం

ఆరుగాలాలు శ్రమ తెలియని మర మనిషి

తన సౌఖ్యం మరిచేది........అమ్మ

 

కోవూరి

 **********

 

మగ రాయుడు


ఆరోజు ఆటోలో నేను ,మధు(స్టూడెంట్) మాత్రమే వచ్చాము స్కూల్ నుండి ఇంటికి.మా ఇంటి దగ్గరే డిగిడి మధు.ఏమి మాట్లాడకుండా తలుపు తీసి మంచి నీళ్ళు తనకిచ్చి,నేను తాగుతూ కుర్చీలో కూర్చొంటూ తనని కూర్చోమని సైగ చేసాను.గ్లాస్ పక్కనపెట్టి చెప్పు అన్నట్టు చూసా.వెంటనే ఏడ్చేసింది.ఏమైంది మదూ ఏడుపు     ఆపి  చెప్పు అన్నాను.

Madam, నేను రౌడి లాగా behave చేస్తున్నానా? అడిగింది మధు.

ఫస్ట్ విషయం చెప్పు అన్నాను.

కళ్ళు తుడుచుకుని మొదలు పెట్టింది."ఈరోజు ఖో ఖో ఆడుతుంటే నా ఫ్రెండ్స్,కొంతమంది

టీచర్స్ కూడా ఇది మగరాయుడు

అంటూ కామెంట్ చేశారు.చాలా రోజులనుంచి విన్నా కూడా ఈరోజు

ఎందుకో చాలా బాధ అనిపించి మీతో చెప్పుకుంటే రిలీఫ్ గా ఉంటుంది అనిపించి..."

"పిచ్చి పిల్లా..ఇందుకేనా ఇంత బాధ పడ్డావ్.ఇక్కడే కాదు,పై చదువుల కెళ్లినా,జాబ్ చేసినా,where ever you go.. comments వస్తూనే ఉంటాయి.ఆడపిల్ల అంటేనే కొన్ని expectations తో ఫిక్స్ అయిపోయింటారు.వాళ్లకు నచ్చని వాళ్ళు గానీఇంకేదైనా కానీ కొంతమంది ఇలా కామెంట్స్ చేయడానికే పుట్టి ఉంటారు.నీవు

స్పోర్ట్స్ లేకపోతే చదువు ఒక్కటేనా,అనిఅంటారు.ఎవరితో

కలవక పోయినా టచ్ మీ నాట్ లా

ఉండే వాళ్ళు ఇంట్లోనే కూర్చోవచ్చు   అంటారు.చదువు,ఆటలు,మిగతా activities ఉన్నా  నీకు గర్వం అంటారు.

 నేను కూడా స్కూల్ స్టేజి నుంచి ఇలా కామెంట్స్ విన్నదాన్నే. అంత

ఎందుకు నీకు తెలుసు  మొన్న నేను,మహేష్ సర్ ఇద్దరం వెళ్లి schoolday కు కావాల్సిన వి తెచ్చాం కదా...నాకు సర్ కు 15 yrs. గాప్ ఉంది.అట్లాంటి వాడు కూడా మొన్న ఇంటి వచ్చేముందు

నీకు బాగా ధైర్యం అక్కా..gents తో ఫ్రీ గా మాట్లాడుతావ్..అందుకే కరుణ తో అన్నాను అక్కా నీవు

మగరాయుడివి అని అన్నాడు.

నేను నవ్వి వచ్చేసా.ఇంటికి వచ్చాక 5 ని.బాధ పడ్డా.వీళ్ళ బుద్ధిపెరగదు.

 వీళ్ళింతే అని అనుకున్నా మా ఆయన అడిగారు ఏమిఅయిందని

 చెప్పా.నవ్వి నేనంటే ఫీల్ అవ్వు పనికిరావు ఈ వాటి గురించి

Time వేస్ట్ చేసుకోకుఅని అన్నారు.

So.... మీ పేరెంట్స్ బాధ పడేలా నీవు behave చేయకుండా ఉండు మీ పేరెంట్స్ సపోర్ట్ ఉన్నప్పుడు ఇలాటి వాటి గురించి ఫీల్ అవకు".

చెప్పడం అపి లేచాను.

వెంటనే మధు కూడా లేచి కళ్ళు తుడుచుకుని ఇక నేను వెళ్తాను

Madam అని,with your permission అంటూ గట్టిగా కవలించుకొని ముద్దు పెట్టి వాళ్ళఇంటికీ పేరుకు తీసింది.తన

సంతోషాన్ని ఇలా చెప్పింది పిచ్చి

పిల్ల అనుకుంటూ..తాను వెళ్లిన వైపే చూస్తుండి పోయాను..

 

ఉషారాణి.

 ***************************

 

కథ: ముక్కంటి

రచన: వాణిశ్రీ నైనాల

 

కోడి కూతకే నిద్ర లేచిన శివయ్య నిండా టీ పోసి కూతురిచ్చిన ఫ్లాస్క్ భుజాన తగిలించుకుని  పొలం దారి పట్టాడు శివయ్య. ఊరింకా పూర్తిగా నిద్ర లేవలేదు. అక్కడక్కడా ఆడవాళ్ళు వాకిలి చిమ్ముతున్నారు. పచ్చని చెట్లు నిద్ర మత్తు తీరక రాత్రి పడ్డ మంచు బిందువుల్ని దులుపుకోనట్టు మంద్రంగా మెరుస్తున్నాయి. ఇవేమీ పెద్దగా పట్టని శివయ్య  వడివడిగా నడుస్తూ పొలం చేరుకున్నాడు. పొలం గట్టునున్న చింతమాను నీడలో క్షణం  ఆగి  ఏపుగా పెరిగి కళకళలాడుతున్న తన చేను వయసుకొచ్చిన ఆడపిల్లలు సింగారించుకుని అమ్మవారి జాతర కెళ్తే చుట్టూ కావలి కాసే అన్నల్లా ఆవలి గట్టున నిటారుగా వరుసలో ఉన్న  తాటితోపునీ చూసుకుని

'ఈ సారి పంటతో కూతురి పెళ్లి చేసేయాలి' అనుకున్నాడు. 'అది ఎళ్లిపోతే నేను ఎలాఉండగలను!' ఒక్కసారి  కలవరపడ్డాడు. కూతురికి అయిదేళ్లున్నప్పుడే శివయ్య భార్య చనిపోయింది. మారు పెళ్లి చేసుకోకుండా  అప్పటినుండీ అమ్మ లేని లోటు తెలియకుండా ఉన్నంతలో అపురూపంగా పెంచాడు అమ్ముల్ని. అమ్ములేమి తక్కువ కాదు నాన్నని అమ్మ ల్లే  సాకింది. అందుకే బెంగ... వెంటనే తమాయించుకుని 'దాని సుఖం కంటే నాకేం కావాలి. దానికి పెళ్ళై పిల్లపాపలతో సంతోషంగా ఉంటే దాన్ని చూస్తూ బతికేస్తాను.' అనుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకుని భుజం మీది తుండు దులిపి మళ్లీ బుజాన వేసుకుని చేలోకి దిగాడు.

             సూర్యుడు నడినత్తికొచ్చాడు. శివయ్య ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని తుడుచుకున్న తుండు నెత్తికి పాగా చుట్టి కాళ్ళకి చెప్పులు తగిలించుకుని  ఖాళీ ఫ్లాస్కు భుజానికి వేసుకుని ఇంటి ముఖం పట్టాడు. ఊరు చేరే సరికి సుబ్బయ్య పలకరించాడు "నువ్వు ఇంట్లో ఉన్నాననుకున్నాను పొలం పోయావా!" అన్నాడు కొంచెం ఆశ్చర్యంగా.

"ఆ... యే పనేవైనా ఉందా?" అన్నాడు శివయ్య

"యేటి లేదు ఇందాక దొరబాబు మీ ఇంటికాడ కనబడితే నువ్వున్నావనుకున్నా" నన్నాడు సుబ్బయ్య.

"దొరబాబా ఆడెన్దుకొచ్చాడు!!"

"నాకేటి తెలుసు...సరే నే పోతున్నా" నంటూ తనదారిన పోయాడు సుబ్బయ్య.

 

ఇల్లుచేరి  "అమ్ములూ! ...అన్నవెట్టవే...ఎవరైనా వచ్చేరేటి నాకోసం" అంటూ కాళ్లు కడుక్కుని లోపలికొచ్చాడు అమ్ములు అలికిడి లేదు.

"అమ్ములూ!! ఈసారి కాస్త గట్టిగా పిలిచాడు. మనిషి కనబడలేదు గాని చిన్న ములుగు వినబడింది. లైటు వేసి చుట్టూ చూసాడు.

మంచానికి గోడకి మద్య ఇరుకులో కదల్లేకుండా పడి ములుగుతుంది అమ్ములు. స్థాణువైపోయాడు శివయ్య అమ్ములు కాళ్ళ దగ్గర కూలబడిపోయాడు. "ఏటే ఏటయింది?" అంటూ అంతలోనే కోలుకుని మంచం మీద దుప్పటి  ఒక్క ఉదుటన లాగి అమ్ములు మీద కప్పాడు. తలబాదుకుంటూ కేకలు వేస్తూ అతి కష్టం మీద మంచం మీద పడుకోబెట్టాడు.

 

" బెంగేం లేదు డాక్టర్  గారు

చూచూసుకుంటారు"  అంటూ ధైర్యం చెప్పారు పెద్దకాపుగారు.

 "సరేమరి ఎంచెద్దాం అందరం కలసి కామందుని ఆదిగి సూద్దాం" అన్నాడు కాస్త దుడుకుగా రాంబాబు.

"ఏటడుగుతావ్ మేం

చేశావాని వొప్పుకుంటారా ఏటి... నీ పిచ్చిగాని" అన్నాడు చిన్నారావు.

ఇలా కాసేపు చర్చ జరిగి చివరికి అయిదుగురు మాత్రం కామందు ప్రహారీలోకి ప్రవేశించ గలిగారు. తల పాగాలు తీసి చంకలో పెట్టుకుని జరిగింది కామందుకి చెప్పారు. ఏమాత్రం  తొణ కని కామందు "ఎవడ్రా చెప్పిందీ...నా కొడుకు టౌను కెళ్ళి రెండు రోజుల య్యింది....సరిగ్గా కనుక్కురా పొయి నీ కూతుర్ని. వయసొచ్చాకా తిరుగుళ్లు క్కువయ్యాయంట నీ కూతురికి అందరూ అనుకుంటున్నారు.

పొండి పొయి పనులు చూసుకోండి...." "ఆసుపత్రిలో డబ్బులేవైనా అవసరమేమో గుమాస్తా ఇస్తాడు పట్టుకెళ్లు" అంటూ సమాధానం కోసం చూడకుండా లోపలికి పోయాడు కామందు. దొడ్లో దున్నపోతు తోక పైకెత్తి రంకెలేస్తూ తాడు తెంపడానికి ప్రయత్నిస్తుంది. శివయ్య తల ఎత్తకుండా వెనుతిరిగాడు.

 

దారిలో కొంతమంది యువకులు ఎదురై "ఆడేటి సేత్తాడు మావా! పద పోలీస్ కంప్లయింట్  ఇద్దాం... ఆళ్లు తీత్తారు ఈడి తాట". అని శివయ్య చెయ్యిపట్టుకున్నారు.

మిగిలిన పెద్దవాళ్ళు " ఏడిసేవులే పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఎప్పుడు ఒకటే...డబ్బులు తినేసి మనల్నే జైల్లో తోత్తారు...నోరుమూసుకుని ఇంటికి పదండి తర్వాత సూద్దాం" అని వారించారు. శివయ్య ఏమి మాట్లాడలేదు.

 

 జీవశ్చవంలా హాస్పిటల్ కి ఇంటికి తిరుగుతూనే ఉన్నా డు శివయ్య.

పొలానికి వెళ్తున్న శివయ్యకు కొబ్బరి తోపులో కేకలు, కేరింతలు వినపడి అటుగా వెళ్ళాడు  శివయ్య వంటిలో ఉన్న రక్తమంతా కళ్ళ లోకి ఉబికినట్టు రక్తనేత్రాలతో వారినే చూస్తున్న శివయ్యను చూసి మిగిలిన కుర్రాళ్ళు ఒక్కక్కరే పక్కకి తప్పుకున్నారు. మందు తాగుతూ మద్యలో నాకిన పచ్చడి చేతులు ఎర్రని చొక్కాకి పులుముకుంటూ ముద్ద ముద్దగా ఏదో గొణుగుతున్నాడు దొరబాబు. శివయ్య ఒక్క ఉదుటున  దొరబాబు మీదకి దూకి గుండెలమీద కూర్చున్నాడు. చెంపలు వాయించాడు జుట్టు పీకుతున్నాడు. రెండు గుప్పెళ్ల తో మన్ను తీసి మొఖం మీద పోసాడు. దొరబాబు గింజుకుంటున్నాడు, రేయ్, రేయ్! అంటూ చేతులతో నెడుతున్నాడు కానీ శివయ్య ఆవేశం ముందు మత్తులో ఉన్న దొరబాబు ప్రతిఘటన సరిపోవడం లేదు. ఓపిక నంతా కూడదీసుకుని దొరబాబు గుండెలమీద పిడిగుద్దులు కురిపించాడు శివయ్య. దొరబాబు లో కదలిక తగ్గుతుంది... ఒక పెద్ద బండ తీసి  పొత్తి కడుపు కిందగా గట్టిగా మోదాడు శివయ్య.

 

పోలీసుల చుట్టూ ఊరంతా పోగయింది.  శివయ్య తలవంచుకుని జనంలో నిలబడ్డాడు.  జన్నాన్ని ఉద్దేశించి ఏం జరిగిందో చెప్పమని ప్రశ్నించారు ఇన్స్పెక్టర్ గారు.

" రాయుడి గారి ఆబోతు కుమ్మిందంతంట సారు" అన్నాడు ఓ యువకుడు జనం లోంచి.

" నువ్వు చూసావా?" అన్నాడు ఇన్స్పెక్టర్.

లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు యువకుడు.

కొంతసేపు మంతనాల తర్వాత నలుగురు యువకులను జీపు ఎక్కించారు పోలీసులు.

"సరే మేం ఇన్వెస్టిగేషన్ చేస్తాం.మనుషులు చేసిందైతే మాత్రం మా చేతుల్లోంచి ఎవ్వరూ తప్పించుకోలేరు."

"ఎవ్వడూ ఊరొదిలి పోకూడదు. ఎప్పుడు ఎవర్ని పిలిచినా స్టేషన్కి రావాల్సి ఉంటుంది." అని లాఠీ చూపిస్తూ జనానికి వార్నింగ్ ఇచ్చి కామందు వైపు తిరిగి.

"క్లూస్ సేకరిస్తున్నాం. మీకేవరిమీదనైనా అనుమానం ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్. తెలిసినా వెంటనే తెలియచేయండి. అచ్చోసిన ఆబోతులు  ఉంటే ఊరికి ప్రమాదం మీరే జాగ్రత్తగా ఉండాలి." అని కామందుకీ షేక్ హ్యాండ్ ఇచ్చి జీపెక్కాడు ఇన్స్పెక్టర్.

 

అప్పుడు తలఎత్తి  కామందు కళ్ళలోకి సూటిగా చూసాడు శివయ్య. ముక్కంటి మూడవ నేత్రాన్ని చూడలేక తలదించు కున్నాడు కామందు.

 

వాణిశ్రీ నైనాల, విజయవాడ

 ****************************************** 

 

తీరని ఋణం  ( కథ )

"మనం ఏది ఇతరులకు ఇస్తామో, అది తప్పకుండా మనకు తిరిగి లభిస్తుంది"

"జరిగి పోయిన దాని గురించి బాధపడకూడదు, జరిగిన దాని ద్వారా, జరగబోయే దాన్ని గురించి ఆలోచించాలి"

ప్రభుత్వ వైద్యశాల ఆవరణలోని వేపచెట్టు నీడలో ఉన్న రాతిబల్లపై కూర్చుని ఉన్న రామకృష్ణకు తండ్రి చిన్నన్నటినుండి వల్లె వేయించిన సూక్తులన్నీ పదేపదే తలపుకు వస్తున్నాయి.తట్టుకోలేని బాధ ఒకవైపు, కుంగదీస్తున్న అవమానం మరోవైపు కలగాపులగమై అతని మనసును పట్టి కుదిపేస్తున్నాయి.

         ఎంతోమంది విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తుకు బాటలు వేసిన  శంకరం మాష్టారు విలువలకు ప్రతిరూపమని, ఆయన  వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆణిముత్యంలాంటి పుత్రుడని ఇన్నాళ్లూ అందరి మెప్పు పొందడమే తెలుసు కానీ, ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి కరోనా తమ కుటుంబంలో కూడా కల్లోలం రేపుతుందని ఊహించని రామకృష్ణ తల్లడిల్లిపోతున్నాడు.

               పది రోజుల క్రితం  తండ్రి శంకరం గారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయిన తన మిత్రుడు రంగారావు అంత్యక్రియలకు హాజరవడం, అక్కడికి వెళ్లివచ్చిన మర్నాటి నుండి ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడడం, ఎందుకైనా మంచిదని తమ కుటుంబమంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, పరీక్ష లో తండ్రి కరోనా బారిన పడినట్లు ఫలితం రావడం....అన్నీ సంఘటనలు వరుసగా రామకృష్ణ మదిలో మెదిలాయి.

               నిన్న మొన్నటివరకు అభిమానం చూపిన వారంతా నాన్నకు కరోనా రావడంతో హాస్పిటల్లో  చేర్చారన్న విషయం తెలియగానే, పలకరించడానికి కూడా మనస్కరించడంలేదన్నట్లు గా దూరమైనా  సమయంలో సహజమేనని సరిపెట్టుకున్నాడు.నిన్న హాస్పిటల్ కు వచ్చినప్పుడు డాక్టర్ గారు నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన్ను మర్నాడు డిశ్చార్జ్ చేస్తామని, హోం క్వారంటైన్లో కొన్నాళ్ళ పాటు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని చెప్పిన మాటలు విని కొంత ఉపశమనం పొందాడు రామకృష్ణ

              కానీ 'శంకరం మాస్టారు మా ఇంట్లోనే అద్దెకుంటున్నారు' అని తమ కుటుంబంపై అంతులేని అభిమానం, ఆప్యాయత చూపే తమ ఇంటి యజమాని సుందరయ్య గారు.., రోజు ఉదయం ఫోన్ చేసి, అవమానకరంగా మాట్లాడిన మాటలు రామకృష్ణ ఆనందాన్ని ఆవిరిచేశాయి. మాష్టారు కరోనా బారిన పడ్డారు కనుక, ఆయన కోలుకున్న తరువాత అయినా తమ ఇంటికి తీసుకుని రావడానికి వీల్లేదని, అలా తీసుకురావాలనుకుంటే వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని సుందరయ్య గారు చేసిన హెచ్చరికే ఫోన్ కాల్ సారాంశం.

                ఆలోచనల్లో మునిగి పోయిన రామకృష్ణ  "మీరు శంకరం మాష్టారు గారి అబ్బాయి కదా" అనే మాటలు వినిపించడంతో, తలెత్తి, ఎవరా..అన్నట్లుగా చూశాడు. ఎదురుగా నిలబడిన యువకుని వైపు చూస్తూ, ఔనన్నట్లుగా తలూపి, "మీరు...." అంటూ , అర్థోక్తి గా ఆగిపోయాడు రామకృష్ణ.           "నా పేరు మోహన్.. నేను చిన్నతనంలో శంకరం మాష్టారి గారి దగ్గర చదువుకున్న శిష్యుణ్ణి..బెంగళూరులో ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీరుగ పనిచేస్తున్నాను. నా భార్య స్నేహ ఇదే హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తుంది. మాష్టారు గారు గురించి నేనెప్పుడూ తనతో చెప్తూ ఉండడంతో, ఆమె హాస్పిటల్లో మాష్టారిని చూసి గుర్తుపట్టి,నిన్ననే నాతో చెప్పింది. మాష్టారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని కూడా చెప్పింది.." అంటున్న మోహన్ వైపు అభిమానంగా చూస్తుండిపోయాడు రామకృష్ణ.

                అంతలోనే మ్లానమైపోయిన రామకృష్ణ ముఖం లోనికి పరీక్షగా చూస్తూ... "మీరెందుకో బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది. కారణం తెలుసుకోవచ్చా.."అని అభిమానంగా అడుగుతున్న మోహన్ వైపు  చూస్తూ.., తనకెదురైన విషమ పరిస్థితిని  కంఠం రుద్ధమౌతుండగా వివరించాడు రామకృష్ణ.

          " భలేవారే..! ఇంత మాత్రానికే ఇంతలా బాధపడుతున్నారా..?మాష్టారిని నేను మా ఇంటికి తీసుకువెళతాను. ఆయన్ని మా ఇంట్లోనే ఉంచుకుని,పూర్తిగా కోలుకునేవరకు.. కొన్నాళ్లపాటు నేనే దగ్గరుండి చూసుకుంటాను.మీరేం దిగులుపడకండి" అంటున్న మోహన్ వైపు నిశ్చేష్టుడై చూస్తుండి పోయాడు రామకృష్ణ.

         అంతలోనే తేరుకుని.. "మీకు..."అని ఏదో అనబోతున్న రామకృష్ణ మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ..., "మాకేమి ఇబ్బంది లేదు..నేను ఇంటినుండే ఆఫీసు పని చేసుకుంటున్నాను. నా చిన్నతనంలో మాష్టారు గారు మా ఊరు కృష్ణాపురం లో పనిచేసేటపుడునేను బడికి వెళ్లకుండా పొలం గట్ల వెంట స్నేహితులను వెంటేసుకునిచదువు మీద ధ్యాస లేకుండా, జులాయిగా తిరుగుతుంటే, నాలో మంచిమాటలతో మార్పు తెచ్చి, అక్షరభిక్ష పెట్టి, జీవితం విలువను తెలియజేసిన దేవుడు మాష్టారు. అందుకే మాష్టారు గారంటే నాకెంతో గౌరవం.. రోజు నేనీ స్థితి లో ఉన్నానంటే.., అందుకు కారణం వారే..! వారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేను..! కొద్దిపాటి సాయం చేయగలగడం నా అదృష్టం గా భావిస్తాను. పదండి.. మాష్టారు గారిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కుందాం.." అంటూ హాస్పిటల్ లోనికి దారితీశాడు మోహన్.

            'నిజమే..!మనం ఇతరులకు ఏది ఇస్తామో, అది తిరిగి మనకు లభిస్తుంది.. ' "నువ్వు నేర్పిన సూక్తులు జీవిత సత్యాలు నాన్నా..!" అనుకుంటూ, తేలికపడ్డ మనసుతో, మోహన్ ని అనుసరించాడు రామకృష్ణ.

చల్లా దేవిక.

 *****************************************8

 

 

నాన్నా, నాన్నా- నిన్నే నాన్నా !


సుధీర్ ఇల్లంతా హడావిడిగా,సంబరంగా కబుర్లతో కళకళ లాడుతోంది.రెండోసంతానం,అబ్బాయికి బారసాల.మొదటి సంతానం రెండేళ్ల కూతురు దివ్య .సుధీర్, భార్య సువర్ణ అందరికీ అల్పాహారాలు, తేనీరు సవ్యంగా అందేటట్లు  అన్నీ అమర్చారు .నామకరణం అయ్యింది .ముద్దుగా అనంత్ అని పేరు పెట్టారు.అందరూ ఆశీస్సులు,దీవెనలు అందజేశారు .బహుమతులుగా  బట్టలు,బొమ్మలు ఇచ్చారు .సుధీర్ చిన్నప్పటి ప్రాణ స్నేహితుడు  శ్యామ్ .అందరికంటే ప్రత్యేకమైన బహుమతిగా ఒక టేకు మొక్క ఇచ్చాడు .అంతేగాక సుధీర్ , సువర్ణలచేత నాటించాడు.అందరూ భోజనం చేసి వెళ్లి పోయారు .

అనంత్ స్కూల్ కి వెళ్తున్నాడు.సుధీర్ ఇంటికి వచ్చిన వారందరూ అనంత్ , అనంత్ తో పాటే పెరుగుతున్న టేకు మొక్క పెరుగుదలనీ చూసి , వారి వారి సంభాషణలతో టేకు మొక్కని , అనంత్ నీ పోలుస్తూ కబుర్లు చెప్పి వెళ్తున్నారు .


అనంత్ పెరిగి పెద్దవాడయ్యాడు. కుటుంబీకుడు కూడా.అమెరికాలో పదిహేను ఏళ్లగా వుద్యోగం చేస్తున్నాడు.సుధీర్ రోజూ సాయంత్రం విశాలమైన సందులో అటూ, ఇటూ తిరుగుతూ పాటలు, వార్తలు వింటూ మొక్కలకీ చెట్లకీ నీళ్లు పోస్తుంటాడు .అదే సమయంలో అనంత్ వీలైనప్పుడల్లా అమెరికానుండి ఫోన్ చేస్తుంటాడు . రోజు కూడా ఫోన్ చేసాడు.' నాన్నాహైదరాబాద్ లో నేను ఇల్లు కడతాను.అన్నీ సిద్ధం చేస్తే సెలవు పెట్టి వచ్చి మిగతా విషయాలన్నీ చూసుకుంటాను . నాన్నా  మన దొడ్లో టేకు చెట్టు ఇప్పటికే బాగా పొడుగ్గా,బలిష్ఠంగా తయారయి ఉంటుంది గదా.దాన్ని జాగ్రత్తగా కోసేసి ఇంటి కిటికీలకు,ద్వారాలకీ వాడదాము.ఇప్పటికే ముప్పై అడుగులు పొడవై ఉంటుంది.చక్కగా వాడుకోవచ్చు.మంచి టేకు కూడా.   ముఖ ద్వారాన్ని అందం గా చేయించ వచ్చు . మన వడ్రంగి చారి ఉన్నాడుగా ।అతనికి అన్నీ తెలుసు టేకు చెట్టుని ఎలా నరకాలి , ఎన్ని ముక్కలుగా చేయాలి , ముక్కలని చెక్కలు చెక్కలుగా ఎలా నరకాలో ,వాటిని కిటికీలకు, ద్వారాలకూ ఎలా వాడాలో   చారి బాగా చెబుతాడు.అందంగా శ్రద్ధగాకూడా చేస్తాడు. త్వరగా  నిర్ణయించు నాన్నా  ఇక వుంటాను  అని ఫోన్ పెట్టేసాడు.

నాన్ననాన్నా.ఎవరో గద్గద స్వరంతో దుఃఖిస్తూ పిలుస్తున్నారు .సుధీర్ అటు,ఇటు చూసాడు .ఎవరూలేరు .గేట్ బయట చూసాడు ఎవరు కనిపించలా.నాన్న-నిన్నే పిలుస్తున్నా.నాన్న-నేనే మీ అబ్బాయిని టేకుగాణ్ణి.అర్ధం అయింది సుధీర్ కి టేకు చెట్టు ఏడుస్తున్నట్లుగా.దుఃఖం ఆపుకోకుండా టేకు చెట్టు ఏడుస్తోంది .నాన్న నువ్వు నన్ను, అనంత్ ని సమానంగా పెంచావు .వాడికి ఇప్పుడు ముప్ఫైదు  ఏళ్ళు .నాకు అంతే .కానీ వాడు నన్ను చంపెయ్యమంటున్నాడు.ముక్కలు ముక్కలుగ చేయ మంటున్నాడు,అని భోరు మన్నాడు టేకుచెట్టు గాడు.సుధీర్ కి భయమేసింది.వెంటనే టేకుచెట్టుని కౌగలించుకున్నాడు.తన చేతుల్తో బుజ్జగిస్తున్నాడు.'వద్దు నాన్న ఏడవకుఏడుపుఆపునువ్వు,ఏడవకు తండ్రీ. నువ్వు నాతోనే, నా దగ్గరే ఉందువుగాని,అని సముదాయిస్తూ అప్పుడే  అనంత్ కి  ఫోన్ చేశాడు .ఒరేయ్ అనంత్ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన రోజుల్లో నువ్వు మన టేకు చెట్టు  వదిలేసి  వేరే పద్ధతిలో  కిటికీలు ,ద్వారాలు పెట్టే  పధ్ధతి ఆలోచించు ఇక టేకు గాడి గురించి వదిలేసేయ్ అని ఫోన్ పెట్టి  టేకు గాణ్ణి నిమురుతూ ఉన్నాడు సుధీర్ !

 

మురళి మోహన్

****************************

 

  

నా రెండవ కథ..

 కష్టే ఫలి

 

అతని పేరు బద్రి.. చదువుకున్నది ఎనిమిది వరకు.. ఇంటిలోని పరిస్థితులు బాగోలేదని చదువు ఆపేసి తండ్రికి అతని పనులలో సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉండేవాడు..

 

తండ్రి ఒక వడ్రంగి వాడు..  చిన్న చితక పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు..

 

వారి ఊరు వారణాసి.. అది ఒదిలి ముంబాయి మహానగరంలో ఎక్కడో ఒక చోట పని దొరకక పోదా అని కుటుంబం తో వల వచ్చిన వలస పక్షితనకంటూ ఉన్న ఒకే ఒక ఆస్తి ఎంతటి కష్టమైన చేయగలను అనే నమ్మకం.

 

అలా వడ్రంగి పనులు ఇళ్లలో, అపార్ట్మెంట్ లలో, ఫ్యాక్టరీ లలో, ఆఫీస్ లలో, ఆసుపత్రులలో ఎవరు పిలిచినా వెంటనే వెళ్ళేవాడు కొడుకుని కూడా తీసుకుని.. ముంబాయి లో ఎంత పని దొరికిన ఉండే రోజు వారి ఖర్చులకి ఒక్కో రోజు పస్తులు ఉండ వలసి వచ్చేదిఅటువంటి పరిస్థితుల్లో మనసులో బాధ అయ్యో పస్తులుండే టట్టు అయితే మన వూరైతే నేమి, ఇక్కడైతే నేమి అనుకొని మళ్లీ సర్ది చెప్పుకునే వాడు..

 

ఒకరోజు అర్జెంట్ గా మరమ్మత్తు పని ఉందని ఒక ఆసుపత్రి యజమాని త్వరగా రమ్మని పిలిచాడు.. పెద్ద మనిషి పిలుస్తున్నాడు అని తిండి కూడా మాని కొడుకుని వెంట బెట్టుకుని పని సామాగ్రిని ఒక భుజం మీద వేసుకుని వెళ్ళాడు.

 

ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉన్నదని, పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో వస్తున్నారని అందుకు హాల్ ని కొంత మరమ్మత్తు చేయాలని ఆయన అడిగాడు.. సమయం లేదు, డబ్బు ఎంతైనా ఇస్తా చేస్తావా అని అడిగాడు ఆసుపత్రి ఎండి.

 

తండ్రి తడబడుతూ ఇంత పెద్ద పని ఎలాగా అని ఆలోచిస్తుంటే, బద్రి దానిదేముంది ఇప్పుడే మొదలు పెట్టేస్తాం, పని అయ్యాక మీరే ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి అని చెప్పేశాడు పెద్ద మనిషి పేరు అడిగి, అలాగే అని చిరునవ్వు నవ్వి మా సెక్యూరిటీ కి చెబుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు.

 

వెంటనే బద్రి తన వూరి వారిని ఒక 8 10 మందిని రమ్మని ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పేసి పనిలో నిమగ్నమై పోయాడుతండ్రికి చూస్తూ ఉండమని పని తనే మొత్తం చేసేస్తా అని చెప్పాడు..

 

ఇంకేముంది అనుకున్న పని అనుకున్న సమయానికి యజమాని అనుకున్న దానికంటే అద్భుతంగా చేసి చూపించాడు..

 

యజమాని సంతోషంతో వారికి డబ్బులు ఇచ్చి, బద్రి తో సొంతంగా బిజినెస్ పెట్ట వచ్చు కదా కాంట్రాక్ట్ లు నేను ఇప్పిస్తా నీ పని చాలా బాగా నచ్చింది నాకు అని అడిగాడుబద్రి అన్ని డబ్బులు లేవు సారూ ఎది చిన్న చిన్న పనులతో పూట గడుపుతున్నాం అన్నాడు..

 

దానిదేముంది నేను ఒక 50,000 రూపాయలు ఇస్తా మొదలు పెట్టండి అన్నాడు. బద్రి వెంటనే తప్పకుండా సారూ అని వారికి కాళ్ళకి నమస్కరించాడు..

 

ఇంకేముంది మంచి శుభ ముహూర్తం చూసి ఇంటీరియర్ డిజైనింగ్ అని పేరు పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ముంబాయి లోనే కాకుండా దేశంలోని పెద్ద పెద్ద నగరాలలో ఎన్నో కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు సొంతం చేసుకుంటూ సుమారు ఒక 40 50 యాభై కోట్లకు అధిపతి..

 

అయినా ఇప్పటికీ ఆసుపత్రి యజమాని నీ కలవడానికి వెళితే వారి కాళ్ళకి దండం పెట్టకుండా ఉండని గొప్ప మనిషి..

 

అస్సలు జల్సాలు చేయకుండా ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేస్తూ, ఎవరికైనా సహాయం చేయాలంటే డబ్బులు ఇచ్చే మంచి మనిషి..  ఇప్పుడు ఒక 30 40 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగి పోయినా ఒదిగి ఉండే మంచి మనిషి బద్రితిండి లేని రోజుల నుండి పది మందికి తిండి పెట్టే స్థాయికి ఎదగడం వెనుక రహస్యం ఎటువంటి మేజిక్ లు లేవు కేవలం కష్ట పడే తత్వం..  ఇప్పుడు ముంబాయి మహానగరంలో సుమారుగా ఒక 6 7 ఇళ్ళు, ఒకటి రెండు కమర్షియల్ ఔట్లెట్స్ ఉన్నాయి, ఇంటి అద్దెలు, కమర్షియల్ అద్దెలే నెలకు ఒక 7 8 లక్షలు సంపాదిస్తున్నాడు అంటే అతిశయోక్తి కాదు.

 

కష్ఠాన్ని నమ్ముకున్న వాడు ఎప్పుడూ చెడి పోలేదు అంటే ఇదే కదా..

 

నచ్చితే చాలా బాగుంది అని, లేకపోతే 👏👏 అని చెప్పండి చాలు..😀😀😀🙏🙏

 

కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి

 

 *********************************


పల్లె నేడు

 తాతయ్యా.....

నా  మనవళ్ల నలుగురి కంఠ స్వరాలు ఒకేసారి వినబడెసరికి,బాల్య  జ్ఞాపకాల బీరువా లో విహరిస్తున్న నేను ఇహలోకాని కి వచ్చాను.

తాతయ్యా...వచ్చేసాం...వచ్చేసాం మీ ఊరు అదే మీ పల్లె...(మా ఊరు ని నేను పల్లె అంటాను) వచ్చేసాం...చప్పట్లు చరుస్తూ బస్ కిటిలోంచి గుమ్మాపురం ఉరి బోర్డ్ చూపిస్తూ.

నా మనవలు కేరింతలతో  హడావిడి చూస్తుంటే, నేను పుట్టి పెరిగిన ఊరు చూడాలని నాకన్నా  వాళ్ళకే ఎక్కువ ఉత్సాహం ఉన్నట్టు అనిపించింది నాకు.

నా మనవలు కథ చెప్పమని నా దగ్గర చేరిన ప్రతిసారి,నేను పుట్టిన ఊరు,..పల్లెటూరి వాతావరణం ,నా బాల్యం గురించి పాత్రలు గా మలిచి కధలు గా చెప్పేవాడ్ని అది వింటూ...వాళ్ళకి తోచిన విదంగా బొమ్మలు వేసి చూపిస్తే, మురిసిపోవడం నా వంతు అయ్యేది. నా ఉద్వేగము చూసో,,లేక నేను చెప్పిన కధలు వాళ్ళని ఆకర్షిందో తెలీదు కానీ,నేను పుట్టిన ఊరు చూపించమని గొడవ చేస్తే,సెలవుల రాగానే ఇగో ఇలా బస్ లో బయలుదేరాము

 

దిగండి... దిగండి...కండక్టర్ తొందర పెట్టాడు

ఎన్నో ఏళ్ల తరవాత మా పల్లెలో అడుగు పెట్టనేమో....ఏదో అలౌకిక ఆనందం* చల్లగా వీస్తున్న చిరు గాలి నా స్పర్శను తాకి నాకు స్వాగతం పలుకుతునట్లు అనిపించింది

ఎక్కడికి వెళ్ళాలి సార్....అడిగాడు ఆటో వాడు పక్కకు వచ్చి

నాకు ఆటో ని చూసి ఒకింత  ఆశ్చర్యం కలిగింది ఆసలు మేము వచ్చింది మా పల్లెనా...?పుట్టి బుద్దెరిగి ఇక్కడ ఆటో ఎప్పుడు చూడలేదు  అంతలోనే తమాయించుకొని శివాలయం కి వెళ్లాలని చెప్పాను.బేరం కుదుర్చుకుని ఎక్కాము ఆటోలో. మేము చేరబోయే శివాలయం గురించి పిల్లలకి చెప్పడం మొదలుపెట్టాను నేను . పిల్లలు, ... కొడుతున్నారు కానీ *మొహాలు మాత్రం వికచించలేదు *కారణం లేకపోలేదు. పల్లెలో దిగగానే జోడెడ్ల బండి ఎక్కిస్తానని మాట ఇచ్చాను మరి పోనీ దారిలో చూపిద్దామన్నా మచ్చుకి ఒకటాయినా కనపడలేదు

రెండు చక్రాలు స్థానం లో మూడు లేక నాలుగు చక్రాలు వచ్చి పల్లె అభివృద్ధి చెందినందుకు సంతోషపడాలో లేక నగరమల్లే కాలుష్య కోరల్లో చికుక్కుకుందని భాద పడాలో అర్థం కాలేదు నాకు

శివాలయం లో గంటలు నా మెదడు కి తరంగాల్లా వ్యాపించింది. కళ్ళుమూసుకుని గాలి గోపురానికి  మనసారా దణ్ణం పెట్టుకున్నాను పిల్లలు నన్ను అనుకరించారు గట్టిగా శ్వాస తీసుకొని చుట్టూ కలియ చూసాను* ఊపిరి ఆగినంత పనైయ్యింది * *పిల్లలతో పంచుకున్న పచ్చ మా పల్లె ఆనవాళ్లు అక్కడ కనపడలేదు

చిన్నప్పుడు గుడి కి కొంత దూరం చుట్టూ పచ్చని చెట్లతో దాదాపు అడవిని తలపించేది* చెరువు కూడా ఉండేది.

తాతయ్యా....నువ్వు చెప్పినవేవి ఇక్కడ కనిపించడం లేదు...చెట్లెవి?చేరువేది? పోలాలూ కూడా లేవు..పిల్లలు ఒక్కకరు వేస్తున్న ప్రశ్నలకి నా దగ్గర కూడా సమాధానం లేదుసమాధానం గుల్లో పూజారి గారు చెప్పారు* గుడి ప్రభుత్వ అధీనం లోకి వచ్చాక.. ప్రభత్వలు మారుతుంటే ఆలయ   రూపు రేఖలు కూడా మరిపోయాయని... ఆలయ అభివృద్ధి పేరు తో చెట్లు నరికేయడం వల్ల వాతావరణం లో కూడా మార్పు వచ్చిందని చెరువులు ఎండిపోయాయిని చెప్పారు అది విని నా గుండె తరుక్కుపోయింది ఇందాక ఆటో లో  పిల్లల తో, ఇక్కడ ఏటు వైపు చూసిన హరిత జ్వలలే అని చెప్తునప్పుడు ఆటోవాడు వ్యంగ్యనగా ఎందుకు నవ్వాడో ఇపుడు అర్థమైంది నాకు. ఎటు వైపు చూసిన బీడు భూములే. మట్టి వాసన కరువైయింది సిమెంట్ రోడ్లు మీద నడుస్తూ ఇరువైపులా దృష్టి సారించాను...ఎక్కడది పచ్చ కొక కట్టిన పొలాలు..?ఏదీ పైరు గాలి ? గుబురు చెట్లు ? పక్షుల కోలాహలాలు?సీతాకోక చిలకల సమూహలు...? డాబా ఇల్లు మేడలు దర్శనమిచ్చయిపట్టనాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాలు.. పంజరం లాంటి భవనాల్లో చేసుకుంటున్న కార్పోరేట్ పక్షులే అందరూ ....పోటీ పడి కదులుతున్న ప్రపంచం తో సాగిపొడమే జీవితం అంతా. పరుగు లో నా కొడుకులు కూడా ఉన్నారు... కానీ పల్లె జీవితాలు అలా కాదేమోనకున్నాను...పచ్చ రంగు తో పోత పోసి నట్టు ఉంటుందనుకున్నాను .కానీ ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే ఏదో తెలియని భయం ఆవహించింది,నన్ను...చటుక్కున నా బాల్య స్మృతులు తెరలు తెరలు గా కనపడింది.

,పొలం గట్లు మీద నించి నిక్కర్ ఎగేసుకుంటూ చేతిలో పలక పట్టుకొని  స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ బడి కి వెళ్లడం మధురానుభూతి. చింత చెట్లు బాదం ఎక్కి కాళ్లు ఊపుతూ  చెరువు లో మెదులుతున్న జీవ రాసులుని  చూడడం అదో ఒక ఆనందం అప్పుడు నేను ఊహించలేదు కాలతో పాటు ఇవన్నీ  కలిసిపోతాయని  బాల్యం తో పాటు పల్లె కూడా కనుమరుగవుతుందని అనుకోలేదు. ఉద్యోగం వచ్చే వరకు మా పల్లె తో అనుబంధం ఉండేది నాకు.

ఇక్కడికి వచ్చే వరకు  మా పల్లె హరితవనం తో శోబిల్లుతోందని భ్రమ లో ఉన్న నాకు ఇక్కడ  ఎండిపోయి సల్యమైన పల్లె వాతావరణం చూసి కళ్ళ వెంట నీళ్లు ఆగలేదు. .

 

నా అంతరంగం గమనించి నట్లు ఉన్నారు పిల్లలు.ఇక ప్రశ్నలు వేయడం మానేసారు...వాళ్ల ఆశల  మీద నీళ్లు జల్లినట్లు అయింది..వాళ్ళు వేసుకున్న రంగుల చిత్రాలు అలికి నట్టు అయింది..ఇంతలో నా బాల్య మిత్రుడు గిరీశం నన్ను గుర్తు పట్టి పలకరించాడు.

అరె.... రాముడు...! ఎన్నాళ్ళకి కలిసావ్? ఎలా ఉన్నావ్? ఇలా వచ్చావ్ ఏంటి?

బానే ఉన్నాను గిరీశం...నువ్వు ఎలా ఉన్నావ్? ఇక్కడికి వచ్చిన కారణం కూడా చెప్పాను నా మనవల్ని చూపిస్తూ.

బానే ఉన్నాను. పద ఆలా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం..చిన్నప్పటి విషయాలు గుర్తుచేస్కుంటు గీరసం తన ఇంటికి తీసుకెళ్లాడు..దారి లో కొంత మంది నన్ను గుర్తు పట్టి నా బాగోగులు తెలుసుకొని కుసలం అడిగారు..పల్లె మారింది కానీ పల్లె మనసు మారలేదని అనందపడ్డాను. ఇప్పటికి అవే మర్యాదలు, చతురోక్తులు, కల్మషం లేని పలకరింపులు.

గీరసం మాటల మధ్యలో తన ఆవేదన వ్యక్తం చేసాడు.

ఏం చెప్పమంటావ్...కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది..మునుపటి పరిస్థితి లేదు ఇప్పుడు. వాతావరణం లో చాలా తేడా వచ్చింది...పెద్ద మనుషులు గతించారు. తరం మారిపోయింది...

గీరసం చెప్తున్నాడు. నాతో పాటు నా మనవలు కూడా అతని మాటలు వింటున్నారు. గీరసం మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు.

ఏదో కొన్ని కుటుంబాలు మాత్రమే వ్యవసాయం చేసుకుంటున్నాయి. మిగిలిన కుటుంబం లో యువకులు నగరాల్లో ఉద్యోగాలు చూసుకుంటుటే,..ఇంకొంత మంది ఖండాలు దాటి వెళ్లిపోయారు. ఇది అభివృద్ధి కి సంకేతం అనుకుంటే పొరపాటే...మన ఉనికి కోల్పోపోయె పరిస్థితి రాకుండా ఉంటే అదే పదివేలు. ఇక్కడ మనుషులు లేక వ్యవసాయం అట్టే జరగడం లేదు * రైతు చచ్చిపోతే తిండి గింజలు ఎలా పుడతాయి? ప్రేమ తో ఇన్నేళ్ల నించి సాకుతున్న నెల తల్లి మోడు అవుతుంటే మనసు కకలావికలం ఆవుతూంది...ఉద్వేగం తో అన్నాడు గీరసం..

నేనూ నా మనవలు  అక్కడ నించి భారంగా కదిలాము..

నా మనసు లోతుల్లో ఏవో మాటలు వినబడుతున్నాయి.

..పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అనుకోడమే కాదు, కొమ్మలు విరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనని అనిపించింది.నాకు ఏమైనా మంచి  చేసి నాకు జన్మ నిచ్చిన తల్లి తరవాత తల్లి వంటి నా పల్లెని బతికించాలని నిర్ణయించుకున్నాను.

తాతయ్య....  నా చిన్న మనవడు నా చెయ్యి పట్టి లాగుతున్నాడు  నాతో ఏదో చెప్పాలని. ..ఎత్తుకొని ముద్దాడాను .

తాతయ్య....అదేదో సినిమా లో హీరో ఒక ఊరు ని దత్తత తీసుకొని బాగుచేసినట్టు మనం కూడా మీ ఊరు ని దత్తత తీసుకుందాం... అన్నాడు వచ్చి రాని మాటలతో.

వాడి మాటలు నా చెవిలో అమృతం పోసినట్లు అనిపించింది. నా ఆనందానికి అవధులు లేవు.నా ఆలోచనలకి ఉపరిపోసి నా కర్తవ్యం గుర్తు చేసిన మనవీడ్ని ఆప్యాయంగా నిమిరాను..

ఇప్పుడు నా మనసుకు స్వాంతన చేకూరింది... పల్లె గాలి స్పర్శ మళ్ళి ఎప్పుడొస్తావ్అని ఆడిగినట్టు తోచింది నాకు. తల్లి ప్రకృతి ఒడిలో సెదదీరాను

 

మున్నంగి పద్మలత

 ************************

 

ఇంటికి వెళ్లినా అదే ధ్యాస అభికి...

రంగులు పూసిన మొహంలో రక్తపు చుక్క లేదు కోపం అసహనం కలిగిన  ఆ మొహంలో ఏదో కోల్పోయిన బాధ ఎక్కువ కనబడుతోంది..

ఒరే అన్నయ్య ప్లీస్.... ప్లీస్ స్టాప్ టూ your బ్లడీ నెగిటివ్ తిగ్స్. థిస్ ఇస్ టూ మచ్...

ఎప్పుడో జరిగిపోయిన విషయం మళ్ళీ తలుచుకుంటున్నావ్.... ఒక్కసారి వచ్చి వెళ్లిపోయిన నీ లైఫ్ లో మళ్ళీ తను వస్తుందని ఎందుకు ఆలోచిస్తావ్...

ప్లీస్ గెట్ ఔట్ మై రూమ్ శోభ.

నాకు తెలుసు నేను ఎం చేస్తున్నానో ఎం ఆలోచిస్తున్నానో...

నేను నిజంగానే తనని చూసా...

నువ్ నమ్మవ్ ఎందుకంటే నా లవ్ మీద మీకు ఎవరికి నమ్మకం లేదు....

నేను నిజంగానే తనని చూసా...

తనే... నా కళ్ళు నన్ను మోసం చెయ్యావ్ కధ..

నేను చెప్పింది నమ్ము శోభ.

శోభకి ఎం మాట్లాడాలో తెలీదు చిరాకులో ఉన్నాడు

కూల్ చేద్దాం అని వస్తే భయపెట్టేసాడు ఒక్కసారిగా.

అభికి మళ్ళీ పాత జ్ఞాపకం

ఎక్సమ్స్ వస్తున్నాయి... చూడటం. నవ్వడం...

తప్ప ఇంకేమి జరగడంలేదు వాళ్ళ మధ్య.

ఒరే శోభ.. నీ ఫ్రెండ్ ఏంటి అసలు మాట్లాడదా..

పాతకాలం అమ్మాయిలా తల ఎత్తకుండా వెళ్ళిపోతుంది ఎప్పుడు చూసినా... అనేసరికి అభి.

చెల్లెలు శోభ అంటుంది.

హోహో అలా అర్ధమయ్యింద సరే ఈ వీడియో చూడు ఒకసారి అని డబ్ స్మాష్ చేసిన వీడియో ఒకటి చూపించింది....

అతడు సినిమాలో త్రిష చేసిన కామెడీ తను యాక్ట్ చేసింది భలే నవ్వు వచ్చేలా ఉంది వీడియో.

అమ్మని... చాలా కళలు ఉన్నయ్ నీ ఫ్రెండ్ లో చెప్తా..

చంపేస్తా. వీడియో చూశావని చెప్తే....

చీ...! అనవసరంగా తొందరపడి చూపించా వీడికి. రేపు నన్ను అడేసుకుంటుంది కాలేజ్ లో వీడు తింగరి పనులు చేస్తే...

అని మనసులో తనని తాను తిట్టుకుంది శోభ.

హా హా హా... దొరికింది ఏ నీ ఫ్రెండ్... చూడు రేపు.

ఒరే అన్నయ్య ప్లీస్ రా ...

నువ్ అనుకున్నంత అమయకురాలు కాదు.

షి ఇస్ వెరీ ఇంటిలిజెంట్..

చూశావ్ గా ఏమయిందో 1స్ట్ డే నే

హ మర్చిపోతాన వదలను...

ఏంటి i love you చెప్పావట ఏ చెప్పనా నాన్న..... అనేసరికి శోభ.  అభికి కంగారు వచ్చి

అమ్మో వద్దు. ష్....

నవ్వుకుంది సరదాగా అన్నయ్య ని ఆట పట్టిస్తూ.

మరుసటి రోజు మార్నింగ్ కాలేజీ కి వెళ్ళగానే

ఊహ...

నీతో కుంచం మాట్లాడాలి.

ఈవినింగ్ నువ్ ఫ్రీ ఐతే బీచ్ కి వెళదాం...

తొందరెంలేదు ఆలోచించుకుని చెప్పు వెయిట్ చేస్తా....

ప్లీస్..

హ్మ్మ్... సరే ఆలోచించుకుని చెప్తా అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఊహ.

ఈవినింగ్ .... మర్చిపోకు... షార్ప్ 5:30.

వెనకకు తిరగకుండానే చెయ్యి బై అంటూ వూపుతూ...

ముందు తన ఫేస్ లో చిలిపిగా నవ్వుకుంటూ క్లాస్ కి వెళ్తుంది.

అసలు ఏఁ చెప్తాడు...

కొంపతీసి లవ్ ప్రపోజ్ చేస్తాడా...

మొన్నేగా చెప్పాడు...

నేను ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాను అని కోపంగా ఉన్నాడా

అమ్మ... ఇప్పుడెలా..

ఏమే శోభ ...

హా చెప్పవే...

ఎం లేదు .

కొంపతీసి ఆ వీడియో మా అన్నయ్య చూసిన సంగతి తెలిసిపోయిందా... వీడెం తింగరి వేషాలు వెయ్యలేదుగా..

ఊహా టెంషన్ లో ఉండటం శోభ గమనించింది..

ఏమయ్యిందే... అలా ఉన్నావ్.

ఏమయినా చెప్పాలా.. చెప్పు...

ఆహా ఎమ్ లేదు...

సాయంత్రం నాతో బీచ్ కి వస్తావా...

లేదు ఊహా నేను అమ్మ కలిసి పక్క ఇంట్లో ఫంక్షన్ కి వెళ్ళాలి...

కావాలంటే నువ్ నీ బోయ్ ఫ్రెండ్ తో వెళ్ళు.. అని జోక్ చేసింది.

అమ్మని ఇద్దరూ కలిసే ప్లాన్ చేశారా అనుకుంది ఊహా..

నేను వెళ్ళను సర్లే వదిలేయ్ అని తమాయించుకుని కూర్చుంది ఊహా.

గమనిస్తూనే ఉంది శోభ.

వస్తుందో రాదో అభి కి టెంషన్...

అసలే చెల్లి కి ఫ్రెండ్ చెప్పేసి ఉంటుందంటావా...

ఎహే... చెప్పని ఏమవ్వుద్ది

అంటూ గాబరాగా మనసులో అనుకున్నాడు అభి.

క్లాస్ వింటూనే మైండ్ అంతా డిస్టర్బ్ గా ఉంది.

అభికి కూడా అంతే...

కింద క్లాస్ రూమ్ లో  అభి.

పైన క్లాస్ రూంలో ఊహ...

ఇద్దరి మనసులోనూ ఒక్కటే. అదే ప్రేమ....

అరే అన్నయ్య iam going to home.

చెల్లెలు massage వాట్సప్ లో

ok అని రిప్లయ్ అభి.

చెల్లెలు క్లాస్ 4 కి ఐపోయింది....

మీ చెల్లి వస్తే నేను వస్తా లేదంటే రాను అని

కొత్త నెంబర్ నుంచి  వాట్సప్ massage.

తను ఊహ.

షీ ఇస్ గోయింగ్ టూ మై హోమ్ తను రాదు.

రిప్లై.

ఐతే నేను రాను... తను రిప్లై.

వెంటనే తనని వెతుకుతూ కాలేజీ మొత్తం తిరిగాడు అభి.

గ్రౌండ్ నుంచి నడుచుకుంటూ తన స్కూటీ ఉన్న పార్కిగ్ ఏరియా లో కనపడింది.

పరుగున వెళ్తూ...

హే ఆగు ...

ఊహా what happn ...

తను రాదు నేనే వద్దన్న...(అబద్దం.... అసలు శోభ కి ఈ ప్లాన్ తెలీనే తెలీదు పాపం.)

మన ఇద్దరి మధ్య తను ఎందుకు ఇప్పుడు అని...

సరే పదా...

ఊహా.. నువ్వేనా...

హా.. నేనే... సరే పదా... అన్నాను.

ఇంత సింపుల్ గా yes అంటావని అనుకోలేదు.

ఇప్పటి వరకు రాను అన్నావ్ ఎలా convince  చెయ్యాలో అనుకున్న.

but నా స్క్యూటీ మీద వస్తాను only 10 min అంతే.

ok fain don...

ఇద్దరూ కలిసి బీచ్ లో నడుస్తూ ...

హా చెప్పండి ఏఁ మాట్లాడాలి...

కూర్చో ఊహా..

వెళ్లిపోదువుగాని..

నిన్నేమి చేయన్లే...

చి చ్చి... అలా అని కాదు....

తొందరగా వెళ్లిపోవాలని.... ఏంటో చెప్పు.

వెల్దువు గాని ఊహా ఒకటి చెప్పు...

నేనంటే భయపడుతున్నవా...

లేకపోతే ఇష్టం లేకన...

అభి... ప్లీస్... నాకు నువ్వంటే భయం లేదు అలా అని ఇష్టం లేక కాదు...

నాకు ఎం మాట్లాడాలో తెలియడంలేదు.

అర్ధం చేసుకో...

అభికి అర్ధం అవుతోంది...

సూటిగా చెప్పడానికి మొహమాటంగా తన సిగ్గు చెబుతోంది.

ఇష్టం ఉంది అని...

ఊహా ఒకటి చెప్పనా..

"సముద్రం ఒడ్డున కాళ్ళు జాపి అలల కితకితలు భరించాలి...

కమ్మని నీ మాటలు వింటూ హోరుగాలి వెనక్కి తగ్గాలి...

నిలకడగా లేని నా మనసుని నీ వైపు లగ్నం చేసి వినాలి...

ప్రేమంటే రెండు మనసుల కలయిక..

రెండు తనువుల తాకిడి కాదు.

ప్రేమంటే ఇద్దరి మధ్య సంభాషణ కాదు,

ఇద్దరి గుండె చప్పుడు ఒకేలా స్పందించడం..

నాకు తెలిసిన అంత వరకూ ఇదే ప్రేమంటే...

అర్ధం చేసుకో నన్ను.

మొదటి రోజు చూడగానే అనుకున్న

తొలి చూపులో పుట్టేది ప్రేమ కాదు ఆకర్షణ

నీ గురించి తెలుసుకున్నాక అప్పుడు అనిపించింది

నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్న అని.

ఊహా... లవ్ యూ సో మచ్.

నాకు కుంచెం టైం కావాలి... అభి.

బై...

గతం నుంచి బయటకు రాలేకపోతున్నాడు అభి.

అన్నా.. ఈ టాబ్లెట్స్ ఇవ్వండి ప్లీస్ తొందరగా.

ఎమ్మా ఊహా.. నాన్నగారికేనా... బాగున్నారా నాన్న..

హా అంకల్. బాగున్నారు.!

ఒరే ఆ టాబ్లెట్స్ ఇచ్చి అమ్మాయిని పొంపించెయ్యి.

ఒకే సార్. (ఊహా అభి లవ్ ని అంగీకరిస్తుందా... తరువాత ఏమి జరిగి ఉంటుంది. wait for next episod.)

 

సూర్య 

***********************

 

 కథ పేరు: మలుపు.

 

ఒక సాధారణ కుటుంబం. ఇంటి పెద్ద ఒక్కరే వ్యాపారం చేస్తున్నారు. వారి సంతానము ఆరుగురు ఆడపిల్లలు. ఇద్దరు మగ పిల్లలు.

 

మా ఇంటి ఇల్లాలు మహాలక్ష్మి. ఎంతో ప్రేమతో ఓర్పుతో ఇంటిని చక్కగా తీర్చిదిద్దే మహా ఇల్లాలు. అందరికీ కడుపు నింపే అన్నపూర్ణ.

 

వారి కాలంలో ఆడపిల్లలను బయటకు పంపి  చదివించడమే గొప్ప. కానీ అమ్మాయిలు అందరిని బాగా చక్కగా చదివించారు. అందులో పెద్ద  అబ్బాయి డిగ్రీ చేశారు.

 

రెండవ అబ్బాయి అంతగా చదువు కొనే వాడు కాదు. చదువు అంటే అతనికి ఇష్టం లేదు. ఎప్పుడు అమ్మ కూచి. స్కూల్ కి వెళ్ళమంటే లేటుగా వెళ్లేవాడు. టీచర్ ఎందుకు లేటుగా వస్తున్నావ్ అంటే మా అమ్మ బట్టలు ఉతికి వచ్చానండి అని చెప్పాడు అది కూడా నిజాయితీ గా చెప్పేవాడు. అప్పుడు టీచరు ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మను అడిగేది నిజమా కాదా అని తెలుసుకోవాలని

 

. అలా అక్కాచెల్లెళ్ల తో పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ అల్లరిచేస్తూ ఉండేవాడు

అలా ఎలాగో ఇంటర్ వరకు వచ్చాడు.

ఇంటర్లో థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యాడు.

 

తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో అతని స్నేహితుడు అతనిని  మెడిసిన్ ఎంసెట్ అనేవారు అదిరాయమని ప్రోత్సహించాడు. ఫస్ట్ క్లాస్ లో చదివిన వాళ్ళకి మెడిసిన్లో రావడం అంటే చాలా కష్టం. అలాంటిది నేను అత్త సెరు మార్కులతో పాసయ్యాను నాకెందుకు రా ఇది అని అన్నాడు.

 

 కానీ అతని స్నేహితుడు వినలేదు. నీకెందుకు నేను చూసుకుంటాను అని చెప్పి అప్పుడు మాస్టారు  కోచింగ్ చెప్పే వాళ్ళు. వాళ్ల దగ్గరికి తీసుకెళ్ళాడు. వాళ్లు నవ్వేరు అతని మార్కులు చూసి. చాలా కష్టము నువ్వు చాలా సాహసం చేస్తున్నావు. ఎంసెట్ అంటే మాటలు కాదు అని అన్నారు .సరే ఇష్టపడి వచ్చావు కాబట్టి  కోచింగ్ ఇస్తాను అని అన్నాడు.

అలా ప్రతి రోజు ఇద్దరు స్నేహితులు ఉదయమే 6 గంటలకు సైకిళ్లపై కోచింగ్ సెంటర్ కి వెళుతూ శ్రద్ధగాచదువుతూ ఉన్నారు.

వాళ్లను చూసిన చుట్టుపక్క అందరూ ఫక్కున నవ్వుకునేవారు. ఫస్ట్ క్లాస్ వచ్చిన వారికే ఎంసెట్ కష్టము అలాంటిది తిక్క వాడిలాగా వెళ్తున్నాడు అని గేలి చేసేవారు

 

ఇంటిలో కూడా అందరూ ఎందుకు సంవత్సరం వేస్ట్ చేసుకుంటావు. ఏదో ఒక డిగ్రీ లో చేరిపో . అని రోజు పోరు పెట్టేవారు

ఒక్కొక్కసారి అతనికి కూడా భయమేసేది

నేను తప్పు చేస్తున్నానా అని. కానీ మిత్రుడు వదిలేవాడు కాదు. నీవు ఎగ్జామ్ రాయాల్సిందే అని పట్టుబట్టి చదివించే వాడు.

 

వాళ్ల నాన్న ఎప్పుడూ ఒరే అని పిలిచేవాడు ఎప్పుడు పేరు పెట్టి కానీ మర్యాదగా కానీ పిలిచే వాడు కాదు. ఒకసారి మనసు చివుక్కు మన్నా నాన్న కదా అని సర్దుకుపోతూ ఉండేవాడు.

ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ వచ్చింది. దాన్ని పూర్తి చేసి ఆఫీస్ కి వెళ్లి ఇచ్చాడు. అక్కడ అది చూసిన అతను ఎగాదిగా ఒక్క చూపు

చూసి వెకిలిగా నవ్వాడుఒకింత బాధ కలిగింది. అలా ఎందుకు చూశాడో అర్థమైంది. ఒకింత బాధ కలిగింది. ఆర్డినరీ పాసు కుర్రాడు వీడు. వీడు ఎంసెట్ రాయడమా. అని చూపులోని అర్థం.

బాధ దిగమింగుకుని ఇంటికి వచ్చేశాడు..

 

ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. టెన్షన్ బిగిన్ అయింది. నిద్రలేని రాత్రులు గడిపాడు. చిట్టచివరకు ఎగ్జామ్ రోజు వచ్చేసింది.

 

ఉదయమే లేచి అమ్మ నాన్నలకు నమస్కరించి ఎగ్జామ్ హాల్ లో ప్రవేశించాడు

అక్కడ అందరిని చూచి ఒకింత ఉద్వేగానికి గురి అయ్యాడు. అయిన తమాయించుకుని

ధైర్యంగా ఎగ్జా మిన ర్ పేపర్ ఇవ్వగానే

వణుకుతున్న చేతులతో తీసుకొని చూశాడు

ఒక్కసారి కళ్ళు బైర్లు కమ్మాయి.

పక్కన అందరూ చాలా స్పీడ్ గా రాస్తున్నారు. ఎట్టకేలకు తమాయించుకుని నిదానంగా రాయడం పూర్తి చేశాడు

 

ఇంటికి వచ్చాడు అందరూ అడిగారు ఎగ్జామ్ ఎత్తిపోయింది కదా అని. మౌనంగా ఉండిపోయాడు.

 

రోజులు గడిచాయి. రిజల్ట్ రోజు దగ్గరికి వచ్చింది. టెన్షన్ చూసి ఎందుకు టెన్షన్ ఎలాగో నీకు రాదు కదా అని ఎగతాళి చేశారు.

 

రిజల్ట్ రానే వచ్చింది. చూడడానికి తాను వెళ్లలేదు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఏంరా రిజల్ట్ చూసుకున్నావా అని అడిగాడు.

నాకు రాంక్ వచ్చింది అని చెప్పాడు . ఇప్పుడు ఇతనికి అర్థం అయింది. ఫెయిల్ అయ్యానని. బోరున ఏడ్చాడు.

 

 అతని స్నేహితుడికి అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నాడు అని  ఏరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నీకు ర్యాంకు వచ్చింది కదా నాకు రాలేదు కదా అందుకని అన్నాడు. అప్పుడు స్నేహితుడు పకపకా నవ్వాడు. ఒరేయ్ పిచ్చివాడా నాకు వచ్చింది అన్నాను కానీ నీకు రాలేదు అని చెప్పలేదు కదా. నీకు కూడా వచ్చింది రా అన్నాడు.

. ఒక్కసారి గా అతనికి అయోమయం. తనకు తాను గిల్లు కొన్నాడు ఇది నిజమా. అని ఆశ్చర్యపోయాడు

ఒక్కసారిగా స్నేహితుని కౌగలించుకుని ఇదంతా నీ వల్లే జరిగింది . నీవు లేకుండా ఉంటే నా జీవితం ఎలా మలుపులు తిరిగేదో అని.

 

. ఎవరిని ఎలా మలుపు తిప్పుతాడో భగవంతునికి తెలుసు.

అత్తెసరు మార్కులతో పాస్ అయ్యి

ఎలాంటి డొనేషన్ లేకుండా ఫ్రీ సీట్ తో పీజీ చేయడం అన్నది నిజంగా భగవంతుని దయ.

 

  భగవంతుడు తన స్నేహితుడు రూపంలో వచ్చి అతని జీవితాన్ని మలుపు తిప్పాడు. అంతేకాదు ఇంటిలో అతని మొదటి డాక్టరు. అతనిని స్ఫూర్తిగా తీసుకొని ఇంటిలో మొత్తం 10 మంది అన్ని స్పెషాలిటీ లలో డాక్టర్ లయ్యారు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదివి ఉన్నారు.. అతని పిల్లలు ఇద్దరు కూడా డాక్టర్లు

 

భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం. స్నేహితుడు రూపంలో వచ్చి జీవితాన్ని మలుపు తిప్పాడు. కాబట్టి మనం ఎప్పుడు అధైర్యపడ కూడదు. మంచే జరుగుతుంది అని ఆశించాలి.. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి.

 

కొసమెరుపుఅతను ఎవరో కాదు మా వారే 😀😃.

డి నాగమణి.

 ********************


 

స్వర్గీయ అక్కినేని కి జన్మ దిన సందర్భంగా అక్షర " ప్రేమాభిషేకం"

 

వేంకట రాఘవా పురంలోనిరుపేద రైతు కుటుంబంలో పుట్టి

రంగస్థలం పై స్త్రీపాత్రలతో నటనలో తొలి అడుగు పెట్టి,

సీతారామ జననంతో సినీ రంగంలో ఒదిగి," సీతారామయ్య గారిలా ఎదిగి,

పెద్దగా చదువుకో లేక పోయినా," మహాకవి కాళిదాసు,క్షేత్రయ్యగా

నాస్తికుడైనాభక్త జయదేవ,తుకారాంగా

త్రాగుబోతు కాకున్నా  భగ్న ప్రేమికు డైనదేవదాసుగా

శ్రీమంతుడుఅయినా దుర్వ్యసనాలకు లొంగనిబుద్ధిమంతుడుగా

ప్రేమించి చూడు "" బ్రహ్మచారీ! " అంటూ నవ్వులు పంచిన " పూల రంగడుగా

తల్లికిచ్చినవాగ్దానంకు కట్టుబడ్డ " సుపుత్రుడుగా

పాకుడు రాళ్ళ చిత్ర సీమలో " ఏడంతస్తుల మేడకట్టిన " జమీందారుగా

ఆంధ్రా హీరోలకు స్టెప్పులు నేర్పినగురు బ్రహ్మగా

కుర్రకారు నుర్రూత లూగించినకాలేజీ దసరా బుల్లోడుగా

మంచిమూగ మనసులుతో నటననే దైవంగా " ఆరాధనచేసి,

పౌరాణిక,జానపద,చారిత్రక సాంఘక పాత్రల్లో జీవించి,

సాంఘిక హీరోగా  పనికి రాడన్న చోటనే ట్రాజి డీ  కింగ్ '

నట సమ్రాట్గా ధన ఘన కీర్తి పొందినకోటీశ్వరుడుకు

ఎవర్ గ్రీన్ హీరోకు,అక్కినేనికి.ఎన్.ఆర్ కు,నాగ్గాడికి

తెలుగు చలనచిత్ర సీమలోఅమర జీవికి

బహుదూరపు బాటసారికి తమ హృ దయప్రేమ మందిరంలో

ప్రేక్షక దేవుళ్ళు చేసేఅక్షరప్రేమాభిషేకంఇదే!

 

 దొంతాభక్తుని రామ నాగేశ్వరరావు, భీమవరం.

************


కథ పేరు : అమ్మ అమ్మే

రచన : దొం తాభక్తుని రామ నాగేశ్వరరావు

బాబూ రాజా! అంటూ సంతోషంగా పిలిచింది సుశీల .

పిలుపు విని,ముందు నడచి వెళ్తున్న రాజా ఒకసారి వెనక్కి తిరిగి చూచి,నడక వేగం పెంచాడు.

సుశీల తొందరగా నాలుగు అడుగులు వేసి,అతని ముందుకు వెళ్లి,భుజాలు పట్టుకొని కుదుపుతూ

    " బాబూ రాజా! ఎందుకు నన్ను చూసి కూడా చూడనట్లు  తప్పించుకు పోతున్నావు? నా పిలుపు వినీ వినబడనట్లు వెళ్లి పోతున్నావు? కన్నతల్లి కంటబడటానికి సిగ్గు పడుతున్నావా? లోకమంతా నన్ను ' డాక్టర్ గారి ఉంపుడు గత్తె' అని అంటూ ఉంటే వినివిని బాధపడటం మానేశాను . కానీ మాట నీకు తలవంపుగా ఉండి,భరించ లేక పోయే వాడివి.పిచ్చిమొద్దువు .లోకం తెలియని పసివాడివి. నీకు ఏం తెలుసు? ఇప్పుడు నువ్వు 30 ఏళ్ళ వాడివైనా నాకంటికి మూడేళ్ల శిశువు లానే కనిపిస్తా వు.ఈలోకం నాపై అభాందం వేయలేదుగా! లోకం అన్నది నిజమే నూటికి నూరు పాళ్ళు నిజమే. నేను డాక్టర్ గారి ఉంపుడు గత్తనే.నేనలా  కాక పోతే లోకం నిన్ను బ్రతికించి, నాకిచ్చేదా? నేను నా కోసం ఉంపుడుగత్తెను కాలేదు.నీకోసం నీ ప్రాణాలను రక్షించుకోవడం కోసమే నేను అలా కావలసి వచ్చింది.

       నేను అనాథను .మీ నాన్న అనాధే.ఇద్దరం ఇష్టపడి,పెళ్లి చేసుకున్నాము.నువ్వు పుట్టిన మూ డే ళ్లకే మీ నాన్న ప్రమాదంలో చనిపోయి,నన్ను ఒంటరిని చేసి,వెళ్ళిపోయాడు.ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ, నీ మీదే నా పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతుంటే దేవుడు నా పై దయలేకుండా నీకు గుండెజబ్బు రప్పించాడు.లక్షలాది రూపాయలు ఖర్చు చేసి,నీకు ఆపరేషన్ ఎలా చేయించగలను. నిన్ను దక్కించుకోవడమే నా ఏకైక లక్ష్యం.నేనేమైపోయినా  ఫర్వాలేదు అనుకున్నాను. నా ప్రాణాలు ఇచ్చైనా బ్రతికించుకోవాలి అనుకున్నాను.అందుకే డాక్టరుగారు నే బిడ్డకు ఆపరేషన్ చేసి,బ్రతికిస్తాను.వాడికి చదువు చెప్పిస్తాను.నిన్ను ప్రేమగా చూసుకుంటాను.నీ తోడు నాకు కావాలి అన్నారు. పరిస్థితుల్లో నేను కాధనగలనా? కాదంటే నువ్వు నాకు దక్కుతావా? అందుకే ఒప్పుకున్నాను.ఆయన బ్రతికినంత కాలం నన్ను బాగానే చూసుకున్నారు.ఇల్లు కొని,ఇచ్చారు.నిన్ను చదివించారు.నీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేశారు.

     ఇంక నా కష్టాలు తీరాయి అనుకున్నాను.నువ్వు ఉద్యోగానికి పట్నం చేరి,ఇల్లు చూసుకుని వస్తానని,అప్పుడు నన్ను తీసుకు వెళ్తానని చెప్పి,వెళ్ళావు.కానీ వచ్చిన ప్రతిసారీ ఏదో సాకు చెప్పి,వెళ్లిపోయే వాడివి. ఒకసారి వచ్చి,పట్నంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పావు.ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూడలేక పోయానని ఎంత బాధ పడ్డానో తెలుసా? పోనీలే మీ ఆనందం మధ్య పానకంలో పుడక లా నేనెందుకు? ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉంటె చాలనుకున్నాను. కానీ నువ్వు నీ పెళ్ళాం మోజులో పడి,ఆమె గొంతెమ్మ కోర్కెలు తీర్చడం కోసం జీతం చాలక అడ్డ దారులు త్రొక్కి,ఉద్యోగం పోగొట్టుకున్నా వు.అంతతో ఆగక,పట్నంలో ఇల్లు కొంటానని,ఊళ్ళో ఇల్లు అమ్మించి,డబ్బు తెచ్చుకున్నావు. డబ్బులు అయిపోయాక నిన్ను పెళ్ళాం వదిలి పోయింది .చివరకు బెంగతో నీ ఆరోగ్యం చెడి కిడ్నీ దెబ్బ తిన్నది. విషయాలన్నీ తెలిసి,నువ్వు చెప్పక పోయినా,ఉండబట్టలేక నేనే నిన్ను వెదుక్కుంటూ పట్నం వచ్చాను.దేవుని దయ వల్ల నా రెండు కిడ్నీలు బాగున్నాయి.నా కిడ్నీ ఇచ్చి, నిన్ను బ్రతికించు కుంటాను.పద నాయనా! ఆసుపత్రికి వెల్దాం" అంది.

రాజా భోరున ఏడుస్తూ తల్లి కాళ్ళ పై పడి " క్షమించమని అడగడానికి నోరు రావడంలేదు. ఇంత త్యాగానికి నేను అర్హున్ని కాదమ్మా!" అన్నాడు.

" ఏమిటా మాటలు.నేను నీ కన్నతల్లిని.నిన్ను నేను చూడక పోతే ఇంకెవరు చూస్తారు.నేను కూడ బెట్టిన సొమ్ముతో వెంటనే ఆపరేషన్ చేయిస్తాను.నేను  బ్రతికేది నీ కోసమే.రాజా! లే నాయనా ! తొందరగా ఆసుపత్రికి వెల్దాం" అంటూ చేయి పట్టుకు బయల్దేరింది.

  కథ కంచికి మనం ఇంటికి.

 

దొంతాభక్తుని రామ నాగేశ్వరరావు, భీమవరం. 

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...