27, సెప్టెంబర్ 2020, ఆదివారం

ఎస్. పి. బాలు ప్రస్థానం


 

 సుప్రసిద్ధ గాయకుడు 
 ఎస్. పి. బాలు ప్రస్థానం

 

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (. 1946 జూన్ 4) గా పిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు.

 

అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.


తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించాడు.


1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.

 

 

 

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

 

1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.

 

సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు.

 

బాలుకు భారతదేశ కేంద్రప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది.

 

బాల్యం, విద్యాభ్యాసం

బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాలు తండ్రి సాంబమూర్తి, పేరొందిన హరికథా పండితుడు. తల్లి శకుంతలమ్మ. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు.

 

బాల్యమునుండే బాలుకు పాటలు పాడటము ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో మద్రాసులో AMIE కోర్సులో చేరాడు. కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు బాలు. బాలసుబ్రహ్మణ్యం చదువుకునే రోజుల్లోనూ, తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్ళు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా


పనిచేయాలని కలలు కనేవాడు.

 

 

వృత్తి జీవితం 


బాలసుబ్రహ్మణ్యం

మద్రాసులో .ఎం.. చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించాడు.

 

చిత్రానికిఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించాడు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని అతని పేరే పెట్టుకున్నాడు బాలు.

చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి గాన గంధర్వుడు.

 

2016 నవంబరులో గోవాలో జరిగిన 47 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.


నటునిగా

1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించాడు బాలు.

1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించాడు. ఇందులో రాధిక కథానాయిక. సినిమా తెలుగులో పాప లాలీ అనే పేరుతో అనువాదం అయింది. ఇంకా ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించాడు. 2012 లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా కనిపించాడు బాలు. ఇందులో లక్ష్మి నాయికగా నటించింది. సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది.

 

 

డబ్బింగ్ కళాకారుడిగా

కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. అందులో కమల్ హాసన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు.

 

తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవాడు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది.

ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేసాడు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను కార్యక్రమం ద్వారా పరిచయం చేసాడు. 1996 లో మొదలైన కార్యక్రమం 2016 లో ఇంకా కొనసాగుతూనే ఉంది.


వ్యక్తిగత జీవితం

నెల్లూరు లోని శ్రీ కస్తూర్బా కళాక్షేత్రంలో బాలసుబ్రహ్మణ్యం అవిష్కరించిన తన తండ్రి సాంబమూర్తి విగ్రహం

బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, ఎస్. పి. చరణ్. కొడుకు ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఈమె నటుడు శుభలేఖ సుధాకర్ ను వివాహమాడింది. బాలు తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4 89 సంవత్సరాల వయసులో నెల్లూరులో మరణించింది.

2020 ఆగస్టు నెలలో కోవిడ్-19 వ్యాధి సోకగా ఆసుపత్రిలో చేరాడు.

 

 

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అందుకున్న పురస్కారాలు

 

భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు

 

పద్మశ్రీ (2001)

డాక్టరేటు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (1999), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నరు రంగరాజన్ చేతులమీదుగా

పద్మభూషణ్ (2011)

శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం (2016), కేంద్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా

నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ప్రత్యేక బహుమతి.

 

 

   

భారతీయుల సంపద..బాలు!

 

అన్ని మతాలకు వరం బాలు స్వరం..

అన్ని భాషలకు వరం బాలు గాత్రం..

అన్ని వయసులకూ స్నేహం బాలు గీతం..

అన్ని జాతులకు ఓదార్పు!

బాలు పాట మేలుకొలుపు!

బాలు ..ఎప్పుడు భారతీయుల ఆస్తి..!

భారతీయులకు ఎప్పటికి తరగని కీర్తి!

 

వసుధ‌‌‌___ తెలుగు తేనియలు


బాలూ...

 

కాలం కాటు వేసింది నిన్ను కరోనా రూపాన,

ఐనా నీ గళం పదిలమైనిలిచింది మా మదిలోన,

నీ రూపం సదా  కదులుతూంది మా కన్నులలోన,

నీ మాటలు మారుమ్రోగు తున్నాయి మాచెవుల్లోన...

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి___ తెలుగు తేనియలు

 

 

రోజుని వదిలేద్దాం , ఏం కాలేదనుకుందాం...

అంతా బాగుందని భ్రమలోనే ఉందాం..

జ్ఞాపకాలు మన తోడని కాస్త సర్దుకుందాం...

జహపనా తోటలో విశ్రమించారనుకుందాం..

వెన్నెలనే చూస్తూ క్షణాన్ని చవిచూద్దాం...

రేపీ వెన్నెల రాదని దిగులిక్కడ వదిలేద్దాం....

అంతా మామూలేనని కాసేపు నిదరోదాం..

కువ కువల వేకువలో నిశీధినే దాటేద్దాం , ఇంకెంతసేపు ఏడుస్తాం..

నిజాన్నిపుడే వదిలేద్దాం..

అబద్ధంగా నవ్వేద్దాం ..అబద్ధంగా నవ్వేద్దాం !!

 

విష్ణుప్రియ___ తెలుగు తేనియలు



కందము

పలుకు పలుకునందమృతము

నొలికించిన స్వరము తాననూహ్యమ్ముగనే

సెలవంచు తరల దివికిని

కలతపడి జనాళి నేడు కలవర మొందెన్!

 

కందము

అలసితి నటంచున్ వెడలి

కలగా మిగలగను గాన గంధర్వుండే

విలులిత మనమ్మునను తా

విలపించె కళామతల్లి వేదన తోడన్!

 

కందము

బాలూ! మాపై కినుకది

ఏలనయా; నీదు గానమే చిర యశమున్

వాలారుచు నుండగ; నీ

వేల నిట భువిని విడి దివికేగితి వోయీ!

 

చల్లా దేవిక___ తెలుగు తేనియలు

 


బాలు స్వరం - అద్భుత వరం

పార్వతీ సాంబ మూర్తుల పుత్రుడు బాలసుబ్రహ్మణ్యం

శకుంతలా సాంబ మూర్తుల సుతుడు మన బాల సుబ్రహ్మణ్యం

బాల సుబ్రహ్మణ్యం కు షన్ముఖాలు

మన బాల సుబ్రహ్మణ్యం కు షన్ముఖాలు

అవే గానం,గాత్రధానం, నటన,

చిత్ర సంగీత దర్శకత్వం,నిర్మాణం,వ్యాఖ్యానం

ఆయన షన్ముఖాల తో కృత్తిక మాటల నలరించాడు

మన బాలు ఆబాలగోపాలాన్ని ఉర్రూత లూగించాడు

శాపవశమున గంధర్వుడు దివినుండి భువికి దిగెనేమో

మన పుణ్య వశమున ఏబది వసంతాలు గానం వినిపించేనేమో

మన పుణ్యము,ఆయన శాపము తీరెనేమో?

గానదిగ్గజం మరల స్వంత గూడు చేరెనేమో?

శ్రీపతి పండితారాధ్యుల వంశంలో పుట్టిన గాయక రత్నం

సినీసంగీత ప్రియుల కారాధ్య దైవమనుట సత్యం

బాలు! నీవు తిరిగి రాని లోకానికి చేరుట

యావత్ సినీ ప్రపంచానికి తీరని లోటు

నీ స్వరం సుమధురం,అద్భుత వరం

నిన్ను మరువబోదు సినీ ప్రపంచం.

 

డి.రామ నాగేశ్వరరావు___ తెలుగు తేనియలు

 

 

" బాలు" కు వీడ్కోలు

సీసము

గంధర్వ గానాల బంధించి వేశావు పండిత పామర ప్రజల నెల్ల

బహు భాష లందున ప్రావీణ్య మొప్పార పాటలు వేవేలు పాడి నావు

పలు గాత్రములు మార్చి పరవళ్ళు త్రొక్కుచూ పలువురి నాశ్చర్య పరచినావు

గానమ్ము తో పాటు గాత్రదాన నటన చిత్ర సంగీత ముం జేసినావు

 

తే.గీతి. మంచి అభిరుచి తోడను మంచి చిత్ర

.ములను నిర్మించి, వ్యాఖ్యానము నొనర్చి

తీవు ఈటీవి చానలు నింపు మీర

మాదు గుండెల పదిలమ్ము మధుర బాలు!

 

డి.రామ నాగేశ్వరరావు___ తెలుగు తేనియలు

 

 

తేటగీతి లో గాన గంధర్వుడు బాలు గారి కి వినయపూర్వక నమస్సులతో

 

తెలుగు పాటకు పల్లవై తీయ నైన

పలుకు తోనందరిమదిలో బాలు డయ్యె

గాన గంధర్వునిగళమున్ గంగ పొంగ

కీర్తి కాంతతా నెగరేసెకేతనంబు

సురలు నరులను మురిపించె జోల పాడి

బాలు మావాడనుకొనని వారు లేరు

 

రమ, కంకిపాడు___ తెలుగు తేనియలు

 

 

 

నీ జననం సహజం నీ కీర్తి అనుపమానం

నీ ఊపిరి పాటే మా పాటకు ప్రాణం

నీ గళం గాంధర్వం నీ మాటలు మనోహరం

యుగళాలు మధురం విషాదాలు అమరం

నవ్వుల్లో నీ పాటే మాకు లాలన

ఏడుపులో నీ పాటే మాకు సాంత్వన

తెలుగు నాట బాలుడివై , పాటల్లో గాంధర్వుడివై

నీ కీర్తి  నలుదెశలా జయ కేతనమెగరేసి

ఉండిపో నిండుగా ఆరాధ్యుల గుండెల్లో కలై'మా'మణి గా

పద్మశ్రీ శ్రీపతి పండితారాధ్యుల సుబ్రమణి గా...

ఎందుకంటే ఈ బాలూ ఒక్కడేగా మా బాలూ ఒక్కడేగా !!

 

విష్ణుప్రియ___ తెలుగు తేనియలు

 

 

బాబోయ్ .... బాలు

అయన చెంత పాట పాడాలా ? ఉండాల్సిందే

తెలుగులో వాక్పటుత్వం , పరిపూర్ణంగా వ్యాకరణం .

కాదు, రాదు అని బిక్క మొఖం చూపిస్తే .... కీర్తి కావాలంటే ఇవ్వన్నీ కేతనాలు బాబు.

బాగా అభ్యాసం చేసుకో ఫో అని నవ్వుతూ ప్రేమగా తన ధోరణి తో దోవ చూపిస్తారుగా బాలుగారు

మురళి మోహన్___ తెలుగు తేనియలు



తెలుగు నాటన పుట్టిన వెలుగు రేడు,

పాట లెన్నియో పాడిన దీటు గాడు

తెలుగు కీర్తిని చాటిన చెలిమి రేడు

గాన కేతనంబు ఘనంబు గ జగ మంత

నెగుర వేసిన ట్టి ఘనుడు నేడు పాడ

లేక నుండె నాస్పత్రిలో యేక బిగిని

 

తెలుగు పాటను పాడగ తెలివి చూపి

పాట లెన్నియో గళమున పాడెగొప్ప

కీర్తి పొందెను బాలుగగీటు రాయి,

నిలిపె,   తెలుగు కేతనమునీకు నమసు.

 

ఆర్. శాయి___ తెలుగు తేనియలు

 

 

తేటగీతి

మధుర యాలాపనల దేవమధువు పంచు

తెలుగు పాట ఘనత నేడు వెలుగు భువిని

కీర్తి కేతనంబెగుర సత్కీర్తి బడయు

నీవె పాటయై పాటయె నీవు గావ!!

 

వాణిశ్రీ నైనాల___ తెలుగు తేనియలు


 గాన గాంధర్వుని ఘనము

పండితారాధ్య దంపతులకు

పుణ్యపుత్రునిగా పుట్టి

నెల్లూరు నేల యందు నెమ్మదిగా ఎదిగి

గానమాధుర్యాన్ని గమ్మత్తుగా పెంచి

(తెలుగు )దేశ (కీర్తి)ని

తరతరాలు తలపోయునట్లు

తనపాటలను పంచి

ఖండఖండాంతరాల

జయ (కేతనం )ఎగురవేసి

బహుభాషా గాయకుడై

బహుళముగా మెప్పుపొందే.

 

డి. వి. హేమలత___ తెలుగు తేనియలు

 

బాల సుబ్రహ్మణ్యం గారి గురించి వ్రాసిన సీసం...

సీసము

రసరమ్య గీతాల వసపోసెనా యమ్మ

నీకు! దీవించ తానిచ్చి జన్మ

మంత్రించి పంపెనా మంత్ర ముగ్ధులజేయ

వాగ్దేవి కశ్చపి వైతి వీవు

యాదమర్చి విరించి యాదిప్రణవ మద్దె

నా నీ నుదుటిపైన నాద బ్రహ్మ!

యక్ష, గాంధర్వుల యాగ ఫలము నీకు

దారబోసితిరేమొ ధరణి జేరి!

గానసుధలొలికించు గాంధర్వుడే నీవు

కర్ణపేయంబు నీ గాత్రసుద్ది

నీ నోటను పలుక నేరాగమైననూ

వైనంబు నర్ధించ వగచు చుండు!

 

పాటల పదనిసలు నరనరాన వెల్లువై

అందమైన శబ్ద మాలగా రూపుదిద్దుకొని

అమ్మ పాల ధార తెలుగు పంచదార అంటూ మాతృభాష మధురిమనుతెలిపి

తన గాన మాధుర్యంతో దశదిశలా కీర్తి కేతనంబు ఎగుర వేసి

అందరిని శోక సంద్రంలో వదిలివేసి తోడుగా సప్తస్వరాలను తీసుకొని

 

పయనమాయే స్వర్గలోకంబుకు  గాన గంధర్వుడు ఎస్పీ బాలు గారు.

ఇప్పుడే న్యూస్  విన్నాను .

 

దేవరశెట్టి నాగమణి___ తెలుగు తేనియలు



అర్ధ శతాబ్దం పాటు కోట్లాదిమనసులను రంజింపచేసిన అమరగాయకునికి నివాళి...బాధాతప్త హృదయంతో . . .  

ఆటవెలది

బాలుగారి మేటి పాటని వినకున్న

నిదురరాదు మనకు; కదలలేము   

తెలుగుయున్నవరకు తీయగా వినిపించు

అమరగాయకునకు అంజలింతు 

 

తేటగీతి

తెలుగు వారి గుండెలలోని తేరుమీద

పరవశమ్మగు పాటతో పరిమళించె

విమలగాంధర్వ సంపద విద్యతోడు    

స్వర్గ సీమని రంజింప వరముతోడు    

గగనమునకేగె గంధర్వ గాయకుండు 

 


కస్తూరి శివశంకర్___ తెలుగు తేనియలు

 

వినటానికి సంగీతం మూగబోయింది

మాట్లాడటానికి స్వరం

చిన్నబోయింది

చూడటానికి కనులు

వర్షధారలయ్యాయి

సుస్వర ప్రపంచం లో

ఒక ధ్రువతార రాలిపోయింది

కొవ్వూరి___ తెలుగు తేనియలు

 

ఐదు దశాబ్దాలు ఉర్రూతలూగించిన

యస్పీ బాలు, తెలుగు పాటకు ప్రతిరూపు,

కీర్తిశేషుడయ్యేనని...

ఆకాశం కన్నీరుమున్నీరాయె

అశేషాభిమానలోకం తల్లడిల్లెను

సంగీతలోకాన జయకేతనమ్మై నిలచి

గాంధర్వ లోకాన బావుటానౌతానని మరలిపోయె.

*చిరయశః కాయుడౌ శ్రీపతి పండితారాధ్యుల బాలు

తెలుగు పాట కీర్తి కేతనం మన మనములందెగరేసి*

 

ఉత్తమ లోకాలు సంప్రాప్తించాలని ప్రార్ధిస్తూ

దుర్భ కృష్ణశాస్త్రి___ తెలుగు తేనియలు

 

 

అన్నమయ్య అలమేలు సమేత అయ్యవారిని తన కీర్తనలతో కీర్తించాడు .వారు వాటికి  ముగ్ధులై

 అన్నమయ్యను తమలో ఐక్యం చేసుకున్నారు

అలానే నేటి గానగంధర్వుడి గాత్రమాధుర్యానికి మంత్ర ముగ్దులై సకలదేవతలు తమ గానసభలకు అధ్యక్షత వహించమని తనని అక్కున చేర్చుకున్నారు

బాలు గారికి అశ్రు నివాళుల తో .........


రమాదేవి  ,కొండిపర్తి___ తెలుగు తేనియలు



నివాళి గా నా గీతలు రాతలు తప్ప ఇంకేమీ చేతకానివాణ్ణి .                                 తెలుగుదనపు నిలువెత్తుదనం అంటేనే బాలు

తెలుగు పాట గొప్పదనం పలికెను దశదిశలు

భారతీయ సంగీతపు సుస్వరాల కీర్తి

పాడుతాతీయగా నిర్వాహణ కేతన స్ఫూర్తి

కన్నాజీ రావు___ తెలుగు తేనియలు

 

అశ్రునివాలి

 శ్రీపతి వారి ఇంట గాన గంధర్వమా

పండితారాధ్యుల ప్రభంజనమా

మూర్తి, శకుంతల ముద్దుల తనయా

సావిత్రమ్మ భాగస్వామ్యం తో బాసిల్లిన బాలు

చరణం మీ శ్వాసగా, పల్లవి మీ ప్రాణంగా

కొనేటమ్మపేట స్వర నీరాజనమా

నెల్లూరు నివాసిగా, పాడుతా తీయగా

నవ గాయనీ గాయకుల పరిచయ కర్తా

పద్మశ్రీ, పద్మభూషణ్ లు మీ కంఠాభరణాలై

29నందులు పొదిగిన నవరసాల స్వరపీఠికా

40వేల పాటలు జాలువారిన గళమా

11భాషల గాన స్వర ప్రభంజనమా

మీ గళం మూగబోయే, మా మది మసిబారిపోయే

 

వి. వి. శ్రీనివాస్, షార్, శ్రీహరికోట___ తెలుగు తేనియలు

 

 

శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యమునకు  నా చిరు అంజలి

 

ఏమిటి నిజమేన,యీమహిని విడచి యస్పిబాలు‌ వెడలె నన్న మాట

నేను వింటి నిజమా,నేను కలను కను చుంటిని యేమో? వసుధను వీడి

వెడలితివి  హతోస్మి  విడచి మమ్మిచ్చోట వెడలితి వేలనో వేల కోట్ల

గొంతులు ధరణిలో‌ గొల్లు మనుచు నుండె బాలసుబ్రమణ్య  బ్రాహ్మణుండ!

ఘంటసాలను కూడి గానమ్ము చేయంగ వేగముగ దివికి వెడలి నావ?

నాగయ్యతో కూడి  త్యాగరాజకృతులు నాలపింప వెడలి నావ? మంగ

ళము పల్లి వారితో గమకము లేమైన  కొత్తవి చర్చించ కోరి నావ

పాడుతా తీయగా పాటను వినిపించ మనుచు నమర లోకమందు నెవ్వ

రైనను‌ కోరినారా?భానుమతి కీర్త నలను నీవు వినగ దలచి వెడలి

నావ? ఎస్పీ బాలు నడిసంద్ర మందు యీ చిత్ర సీమను త్రోసి చేరె దివికి

నను నపభ్రంసలు వినబడుచుండగా నెటుల వెడలినావు నెమ్మి తోడ

స్వర్గమునకు,నమ్మ శక్యము కాకుండె నింకను మనసుకు, శంక కలుగు

చుండె ,నేవిన్నది శుధ్ద యబధ్ధమౌనని,పొరబాటున నిను శచి పతి

కొనిపోయె నాయేమి? కోట్ల మందికి గుండెలన్ని నొక్క క్షణము లయలు‌ తప్పె

నీవు లేవను వార్త నెవ్వరు నమ్మజాలగ లేరు జనులెల్ల వగచి వగచి

కనుల నీరంతయు కడలినిచేరుచుండెను గదా నిజమిది‌ ఘనుడ , గాన

గంధర్వు డా యిది‌ గారడీ‌ ననుచుంటి పరమ శివునకును,భార్య పార్వ

తమ్మ నీ పాటను తనకు ముదమ్ముగ వినిపించమని కోర ప్రేమ తోడ

నిను పిలిపించెను  నీల కంఠుడుతన కైలాసమునకు, ముఖ్యమని తలచి

సుబ్బలక్ష్మమ్మకు నబ్బురముగ తోడు నిడగ శ్రీహరి పిల్చె నిన్ను‌ విష్ణు

సాన్నిధ్యమునకు, నిజము గాదె నవ సంగీతపు బాణీలు  జాతికి నిడ

యా బ్రహ్మ పిలిపించె నానందముగ నిన్ను సత్యలోకమునకు సంతసముగ,

నిజమిది తెలుగువాని ఘనత విశ్వమం త తెలిపితివి నీవు ధన్య జీవి

వయ్య నీవు, తెలుగు వారి కెవరు సాటి రారని‌ తెలిపిన బ్రహ్మ వయ్య,

పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు కనులు తెరిచి భువి కాంచి నట్టి

ప్రతి జీవి కనులను పరమేష్డిసన్నిది కై మూయ తప్పదు ఖల్వ మందు

ఘంటసాల పిదప కుంటు పడును చిత్ర సీమ యనితలచ శీఘ్రగతిని

కంఠము నందించి ఘనమైనచిత్ర జగమ్మును నోర్మితో కాచి నావు,

భక్తి పాటలను శుభమ్ముగా యెన్నియో భాషలలో పాడి పరవశమ్ము

జనుల గళమునందు సమకూర్చినట్టి థ్రష్టవు యీవు జగతిలో  సంబరముగ

యెన్ని యవార్డులు యెంత కీర్తి  బడసి సంగీత సాహిత్య  సంప్రదాయ

విలువలకు నెపుడు పెద్ద పీ టను వేసి మన తెలుగు రహి ఘనత తోడ

పదుగు రెదుట నీవు పంచి ముదము పొంది నావుగా, నీదు గానమును వినని

జనులు లేరు జగతిన్ ,సప్త స్వర సరములో కోహినూరువే!  లోకమందు

యెనలేని కీర్తిని ఘనముగా పొంద నీ శక్తిని  పొగడగా సాధ్య మెవరి

 

తరము,  శ్రీపతి వంశమెంత తప మిచట

చేసెనో, తెలుగు శిశువా, చేయు చుంటి

శిరసు వంచి నమస్సులు , భరత మాత

బిడ్డడా గొనుమంజలి ప్రేమ తోడ

 

పూసపాటి ___ తెలుగు తేనియలు

 

ఎన్నాళ్ళు మీరే వింటారర్రా బాలు మధుర గానమును.... మాకూ అవకాశం ఇవ్వండర్రా.....ఇట్లు దేవతలు...

 

తెలుగు వారి కొరకు తేనెలనొలికించు

పాట పాడి జూపె పాట గాడు

వాని కీర్తి జూసి వాగ్దేవి మురిసెనే

కేతన మును జూపి కేలు జాచె.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, ముంబయి___ తెలుగు తేనియలు


పాటల పూదోటన వీచే సుమగంధం

గతితప్పి భువిని విరిసిన గాన గంధర్వం

మా మనసుల పలికే సరిగమల సంగీతం

శాపం తీరి నిజలోకం చేరి మమ్ము ఉంచావు శోకసంద్రం

ఇదే ఒక నమ్మలేని నిజం

నీకు సాటి మరిలేరు ఇది మరువం

 

మధుర గీతాల ఆలాపనలో మధువు నీవు

విషాద గీతాలు ఒలికించే గరళం నీవు

మత్తు గీతాల ఊరించే మెత్తని జిలేబి నీవు

భక్తితో అర్చించే అపురూప కుసుమం నీవు

 

దేశభక్తి గీతాల ఎగురవేసిన జెండా నీవు

ఉద్రేకం ఉప్పొంగే వీర పౌరుష ఖడ్గం నీవు

ఉత్సాహం నింపే ధీరుడి గొంతు నీవు

ఉల్లాసం పరుగెత్త దాగని ఆనందం నీవు

 

రక్తిని విసిరే గురితప్పని వలపు బాణం నీవు

ప్రేమికుల విరహ తాపాన్ని దాచే ప్రేమ నీవు

ఆలూమగల సైఆటల సరిజోడువు నీవు

చిన్నారుల చిచ్చికొట్టి నిద్రపుచ్చే జోలాలి నీవు

 

చక్కిలిగిలి పెట్టే నవ్వులరేడు నీవు

తల్లిదండ్రుల చూపే బాధ్యత నీవు

గురు దైవం ముందు మ్రొక్కె చేయి నీవు

సరిగమల వైవిధ్యం వివరణ నీవు

 

భాష పట్ల మమకారం నీవు

శబ్ద ఉచ్చారణ మార్గం నీవు

వేల కోట్ల గళాల పాటవు నీవు

మా మనస్సు ల గెలిచి నిలిచేవు

 

బాలుడువని మా మురిపాలుడవని

పాటల నిలిచిన మధుర పాటగాడివని

పలు కాలాలు నిలివాలని మాకొరిక ని

శాపం తీరి నిజలోకం చేరావని

 

మేము అనుకోవాలని నీజ్ఞాపకాలై

ఉండాలనే కొత్త పాటలు ఇక రావని

మేము గుర్తు ఉంచుకుంటాం

తెలుగుపాట కీర్తి కేతనం నీవని

గత పాటలు మదిలో పాడకుంటూనే ఉంటాం

 

బాలు మామకు అశ్రునయనాలతో

 

డా.  సతీష్___ తెలుగు తేనియలు 

  

మూగవోయిన క్షణం

 

వేల మనస్సులను పాటలతో ఊర్రుతలూగించెనపుడు...

గానగందర్వము మూగవోయిన క్షణమిపుడు...

స్వర మాధుర్యంతో మంత్ర ముగ్దము చేసెనపుడు...

సంగీత ప్రపంచపు రారాజయై దివికెగెనిపుడు...

సప్త స్వరాలను అలవోకగా ఆలపించెనపుడు...

సప్త వర్ణాల కన్నీటి సంధ్రమాయెనిపుడు...

సకలకళలతో, సంగీత సినీ ప్రపంచపు అగ్రశిఖర మాయెనపుడు...

ఊహించని సూక్ష్మజీవికి వటవృక్షంలా నేలకొరిగెనిపుడు....

ప్రజల గుండెల్లో సరాగమాలికల పల్లవాయెనపుడు...

గగన సీమకెగినా, పారిజాతమాయెనిపుడు...

బాలు.. నిలిచెనా చరిత్రపుటల్లో పాటలో పల్లవిలా...

ఆశ్రునయనాలతో అక్షర సుమాంజలి...

 

సి.హెచ్. రజిత, కరీంనగర్___ తెలుగు తేనియలు


 

రాక - పోక

 

జననం ఒక ప్రహసనం

మరణం ఒక ప్రస్థానము

రెంటి నడుమ వూగిసలాట

మనిషి జీవిత పాఠశాల

 

ఏడుపుతో ఆరంభం

ఎక్కి దిగే జీవిత కాలం

ఆడే ఏడుస్తంభాలాట ఎప్పుడు

ఆగునో దాగుడుమూతలాట

 

నవ్వే పాత్రలు అనేకం

ఏడిచే పాత్రలు అనేకానేకం

మన పాత్ర తెలుసుకొనే

సరికి ముగిసే జీవితకాలం

 

పరిచయాలు ఎన్నో

పరిష్వoగనాలు ఎన్నెన్నో

తిరిగే మలుపులెన్నో చేరాల్సిన

గమ్యపు ఆహ్వానం ఒక్కటే

 

-కోవూరి___ తెలుగు తేనియలు

(బాలు గారి మరణాన్ని జీర్ణించుకో లేక )

 

 

బాలు

 

బహుముఖ ప్రజ్ఙాశాలి

బ్రహ్మ పంపగా భువికి వచ్చిన గాన గంధర్వుడు బాలు.

పాట ఏదయినా మారెను తేనెగా నీ గళమున

రాగమేది ఆలపించినా రసధారలుగా మారెను గమ్మత్తుగా

స్వరమేదైనా నీ గుండె మహతి వీనై మీటెను.

పదకొండు భాషలలో నాలభైవేల పాటలు ఆలవోకెగా ఆలపించినా

నిండైన తెలుగుదనాన్ని చూపి మన తెలుగు తల్లి కీర్తి చాటి జయ కేతనెగురవేసిన బాలు

మన తెలుగు కళమతల్లికి గర్వకారణం

నిలువెత్తు మంచితనానికి విశ్వరూపం.

 

ఎం.పద్మలత___ తెలుగు తేనియలు

 

బాలు సాంగ్స్-

 

ఒక్కడే రావడం ఒక్కడై పోవడం.

శంకరా నాద శరీరా పరా వేద విహారా.

చిన్నదాన నన్ను చూసి పోతా వటే.

సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం.

ఏలే ఏలే మరదలా.

 

 కె మల్లికార్జునరావు___ తెలుగు తేనియలు

 

బాలు సాంగ్స్-

 

ఒక్కడే రావడం ఒక్కడై పోవడం.. నలుగురు సినిమా

శంకరా నాద శరీరా పరా వేద విహారా. శంకరాభరణం సినిమా

చిన్నదాన నన్ను చూసి పోతా వటే. నేనంటే నేనే సినిమా

సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం.. సంసారం ఒక చదరంగం సినిమా

ఏలే ఏలే మరదలా... అన్నమయ్య సినిమా.

 

 కె మల్లికార్జునరావు___ తెలుగు తేనియలు

 

 

మా బాలు మన బాలు -

అమరపురికి తరలి పోయిన అమృత గానం

 

సుస్వరాల గానం స్వర్గానికి వెళ్ళింది,

గాన గంధర్వుడు కన్నుమూసాడు,

శృతిలయలు శోకసంద్రం అయ్యాయి,

17 భాషలు 50 వేల పాటలు పాడి,

అవార్డుల రివార్డులు అక్కున చేర్చుకున్న,

విశ్వ గాయకుడు గగనానికి ఎగిరాడు.

 

తీయటి మాటకు కమ్మని పాటకు,

రూపమైన అపురూప గాయకుడు,

కారణజన్ముడు బాలు మనకికలేరు,

భావి తరాలకు గాయకుల నందించిన,

పాటల సారధి వారధి దివికేగి నారు బాలు .

 

నా పాట పంచామృతం అన్న

బాలు పాట వింటే -

భుజం తట్టి నట్టు ఉంటుంది,

ప్రకృతి పరిగెత్తి వచ్చినట్టు ఉంటుంది,

మలయానిలం మేని తాకినట్టు ఉంటుంది,

 

మన సంతోషం బాలు ..మన సంస్కారం బాలు..

మన తెలుగు బాలు.. మన వెలుగు బాలు..

మన రామదాసు బాలు ..మన అన్నమయ్య బాలు.

అర్థ శతాబ్దం పాటు ఆబాలగోపాలాన్ని

అలరించిన మన * గానమయ్య *బాలు..

 

స్వర మధురిమ..లయ చతురిమలను..

శ్వాసగా చేసుకొని..

సాహిత్యంలో భావాన్ని..

సన్ని వేశంలో స్వారస్వాన్ని..

తన గొంతులో పలికించి..

 

బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలా సాగి..

చలనచిత్ర భారతికి  అనునిత్యం..

స్వరాభిషేకం చేసి..

స్వరాలతో సంధ్య హారతులిచ్చి  ..

అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్ధికి..

 

గానమే సోపానముగా భావించి..

ఓంకార నాదాలను..

తన గాన లహరితో సంధానం చేసిన..

అపర గంధర్వుడు.. తుంబుర సమానుడు..

అమర లోకాలకేగినాడు..

బాలుడై వచ్చి.. గానంలో లీనమైన..

శ్రీ పండితారాధ్యుల బాలు గారికి..

ఇవే నా అశ్రుసుమాంజలులు.

 

CA కె మల్లికార్జునరావు___ తెలుగు తేనియలు

 

 

చక్కగా తాగేద్దాము ... ఇవిగో ఈవన్నీ

ఉత్పలమాల

తాగుము.. తీయనైన సుధ; తన్మయమొందగ బాలు పాటతో

త్రాగుము భక్తి భావముల తత్వపురీతిని దివ్యరీతిగన్   

తాగవలెన్ మరంద మధుధారలు నిండిన తేనియల్ సదా 

సాగుచు పోవలెన్ విరుల శాఖలు "తెల్గుల తేనె" నింపుచున్

మోగవలెన్ స్వనంబు మధుమోహన భావము పల్కినట్లుగా   

 

కస్తూరి శివశంకర్___ తెలుగు తేనియలు

 

సుస్థిర స్థానం

 

అక్షర తూణీరాలు పదాలు 

విల్లంబులుగా గాండీవం చేరాయి

గొంతుకనే గురిచూసి

లక్ష్య మనే గాత్రం తో

సుస్వర క్షేత్రం లో సరిగమల

పంటలు పండించారు

భాష తో సంబంధం లేకుండా

భావవ్యక్తీకరణ తో పాటల వనంలో

కూజితాలు పలికించారు

చరణం మరువక కొడుకు గా

పల్లవి గుర్తుగా కూతురు పేరుగా

సంగీతానికి జ్ఞాపకం గా...........

ఒక మంచి మనిషిగా........

అవార్డులు ఎన్ని వరుసలు తీరినా

గర్వము లేక ఒదిగిన సహృదయశీలి

గానమే ఊపిరిగా స్వరాలే ప్రాణంగా

సాగిన సంగీత సామ్రాట్టు

నేడు మన నడుమ లేకున్నా

మనందరి హృదయాలలో సుస్థిర స్థానం బాలుది...

 

కోవూరి___ తెలుగు తేనియలు

 

ఆదివారం కవిత

రోజూ నడిచే రోడ్డే

ఏదోరోజు నిన్ను  రక్త సిక్తం చేస్తుంది..

రోజు కలిసే వాడే

ఏదోరోజు మాయ చేసి ముంచిపోతాడు..

రోజూ విశ్రమిoచే  ఊయల తీగలే

ఏదోరోజు  వికృతంగా నీ ఊపిరి తీస్తాయి.

ప్రతి రోజూ రోజులా ఉండదు!

ప్రతి క్షణం క్షణం లా ముగియదు..

అనునిత్యం అప్రమతుడవు కాకుంటే

అనుక్షణం జగరూకుడవై లేకుంటే..

తలచినదే జరుగుతొందని

తల ఎగరేస్తూ నీవుంటే..!

తల తెగిపడే రోజును

కాలం సిద్ధం చేస్తున్నట్టే!

కాలాన్ని ప్రవాహంలా

చూసి వదిలేయకు..

కాలాన్ని గురువుగా ఎంచి

ఎంచక్కగా అడుగేయ్ ముందుకు!

కాలం బోధనలు కాలదన్నుకుంటే..

కాలంపై నువ్వు కాలుదువ్వుతుంటే..

కాలంపై నువ్వు ఒంటి కాలిపై లేస్తోంటే

కాలంపై నువ్వే కన్నెర్ర చేస్తే..

కాలం తలపైనే నువ్వు కాలు మోపాలనుకుంటే..

పడగ విప్పి నాట్యమాడుతూ

ఇప్పటిదాకా ఇంపుగా మురిపిస్తున్న కాలమే

ఏదోక్షణంలో కాలనాగై కాటేసి తీరుతుంది!

జగతిలో  నీ  యాత్ర సుఖయాత్రగా

మిగలాలంటే..

కాలం చూపినదారిలో

శ్రమకోర్చి నడవాలసిందే!

కాలం కనుసన్నలలో

తలవంచి సాగాలిసిందే !

కాలంతో కరచాలనం చేసి

 కలిసిమెలసి పోవాల్సిందే !

 

వసుధ___ తెలుగు తేనియలు

 


శ్రీ ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారికి శ్ర ద్ధాంజలి ఘటిస్తూ

 

సీసము

ఘంటసాల వారితో గళము కలిపి పాడిన దినంబుల మొదలు, నాటి నుండి

నలుపెరంగకనేక నవరస గానము తోటి, చాతుర్యము తోటి నాటి,

నేటి దినంబుల నేర్పును బుణికించుకొని నవలీలగా బహుబాషల గాన సాహి

తీ పరంపరలను దివ్య గానంబుతో పలుమార్లు జూపె తనవంతు భక్తి!

శాస్త్రీయ, లలిత, విషాద, జానపద, సరిగమలు పలికిన రీతి మేటి 

సంగీత  దర్శక సాహిత్య గురువుల  తో స్నేహ శీలివై తోడు చేరె !

 

తెనుగు పాట కీర్తిని పెంచి తెలుగు బాష

ఘనత దేశ దేశంబులు ఘనము గాను

తెలుప తేనెలూరు నీపాట తెలుగు వారు

మరువరు యుగయుగంబులు మమత చూపు !

 

మైనేని మురళి ___ తెలుగు తేనియలు

 

సెలవు





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...