నేటి వ్యాసం
అక్షరాలతో ప్రాణాయామం :
1. శబ్దం - రూపం:
శబ్దానికి రూపం వస్తే ఏర్పడేది అక్షరం. అక్షరాలు పదములుగ , పదములు వాక్యములుగ , వాక్యములు భాషా సాహిత్యంగా పరిణామం చెందుతాయి.
భారతదేశంలోని అత్యధిక భాషలకు తల్లి వంటిది సంస్కృత భాష. తెలుగు భాషకు కూడా సంస్కృతము మూల భాష.
అక్షరాలు సామాన్య దృష్టితో చూస్తే భాషకు ఒక లిపి మాత్రమే . గహనంగా పరిశీలిస్తే అక్షరాల విలువ , విశిష్టత చాలా గొప్పవి .
ఈ విషయం కొంతవరకూ క్రింద వివరించాను.
2. డమరుక నాదం:
విలయ కారకుడు పరమేశ్వరుడు, నిజానికి భావ పరంపరా వారధి అయిన భాషకు ఉద్భవ కారకుడు. నటరాజుగా మారిన తాండవ శివుని అభంగ ఢమరుక నాదం నుంచే సకల భాషలకు మూలమైన ధ్వనులు ఉద్భవించాయి. ఆ ధ్వనులే ఉత్పత్తి స్థానం ఆధారంగా వర్ణాలుగా పరివర్తన చెందాయి. ఆ వర్ణాలే లక్షల అక్షర మాలలై, వ్యాకరణాన్ని వరించి భాషలుగా అవతరించాయి. అందుకే ఆదిదేవుడి వలె అక్షరం కూడా అనశ్వరమైనది మరియు అర్థనారీశ్వరమైన ఆది దంపతుల వలె వాగర్థాలు కూడా విడదీయలేనివి.
3. ధ్వనులు:
నటరాజు శంకరుడు ఆనందతాండవం తర్వాత తన చేతిలోని ఢమరుకాన్ని
14సార్లు మోగించాడు. అప్పుడు ఈ క్రింద సూచించబడిన ధ్వనులు వెలువడ్డాయి.
1) అ, ఇ, ఉ, ణ్
2) ఋ, లు, క్
3) ఏ, ఓ, ఙ్,
4) ఐ, ఔ, చ్
5) హ, య, వ, ర, ట్
6) ల, ణ్
7) ఞ, మ, ఙ, ణ, న, మ్
8) ఝ, భ, ఞ్
9) ఘ, ఢ, ధ, శ్
10) జ, బ, గ, డ, ద, శ్
11) ఖ, ఫ, ఛ, ఠ, థ, చ, ట, త, వ్
12) క, ప, య్
13) శ, ష, స, ర్
14) హ, ల్.
4. వర్ణమాల:
పై ధ్వనుల ఆధారంగా మహర్షులు ప్రస్తుతం మనం వాడుకుంటున్న వర్ణమాలను... అంటే ‘‘అ’’ నుండి ‘‘హ’’ వరకుగల రూపొందించి వాటికి ‘‘అక్షరములు’’ అని నామకరణం చేశారు. ‘క్షరము’ అంటే నశించేది అని అర్థం. క్షరము కానిది కాబట్టి ‘అక్షరము’ (శాశ్వతంగా నిలిచేది) అన్నారు. అలాంటి ధ్వనులను చెవులతో మాత్రమే వినగలం. కళ్లతో చూడటానికి, చేత్తో రాయటానికి తగినవిధంగా ఆ ధ్వనులకు ఒక రూపం కల్పించి ‘అక్షరాలు’ అన్నారు. ఈ అక్షరాలతో ప్రత్యక్షంగా ఉన్నవారికి, పరోక్షంగా ఉన్న వారికే కాకుండా ఆ తర్వాతి తరాలవారికి కూడా తమ భావాన్ని అందించగల ఒక గొప్ప అవకాశం లభించింది.
5. ఓనమాలు:
ప్రస్తుతం అక్షర రూపంలో మనం ఉచ్చరిస్తున్న ధ్వనులతోనే అధికశాతం ఉచ్చరించడం సాధ్యమవుతుంది. ఆ విధంగా పరమేశ్వరుని అనుగ్రహంతో లభించినవి కాబట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞతా సూచకంగా వర్ణమాలను నేర్పేముందు ‘‘ఓం నమశ్శివాయ సిద్ధం నమః’’ అని రాయిస్తారు. ఆ తర్వాతే ‘అ, ఆ’ మొదలైన వర్ణాలను బోధించటం ప్రారంభించారు. తదనంతర కాలంలో అవే ‘ఓనమాలు’గా ప్రసిద్ధమయ్యాయి.
6. మూడు భాగాలు:
అక్షరాలలో లో లో ‘అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు’ అని మూడు భాగాలున్నాయి. అచ్చుల సహాయం లేకుండా హల్లులను స్వతంత్రంగా పలకటం సాధ్యం కాదు. కాబట్టి హల్లులకు అచ్చులు ప్రాణంవంటివి. అందుకే అచ్చులను ‘ప్రాణులు’ అంటారు. ‘‘అచ్’’ ప్రత్యాహారాంతర్గతమైనవి... అంటే- మొదట చెప్పిన సూత్రాలలో ఒకటో సూత్రము మొదటి అక్షరం ‘‘అ’’. నాలుగోసూత్రము చివరి అక్షరం ‘‘చ్’’. ఈ మధ్యగల అక్షరాలు ‘‘అ, ఇ, ఉ, ఋ, ......, ఏ, ఓ, ఐ, ఔ’’లకు ‘అచ్చులు’ అని పేరుపెట్టారు. అదేవిధంగా ‘‘హల్’’ ప్రత్యాహారాంతర్గతమైనవి... అంటే- ఐదో సూత్రం మొదటి అక్షరం ‘‘హ’’. పద్నాలుగో సూత్రం చివరి అక్షరం ‘‘ల్’’. ఈ మధ్యగల అక్షరాలకు ‘హల్లులు’గా నామకరణం చేశారు. ఇటువంటి అక్షరాలు ఆస్యము (నోటి)లో
7. అక్షరాలు- ఆరోగ్యం:
అక్షరాలు ఉచ్చరించినపుడు మన శరీరంలోని ఏ ఏ భాగాల నుండి ఉత్పత్తి అవుతాయో చూద్దాం.
(1) అ, క, ఖ, గ, ఘ, ఙ, హ, వసర్గలు - - - - - - - - వీటికి కంఠం ఉత్పత్తి స్థానం.
(2) ఇ, చ, ఛ, జ, ఝ, ఞ, య, శ - - - - - వీటికి దవడలు (తాలు).
(3) ఋ, ట, ఠ, డ, ఢ, ణ, ర, ష - - - - - - - వీటికి మూర్ఘ (నాలుక పైభాగము).
(4)...., త, థ, ద, ధ, న, ల, స- - - - - వీటికి దంతాలు.
(5) ఉ, ప, ఫ, బ, భ, మ - - - - - - - - వీటికి పెదవులు (ఓష్ఠములు).
(6) ఞ, మ, ఙ, ణ, న (ముందు చెప్పిన స్థానాలతోపాటు పాటు (నాసిక).
(7) ఏ, ఐ - - - - - - - - కంఠం, దవడలు.
(8) ఓ, ఔ - - - - - - - కంఠం, పెదవులు.
(9) వ, - - - - - - - - దంతాలు, పెదవులు.
(10) ఖ - - - - - - - - జిహ్వమూలం (నాలుక మొదటి భాగము)
8. అక్షరాలలో ప్రాణాయామం:
పైన చెప్పిన విధంగా, అక్షరాలు పలికినప్పుడు
ముఖమందలి వివిధ భాగములు ఉత్తేజితమవుతాయి. తద్వారా శబ్దములు శరీరము నందు ప్రవేశించి ఆరోగ్య దాయకమవుతాయి . ఈ కారణం చేతనే మన రుషులు - మంత్రాలు, దేవతా ప్రార్థనా శ్లోకాలు , పద్యాలు, దండకాలు, మొదలగు రూపాల్లో అక్షరాలను పేర్చి కూర్చి ఉచ్చరించమని (పారాయణం, భజన, ప్రార్థన, మంత్రోచ్ఛారణ మొ!! విధంగా) మనకు అందించారు , మన శరీర మానసిక ఆరోగ్యానికి మార్గం చూపించారు.
శబ్ద శాస్త్రం లో పేర్కొన్నట్లు, ప్రతి అక్షరాన్ని నిర్దేశించిన నిర్దిష్టమైన పద్ధతిలో పలికినప్పుడు ప్రాణాయామం అభ్యసించిన ఫలితం దక్కుతుంది . ఇంతే కాకుండా, అక్షరాలను మంచి పదాలుగా మార్చి వాటిని మంచి వాక్యాలు గా మార్చి మనం పలికినా, విన్నా, మనం చేసుకున్నా, అవి హృదయంలో ప్రవేశించి సత్ సంస్కారాలను బలోపేతం చేస్తాయి. తద్వారా, మన వ్యక్తిత్వంలో కూడా మంచి మార్పు వస్తుంది.
అక్షరాల వెనుక దాగి ఉన్న మహత్తరమైన విలువను తెలుసుకుందాం, ప్రయోజనాలు పొందుదాం. అందుకే రుషులు అన్నారు అమంత్రమక్షరం నాస్తి అని.
కె మల్లికార్జునరావు___ తెలుగు తేనియలు
******
శబ్బాష్ రా శంకరా
తనికెళ్ళ భరణి
తెలుగు పాఠకులు ఈ చక్కని సాహిత్యాన్ని పుస్తకాన్ని కోల్పోతున్నారని అనిపిస్తోంది. ఎంతమమది చదివారో తెలియదు.
పూర్తిగా శివ తత్వాలు కలిగిన పుస్తకం. ఈ రకమైన సాహిత్య ప్రక్రియ నిజానికి కొత్తది, మరెవరూ ప్రయత్నించనిది.
చాలా చిన్న పుస్తకం. శ్రవణ మాధ్యమం లో కూడా YouTube లో లభ్యము
భరణి గారు పుస్తకాన్ని బ్రహ్మానందం కి, ఆడియో సంకలనాన్ని ప్రకాష్ రాజ్ కి అంకితం ఇచ్చారు.
ఇది మనకి కేవలం అర్థం అవ్వాల్సినది కాదు. జీవితంలో జీర్ణం అవ్వాల్సినది.
ఈ తత్వాలు వంటబట్టుగాక. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!
ఈ పుస్తకం అర్థమైతే... శబ్బాష్ రా భరణీ అంటారు.
భరణి గారి సాహితీ పిపాస, తాత్విక దృష్టి అర్ధం చేసుకోవడం కోసం చూడతగిన చక్కని సాహిత్యం.
శబ్బాష్ రా శంకరా మకుటంతో శివుని అరిచించిన పుష్పాలు ఈ తత్వాలు. ఆసాంతమూ అందమైన ద్విపదలు
శైలి ఉదాహరణకి కొన్ని పంక్తులు
అమ్మా! నేన్నీ కడుపులుండంగనే
శివమంత్రం నాకు చెప్పింటె
ఏడుస్తనా... బైటికొస్తనా?
శబ్బాష్ రా శంకరా!!
లింగం మింగెడి దొంగనా కొడుకులు
గుడినే మింగు నీ కొడుకులూ!
మూడో కన్ను తెర్వవేమిటికిరా
శబ్బాష్ రా శంకరా!!
పూసల్ లెక్కబెడ్తెనో
ఉపాసాల్ జేస్తెనో వస్తదా!
కాలంగావలె కాలబెట్టవలె
శబ్బాష్ రా శంకరా!!
తన్మయత్వం, భక్తిభావం, ఆర్ద్రత మేళవించిన చక్కని సాహిత్యం
శబ్బాష్ రా శంకరా
******
ఆదివారం
ఆదివారం ఆలస్యంగా లేద్దామనుకున్న ప్రతిసారి బలవంతంగా నిద్రలేపడం , ఆ మత్తులోనే ఏం జరుగుతోంది అనుకునేలోగా మట్టు గిన్నెడు నూనెలో ఓసారి ముంచి తేల్చి , ముక్కులో, చెవిలో నూనె ఒంపేసి ఉక్కిరిబిక్కిరి లోంచి తెరుకునేలోగా ముక్కాలి పీట మీద ఎండలో కుదేసి , దబ్బపండు లా ఉంటావు చూస్కోమని , మీగడ నలుగులు పెట్టి ఆఖరుకు తొక్క తీసిన దానిమ్మ పండల్లే తయారుచేసేది బామ్మ..
కంట్లో పడుతోంది బామ్మోయ్ , షాంపూ కొనచ్చుగా బామ్మా.. అన్నా పట్టించుకోకుండా కళ్ళలో పడితే ఉప్పుకల్లు ఇస్తా , షాంపూ లేదు పొగడపువ్వు లేదు నోరుమూసుకో నోట్లో కెడితే చేదుగా ఉంటుంది అని నా నోరుమూయించి , పట్టులా ఉంటుంది జుట్టు చూడు అని ముందు పట్టించిన నూనె దాఖలాలు లేకుండా కుంకుడుపులుసు తో రుద్ది రుద్ది కొబ్బరి పీచుకి దగ్గర రూపం తెప్పించేది ...పక్కనే ఉన్న చప్టా మీద అంట్లు తోముతున్న పళ్ళాలికి తన చేతిలో ఉన్నది అసలా, లేక నా నెత్తిన ఉన్నది అసలా అనే సందేహం వచ్చేది !
ఇవన్నీ ఓకే ..నా తిక్కల్లా 4 డేగిసాల వేడినీళ్ళ స్నానం దగ్గరికి వచ్చేసరికి అమ్మోరు పూనినట్టు బెట్టు చేసేదాన్ని...కారణం అప్పుడెప్పుడో మా చిన్నమావయ్యతో కలిసి చూసిన సాగరసంగమం సినిమా, మా మావయ్యకి సినిమా మొత్తం జయప్రద మాత్రమే కనిపించింది, నా బండి మాత్రం మౌనమేలనోయి పాటలో వేడినీళ్ళ షవర్ దగ్గర ఆగిపోయింది!!
అచ్చు అలాంటిదే పెట్టించమని హఠం చేసేదాన్ని , మా తాతయ్య నాకన్నా 32 ఆకులు ఎక్కువ , ఆ వెధవ ఫారిన్ పోకడలు పోయావో డిప్పచ్చులు పడతాయి ,ఆ డేగిసాడు నీళ్ళు పోసుకుని , తూర్పు తిరిగి దణ్ణం పెట్టు సూర్యుడున్నాడు పుణ్యమన్నా వస్తుంది ,నేన్ మాత్రం ఇలాంటి అవకతవక వేషాలు వేయనివ్వను, అని భీష్మ ప్రతిజ్ఞ చేసాడు !!
పోనీలే పిల్లా.... అని దీర్ఘం తీసేది బామ్మ , నిండా 5 లేవు దానికవసరమా? అని తాత ..కొట్టుకునేవారు , ఈలోగా నేను నాని నాని సోడా పెట్టిన గ్లాస్కో పంచెలా అయ్యేదాన్ని...
ఓ పావుగంటో ఐదునిముషాలకో చూసి చేసేది లేక చెంబుడు నీళ్ళు పోసుకుని , ఏడిసినట్టుంది బతుకు , ఈ జన్మకిక జరిగే పనికాదు ..అనుకుని పక్కకుపోయేదాన్ని !!
ఓ రోజు మా పళ్ళాలు గిన్నెలు తోముతూ.. తాయారమ్మ గారో , పైసా కర్సు లేకుండా శవరండోయ్ అని ఒక అరుపు అరిచింది.. కట్ చేస్తే !!
నా నెత్తిన కాఫీ ఫిల్టర్ పై గిన్నె పట్టుకుని పళ్ళాలు,ఓచేత్తో చిన్న బిందె నీళ్ళు ఎత్తిపోస్తూ , అదే చేత్తో మొట్టి పోస్తూ మా అమ్మ !!
నా తల్లే నా బంగారమే , ఒసేయ్ పళ్ళాలూ నీ తెలివి బంగారంగానూ.. దాన్నెత్తిన డికాషను, నానెత్తిన పాలు పోసావే... ఈ పండక్కి నీకు రెండు గారెలు , ఓ గుప్పెడు పులిహోర ఎక్కువిస్తా అని వరాలు కురిపిస్తూ బామ్మ!!
విష్ణుప్రియ___ తెలుగు తేనియలు
******
స్వేచ్చా సమర్పణలు
సమస్య కుప్పలుగా సిరులు కూడ క్షోభించ దగున్
ఇచ్చిన పాదము కందము, నా 1001. వ పూరణ. సీసములో
బంధు గణంబులు బారులు తీర్చుచు గడప ముందర చేరి గొడవ చేతు
రప్పు లివ్వ మనుచు, రాత్రులు నిదుర రా క భయము తో మనంగ వలయు గద,
సతతము పన్నుల శాఖయు, పోలీసు శాఖల దాడులు జరుగ వెతలు
కలుగు ,కుప్పలుగా సిరులు కూడ క్షోభించ దగునెప్పుడు నిలలో, ధర్మ గతిని
ధనము పొంద నిరతము ముదమ్ము పొంద గలము,
చెరసాల బాధలు కలుగ వెపుడు,
లంచమును గైకొన ననుచు లక్షణముగ
తెలిపె నొక భర్త తన భార్య తీరు గాంచి
పూసపాటి____ తెలుగు తేనియలు
*****
నేటి శంకరాభరణం పూరణ
బాలనాగమ్మ పుత్రుం డు బాలవర్ధి
చేత నా మాయల ఫ కీర్ చిత్తుగాను
మరణ మొందగ కసిదీర మగువ పలికె
చచ్చె సింహము చేమచే సత్య మిద్ధి.
డి.రామ నాగేశ్వరరావు____ తెలుగు తేనియలు
సమస్య : చచ్చె సింహము చీమచే సత్యమిద్ది
నా పూరణ సీసములో
మహా పరాక్రమ వంతుడైన అర్జునుడు తన కుమారుడైన
బభృవాహనుని చేతిలో గంగా దేవి శాప కారణమున చనిపోగ
అర్జునుని భార్య ఉలూచి తన వద్ద గల మణిచే అతనిని బ్రతికిస్తాను అని చెబుతుంది అప్పుడు చక్ర ధారి ఉలూచిని గాంచి పలికిన సందర్భము
విల్లును పట్టిన వేగముగ నలుదిశలకు విడుచువాడు సవ్యసాచి
సంగరమున శర సంధానమును జేసి రిపులను కూల్చు కిరీటి యతడు,
చీకటి లోనైన చిత్రగతిని విల్లు సంధించి కూల్చెడి శౌర్యుడతడు
యట్టి ధీరుడిపుడు పిట్ట పగిది నేడు బభృవాహనునిచేత ప్రాణములను
కోలు పోయెనుగా నేడు, కాల మహిమ,
చచ్చె సింహము చీమచే సత్యమిద్ది,
ఘనత నొందిన గాండీవి తనువు విడిచె
ననె నులూచితో గిరిధారి జనుల యెదుట
*****
కుమార్తె ల దినోత్సవం శుభాకాంక్షలు.
చూపుడువేలు ఆలంబనగా
నడయాడిన నడత మార్గంగా
చిగురించిన ఆశల నడుమ
కొత్తబాట చూపుతుంది కూతురు
తండ్రికి తనే సంద్రంలో చుక్కానిలా......
కోవూరి____ తెలుగు తేనియలు
(Happy Daughters Day)
బాలూ.. పాట.. మాట.. మంతి..
పాటే మధురము.. మాట మరీ మధురము,
రూపం మధురము ..నటనం మరీ మధురము..
తండ్రి నుంచి అబ్బిన గళం,
తల్లి నుంచి వచ్చిన గుణ గణం,
పెన్నా నది నీరు త్రావిన చిన్ని బాలుడు,
అన్ని కళలయందు ఆరితేరినాడు....
పొగడ్తలకు అతీతుడు, పని లో నిష్ణాతుడు,
పల్లవి, చరణాలకు సదా సన్నిహితుడు,
శృతి లయలకు నిబద్ధుడు, ఉచ్చారణలో శ్రేష్ఠుడు,
మాయమర్మమెరుగని న్యాయ నిర్ణేత వాడు....
చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి____ తెలుగు తేనియలు
******
మహాభారతంలో మనకు తెలియని కథలెన్నో దాగి ఉన్నాయి...!
జూదం, ద్రౌపదీ వస్త్రాపహరణం, కురుక్షేత్ర యుద్ధం... వీటినే చూపెడతారు. నిజానికి ఇప్పటి ఈ సమాజానికి కావాల్సిన "నీతికథలు" ఎన్నో ఉన్నాయి...!!!
అందులో ఒకటి ఇది...👇🏻
పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.
ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.
అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు... ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది !
ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా ?.. అని చెప్పడంతో...
ఆమె... మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది !!!
ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.
ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు.
కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు...
రాజా...ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు...
కృష్ణా... మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు... ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు... అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో... ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు !!!
తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు !!!
సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం... ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు !!!
మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో... ప్రజలు ఎప్పుడు మారుతారో...
************
కూతురు
మా అమ్మాయి నాకు కూతురు , స్నేహితురాలు , టీచరు , అమ్మ , అత్తగారు కూడాను చిన్నప్పటి నుండి నాన్న ..నాన్న ..నాన్న అంటూ నా చుట్టూ తిరిగేది. బడి కెళ్లే రోజుల్లో పలక , బలపం, రాతబల్ల కొనిపెట్టా
నాన్న కూర్చో, నేను పాఠాలు చెబుతా విను అని చెప్పేది కూడా పెరుగుతూ స్నేహితురాల్లాగా కబుర్లు చెబుతూ , కావలసినంత పని చేసి పెట్టేది .
కాపురానికి వెళ్ళింది .
నేను వెళ్లిన్నప్పుడల్లా మా అమ్మ, అత్తగారి లాగానే
రుచిగా, శుచిగా వంటలు చేసి వడ్డిస్తుంది ।
టాటాలు తీసు కెళ్తుంది . అడిగిన వన్నీ కొనిపెడుతుంది .
కానీ , చేతిలో బెత్తం సిద్ధంగా పెట్టుకునేది
చూపుడు వేలు ఊపుతూ సరైన ఆహారం వేళకి తిని సమయానికి వ్యాయామం
చేయక పొతే వీపు విమానం మోతే అని గట్టిగా చెపుతుంది ।
************
చల్లా దేవిక____ తెలుగు తేనియలు
కూతురు
తేటగీతి మాలిక
సిరులొసంగు శ్రీలక్ష్మియె చిన్నిపాప
గాను దమకు జన్మించెనుగా యనుచును
ముద్దులొల్కు తనయ కని మురిపెముగను
తల్లిదండ్రులు బెంచును తనివిదీర !
చిరునగవుల మోము చిరుగజ్జెల పదముల
రవళి తోడ నట్టింటను రాణి వోలె
కూతురెపుడు దిరుగగాను కూర్మి గల్గి
కన్నవారలానందించు మిన్న గాను!
చదువులెన్నియొ చక్కగా చదివినతరి
వృత్తి నందు కుదురుకొన తృప్తి నొంది
తగిన వరుని కొఱకు తాము తరచి వెదకి
పరిణయమ్మును సేతురు పరవశించి!
పుట్టినింటి గారవమును పొదవు జేసి
మెట్టినింటి మర్యాదయె మించునటుల
నడచునట్టి కూతురును కనగ యనదగు
కొడుకు కన్నను మిన్నయె కూతురనగ!
కూతురనగాను యనురాగ కోరకమ్ము
కూతురనగ నెల్లరకును కొంగుపసిడి
కూతురనగ బాంధవ్యపు కోశమౌను
కూతురనగ జూడవలదు కొదువగాను!
కొడుకు గావలెనని దల్చి కొరివిబెట్ట
కూతురనిన మాట వినిన చేదుయనుచు
తారతమ్యము జూపుచు ధరణి యందు
ఎంచు వారలనజ్ఞానులె యననౌను!
చల్లా దేవిక____ తెలుగు తేనియలు
తొలి చూపులు
నా తల్లి చూపులన్నీ తొలి చూపులే!
గుక్కపెట్టి నేనేడుస్తుంటే
తల్లడిల్లిన నా తల్లిని
నే తొలిసారిగా చూశా.
తొలిసారి నన్ను బళ్ళో వేస్తే
తల్లడిల్లిన నా తల్లిని
నే తొలిసారిగా చూశా.
నా ఈడు నన్ను ఆడదాన్ని చేస్తే
తల్లడిల్లిన నా తల్లిని
నే తొలిసారిగా చూశా.
నీ తొలి చూపులకు నే లోనవుతే
తల్లడిల్లిన నా తల్లిని
నే తొలిసారిగా చూశా.
అన్ని తొలి చూపుల్లో నేనెదిగిపోయినా
నీ ఒక్క తొలి చూపులోనే ఒదిగిపోతున్నా.
ఓ బంధమా!
ఎడడుగుల బంధమా!!
నువ్వూ ఇవ్వగలవా నాకు ఆ తొలి చూపులను
జన్మ జన్మల దాకా?!?
----అ.అ----
అత్తిలి అనంతు____ తెలుగు తేనియలు
(ఈ సృష్టిలో క్షణక్షణం కొత్తగా కనిపించేది నా దృష్టిలో అమ్మే! అందుకేనేమో ఓ కవన కన్య ఇలా నాలో పరకాయప్రవేశం చేసింది. 19.04.2008)
*****
స్త్రీ తత్వం
ఆకాశాన్ని ఆదరిస్తే...
మేఘమై వర్షించి
మక్కువ చూపగలదు
తేడా వస్తే..
పిడుగులు కురిపించి
ప్రళయం చూపగలదు
ప్రకృతిని పలకరిస్తే..
అన్నీ అందించి
అక్కున చేర్చుకోగలదు
తేడా వస్తే..
విపత్తులు సృష్టించి
విలయతాండవం చేయగలదు
నిప్పు కణాల్ని నియంత్రిస్తే..
నమ్మకంగా సేవ చేసుకుంటాయి!
అదే ..వాటిని నిర్లక్ష్యంగా చూస్తే
నిస్సిగ్గుగా నామరూపాలు లేకుండా చేస్తాయి!!
మనిషి మెదడుని నియంత్రిస్తే..
అద్భుతాలు ఆవిష్కారమవుతాయి
అదే..దాన్ని అలక్ష్యం చేస్తే
అనవసర ఆలోచనలతో
రాక్షసుడుగా తయారుచేస్తుంది!!
ఆడవాళ్లూ అంతే..
ఆదరిస్తే అమ్మలా
ఆదరించగలరు
తేడా వస్తే..
ఆదిశక్తి లా ...
అంతూ చూడగలరు!!
కె మల్లికార్జునరావు____ తెలుగు తేనియలు
తేటగీతి
పుట్టినింటను దిరుగాడి పుత్రికగను
కొలది కాలమ్ము కతిథియౌ మెలత తాను;
మెట్టినింటి వారల భాగ్య మెట్టి దనగ
కోడలిగ దిరుగాడుచు కూర్మి తోడ
చిరము వసియించు వారింట శ్రీకరముగ!
కనుక మీరు అభాగ్యులు కాదు.. పుత్రులున్న మీదే భాగ్యమంతా..సంతోషపడండి తమ్ముడూ..!
ధూర్జటి మహాశయుడు చెడునే మోక్షపదంబ పుత్రకునకున్...అని ఏనాడో నిలదీసినా, సమాజంలో ఈనాటికీ మార్పు రాకపోవడం దురదృష్టకరం
తమ్ముడూ..!
*****