2, జనవరి 2021, శనివారం

పుస్తక సమీక్ష, 27.12.2020, ఆదివారము

 



సమీక్ష/  వ్యాసం

ఒక విశ్లేషణ:  కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన...

 కర్మలు చేయుటకే అధికారము కానీ ఫలితము నకు కాదు... అని అర్థం..

ఇక్కడ ఒక సందేహం వస్తుంది.  ఫలితమును ఆశించకపోతే కర్మలు చేయుటకు ప్రోత్సాహం ఎలా వస్తుంది? అని .

ఇంకో సందేహం వస్తుంది...భగవద్గీతలోనే  అనేక శ్లోకాలలో , మనిషి తాను చేసిన కర్మల ఫలితాన్ని ఎన్ని జన్మలైనా అనుభవించక తప్పదు అన్న విషయం చాలా దృఢంగా చెప్పబడింది. కర్మ  మరియు  పునర్జన్మ   సిద్ధాంతాలకి కూడా ఇదే ప్రాతిపదిక.

 

నా విశ్లేషణ:

ఫలితమునకు రెండు అంశాలు లేదా రెండు అధికారాలుంటాయి ఉంటాయి. ఒకటి ఫలితము నిర్ణయించుట, రెండవది ఫలితము అనుభవించుట. పై శ్లోకంలో " మాఫలేషు కదాచన " అనగా ఫలితం నిర్ణయించుటకు అని మనం భావించాలి.

 

ఒక ఉదాహరణ-

విద్యార్థి కష్టపడి చదివి పరీక్ష రాస్తాడు, కానీ అతను ఉత్తీర్ణుడు కావటము అనే ఫలితము అతని చేతిలో ఉండదు,   అధికారం జవాబు పత్రం దిద్దే వారి చేతిలో ఉంటుంది. కానీ ఫలితాలు వెలువడిన తర్వాత ఫలితాన్ని అనుభవించవలసినది విద్యార్థియే. 

 

పై ఉదాహరణలో విధంగా ఎవరి కర్మ కైనా ఫలితము నిర్ణయించ వలసినది భగవానుడు మాత్రమే. కర్మఫల నిర్ణయము మన అదుపులో లేనప్పుడు, వాటి గురించి మనము ఎక్కువగా ఆలోచించ కూడదు, చింతించ కూడదు, వ్యామోహ పడకూడదు

 

ఇంకొక ఉదాహరణ -

ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగికి ఒకరోజు బోనస్ లభించింది అనుకుందాం.  అతనికి ఆరోజు  లభించిన బోనస్   అతను సంవత్సరకాలం చేసిన అన్ని పనులకు గాను వచ్చిన ఫలితము. ఇంకా వివరంగా చెప్పాలంటే అతనికి బోనస్ లభించిన రోజున అతను చేసిన పనికి అతనికి లభించిన బోనస్ కు ప్రత్యక్ష సంబంధం లేనే లేదు.

మన చేయు పనులకు , దక్కు   ఫలితాలకు, అనుభవాలకు  రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. లెక్కలు, వాటి లాజిక్కులు, పై వాడికే తెలియాలి; మనకు తెలియవు.

 పనులు  చేస్తున్న సమయమందు  రాబోయే ఫలితాల గురించి మనం ఆలోచించడం మొదలు పెడితే, చేసే పనిలో  ఏకాగ్రత లోపిస్తుంది . మొదటి ఉదాహరణలో విద్యార్థి పరీక్షలు రాసే సమయంలో ఫలితాల గురించి ఆలోచిస్తే అతను పరీక్షలు సరిగా రాయలేడు.

అలాగే రెండవ ఉదాహరణలో ఉద్యోగి తన కర్తవ్యం నెరవేర్చు సమయంలో   బోనస్ గురించి ఆలోచిస్తే అతను చేసే పని మీద ఏకాగ్రత ఉంచలేడు. పని  సక్రమంగా జరగక  చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.

భావననే ప్రస్తుత కాలంలో ని లివ్ ఇన్ ప్రజెంట్ కు ప్రాతిపదిక. ఫలితము మీద కోరిక లేక వ్యామోహము   లేనప్పుడు స్థితప్రజ్ఞత మనకు అభ్యాస మవుతుంది, తద్వారా మనశ్శాంతి సాధించగలము.

అందువల్లనే, ఫలితం గురించి ఆలోచించకుండా చిత్తశుద్ధితో పని చేయాలి, అన్నది భగవానుని ఉపదేశం మరియు ఉద్దేశ్యం.

CA కె మల్లికార్జునరావు

 

 

ధనుర్మాస దైనందినం

తెల్లవారుజాము , అప్పట్లో టైమ్ చూడటం రాదు...పెద్ద మగాళ్ళంతా తలపాగాతో పొలాలకి, పెద్ద ఆడవాళ్ళేమో ఇంటిముందు ముగ్గులేయడానికి, పిల్లలంతా చలిమంట ముందు....., చలిలో కూర్చుని వెచ్చ కాచుకోవడం కోసం ఏడాది మొత్తంలో ఉదయాన్నే లేచేది ఈ నెల మాత్రమే!!

 ఊరంతా మంచుదుప్పటి కప్పుకుంటే , నేను మాత్రం గీతాంజలి లో నాగార్జున లా శాలువా కప్పుకుని , నోట్లో పందుంపుల్ల వేసుకుని , పిల్ల పిశాచంలా తయారయ్యి దారిలో హన్నుగాడ్ని , గణేష్ ని ,జ్యోతి ని ,ఇంకా నా మాటవినే ఇంకో నలుగురిని వెంటేసుకుని ముసుగువీరుల్లా ఊరుమీద పడేవాళ్ళం,ఈ ఉద్యమం మొదలైన కొత్తల్లో.. పొలాలకి వెళ్ళేవాళ్ళు మమ్మల్ని అధాటున చూసి ఊళ్ళోకి కొరివిదెయ్యాలొచ్చాయ్రోయ్ అని భయపడి..తర్వాత నిజ్జం తెలిసి , వాళ్ళ పాటికి వాళ్ళు మమ్మల్ని తప్పించుకుపోవడం అలవాటుచేసుకున్నారు.

మా ధ్యేయమల్లా మా ఇంటి ముగ్గుకన్నా ఎవరి ముగ్గన్నా కొంపదీసి బాగుందా?,వాళ్ళమీదవాళ్ళకున్న నమ్మకం పోగొట్టి ముగ్గు సన్యాసం చేయించడం.. వీధంతా తిరుగుతూ ,మా పిన్నే బా పెట్టింది తెల్సా? మీ ముగ్గులు అస్సల్ బాలేవ్, చుక్కకి , ముగ్గుకి సమ్మన్ధమ్ లేకుండా ఉంది, వాక్ అనేసి అక్కడ్నించి పారిపోవడం !!

బాత్రూం క్యూలో బాబాయ్ ల మధ్యలో దూరి , పేచీ పెట్టో ,పెటకం పెట్టో ముందు స్నానం చేసేసి, కుచ్చుల గౌను, బంతిపూల జడతో అరుగుమీద తిష్ట వేసేదాన్ని !!

"హరిదాస్ గారో ముందు మా ఇంటికి రండీ" అని ఓ అరుపు అరిచి మా అమ్మ ఇచ్చిన గుప్పెడుకి ఇంకో రెండు గుప్పెళ్ళు అన్నచేత పోయించేదాన్ని, ఈ లోగా ఎల్లాలమ్మ గరగ వస్తే పసుపు నీళ్ళు పోసే పని నాదే , ఆసాదు ఇచ్చిన పసుపు  కొంచం గడపకి కొంచం మొహానికి !!

7 అయ్యేసరికి పక్కనే ఉన్న రాములోరి గుళ్ళో బాలభోగం గంట మోగేది , నీకోసం ఇంట్లోకి తెస్తారు లేవే అని బామ్మ అన్నా వినకుండా తుర్రుమని గుళ్ళోకి పరిగెట్టేదాన్ని, గుళ్ళో పెద్తాత ఉంటే క్యూలో నిల్చునే దాన్ని ,నన్ను దూరం నుంచే చూసి.. ఆఁ వచ్చావా ? దేవుడు బద్దకిస్తాడేమో గానీ నీకు లేదే బద్దకం ,  అని ముద్దుగా తిడుతూ పెద్ద బాదం ఆకులో ఓ చిన్న గరిటడు దధ్యోజనమో , చక్కెరపొంగలో పెట్టేవారు , ఇంతేనా ? అన్నట్టు చూస్తే.. ఇంకా బోలెడు మందున్నారు మొత్తం నీకే పెట్టేస్తే ఎలా?అనేవారు ,చిన్నబుచ్చుకున్న నన్ను చూసి మా సొంతాత వెనకాల నుంచి వచ్చి .. ముందది తిను మళ్ళీ నీకు పెడతాలే ,కావాలంటే నా వాటా కూడా నీకే , అని చెవిలో భరోసా ఇచ్చేవారు ..ఆ కొంచం ప్రసాదమే మహా రుచిగా ఉండేది, మారు అడగబుద్దయ్యేది కాదు ,తినేసి కాసేపు మా గంభీర మీసాల రాముడిని , ఆయన కుడి కాలిపై కూర్చున్న చిరునవ్వుల సీతని చూస్తూ కూర్చునే దాన్ని... మా బామ్మ తోటలో చిట్టి చామంతుల దండలు, గన్నేరు పూజలు పొంది, కొమ్మిశెట్టి వారి సాంబ్రాణీ ధూపాలతో , వచ్చి వెళ్ళే భక్తులతో, గంట గణగణల సందడితో ,గుడి గోపురం మీద నెమ్మదిగా కదిలే మంచు మేఘాలని చూస్తూ , గుడి వెనుక పంటపొలాల మధ్యనుంచి వినిపించే కోతల హడావిడి వింటూ  ఓ పావుగంట గడిపేదాన్ని .. ఈ లోగా ఒసేయ్ అమ్ములూ.... అంటూ పొలికేక వినపడేది.... ఓ ప్లేటున్నర ధద్యోజనం తీసుకొచ్చి నా ముందు పెట్టి...హ్మ్మ్ తిను గుళ్ళో పేచీ పెట్టావుట కదా, ఇంట్లో ఓ సోలెడు ఎక్కువే వండుతా కదే, అక్కడికెళ్ళి కక్కుర్తి పడటమెందుకు అనేది బామ్మ...ఇది గుళ్ళో రాముడిది కాదు, ఇంట్లో తాయారమ్మది నాకొద్దు అనేదాన్ని, అది చేసిందీ నేనే...నాకే పేర్లు పెడతావ్? మళ్ళీ అడుగు చెప్తాను అని కసిరేది !!

ముక్కోటి ఏకాదశి నాడు అందరూ ఉపవాసం ఉంటే అందరి వాటాలోని బాలభోగాలు ఫుల్లుగా లాగించేసి అది అరిగేదాకా గుళ్ళోకి ఇంట్లోకి ఓ వంద చక్కర్లు కొట్టడం, లక్షతులసి పూజ అయ్యి "ఎ ఏవం వేదా" మంత్రం వినగానే అలర్ట్ గా నిల్చుని రాగయుక్తమైన మంత్రపుష్పం చెవులాలకించి వింటూ ఉంటే వైకుంఠం లోని నారాయణుడు చిరుమందహసంతో చూస్తున్నట్లే ఉండేది.

ఇక రాత్రి జాగరణలో భాగంగా భజనల్లో త్రికరణ శుద్దిగా పాలు పంచుకొని... నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం(త త త..తా తా) అనే పాటని సమపాళ్ళలో పాడుతూ ఉంటే(నా పాట నా చెవులకి బానే ఉండేది) ... మధ్యలో ఎవడో విఠ్ఠల విఠ్ఠల పాండురంగ విఠ్ఠల విఠ్ఠల పాండురంగ అని బైపాస్ రోడ్డు ఎక్కేసేవాడు , ఈలోగా ఇంకొకడు శ్రీరామచంద్రప్రభో అనేవాడు.. పాటకి పరవశించో , పరితపించో... వాళ్ళ గొంతు ముందు నా గొంతు వినపడక నాతో వచ్చిన పిల్లబాచ్ నా మాట వినక , మనసువిరిగిపోయేది... "ఇంట్రస్ట్ పోతోంది తాతా" అన్నట్టు మా సొంతాత కేసి చూస్తే ... పర్లేదు లేవే నువ్వు గార్ధభం ... వాళ్ళు వృషభం .. ఇహ ఎలాగూ అయిపోవచ్చిందిలే, ఇహనో ఇప్పుడో వెంకమ్మ కోడి కూస్తుంది చూడంటూ ... ఇదిగో భజంత్రీలూ మీరు మొదలెట్టండయ్యా... మేలుకో శ్రీరామా అంటూ...తేలిగ్గా లేచేసేవారు !! హ్మ్మ్...పిల్లలంటే చిన్న చూపే కాదు, అసలు వీళ్ళకి కళ్ళే కనపడవు అనుకునేదాన్ని...

 

భోగి...

అర్థరాత్రి సుబ్బు బాబాయ్ వాళ్ళ అరుగుమీద మాయమైన రోజ్ వుడ్ కుర్చీ., జమిందార్ గారి దివాణం లో దొంగలెత్తుకెళ్లిన టేకు దుంగ , ప్రెసిడెంట్ గారి తోటలోని తాటి పట్టె, వాసాలు మార్చడానికని కొమరిన గడ్రాజు గారి గాదెల ముందు పెట్టిన వేప దుంగలు , అవతలి పెరట్లో వేన్నీళ్ల కోసమని కప్పెట్టిన మా ఇంటి కొబ్బరిమట్టలు..  వగైరాలు .. భోగినాడు ఉదయం భోగిమంటల్లో సమిధలయ్యి, ఇవెక్కడో చూసినట్టున్నాయే🤔.... అని జనాలు అనుకునేలోగా ..విభూధిగా మారి ఊళ్ళోవారి నుదుటని చేరేవి ...

 

వీధి పిల్లలంతా ఓ పెద్ద గోనిసంచేసుకుని వచ్చి ఎప్పుడెప్పుడు పండగ ఏడాది పండగ అని కొత్త అల్లుడ్ని ఆటపట్టించి డబ్బులో ,బియ్యమో దండుకు పోయి ..  భోగిమంటల్లో విందు వండి ఊరిమొత్తం లో ఉన్న జంతు జాలానికి పెట్టేవారు , పాపం వాటిక్కూడా పండగుండాలి కదా మరి , గంగిరెద్దు వాడొస్తే కాపలాగా గుమ్మంలో కూర్చునే దాన్ని , బామ్మ మనసు మా స్కూల్ గ్రౌండంత విశాలమేమో ఇంట్లో ఉన్న మా మంచి బట్టలన్నీ..కడుపు చలవే నా బంగారుతల్లి కదూ..ఈ సారికి ... అని గంగిరెద్దు మీద వేసేసిన్ది... మధ్యాహ్నానికల్లా ఈ కడుపు చలవ , బాచాలకొండ అనే పదాలతో మభ్య పెట్టి అల్మారాలో ఉన్న మూడొంతుల బట్టలు మా సత్తెమ్మ మనవరాలు సత్తికొండ ఒంటికి చేరేసేది...

"అసలు నా బీరువా దాని బట్టలు దాచుకోవడానికేనేమోనని నా అనుమానం, ఈసారి నుంచి దాన్నే తవ్వా వాళ్ళ కొట్టుకి తీసుకెళ్ళి దానికి నచ్చినవి కొని, నాకోసారి వేసి శివజ్యోతి వాడితో ఫోటో తీయించి ,మళ్లీ దానికిచ్చేయడం మంచిది, ఏమంటావ్?" ... కడుపు మండుతుంటే పంచదార తింటూ నా అభిప్రాయం చెప్పాను మా బామ్మతో ... ఏడిసినట్టు ఉంది .. అంటూ చిటికిన వేలితో తీసి పారేసింది బామ్మ !!

దీనంగా మా తాతకేసి చూస్తే.... మన అభిప్రాయాలతో దానికి లెక్ఖానటే  ... అని మా తాత పేపర్లో తల దూర్చారు!

పండగపూటా ఏడిపించిన బామ్మని సణుక్కుంటూ పిన్ని వేసిన పూలజడ చూసి కళ్ళు తుడుచుకుని గొబ్బిళ్ళు పెట్టుకునేదాన్ని!!

గొబ్బిళ్ళలో వంతులవారీగా గొబ్బి సుబ్బమ్మ పాటలు పాడి అటుకులుబెల్లం ప్రసాదం ఓ మూల కూర్చుని చప్పరిస్తుంటే ... , మా చెల్లెళ్ళకి భోగిపళ్ళు పోయడానికి వచ్చిన పేరంటాళ్లు ఏఁ అమ్ములుగారు మీకొద్దా భోగిపళ్ళు? అని వెక్కిరించేవారు !!

సంక్రాంతి కి బాబాయ్ , ఫ్రెండ్స్ , నేను .. సైకిళ్లేసుకుని ఇంట్లో చెప్పకుండా ద్రాక్షారం సినిమాకని చెప్పి కొబ్బరితోటల్లోని కోడిపందాలకి వెళ్ళేవాళ్ళం .. అక్కడ మమ్మల్ని చూసిన కిరాణా కొట్టు నేత్స్సత్తెం(నేతి+సత్యం) గారబ్బాయ్ ఇంటికి పప్పు, ఉప్పు, నిప్పు చేరేసేవాడు..  ఇంటికొచ్చాకా , సత్తెమ్మ బట్టలుతుకుడు, అందాలరాఁవుడు పాటలు !!

కనుమ నాడు అమ్మవారి గుళ్ళో కానుకలిస్తుంటే గుర్తొచ్చేది అప్పుడే పండగ అయిపోయిందని.. ఆ బాధలో పోలి స్వర్గం ముగ్గు తో 'ముక్క'నుమ ముగిసేది ముగ్గులోని రథం ముందుకెళ్ళేదేమో గానీ , ఇంట్లోని ఉత్సవ విగ్రహం మాత్రం స్కూల్ కి రెండ్రోలు అనధికార సెలవు పెట్టేది !!!

******


 

నారాయణ శతకం లో నాకు నచ్చి ఒక పద్యం

మ 

పరమ జ్ఞాన వివేక పూరిత మహా  భవ్యాంతరాళంబునన్

పరగన్నీ నిజ నామమంత్ర మొనరన్  భక్తిన్ననుష్టింపుచున్

దురితాన్వేషణ కాల భూతము వెసవ్దూలంగ వాకట్టువా

డరుగన్ భవ్యపదంబు నొందుటకునై యవ్యక్త!నారాయణా!

 

టీకా.

అవ్యక్త = స్పష్టంగా కనిపించని వాడా, ఓ నారాయణా, పరమ =ఉత్కృష్టమైన, జ్ఞాన, వివేక పూరిత, మహా భవ్యాంతరాళంబునన్ =గొప్ప యోగ్య మైన హృదయమందు, పరగన్ =ప్రవర్తించు విధంగా,

నీ నిజ నామ మంత్రంబు, ఒనరన్ =ఒప్పగా, భక్తిన్ =భక్తిని, అనుష్టింపుచున్ =అను సంధానం చేయుచు, దురితాఅన్వేషణ, కాల భూతము =పాపాలను వెదుకు మృత్యువు, వెసన్ =వేగముగా, తూలం గా =పైన పడగా, వాకట్టు వాడు =వాక్ నిలయం గల మౌని, భవ్య పదంబు నొండుటకై, భద్ర మైన ముక్తి స్థానము పొందుటకు, అరుగున్ =వెళ్ళను.

 

భావము

అవ్యక్త నారాయణా, పరమ జ్ఞాన వివేకభరితమైన

హృదయములో నీ నామ మంత్రమును జపించుచు

మరణించిన మౌని పరమ పదమును పొందును.


****** 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...