14, జనవరి 2021, గురువారం

09 01 202, శనివారము _ పుస్తక సమీక్ష

 


 09 01 202,  శనివారము_పుస్తక సమీక్ష

 

"తెలుగు తేనియలు" మిత్రులందరికీ నమస్కారం 🙏

కాళహస్తీశ్వర శతకము మహాకవి ధూర్జటి అందించిన విషయం తెలిసిందే.

మనలో చాలా మంది బహుశా శతకంలోని ఎన్నో పద్యాలని 8, 9 తరగతుల్లో ఉన్నప్పుడు బట్టీయం కూడా చేసి ఉన్నాము.

 పైకి భక్తి శతకంలా కనిపిస్తున్నా, ఎంతో నీతి, అంతకు మించిన వైరాగ్య భావనలు శతకంలోని ఎన్నో పద్యాలలో కనిపిస్తాయి.

శ్రీకృష్ణదేవరాయలు కొలువులో ఉండి కూడా "రాజుల్ మత్తుల్ వారిసేవ నరకప్రాయంబు" అన్న statement ఇచ్చే ధైర్యం, విరక్తి మహాకవికి ఉంటుంది చెప్పండి ?

"నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్" అంటూ అన్నమయ్య శైలిలో కాళహస్తీశ్వరునికి తప్ప ఎవరికీ పద్యాలు వ్రాయను అని చెప్పుకున్నారు.

పైగా కవితా లక్షణాలు, ఛందోశిల్పం కూడా గమనించవచ్చు మత్తేభ శార్దూలాలలో మీకు నచ్చిన పద్యం ఉదహరించగలరు.

 

 

కాళహస్తీశ్వర శతకం లోని 32 పద్యం 🙏

శా ll

రోసీరోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్‌

బాసీపాయదు పుత్త్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్‌

కోసీకోయదు నా మనంబకట! నీకుం బ్రీతిగా సత్క్రియల్‌

చేసీచేయదు దీనిత్రుళ్ళణఁపవే శ్రీకాళహస్తీశ్వరా !

 

పద్యంలో రోసియు రోయదు, చేసియు చేయదు వంటి ప్రయోగాలని మహత్తరంగా రోసీరోయఁదు వంటి సంధులతో అందించడం దూర్జటికే చెల్లింది.

ప్రతి మనిషికీ ఉండే చంచల స్వభావాన్ని, మనసునీ పద్యంలో ధూర్జటి గారు చూపించారు...

 "కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబుల" అంటూనే, మనసు ఎంత చంచలమైనదో చూపిస్తూ పుత్రుల మీద, మిత్రుల మీద, సంపదలు, భోగాల మీద వాంఛలు వదులుకోనీయదు మనసు అంటారు....  ఆలోచిస్తే నిజమే కదా అనిపిస్తుంది.

 

మనలో చాలా మంది resolutions అంటూ ఒక నిర్ణయం తీసుకోవడం, మళ్ళీ కొన్నాళ్లకు చంచలమైన మనసు మాట విననీయకపోవడం అనుభవైకవేద్యమే కోరికలని, వాంఛలని చంపుకోనీయక పరమాత్మ మీద మనసు లగ్నం కూడా చేయనీయదు అని విన్నవించుకునే సందర్భం "దీని త్రుళ్ళణఁపవే" అని చెప్పుకునే సందర్భం.

శతకం అనగానే... పరమాత్మని కీర్తించడం, శ్లాఘించడం పరిపాటి... కానీ శతకంలో అటువంటి ఛాయలు ఎక్కడా కనబడవు.

సామాజిక ప్రయోజనం సాధించడానికి సాహిత్యం, ఇటువంటి శతకాలు మార్గదర్శకాలవుతాయి.

 

 

శ్రీ కాళ హస్తీశ్వరశతకం

(పెద్ద బాలశిక్ష) లోని 11 పద్యం

ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం

బేలా నా మెడ గట్టినాడ విక నిన్నేవేళఁ జింతింతు, ని

ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి, యీ

శీలామాలపుఁ జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా!    

ఈశ్వరా! భార్యాపుత్రులు, తల్లిదండ్రులు, ధనములు అనే పాశములను నా మెడకు చుట్టావు. వ్యామోహంలో పడి నిన్ను నేనెట్లా స్మరించగలను? భరింపరాని దుఃఖము ఎలా పోగొడతావో ఈశ్వరా! నీ దయ.

రమ

 

విదురనీతి ఎందుకు ముఖ్యం

తాను పాండవులతో సంధి చేసుకొనవలయునో లేక యుద్ధానికి సిద్ధపడి కురుక్షేత్ర మహా సంగ్రామానికి కారణభూతుడు కావలెనా? అని సందిగ్ధంలో ఉన్న సమయంలో కురు చక్రవర్తి ధృతరాష్ట్రునికి, ఆతనికి ఒక విధముగా సవతి తమ్ముడైన విదురుడు బోధించిన నీతియే విదురనీతి అని ప్రసిద్ధి చెందింది.

విదురనీతి మహాభారతంలోని ఐదవదైన ఉద్యోగపర్వంలో, ముప్ఫై మూడవ అధ్యాయం నుంచి నలభైయవ అధ్యాయం వరకు అంటే ఎనిమిది అధ్యాయాలలో విస్తరింపబడింది.

ఎనిమిది అధ్యాయాలలోనూ ఒక మనుష్యుడు మనుష్యునిగా రాణించి ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల సాధన కోసం అనుసరించవలసిన నీతి విషయాలన్నీ సంపూర్తిగా వివరించబడ్డాయి.

రాజనీతిని గురించిన అనేక విషయాలతో కూడిన విదుర, ధృతరాష్ట్ర సంవాదమైన విదురనీతి ఒక రకంగా చాణక్య నీతికి ఇంకా అసంఖ్యాక నీతిగ్రంథాలకు ఆధారప్రాయ రచన అని భావించవచ్చు.

 

విదురుడు సత్యానికి విధేయతకు పక్షపాతరహిత విధానాలకు దూతగా ధర్మప్రతినిధిగా భావించవచ్చు.

విదురుడు మహాభారతం యొక్క ఆంతరిక భావాత్మకతకు ప్రతినిధి.

కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపివేసి.. తన కుమారులను రక్షించేందుకు ధృతరాష్ట్రుడు ఆరాటపడుతాడు. విదురుడు యుద్ధం ప్రారంభమయ్యేందుకు గల  కారణాలను వివరిస్తూ.. ధృతరాష్ట్రునికి బుద్ధి చెప్తాడు.

సంజయుని సంధికి సిద్ధం చేస్తాడు. సమయంలో విదురనీతి ఎలా ఉందంటే.. విదురా.. యుద్ధానికి సమయం వచ్చేసింది. తనను ఏం చేయమంటావని ప్రశ్నిస్తాడు. అప్పుడు విదురుడు ఇలా చెప్తాడు.

''అలా అడిగితే నేను ఏమి చెప్పను? రాజ్యం దక్కింది కదా అని తమ్ముని రాజ్యం కాజేయాలని చూశావు. చేపతో సహా గాలం కూడా మింగిన చందాన ఉంది నువ్వు చేస్తున్న పని. పక్వానికి రాక మునుపే పండును కోసిన రుచిగా ఉండక పోవడమే కాక దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది. పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి ఈర్ష్య చెందే వాడు రోగం లేక పోయినా బాధపడక తప్పదు'' అంటాడు.

ఇంకా విదురుడు ధృతరాష్ట్రునికి ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోయిన ఊరక ఉండటం మంచిదని హితబోధ చేస్తాడు. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మము, పాపము, కీత్రి, అపకీర్తి కలుగుతాయి. గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది కాని మాటలతో చెడిన కార్యం సిద్ధించదు.

 

నాకు బాగా నచ్చిన శతకంలోని పద్యం (13 పద్యం)

శా /

వేదంబు పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్సూచెఁ దా

నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి; చెం చే మంత్ర మూహించె? బో

ధా విర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు; నీ పాదసం

సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!        

 

భావము

ప్రాణికోటికి మోక్షము కలుగుటకు నీ పాదాలు సేవించు భక్తి ఒక్కటే కారణం గానీ, చదువులెన్ని చదివినా జ్ఞానమును, మోక్షమును కలిగించునా?

ఎంతమంది చదివినవారు లేరు? వారందరికీ జ్ఞానము కలిగిందా? మోక్షము కలిగిందా? నీ దయతో మోక్షము పొందిన సాలెపురుగు వేదము చదివింది? పాము శాస్త్రములు పఠించినది? ఏనుగు విద్యలు నేర్చుకొంది? ఎరుకలవాడు మంత్రజపము చేశాడు. వీరందరూ ముక్తి పొందటానికి చదువులే కారణమైనవా?

శ్రీదేవి

 

  వెన్నెల రేయి

మరుమల్లెలు పరిచిన సువాసనలు

చల్లని జాబిలి చూపు

నిచ్చెలి మనసున రేపిన కవాతు

జగమున ఏలేనే నా హృదిని కదిలించేనే

అడుగు అడుగు నిన్నే అడుగు

కదిలే కనురెప్పలు రెప్ప వేయనీయలేదే

పలికే అధరాలు నీ పేరే పలుకు పదే పదే

 

ఎదురు చూసే నా కనులకు

ఎల్లప్పుడూ నీవు దూరమే

నీ నుండి దూరమైన నా మనసుకు

ఓదార్పు నీ గత జ్ఞాపకాలే

చెలివై నిచ్చేలివై నిట్టూర్పు విడిచినా

నా వైపు నీ చూపుకు పట్టం కట్టానే

నా వైపు నీ నడకకు పూలపాన్పు పరిచానే

హరివిల్లులో రంగుల్లా నా మదిలో మెరిశావే

తామరాకు పై నీటిబొట్టులా జారావే

కనిపించని ఆగాధాన  నీ జాడకై వెతికానే

కోవూరి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...