5, జనవరి 2021, మంగళవారం

పుస్తక సమీక్ష, - ఆదివారము, 03.01.2021 పోతన పద్య రత్నాలు

 


పోతన పద్య రత్నాలలో  నాకు నచ్చిన మరొక పద్యము

 

2-64 (ద్వితీయ స్కంధము)

।।

తపముల్ సేసిననో, మనోనియతినోదానవ్రతావృత్తినో,

జపమంత్రంబులనో, శ్రుతిస్మృతులనోసద్భక్తినో యెట్లు లబ్ధపదుండౌనని బ్రహ్మ రుద్ర ముఖరుల్భావింతు రెవ్వాని;

య్యపవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుండౌఁ గాక నాకెప్పుడున్.

 

భావము

బ్రహ్మ, రుద్రుడు మొదలైన వారు పరమేశ్వరుని దివ్యసన్నిధికి ఎలా చేరగలము  అని ఆలోచిస్తున్నారట

తపస్సులతోనా ??

మనోనిగ్రహంతోనా ?

దానాలతోనా?

వ్రతాలతోనా ?

జపాలతోనా,

మంత్రాలతోనా??

శ్రుతిస్మృతులను వల్లించడం వల్లానా??

లేక "ఉత్తమభక్తితోనా" అని చింతిస్తు ఉంటారు.

ఆట్టి మోక్షప్రభువు, ఆత్మస్వరూపుడు నాకు ఎల్లవేళలా సులభుడవుగాక.


 

గోదాదేవి

 

 విష్ణుచిత్తుని గారాలపట్టి గోదాదేవి తండ్రి తెచ్చిన మాలలు ధరించి భగవంతుని మనం మనం నిలిచిన భక్తురాలు

ఆండాలు గా రంగడన్న భక్తి నిండి

ప్రీతితో హృదయమంతా నింపుకొనే

తులసి వనంబున శ్రీలక్ష్మి గా చేరి కృష్ణుని మెడలో హారము గా ఒదిగిపోయే

శ్రీరంగంలోని రంగడి చెంతచేరి ముప్పది పాశురాలతో కీర్తించె

మార్గశిర మాసమందు

తిరుప్పావై పఠనము తో మార్మోగె వైష్ణవాలయాలు

కన్నియ లందరూ కాత్యాయిని వ్రతము

సలుపు రీతిగా గోదాదేవి

 వ్రతవిధాన భాగ్యం ప్రసాదించే

పాశురాలతో రంగడిని పూజించి

మెప్పించి సతీ గా చేరి శ్రీరంగడి లో ఐక్యమై పోయే.

నాగమణి దేవరశెట్టి

 

 

నల్లకలువ పుస్తక పరిచయం*

కవి: కత్తి పద్మారావు గారు

 

కత్తి పద్మారావు గారు దళితవాద ఉద్యకారుడు, హేతువాది, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ స్థాపకుడు. తెలుగు, సంసృత భాషలలో స్కాలర్. కులము, మతము, చరిత్ర వంటి అంశాలు, తత్వశాస్త్రం, మహిళా విద్యలపై అనేక పుస్తకాలు వ్రాసారు.

కత్తి పద్మారావు గారు నల్లకలువ కవితా సంపుటి ద్వారా అస్పృశ్యత వంటి సాంఘిక దురాచారాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూ, అగ్రకులాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడుగు వర్గాల వెతలను స్పృశిస్తూ ఆయన వెలిబుచ్చిన ఆవేదన ప్రతి పాఠకుడి అంతరంగాన్ని కదిలించకమానదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమాజంలో ప్రతివారికీ అసమానత అనే  పాపంలో భాగము ఉంది అని చెప్పవచ్చు.

 

ఒక పేద వాడి అంతరంగం ఆవిష్కరిస్తూ గోదావరి ఒడ్డున చింతచెట్టు కొమ్మకు నన్ను ఏలాడగట్టి మట్టి  మోస్తున్నప్పుడు...నా ఏడుపు విని వచ్చిన కాకులు కేకలే నా సంగీత పాఠాలు, ట్రంకు రోడ్డు మీద తారు పోసినప్పుడు కాలిన తారులో కాలు పెట్టిన నన్ను చెప్పులు లేకుండా లేవనెత్తిన నా తల్లి కేకే నా గుండె నాదం...

అంటూ నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణం లో తండ్రి చావు, తమ్ముడు రైలు కిందపడి ముక్కలవడం వంటి బీదవాడి కష్టాలు చదువుతుంటే హృదయం ద్రవించకమానదు.

 

లక్క ఇంటిలో కుంతికి, పాండవులకు బదులుగా ఒక దళిత స్త్రీ ఐదుగురు కుమారులతో దగ్ధం చేయబడిందట. దళితమ్మ అనే ఉప శీర్షికలో ఆమె ఆవేదనను తెలుపుతూ ఇలా అంటారు

హస్తినా పురిలో ధర్మజుడు కర్ణుడికి పెట్టిన పిండం ఏం దళిత సూరయ్యకు చేరిందోనని లాక్షా గృహంలో దళిత స్త్రీ నవ్వింది ...హస్తినాపుర వీధుల్లో కుంతి భుజాల మీద సగం కాలిన శవాలు పట్టమహిషికీ, పంచముడికీ వున్న సంబంధాన్ని చూసి లాక్షా గృహంలో దళిత స్త్రీ నవ్వింది... అంటూ వ్యగ్యంగా సమాజాన్ని ప్రశ్నిస్తారు.

 

లక్నోలో బీఎస్పీ మంత్రిమండలి ప్రమాణ స్వీకారం ప్రేరణతో రాసిన  జైభీమ్  అనే ఉపశీర్షికలో

నా పాదాల్లో అరుణ కిరణాలున్నాయని నేడు నమస్కరిస్తున్న చేతులు నేను చిన్నప్పుడు మంచి నీళ్ళ డిగితే అస్పృశ్యమన్నాయి... నేను నడిస్తే నా వెనుక పరిగెడుతున్నపుడు కానీ నా నడకను వీళ్ళ పరుగు అన్దుకో లేదని వారికి తెలియదు అంటూ కించిత్ గర్వాన్ని ప్రదర్శిస్తారు పద్మారావు గారు.

 

నేను చరిత్రను... రామదాసు పాటలోని సీత నన్ను వెక్కిరించింది, నేను ధరిత్రిని... మొఘల్ పాదుషా తురంగం నా అంతరంగం పై కవాతు చేసింది...నేను శ్రమరమను... గొర్రెల కాపరి చెమట బిందువులలో నేను మెరుస్తున్నాను, నేను జలధునిని... సాగరం గుండెల్లో జ్వలిస్తూనే ఉన్నాను అంటూ సమాజానికి  శ్రమజీవుల అవసరం, వారి అగత్యం తెలియచేస్తూ మానవులు తారతమ్యం విడవనంత వరకూ ఇలాంటి దురాచారాలు సమాజానికి ఆరనిమంటలే అని చెప్పకనే చెప్తారు .

 

నీలో నేను  అనే శీర్షికలో నేను మనువును మానవత్వం నా శత్రువు నేను నీలో ఉన్నాను నీవు నన్ను గుర్తిస్తే నేను నశిస్తా నన్ను బ్రాహ్మణుడిగా ద్వేషిస్తే నీదీ బ్రాహ్మణ వాదమే నా మూలం హైందవం దాన్ని కూలిస్తే నేను మరణిస్తా అంటూ  మనుధర్మాన్ని బహిరంగంగానే విమర్శించారు.  కులవృత్తుల వారిని చిన్నచూపు చూస్తున్నారంటూ...

చాకిరీ వీరుణ్ణి  చాకలోడన్నారు మానవతా ధీరుణ్ణి మడేలోడన్నారు సంస్కార హీనులు సామాజిక ద్రోహులు చేతి పని వాడికి గోతులు త్రవ్విన భూమిలో నైపుణ్యానికి హీనత్వాన్ని అంటగట్టిన నేలలో భూమి వారసులు తిరగబడక మానరు బండకు పడేసి ఉతక్కమానరు అంటూ ప్రతీకార ధోరణిలో విరుచుకు పడతారు.

 

సాంఘిక దురాచారాలను ఎత్తిచూపుతూ సమాజానికి కనువిప్పు కలిగించి, జాతిని జాగృతం చేసిన ఎందరో మహనీయులు, కవులు, రచయితలు  వారందరికీ నమోవాకాలు తెలియ చేస్తూ చదివిన వారందరికీ కృతజ్ఞతలు తెయజేస్తున్నాను.

 

వాణిశ్రీ నైనాల

 

 

 

 

సామాజిక సేవా దీపిక, మహిళా చైతన్య భూమిక, మరపురాని ఆదర్శాల జ్ఞాపిక..శ్రీమతి సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా అక్షర స్మృత్యంజలి

 

మహారాష్ట్ర లోని నైగావ్ లో  జన్మించిన దివ్య చరిత..

మహాత్మా జ్యోతిరావు ఫూలేకు పరిపూర్ణ జీవిత భాగస్వామియైన సద్గుణ చరిత ..

వివాహానంతరం విద్యనభ్యసించిన

 మొక్కవోని దీక్షాదక్షిత..

పతి అడుగుజాడల్లో సంకోచింపక

 నడచిన నిరహంకారిత..

సాంఘిక దురాచారాల పట్ల

 కలత చెందిన ఆవేదనాభరిత..

దళిత బాలికల ఉద్ధరణకు

 పూనుకున్న కరుణాంతరంగిత..

దూషణలకు, అవమానాలకు వెరవని

వెనకడుగు వేయని సాహసవనిత..

మొదటి మహిళా ఉపాధ్యాయినిగా కీర్తించబడిన సౌశీల్య చరిత..

అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా

 దారిచూపిన దిశానిర్దేశిత..

విద్యా ఉద్యమానికి నాంది పలికిన

 అఖండ చేతనా జ్వలిత ..

మహిళల హక్కుల కోసం పోరాడిన

అలుపెరుగని క్రియాపరిణీత..

స్త్రీ విద్యయే ప్రగతి సాధనమని

ఆచరణాత్మకంగా నిరూపించిన

 మహోన్నత సాధికారిత..

మహిళాభ్యుదయమే దేశాభ్యుదయమని చాటిన దార్శనికతా శోభిత..

పితృస్వామ్య వ్యవస్థను

 నిరసించి ఎదిరించిన ధీరచరిత..

సామాజిక సమస్యలపై

 పోరాడిన వజ్ర సంకల్పిత..

వితంతు శిరోముండనానికి విచలితయై

 అడ్డుకున్న కరుణాభరిత..

సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా, ఉపాధ్యాయినిగా రాణించిన

 బహుముఖ ప్రజ్ఞా ప్రకటిత ..

అనాధ చిన్నారులను అక్కున చేర్చుకున్న

మహనీయ మానవతా ఉద్దీపిత..

మహిళా సేవా మండల్ స్థాపన ద్వారా

స్త్రీ సాధికారతకు

శ్రీకారం చుట్టిన సృజన శీలిత..

యశ్వంతరావుకు పెంపుడు తల్లిగా మాతృత్వాన్ని పంచిన ప్రేమామృత..

భర్త ఆదర్శాలే ఆలంబనగా

 పురోగమించిన నిష్కళంకిత..

సత్య శోధక సమాజం పునాదిగా

 నవసమాజ నిర్మాణ ఆకాంక్షిత..

పునర్వివాహాలతో వితంతువుల

జీవితాలలో

వెలుగులు నింపిన విద్యుల్లత..

పసి హృదయాల సేవలోనే

 అసువులు బాసిన ధన్యచరిత..

చరిత్ర పుటలలో చిరస్థాయిగా

 నిలిచిన జాజ్జ్వల్యమానిత..

మహిళా ఉపాధ్యాయులుగా

  నేడు ఆమె సంస్మరణం

మన గురుతర బాధ్యత..

ఆమె ఆశయాలను కొనసాగించడమే

మహిళా ఉపాధ్యాయ దినోత్సవానికి

  నిజమైన సార్థకత..

మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో..

చల్లా దేవిక.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...