14, జనవరి 2021, గురువారం

12.01.2021, చిత్రమునకు కవిత, జాతీయ యువజన దినోత్సవం

 


12.01.2021 చిత్రమునకు కవిత

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా భారత దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింప చేసిన, అత్యంత ప్రభావశీలి అయిన శ్రీ స్వామి వివేకానంద గురించి, భారతజాతిని జాగృతం చేస్తూ స్ఫూర్తి నిచ్చే కవితలు/ పద్యాలు వ్రాయవలెను.

 

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వివేకానందుడు గుర్తుచేసిన యువశక్తి  కి నమోవాకములు తెలుపుకుంటూ....

 

కం ll

జయమ పజయమున గానక  

రయముగ కార్యము నిరతము రవితేజమువై     

నియమముగ శ్రమించగనే   

భయమేల వలదు ఘనముగ ఫలితము కలుగున్

 

 

కం ll

తలపులలో ధీరునివై 

చెలువములై సూక్తి సుధలు చిన్మయభవమై

పలుకులలోన వివేకము

నిల జ్ఞానాభ్యాసమై నరేంద్రా ! విభుడా !

 

కం ll

అజ్ఞానము తొలగింపగ

సుజ్ఞానపు మార్గములను శోధింపగనే

విజ్జత విద్యాగంధము

ప్రజ్ఞల్ ప్రభవించఁగ పరిపాకము తీరున్

 

కం ll

నీ నడక పరులు పథముగ

నీ నుడువు లితరులు సతము నెక్కొనురీతిన్  

నీ నీతి వాక్యము వివే

కానందమయముగ నీకు కైమోడ్పులిడెన్ !

 

యువశక్తిని జాగృతం చేసే స్వచ్ఛమైన తలంపుతో ఉక్కునరాలతో, ఉక్కు పిడికిలి తో పిలుపు నిచ్చిన స్వామీ వివేకానందుని భక్తితో...

 

ll

ఉక్కునరమ్ములన్ గలిగి నొక్కటి జేసెడు కండరమ్ములన్

చక్కని యైకమత్యమును జైత్రరథమ్ముల చేతనత్వమున్ 

మక్కువ మీఱుగన్ భరతమాతని సన్నుతి జేయుదీక్షతో

మిక్కిలి శక్తియుక్తులు సమీకృతమైన వివేకమార్గమున్

నిక్కము తేకువన్ మెఱచు నిశ్చయమౌ యువశక్తి తేజమై

 

కస్తూరి శివశంకర్

 

అయన  మహిమే !

యువకుల యువకుడు స్వామి వివేకానంద !

 

యువత కోసమే , యువత కొరకే తన

శ్వాస , ఆలోచన, అభిలాష , తలపు,

కోరిక ,ఆకాంక్షలు మహా దివ్యశక్తి ని

లక్ష్యంగా ఎందరో యువకులు , యువతులు

తమ శక్తి, సామర్ధ్యాలను పెంచుకొంటూ

అవసరాన్ని బట్టి మార్చుకుంటూ

అనేక విధాల ,వివిధ రంగాల్లో

ప్రతిభ చూపిస్తూ అభివృద్ధి పథంలోకి

పరుగులు తీస్తున్నారు

జి మురళీ మోహన్ రావు

 

సీ.

యుగపురుషునిగ తా నుద్భవించినె వివేకానంద స్వామియై గరిమ జూప

ఆధ్యాత్మిక విలువలన్ని నిక్షిప్తమై తేజరిల్లెడు యోగిగా జగమున

నిలిచి హైందవ జాతి వెలుగు కిరణములన్ దశదిశలా నింపి తాత్త్వికుడయె

జాతి నున్నతముగ జాగృతం బరచెడు దైవ స్వరూపుడై తనరు చుండె

గీ.

యువత కాదర్శకునిగ తానవతరించి

రామకృష్ణ మఠము గూర్చి రశ్మిమావి

వలె భవితకు వెలుగులిడి; వరలు చుండె

దివ్యశక్తి వ్యక్త పరచు ధీరుని వలె.

వెంకట్.సి హెచ్

 

స్వామి వివేకానంద కొన్ని ఉపదేశ సుధ బిందువులు -

అంతరాత్మతో తరచు సంభాషించుము,

లేక, ఉండదు మంచిని వినే అవకాశము.

నీ వెనక ముందు ఏమున్నది కాదు సత్యం

నీలో ఏమున్నది అను విచారణ ముఖ్యం

సహనం ఒక్క క్షణమైనా మేలు

దూరం చేయు కొండంత ప్రమాదం

అసహనం ఒక్క క్షణమైనా చాలు

నాశనం చేయు జీవితం మొత్తం

ధనం కోల్పోయిన కొంతే కష్టం

వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం నష్టం

అన్ని అవస్థలలోనూ కర్తవ్యం గుర్తించు

అపుడు కార్యాలు  నిరాటంకంగా జరుగు

ఉత్సాహంతో ధైర్యంతో శ్రమించాలి

అలసటనానందంగ అనుభవించాలి

నీ విజయానికివే ప్రథమ లక్షణాలు

గెలుపు వచ్చెనని గర్వించకు

ఓటమి కలిగెనని నిరాశ పడకు

జయాపజయాలు ఆఖరు కావు

ఆత్మన్యూనత గొప్ప బలహీనత

ఆత్మ నిందతో తప్పదు పతనావస్థ

గాఢ నిద్ర నుండి మేలుకొనుడు

లక్ష్యం చేరువరకు విశ్రమించకుడు

చైతన్యం తెచ్చు ప్రతి ఆశయాన్ని బలపరచుము

బలహీనం చేయు ప్రతి తలంపును తిరస్కరించుము.

CA కె మల్లికార్జునరావు

 

హరే కృష్ణా మన తలరాత మార్చే గీత

మన లోపల ఒకడు

ఉన్నాడు....అసలైన వాడు.

కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే 6 గురు  దొంగలు అడ్డుగా ఉన్నారు..

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే 6 గురు  దొంగలు..

ఈ 6 గురిలో 4 గురు దొంగల నుండి సులభంగా తప్పించు కోవచ్చు, కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించు కోవడం చాలా కష్టం..

ఆ ఇద్దరు పెద్ద రౌడీలు. వాళ్ళే కామం, క్రోధం....ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజో గుణం అనే ఇంట్లో..

" కామ ఏష క్రోధ ఏష రజో

గుణ సముద్భవహ "

ఈ కామం, క్రోధం అనేవి రజో గుణం నుండి వస్తున్నాయి అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు..

కాబట్టి రజో గుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు ఉంటారు.

ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి. అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు..అయితే ఈ రజో గుణం అనేది First floor....ఇంకా మనం First floor కు రాలేదు.....మనం Ground floor లో ఉన్నాం.

మనలో ఉండే తమో గుణమే ఆ Ground floor.

అంటే మనం తమో గుణంలో ఉన్నాం.

బద్దకం, అతి నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణం.....ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం.....ఇంకా Ground floor లోనే ఉన్నాం.

Ground floor నుండి పైకి రావాలంటే చాలా కష్టం. అలాటి ఈ Ground floor నుండి పైకి వచ్చి, First floor కు వెళ్లి అక్కడ ఉండే 6 గురు  దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second floor వస్తుంది.

floor పేరు  *సత్వ గుణం..

floor చాలా పెద్దగా ఉంటుంది....హాయిగా ఉంటుంది......

ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది..

అయితే చిన్న సమస్య....... ఇక్కడ ఒకే ఒక దొంగుంటాడు. భయపడకండి...... వాడు

మంచి దొంగ.....వాడు మీకు మంచి మాటలే చెబుతూ  ఉంటాడు  మీకు Third

అది వెలుగులకు వెలుగు,మహావెలుగు.

చివరిగా ఒక good news ఏమిటంటే మనం Ground floor నుండి third floor వరకు వెళ్ళడానికి ఒక  *Lift   ఉంది.

Lift పేరే "భగవద్గీత".

గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్వ గుణానికి, సత్వ గుణం నుండి శుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి, చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు.

పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు..

కృష్ణం వందే జగద్గురుం!

 

 

శ్రీ వివేకానందుని జయంతి   సందర్భముగా

1. తేటగీతి...

రామకృష్ణుని శిష్యుడై సీమ కేగి

దేశ సంస్కృతి, కీర్తినల్దిశల బాపి

విశ్వ సౌభ్రాత్వ భావనల్ విశదబరచ

మన నరేంద్రుని ఖ్యాతియె నసుదోచె....

 

2. తేటగీతి..

విద్య పరమార్థ మెరిగిన విదురుడతడు

శిష్య బృందపు మేల్బంతి  శిఖరమతడు

"బలమె జీవనమని" యన్న భాగ్యశాలి

జగతి జాగృతి గోరిన సారగుణుడు......

 

3. తేటగీతి..

"లెండి, మేల్కొను, సాధించి రండి తిరిగి"

యనుచు నుత్తేజబరచిన హాలికుండు

ప్రభల శక్తికి యువతయె వారధనుచు

కష్ట జీవుల మేల్గోరి ఖ్యాతినొందె

 

4. తేటగీతి...

 " గోడలు బ్రద్దలై బలము జూపు"

"జాతి ప్రగతికి శ్రమటోడ్చు ఖ్యాతి నిలుప"

 యనిన ప్రేరణ శక్తికి నంజలిడుదు.....

పి.ఎల్.నాగేశ్వరరావు

 

శ్రీ వివేకానందుని జయంతి  సందర్భముగా

1. తేటగీతి...

రామకృష్ణుని శిష్యుడై సీమ కేగి

దేశ సంస్కృతి, కీర్తినల్దిశల బాపి

విశ్వ సౌభ్రాత్వ భావనల్ విశదబరచ

మన నరేంద్రుని ఖ్యాతియె మనసుదోచె....

 

2. తేటగీతి..

విద్య పరమార్థ మెరిగిన విదురుడతడు

శిష్య బృందపు మేల్బంతి  శిఖరమతడు

"బలమె జీవనమని" యన్న భాగ్యశాలి

జగతి జాగృతి గోరిన సారగుణుడు......

 

3. తేటగీతి..

"లెండి, మేల్కొను, సాధించి రండి తిరిగి"

యనుచు నుత్తేజబరచిన హాలికుండు

ప్రభల శక్తికి యువతయె వారధనుచు

కష్ట జీవుల మేల్గోరి ఖ్యాతినొందె.......

 

4. తేటగీతి...

"ఐకమత్యమె జాతికి నాయుధమ్ము"

 

"కులము గోడలు బ్రద్దలై బలము జూపు"

"జాతి ప్రగతికి శ్రమటోడ్చు ఖ్యాతి నిలుప"

యనిన ప్రేరణ శక్తికి నంజలిడుదు.....

పి.ఎల్.నాగేశ్వరరావు

 

వివేకానందుని గురించి నాకు తెలిసిన చిన్న‌ విషయం....

స్వామి వివేకానందుడి  ఉపన్యాసాలు బాగా విన్న ఒక విదేశీ మహిళ ఆయననే follow అయ్యేదట.... ఎక్కడ కి వెళితే అక్కడకు వెళ్ళి ఆయన చెప్పే మాటలు అలా వింటూ ఉండేదట....‌ఆయన అమోఘమైన‌తెలివితేటలు. పాండిత్యము,అపారమైన జ్ఞాన సంపద చూసి ముచ్చట పడి.. ఒకరోజు వారిని అడిగేసిందట..... మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని.... అప్పుడు స్వామి ఒక చిన్న నవ్వు నవ్వి ఎందుకు మీరు‌ నన్ను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నారు... నేను సన్యసించాను కదా అన్నారట.... అప్పుడు ఆమె మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటే మీ అంత తెలివితేటలు జ్ఞానం ఉన్న మీ అంశ నాకు పుడుతుంది....‌అన్నదట... అప్పుడు స్వామి మళ్ళీ నవ్వి ఐతే నన్నే నీ బిడ్డ అనుకోమ్మా అని నమస్కరించారంట....

 అప్పుడు మహిళ నోట వెంట మాట రాక కళ్ళ నీళ్లతో కాళ్ళమీద పడి నమస్కరించి వెళ్ళిపోయిందట

ఆత్రేయ

 

వేళ వివేకానందులవారి 158 జయంతి. జాతీయ యువదినోత్సవంగా గుర్తించి ప్రతి సంవత్సరం ఆయన జయంతి జరుపు కుంటున్నాము. ఆయనకు నివాళి నర్పిస్తూ నాకు తెలిసినంతలో స్వామిజీ ని స్మరించుకుంటున్నాను.

 

నమస్తే యతిరాజాయ! వివేకానంద శూరయే

సచ్చిద్సుఖ స్వరూపాయ!స్వామినే తప్ప హారిణే

 

వివేకానందుడు,  ఆయన జీవిత చరిత్ర గురించి, బోధనల గురించి తెలియని వారుండరు.

యువతకు స్ఫూర్తి ప్రదాత!

దేశ ప్రగతి యువత వల్ల మాత్రమే జరగ గలదని వారిని చైతన్యపరచి, అన్ని విధాలా తీర్చి దిద్ది, సత్య. నిష్ఠ భక్తి, జ్ఞాన, సేవా మార్గాలలో వారికి తర్ఫీదు నిచ్చి

సమాజానికి అందివ్వడంలో రామకృష్ణ మఠ పు అవిరళ కృషి ఎంతైనా ఉంది.  వ్యవస్థాపకులు యోగివర్యులైన వివేకానందులవారే.

 

పశ్చిమ దేశ వాసులను " Brothers and Sisters of America"అని సంబోధించగానే చప్పట్ల వర్షం రెండు నిముషాలపాటుఆగకుండా కురుస్తూనే ఉందట. పాపము చేస్తే దేవుడి శిక్షిస్తాడు అన్న మతోన్మాదపు

శక్తుల బోధనలు విన్న ప్రజలు ఆలోచించి వివేక, వివేచనలను పెంపొందింప జేయ గలిగిన యోగి పుంగవుడు.

 

చిన్న నాటినుండి ధ్యానంలో మునిగి ఆకలిదప్పులు మరిచిపోయేవాడట.కష్టాల నావలో పయనిస్తున్నా, రామకృష్ణులవారిని గుడ్డిగా నమ్మలేదు. ఆయనను కూడా పరీక్షించి ప్రియ శిష్యుడయ్యాడు. ఒకసారి కష్టాలనుండి గట్టేంకించమని రామకృష్ణులవారి జగన్మాతను కోరమని  అభ్యర్థించారు. దానికి  నరేంద్రుని నేరుగా జగన్మాతను కోరమని చెప్పారు

రామకృష్ణ గురుదేవులు. నరేంద్రుడు దక్షిణేశ్వర్ లోని కాళీ మాత ముందుకూర్చుని ధ్యానమగ్నులు కాగా అమ్మవారు ప్రత్యక్షమయినపుడు, వారు కష్టాల విముక్తి గురించి ప్రస్తావించకుండా ముక్తి మార్గాన్నిఆపేక్షించారట. ఎన్నిసార్లు ప్రయత్నించినా అలాగే కోరుకున్నారట.

 

రామకృష్ణుల వారు విష్ణు స్వరూపమైతే, వివేకానందులవారు శివ స్వరూపంగా భాసించే వారట.

 

39 సంవత్సరములకే పరమపదించినా, తాను భువిపై వచ్చిన  ప్రయోజనాలను నెరవేర్చిన మహా మనిషి.రామకృష్ణుల వారి సన్యాస శిష్యులను, సంసార శిష్యులను ఒక్క త్రాటిపై నడిపిన గురుదేవులు.రామకృష్ణా మఠం అతి పెద్ద సేవా సంస్థ కావడానికి శారదా మాత పర్య వేక్షణ లో ఆయన వేసిన బీజం మహత్తరమైనది. అందుకే, ఈనాటికి  యోగ మార్గంలోవివిధములైన శిక్షణ పొందడానికి పిల్ల, పెద్ద లేకుండా అందరూ వస్తారు.

 

ఆలయంలో లభించే ప్రశాంతత వేరే ఆలయాల్లో అరుదుగా చూస్తాము. హిందూ మత పరిరక్షణలో ముందడుగు వేసే విధంగా తీర్చి దిద్దారు, వివేకానందులవారు. ఆయనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, మనసారా స్మరించి నమస్కరించుకోవడం తప్ప

 

తేట గీతులలో నివాళి

నరులలోనింద్రుడుగ బుట్టిన మనుజుండు

తల్లి భువనేశ్వరి యనుగు తనయుడగుచు

విశ్వనాథుని వరమయి వెలుగునిచ్చి

ప్రాచ్య దేశ ప్రాభవమును పశ్చిమమున

పరిఢవిల్ల జేసె మహిత భరత కీర్తి

 

రామ కృష్ణుని నెయ్యమున్ రాటు దేలి

దైవమును కనుగొనుటకై దారి వెదకి

భరత మాత పుత్రులమని వక్కణించి

ధీరశూరుడుగ నిలచిన్  దేశ భక్త!

 

రామకృష్ణుని బోధల రవళి విశ్వ

మంత మార్మోగ శారదా మాత వెన్ను

దట్ట యువశక్తి సంఘటితపఱచగను

నిర్విరామ కృషి సలిపిన్ నీకు నుతులు

 

యువతనంత మేల్కొలిపిన యోగి వర్య

సచ్చిదానందము పొందగ సత్య నిష్ఠ

ధారణ కై దేహ ధార్థ్యత తప్పదనుచు

గుఱుతెరిగి చేతన నొసగిన గురువు నీవు

అవళూరు సీత

 

సీ"

ఆత్మశక్తినిబెంచ నాదర్శ మూర్తియై యువతను మేల్కొల్ప నవతరించె

హైందవము ఘనత నవనికెల్లను జాట నడ్డంకులెన్నియొ నదిగమించె

తత్వభోద నెరపి ధ్యానామృతము బంచ రామకృష్ణుల కిష్ట  శ్రావకుండు

మానవాళికి మత మర్మమెరుకచేసి మానవత్వము జాట మాన్యవరుడు

జాగృత పరచ నేతెంచె జాతి నెల్ల

దేశ దేశమ్ములు దిరిగె దిప్తిబంచ

భరతమాతకు తరగని భాగ్య మొసగ

మాన్యులందరి కీతడు మార్గదర్శి

వాణిశ్రీ నైనాల

 

భరత మాత కు బిడ్డగ భావి యువత

కెల్ల బోధన తోడను గెలుపు తెలియ

జేసి విశ్వము అంతయు చెప్ప జీవి

తమ్ము సారము , వెలుగొందె  తార కగను

 

తేటగీతి

వ్యక్తి,సంఘముల వికాసపథముఁ దెల్పి,

యాస్తికత మూలమెరిగించి యవనినంత,!

నడత నేర్పె  నరేంద్రుడు నాయకునిగ

ఖ్యాతి దెచ్చెను వసుధనీ కర్మ భువికి !!

డా. నాగులపల్లి

 

కం||

వీణా పాణీ గానక

నేనేమిక సేతు నిపుడు నేర్వగ కైతల్

పోనీ దెలుపిన మార్గము

కానిచ్చెద నీ భవితను ఘనముగ నికపై!!

చక్రవర్తి

 

యువత మేల్కొనునులె నీదు యుత్సహమ్ము జూచి నన్

భవము గల్గినట్టి పుణ్య భరత ఖండము కొరకై

భవము చూపె యువత దేశ భవిత కొరకు లెస్సగన్

యువతకు నొసగితివి శక్తి యుక్తి ఠీ వి జూపగన్.

ఉష

 

నిన్నటి వివేకానందుని అంశంపై ఇంకొక వచన కవిత-

యేను భారతీయుడ

మేము పురాతనము కాము

నిత్యమై సత్యమై వెలుగు

సకల మతములకు తల్లి యగు

సనాతన హైందవ మతము మాది

విశ్వ జనహితమే మా మతము

సకల జన సమ్మతమే మతమంటు

ప్రపంచ వేదికపై గర్జించిన సింహ మతడు

నా సోదర సోదరీమణులారా యని

అమెరికా వాసులను సంబోధించి

విదేశీయుల మనసులు తట్టి లేపి

నందు భ్రాత్రు భావమును జాగృతి

నొందించి మనుషులంతా ఒక్కటే

యని ప్రేమ నాదమై ఝుంకరించి

ప్రపంచ శాంతిని కోరిన భ్రమరు డతడు.

శ్రీ రామకృష్ణ పరమహంస ప్రియ

శిష్యుడై దేశదేశములు పరిభ్రమించి

"యోగ" భాషను అందరకు తెలిపి

మానవజాతి ఉన్నతకు పాటుపడి

కృషి కల్గి మనుషులు రుషులౌదురని

బోధనలు చేసిన విశిష్ట  గురువతడు.

CA కె మల్లికార్జునరావు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...