5, జనవరి 2021, మంగళవారం

పుస్తక సమీక్ష - శనివారము , భాగవతం 02.01.2021

 


భాగవతం

 

తే.

బాసర సరస్వతీ! మమ్ము బావనముగ

గాంచి జ్ఞాన మొసగు మమ్మ! కరుణ తోడ

వరము లిచ్చి రక్షింపగ వందనంబు

తల్లి! తేనియ సభ్యుల దండములివె!

 

భాగవతంలో నాకు నచ్చిన పద్యాలు...

మీరు కూడా వీలయితే మీకు నచ్చిన పద్యం ఉదహరించగలరు

 

2 - 68

సీ.

పూర్ణుఁ డయ్యును మహాభూతపంచకయోగ

మున మేనులను పురములు సృజించి;

పురములలోనుండి పురుషభావంబున

దీపించు నెవ్వడు ధీరవృత్తిఁ?

బంచభూతములను పదునొకం డింద్రయ 

ములఁ బ్రకాశింపించి భూరిమహిమ

షోడశాత్మకుఁడన శోభిల్లు, జీవత్వ

నృత్త వినోదంబు నెఱపుచుండు?

 

2-68.1-

తే.

నట్టి భగవంతుఁ, డవ్యయుండచ్యుతుండు

మానసోదిత వాక్పుష్ప మాలికలను

మంజు నవరస మకరంద మహిమ లుట్ట

శిష్టహృద్భావలీలలఁ జేయుఁగాత.

 

భావము:

తాను పరిపూర్ణుడై ఉండికూడ పృథివ్యాది పంచ మహాభూతాలను కలిపి శరీరాలనే పురాలను సృష్టించి వాటిలో పురుషుడనే పేరుతో ఎవడు సదా ధీరుడై ప్రకాశిస్తుంటాడో; పంచభూతాలను, పదకొండు ఇంద్రియాలను ప్రకాశింపజేసి గొప్ప ప్రభావంతో షోడషశకళాత్మకుడై శోభిల్లుతు ఎవడు జీవత్వ మనే నృత్తవిలాసం ప్రదర్శిస్తుంటాడో; అవ్యయుడు, అచ్యుతుడు అయిన భగవంతుడు, మనోజ్ఞమైన నవరసాలనే తేనెలు జాలువారుతూ నా మనస్సునుండి పుట్టిన వాక్కులనే పుష్పమాలికలతో సజ్జనుల హృదయాల నలరించుగాక.

 

శిష్ట = మంచివారి; హృత్ = హృదయములందలి; భావ = భావముల, తలపుల; లీలన్ = విలాసములు; చేయున్ = చేయు; కాత = కాక.  

 

షోడశాత్మకుఁడన  షోడశ = పదహారు కళలు/రకములు {షోడశాత్మక - 5 పంచభూతములు, 5 జ్ఞానంద్రియములు, 5 కర్మేంద్రియములు మరియు 1 మనస్సు మొత్తం 16}; ఆత్మకుఁడు = ఆత్మకలవాడు

 

ఒక మంచి సేకరణ:

ఒక అద్భుత ఆశు పద్యం

లక్ష్మీ పార్వతుల అన్యోన్య పరిహాసం-

 

సీ.

గంగా ధరుడు నీ మగండని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటనియె,

నెద్దునెక్కును నీదు నెమ్మెకాడని నవ్వ గ్రద్దనెక్కును నీ మగండటనియె

వల్లకాడిల్లు నీ వల్లభున కనంగ నడిసంద్ర మిల్లు నీ నాధున కనె

నాట్యంబు సేయు నీ నాయకుండన నంగు గావించు వెన్కనీ కాంతుడనియె

 

తే.గీ

ముష్టి కెక్కడి కేగె నీ యిష్టుడనిన

బలి మఖంబున కేగె నో లలన యనియె

నిట్టులన్యోన్య మర్మంబు లెంచుకొనెడు

పర్వతాంబోధి కన్యల ప్రస్తుతింతు.

 

పద్యం తిరుపతి వేంకట కవుల శతావధాన సారం లోనిది. వారు ఒక శతావధానంలో చెప్పిన పద్యమిది. అర్థం సులభ గ్రాహ్యమే అయినా అవతారిక లేనందువల్ల కొంత మందికి పూర్వగాధలు తెలియక పోతే పద్యం లోని రసాస్వాదన అనుభవం లోనికి రాదు. కనుక కొంచెం వివరిస్తాను. లక్ష్మీ దేవి వేరే పనీ పాటూ లేని ఒక తీరిక సమయంలో వచ్చి పార్వతీ దేవితో ముచ్చట పెట్టుకుంది. సరదాగా పార్వతితోనీ మగడు ఆడదానిని (గంగను) నెత్తి మీద ధరించాడు కదా?” అంది. దానికి జవాబుగా పార్వతి విష్ణుమూర్తి మోహినీ అవతారంలో స్త్రీ రూపాన్ని ధరించడం గుర్తు చేస్తూనీ మగడు పూర్తిగా ఆడ మేషమే ధరించాడు కదా?” అంది. అప్పుడు లక్ష్మీదేవి  నీ మగడు ఎద్దునెక్కి తిరుగుతాడు కదా?” యని యెద్దేవా చేయబోయింది. దానికి వెంటనే పార్వతీ దేవినీమగడిలా గ్రద్ద నెక్కి తిరగడం కంటె అదేమి తక్కువఅని జవాబిచ్చింది.( ఎద్దు-నంది శివుని వాహనమైతే విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు- గ్రద్ద- కదా?). అప్పుడు లక్ష్మీ దేవినీ మగని యిల్లు వల్లకాడు కదా?” అంటే పార్వతి వెంటనేనడి సముద్రం లో ఉండడం కంటె అదే నయం కదా?” అంది. ( పరమశివుని నివాసం వల్లకాడనీ విష్ణుమూర్తి పాలసంద్రపు నివాసి అనీ తెలుసు కదా?) .లక్ష్మీ దేవినీ మగడు నాట్యం చేస్తాడు కదా?” అని ఎకసక్కెమాడబోతే పార్వతిఅవును మీ ఆయన అటువంటి నాట్యానికి వెనక హంగు చేస్తాడు కదా?” అని జవాబిస్తుంది. శివుడు నటరాజు కనుక నాట్యం చేస్తాడు. ( అయితే దీనిలో హేళన ఏముంది? అని కొందరికి అనిపించవచ్చును. కాని పాత రోజుల్లో నట గాయకులంటే ఆంధ్ర దేశంలో చిన్న చూపే ఉండేది. నటులకీ,నాట్యకళాకారులకీ గాయకులకీ ఏమాత్రం గౌరవం ఉండేది కాదు. వారికి పిల్లనివ్వడానికి కూడా ఇష్టపడే వారు కాదు. సంఘంలో వారంటే చిన్న చూపే. సినిమాల రాకతో నటీనటుల సంపాదన పెరగడంతో సీను మారిందనుకోండి. అది విషయాంతరం). విష్ణుమూర్తి, గజాసుర సంహారంలో గజాసురుని కడుపులో ఉన్న మహాశివుని బయటకు రప్పించడానికి నందిని తీసుకు వెళ్లి అసురుని సభలో దాని చేత నృత్యం చేయిస్తూ ప్రక్కవాద్యం వాయిస్తాడు. నంది గజాసురుని తన కొమ్ములతో పొడిచి చంపి శివుణ్ణి బయటకు రప్పిస్తుంది. ఇదిగో ఇక్కడ విష్ణుమూర్తి  హంగు చేయడాన్నే లక్ష్మీ దేవికి గుర్తు చేస్తూ విష్ణుమూర్తి హంగుకాడని పార్వతీ దేవి దెప్పిపొడిచింది. అన్నిటికీ తిరుగు లేని సమాధానాలిస్తున్న పార్వతిని చూసి ఇక లాభం లేదనుకుని లక్ష్మీ దేవి ఆఖరు అస్త్రంగానీ మగడు ముష్టి కెక్కడకు వెళ్లాడని అడుగుతుంది. దానికి పార్వతిబలి చక్రవర్తి చేసే యజ్ఞానికి వెళ్లి ఉంటాడనుకుంటానన్నది. (శివుని భిక్షాటనా,విష్ణువు వామనావతారంలో బలి దగ్గర దానం గ్రహించడం తెలిసినవే కదా?)

పై విధంగా లక్ష్మీ పార్వతులు ఒకరి నొకరు మేలమాడుకున్నారని చెబుతూ వారిద్దరినీ ప్రస్తుతించారు మన జంట కవులు. ఇంత భావాన్ని ఒక చిన్న పద్యంలో ఇమిడ్చి చెప్పడం మహాకవులకే చెల్లుతుంది. స్త్రీల సహజమైన చిత్త ప్రవృత్తిని అద్భుతంగా ఆవిష్కరించిన పద్యమిది. ముఖ్యంగా వారి భర్తలను ఎవరైనా అవమానిస్తూ మాట్లాడితే వారు సహించలేరు కదా? ఇంత వరకూ చాలా మందికి తెలిసే ఉంటుంది. కాని పద్యంలో సొగసైన విషయం మరొకటి ఉంది. అది మనవి చేస్తాను. సీస పద్యానికి అనుబంధంగా చెప్పిన తేట గీతిలో పార్వతి లక్ష్మీ దేవినిలలనాఅని సంబోధిస్తుంది. లలన అనే పదానికి ధన గర్వాతిశయంతో ఉన్న స్త్రీ అనే అర్థం ఉంది. అందు వలన పార్వతి సిరుల కధిష్ఠాన దేవత అయిన లక్ష్మీ దేవినినేను పేద రాలిని, నీవు ఐశ్వర్వవంతురాలవు కనుక ధన గర్వంతో నన్ను మేలమాడడానికి పనికట్టుకుని వచ్చావని నిష్టూర మాడిందని కూడా మనకు అవగతమవుతుంది. ఒక చిన్న సంబోధనలో కూడా ఇంత ఆంతర్యం ఉండేటట్లు ఆశువుగా పద్యం చెప్పినవారు మహా కవులుకాకేమవుతారు?

మహాకవులెప్పుడో మరణించినా మంచిపద్యం మనకి మిగిల్చి పోయారు.

CA కె మల్లికార్జునరావు

 

రోజు ,   రోజు  -   రోజాలు నవ్విన రోజు

రాజాలా తలెత్తుకొని నిలబడే రోజు

కొత్త సంవత్సరం మొదలిడిన రోజు

పాత చేదు జ్ఞాపకాలు చెరిపేసిన రోజు

కుటుంబాలని కలిపి మనుషలను దగ్గర చేసిన రోజు

పాత సంప్రదాయలను తిరగ రాసిన రోజు

మమతలు వెల్లివిరిసిన రోజు

ఆకాంక్షలను రికేత్తించిన రోజు

తూరుపు సింధూరం దిద్దిన రోజు

ఆశల కెరటాలు ఎగసిన రోజు

మౌనం వీడి చెరశాల సంకెళ్లు తెంచుకున్న రోజు

నా చెలి నవ్విన రోజు రోజు

 

-కోవూరి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...