21, నవంబర్ 2020, శనివారం

పుస్తక సమీక్ష - ఆదివారము 15 11 2020


 

 ప్రతిరోజు లాగే  ఉదయాన్నే అలారం మోగింది

బద్ధకం వదిలింది  నడక మొదలైంది

అడుగెనుక అడుగు తో  శ్వాస క్రమానుగతంగా 

నుదిటిన పట్టిన స్వేదం అలుపెరుగక పోరాటం..........

జీవనయాత్రలో  గమ్యం తెలియని నడకలెన్నో

అందుకోవాల్సిన శిఖారాలెన్నో

నిశ్చలస్థితి లో నీరు గమనస్థితి లో ఆలోచనలు

పొంతనలు లేని స్థితి లో  విశ్రమించని నడక

భానోదయం నులివెచ్చని  కిరణాల పలకరింపు

కొసరే గాలికి కొబ్బరిఆకుల గలగలలు

రాలే పొన్న చెట్టు పూల గుభాళింపులు

ఇవేవి సాగే నడకని ముసురుకుంటున్న ఆలోచనలని

మార్చ లేక నాతో రాజీ పడక

స్థాణువై నిలిచి నా వైపే చూస్తున్నాయి

తీరం తెలియని ప్రయాణం కొనసాగుతుంది

 

కోవూరి  | తెలుగు తేనియలు

 

రామకృష్ణ కవి చాటు పద్యాల మీద, నేను వ్రాసుకున్న సీసము

తిక్కన గారి పద్యం స్ఫూర్తి. . . .  

 

సీసము

ఎవ్వాని భావాలు హృదయసీమలలోన  పల్కరించిన చాలు చిల్కు"నగవు"  

ఎవ్వాని పద్యాలు నెత్తావి జల్లులై  ధరణిలో సరసులు ధన్యమగును 

ఎవ్వాని పల్కులే యిలలోన చాటువై నరుల నాల్కల పైన నాట్య మాడు 

ఎవ్వాని కీర్తియే తేజోవికీర్ణమై దశ దిశాంతమ్ములన్ దాటి సాగు

 

తేటగీతి

రామకృష్ణ కవీ ! పద లాహిరులున,  

సరస సంభాషణాలన జావళీలు  

మనసులోన  పొంగారగ మంజువాయె  

చాటుపద్య రుచిరముల చల్లెనిపుడు 

 

కస్తూరి శివశంకర్  | తెలుగు తేనియలు

 

 


నేటి వ్యాసం..

మేధో శుద్ధి   మేధస్సు :

 

మన ప్రాచీన గ్రంధాల ప్రకారం ఈ విశాల విశ్వంలో 84 లక్షల జీవరాశులకు ఉన్నాయి. అన్ని జీవరాశులకూ మేధస్సు ఉంటుంది. కానీ మానవ మేధస్సు మాత్రం విశిష్టమై ఇతర  జీవరాశులపై తన ఆధిపత్యం  సాధిస్తూ ఉంది.

 

పూర్వకాలంలో లో భారతీయ మహర్షులు తమ  మేధో శక్తిచే ప్రపంచంలోని ఎన్నో రహస్యాలను ఛేదించి ముందు తరాలకు అందించారు.

 

ఆధునిక యుగంలో కూడా ఎందరో తమ మేధో శక్తిచే ఆశ్చర్యపడే సాంకేతిక అద్భుతాలు సాధించారు. ఇందుకు స్పష్టమైన ఉదాహరణ మనం విస్తృతంగా వాడుతున్న చరవాణి...  ఇంకొన్ని ఉదాహరణలు-

 

a. ప్రఖ్యాతి చెందిన శకుంతలా దేవి  అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్ కన్నా అధిక వేగంతో లెక్కలు చేసి చూపారు..

 

b. స్టీఫెన్ హాకింగ్ కొన్ని దశాబ్దాల పాటు అతని శరీరంలో అధిక భాగం  నిర్వీర్యమైనాఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు మానవాళికి అందించాడు..

 

c. తెలుగు భాషలో  అవధాన ప్రక్రియ  ద్వారా ఎందరో మహా కవులు తమ తమ అపరిమిత ధారణా శక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు..

 

అలా ఎందరో మహనీయులు , శాస్త్రవేత్తలుయుగ యుగాల నుండి నేటి వరకు తమ తమ మస్తిష్కపు పదును చాటుతూనే ఉన్నారు . సాంకేతికపరంగా, వైజ్ఞానిక పరంగా మానవుడు ఎంతో అభివృద్ధి సాధించాడు. సుదూర గ్రహాలకు వెళ్తున్నాడు, సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుల నుండి  అమితమైన శక్తులను వెలికి తీశాడు.

 

ఇట్టి అనంత శక్తి కలిగిన మానవ మస్తిష్కము లేదా మేధస్సు లేదా మెదడును

భగవంతుడు మానవ శరీరాల్లో అమర్చాడు ... మెదడు మీద జరిగిన పరిశోధనల ప్రకారము  మనిషి మెదడు శక్తి లో 10 వ భాగం  వరకు మాత్రమే గరిష్టంగా వాడుకుంటున్నాడు. ఆ కొద్ది శక్తితోనే మనిషి ఎన్నో విశ్వ రహస్యాలను చేదించాడు..

 

మేధో సంరక్షణ:

 

భవంతుడు ప్రసాదించిన ఈ అద్భుతమైన "మెదడు" ను  మనము దీన్ని ఎలా కాపాడు కుంటున్నాము?

 

a.  ఇతర శరీర భాగాల లాగా మెదడు కు కూడా  తగినంత విశ్రాంతి  అవసరం . విశ్రాంతి పొందిన  మెదడు  సామర్ధ్యత కోల్పోకుండా ఉంటుంది.  వర్తమాన జీవనంలో  మెదడు కు  విశ్రాంతి నివ్వాలనే తలపే  మనకు  రాదు. ఈ సందర్భంగా, నిద్రలో కూడా  మెదడు పని చేస్తూనే ఉంటుందని గమనించాలి.

 

b. మెదడును ఉపయోగించి కనిపెట్టిన కంప్యూటర్లను , చరవానులనుఎప్పటికప్పుడు  జాగ్రత్తగా పరిశుభ్రం చేస్తు వాటి సమర్థతను  కాపాడుకుంటున్నాము , కానీ  మెదడును మాత్రం  పరిశుభ్రం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాం.

 

c. కంప్యూటర్లలో వైరస్ చేరుతుందని, ఎప్పటికప్పుడు  యాంటీవైరస్ ప్రోగ్రామ్ ఉపయోగించి ఆ వైరస్ను తీసి వేస్తున్నాము.  కానీ మన మెదడులో ప్రవేశించే చెడు ఆలోచనలు అనే వైరస్ ను మాత్రం పెంచి పోషిస్తున్నాము.

 

ధ్యానం

 

అయితే మెదడుకు విశ్రాంతి ఎలా అందించాలిఇందుకు  మహర్షులు  ధ్యానము అనే ఒక  క్రియను సూచించారు. గ్రంధాల ద్వారా , ప్రవచనాల ద్వారా,   ధ్యానం  గురించి ఎన్నో విధాలుగా వివరించి , అందరూ ఆచరించాలని ఉపదేశించారు.

 

ధ్యానంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో లో మెదడుకు తగినంత విశ్రాంతి కల్పిస్తారు. విశ్రాంతి పొందిన మెదడు సమర్థత పునరుజ్జీవం అవుతుంది. ఇంకొద్ది లోతుగా వెళ్లి మెదడును పరిశీలించడం జరుగుతుంది. ఈ ధ్యాన మార్గం లోనే  మహర్షులు ఎన్నో వేల ఏళ్ళ క్రితం, అపారమైన శక్తులను ( అణి మాది  సిద్ధులను ) సాధించారు..

 

 ధ్యానం అంటే  ఏదో ఒక బ్రహ్మ పదార్థం అనిఒక తెలియని , కనిపించని, భగవంతుని గురించి సమయము గడపడమే అని విద్యావంతులైన నేటి మానవ సమాజంలో ఒక గుడ్డి నమ్మకం..కానీ తాజా పరిశోధనల్లో - ఈ విశ్వం అతి సూక్ష్మ  అణువుల శక్తి సమూహమని నిర్ధారించారు. ఈ అజ్ఞాత శక్తి

నే  మన ప్రాచీన గ్రంధాలు  భగవత్ శక్తి  అని

అన్నాయి . సైన్సు ఇంత దగ్గరగా భగవంతుని చేరినప్పటికీ  ధ్యానం  విషయంలో నేటితరం నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది.

 

పాశ్చాత్య దేశ ప్రజలు ధ్యానం విశిష్టతను గుర్తించి, తమ దినచర్యలో భాగంగా చేసుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.. మనలో కూడా ఈ ప్రయత్నం జరుగుతుందని ఆశిద్దాం.

 

CA కె మల్లికార్జునరావు  | తెలుగు తేనియలు

 

 

 

నేటి వేమన పద్యం- భావం

చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు

కొంచమైన నదియు గొదవుగాదు

విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత

విశ్వదాభిరామ! వినురవేమ!

 

భావం: మంచి మనసుతో

 చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!

 

ఉత్పలమాల

 

భ్రాంతిని జీవితమ్ము గని బంధువు లెల్లరు దూరమైన యే

శాంతిని బొందలేక నిక సంతస మంతయు ద్రవ్యమందునన్

శాంతము జూచుచున్ మరచి సాయము జేసెడి తోడులేకయున్

వింతగ నాసలన్నియును ప్రేరణ నీయగ జీవుడాయనెన్

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి  | తెలుగు తేనియలు

 

 

 

ఆదివారం నాటి ప్రహేళిక

గుఱ్ఱం జాషువా గారి రచనలు

 

1. ఈ క్రింది పద్యము ఏ కావ్య ఖండిక లోనిది? సందర్భం ఏమిటి

జీవరత్నంబు వగు  నిన్ను స్వీకరించి

వట్టి రతనాలు నా యింట వదిలినాడు

యిచ్చి బులిపించి క్రమ్మర బుచ్చుకొనుట

యేటి కలవాటు జేసెనో యీశ్వరుండు

 

2. ఈ క్రింది పద్యము పూరించండి

రాజు మరణించె నొక తార రాలిపోయె

 

3. జాషువా గారు గబ్బిలం ఖండ కావ్యమును ఎవరికి అంకితం ఇచ్చారు?

 

4. ఈ క్రింది పద్యము ఏ ఖండకావ్యం లోనిది

ధర్మసంస్థాప నార్థంబు ధరణి మీద

నవతరించె దననె నబ్జభవుని తండ్రి

మునుపు జన్మించి నెత్తి కెత్తినది లేదు

నేడు జన్మింపకున్న మున్గినది లేదు

 

5. జాషువా గారు రచించిన ప్రఖ్యాత పౌరాణిక నాటకము పేరేమిటి?

 

6. ఈ క్రింది పద్యము ఏ ఖండ కావ్యం లోనిది ? ఎవరు ఎవరితో ఇలా అంటున్నారు?

" క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప

సాధ్యమే మానవున కిలాచక్ర మందు?

దాటి పోయిన యుగముల నాటి చరిత

మరల బుట్టింప గవియు సమర్థు డగును."

 

7. ముంటాజమహల్ ఖండ కావ్యాన్ని జాషువా గారు ఎవరికి అంకితం ఇచ్చారు?

 

8. హిందూ ముస్లిం మైత్రి ఆధారంగా చేసుకుని జాషువా గారు రచించిన నాటకము పేరేమిటి?

 

9. జాషువా గారు ఏ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు?

 

10. ఈ పద్య పాదము ఏ ఖండ కావ్యం లోనిది..

ఇట నస్ప్రశ్యత సంచరించుటకు దావే లేదు; విశ్వంభరా

 

 

 

పిల్లలు లేని బడి - దేవుడు లేని గుడి "

 

ఎనిమిది నెలలు అయింది కరోనా కారణంగా బడిలో పిల్లలు లేక. పాఠశాల ప్రారంభమయ్యేది తొమ్మిది గంటలకే అయినా ఎనిమిది గంటలకల్లా బడిలో ఉండే వాళ్లు పిల్లలు. తల్లిదండ్రులు పనులకు వెళుతూ పిల్లల్ని స్కూల్లో ఉంచి నిశ్చింతగా వెళ్లేవాళ్లు. తమకు తోడు ఇంకా బడి వయసు రాని తమ్ముడినో చెల్లెలినో కూడా వెంటబెట్టుకుని వచ్చేవాళ్ళు పిల్లలు. అంగన్వాడి టీచర్ వచ్చేంతవరకు వాళ్లను తమ దగ్గర కూర్చోబెట్టుకొని వచ్చాక అంగన్వాడీలో కి పంపి అప్పుడప్పుడు చూస్తూ వచ్చే అన్న అక్క లో ఎంత బాధ్యతో. టీచర్ రోడ్డు మీద కనిపించటంతో నే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అంటూ చుట్టుముట్టే వారు పిల్లలు. వచ్చీరావడంతోనే ఒకరిమీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ కావాలని టీచర్ తో మాట్లాడడానికి ప్రయత్నించేవారు మరికొందరు .. పాఠశాలకు ముందుగా వస్తే చక్కగా చెట్లెక్కి ఆడుకోవచ్చు అని ముందుగా వచ్చే వారు మరికొంత మంది పిల్లలు. బడి గంట కొట్టడానికి పోటీపడుతూ ఈరోజు గంట కొట్టడం నా వంతు రేపు నీ వంతు అంటూ పోటీ పడే పిల్లలు లేక బడి గంట మూగబోయింది. పిల్లలు చదివే పద్యాలు ఎక్కాల తో సందడిగా ఉండే పాఠశాల మొత్తం నేడు నిశ్శబ్దంగా మారిపోయింది... చెట్టుమీద కూసే కోయిల కూతను వెక్కిరించే వారు లేరని కోయిలలు కూడా స్కూల్ వైపు రావడం మానేశాయి. చెట్ల మీద కాసిన జామ పండ్లు అన్నీ క్రింద రాలిపోతున్నాయి. ఎప్పుడు గుంపులుగుంపులుగా వచ్చే కోతులు కూడా పిల్లలు కనిపించడం లేదనే ఏమో ఈ మధ్య అస్సలు రావడమే లేదు. ఆడపిల్లలు పోటీపడి కోసుకునే కాగడ మల్లె పూల చెట్టు తలనిండా పూలతో పిల్లలు ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది. ఖాళీగా ఉన్న నల్లబెల్ల తనపై ఎప్పుడెప్పుడు పాఠాలు రాస్తారా అని ఎదురు చూస్తుంది. పిల్లలు ఆట పాటలు లేక పాఠశాల మైదానమంతా చిన్ని పాదాల తాకిడి కోసం ఎదురు చూస్తుంది. వారానికి మూడు గుడ్లతో తో పోషకాహారాన్ని అందించే మధ్యాహ్న భోజనం గది తాళాలు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తుంది. టీచర్లు వచ్చి తాళాలు తీసి బడిలో కూర్చుంటే అప్పుడప్పుడు పిల్లలు వచ్చి ఇక బళ్ళు తెరుస్తారా టీచర్ అని ఆశగా అడుగుతున్నారు. బడి ఉన్నప్పుడు ఎంతో ఆరోగ్యంగా చలాకీగా ఉండే పిల్లలు ఎందుకనో బక్క చిక్కి పోయారు. టీవీ ల్లో, ఫోన్ లలో పాఠాలు అర్థం కావడం లేదని కొంతమంది అంటుంటే మరి కొంతమంది పిల్లలు మాకు కరెంటు లేదు టీచర్ మేము చూడలేదు టీచర్ అంటూనే మీరు రోజు బడికి వస్తున్నారు కదా టీచర్ మేమెందుకు రాకూడదని అమాయకంగా అడుగుతున్నారు. మరికొంతమంది పెద్ద తరగతి పిల్లలు ఆంధ్రప్రదేశ్లో బళ్ళు తెరిచారంటగదా టీచర్ మనకు ఎప్పుడు తెరుస్తారు అంటూ ఆరాలు తీస్తున్నారు.. ఇక మన ఉపాధ్యాయులు విషయానికి వస్తే రోజు టైం ప్రకారం బడికి రావడం ఆన్లైన్ తరగతులు వినమని ఫోన్ లు చేయడం వింటున్నారో లేదో అని ఇళ్లకు వెళ్లి విచారించడం.. పాఠాలు అర్థం అవుతున్నాయా  లేదా అని అడగటం.. రోజుకి ఎంత మంది పాఠాలు ఏ ఏ మాధ్యమాల ద్వారా విన్నారు అని రాసుకోవడం ... వర్క్ షీట్ లు.. ఇవన్నీ చేసినా కూడా పిల్లలకు సరైన బోధన అందడం లేదని బాధపడటం మన వంతు అయింది. ఈ ఆన్లైన్ తరగతులు కంటే భౌతిక దూరం పాటిస్తూ పిల్లలను బడికి పిలిచి చెప్పడమే మంచిదనిపిస్తుంది. ఈ మధ్య ఒక అమ్మాయి కి ఫోన్ చేసి ఈ టీవీలో వచ్చే పాఠం విన్నావా  , పాఠం పేరు ఏమిటి అని అడిగితే అప్పుడు కరెంటు పోయింది టీచర్ అని చెప్పింది.. ఈ విధంగా చూసినట్లయితే మన తరగతి గదిలో ఒకటికి పది సార్లు చెబితే గానీ అర్థం చేసుకోలేని కొంతమంది పిల్లలు, , టీవీలో వచ్చే పాఠాలు వింటూ ఏ మాత్రం జ్ఞానం సంపాదించుకుంటారో అని  సందేహం వస్తుంది. నెలల తరబడి పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల మాట వినడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ  తోటి వారితో కలిసి ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లలు ఒంటరిగా ఇంట్లో ఉండడం వల్ల  స్నేహభావం కోల్పోతున్నారు.. ఇన్ని నెలలు ఇంట్లో ఉండటం వల్ల చిన్న పిల్లలున్న తలిదండ్రులలో ఒకరు పని మానేసి ఇంటివద్దనే వుండాల్సివస్తుందనీ , ఈ కరోనా కాలం కాస్త కరువు కాలంగా మారిందనీ వాపోతూ త్వరగా కరోనా పోవాలని కోరుకుంటున్నారు. కరోనా కారణంగా మూతబడిన ఆలయాలు తెరుచుకున్నాయి అలాగే " దేశ భవిష్యత్తు రూపుదిద్దుకొనే విద్యాలయాలు " కూడా త్వరగా తెరుచుకోవాలనీ పిల్లలతో కళకళలాడుతూ,గురువుల సమక్షంలో భావిభారతనిర్మాతల భవిష్యత్తు రూపుదిద్దుకోవాలని ఆశిద్దాం....నా మిత్రుడి విశ్లేషణ....

 

 

అంశం. కేదారేశ్వర వ్రతం,

గేయం, (ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ, బాణీలో )

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి,

 

పల్లవి,

కేదారేశ్వర వ్రతము,

సౌభాగ్య వతులకు శుభప్రదము,

ఆచరించెను శ్రీ గౌరీ,

అర్ధ శరీరం పొందెను పతిలో,

అర్ధ నారీశ్వర రూపము,

జగతికి కడు ఆనందకరము...

 

చరణం 1

మాసములన్నిటి లోకి,

పరమ పవిత్రం కార్తిక మాసం,

కార్తిక మాస పౌర్ణమినాడు,

కేదారేశ్వర నోము నోచిన,

కలుగును శుభములు అన్నీ,

తొలగును కష్టములెల్లా....

 

చరణం 2.

పుణ్యవతి, భాగ్యవతి,

వ్రత మారంభించిరి మున్ను,

పూర్తి చేసిన పుణ్యవతి,

సకల భాగ్యములు పొందెను,

వ్రత దీక్ష మరచిన భాగ్యమతి,

కడు ఇడుములపాలాయెను,

నిష్ఠతో వ్రతమును పూర్తిచేసి,

ఫలితము పొందెను భాగ్య వతి...

 

హామీ..ఇది నా స్వంత రచన,

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి  | తెలుగు తేనియలు

(ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ, వరలక్ష్మీ తల్లి  బాణీలో )

 

 


పులి మ్రుగ్గు

(పులి ముగ్గు - Retold version విశ్వనాధ పావనిశాస్త్రి)

నవలా రచన : శ్రీ విశ్వనాధ

 

పులిగా మారే విద్య అనేది ఒకప్పుడు నిజంగానే జరిగిందనడానికి ప్రచారం లో ఉన్న ఒక కథ

 

ఒంగోలు ప్రాంతంలో పెద్ద ఆరకట్ల, చిన్న ఆరకట్ల అనే రెండు గ్రామాల్లో దాదాపు మూడొందల యేళ్ల క్రితం పులిగా మారే విద్య తెలిసిన కుటుంబాలుడేవట. అలాటి కుటుంబాల్లో ఒకాయన కూతురు పురిటికి వచ్చింది. బిడ్డ పుట్టాక తిరిగి భర్తతో అత్తారింటికి వెళ్లే సమయంలో బండి అడవి దారిన పోతుండగా భర్త అడిగాడు

 

మీ ఇంట్లో పులిగా మారే విద్య తెలుసటగా ? నీకూ తెలుసేంటి?” అని! ఆమె నోరు జారి “తెలుసు” అన్నదిఇంకేముంది?

ఎలా మారతారో చూపించమని పీకల మీద కూచున్నాడు! ఎంత చెప్పినా వినక ఏం చెప్పినా వినక మారి చూపించక పోతే చస్తానని బెదిరించాడు.

 

పులిగా మారాక నాకు మనిషిననే జ్ఞానం ఉండదన్నా వినిపించుకోలేదు. విధి లేక కొంచెం విభూది మంత్రించి ఇచ్చి, పిల్లాడితో చెట్టెక్కి కూచోమనీ, కాసేపయ్యాక విభూది తన మీద చల్లమని చెప్పి పొదల్లోకి వెళ్ళి పులిగా మారి గర్జిస్తూ బయటకు వచ్చింది. ఆయన ఎన్నడూ పులిని గానీ, పులి చేసే హడావుడి గానీ చూసిన వాడు కాదు. హడలి పోయి విభూది సంగతి మర్చిపోవడమే కాక పిల్లాడిని జారవిడిచాడు. పులి కాస్తా పిల్లాడిని నోట కరుచుకుని అడవిలోకి పారి పోయింది.

 

కొంత సేపయ్యాక చెట్టు దిగి ఏడ్చుకుంటూ మామగారింటికి పోయి ఈ విషయం చెప్పగా మావగారు,

 

"ఎంత పని చేశావు రా మూర్ఖుడా? పులిగా మారాక ఆహారం స్వీకరిస్తే ఇహ మళ్ళీ మనిషిగా మారే అవకాశం లేదు” అంటూనే అడవికి వచ్చి ఎంత వెదికినా కూతురు పులి కనిపించలేదు. చేసేది లేక అల్లుడిని కూడా పులిగా మార్చి అడవికి పంపాడట.

 

ఇంటికి వచ్చి కూతురి కథ చెప్పి ఇక పైన ఆ విద్య తాలూకు మంత్రోపదేశం ఎక్కడా ఎవరూ ఎవరికీ చేయ కూడదని ఆంక్ష విధించి మరణించాడు.

 

ఈ కథ ఆధారంగానే విశ్వనాథ పులి ముగ్గు వేశారని పావని శాస్త్రి చెప్తారు. అంతే కాదు, తెలుగులో తొలి “Human Metamorphosis” నవల ఇదేననీ,

 

తొలి రీటోల్డ్ నవల కూడా ఇదేననీ అంటారు.

1960 లో విశ్వనాథ రాసిన పులి మ్రుగ్గుని పావని శాస్త్రి 1985,86 లో పల్లకి వార పత్రిక కోసం సీరియల్ గా అందించారు.

 

మనిషి వాస్తవంలో పులిగా మారగలడా లేదా అనేది సత్యం కాక పోయినా, పులుల కంటే కౄర ప్రవృత్తి గల మనుషుల్ని నిత్యం వార్తల్లో దర్శిస్తూనే ఉన్నాం.

 

జానపద నవలగా పులి ముగ్గుని హాయిగా ఆస్వాదించవచ్చు

 

Kartika Puranam - 1

 

ప్రథమాధ్యాయము

 

శ్లో!! వాగీశాద్యాస్సుమనసః సర్వార్థానాముపక్రమే!

యన్నత్వా కృతకృత్యాస్స్యుః తం నమామి గజాననమ్!!

ఋషయ ఊచుః

 

శ్లో!! వశిష్ఠేన విదేహాయ కథితం బ్రూహినో మునే!

శ్రోతుకామావయంత్వత్తః కార్తీకవ్రతముత్తమమ్!!

 

తా!! నైమిశారణ్యమందు సత్రయాగ దీక్షితులయిన శౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును సవిస్తారముగా మేము మీవలన వినగోరితిమి అని సూతుని అడిగిరి.

సూతుడు ఇట్లు చెప్పెను. శౌనకాది సమస్తమునీశ్వరులారా! వినుడు. ఈ కార్తీకమహాత్మ్యమును వశిష్ఠమహాముని జనకమహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జననమరణ రూప సంసార బంధనమును త్రెంచుకుని మోక్షము పొందుదురు.

ఒకానొకప్పుడు దైవవశముచేత సిద్ధాశ్రమమునకు బోవుచు వశిష్ఠమహాముని జనకమహారాజు గృహమునకు జేరెను. అంత జనకమహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనమునుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామముజేసెను. సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి మునిపాదోదకమును తన శిరస్సున చల్లుకొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామరపువ్వుల వంటి కన్నులు గలవాడును, సమస్త జంతువులయందును దయగలవాడును, బాలసూర్యసమాన కాంతిగలవాడును, సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తి భావముతో ఇట్లని విన్నవించెను.

బ్రాహ్మణోత్తమా! మీదర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యమింకేమియు లేదు. ఇప్పుడు మా పితరులందరును తృప్తినొందినారు. మహాత్ములయొక్క దర్శనము సంసారులకు దుర్లభము, కనుక ఇప్పుడు మీరాక నాకు శుభములకు కారణమైనది.

సూతుడిట్లు చెప్పెను. తరువాత వశిష్ఠమహర్షి వికసించిన ముఖముగలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను. రాజోత్తమా! నీకు క్షేమమగుగాక. నేను మా యాశ్రమమునకు బోవుచున్నాను. రేపు మా ఇంటివద్ద యజ్ఞముజరుగును. దానికి ద్రవ్యమును ఈయగోరుదును.

ఆరాజిట్లు పల్కెను. మునీశ్వరా! యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చెదను. గాని వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీవలన వినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధికఫలమునిచ్చెడి సూక్ష్మధర్మములను నాకు చెప్పుము. మునీశ్వరా! ధర్మజ్ఞా కార్తీకమాసము సమస్త మాసములకంటెను సమస్త ధర్మములకంటెను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము.

వశిష్ఠుడిట్లు పల్కెను. రాజా! పూర్వ పుణ్యమువలన సత్వశుద్ధి గలుగును. సత్వశుద్ధి గలిగిన పుణ్యమార్గమందు అభిలాషగలుగును. లోకోపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను. వినుము. విన్నంతనే పాపములు నశించును. సత్త్వగుణము కలుగును. రాజా! సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయములగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీకవ్రతమును తులాసంక్రమణము = సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని, కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని గాని, ఆరంభించి నెలరోజులు చేయవలెను. ఆరంభమందు ఓ దామోదరా! నేను కార్తీకవ్రతము ఆరంభించుచున్నాను. దానిని నిర్విఘ్నముగా పూర్తిజేయుము అని సంకల్పము చేసి కార్తీకస్నానమారంభించవలెను. కార్తీకమాసమునందు సూర్యోదయసమయమున కావేరీనదియందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించినతోడనే మూడులోకములను పవిత్రముజేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త జలములయందును ప్రవేశించును. తులారాశియందు కార్తీకమున చెరువులందును, దిగుడుబావులందును, నూతులందును, చిన్నకాలువలందును హరి నివసించియుండును. కార్తీకమందు వ్రతము అన్ని వర్ణాలవారు జేయవచ్చును.

బ్రాహ్మణుడు కార్తీకమాసమందు గంగకుబోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళుచేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రములచేత భైరవానుజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను. తరువాత దేవర్షిపితృతర్పణ మాచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠించుచు బొటనవ్రేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచికట్టుకొని ఉదకమును వదలి ఆచమనము చేసి శిరస్సును వదలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరింపుచు ధౌతవస్త్రమును ధరించవలెను. తరువాత గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనముచేసి గాయత్రీజపము చేయవలెను. స్త్రీలు గౌరీజపము చేయవలెను. తరువాత ఔపాసనముగావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలోనుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రమమందు షోడశోపచారములతో పూజించవలెను. తరువాత కార్తీక పురాణమును పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వేదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనముగావించి, తరువాత పురాణకాలక్షేపమును చేయవలయును. సాయంకాలముకాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి, విష్ణ్వాలయమునందుగాని, శివాలయమునందుగాని, తన శక్తి కొలది దీపములుబెట్టి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణుస్తోత్రమును గాని శివస్తోత్రమునుగాని పఠించి నమస్కారములాచరించవలయును. ఎవడు కార్తీకవ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తివర్జితమైన వైకుంఠమును బొందుచున్నాడు. పూర్వజన్మార్జితములున్ను ఈజన్మార్జితములున్ను అయిన సమస్త పాపములు కార్తీకవ్రతమాచరించిన యెడల నశించును. బ్రాహ్మణుడుగాని, క్షత్రియుడుగాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, ఋషీశ్వరుడుగాని, స్త్రీలుగాని భక్తి శ్రద్ధలతో కార్తీకవ్రతమును జేసిన యెడల వానికి పునరావృత్తిలేని వైకుంఠమునొందుదురు. ఎవ్వడు కార్తీకవ్రతమాచరించు వానిని జూచి సంతోషించునో వానియొక్క పగటికాలమందాచరించిన పాతకము నశించును. ఇందుకు సందేహము లేదు.

 

ఇతి స్మాందపురాణ కార్తీకమహాత్మ్యే ప్రథమాధ్యాయ స్సమాప్తః

 

 

 

మా ఇంటి మారాణి

పెళ్ళాయ్యాకా ఇల్లు,   ఊర్నుంచి వచ్చాకా పెట్టెలు,  దీపావళి అయ్యాక వాకిలి

ఇవన్నీ సర్దాలంటే పూర్వీకులతో ఓసారి పిచ్చాపాటి వేసుకోవాల్సిందే!!

దీపావళి రెండోరోజు వాకిలి మొత్తం కురుక్షేత్రం తర్వాతి ప్రశాంతతలా ఉంటుంది , చిరంజీవిగా మిగిలిపోయిన అశ్వత్థామ లా మా పళ్ళాలు కోపంగా, కసిగా ..పగతో తిట్టుకుంటూ , ప్రతాపం అంతా చీపురు మీద చూపిస్తూ వాకిలి ఊడుస్తూ ఉంటుంది, 3 తరాలుగా మా ఇంటి ఏలిక ఆవిడే అవ్వడం వల్ల ఆవిడని మేము పనిలోంచి , తీయలేము, తీస్తే ఇంకొకరు రారు(రానివ్వదు) , మేము ఏమ్ చేయలేము అనే ధీమా బాగా ఎక్కువున్న మా పళ్ళమ్మ.. ఒక చీపురు అటేసి నావైపు ఓ చుర చూపు , చీపురు ఇటేసి మా బాబాయ్ కేసి ఓరచూపు.. చీపురు నెత్తిమీద టపీ టపీ మొత్తుతూ మా తాతకేసి ఓ విసురు చూపు చూస్తుంది .. ఆ తర్వాత దండకం అందుకుంటుంది, తిరిగి ఏమీ అనే హక్కు మాకు లేనందువల్ల , బుర్ర గోక్కుని లోపలకి పోయేవాళ్ళం !!

 

ఆ తుడుపులో కాలనివి తీసి అరుగుమీద పెట్టదు సరికదా వీధిలోకి తీసుకెళ్ళి చెత్తకుప్ప మీద పోస్తుంది .. ఓ వారం తర్వాత మా గ్రామ హెల్పర్ సత్తెమ్ బీడీ వెలిగించుకుని ,మిగిలిన నిప్పుని కుప్పకి అప్పిస్తాడు, శీతాకాలం ఎండకి బాగా రెడీ అయిన కుప్ప పేలి ఎదురుగ్గా ఉన్న అన్నారం ఇంట్లోకి రెండు, ఓరు వాకిలిగా వేసిన అనంత గుమ్మంలోకి ఓ అరడజను జువ్వలు దూరుతాయ్...

 

అప్పుడు మొదలవుతుంది దీపావళి ... పళ్ళాలు గారో !!  అంటూ వీసా దొరికిన టెర్రరిస్టులా ఇంట్లోకి దూసుకొచ్చి గొడవ మొదలెడుతుంది మా అన్నారం, అప్పటివరకూ లోపల అణచిపెట్టుకున్న కోపం గ్యాస్ ఓపెన్ చేసిన గోళిసోడాలా పేలి ఊరంత నోరు చేసుకుని అరవడం మొదలెడుతుంది మా పళ్ళాలు... మేమొక్కళ్ళమే దీపావళి చేసుకున్నట్టు మాకేసి చూస్తూ..  " బామ్మర్ల లోన చేత్తన్నావ్ చెత్త బయట పడేనీకి బుద్ధిలేదు? " అంటూ మా వంకేసి తిట్టడం స్టార్ట్ చేస్తుంది అన్నారం , నువ్వెవత్తివే మా ఓళ్ళని తిట్టడానికి అన్నారం గారూ అంటూ ఆ హడావుడి లో పెద్ద మేష్టారు అనబడే మా తాతని, వాళ్ళ తాతని కూడా ఆవాహయామి అని అష్టోత్తరం చదివేస్తుంది , ఓ గంట వాదోపవాదాలయ్యాకా అటు-ఇటు తిరిగి ఆఖరుకు ఈ అమ్ములు గారే అన్ని అనర్థాలకి కారణం అని తేల్చిపారేస్తుంది.

 

ఇంత పెద్ద గొడవలో కాసేపు మీరు, కాసేపు ఒసేయ్ అనుకుంటూ పురావస్తు తవ్వకాలు మొదలుపెడతారు ..పళ్ళాలు మానేస్తే తాను మా కొలువులో చేరాలని అన్నారం ఆశ, చచ్చి దెయ్యమైనా సరే ఈ కొలువు మానను అని పళ్ళాలు, దాచ్చారంలో కిక్ స్టార్ట్ చేసిన కథ మా అబ్బాయి ఆదిత్య గాడి నలుగు స్నానాల వరకూ ప్రయాణిస్తుంది , కార్తీకదీపం సీరియల్ 100 ఎపిసోడ్స్ లో లేని ట్విస్టులన్నీ వీళ్ళ సింగిల్ ఎపిసోడ్ లో ఉంటాయి.

 

ఓ పదేళ్ళ క్రితం ఇలానే మా వీధిలో మొదలైన గొడవ మొత్తం పనమ్మాయిల మిత్ర సంఘం వరకూ పాకి ఒక ఉద్యమం లేచింది..పర్యవసానం మాకు పనిష్మెంట్ అయింది, రిబ్బన్ కటింగ్ చేసినవాడే హెయిర్ కట్ చేయాలనే నియమం పెట్టింది మా పళ్ళాలు!! ఇకపై దీపావళి మర్నాడు తుడుపులు దగ్గరుండి తుడిపించేటట్టు, పేలనివి నేను, నా అనుచరులు ఏరి జార్త పెట్టేటట్టు.... , చచ్చిన్ది గొర్రె అనుకుని, మేము కూడా ఓ చీపురు అందుకుని అటో తుడుపు ఇటో తుడుపు వేయడం అలవాటు చేసుకున్నాం!!

 

ఈ మధ్య డెబ్భైయ్యె 'పది'లో పడిన మా పళ్ళాలు , కాలునొప్పి అనే ఒక వంక పెట్టి వాకిలి ఊడ్పులు అనే పనికి స్వస్తి చెప్పింది, ఊరంతా ఒంటికాలిమీద పరుగెత్తే పళ్ళాలు, మా వీధి మొగ పొగడ చెట్టుకి వచ్చేసరికి కుంటుతూ నడుస్తుంది .. ఓనాడు... గిన్నెకొక ఊరి కథ చెప్పాకా మా సదరు రాణి గారిని అడిగా  " పొగడ చెట్టు మీదేమైనా దెయ్యం ఉందా పళ్ళాలు ? " అని ..

 

నేదమ్మా ? అయినా రాములోరి గుడి ముందు సెట్టది, దెయ్యానెందుకుంటాయ్ ? ఏఁ ? అంది...

 

అబ్బే ఏం లేదు,నీ .... కుంటడం అనే ప్రక్రియ.... పొగడచెట్టు నుంచే మొదలవుతుంటేనూ...అని సాగదీసి ..అన్నాను !!

 

కాసేపు నాకేసి ఎగాదిగా చూసి...

ఎలా భరిస్తున్నారమ్మా నిన్ను? అంది !!

 

ఇన్నాళ్ళు లోపల అనుకునేది బయటే అనేసింది.

 

 

సమాప్తం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...