4, నవంబర్ 2020, బుధవారం

ఆదివారము రచనలు, పుస్తక సమీక్షలు, 01.11.2020

 


తేటగీతి

కోపమెపుడు జూపవలదు కొల్లగాను;

కూర్మి నెపుడు జూపవలదు కొదువగాను;

విషయమరసి భావమ్మును వెల్లడించు;

మాననీయుల మాటను మరువకెపుడు!

 

ఆంధ్రులంతా కలసి ఆరాటపడుచున్న

ఆంధ్ర రాష్ట్రము కొరకు త్యాగము ఒనరించి

అశువులు బాసెను కాదా అమరజీవి

అతడేంత ధన్యుడో, ఆంధ్ర మాత ముద్దు

బిడ్డడు, ఆంధ్రులందరు కలసి తెలుపరా

నివాళి ,ఆంధ్ర మాత ఎంతో సంతసించు.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి "జోహార్"

 

బి.వి శాస్త్రి తెలుగు తేనియలు

 

 

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా

తేటగీతి మాలిక:

పొట్టి శ్రీ రామ!నీ భిక్ష ( బుట్టి నట్టి

తెలుగు రాష్ట్రము నందున తెలుగుకు తగు

నాదరణ కరువై పోయె నమర జీవి!

రెండుగా బ్రద్ధలయ్యెలే నిండు కుండ

వ్యర్ధమగు చుండెనా? నీదు త్యాగమంత

తెలుగు నకు పూర్వ వైభవ దీప్తి రగుల

శక్తి చూపుట మరచిన జాతియందు

తెలుగు రక్షకై ఉద్యమ దీక్ష పెంచు.

 

డి.రామ నాగేశ్వరరావు తెలుగు తేనియలు

 

 

 నా భాష తెలుగు. నేను తెలుగు వాడిని. చాల గొప్ప చరిత నా తెలుగు తల్లిది.

11 శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభార తం తెలుగులోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు.

 

తెలుగదేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

యెల్ల నృపులు గొలువ యెఱుగవే బాసాడి

దేశభాషలందు తెలుగు లెస్స.

 

 (శ్రీకృష్ణదేవరాయలు)

కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు.

 

బమ్మెర పోతన (1450–1510) గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు.

 

 శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

 

పోతన కవిత్వములో భక్తి, మాధుర్యము, తెలుగుతనము, పాండిత్యము, వినయము కలగలిపి ఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది ఎలా చూచినా అతిశయోక్తి కానేరదు. భావి కవులకు శుభము పలికి రచన ఆరంభించిన సుగుణశీలి ఆయన. డా. సి.నారాయణరెడ్డి గారి వ్యాసము భక్తి కవితా చతురానన బమ్మెర పోతన తెలుగు సాహిత్యములో పోతనగారి విశేష స్థానాన్ని వివరిస్తుంది.

 

బాలరసాలసాలనవపల్లవ కోమల కావ్యకన్యకం

గూళలకిచ్చి యప్పడుఁపు గూడు భుజించుటకంటె సత్కవుల్

హాలికులైననేమి గహనాంతరసీమలఁ గందమూల కౌ

ద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషనార్థమై.

 

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె

ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా

యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ .

 

శారద నీరదేందు ఘనసార పటీర మరాళమల్లికా

హారతుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం

దార సుధాపయోధి సితతామరసామర వాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడుకల్గు భారతీ!!

 

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వూవునే మదనములకు

నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు

లలిత రసాల పల్లవఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు

పూర్ణేందు చంద్రికా స్ఫురిత చాకోరకంబరుగునే సాంద్రనీహారములకు

అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పానవిశేషమత్త

చిత్తమేరీతి నిరతంబు జేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయనేల!

 

ఇందుగలండందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి! వింటే.

 

కలడందురు దీనులయెడ కలడందురు పరమ యోగి గణముల పాలన్

కలడందురన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడో లేడో.

 

లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యె బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువులున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్

రావే యీశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!

 

అలవైకుంఠ పురంబులో నగరిలోనామూల సౌధంబు దా

పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో

త్పలపర్యంకరమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై.

 

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే

పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డాకర్ణికాం

తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో

పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

 

ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంబుపై

పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న

ర్యాదం జెందు కరంబు క్రిందగుట మీదై నాకరంబుట మేల్గాదె రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నా పాయమే?

 

ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపై

నంతై తోయదమండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై

నంతై చంద్రునికంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై

నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్దియై.

 

హరియను రెండక్షరములు హరియించు పాతకంబు నంబుజనాభా

హరి నీ నామస్మరణము హరి హరి పొగడంగ తరమె హరి శ్రీకృష్ణా !!

 

విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి.

 

 అంత ప్రఖ్యాతి గాంచిన వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించాడు. వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు.

 

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను

సజ్జనుండు పలుకు చల్లగాను

కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా

విశ్వదాభిరామ వినురవేమ.

 

అనగననగరాగ మతిశయించునుండు

తినగ తినగ వేము తియ్యనుండు

సాధనమున పనులు సమకూరు ధరలోన

విశ్వదాభిరామ వినుర వేమ.

 

బహుజన ప్రియమైన శతాకాలలో సుమతీ శతకం (sumathi Satakam) ఒకటి. ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పద్యలు తెలియని తెలుగువారు అరుదు.

 


 

 

సిరి దా వచ్చిన వచ్చును

సలలితముగ నారికేళ సలిలము భంగిన్

సిరి దాఁ బోయిన బోవును

కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!

 

వినదగు నెవ్వరుచెప్పిన

వినినంతనె వేగపడక వివరింపదగున్

కనికల్ల నిజము దెలిసిన

మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!

 

బలవంతుడ నాకేమని

పలువురితో నిగ్రహించి పలుకుట మేలా

బలవంతమైన సర్పము

చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!

 

పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా

పుత్రుని కనుగొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

 

తన కోపమె తన శతృవు

తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ

తన సంతోషమె స్వర్గము

తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!

 

అక్కరకు రాని చుట్టము

మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా

నెక్కినఁ బారని గుర్రము

గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!

 

శ్రీనాథుడు 15 శతాబ్దమున జీవించాడు. వీరు కొండవీటి ప్రభువు సర్వజ్ఞసింగ భూపాలుని ఆస్థాన కవి. విద్యాధికారి. కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించారు. శ్రీనాధుడు కొండవీటి రెడ్డి రాజు ప్రోలయ వేమభూపతి ఆష్థానం వాడని ప్రసిద్ధి.

శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ఆయన వ్రాసిన ఒకటి రెండు చాటువులనైనా చెప్పుకోకపోతే విషయానికి సమగ్రత చేకూరదు. మచ్చుకి దిగువ పద్యాలూ అవధరించండి.

 

కుల్లాయుంచితి, కోకసుట్టితి, మహాకూర్పాసమున్ బెట్టితిన్,

వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా

చల్లాయంబలి ద్రావితిన్, రుచులు దోసంబంచు పోనాడితిన్,

తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్

 

రసికుడు పోవడు పల్నా

డెసగంగా రంభ యైన నేకులె వడుకున్

వసుధేశుడైన దున్నును

కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్

అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లే

దంగన లింపు లేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై

భంగపడంగ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె

న్నంగను సున్న గాన బలనాటికి మాటికి బోవ నేటికిన్

 

గరళము మ్రింగితి ననుచుం

బురహర గర్వింపబోకు పో పో పో నీ

బిరుదింక గానవచ్చెడి

మెరసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ

 

సిరిగల వానికి జెల్లును

దరుణుల పదియారు వేల దగ బెండ్లాడన్

దిరిపెమున కిద్ద రాండ్రా

పరమేశా గంగ విడుము పార్వతి చాలున్

 

కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితాలోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య రామదాసు (కంచెర్ల గోపన్న) వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.

 

తెలుగు బాష సంగీతానికి అనువైన అజంత బాష. తెలుగు ఆజన్మ సంగీత కవచకుండలాలతో భాసించింది. సంగీత కళారాధనలో మన తెలుగు వారికి కలసి వచ్చిన గొప్ప అదృష్టం మన మాతృ బాష తెలుగు. తెలుగు బాషలో వచనానికి కూడా సంగీత సాహచర్యం ఉంది. తెలుగు పాటలో, పధ్యములో సంగీత సాహిత్యాలు గంగాయమున వలే సంగమించి ఉంటాయని సహృధయులందరికీ విదితమే. పధ్య కవిత్వంతో పాటు తెలుగు బాషలో వెలసిన పాటలు, స్త్రీల పాటలు, గేయాలు, కీర్తనలు, మరి ఇతర బాషల్లోనూ లేవు.

 

 రామధాసు కీర్తనలు తెలుగు దేశమంతా వ్యాపించాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు ముప్పై రెండు వేల కీర్తనలు రచించాడు. తెలుగు వారి కళాభినివేశమునకు, మూర్తీభవించిన పారాకాష్ట త్యాగరాజు.

 

త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి.

 

 శ్రీత్యాగరాజస్వామి. రామభక్తా మృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు.

 

 త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.

 

తరిపి వెన్నెల! ఆణిముత్యాల జిలుగు

పునుగు జివ్వాజీ! ఆమని పూల వలపు

మురళి రవాళులు! కస్తూరి పరిమళములు

కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు బాషఅని నండూరి వారు అన్నారు.

 

గాంధీజీ 1938 లో తన హరిజన పత్రికలో బాలబాలికలకు ఆంగ్లము ద్వారా విధ్యాబోధన చెయ్యడాన్ని తప్పు పట్టారు.

 

 నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృబాష వల్లనే వస్తుందని, స్వబాషలో విధ్య ఉంటే, మనకు స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదనిగాంధీజీవ్రాశారు.

 

 మాతృబాషలో విధ్యాబోధన వల్ల మనసులు చురుకుగా పనిచేస్తాయని, రవీంధ్రుడు అన్నాడు.

 

మాతృబాషలో  విధ్యాబోధన వల్ల గ్రహణ సామర్ధ్యం పెరుగుతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు.

 

మాతృబాషలో విధ్యాబోధన వల్ల విధార్ధులలో సృజనాత్మకత పెరుగుతుంది”.

మాతృబాష తల్లి పాల వంటిది. పరబాష పోతపాల వంటిది.” అని కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్న మాట సత్యము.

 

అమ్మపాలు విషమని ఎంగిలి పాలకై

అర్రులు చాస్తుంటే కుమిలి ఏడుస్తున్నది నా తెలుగు తల్లి

నాడు పూల పానుపు, నేడు ముళ్ల పందిరి,

రానున్న కాలం తలుచుకుంటున్నది నా తెలుగు తల్లి

తెనుగు తనము పోయింది

పరభాషా పోకడలు గతులు తప్పగా

నా తెలుగు తల్లికి ముప్పు తప్పదా?

 

ఎం.గోపాలాచార్యులు కవిత ఈనాటి పరిస్థితి ని అద్దం పడుతోంది.

 

తరతరాల భాష మనందరి భాష ముద్దుగారే భాష రాజకీయాలకతీతంగా మతాలకతీతంగా కులాలకతీతంగా ఆదరణ పొందుతుందా ! కాలమే సమాధానం చెప్పాలి .

 

... నాడే నిజమైన తెలుగు రాష్ట్రావతరం ....జై తెలుగు తల్లీ !!జై తెలుగు తల్లీ !!! !!!తెలుగు భాష పునర్వవైభం కోరుకునే ...

 

P. రాజ్ కుమార్

 

విష్ణుప్రియ తెలుగు తేనియలు


 

 తెలుగు భాష, తెలుగు  సాహిత్యం మరుగున పడుతున్న రోజుల్లో,

తెలుగు భాషా సాహిత్యం ఆస్వాదించే సమూహం ఉందని తెలిసి ఒక తెలుగు భాషాభిమానిగా మిగుల సంతసించితిని.

సమూహంలో నేను సభ్యునిగా చేరినందుకు నాకు ఎంతో ఆనందదాయకం.

అయితే నేను తెలుగు భాషాభిమానినే కానీ, నాకు సాహిత్యం పైన పటుత్వం లేదు.

 

అందువల్ల నేను ఇందులో  పూర్తి స్థాయిలో పాల్గొనలేక పోతున్నందుకు చింతిస్తున్నాను.

అయినా ఇంతమంది సాహితీ ప్రియులను చూస్తూ సమూహంలో మీరు అందిస్తున్న తెలుగు భాషా పరిజ్ఞానాన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తూ చాలా గర్వపడుతున్నాను.

మన మాతృభాషకు ఇంత ఆదరణ ఉందని సమూహంలో చేరిన తర్వాతే తెలిసి ముగ్ధుడనయ్యాను.

దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన సాహితీ సమరాంగణా సార్వభౌములు శ్రీకృష్ణదేవరాయలవారు.

ఇంతమంది తెలుగు సాహితీ ప్రియులను చూసిన తర్వాత తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి జీవం ఎప్పటికైనా సజీవంగా ఉంటుందనే నమ్మకం మీరందరూ నాకు కలిగించారు.

ముఖ్యంగా  శ్రీ కస్తూరి శివ శంకర్ గారు సాంకేతిక రంగంలో(మెకానికల్ ఇంజనీయర్ గా) పనిచేస్తున్ననూ తెలుగులో, తెలుగు భాషలో, తెలుగు సాహిత్యంలో ఇంత మాధుర్యాన్ని తెలియజేస్తూ అందరినీ అలరిస్తూ ఉన్నారని తెలిసి నాకు మరింత ఆనందం కలిగింది.

సమూహంలో నన్ను సభ్యునిగా చేర్చిన ఒకప్పటి మా సహోద్యోగులు కస్తూరి శివ శంకర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు.

సమూహ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు.

 

ధన్యోస్మి,   భవదీయుడు,

రత్నాకరం రాజు తెలుగు తేనియలు


 

 

నేడు దేవులపల్లి వారి జయంతి సందర్భంగా  దేవులపల్లి వారి అత్యద్భుతమైన భావనా తరంగం

 

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

అనే జాతీయం ఆధారంగా కురిసిన అమృతం..

 

కల విహంగమ పక్షముల తేలియాడి

తారకామణులలో తారనై మెరసి మాయమయ్యెదను

నా మధుర గానమున నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

 

మొయిలు దోనెలలోన పయనంబొనర్చి మిన్నెల్ల

విహరించి మెరపునై మెరసి పాడుతు చిన్కునై

పడిపోదు నిలకు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

 

తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ

తెలిమబ్బు జతగూడి దోబూచి సరసాలనాడి

దిగిరాను దిగిరాను దివినుండి భువికి

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

 

తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ

జతగూడి దోబూచి సరసాలనాడి దిగిరాను దిగిరాను

దివినుండి భువికి నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

 

శీకరంబులతోడ చిరుమీలతోడ నవమౌక్తికములతో

నాట్యమ్ములాడి జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

 

పరువెత్తి పరువెత్తి పవనునితోడ తరుశాఖ

దూరి పత్రములను జేరి ప్రణయ రహస్యాలు

పల్కుచునుందు; నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

 

అలరుపడంతి జక్కిలిగింత వెట్టి విరిచేడె

పులకింప సరసను బాడి మరియొక్క ననతోడ

మంతనంబాడి వేరొక్క సుమకాంత వ్రీడ బోగొట్టి

క్రొందేనె సోనల గ్రోలి సోలుటకు పూవు పూవునకును

పోవుచునుందు; నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

 

పక్షినయ్యెద చిన్ని ఋక్షమయ్యెదను

మధుపమయ్యెద చందమామనయ్యెదను

మేఘమయ్యెద వింత మెరపునయ్యెదను

అలరునయ్యెద చిగురాకునయ్యెదను

పాటనయ్యెద కొండవాగునయ్యెదను

పవనమయ్యెద వార్ధిభంగమయ్యెదను

 

ఏలకో యెప్పుడో యెటులనో గాని

మాయమయ్యెద నేను మారిపోయెదను.

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు ?

 

 

ఆంధ్రా షెల్లీ... దేవులపల్లి...

 

మనసున మల్లెలమాలలూగితే రేయంతా హాయి నిండుతుందా? మావిచిగురు తింటే కోయిల ఎలా పాడుతుంది? అచ్చంగావచ్చే వసంతరాత్రిలో శృంగార గరిమ ఎలాగుంటుంది? గగనసీమలో స్వేచ్చగా విహరించే మేఘం ప్రేమ సందేశాన్ని ఎలా మోసుకొస్తుంది? ప్రియుని జాడ ఎలా తెలుసుకుంటుంది? మనసు తెలిసిన మేఘమాలది జాలిగుండె కాదా? సఖియ రాకుంటే వసంతమాసం ఆగుతుందా?

 

మోయలేని హాయిని ఒక్క క్షణం మోయలేదా? ఆకాశపందిరిలో పెళ్లిజరిగితే దేవతలు పురోహితులుగా, అప్సరసలు పేరంటాళ్లుగ రావడం సాధ్యమా?... వీటన్నిటికీ సమాధానాలు దేవులపల్లి కృష్ణ శాస్త్రి భావ కవితలే. మీగడ తరకల్లాంటి జుబ్బా, పంచెకట్టు, ఉత్తరీయం, బంగారు రంగు శరీరం, వెండి గిరజాల జుట్టుతో భావకవితా ప్రపంచానికి చక్రవర్తిలా, తన కవిత్వంలాగే అందంగా భాసిల్లిన పదనిర్దేశకుడు. వర్షం వచ్చేముందు వీచే చల్లనిగాలి తెమ్మెర తనువును తాకితే ఎంత పులకరిస్తామో, కృష్ణశాస్త్రి కవిత వింటుంటే అదే పులకరింత వీనుల విందుగా వస్తుంది.

 

భావ కవిత్వానికి సినిమా పాటల ద్వారా ఒక శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చేసి, దిశానిర్దేశం చేసిన అతి కొద్ది మంది కవులలో కృష్ణశాస్త్రి ముందుంటారు. సినిమాలకు ప్రత్యేకించి అయన రాసిన పాటలు తేనెలూరే తెలుగుదనంతో పరిమళాలు వెదజల్లుతాయి. శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం కవితా సంపుటికి చలం యోగ్యతాపత్రం రాస్తూకృష్ణశాస్త్రి తన బాధని అందరిలో పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు.

 

కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ... ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధఅని రాశాడు. అయితే శ్రీశ్రీ తను కృష్ణశాస్త్రి కవితా శైలినే అనుకరించేవాడిని అని చెప్పుకున్నాడు. ‘తెలుగు దేశపు నిలువుటద్దం బద్దలైంది. షెల్లీ మళ్లీ మరణించాడుఅంటూ కృష్ణశాస్త్రి చనిపోయిన రోజున శ్రీశ్రీ రోదించాడు. కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ స్పందిస్తూఒక్క షెల్లీ యే కాదు, కీట్స్, వర్డ్స్‌వర్త్‌ వంటి మహాశయుల సంయుక్త స్వరూపం కృష్ణశాస్త్రిఅన్నారు. అటువంటి కవిపుంగవుడు దివికేగి సరిగ్గా 24 ఫిబ్రవరి నాటికి 40 యేళ్ళు. ఇన్నేళ్లయినా దేవులపల్లి కవితలు, సినిమా పాటలు నేటికీ నిత్యనూతనంగా వినిపిస్తూనే, కనిపిస్తూనే వున్నాయి. కృష్ణశాస్త్రి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకాలను కొన్ని గుర్తుతెచ్చుకుందాం...

 

వికసించిన సాహిత్యాభిలాష...

 

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గరలో వుండే చంద్రపాలెంలో నవంబరు 1, 1897 కృష్ణశాస్త్రి జన్మించారు. రోజుల్లో దేవులపల్లి సోదరకవులు (సుబ్బారాయ శాస్త్రి, వెంకట కృష్ణశాస్త్రి) పిఠాపుర సంస్థానంలో విద్వత్కవులుగా వుండేవారు. వారిలోతమ్మనశాస్త్రిగా వాసికెక్కిన వేంకట కృష్ణశాస్త్రి దేవులపల్లి తండ్రి. వీరి ఇంటిలో నిరంతరం సాహిత్య గోష్టి జరుగుతూ వుండేది. వాతావరణంలో పెరిగిన కృష్ణశాస్త్రి పదవ యేటనేనందనందన ఇందిరానాథ వరదాఅనే పద్యం రాశారు. సాహిత్యకృషి సల్పుతూ తన పదహారవ యేటనే అష్టావధానం నిర్వహించిఓహోఅనిపించుకున్నారు.

 

పాఠశాల విద్యాభ్యాసం పిఠాపురంలో పూర్తిచేసి 1919లో కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలో ఇంటర్మీడియట్‌ విద్యను, బి. డిగ్రీని విజయనగరం కళాశాలలోను చదివారు. విద్యార్థి దశలోనే గిడుగు రామమూర్తి పంతులు వ్యావహారిక భాషావాదం, బ్రహ్మ సమాజ ఉద్యమ ప్రభావం కృష్ణశాస్త్రి మీద ప్రబలంగా ఉండేవి. పెద్దాపురం మిషనరీ పాఠశాలలోను, కాకినాడ పి.ఆర్‌. హైస్కూలులోను ఉపాధ్యాయునిగా పని చేశారు. అలాగే తెలుగు ట్యూటర్‌గా పి.ఆర్‌.కళాశాలలో కూడా పనిచేశారు. ‘జయము జ్ఞాన ప్రభాకరా జయము క్రాంతి సుధాకరాఅనే ప్రార్థనా గీతాన్ని బ్రహ్మ సమాజం కోసం రచించారు.

 

అప్పుడే సాహితీ వ్యాసంగం కొనసాగిస్తూజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి, జయజయజయ శత సహస్ర నరనారీ హృదయనేత్రిఅనే దేశభక్తి గీతాన్ని పాఠశాల విద్యార్థుల కోసం రాశారు. వాశిలో విశ్వకవి రవీంద్రునిజనగణమన అధినాయక జయహేఅనే మన జాతీయగీతం కన్నా ఏమాత్రం తక్కువగా అంచనా వేయజాలని అద్భుత దేశభక్తి ప్రార్థనా గీతమిది. ‘జయజయ సుశ్యామల సుస్యామచల చేలాంచల... జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల... జయ మదీయ హృదయాశయ లక్షారుణ పదయుగళా... జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయగాయక వైతాళిక గళ విశాలపథ విహరణ... జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణఅంటూ భారతమాత దేవభూమికి జయం పలుకుతూ సాగే ప్రార్థనాగీతానికి స్వాతంత్య్రోదమ సమయంలో వింజమూరి అనసూయాదేవి బాణీ కట్టింది.

 

1920లో వైద్యం కోసం బళ్లారి వెళ్ళినప్పుడు ప్రకృతి శోభను ఆస్వాదిస్తూకృష్ణపక్షంఖండకావ్యాన్ని రచించారు. 1922లో భార్య రాజహంస కాలం చెయ్యడం కృష్ణశాస్త్రిని బాధించింది. అప్పుడే కరుణాత్మకమైన కవితలు రాశారు. వాటిలోకన్నీరుఅనే ఖండకావ్యాన్ని ఉదహరించాలి. తరువాత పునర్వివాహం చేసుకొని భావ కవితోద్యమ సారధ్యం వహిస్తూ దేశమంతటా తిరిగారు. పిఠాపురంలో హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొంటూ వుండడంతో బంధువర్గం కృష్ణశాస్త్రిని వెలివేసింది. 1929లోఊర్వశి, ‘ఆత్మాశ్రయత్వం, ‘ఊహాప్రేయసి, ‘ప్రవాసమువంటి కవితలతో పుస్తకాలు ప్రచురించారు. అదే సంవత్సరం విశ్వకవి రవీంద్రునితో పరిచయమైంది. 1941 వరకు కాకినాడ కళాశాలలో పనిచేశారు.

 

 ‘అమృతవీణవంటి గేయ మాలికలు, ‘అమూల్యాభిప్రాయాలువంటి వ్యాసావళి, ‘బహు కాలదర్శనం, ‘ధనుర్దాసువంటి నాటికలు, ‘మంగళకాహళివంటి దేశభక్తి గీతాలు, సంగీత రూపకాలు రచించారు. కృష్ణశాస్త్రికి బెజవాడ గోపాలరెడ్డి అత్మీయమిత్రులు కావడంతో ఆయనను వాహినీ పిక్చర్స్‌ అధినేత బి.ఎన్‌.రెడ్డికి పరిచయం చేశారు. చలనచిత్ర రచన చేయమని బి.ఎన్‌.రెడ్డి కృష్ణశాస్త్రిని పలుమార్లు కోరినా ఆయన అంత ఆసక్తి చూపలేదు. చివరికి బి.ఎన్‌.రెడ్డి, కృష్ణశాస్త్రిని మద్రాసుకు మకాం మార్చేలా చేశారు.

 

 

చలనచిత్ర రంగప్రవేశం...

 

వందే మాతరంషూటింగు కోసం బి.ఎన్‌.రెడ్డి హంపికి వెళ్ళారు. శ్రీకృష్ణదేవరాయలు మీద వున్న ఆరాధనాభావంతో బి.ఎన్‌.రెడ్డి కృష్ణదేవరాయల నేపథ్యంలో సినిమా నిర్మించాలని ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. రచయిత బుచ్చిబాబు రాసినరాయల కరుణకృత్యంనాటిక, ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో వచ్చిన కథను సమన్వయం చేస్తూ ఒక కథ అల్లారు. కథను కృష్ణశాస్త్రి అభివృద్ధి చేసి, స్క్రిప్టు తయారు చేశారు. మల్లీశ్వరి నాగరాజు ముందు ప్రదర్శించిన నృత్యగానాలను మారువేషంలో ఉన్న రాయలు, అల్లసాని పెద్దన చూసినప్పుడు అల్లసాని మల్లీశ్వరిని ఆశువుగా పద్యంలో మెచ్చుకునే సన్నివేశం వుంది.

 

అల్లసానివారి అల్లిక జిగిబిగి అనే నానుడి వుండడంతో, అదే ధోరణిలో పద్యం రావాలని చెప్పి బి.ఎన్‌.రెడ్డి కృష్ణశాస్త్రి చేత వంద పద్యాలు రాయించి అందులోంచిభళిరా ఎన్నడు జారె నీభువికి రంభా రాగిణీ రత్నమేఖలయో నిర్జర వల్లభ ప్రియవధూ కంఠస్రవథ్ధామమో...’ అనే పద్యాన్ని ఖరారు చేశారు. చిత్రీకరణ విషయంలో బి.ఎన్‌.రెడ్డి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. దేవులపల్లి మాటలతోబాటు, ఇందులో రాసిన పాటలన్నీ విశేషంగా జనాదరణ పొందాయి. పాటలన్నీ కథా సంబంధంగా రాసినవి కావడం విశేషం. సినిమాలో కథాంశాలైన ప్రణయం, అనురాగం, విజయనగర వైభవం, వేదన వంటి కోణాల్లో పాటలు రాశారు కృష్ణశాస్త్రి. 1951లో విడుదలైన చిత్రం గొప్ప క్లాసిక్‌గా సంచలనం సృష్టించడంతో, కృష్ణశాస్త్రి ఉత్తమ శ్రేణి సినీకవిగా గుర్తింపు పొందారు.

 

తొలుత సినిమా రంగం మీద పెద్దగా ఆసక్తి లేకున్నా కొన్ని సినిమాలకు అద్భుతమైన పాటలు రాశారు. ‘నాయిల్లు’ (1953) చిత్రంలోఅదిగదిగో గగన సీమ, ‘బంగారుపాప’ (1954)లోయవ్వన మధువనిలో వన్నెల పూవులా ఉయ్యాలా; ‘భాగ్యరేఖ’ (1957)లోనీవుండేదా కొండపై నాస్వామి నేనుండేదీ నేలపై, ‘రాజమకుటం’ (1959)లోసడిసేయకో గాలి సడిసేయబోకేవంటి అద్భుతమైన పాటలు రాశారు.

 

అలా సినిమాలకు పాటలు రాస్తూనే, ఆకాశావాణికి రేడియో రూపకాలు రాసేవారు. దాంతో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలోప్రయోక్తగా చేరమని ఆహ్వానం అందింది. జెమినీ వాసన్, బి.ఎన్‌.రెడ్డి వంటి వారు ఒత్తిడిచేసి మద్రాసులోనే కొనసాగే ప్రయత్నం చేసినా కృష్ణశాస్త్రి ఆకాశవాణిలో చేరేందుకే మొగ్గుచూపారు. హైదరాబాదుకు వచ్చిన రోజుల్లోనే 1958లో కూతురు సీత మశూచి సోకి మరణించడంతో కృష్ణశాస్త్రి మరలా మద్రాసుకు మకాం మార్చారు. ఆకాశవాణిలో వుండగావిప్రనారాయణ, ‘క్షీరసాగర మథనంవంటి యక్షగానాలు అద్భుతంగా రాసి ప్రదర్శింపజేశారు.

 

విధి వక్రించి గొంతు మూగవోయి...

 

1964లో తిరుపతిలో అన్నమయ్య జయంతి ఉత్సవంలో కృష్ణశాస్త్రి పాల్గొన్నారు. అతని వెంట బాలాంత్రపు రజనీ కాంతరావు కూడా వెళ్ళారు. ఉపన్యాసం చదివేందుకు ఉద్యుక్తుడైన కృష్ణశాస్త్రి గొంతు బొంగురు పోయింది. దాంతో తన ఉపన్యాసాన్ని రజనీకాంతరావు చేత చదివించారు. వైద్య పరీక్షల్లో అది గొంతు క్యాన్సర్‌ అని నిర్ధారణ అయింది. మద్రాసులో కృష్ణశాస్త్రి స్వరపేటికను తొలగించారు.

 

స్వరపేటిక తొలగించిన తరువాత కృష్ణశాస్త్రి దాదాపు పదహారేళ్లు బ్రతికినా, మూగవోయిన కంఠంతోనే అనేక సినిమాలకు పాటలు, ఆకాశవాణికి లలిత గీతాలు రాశారు. ఎవరితోనైనా మాట్లాడాలన్నా, చెప్పాలన్నా కాగితం మీద రాసి చూపేవారు. కృష్ణశాస్త్రి పాటలు మనసు లోతుల్లోంచి వచ్చేవి. భావోద్వేగాలకు పెద్దపీట వేసేవారు. ‘మల్లీశ్వరితరువాత కృష్ణశాస్త్రిరాజీ నాప్రాణం, ‘నాయిల్లు, ‘రాజగురువువంటి కొన్ని చిత్రాలకు పాటలతోబాటు మాటలు కూడా రాశారు. తరువాత పాటలకు మాత్రమే పరిమితమయ్యారు.

 

కృష్ణశాస్త్రి రాసిన కొన్ని లలిత గీతాలు సినిమా పాటలుగా రూపొందాయి. వాటిలో... ‘బంగారు పంజరంచిత్రంలోపదములె చాలు రామా, ‘గట్టుకాడ ఎవరో, సెట్టు నీడ ఎవరో, ‘భక్తశబరిలోఏమి రామకథ శబరీ శబరీ ఏదీ మరియొకసారి, ‘రాక్షసుడుచిత్రంలోజయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి, ‘ఆనంద భైరవిచిత్రంలోకొలువైతివా రంగశాయిపాటలు కొన్ని మాత్రమే. కృష్ణశాస్త్రి 24 ఫిబ్రవరి 1980 మరణించిన విషయం తెలిసిందే. 1983లో ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావుమేఘసందేశంసినిమా నిర్మించి అందులో కృష్ణశాస్త్రి రాసిన మూడు లలిత గీతాలను ఉపయోగించుకున్నారు.

 

పాటలు బాగా పాపులర్‌ అయ్యాయి. అంతేకాకుండా దాసరిమేఘసందేశంచిత్రాన్ని కృష్ణశాస్త్రికి అంకితమివ్వడంతో చిత్రసీమలోని పలువురు సినీ పండితులు హర్షించారు. ‘ఆకులో ఆకునై పూవులో పూవునై, ‘ముందు తెలిసేనా ప్రభూ మందిరమిటులుంచేనా, ‘సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులోఅనేవిమేఘసందేశంచిత్రంలో వినియోగించిన లలితా గీతాలు.

 

అలరించిన కృష్ణశాస్త్రి పాటలు...

 

మల్లీశ్వరిచిత్రంలో పాటలు ప్రకృతి శోభను ప్రతిబింబించాయి. ముఖ్యంగాపరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి, ‘మనసున మల్లెలు మాలలూగెనే, ‘ఎందుకే నీకింత తొందరా, ‘నా ఇల్లుచిత్రంలోఅదిగదిగో గగనసీమ అందమైన చందమామ, ‘వచ్చేనమ్మా సంక్రాంతి పచ్చని వాకిట చేమంతివంటి పాటలు కోవలోకి వస్తాయి. కృష్ణశాస్త్రి రాసిన విరహగీతాలు అద్భుతాలే. ‘మల్లీశ్వరిలోఎడతానున్నాడొ బావా జాడ తెలిసిన పోయిరావా అందాల మేఘమాలా, ‘ఉండమ్మా బొట్టుపెడతాలోఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి, ‘కలసిన మనసులుచిత్రంలోఒక్క క్షణం ఒక్క క్షణం నన్ను పలకరించకు నావైపిటు చూడకుపాటలు చెప్పుకోవచ్చు. కృష్ణశాస్త్రి ఎన్నో ప్రణయ గీతాలు, భక్తి గీతాలు, విషాద గీతాలు కూడా రాశారు. వాటిలో కొన్ని పాటలు చెప్పాల్సివస్తే...

 

 

 

 

 

* మనసున మల్లెల మాలలూగెనే ఎంతహాయి రేయి నిండెనో (మల్లీశ్వరి)

* పిలచిన బిగువటరా ఔరౌర (మల్లీశ్వరి)

* నీవుండేదాకొండపై నేనుండేదీ నేలపై (భాగ్యర్వేఖ)

* రావమ్మా మహాలక్ష్మి రావమ్మా (ఉండమ్మా బొట్టుపెడతా)

* చుక్కలుపాడే శుభమంత్రం (కళ్యాణ మండపం)

* గోరింట పూచింది కొమ్మ లేకుండా (గోరింటాకు)

* ఆరనీకుమా దీపం కార్తీక దీపం (కార్తీకదీపం)

* పాడనా తెనుగు పాటా (అమెరికా అమ్మాయి)

* నాపేరు బికారి నా దారి ఎడారి (శ్రీరాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌)

* కుశలమా నీకు కుశలమేనా (బలిపీఠం)

* నేలతో నీడ అన్నది నను తాకరాదని (మంచిరోజులు వచ్చాయి)

* ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి (ఏకవీర)

* ఘనా ఘన సుందరా కరుణారస మందిరా (భక్త తుకారాం)

* ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా (జగత్‌ కిలాడీలు)

* ఊరకే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది (సంపూర్ణ రామాయణం)

* ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని (సుఖదుఃఖాలు)

* ఎవరు నేర్పేరమ్మ ఈకొమ్మకు (ఈనాటి బంధం ఏనాటిదో)

* మావిచిగురు తినగానే కోయిల పలికేనా (సీతామాలక్ష్మి)

* ఏమి రామకథ శబరీ శబరీ ఏదీ మరియొకసారి (భక్త శబరి)

*  గంగకెంత దిగులు గాలికెంత గుబులు (శ్రీరామ పట్టాభిషేకం)

* చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు (చీకటి వెలుగులు)

* మాట చాలదా మనసు చాలదా (మట్టిలో మాణిక్యం)

* పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా (బంగారు పంజరం)

* రానిక నీకోసం సఖీ రాదిక వసంతమాసం (మాయని మమత)

* అడుగడుగున గుడి వుంది అందరిలో గుడివుంది (ఉండమ్మా బొట్టుపెడతా)

 


కృష్ణశాస్త్రికి అనేక సన్మానాలు, ప్రశంసలు లభించాయి. 1976లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకపద్మభూషణ్‌అవార్డునిచ్చి గౌరవించింది. 1978లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. ప్రఖ్యాత వ్యంగ్యచిత్రకారుడు, సాహితీవేత్తబుజ్జాయికృష్ణశాస్త్రి కొడుకే. చందమామలోని చల్లదనాన్ని, మందారపువ్వులోని మకరందాన్ని, గుండెలోని ఆర్దత్రని రంగరించి రాస్తే అది కృష్ణశాస్త్రి పాటవుతుంది. పట్టు పరికిణిలో ఒదిగిన సింగారం కృష్ణశాస్త్రి పాట. ఆయన తెలుగు పదం అమ్మమ్మ చేతిలో నేతి నైవేద్యం.

 

ఆచారం షణ్ముఖాచారి

 

 

రమణీయ రజత తల్పంబునందు

చల్లగా నిద్రవోవు వ్రేపల్లెవాడ

సకల గోపాల గోపికా జనముతోడ.

 

సాము సడలిన పతి పరిష్వంగమందు

సుఖము దుఃఖము లేని సుషుప్తిలోన

స్వప్నవీథీ యథేష్ట సంచార కలన

మేను మరచిన న్నంత మేలుకొలిపె

శర్వరీ శీత పవన పక్షముల మలసి

స్వాదు యము నోర్మి సంగీత ఝరుల గలసి

కౌముదీధౌత శుభ్ర దిక్తటుల సొలసి

మురళికా మందమంద మాధురుల రుతులు.

 

ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల

బడిపోవు విరికన్నె వలపువోలె

తీయని మల్లె పూదేనె సోనల పైని

తూగాడు తలిరాకు దోనెలోలె

తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై

పరువెత్తు కోయిల పాటవోలె

వెల్లువలై పారు వెలది వెన్నెలలోన

మునిగిపోయిన మబ్బుతునకవోలె

 

చిరుత తొలకరివానగా చిన్ని సొనగ

పొంగి పొరలెడు కాల్వగా నింగి కెగయు

కడలిగా పిల్లగ్రోవిని వెడలు వింత

తీయదనముల లీనమైపోయె నెడద.

 

పరువు పరువున పోవు నెదతో

పరువు లెత్తితి మరచి మేనే

మరచి సర్వము నన్ను నేనే

మరచి నడిరేయిన్."

 

"ప్రాణనాయకు కౌగిలి పట్టు వదలి

యిల్లు వదలి యెన్నండు నీ పల్లె వదలి

యడుగిడని దాన; వా నాటి యర్ధరాత్రి

విజన పథముల బడి యెట్లు వెడలినావు?"

 

"తావులతోడ తేనియల

ధారల నిప్పిలు వేణుగీతికా

రావముతోడ మందగతులన్

జను మారుతముల్ విశాల బృం

దావన వీథులందు యమునా

నవభంగ మృదంగ వాద్యముల్

త్రోవ స్ఫురింపగా వలపు

తొందర వెట్టగ బోతి నొంటిమై.

 

సన్నని యెల్గెత్తి జాలిగా నెవరినో

యరయుమా! పిలుచుచున్నదియె యమున!

పక్ష నిర్జీవ ధావళ్యమ్ముతో నున్న

సికతాతలమ్ము గాంచితివె, దాని?

తుది మొదల్ లే దిదే త్రోవరుల్ త్రొక్కని

యీ దారినే పరువెత్తినాను!

మొండిచేతుల నెత్తి యీ వనతరుల్

శూన్యదృక్కుల దిశల్ చూచు నయ్యొ!

ఇచటనె, యిచటానే యత; డిచట నేను -

ఇచట నీ జాజిపూ బొదరింట నేను -

కడిమిచెట్టు క్రింద సుమ్మీ యతండు -

సరిగ కన్నుల గట్టిన సరణి దోచు.

 

శారద శర్వరీ మధుర చంద్రిక,

సూర్యసుతా స్రవంతికా

చారు వినీల వీచిక, ప్రశాంత

నిశా పవనోర్మి మాలికా

చారిత నీప శాఖిక, కృశాంగిని

గోపిక నేను, నాడు బృం

దా రమణీయసీమ వినినారము

మోహన వేణుగానమున్.

 

మలయ పవను కౌగిలిలోనె పులకరించి

హాయిగా కంఠ మెత్తు ప్రాయంపు వంశి

విశ్వమోహను జిలిబిలి పెదవు లంటి

యవశమై పోయి యేమి చేయంగ లేదు!

 

బాలగోపాలు బోలెడు పాటగాని

కని విని యెరుంగ మెన్నండు; కరములోని

మురళినే కాదు, నాలోని మ్రోడు టెడద,

నీ శిథిల జీవనమ్ము మ్రోయింప గలడు.

 

నందగోప కుమారు నానంద మురళి

కా మనోహర సుషి రాపగా తరంగ

జాలముల తారకా రవి చంద్రతతులు

కరగి చిని చిన్ని గీతులై కలసిపోవు.

 

చూవితివొ లేదొ చిన్ని కృష్ణుని సొబంగు?

పెదవి చివురు సంజల నరవిచ్చు నవ్వు

వెన్నెల, చలించు తుమ్మెద బెళుకు చూపు,

లోల పవన చాలిత కుటి లాలకమ్ము,

తరళ చూడా కలాపమ్ము, మురళి గూడి

యల్ల నల్లన గొంతెత్తి యమృతగాన

శీతల తుషారముల విరజిమ్ము వేళ

చిన్ని కృష్ణుని సొబగు చూచితివొ లేదొ?

లేవు శర త్తమస్వినులు

లేవు మనోజ్ఞ సుధాంశు మాలికల్

లేవు మదీయ గాత్ర లవలిం

బుల కాంకుర కోర కావళుల్

లేవు కుమారగోప మురళీ మృదుగీత ఝరీ విలాసముల్!

 

జిలిబిలి పట్టురేకుల వెన్న తొట్రిలు

మల్లియ యెద దాగు మధుప రవము

కనుచూపు దాటు నామని బాయు కోయిల

గొంతులో చిక్కు వసంతగీతి

విభు వీడి శుష్కించు విరహిణి సెలయేటి

కడుపులో నడగిన కడలి మ్రోత

రేనికై వెదకెడు రిక్కచూపుల లోన

చెరవడ నిండుచందిరుని పాట

 

యిట్టు లీ దీన గోపికా హృదయ మంది

రాంతరాళము లోన త్రుళ్ళింత లాడు

వేణు నాదంబు, వినిపించు విశ్వమోహ

నాకృతి కిశోరగాయకు నరయుచుంటి.

 

ఇది నా చరితము; విని నీ

వదరెదు తొట్రిలెదు వడకు దటు నిటు కనులన్

జెదరెడు చూపుల నేదో

వెదకెదు! ఎవ్వతెవు నీపవిటపీవనిలోన్?"

 

దేవులపల్లి కృష్ణశాస్త్రి

 

 

 

 

 

పుస్తకం : వేయి పడగలు

కవి : కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు 

 

వేయిపడగలు పుస్తక సమీక్షను ఇంతకు మునుపే సమీక్ష సామ్రాట్లు శివ గారు(ఏకవీర కూడా), వెంకట్ గారు అందించినప్పటికీ నా ప్రయత్నం సాహసమే అయినా వారి సమీక్ష ప్రభావంతోనే ఏకవీర, వేయిపడగలు కూడా చదివాను. అనుభూతిని, నచ్చిన అంశాలు  మీ అందరితో  పంచుకునే తపన మాత్రమే.

 

 క్లుప్తంగా.. కథానాయకుడు కవి, ధర్మవర్తనుడు  ధర్మారావు అనే పాత్ర , పాత్ర చుట్టూ అల్లుకున్న ఎన్నో పాత్రలు ఉపకథలు 900 పేజీల పుస్తకం. అప్పటి సామాజిక, రాజకీయ స్థితిగతులను, ప్రజల ఆలోచనా విధానాలను కళ్ళకు కట్టారు విశ్వనాథ్ వారు. ఆయన పదప్రయోగాలు, భాషా సున్నితంగా హృదయాన్ని స్పృశిస్తూ  చదువుతున్నంత సేపూ వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. చక్కని ఉపమానాలతో చేసే వర్ణనలు సందర్భానుగుణంగా దృశ్యాన్ని కళ్ళకు కడుతుంది.

 

 అప్పటి విద్యావిధానంలో క్రమేపీ కల్గిన మార్పులు కళాశాలలో ఉపద్యాయుడిగా పనిచేసే ధర్మారావు పాత్ర ఆధారంగా  చక్కగా విశదీకరించారు. స్నేహానికి పెద్ద పీట వేశారు. స్నేహితుల మధ్య చర్చలు, ఒక మోస్తరు వాదనలు ద్వారా రచయిత ఆయన అభిప్రాయాలను వెలువరించినట్లనిపిస్తుంది.

 

 విద్య ఏవిధంగా ఉండాలి అని చెప్తూ "మన పూర్వీకులే అన్నారు చదువుట, వ్రాయుట చదువు కాదు. హృదయ పరిపాకమును కలిగించునది చదువు. విద్య మోక్ష పర్యవసాయిని." అంటారు.

 

 నాగరికతను గురించి వివరిస్తూ " నాగరికత అనగా నియమము కలిగి యుండుట. మనసుకుకు నియమావలంబన చేత ఉత్తమయోగ్యత కలుగును. చదువుకోని వాడు మహా విషయము లందు అనాగరికమై ఉండును. ఆధ్యాత్మిక గౌరవం కలుగదు" అంటూ నాగరికతకు సిసలైన  అర్ధాన్ని తెలియ చేస్తారు.

 

 ముఖ్యంగా మన తెలుగు సాహిత్యానికి పాశ్చాత్య సాహిత్యానికి ఉన్న భేదాన్ని చక్కగా వివరిస్తారు. పాశ్చాత్య లోకం తన సంఘము ప్రతి నిమేష పరివర్తనముల  చేత గగ్గోలు పడుతున్నదనిఅనియత భావములు జలపాతముల వలె నిలిచి ప్రవహించలేక ఊర్ధ్వ తిరో గథో ముహుస్థానముల చేత ఘార్ధిల్లి పోవుచున్నదని, సిద్ధాంతమేదో, ఆదర్శ మేదో తెలియదనీ, ఒక నిలకడకు రాణి పరిస్థితుల నుండి బహుళ సమస్యలు పెంచుకుని, తత్సమస్యా పరిష్కారము కొరకు వేవిధముల వాఙ్మయమును వినియోగించుచున్నదని, ఇదే సరస్వతమ"ని ప్రశ్నిస్తారుషెల్లీ, కీట్స్, బెర్నా౦ డ్ షా  వంటి పాశ్చాత్య కవులను వారి సాహితీ ప్రక్రియలను  తెలుగు సాహిత్య ప్రక్రియలకీ ఉన్న బేధాన్ని, అలాగే రసము, భావము మధ్య బేధాన్ని వివరిస్తూ "మహాకవి అగుటకు రసమే ప్రధానం. రసము నేవారు సమృద్ధిగా పండించునో అతడే మహాకవి. భావము చిన్న పడియ అయితే రసము సముద్రము వంటిది అంటారు.

 

 ఇలాంటి అనేకనాక  మేధో చర్చలు ఆలోచింప చేస్తాయి.    సుబ్బన్న పేట అనే ఒక గ్రామం కాల క్రమంలో పట్టణంగా రూపొందే విధానం, అలాగే అక్కడ గుండేరు కి వరదలు సంభవించినప్పటి పరిస్థితిని వర్ణించే తీరు చదివి తీరాల్సిందే. నాతో పాటు మీరు చదివి అనుభూతి పొందాలని ఆశిస్తూ ఆసాంతం చదివినందుకు ధన్యవాదాలు.

 

వాణిశ్రీ నైనాల తెలుగు తేనియలు

 


 

వేయిపడగల పై వెయ్యి సమీక్షలు ఉన్నా మరొక సమీక్ష అవసరమా?

అవసరమే!!

 

మరల నిదేల రామాయణం బన్నచో,        

నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ

తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు,  

తన రుచి బ్రదుకులు తనివి గాన

చేసిన సంసారమే చేయు చున్నది,        

 

తనదైన అనుభూతి తనది గాన

తలచిన రామునే  తలచెద నేనును,        

నా భక్తి రచనలు నావి గాన

కవి ప్రతిభలోన నుండును గావ్యగత

తాంశములయందు తొంబదియైన పాళ్ళు...

ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి

రెట్లు  గొప్పది నవకథా దృతిని మించి

 

అల్లాడి మోహన్ తెలుగు తేనియలు


 

 

స్వేచ్చా సమర్పణ

 

నా  స్వీయరచన

జాతీయాలతో   భార్యాభర్తల మధ్య సంభాషణ

 

భార్య : ఏమండీ !

పొద్దున్నే  ఎక్కడికెళ్లారీయన?

ఎవరి  చెవిలో పూవుపెడుతున్నాడో.

 

భర్త : ఏమే  ! ఎందుకు

 చెవికోసినమేకలాగ అరుస్తున్నావు. నేను ఎక్కడికి

పోలేదు. వరండాలో కూర్చొని

పేపరు చదువుతున్నాను.

 

భార్య : మన రాధను చూసివెళ్లిన వారిగురించి కనుక్కోమని

 చెవిలోఇల్లుగట్టుకొని

మరీ చెప్తున్నాను. మీకు

ధ్యాసే లేదాయె. ఎప్పుడూ

 బెల్లంగొట్టినరాయి

లాగా ఉంటారు.

 

భర్త :అదిసరేగాని మా అక్కకొడుకు వున్నడుగదే.

 

భార్య :...... వున్నాడు లెండి మహా! వాడొక

 అచ్చేసినఆంబోతు  ఎప్పుడూ వూర్లు తిరుగుతుంటాడు. వాడు

 మేకపోతుగాంభీర్యం చూపుతాడేగాని, వాడిలో

ఏమీ పసలేదు.

 

భర్త : పొనీలేవే ! అందరికీ

 తలలోనాలుక  లాగా

మెలుగుతుంటాడుకదా.

 

భార్య : ఏమీ వద్దులే ఎంతచెప్పినా

 కుక్కతోకవంకరే  కదా !

వాడికి  చేతిలోచిల్లిగవ్వ

లేకపోయినా

 అరచేతిలోవైకుంఠం  చూపుతాడు. నాకు చెప్పకు

వాటిగురించి ఇక.

 

భర్త : సరేలేనాకు

 కడుపులోఎలుకలుపరుగెడుతున్నాయి    ఉపాహారం

పెట్టు.

 భార్య : అంతేలే ! మీకు

 కుండబద్దలుకొట్టినట్లు

మాట్లాడితే నచ్చదులే.

మీకు   తేనెబూసినకత్తి

లాంటివారు నచ్చుతారు.

మిమ్మల్ని పెళ్లిచేసుకున్నప్పుడే

అనుకున్నాను  మీదంతా

 ఆరంభసూరత్వం  అని.

 

భర్త  : సరెలేవే ! నీవు చెప్పినట్లే

చేస్తాను. నీకు దెప్పటం

 వెన్నతోపెట్టినవిద్య  కదా.

ఎప్పుడూ నువ్వు

 స్వర్గానికినిచ్చెనలు   వేస్తుంటావు.  

 

కొంత సేపటితరువాత...........

 

భార్యఏమండీ ! ఇప్పుడే

మన రాధను చూసినవాళ్లు

ఫోన్ చేశారండి. అని

 అంరాన్నంటిన సంబరంతో

పొంగిపోయింది.

 

భర్త కు గొంతులోవెలక్కాయ  పడినట్లు అయింది.

 

భార్యఏమండీ...  వినబడిందామీకూ?

భర్త  :  ... విన్నాలేవేఅయినా నాచేతిలో

 చిల్లిగవ్వ  గూడ లేదు.

ధరలు చూస్తే

 కొండెక్కికూర్చున్నాయి

ఇప్పుడు కరోనా గదా. కరోనా

తగ్గినతరువాత పెళ్ళిచేస్తామనిచెప్పు.

 

భార్య : అయ్యో ! నామతిమండ  ఇప్పుడు

కరోనా కదా . సరే నండి కరోనా తగ్గినతరువాత మాట్లాడుతామని చెపుతాను.

సంబంధమే ఖాయంచేసుకుందామని

 కొసమెరుపుగాచెప్పింది.     

  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...