ప్రహేళిక సంఖ్య- 33
ది.22.11.2020
గుఱ్ఱం జాషువా గారి రచనలు
1. జాషువా గారి స్వయంవరం కావ్య ముద్రణకు సహకరించిన వారెవరు?
జవాబు:
శాంతిస్వభావులు కళాప్రియులు, మదరాసు శాసన సభ్యులు శ్రీ మేడూరి నాగేశ్వరరావు గారు స్వయంవరం కావ్యాఖండిక విని సంతోషించి ముద్రణకు అవసరమైన సాయ మందించారు.
2. జాషువా రచించిన గుంటూరు మండలము నకు సంబంధించిన కథ పేరేమిటి? దానిలోని కథానాయకులు ఎవరు?
జవాబు:
గుంటూరు మండలము నకు సంబంధించిన కథ చిన్న నాయకుడు ఇందలి కథానాయకులు కన్నమ, చిన్ననాయకుడు.
జంతుబలులు చేసే దొంగ పూజారులను, మద్యపానమును, కోడి పందెములను, మెట్ట వేదాంతమును, దుర్వైద్యులను ఖండించి దేశమును హెచ్చరించ దలచి కొన్ని పాత్రలను సృష్టించి చిన్న నాయకుడు కథను జాషువా గారు వ్రాశారు.
3. జాషువా రచించిన ఇంటిగుట్టు ఇతివృత్తం ఏమిటి? (2 మార్కులు)
జవాబు:
ఇంటిగుట్టు ప్రధానంగా క్రైస్తవ మతము పుచ్చుకొని సఖ్యత లేని రెండు సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలను ఎత్తి చూపిస్తుంది. వారి మధ్య ఉన్న వైషమ్యాలు ప్రధాన ఇతివృత్తం గా ఇంటి గుట్టు ఖండికను జాషువా గారు వ్రాశారు
4. ఈ క్రింది పద్యము ఏ కావ్య ఖండిక లోనిది.
మగడు గొట్టిన రోదించి మానుకొన్న
పెద్ద గయ్యాళివలె వాన వెలసి పోయె
మమత లుడిగిన సన్యాసి మనసువోలె
గగనమండల మెల్ల నిష్కలుషమయ్యె
జవాబు:
స్వప్న కథ గా వ్రాయబడిన రెండు భాగములలో ద్వితీయభాగము- *అనాథ లోని పద్యము.
5. జాషువా మీద పరిశోధన చేస్తే మరగుజ్జు కూడా మహా వృక్షమౌతాడని ప్రశంసించిన ప్రముఖ కవివరేణ్యుడు ఎవరు?
జవాబు:
డా. సి.నారాయణ రెడ్డి గారు
6. జాషువా రచనల మీద పరిశోధన చేసి జాషువా పురస్కారం అందుకున్న వారెవరు?
జవాబు:
జాషువా పురస్కారాలు చాలా మందికి వచ్చినప్పటికీ
వారి రచనలు పరిశోధించి పుస్తకం వ్రాసిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ 2012 లో జాషువా స్మృతి పురస్కారం అందుకున్నారు.
7. శ్రీరామ చరిత్ర ఆధారంగా జాషువా రచించిన వచన గ్రంథం పేరేమిటి?
జవాబు:
పిల్లలమర్రి పినవీరభద్రుడు వ్రాసిన జైమిని భారతము మరియు పాపరాజు వ్రాసిన ఉత్తర రామాయణం లోని శ్రీరామ చరిత్రను ఆధారంగా జాషువా గారు కుశలవోపాఖ్యానము రచించారు.
8. ఈ క్రింది పద్యము ఏ కావ్య ఖండిక లోనిది?
జీవితేశ్వర! మన సుధా జీవితంబు
లంతరించెనె యొక కౌగిలింత లోన?
నాథ!మన వినూతన యౌవనములకపుడ
వయసు నిండెనె యొక్క చుంబనము తోడ
జవాబు:
జేబున్నీసా ఖండిక లోనిది
ఔరంగజేబు తన కుమార్తె ప్రియుడిని చంపేసిన సందర్భంలో జేబున్నీసా విలపిస్తూ ఇలా మాట్లాడుతుంది.
9. జాషువా తొలి కృతి ఏది? ఎప్పుడు రచించారు?
జవాబు:
హిమదామార్కధర పరిణయం (1916)
రుక్మిణీ కళ్యాణం 1919 లో రచన... వారి రచనలు చూస్తే ఇదే మొదటి కృతిగా ఉన్నది. కానీ హిమదామార్కధర పరిణయం 1916 లో వ్రాసారని సమాచారం.
10. నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు ఈ పద్య పాదము ఏ కావ్య ఖండిక లోనిది? ఇతివృత్తం ఏమిటి?
జవాబు:
క్రొత్త లోకం కావ్యం లోని తొలి కోర్కె శీర్షిక లోనిది.
సమాజంలో ఉన్న అనేక అసమానతలు, స్వార్థము, దైవ సృష్టిలో ఉన్న వైషమ్యాలు నివేదిస్తూ సృష్టికర్తను ప్రశ్నిస్తూ, అతని సృష్టించిన అద్భుతాలను కొనియాడుతూ, నవ సమాజ స్థాపన చేయాలని విన్నవిం చుకోవడం ఇతివృత్తం.
ప్రకృతిలో నవ్వు చాలా ఆనందాన్నిస్తుంది, మోసపూరిత ము లేని స్వచ్ఛమైన నవ్వులు మాకివ్వమని కవి అభ్యర్థిస్తాడు.
******
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి