25, నవంబర్ 2020, బుధవారం

వారాంతపు పుస్తక సమీక్షలు శనివారము, 21.11.2020

 


వారాంతపు  పుస్తక సమీక్షలు

మరియు సభ్యుల రచనలు

21.11.2020,  శనివారము


పుస్తక సమీక్ష

కావ్యం: విశ్వంభర

వ్రాసినది: డా. సి నా రె

 

సంవత్సరం: 1980

ఈ రచనకు 1988లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది.

ఈరోజు నేను పంచుకొనేది ముందుమాట, ముద్దుమాట..

 

ఈ విశ్వంభర కావ్యాన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు ఎం.ఏ.స్థాయిలో పాఠ్యగ్రంథంగా నిర్ణయించాయి. దీని మీద ఎం.ఫిల్., పి.హెచ్.డి. పట్టాల కోసం పరిశోధనలు జరిగాయి. దీనిని హిందీలోకి ఆచార్య భీమసేన్ నిర్మల్, ఇంగ్లీషులోకి డాక్టర్ అమరేంద్ర అనువదించారు.

 

ప్రస్తావన

 

ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యంలేని మనిషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి.

 

మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు.

 

అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ - ఇలా ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి!

 

కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతిశక్తుల వశీకరణం - ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి!

 

ఆదిమదశ నుంచీ ఆధునికదశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు.

 

మనిషి సాధన త్రిముఖం - కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగునా ఎదురుదెబ్బలు. క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు.

 

మచ్చుకు కొన్ని

 

ఆరంభం

నేను పుట్టక ముందే

నెత్తి మీద నీలి తెర

కాళ్ళ కింద ధూళి పొర

 

ఆ తెరకు అద్దిన అద్దాల బిళ్లల్లో

మిణుగురులు కనురెప్పలు మిటకరించాయి

చిచ్చుముద్దల్లోంచి

చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు

పాలమీగడల్లా పరుచుకున్నాయి

 

ఇంకా

బురద నవ్వింది కమలాలుగా

పువ్వు నవ్వింది భ్రమరాలుగా

పుడమి కదిలింది చరణాలుగా

జడిమ కదలింది హరిణాలుగా

నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది

నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది

 

వేయి తోటలను నరికిన చేయి

పూయిస్తుందా ఒక్క పువ్వును

ఉర్వీతలాన్ని వణికించిన శక్తి

ఒక్క హృదయాన్ని జయిస్తుందా...

 

ముగింపు

మనసుకు తొడుగు మనిషి

మనిషికి ఉడుపు జగతి

ఇదే విశ్వంభరా తత్వం

ఇదే అనంత జీవిత సత్యం....

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 ******

 

నవల : థ్రిల్లర్ 

రచయిత : యండమూరి వీరేంద్రనాధ్

పరిచయం : కస్తూరి శివశంకర్

Man has an edge over other animals, and conquered the earth with his only power ! That power is called Reasoning                

 

అన్న సూక్తితో నవల మొదలవుతుంది   

ఈ భూమ్మీద మనిషి అనే జీవి, కేవలం ఒకే ఒక శక్తివల్ల మిగతా అన్ని ప్రాణులమీదా ఆధిపత్యం సంపాదించగలిగాడు.  ఆ శక్తి పేరు రీజనింగ్

  

విద్యాధరికి  నా అనే వాళ్ళెవరూ లేరు. తండ్రి మరణించి అయిదేళ్ళయింది. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. ఆమె బి.ఏ. పాసయి, ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంటుంది  ఒక్కటే అమ్మాయి, గదిలో ఒంటరిగా వుంటూ ఆఫీసుకి వెళ్తుందీ అంటే ప్రేమకేం తక్కువ? వచ్చిన చిక్కల్లా ఆమెకి ఇంత ప్రేమని ఏం చేసుకోవాలో తోచడం లేదు.

 

కర్తవ్యం భుజాలమీద వేసుకుని సంబంధాలు చూసే మానేజరు ప్రేమ, కాఫీ ఇచ్చే కుర్రబాసు ప్రేమ, ఇంటికొచ్చి పనులేమన్నా చేసిపెట్టాలా అని అడిగే నౌకరు ప్రేమ, అంతా ప్రేమమయమే.

చూడగానే నచ్చటం, ప్రేమించడం అంత ఆరోగ్యకరమైన ఆలోచన కాదు అని ఆమె నమ్మకం.  

ప్రేమకి అందం ఒక్కటేనా పునాది? లాంటి భావజాలం ప్రతి యువతీ యువకులనూ ఆలోచింపచేస్తుంది 

 

మనసు పుటలలో నిక్షిప్తమైన గుప్త అనుభవాలు జుగుప్స కలిగిస్తున్నవే తప్ప, వర్షంలో తడిసిన భూమి అమాయకంగా వాసన వెదజల్లినట్టు' హాయి కలిగించటం లేదు

 

తల్లి రెక్కలలో వొదిగిన పక్షిలా, అర్థరాత్రి కొమ్మల మధ్య కదిలే గాలిలా ఒక అనుభవం జ్ఞాపకం వస్తే ఎంత బావుండాలి! అదీ థ్రిల్లంటే

 

చిన్నప్పుడు ఆమె ఇంట్లో తల్లి , తండ్రి కొన్నాళ్ళకు  పనిమనిషి ఉద్యోగంలో పై అధికారి వంచన, మోసం .

ఇంటి యజమాని, అతని కొడుకు. అందరూ తమ స్వార్థం కోసం జీవిత విధానానికి అనుగుణంగా కొన్ని "రీజంనిగ్"లు సమకూర్చుకోని ఆమెకి మనుష్యులంటే అసహ్యం పుట్టేలా చేశారు విద్యాధరికి.

ప్రేమ కన్నా పెద్ద స్వార్థం లేదనే నీచమైన సిగ్గుమాలిన భావానికి లోనుచేస్తారు అందరూ 

 

ఆ తరువాత అనుదీప్ కి, ఆమెకి జరిగిన చిత్రమైన సంఘటనలుఆమె శరీరం మీద ఆమెకి తెలియకుండా ప్రేమ లేఖ వ్రాయడం కొంత వినూత్నంగా అనిపిస్తుంది.   ప్రేమకన్నా గొప్ప శక్తి లేదని నిరూపించటం కోసం ప్రపంచం మొత్తం మీద విద్యుచ్చక్తి సరఫరా ఇరవై నాలుగ్గంటల పాటు నిలిపివేయడం కొంత కొత్తగా ఉంటుంది 

 

భార్యగానీ, భర్తగానీ తమ ప్రవర్తనకి అనుగుణంగా కొన్ని వాదనల్ని సమకూర్చుకుంటారు. ఆ రెండు వాదనల 'క్లాషే' - పోరాటానికి నాంది. బాగా కీచులాడుకునే దంపతుల్ని ప్రశ్నించి చూడండి. ఎవరి రీజన్ వారికుంటుంది "ఇద్దరూ కేవలం అవతలివారి ప్రవర్తనవల్లే తమ సంసారం ఇలా తగలబడిందని వాపోతూ వుంటారు." 

 

నాకు దుఃఖాశ్రువులు సముద్రంమీద వర్షంలా కురుస్తాయి. ఒక్కటైనా స్వామిముత్యమవుతుందేమోనని జీవితకాలం ఎదురుచూస్తూ వుండగా ఇంటి ప్రాంగణంలో వృద్ధాప్యం నిలబడి పరిహసించింది

 

 వంటి సంభాషణలు ఆసక్తిగా అనిపిస్తాయి 

 

నవల చదువుతున్నంత సేపు నేను ఉద్వేగం, కథానాయిక పాత్ర పట్ల ఒక దీనమైన వేదన అనుభవిస్తాము... కానీ, జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవానికి సంబందించిన రీజనింగ్ లో చాలా గొప్పగా అన్వయం చేయడం ఎంతో వైవిధ్యంగా అనిపిస్తుంది పుస్తకం మొత్తం చదివాక హృదయమంతా ఆ వేదన అలాగే ఉంటుంది 

 

ప్రేమకు పది నిర్వచనాలు...మనుష్యులలో ఉండే వైషమ్యం, కౌటిల్యం,  స్వార్ధానికి దర్పణంలా కనిపిస్తాయి ఎన్నో సన్నివేశాలు 

 

ఈ పుస్తకం గురుంచుయ్ అఖ్రి పేజీలో యండమూరి వ్రాసే మాటలు

 

ప్రతీ రచయితా ఎక్కడో ఒకచోట స్ఫూర్తి పొందుతాడు.

ప్రకృతి, ఒక సాయంత్రం, ఒక పుస్తకం, ఒక సంఘటన, ఒక వ్యక్తి... ఇలాటివేమైనా ఆ స్పూర్తికి కారణం కావచ్చు. కాబోయే రచయితలు తమ నవలలు ప్లాన్ చేసుకోవటానికి ఇలాటి చివరిమాటలు ఉపయోగపడతాయని నా ఉద్దేశ్యం. "జయభారత జనయిత్రీ" అన్న దేవులపల్లి పాట "రాక్షసుడు" నవలకి ప్రేరణ అని, ఆ పుస్తకంలో కూడా వ్రాశాను. అయితే అందులో ఒక చిక్కుంది. ఇలా చివరిమాటలు వ్రాయొద్దని తణుకునుంచి ఒక అభిమాని ఉత్తరం వ్రాశాడు. "వీరేంద్రనాథ్. ఈసారి తెలుగులో వ్రాసినదాన్నే కాపీ కొట్టాడట. దేవులపల్లి అనే ఆయన వ్రాసిన నవలని తిరగ వ్రాశాడట-" అని ఎవరో ప్రచారం చేయటం దీనికి కారణం చాలా ఇరిటేషన్ కలిగింది. అయనెస్కో వ్రాసిన "దున్నపోతులు" అన్న అబ్సర్డ్ నాటకం గుర్తొచ్చింది. "అబ్సరిడిటీ" గురించిన అంకురం మనసులో అప్పుడు పడి వుండొచ్చు బహుశా.

 

కొసమెరుపు ఏమిటంటే మీలో ఎవరైనా "ముత్యమంత ముద్దు" సినిమా చూసి ఉంటే, అది థ్రిల్లర్ నవల అన్నమాట

 

ఈ వారం సాహితీ సమీక్షలో భాగం గా శ్రీ రమణ గారి కధ మిధునం మీకు పరిచయం చేయాలి అనుకుంటున్నాను. ఈ కధను చాలా కాలం క్రితం గ్రంధాలయం లో చదివాను. 2012 లో తనికెళ్ళ భరణి గారు శ్రీ బాలసుబ్రహ్మణ్యం , శ్రీమతి లక్ష్మి గార్లతో సినిమాగా కూడా రూపొందించారు. శ్రీ రమణ గారి రచనను ఏ మాత్రం మార్చకుండా ఒక చక్కని దృశ్య కావ్యంగా రూపొందించారు తనికెళ్ళ భరణి గారు. {ఈ కధ చదివినప్పటికి, సినిమా చూసినప్పటికి నాకు ద్రాచ్చారమ్ తో పెద్దగా పరిచయం లేదు కానీ ఈరోజు సమీక్ష కొరకు మళ్ళీ చదువుతుంటే మన విష్ణు, వాళ్ళ ఊరి పోస్ట్ మెన్, విష్ణు వాళ్ళ పనిమనిషి పళ్ళాలు, తరవాణి బామ్మగారు అందరు కళ్ళముందు కదిలారు}

 

అక్క మిధునం అని ద్రాచ్చారమ్ అటుందేమిటి అనుకోకండి. ఈ కధ మొత్తం వినిపించే ఒకే ఒక ఊరు పేరు ద్రాక్షారామం . ద్రాచ్చారమ్ సంబంధం తప్పిపోవడం వలనే ఈ అప్పదాసుగారిని చేసుకోవలసి వచ్చింది అనీ, వాళ్ళు వడ్డాణాలు అరవంకీలు అన్నీ పెట్టేవాళ్లు అనీ తరచుగా బుచ్చిలక్ష్మి అప్పదాసుని ఆటపట్టిస్తూ ఉంటుంది. చివరాఖర్లో తూచ్ అసలు ద్రాచ్చారమ్  సంబంధంరాలేదు అని చెబుతుంది అనుకోండి అది వేరే విషయం.

****** 

కధ పేరు :: మిధునం

 

రచయిత : శ్రీ రమణ గారు

ఈ కధలో నాయకుడు అప్పదాసు 

కధనాయకురాలు బుచ్చిలక్షి  

 

కథ ఇతివృత్తం :

 చాలా సామాన్యమైనది ఆరు పదుల వైవాహిక   బంధం పెనవేసుకున్న చక్కని భార్యా , భర్తలు వీరిద్దరు.    వృద్ధాప్యంలో ఉన్న దంపతులు (అప్పదాసు, బుచ్చిలక్ష్మి),

వారి పిల్లలు తమ ఉద్యాగాల కోసం మరెక్కడో బతుకుతున్నపుడు, ఒకరికొకరు తోడుగా గడిపే దైనందిన జీవితంలో ఉండే విశేషాలు, వారి మధ్య ఉన్న అంతులేని అనురాగం, చిలిపి చేష్టలు, కోపతాపాలు, మాటల్లో అనురాగంతో కూడిన విసుర్లు, వారున్న ఇంటిలోని వాతావరణం, భోజన అలవాట్లు మొదలైన వివరాలతో కళ్ళకు కట్టినట్టుండే దృశ్యాలను అతి తేలికగా ఊహించుకొనేట్లు

 శ్రీ రమణ గారు అత్యద్భుతంగా రాసారు.

 

కథ చివర్లో ఈ దంపతులకు వియోగం ఎలా వస్తుందో కూడా చిత్రిస్తూ కథ ముగిస్తారు రమణ గారు. కానీ ఈ కథలో ముగింపు కూడా ఒక కొసమెరుపే. అప్పదాసు బుచ్చిలక్ష్మి ల అన్యోన్యతకి ప్రత్యక్ష సాక్షి మన రమణ గారే మనకి కధలో కనిపించే మూడో పాత్ర.

 

అప్పదాసు గారి పెరటి వర్ణన రాయాలి అంటే అదొక సమీక్ష అవుతుంది. ఈ కధ నచ్చితే మిథునం సినిమా కూడా చూసేయ్యండి. అప్పుడు అప్పదాసుగారి పెరడు చూడొచ్చు.

 

ఇక ఈ కధలో మన కళ్లను మనసును కట్టిపడేసే కొన్ని వర్ణనలు కొన్ని అచ్చ తెలుగు అప్పదాసు గారి  సంభాషణలు.

 

# మిడి మేలపు దొరలకంటే ఏపూట ఫలసాయం ఆపుట ఇచ్చే ఈ కొలువుకన్నా ఇంకేం కావాలి ?

# సత్ సంగత్సే నిస్సంగత్వం అన్నట్టు  మంచి తోడు నీడా నాకు దొరికినంత గొప్పగా  ఆ దేముడికి  కూడా దొరకదేమో బుచ్చీ. 

 

నిమ్మ చెట్టు కి పూత పూస్తే కిష్టప్ప చేతి కొచ్చాడని  మామిడి పిందెలు వేస్తే మాధవుడు మనల్ని ఒకకాపు కాస్తాడని ఇలా చెట్లకి పిల్లల పేర్లు పెట్టుకుని మురిసిపోతూ ఉంటారు  ఆ దంపతులు

 

# అప్పదాసు గారు రోజు తినే అన్నాన్ని ఎంత ఇష్టంగా భక్తితో *తింటారో ఈ వర్ణన లో చెబుతారు  మొదటి ముద్ద స్పటిక లింగం , దానికి నేతి తో అభిషేకం చేసి ఆవకాయ తో బొట్టెట్టి కొత్తిమీర మాల వేస్తా అంటారు ఇంతకముందు అమరావతి కధల్లో అప్పంబొట్లు  భోజన ప్రియత్వం గురించి చెప్పుకున్నాం కదా మన అప్పదాసు గారు కూడా అంతే. 

 

# దప్పళం తెర్లుతుంటే క్షీరసాగర మధనం లా కోలాహలం గా ఉండాలి. పోపు పెడితే తొలకరిలా  ఉరిమి రాచిప్పలో ఉప్పెన రావాలి. అలాగే ఇంగువ ఉదారంగా ఓ రుద్రాక్ష పరిమాణం లో ఉండాలి. కరివేపాకు చెట్టునుండి సరాసరి దప్పళం లో పడాలి లాగే మామిడి టెంకలు అసలు మర్చిపోకూడదు

 

# దప్పళం మరిగినకొద్దీ, రుచి   దాంపత్యం ఏళ్ళు గడచిన  కొద్దీ అందం 

# పచ్చడి లో కొత్తిమీర దూడ మేతలా వేయకు

అసలు విషయాన్ని మింగేయ్యకుండా తత్వాలు పాడే *టప్పుడు తాంబూరా శృతి లా ఉండాలి

# ఎవరి రుచి బతుకులు వాళ్ళవి. ఎంత కొడుకులైతే మాత్రం అకారణం గా వాళ్లమీద వాలిపోకూడదు 

 

# అప్పదాసు గారి హఠాన్మరణం తరువాత  ఒంటరిగా కూర్చున్న బుచ్చి  లక్ష్మి దగ్గరకు వెళ్ళిన రమణ గారితో ఇలా అంటుంది ఆడవాళ్లందరు పుణ్యస్త్రీ గా పోవాలి అనుకుంటారు కానీ నేను మాత్రం మీ మమయ్యే ముందు చనిపోవాలి అనుకున్నాను . వైధవ్యం కోరుకునే వెర్రిదాన్ని అనుకోకు. మీ మామయ్య అంటే నాకు పిచ్చి ప్రేమ. ఆయనకి చీకటి అంటే భయం ఉరుములు అంటే భయం. ఏ అర్ధరాత్రో లేచి ఆకలి అంటే ఆవిరి కుడుములు, కందట్లు పొంగణాలు ఎవరు వేసిపెడతారు ? అందుకే ఆయనే ముందు పోవాలి అనుకున్నాను అంటుంది బుచ్చిలక్ష్మి.

మా లగ్గం కాగానే పల్లకిలో అమ్మవారి గుడికి వెళ్ళేదారిలో మధుపర్కాలకి ముడి వేసిన వేరుసెంక్కాయలు నా దోసిట్లో పోసి తిను బాగుంటాయి అన్నాడు మీ మామయ్య వీడెవడో మంచోడిలా ఉన్నాడు అనుకున్నాను అలా అప్పుడు మొదలయ్యింది.

 

మా  ఇద్దరి స్నేహం

జత కుదిరితే భార్యా భర్తల స్నేహం కంటే మంచి స్నేహం *ఎక్కడ దొరుకుతుంది ?

70 ఏళ్ళు అయినా ఇంకా ఆ వేరు శనక్కాయల రుచి ఇంకా గురుతు ఉందిరా .

లక్కా బంగారం లా కలసిపోయము బంగారం కరిగి పోయింది ఒట్టి లక్కలా నేనున్నాను

 నా విస్తరాకులు అయిపోగానే నేనూ పోతాను.   అని    కన్నీళ్లు పెట్టుకున్న అత్తయ్యని చూసి *ఇన్నీ చెప్పి ఈ ఏడుపు ఏమిటి అంటే అదేరా భడవా జీవితం అంటే అని  బుచ్చిలక్ష్మి

 ఒక బోసి నవ్వు నవ్వడం తో ఈ కధ ముగుస్తుంది.

 

 

మిథునం కథలో కొన్ని పదాలు క్రమేణా తెలుగువారు మర్చిపోయారేమో అనిపిస్తుంది.  (రాచ్చిప్ప , దప్పళం , లాంటి కొన్ని పదాలు)  కొన్ని ప్రాంతాలలో ఉన్న తెలుగువారి భోజన విశేషాలు, అలవాట్లు ఈ కథలో ప్రతి చోట కనపడుతూ ఉంటాయి. కథలోని అన్ని అంశాలు గొప్పవైనా, ఈ కథా కాలం నాటి మన రాష్టంలో కొన్ని ప్రాంతాల్లొ ఉన్న వాడుక భాష పదాలను తరవాతి తరాలకు అందించటం కోసమైనా ఈ కథను చదవాలి. గుర్తు పెట్టుకోవాలి!

ఈ సమీక్షని చదివినందుకు ధన్యవాదాలు. ఏమైనా లోటు పాట్లు ఉంటే సహృదయంతో మన్నించండి

 

రమ, కంకిపాడు.

 ******

 

ఇది ముమ్మాటికీ నిజము

 

పుస్తకం లోని ఏ పేజీ తిరగేసినా ఒక దివ్యమైన సమ్మోహనం హ్రదయాంతరాళంలో పలకరిస్తూ ఉంటుంది.

కవిత్వం వ్రాయాలనుకునే ప్రతి ఒక్కరికీ దివ్యమైన కరదీపిక వంటిదే

 

Page 17

 

ఎప్పుడో ఒక పసిమి కోనలో

పిక్కటిల్లిన క్రేంకారం

అది నా గర్భం ప్రసవించిన షడ్జం

అది నాదక్షోణి స్పందించిన గాంధారం

ఎక్కడో ఏటి గట్టులో

రెక్కలెత్తిన క్రౌంచ కంఠం

 

Page 22

 

ప్రకృతి లోని చలన శీలానికి

పరిణామం మనిషి

జగతిలోని భ్రమణగుణానికి

ప్రతిరూపం మనిషి

 

Page 30

 

ఏ రూపమూ లేని మనసు

నాదంగా ఎగిసింది

పదంగా నడిచింది

రేఖలుగా మెరిసింది

మూర్తులుగా నిలిచింది

అణువణువులోని లయలను

తనువులో ఒలికింది

మదిరాక్షి కళ్ళలో మునకలేసింది

 

Page 46

 

అరుణోదయం ఊరుకోదు

కిరణాలను సారించనిదే

వసంతోదయం ఊరుకోదు

పరిమళాలు పారించనిదే

ప్రసరించే నీరు ఊరుకోదు

పల్లం అంటుముట్టనిదే

ప్రతిఘటించే మనసు ఊరుకోదు

ప్రశ్నలని ఎక్కు పెట్టనిదే

 

ఇలా వ్రాసుకుంటూ పొతే ప్రతి అక్షరంలోని పదునైన కోణమూ, సరళ మాధుర్యమూ ఆస్వాదించాలి 

 

మరీ ముఖ్యంగా ఆ అక్షరాల వెనకాల ఉన్న మనోగణాక్షాలని స్పృశించే ధైర్యం చేయాలి

అదే కదా సినారె ప్రతి మనిషి మనసులో, సమాజంలో ఆశించే జ్వలిత చేతన

 

శివశంకర్ కస్తూరి

 

 

ఇదిగోండి "తప్పు చేద్దాం రండి" అనబడే ఈ వ్యక్తిత్వ వికాసనిధిలో బాగా నచ్చినవి కొన్ని మీ అందరి కోసం.  

ఇలాంటి పుస్తకాలకు సమీక్షలు ఏమి ఇస్తాము మస్తకంలో పొందిన అనుభూతి తప్ప. . .

యండమూరి వీరేంద్రనాధ్ - తప్పు చేద్దాం రండి  లోని కొన్ని ముఖ్యమైన సుభాషితాలు.

 

1. అందరూ మూర్ఖులుగా మారి  ఒక్కడు మారకపోతే సమస్య. ఒక్కడు తొందరగా మారి అందరూ మారకపోతే ఇంకా పెద్ద సమస్య

 

2. గెలుపు అంటే శిఖరం చేరుకోవటం కాదు, చేరుకున్నాక ఏమి చెయ్యాలో తెలియటం

 

3. తెలివి కావాలంటే ప్రతిరోజూ కొంత అవసరమైనది నేర్చుకోవాలి.. జ్ఞానం రావాలంటే ప్రతిరోజూ కొంత అనవసరమైనవి వదులుకోవాలి

 

4. మార్పు నీ మీద ప్రభావం చూపే లోపులో, నువ్వు మార్పుని ప్రభావితం చెయ్యి

 

5. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద ట్రాజెడీ (విషాదం) బాల్యంలో చనిపోవటం కాదు. 75  సంవత్సరాలు బ్రతికి ఏమీ సాధించకపోవటం

 

6. గతం గొప్పదే. కానీ, గతం కన్నా ఈ రోజు గొప్పగా లేకపోతే, ఆ వ్యక్తి జీవన విధానంలో ఎదో తప్పు ఉందన్న మాట  

 

7 పోరాటానికి వెళ్తున్నప్పుడు నీతో పాటు విజయోపన్యాసాన్ని తీసుకువెళ్లటం నీపై నీకున్న నమ్మకం

 

8 ఈ ప్రపంచంలో అందరినీ సంతోష పెట్టాలనుకునేవాడు తానూ సుఖంగా ఉండలేడు. తన వారిని సుఖపెట్టలేడు  

 

9 "అంతా తనదే" అన్నది మమకారము. "అంతా తానే" అన్నది అహంకారము. రెండూ వదలవలసినవే

 

10 పొరపాటుకి క్షమాపణ చెప్పటం పాత పధ్ధతి. పొరపాటుని కరెక్టుగా సరిదిద్దుకోగలగటం కొత్త పధ్ధతి

 

11 వెళ్తున్నప్పుడు విత్తనాలు జల్లుకుంటూ వెళ్తే, వచ్చేటప్పటికి చెట్లు స్వాగతమిస్తాయి   

 

12 గొప్ప విజయం కోసం చిన్న విజయాన్ని త్యాగం చేయటమే "పవర్"

 

తేటగీతి

పాప పుణ్యములరయక పరుల గోజి

గాసిబెట్టి జనంబుల కరుణ లేక

పాలసులుగ జీవింపగ ఫలము గలదె;

మాననీయుల మాటను మరువకెపుడు!

 

తేటగీతి

ఘోర పాపములను జేసి గురుత పాసి

పుణ్యమంతయు గోల్పోయి పూజ్యమవగ

పరితపింపజేయు తుదకు పాతకములు;

మాననీయుల మాటను మరువకెపుడు!

 

తేటగీతి

మానవత్వమొకటె తన మత మటంచు

కరుణ తోడ చరించెడు కల్యుని గన

దేవుడంచు మ్రొక్కదగును దివ్యముగను;

మాననీయుల మాటను మరువకెపుడు!

చల్లా దేవిక.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...