30, నవంబర్ 2020, సోమవారం

కార్తీక పురాణం -15 వ అధ్యాయము, దీప ప్రజ్వలనము

 


కార్తీక పురాణం -15 వ అధ్యాయము

దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట 


అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.


ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విదువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను.


ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను, లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.


సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణపఠనముజేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులుజేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.


ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా, ప్రక్కనొక మానవుదు నిలబడి యుండుటను గమనించి "ఓయీ! నీవెవ్వడవు? ఎందుకిట్లు నిలబడియుంటివి?" అని ప్రశ్నించగా, "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నుంది ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను.అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తినుబండారములను కడుచౌకగా కొని, తిరిగి వాతిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమనుభవించుచుంతివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.


ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము. 


********  

29, నవంబర్ 2020, ఆదివారం

చిత్రానికి పద్యం - 68, 26.11.2020

 


చిత్రానికి పద్యం - 68,

 

""అలవిగాని చోట నధికులమనరాద""

నెండు వేమ పలుకు నేర్చి,,నెలవు

చేయి దాటి పోగ, చెట్టెక్కెనే  మృగ

రాజు,, దార వోసి రాజసమును !

( నెలవు....ఇక్కడ... సన్నివేశము, పట్టు)

ఒక పాదము అంతా  అప్పుపుచ్చుకున్నందుకు.. ప్రాతః  స్మరణీయుడు వేమనకి, మదిలోనే..సాష్టాంగ ప్రణిపాతములతో....

వట్టెం వెంకట రమణ  

 

రుజలు.. అంటే రోగములు, రుగ్మతలు... వాటిని గుణ పరచడానికి (తగ్గించడానికి), రోగికి, చేదుగా ఉండే మందే.. ఇవ్వవలసి రావడం కద్దు.. చేదుగా ఉంది కదా అని మందు చెడు చేయదు..ఇవ్వకుండానూ  మానలేము...  పైగా (చేదే) బాగా పనిచేసి, మంచి చేస్తుంది..

 

నిజానికి... గుణ(ము)పరచే ( తగ్గించే).... గుణము ( లక్షణము) ""చేదు"" అనే గుణానికే  ఉంటుంది.. చేదు యొక్క  నిజ(సహజ మైన సొంత) గుణములు..  చేదు యొక్క సొంత  నైజము.... ఎప్పుడూ సేద దీర్చి, ఉపశమనమే  ఇస్తుంది.. అని..... అనుకుని వ్రాసాను...

 

 

వచన కవిత,

చేదు మందు మింగుడు పడదు,

సూది మందు మరింత కష్టము,

వ్యాధి నివారణకవి  తప్పదు మరి,

చేదు నిజము లెపుడు సేద తీర్చు .

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

పదియు రెండు వఱకు బడికి పోని యతఁడే

యాంధ్ర వాగ్మయమునె నధికరించె

సూరి వడసి బ్రాహ్మి చూడ్కులు చల్లగా,

సృష్టి సేసె కావ్య వృష్టి శిఖల !

 

వింశత్యాధిక అనన్య సామాన్య  వ్యాకరణ,నిఘంటు,గ్రంథ రచనలు చేసి, ఆంధ్ర వాజ్మయానికి.. ముఖ్యంగా  వ్యాకరణపరముగా  దిశా నిర్దేశము చేసిన అపర సరస్వతి..  చిన్నయ సూరి గారికి సహస్ర  ప్రణతులు..

వెంకట రమణ

 


 

ప్రాణమెంత తీపి ప్రాణులకిలలోన

బర్రెలన్ని జేరి భయము గొల్ప

చేవ జచ్చిపోయి చెట్టెక్కె మృగరాజు

బలగమున్న జూడు బలము గల్గు

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

ఆట వెలది

చిన్ననాటి చిలిపి చెలిమి కలిమిలన్ని

దూరమయ్యె నెవరొ దోచి నట్టు

మనసు కలత దీర్చు మధుర క్షణములన్ని

చేదు నిజములెపుడు సేద తీర్చు

 

రమ, కంకిపాడు.

 

 


నీరీక్షణ

 

విశాల నేత్రాల నుండి

అశ్రుబిందువొకటి జారి పలకరించింది

హృదయంలో దాగున్న

బడబాగ్నిని గుర్తుచేసింది

ఆలోచనా తరంగాలలో

విషాద గీతిక నేనున్నానని ఆలాపించింది

చేజారిన కాలం గతం గుర్తు చేసి నవ్వింది

ఒంటరినని ప్రకృతి ఒడి పరిచింది

నీలాకాశం ఛత్రమై సేదతీరమంది

సుదూరంలో తన అడుగుల చప్పుడు హృదయాంతరాలలో ప్రతిధ్వనిస్తుంది

ప్రకృతి ప్రకోపమో విరించి రాతలో దోషమో

ఎదురు చూసిన కనులు

తన రాకై ఎదురుచూస్తున్నవి

కోవూరి

 


 

వచన కవిత

 

గడ్డిపరకలు కలిసి గజమును బంధించు

చీమలు కలిసి పామును హత మొనర్చు

ఎనుములన్ని ఏకమై సింహాన్ని బెదిరించు

ఐకమత్యమున్న ఎడ బలమెంతో హెచ్చు

CA కె మల్లికార్జునరావు

 

 

1) ఆట వెలది

 

ఐక మత్య మున్న నలరారు సౌఖ్యంబు

బలముఁ గలుగు శత్రు భయము లేదు

దున్న లన్ని గలిసి దూకించె సింహాన్ని

చెట్టు నెక్కి రక్షఁ జేసు కొనగ

 

2) ఉత్పలమాల

 

మిక్కిలి శౌర్యమున్నెరపి మెక్కితి నిచ్చటి జంతుజాలమున్

యెక్కడి దున్నలో కలిసి యేకముగా నను ముట్టడించెగా

చిక్కుకు పోయినా నిచట చేవయు ధైర్యము లేకనిత్తరిన్

చుక్కలు చూపుచున్నవిట సున్నముఁ జేయుట ఖాయమిచ్చటన్

ఆదిభట్ల సత్యనారాయణ

 

సీమ తనదయిన యెడల సింహము నయి

యెదిరించగ వచ్చును.   నంది జాతి

నంత కలసి యడవి రాజు నంతు చూడ

గలవు. గుంపుగున్న నెదురు గలదె నిలను.

సూరే వెంకటప్పయ్య.

 

 

వచన కవిత,

ఒక్కటై చిక్కిన,

దక్కదు ప్రాణము,

దక్కిన ప్రాణము చాలును,

తక్కినవి తదుపరి చేజిక్కున్...

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

స్థాన బలిమి లేక సింగ మాయెను

గ్రామ సింహముగ లోక లక్షణమిదే

CA కె మల్లికార్జునరావు

 

 

 ఇటను గాంచగ చిక్కి సింహము

వట వృక్షమెక్కే భీతి తోడను

 వేట మరచిన మృగ రాజైన

ఓటమి నంగీకరించవలె!

 

తలకు మించిన కార్యమైనా

బలిమి తోటే సాధ్యమే కద!

చెలిమి బలిమిగ కలసి మెలిగితె,

తొలగు భయంబు కలుగు  జయంబు.

శిరీష

 

 

మీరక్కడ .. మే మిక్కడ

 

కార్య నిర్వాహకులం అనుచూ అధికారం

సింహం గర్జన లాగా  కొందరు అరుచు వుంటే

విధి నిర్వహణ మా కర్తవ్యం,సంపాదన

ప్రతి నిమిషం సూచనలు ఆదేశాలతో మా పనులకు

భంగం కలిగించొద్దు అని చెప్పు కార్మికులు ఎందరో!

స్నేహమే  అందరితో పనులు చేయించు మార్గము.

జి మురళీ మోహన్ రావు

 

 

తేటగీతి

బుద్ది, కండబలముల సమృద్ది నాది

రాజనీతి దెల్సిన మృగరాజు నేను !

నాది ఓటమి భీతియు గాదు నేడు

మందబుద్దుల గుమిబలమస్థిరంబు!!

డా. నాగులపల్లి

 

 

ఒక్కలా ఉండదుగ కాలం

దున్నలే తరిమెను సింగాన్ని

ఇత్తఱి ని ఎపుడు చేతురో

మగువలు నేటి కీచకులను...

 

ఉష.

 

 

సింహగర్జనలాగా కొందరు

అధికారులు ఆరుచు చుండ

విధినిర్వహణ మా కర్తవ్యం,

మా సంపాదన కూడా. మీరక్కడా ,మేమిలా అయితేనే పనులు సవ్యంగా పూర్తి చేయగలం అని చెప్పే శ్రామికులు ఎందరో .

జి మురళీ మోహన్ రావు

 

 

ఆటవెలది

 

పిరికితనము వలదు బెదురెరుగక సాగు

నీదు శక్తి మరచి నీరసించ

తగదు వెరపు వీడి ధైర్యము కల్గిన

గెలుపు నీవశమగు గేదెలెంత

రమ, కంకిపాడు.

 

 

తేటగీతి

 

స్థాన బలిమియె గాని స్వశక్తి కలదె!

నేర్పు లేని దున్నలు వేట నియతి నెరిగి

ఐకమత్యము నెంచగ నాయుధముగ

శిరము వంచక తప్పదు సింగమైన

 

వాణిశ్రీ నైనాల

 

 

ఉత్పలమాల

బుద్దిబలంబు తోడయిన పుష్టికి రాజుగ రాజ్యమేలులే

బుద్ధిగ శాంతుడై మసలు  బొత్తిగ నెగ్గని తావులందహో

బుద్దిబలంబుచే నొదిగె బొర్రల గేదెల గుంపు బల్మికిన్

వద్దిక వేటయే యనుచు వాటము నెర్గిన బాటనెంచెలే

 

డా. నాగులపల్లి

 

 

కందము

సింగము యెద్దుల జూడగ

రంగములో దిగక బోగ రక్షణ కొరకై

మ్రింగుచు తా పలు గుటకలు

కంగారుగ చెట్టునెక్కె కష్టము పాలై!!

 

కందము

పిచ్చెక్కిన సింహమొకటి

వచ్చెను యెద్దుల నడుమకు పరుగిడ కనె తా

చచ్చెను నేననుచు బలికి

ముచ్చెమటలు బట్టగానె ముడిచెను తోకన్!!

 

కందము

రోజులు తోడుగ లేకను

రాజైనను తప్పదిలను రక్షణ కరువౌ

రాజీ పడుచూ బ్రతుకున

పేజీలను పెంచవలెన ప్రియముగ నెపుడున్!!

 

కందము

అలసిన సింహము యొక్కటి

తెలియక తానొచ్చి జేరె యెద్దుల నడుమన్

తెలియగ నిజమును పాపము

కలబడకనె చెట్టు నెక్కి గండము దాటెన్!!

 

కందము

దారిని దప్పిన సింగము

చేరగ నొక బర్రె మూక చెమటలు బట్టెన్

జోరుగ భలె పరుగులిడుచు

జారు కొనెను చెట్టు పైకి జాగరుకతగా!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

మీరక్కడ .. మే మిక్కడ

 

కార్య నిర్వాహకులం అనుచూ అధికారం చలాయిస్తూ సింహగర్జన లాగా

కొందరు అరుచు చుంటే 

 

విధి నిర్వహణ మా

కర్తవ్యం, మా సంపాదనలు .

ప్రతి నిమిషం సూచనలు,

ఆదేశాలతో మా పనులకు

భంగం కలిగించొద్దు అని

చెప్పు కార్మికులు ఎందరో!

స్నేహమే  అందరితో

పనులు చేయించు మార్గము.

జి మురళీ మోహన్ రావు

 

 

సీసము

కానలందు ప్రభువై గరిమ జూపెడి మృగ రాజు వెలుగునె రారాజు వోలె

భయమెరుగని మృగపతి దృఢమగు మహిషమును వేటాడ విస్మయము బరచి

వన మహిషములన్ని పాటవముగ నెదిరించి నిలువరింప మృగరిపువగు

సింగ మదిరిపోయి చెట్టునెక్కి తన ప్రాణములు నిల్పుకునె ననాదరముగ

 

తేటగీతి

అల్పజీవులయిన తా మనల్ప శక్తి

జూపి యైకమత్యము తోడ చోద్యముగను

క్రౌర్యము నెదిరించి నిలిచె క్షౌణినందు

కలిసికట్టుగ యత్నింప ఘనత గూరు

వెంకట్.సి హెచ్

 

 

తేటగీతి

ఆత్మ రక్షణ మెపుడైన నవసరమని,

దర్పమును వీడి సింగము దారి మార్చి

చింత నొందుచు వేగమే చెట్టు నెక్కె,

యెనుము లైక్యతా శక్తుల నెఱుక పఱచ

దండు గాకూడి ముప్పును తలగ బెట్టె

 

అవళూరు సీత

 

 

అడవికి రారాజు

జంతువులకు మృగరాజు

అడవి జీవులకు అధిపతి

నేల విడిచి సాము కి సై

మోడువారిన చెట్టు పైకి సై సై

చుట్టూ చేరిన గేదెలతో ఆటకి నై నై

గుహని ఒదిలి అడవి నొదలి

దారి తప్పి మైదానం ఒప్పి

తనది కాని జీవన విధానం

గర్జనలు లేవు గజ్జెల చప్పుడు తప్ప

శాసనాలు లేవు శిరోధార్యాలు తప్ప

బలము లేదు బలహీతలు తప్ప

తనది కాని ప్రదేశం లో

ఎట్టితో సమానం

మృగరాజైనా మహారాజైనా...............

కోవూరి

 

ఆటవెలది

సింహరాజుయెక్కెచిరుతలా తరువును

పశుల మందజూచి పాకెననియు

మందబలము వలన మంచియే జరుగని

బర్రెలన్ని మదిన భయము వీడె

హేమలత

 

స్వేచ్ఛ

 

పుట్టినప్పుడు మహాలక్ష్మి పుట్టిందన్నారు

మురిసిన నాన్న, ఊరంతా భోజనాలెట్టారు,

నా తల రాత బాగోలేక అమ్మ పోయినప్పుడు

దరిద్రపుగొట్టు దానివన్నారు,

మసిబారిన నాన్న చావు భోజనాలెట్టారు,

మరలా ఇంట్లో దీపం వెలిగింది

నా ఒంట్లో సత్తువ తగ్గింది

ఉషస్సులా వెలిగే నేను మకిలి పట్టి చీకటినయ్యాను

చూసే చూపులను బట్టి రక్షణ కవచం ఏర్పరుచుకున్నాను

అంతరంగాలలో ఉదయించే ప్రశ్నలకు

జవాబులు నేనే ఇచ్చుకున్నాను నేర్చుకుంటున్నాను.....

సమాజంలో బ్రతకటం ఎలా అని

తల్లీ నిలువెల్లా నీడ లేకపోయినా

యుక్తవయస్సులో తుమ్మమొద్దుకు కట్టపెట్టి 

నామెడలో పలుపుతాడు కట్టపెట్టాడు నాన్న

తన గొంతుక పై కత్తి పెట్టుకొని...

నాన్న అనే మగాడు పోయి, మొగుడు అనే మృగాడు వచ్చాడు

బానిసలా బ్రతకమన్నాడు

ఇరుసు కింద నలిగే కందెనవ్వమన్నాడు

నేపెట్టిన కాటుకనే దిద్దుకోమన్నాడు

నే కన్న నలుసుకి తనే పేరెట్టాడు

విసిగిన జీవితానికి చరమాంకం పాడి

ఆశించిన స్వేచ్ఛను వెతుక్కుంటూ

అవని ఆవలి దిక్కుకు పరుగులు పెట్టాను

నిరాశ వెక్కిరించింది నిస్పృహ ఆవరించింది....

అయినా నా కొత్త ప్రపంచం కోసం

అడుగులు నిడివి పెంచి నడక సాగింది

నేను కలలు కన్న నా స్వేచ్ఛా సామ్రాజ్యపు దిశ వైపుగా........

కోవూరి

 

 

మత్త కోకిల 1

ఐకమత్యముతోడ ప్రౌష్ఠము స్థైర్యమున్ జనియుంచగా

చాకచక్యముగా మహీరుహశాఖపై వెఱ సింహమే

నైకభేదములౌ విలాసమునన్ విచారపు గేహముల్

భీకరప్రవిదారణంబున విభ్రమమ్ములు ప్రాణముల్

 

మత్త కోకిల 2

తగునానీకిది యివ్విధంబుగను చింతాక్రాంతమైయుండఁగన్

జగడంబుల్ వలదంటు యుక్తుమగు ధీసంకల్పచాతుర్యమున్

మృగరాజా విధి చిత్రమే ! భవము ప్రామీత్సమ్ములే సత్యమై

జగదాధారమపూర్వమై వికలమాశాపాశముల్ శంకరా !

 

కస్తూరి శివశంకర్

 

 

మనిషి - మానవత్వం

మనుషు లెపుడు నరుకుట మానలేదు

అడవులన్నియు మెండుగ నంతమొంద

క్రూర మృగములెల్ల పట్టె పల్లెబాట

బితుకు బితుకంటు బతుకగ   పల్లెజనులు

ఆటవిడుపుగ నొచ్చె పిల్లసింగము పొలము

చెంత చెట్టు నెక్కె భీతి తోడ

శరణ మొసగెను మన మంచి గేదెలు

దిగియొచ్చి, దరిచేరి నాడుకొమ్మని జాలి జూప

భయము, బిడియము బక్కజిక్కిన  బుల్లి సింగము

వందనాలు జెప్పి, వడిగ వడిగ జారుకొనియె.....

జంతుజాలము మేలు మానవత్వమన్న

మనిషి నేర్వగ వచ్చు గొప్పగా పశుల జూచి........

 

పి.ఎల్. నాగేశ్వరరావు

 

 

తేటగీతి

బలము యున్న నిస్సారమే బలిసి యున్న

సింగమే భీతి తోడను తుంగ గరిచె

కండ పుష్టిగ కాయంబు కలిగి యున్న

అనువు గాని చోట నిలువ అదును గాదు

పద్మలత


15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...