5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

పుస్తక సమీక్ష, శనివారము 23.01,2021



 పుస్తక సమీక్ష,  శనివారము 23.01,2021

 

నేటి మన ప్రణాళికలో భాగంగా మన సాహితీవేత్తలని స్మరించుకునే అవకాశం. ఈ శతకాలలో మీకు నచ్చిన పద్యం ఉదహరించండి

ఔత్సాహికులు మీకు నచ్చిన కధలు, నవలలు, కథానికలు పరిచయం చేయగలరు

****

సంస్కృత నుండి తెలుగు భాషలోకి అనువదింపబడిన శతకములలో,  భర్తృహరి శతకత్రయం (నీతి, శృంగార,వైరాగ్య )  అధిక ప్రచారంలో ఉంది.

నాకు మీ పోస్ట్ చూడంగానే చిన్నప్పుడు  బట్టీ పట్టిన, నాకు నచ్చిన  నీతిశతకం లోని పద్యం గుర్తుకు వచ్చింది.

ప్రపంచంలో , విద్యకు సమానమైన ధనం మరొకటి లేదు అని చాటి చెప్పే పద్యం.   

మీ అందరికీ తెలిసే ఉంటుంది  నేను ఉదహరించక్కరలేదు  ( విద్యనిగూఢ గుప్తమగు విత్తము )

ఎవరికీ కనిపించకుండా రహస్యంగా ఉండే ధనం .. ఎవరూ అపహరించుకోలేని ధనం .. ఎంత చక్కని భావం ..

కాలములు మారుతున్నా .. జీవన విధానములు మారుతున్నా సర్వ వేళలా  వర్తించే పద్యం.. 

 

 

కుమార శతకములో ఈ రెండు శ్లోకములను పిల్లలకు.,

తల్లిదండ్రులు , పెద్దలు చక్కగా వివరించి చెబితే వారికి ఎంతగానో ఉపయోగిస్తాయి.

 

మంచి జ్ఞానమును సంపాదించుకుంటూ సత్సంగములతో

అటువంటి జ్ఞానమును పంచుతూ , పెంచుకుంటూ కీర్తి తెచ్చుకోవచ్చు . ధనమును సంతృప్తిగా సంపాదించు కోవచ్చు.

చెప్పిన పనులన్నిటినీ సవ్యముగా  నిర్ణయించిన సమయంబులో చేస్తూ  తెలివైన వారిలో తెలివి కలవాడిగా పేరు తెచ్చుకోవాలి .

జి మురళీ మోహన్ రావు

 

 

కుమార శతకం నుండి రెండు పద్యాలు

పనులెన్ని కలిగి యున్నను దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై

వినగోరుము సత్కథలను; కాని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!

 

ఓ కుమారా! నీకెంత తీరికలేకున్ననూ, ఎన్ని పనులున్ననూ, మంచి బుద్ధిగలవాడివై ప్రతీ రోజు జ్ఞానమునిచ్చే మంచి కథలను వినవలెను. నీవట్లు చేసినచో నీ ప్రజ్ఞ పెరిగి, నిన్ను బుద్ధిమంతులందరూ సంతోషముతో మెచ్చుకొంటారు.

 

పెద్దలు విచ్చేసినచొ బద్ధకముననైన దుష్ట పద్ధతి నైన్

 హద్దెరిగి లేవకున్నన్ మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!

 

ఓ కుమారా! మన ఇంటికి పెద్దలు వచ్చినచో మర్యాదగా లేచి నిలబడవలెను బద్ధకమువలనగాని, పొగరుతనంతోగాని, పెద్ద చిన్న భేదములు గ్రహింపక మొండిగా లేవకున్నచో, నిన్నందరూ మూర్ఖునిగా పరిగణిస్తారు.

 

 

నృసింహ శతకంలోని  పద్యం

 

సీ ||

తల్లిగర్భమునుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయెడినాడు వెంటరాదు

లక్షాధికారైనలవనమన్నమె కాని మెరుగు బంగారంబు మ్రింగ బోడు

విత్తమార్జన జేసీ విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువ బోడు

పొందుగామరుగైనభూమిలోపల బెట్టి దానధర్మము లేక దాచిదాచి.

 

తేటగీతి

తుదకు దొంగలకిత్తురో? దొరల కవునో?

తేనెజుంటీగలియ్యవా తెరు వరులకు?

భూషణవికాస!శ్రీ ధర్మపుర నివాస !

దుష్టసంహార !నరసింహ ! దురిత దూర.

 

భావం : నరసింహా ! తల్లిగర్భం నుంచే ధనము తేడు యెవ్వడు. పోయేటప్పుడు ఈ ధనము వెంటరాదు.లక్షాధి

కారైన ఉప్పు, అన్నమే తినాలిగాని. బంగారం మింగ లేడు. తేనెటీగలు తేనెను నరుల కిచ్చినట్లు ధనము కూడబెట్టి దానముచేయక, అనుభవింపనివాడు ఆ సొమ్మును దొరలపాలో, దొంగలపాలో చేయును.

హేమలత

 

 

*భాస్కర శతకములోని పద్యరత్నము.*

చంపకమాల

 

చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న , నా

చదువు నిరర్ధకంబు, గుణ సంయుతు లెవ్వరు మెచ్చ, రెచ్చటం

బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు, నిం

పొదవెడు నుప్పు లేక , రుచిపుట్టగ నేర్చునటయ్య  భాస్కరా!

 

 తాత్పర్యం.. .

నలచక్రవర్తి లాగా వంటచేయ ప్రయత్నించి, తగు పాళ్ళలో ఉప్పు కూరయందు వేయకుండిన, ఆ కూర రుచిలేక తినుటకు యిష్టపడము....

అలాగే, ఎంత విద్యా సంపన్నుడైననూ, అందులోని రసజ్ఞత, అర్థం, పరమార్థం గ్రహింపకున్నచో, ఆ చదువు అతనికే కాదు, సమాజానికి కూడ పనికిరాక నిరర్ధకమగునని...భావం..

 

మిత్రులారా...ఒక సారి భాస్కర శతకములోని శ్రీ మారన వెంకయ్య గారి పద్యరచనా చమత్కృతిని గమనించండి.

అన్ని పద్యాలు కూడా  అ..కారాది అక్షరాలతో మొదలయి,హ..కారముతో ముగుస్తాయి. (అ  నుండి    వరకు ).

 

మీదుమిక్కిలి,  దృష్టాంతవర్ణనలతో కూడిన నీతి పద్యాలు యివి...ప్రతి పద్యములోను, సూక్తి...దానికి అన్వయిస్తూ  ఒక ఉపమానము చెప్పడం జరిగినది...యిది మామూలు విషయం కాదు....ఎన్నో కథలు, పురాణాలు, కావ్యాలు, గ్రంధాలు, ఇతిహాసాలు, యింకా అనేక విషయాలపై మక్కువ, పట్టు ఉంటేగాని....శతక పద్యాలలో వాటిని ఉపమానాలుగా చెప్పడం కుదరదు...

 

వేమన, సుమతీ, భాస్కర శతకముల పద్య పరిమళాన్ని కొద్దిగా వెదజల్లే  ప్రయత్నం....

 

 సీసం....

" తప్పులెంచుట దప్పు తాను గొప్పగ నెంచి " వేమ నార్యుని మాట వెన్నుదట్టు

" కీడు చేసిన వాడి గోడు చూడగ రాద " మనసున బద్దెనన్ మరువ గలమె?

" దృష్టాంత వర్ణనల్ " దృష్టి బెట్టగనట మారన వెంకయ్య మాన్యుడయ్యె

మంచి మాటలు విని మంచిగా జీవించు పాడె నెక్కిన గాని బ్రతుగ వలయు....

 

 తేటగీతి

శతక పద్యము లందును శ్రద్ధబెట్టు

నీతి పథమున బయనంబె నిన్నుగాచు

కాడి దప్పించి పరుగిడ గాడిదప్పు

సంస్కరించుకో  జన్మమ్ము  జక్కగాను.

 

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

పుస్తకం: నానీ పంచశతి

రచయిత: ఎన్ సి హెచ్ చక్రవర్తి గారు

భద్రాచలం లో  ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ సేవలనందించి పదవీ విరమణ అనంతరం  ఎందరో ఔత్సాహికులకు వివిధ కవన ప్రక్రియలలో మెళకువలు నేర్పించి తీర్చి దిద్దే యజ్ఞాన్ని తలపెట్టి అవిరామ సాహితీ సేవలో తరిస్తున్నారు.

నానీ పంచశతి లో నాకు నచ్చిన కొన్ని నానీలు మీతో పంచుకునే ప్రయత్నం.

1

 నాలుక

అదుపులో ఉంటేనే రక్ష

ఒరలో ఒదిగిన

కత్తిలా...

మాట విలువ తెలియ చేస్తూ అదుపులో లేకపోతే రక్తపాత మే అని చెప్పకనే చెప్పారు.

 

2

వార్తలన్నీ

తెలుపూ నలుపే!

చానల్సులో

రంగులద్దు కుంటాయి

 

తిమ్మిని బమ్మిని చేసే నేటి మీడియా వార్తలను తారుమారు చేసే తీరును ఇలా ఎండగడతారు కవి.

 

3

తరగతి గదిలో

చక్కగా ఉంటే

పరీక్ష గదిలో

ఈ కష్టాలెందుకు?

విద్యార్థుల ఏకాగ్రత పై చిరు చమక్కు  ఉపాధ్యాయులు కదా ఎంతోమంది విద్యార్థులు అందరిలోనూ కామన్ గా ఉండే తప్పిదం ఇలా చురక వేసారు

 

4

"జోగి జోగి రాసుకుంటే

ఒకప్పుడు బూడిద

ఇప్పుడో

ఎనలేని సంపద"

ఇప్పటి దొంగ బాబాల పరిస్తితిపై ఆవేదన, అశక్తత ఇలా నానీగా...

 

5

చెట్టుకు ఎక్కడిది

అంత సహనం?

మరి_ విత్తును

పొడిగింది_ భూమే!

ఈ రెండు నానీలలో సహనం గొప్పతనాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేసారు

 

6

రాయిది గొప్ప పౌరుషం

ఉలితో కొడితే

కాలికిం దినుండి

నెత్తిపైకి

 

7

అజ్ఞానం

కందుకం లాంటిది

ఎంత గెంటినా

మళ్లీ మనిషి కోర్టులోకే

అజ్ఞానం పై మనిషి అలుపెరుగని పోరును లక్యం(గోల్ లో పడని) చేరని బంతాటతో పోల్చి విజ్ఞత చూపారు.

 

8

"ఎదిగాక తన్నేది

తల్లిదండ్రుల్నేనా?

విత్తనం

మొలకను చీల్చినట్టు"

పిల్లల తీరును సహజంగా జరిగే విత్తు మొలకెత్తడంతో పోల్చి

కవి తన పెద్దరికాన్ని చాటుకున్నారు.

 

9

మంచు పల్లకిలో

ఊరేగాను

కరిగిపోయి

ఒంటరిగా మిగిలాను"

ఊహాల మేడల అశాశ్వతను తెలియచేస్తూ...

 

10

"పూరిళ్లు

జబ్బలు చరిచాయి

ఫైళ్ళలో

మేడ స్థాయి దక్కినందుకు"

కనిపించేది కాగితాల్లో ఉండదు. కాగితాల్లో ఉండేది కంటికి కనపడదు ఈ పరిస్థితికి ఈ నానీ అద్దం పడుతుంది.

 

11

కాలం

కలిసి రాలేదు

న్యాయస్థానంలో

నడిచే కొడుకు దొరికాడు

ఇక్కడ "కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు" అనే నానుడిని  వాడుకుని ఒక వ్యక్తిత్వ హీనుడిని ఇలా పరిచయం చేస్తారు.

 

12

"పాపానికి

ఒంటరి భయం పోయింది

గుడులలో

క్యూలను చూసినాక"

పాపభీతి ఎంతగా పెరిగిపోయిందో వ్యంగ్యంగా ఎలా చెప్పారో చూడండి.

 

13

దానికి

ఏ వాహనమూ

అక్కర్లేదు పుకారు

కనపడని కారు

అంటూ సమాజంలో పుకారు షికారు గురించి చమత్కరిస్తారు కవి.

 

14

పుస్తకం చదివితే

సముపార్జించుకున్న

అజ్ఞానం పోతుందని

వాడి భయం

సాహితీ ప్రియులకు సహజమైన ఏవగింపు  పుస్తకం పట్టని వాడిమీద ఇలా చురుక్కు.

 

15

కొంపంటుకుంది

మతం నిప్పును

ఆర్పేయకుండా

పడుకున్నట్టున్నాం...

మనిషి మనుగడ కోసం పుట్టి మనిషికే కొరివిలా మారిన మతం  మీద మెత్తని అస్త్రం...    మరిన్ని వివిధ అంశాలపై ఆలోచింపచేసే మరిన్ని మధురమైన నానీలు మచ్చుకు...

 

16

ఆ పువ్వు

హృదయం విప్పారింది

మకరంద

దానమీయాలను కోగానే

 

17

ఆపద

పెద్ద పరీక్ష పెట్టింది

నిబ్బరం ఒకటే

ఉత్తీర్ణత

 

18

వ్యామోహానిది

గగన విహారం

తెగపోయిన

పతంగి దారం

 

19

మనం

ఓటమి నంగీకరించం

అవసరమైతే

నెగ్గినవైపు మారిపోతాం

 

20

రాజ్యాంగం

కేకలు పెట్టేస్తుంది

నేతలు చేసే గాయాలకు

తాళలేక

 

21

ఈనాడు ఉన్నారు

దృతరాష్ట్రులు

శిశుపాలురూ

సంజయ విదురులు తప్ప

 

22

పార్టీ

గొంతు మార్పిడి నైపుణ్యానికి

మారీచుడూ

విస్తుపోయాడు

 

23

ఉగ్రవాదం కక్కిన

రక్తం ఆరింది

రాజకీయపు చారిక

అలాగే ఉంది

 

24

*న్యాయా న్యాయాలు

సమంగా ఉన్నాయి...

కోర్టులో త్రాసు

అందుకే కదలదు

 

25

దరిద్రం లక్ష్మి

అక్కా చెల్లె ళ్లే!

వాళ్ళు వరిస్తే మాత్రం

అన్నదమ్ములు కాలేరు

 

26

నాటిన మొక్క ను

చంపడం చూసి

తెల్లబోయి మబ్బు

నీళ్ళు పోయడం మానింది

 

27

పునాదికి కోపం వస్తే

బైట పడుతుంది

పైకప్పు

మిడిసిపాటు బండారం*

 

 

28

వాడిపై అసూయను

తరిమికొట్టా

కంటినిండా

కునుకు పట్టింది

 

29

కోతి కాలంలో

ధర్మం నాల్గు పాదాలు

ఇప్పుడు

మనిషికి రెండే కాళ్ళు

 

30

కొత్త నీటి ఉధృతి

బురదమయం

కొంత వయస్సు రానీ

తేటపడుతుంది

 

31

మొహం ఉంటే

కొండవాగుకు దెబ్బ   తగలదు

వెదురు గాయమై

పాడుతుంది

 

32

నిజం మంచుపల్లకిలో

కూర్చో లేను

భేషజం కోటు

వేసుకుంటే తప్ప

 

33

కోరికల వాన

ముంచెత్తుతోంది

నిరాసక్త ఛత్రం విప్పాను

తడవకుండా...

 

34

ఎర్రలైటును

పట్టించు కోలేదని

కోపంతో రోడ్డు ముఖం మారింది

ఎర్రగా

 

35

"ఎంత తాత్వికుడైనా

సత్యం కోసం

కళ్ళజోడు పెట్టాల్సిందే

ఆనకపోతే"

 

సత్య శోధనకు  ఉపకరణాలు, సాధన కావాలని నర్మగర్భంగా చెప్పారు కవి

 

36

కాలం

తరుము కొస్తోంది

దానికందకూడదనే

కవిత్వం కోటకట్టుకున్నా

 

37

భావాలను

గుచ్చుకుంటూ పోయాను

నానీల మాలగా

గుబాళించింది

 

ఆయన ఆశ్రయించిన కవితాప్రక్రియ ఆశువుగానే చక్కని విరిమాలగా తయారై ఆస్వాదకులకు కవితా సౌరభాలు వెదజల్లింది. మీరు కూడా చదివి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు

వాణిశ్రీ నైనాల

 

 

**********************************************************

 

షడ్జామడ్జకరాడ్జవిడ్జ వసుధజ్జాలాంఛిదజ్జాఖరే

జడ్జటకిట్కిధరఢ్గరేడ్ఘన ఘనఖడ్జోతవీడ్జట్భృమ విఢ్యా

లుఢ్భ్రమలుట్ప్రయట్రయపదా డడ్గ్రరడడ్గ్రరహ

పాదౌటేట్ప్రట టట్రయట్పుట రసప్రఖ్యాత సఖ్యోదయా !

 

***********************************************************


 

సేకరణ మాత్రమే

గొప్ప గొప్ప కవివర్యుల మంచి మంచి పద్యాలు ఉటంకించుతూ, శ్రీ యెర్రాప్రగడ  రామకృష్ణ గారు వ్రాసిన ఈనాటి..ఈనాడు లోని సంపాదకీయం నచ్చింది నాకు..

అందుకే మీ అందరితో  పంచుకోవాలనిపించింది.

(ఆయన స్వయంగా, మా ఇంకో సమూహంలో ఉంచినది.)

వట్టెం వెంకట రమణ

 

కునుకుతోనే కులాసా

(24/01/2021ఈనాడు ఆదివారం సంపాదకీయం, ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమండ్రి)

 

నలతకు గురైన తనువు, కలతకు బలైన మనసు కుదుట పడాలంటే హాయిగా కునుకు తీయడమే చక్కని దారి. ‘సేద తీర్చుచు మనిషికి మోదమొసగు సకల వేదనా జగతి మోహకళ వీవు’ అన్నారందుకే నిద్రను ఉద్దేశించి బులుసు వేంకటేశ్వర్లు కవి. తలంటు పోసి, జుట్టుకు సాంబ్రాణి పొగ వేసి సున్నితంగా జోకొడుతూ అమ్మలు- పోతన నేర్పించిన ‘జోజో కమల దళేక్షణ జోజో మృగరాజ మధ్య...’ గాని, అన్నమయ్య ఆలపించిన ‘జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామ గోవింద’ గాని అందుకుంటే చాలు, పసిపిల్లలు లీలగా నిద్రలోకి జారుకుంటారు. తగాదా తీరిన దరిమిలా దంపతుల కలయిక, తలారా స్నానం ముగించాక పట్టే నిద్ర- ఒకే రాశిలోవి అన్నాడు సుమతీ శతకకర్త బద్దెన. ‘తల కడిగిన నాటి నిద్ర, తరుణుల తోడన్‌ పొలయలుక నాటి కూటమి వెల ఇంత! అని చెప్పరాదు’ అని తేల్చాడు. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకొని మునిమాపు వేళ ఉడుకు నీళ్లతో జలకమాడి, ఒళ్లు తెలియకుండా నిద్రపోతారు శ్రమజీవులు. రతికేళి సైతం సుఖనిద్రకు మంచి సాధనమే అన్నాడు శివరాత్రి మాహాత్మ్యంలో శ్రీనాథుడు. ‘...కాలం బెంతేనియు నిద్ర వోదురు నిశల్‌, సంభోగ లీలావధిన్‌’ అని ఉద్ఘాటించాడు. పద్మినీ పరిణయకర్త యోగానంద కవిదీ అదే అభిప్రాయం. అలసి సొలసి గాఢ నిద్రలోకి జారుకొనే భూలోక వాసుల భోగంతో పోలిస్తే ‘నిద్రాహార వీటీ లసత్‌ భ్రూ విక్షేప సుఖంబు లెరుగని రంభాద్యప్సరల సౌఖ్యం ఏ పాటిది?’ అని పరిహసించాడు. దేవతలు ‘అనిమిషులు’ (రెప్పపాటు లేనివారు) అని గుర్తుచేసుకొంటే- ఈ పోలికలోని సొగసు గిలిగింతలు పెడుతుంది.

 

విరహం నిద్రలేమికి బలమైన కారణం. భారతం అరణ్యపర్వంలో నన్నయ ప్రసిద్ధపద్యం ‘నలదమయంతు లిద్దరు మనఃప్రభవానల బాధ్యమానులై సలిపిరి దీర్ఘ వాసరనిశల్‌...’ అదే విషయాన్ని గట్టిగా సమర్థించింది. అసూయ వైరం పగ భయం... వంటి మరెన్నో కారణాలవల్ల నిద్ర దూరమవుతుందని వైద్యశాస్త్రం చెబుతోంది. ఆరోగ్యం బాగున్నా నిద్ర పట్టక బాధపడే నలుగురిని భారతంలోని ఉద్యోగపర్వం పరిచయం చేసింది. ‘బలవంతుడు పై నెత్తిన బలహీనుడు, ధనము కోలుపడిన యతడు, మ్రుచ్చిల వేచువాడు (పరాయిసొమ్ము కాజేయాలని కాచుకు కూర్చున్నవాడు) కామాకుల చిత్తుడు- నిద్ర లేక కుందుదురు’ అని తేల్చాడు తిక్కన. పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళి తిరిగొచ్చిన సంజయుడు గట్టిగా మందలించేసరికి ధృతరాష్ట్రుడు ఆందోళనకు గురై నిద్రపట్టక విదురుడికి కబురు చేశాడు. విషయం గ్రహించిన విదురుడు ఈ మాట చెప్పి, ‘ఆ నలుగురిలో నువ్వెవరో నువ్వే నిర్ణయించుకో’ అని ధృతరాష్ట్రుణ్ని దెప్పి పొడిచాడు. తాజాగా మాజీగా మారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ‘బాగా నిద్రపోవాలని’ వైద్యబృందం ఆమధ్య సూచించింది. అయితే అందుకు- నన్నయ అరణ్యపర్వంలో చెప్పినవో, తిక్కన ఉద్యోగ పర్వంలో చెప్పినవో కారణాలు కావు సుమా! ఇది ట్రంప్‌ కరోనా బారిన పడినప్పటి సంగతి! బాగా నిద్రపోవడం చికిత్సలో భాగం. సరైన నిద్ర ఆరోగ్యానికి చిహ్నం మాత్రమే కాదు, అది ఆరోగ్య కారకం కూడా... అనేది ట్రంప్‌ ఉదంతం నుంచి గ్రహించవలసిన విషయం. దశావతార చరిత్రలో రామయామాత్యుడు చెప్పిందదే. ‘నిద్ర మానియుండిన జాడ్యంబు మేన పొడము (దేహం రోగగ్రస్తం అవుతుంది) కన్నుగవ యందు అరుణిమ కడలు కొనును’ అని నిద్రలేమికి చెందిన దుష్ఫలితాలను వివరించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిద్రకు ప్రాధాన్యం పెరిగిందన్నది వాస్తవం

 

(ఎర్రాప్రగడ రామకృష్ణ.. రాజమండ్రి )


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...