16, మార్చి 2021, మంగళవారం

14.03.2021, ఆదివారము , పుస్తక సమీక్ష మరియు స్వేచ్ఛా సమర్పణలు

 


14.03.2021,  ఆదివారము ,  పుస్తక సమీక్ష మరియు స్వేచ్ఛా సమర్పణలు

 

పరవస్తు చిన్నయసూరి గారి నీతిచంద్రికాం తర్గతమైన  పద్యసద్రుశమైన యద్భుత గద్య ప్రేరణతో.....

నాకు పద్యమును బోలు జిగిబిగి గల్గు గద్యమునల్లుటయనిన, పద్య రచన వలెనే, మిక్కిలి మక్కువ. ఆ నిమిత్తంబున.....

 

************

సూర్యవంశపు చక్రవర్తి,సగరుని అరువది వేలమంది పుత్రులు, కపిల మహాముని శాపవశమున..పాతాళ లోకమునందు భస్మమై, యుత్తమగతులు వొందజాలక బూడిద కుప్పలుగా బడియుండ, సగరుని మనుమడైన దిలీపుని యొక్క కొమరుడు.. భగీరథుడ ను రాజు... దన తాతలకుత్తమగతులు గల్పించు నొక్క దృఢ సంకల్పముతో,బట్టువట్టి, దివిజ గంగను భువికి దీసికొని రావలయు ననునవసరంబున, గంగను గూర్చి

ఘోర తపమాచరించి, మెప్పించి, యామె యుధృతి నుండి భువిని గాపాడు నిమిత్తము,వెండియు శివుని గూర్చి దవము సేసి, యాతనియుం మెప్పించి, యెప్పించి.. తన (శివుని) జటాజూటమునందు మోపి, నిల్పునట్లు సేసెను.

భగీరథుని బ్రార్థననాలించి, శివుండు,గంగ యొక్క నొక్క పాయను భువిపైకి విడువగా, నపుడా గంగ, పాతాళలోకమున బ్రవహించి,యచట నలమటించుచున్న సగరులకు సద్గతులు గలుగజేసినది..

 

ఇట్టి కష్టతరమైన ప్రయత్నముతో గంగను దెచ్చి,దన ముత్తాతలకు సద్గతులు గల్పించెను గాన,నేదేని కష్టసాధ్యంబగు కార్యమును.... భగీరథ యత్నము గ బోల్తురు.

 

అటులనే, సగరుల దరింప జేసి,గంగ,పాతాళమునుండి సముద్రమును జెరేను గావున... , సగరుల నామంబుపై....... సముద్రము, సాగరమ ను బేరును బొంది, యటుల బిలువ బడుచున్నది.

 

ఇతి ...యీనాటి

ఈశ్వరుడీడేర్చిన  భగీరథుని  యీప్సితం......

ఇతి... భగీరథ యత్నం...

 

 

ఏ దేశమేగినా ఎందు కాలెడినా

ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,

పొగడరా నీ తల్లి భూమి భారతిని,

నిలపరా నీ జాతి నిండు గౌరవము.

 

ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో

జనియించినాడ వీ స్వర్గఖండమున

ఏ మంచిపూవులన్ ప్రేమించినావో

నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.

 

లేదురా ఇటువంటి భూదేవి యెందూ

లేరురా మనవంటి పౌరులింకెందు.

సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,

ఓడలా ఝండాలు ఆడునందాక,

అందాక గల ఈ అనంత భూతలిని

మన భూమి వంటి చల్లని తల్లి లేదు

పాడరా నీ వీర భావ భారతము.

 

తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగా

సౌర్య హారముల్ రాజచంద్రులర్పింప

భావ సూత్రము కవి ప్రభువులల్లంగ

రాగ దుగ్ధముల్ భక్తరత్నముల్ పిదక

 

దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ

రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా

జగములనూగించు మగతనంబెగయ

సౌందర్యమెగ బోయు సాహిత్యమలర

 

వెలిగినదీ దివ్య విశ్వంబుపుత్ర

దీవించె నీ దివ్య దేశంబు పుత్ర

పొలములా రత్నాలు మొలిచెరా ఇచట

వార్ధిలో ముత్యాలు పండెరా ఇచట

 

పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకూ

కానలా కస్తూరి కాచెరా మనకు.

 

అవమానమేలరా ? అనుమానమేలరా ?

భారతీయుడనంచు భక్తితో పాడ!

 

- రాయప్రోలు సుబ్బారావు గారి జయంతి సందర్భంగా నివాళులు.

 

 


మాకందము(మామిడి పండు) వలె గన్పట్టునని, ఒకవేళ,

మీ కందమునెంచుకొంటిరా శతకమునకు....అంతే...

 

కందము అసలే దురద.. ప్రాస ప్రాకులాటలో...

దూల దీర్చగల..... ప్రాణాలు కడదేర్చగల దుంటరి...

 

కం.

ప్రాస గుదిర్చెడి సడిలో

వేషము దాల్చును విషయమె, వేరే రూపుఁన్;

ప్రాసల 'కంద'కు దండము;

ప్రాస ప్రహసనము దేర్చు బ్రాణముల కడన్ !

( సడి... అలజడి)

 

 

 

మేము-పెహాదు- మా ప్రయాణం

హలో ! పెహాదు , రేపు శిరీషగారింటికి వెళ్ళాలి వస్తావా బాబూ?

నేను నర్సీపట్నంలో ఉన్నాండి బాబూ ? అయినా! ఏ టైఁవు కి ?

పొద్దున్నే 7 !!

అంత పొద్దున్నే ఎందుకండీ ? మధ్యాహ్నం సల్లబాటున బైల్దేర్దాం .. ఏఁవంటారు?

నువ్వు వస్తే రా ,లేపోతే మానే ,సలహాలివ్వకు !! లేదా ఎవర్నైనా పంపు!!

ఆఁ ,బానే సెప్తున్నారు మాటలు, మీరు లెగిసి ,రెడీ అవ్వీటప్పటికి 7ఐతే నాకు సెప్పండి! అయినా నేన్రాకుండా ,మీరు కదిలినా , నాన్నగారు కదల్రండీ, మీరే వేరే బండి మాహాడేసుకు వెళ్ళండి, నేను- నాన్నగారు విడిగా వస్తాం.

వస్తే రా , కోడి_కుంపటి కతలు చెప్పకు !!

  ***

హలో అమ్ములుగారో , నేను నా బేరం వేరేవాళ్ళకి చెప్పి వస్త్నానండి ,కానీ 10అవ్వుద్దీ ,10.30కి బయల్దేరదాం !! కాకినాడ దాకా వచ్చేసా..

టైమ్ కి రాపోతే వెళ్లిపోతాం అని మా పిన్ని చెప్పమంది, తర్వాత నీ ఇష్టం !!

అదికాదండీ , నా బేరం వదులుకుని మీకోసం వస్తుంటే ,ఈ బెదిరింపులేంటండీ ? మీరు మారరా ? ఇంతేనా ,అయినా నేను నాన్నగారికోసం వస్త్నా కానీ ,మీలాంటివాళ్ళతో కష్టవండీ బాబూ!! నర్సీపట్నం నించి బయలుదేరా వచ్చేస్తున్నా!!

ఇప్పుడే కాకినాడ అన్నావ్ , మళ్లీ నర్సీపట్నం అంటున్నావు , ఏమ్ వేషాలుగా ఉందా?

వచ్చేత్నాండీ ,బాబోయ్, కాకినాడలోనే ఉన్నా !!

వేషాలేయక ఇక్కడున్నట్టు రా!!

ఇక్కడున్నట్టు రాడానికి నాది డొక్కు అంబాసిడరు, ఇమానం కాదు, వచ్చేదాకా కాసంత ఆగండి.

**

ప్రసాదు మామ ఇంకా రాలేదేంటమ్మా ??

వస్తాడొస్తాడు !!

 

9 అయింది ఇంకా రాలేదు వాడు , 10 కల్లా మనం బయలుదేరిపోదాం (పిన్ని)

ఓయ్ ,పెహాదు ఎక్కడున్నావ్ నాయనా?

ఆయ్ , దాచ్చారం వచ్చేసానండీ , ఇంటికెళ్లి స్నానం గట్రా చేసి , ఫెష్ అయ్యి వస్తానండీ !!

ఇప్పుడే బాబయ్య నీళ్ళమోటర్ ఆన్ చేసాడు ,వచ్చేస్తే ఇక్కడే చేసేయచ్చు అంటున్నాడు ,మరి!!

మరి బట్టలండీ ?

కారు నడుపుతూ ఉంటే గాలికి అవే ఆరిపోతాయ్ లే !!

యాండమ్ములుగారు ,మీరేంటండీ బాబూ, ఇంకా ఆ శాడిస్ట్ పనులు , మారరా ? మీ పన్లు మీకైపోవాలా ? వేరేవోళ్ల సంగతి అక్కర్లేదా??ఎవడెలా పోయినా ఫర్లేదా, మీరేంటండీ బాబూ !! నాన్నగారి ముఖం చూసి ఊరుకుంటున్నాకదా అని, మరీ ఇంత గీర్మాణం పనికి రాదండి..ఆఁయ్.

ఓయ్ ,నీ నాన్నగారి దండకమ్ ఆపి ,త్వరగా రా!!

టైమ్ 10.20 ..

ఏండోయ్ ,వచ్చేహనండోయ్ !!

నువ్వనుకున్న టైముకే వచ్చావ్ ,లగేజులన్నీ సర్దేయ్ !!

ఏఁవే ,నీది ఇదొక్కటేనా ??

ఇంకోటుంది , లోపల సర్దేసినట్టున్నాడు !

,అందరూ ఎక్కేహారా ? యాండే, నాన్నగారు ఎనకమాల కూసున్నారు?

ఆయనే వెనక్కాల కూర్చుంటానన్నారు ,మేవేం అడగలేదు !!

యాండీ ,నాన్నగారు !! మీకు కంఫర్టుగుందా ,ప్యానెసుకోండి నాన్నగారు , ఇలా ఎనక్కి కూర్చోండి నాన్నగారు , తలగడేవన్నా ,కావాలాండీ? బాగుందా? ముందు కూర్చోరా ??

ఓరి నీ ప్రేమ మండిపోను, కారు కదుల్చుతావా? మమ్మల్ని నడిచి వెళ్లిపోమంటావా?

మీకన్నీ ,తెల్సు కదండీ , నాకు తిండిలేనప్పుడు పిలిచి తిండిపెట్టిన దేముడండీ ,  ఆయన సూడపోతే నేన్లేనండీ !! అందుకే మావోడికి ఈయన పేరెట్టుకున్నానండి, మరేమోనండీ ,మీకో.విషయం తెల్సా!!

పెహాదు.. నాన్నగారి దత్తుడు అని ఒక సినిమా తీద్దాం కానీ ,నువ్వు పోనీ !!

 

నాన్నగారూ ,దారిలో కచేరి సావిడి దగ్గర ఆంజనేయసామి బొమ్మకాడ ఆపలాండీ ?   హా ,ఆపాపు !!

నేను : ద్రాక్షారం లో టిఫిన్స్ కి ఆపు !!  సరేనండీ..

అవిగో కర్ర పెండలాలు ,ఆపు !!

రాంపురం లో బాంటాయి ,అక్కడాపుతా ..

లేకపోవాలి , నీ గుండు రామకీర్తనే !!   అలాగేలేండి !!

ఇదిగో ఇక్కడాపు ,మా ఫ్రెండ్ ఇల్లు ఫోటో తీసుకుంటా!!!

ఇదిగో ఇక్కడాపు ,తాపేశ్వరం కాజాల షాపు !!

అదిగో అక్కడాపు , కొబ్బరి బోండాలు !!!

ఇదిగో ఇక్కడాపు ,సీనరీ బాగుంది !!

మరి రాజమండ్రి బ్రిడ్జి దగ్గరాపుతావా ? ఫోటోలు తీసుకోవాలి !!

 

ఇందాకణ్ణించి ,చూస్తున్నాను ,ఏంటండీ బాబూ ఆ డబ్బా పట్టుకుని ఓ ఫోటోలు ,మీరు సూడని గోదారా? మీరు సూడని బ్రిడ్జా ? ఉత్తినే , స్వీట్స్ కొనుక్కుని రాకుండా ఓ ఫోటోలు !!ఆరిల్లు ,ఈరిల్లు అని ఫోటోలు ,పొలానికి ఫొటోలు ! , ఆఖరికి గేదెలు వేసేది కూడా తీసేట్టున్నారే ? ఏంటండీ ఇలా అయిపోయారు !!

 

కొత్త కెమెరాలే ,మళ్లీ మళ్లీ రాలేమని ఫోటోలు తీస్తున్నా , నీ సుత్తి గోలాపు , కర్ర పెండలాలు కొననే లేదు !!

నాకు ఓ ఆకలేసేత్తందండీ ,మీరేమో ఫోటోలు ,హడావిడీని, నాన్నగారికి నీరసమొత్తాది ,ఇంక శిరీష గారి ఇంటికాడే ఆగుద్ది బండి !!

అయ్యయ్యో ,చెరుకు పానకం పెహాదూ !!

సెరుకు ,లేదు సెత్తా లేదు ,పొద్దెక్కిపోతుంటే చెవిలో రొద.. ఒళ్ళంతా సెమట్లు , సెవులు రక్తాలు కారిపోయేలా ఉన్నాయ్, నేనాగనంతే!!

హమ్మయ్య ,ఇప్పుడు తీస్కోండి అదిగో.అక్కడ ఆంబోతు ,ఇక్కడ గేది ,అక్కడేమో పిచ్చికుక్క, అదిగో ఇంటిముందు ముగ్గు, గేటుపైన పిట్ట.. తీస్కోండి బా ,తీస్కోండి ఫొటోవులు !!

నా బాగ్ ఏది ప్రెసాదు ?

ఏ బ్యాగండీ ?   నల్ల బట్టల బ్యాగు ప్రసాదూ !!    ఇక్కడైతే లేదు ..

అదేంటి ప్రెసాదూ,అరుగుమీద స్తంభం పక్కనే ఉంది కదా?

నాకేమన్నా సెప్పారా? సేతికిచ్చారా?

అక్కడ పెడితే, కార్ లో పెట్టమనే కదా ?

వచ్చేదాకా బుర్ర తినేహేరు , అక్కడే  మరిసిపోయినట్టున్నాను ,ఇన్నేళ్లొచ్చినా మీకు బాధ్యత లేదు, పైగా నాపైన ఎడతన్నారు.. బాగ్ పోతే బాగుండు , ఓ దరిద్రం వదులుద్ధి!!

గేట్ వేసే ఉందిలే , ఏం పోదులే!!

 అమ్ములుగారి బాగ్ ఎత్తుకెళ్ళినోడికి , ఇంటెనకాల చెట్టుకున్న వంద మావిడికాయలు ఫ్రీ అని నేను మనూళ్ళో టముకేయిస్తాలెండి !!

అలా నువ్వు చేయాలి, మీ నాన్నగారి జేబులోంచే పోయిన బట్టలకి డబల్ డబ్బులు లాగుతా..

ఇంత దారుణంగా ఎలా పుట్టారండీ బాబూ మీరు? మీలాంటోళ్ళు పగోళ్ళకి కూడా పుట్టకూడదు, మీకోసం నా ట్రిప్పు డబ్బులకి నీళ్లొదిలి వచ్చాను సూడండి , తడి సెప్పెట్టి కొట్టుకోవాలి.

(పసాదుగాడికి గీర్మాణం ,పొగరు బాగా పెరిగాయి , "మా అన్నారం ఉవాచ").

సమర్పణ: విష్ణుప్రియ

 

 

మనశ్శాంతి అంటె

తరచుగ మోమున పూచే దరహాసం

పరులను విమర్శించుటలో అయిష్టం

గతము చింతించుటకు అసమర్థత

ప్రతి క్షణము ఆనందించు సమర్థత

భవిష్యత్తుపై భయము లేని ధీరత

నమ్మిక ఆధారంగా ప్రవర్తించు నడత

సమస్యలున్నా ప్రేమ ఇచ్చిపుచ్చుకునే శక్తి

తనకున్నది, లేని వాళ్ళతో పంచుకునే బుద్ధి

సదా భగవానునికి కృతజ్ఞతలు తెల్పు భక్తి

CA కె మల్లికార్జునరావు

 

 

 

తెలుగుభాష గురించి ముఖ్యమైన ప్రశ్నలు. 

👉 16 17 శతాబ్దాలలో పోర్చుగీసువారు తెలుగువారిని జంతియో అని తెలుగుభాషను జేంతు అని పిలిచేవారు.

👉 ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు భాషను నికోలస్ కాంట్ అన్నాడు.

👉 ఆంధ్రం, తెలుగు ,తెలుగులో ప్రాచీనమైనది ఆంధ్రము.

👉 ఆంధ్ర శబ్దం సంస్కృత పదం. తెలుగు, తెనుగు పదాలు అచ్చ తెలుగు పదాలు.

👉 ఆంధ్రము-తెనుగు- తెలుగు వ్యాసకర్త జి.ఎన్.రెడ్డి.

👉విద్య, హిమాలయాల మధ్య ప్రదేశాన్ని ఆర్యావర్తము అని పుణ్యభూమి అని అమరసింహుడు అమరకోశంలో చెప్పాడు.

👉 ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రపదం తొలిసారిగా జాతి వాచకంగా కనిపిస్తుంది.

👉 వాయు, బ్రహ్మాండ, మత్స్య పురాణాలలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది.

👉 ఆంధ్రుల గురించి మొదటి సారిగా ప్రస్తావించిన వ్యక్తి మెగస్తనీస్ , ఇండికా గ్రంథం.

👉 అశోకుని 13వ శిలాశాసనం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొదటి శిలాశాసనం.

👉 వరాహమిహిరుడు తన బృహత్సంహిత లో.' కౌశిక విదర్భ వశ్స ఆంధ్ర చేది ' అని ఆంధ్ర దేశాన్ని పేర్కొన్నాడు.

👉 ఆంధ్ర పదం దేశ వాచకంగా కనిపిస్తున్న మొదటి శాసనం మైదవోలు శాసనం.

👉 ఆంధ్రుల నివాసం గురించి మొదటగా బౌద్ధ జాతక కథలలో కనిపిస్తుంది.

👉 నన్నెచోడుని కుమారసంభవంలో ఆంధ్రవిసయం అనే ప్రయోగం కనిపిస్తుంది.

👉 ఆంధ్ర శబ్దం ను భాషా వాచకంగా ఉపయోగించిన తొలి గ్రంథం భరతుని నాట్య శాస్త్రం.

👉 ఆంధ్ర శబ్దం ను భాషా వాచకంగా ప్రయోగించిన తొలి శాసనం నందంపూడి శాసనం.

👉 ఆంధ్ర శబ్దం లో భాషా వాచకంగా ప్రయోగించిన తొలి తెలుగు కవి నన్నయ.(ఆంధ్ర శబ్ద చింతామణి గ్రంథంలో).

👉 పదకొండవ శతాబ్దం నుంచి కవులందరూ ఆంధ్రశబ్దం భాష వాచకంగా ప్రయోగించారు.

 

త్రిలింగ పదం

👉 వాయు పురాణం తిలింగ అనే పదం కనబడుతుంది , టాలిమి త్రిలింగం అని పేర్కొన్నాడు, మూడో గళింగం అని ప్లిని పేర్కొన్నాడు.

👉 తెనుంగు పదాన్ని ప్రయోగించిన తొలి కవి నన్నయ.

👉 జానుతెనుగు అనే పదాన్ని పాల్కురికి సోమన బసవపురాణం లో ప్రయోగించాడు.

👉 తెలుగు పదాన్ని భాషా వాచకంగా ప్రయోగించిన తొలి కవి పాల్కురికి సోమన .  - పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో తెలుగు పదాన్ని ప్రయోగించాడు.

 

నన్నయ _ తెనుంగు ,తెనుగు.

నన్నెచోడుడు_  తెనుంగు.

పాల్కురికి సోమన_ తెనుంగు తెలుగు .

తిక్కన _ తెనుంగు ,తెనుగు.

 

👉తెలుగు శబ్దమే ప్రాచీనమైనది దాని నుండి సృష్టించబడినది త్రిలింగ శబ్దం అని పేర్కొన్నది కొమర్రాజు లక్ష్మణరావు.

👉 తెలుగు త్రిలింగ శబ్దం అని తన ఆంధ్ర భాష వికాసంలో పేర్కొన్నది గంటి జోగి సోమయాజి.

👉చిలుకూరి వీరభద్రరావు త్రిలింగ శబ్దం నుంచి  ( శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ) మధ్య ఏర్పడిన భాసే తెలుగు భాష అని చెప్పడం జరిగింది.

👉 తెలుగు ప్రాకృత శబ్ద భవము అని భావించింది చిలుకూరి నారాయణరావు (ఆంధ్ర భాషా చరిత్ర).

ఆంధ్ర తొలి గ్రంథాలు:-

 జాతి వాచకం -ఐతరేయ బ్రాహ్మణం

దేశ వాచకం - వాల్మీకి రామాయణం,

బాషావాచకం - నాట్యశాస్త్రం.

 

 తొలి శాసనాలు :-

జాతి వాచకం -13వ శిలాశాసనం, అశోకుడు.

దేశ వాచకం: మైదవోలు శాసనం, శివ స్కంద వర్మ.

భాషా వాచకం: నందంపూడి శాసనం, నన్నయ.

 

తెలుగు తొలి గ్రంథాలు:-

తెనుగు -ఆంధ్ర మహాభారతం నన్నయ్య.

త్రిలింగ - ప్రతాపరుద్ర యశోభూషణం ,విద్యానాథుడు.

 తెలుగు - బసవ పురాణం, పాల్కురికి సోమనాథుడు.

 

👉 శాసన విషయ నైపుణ్యం కలిగిన తొలి తెలుగు వ్యక్తి -  కావలి బొర్రయ్య.

👉ప్రాచీనాంధ్ర శాసనాలు పై పరిశోధన చేసిన పండితుడు బూదరాజు రాధాకృష్ణ.

👉 శాసనాలను గురించి లిపి పరిమాణాన్ని నిరూపించే శాస్త్రాన్ని ఏపీ గ్రఫీ అంటారు.

 

ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాలు:-

శాతవాహనులు, ఇక్ష్వాకులు ,పల్లవులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు ,రేనాటి చోళులు ,తూర్పు చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యం.

 

👉అమరావతి శాసనం లో తొలి తెలుగు పదమైన' నాగబు' పదం ఉంది దీనిని1928 లో వేటూరి ప్రభాకరశాస్త్రి గారు కనుగొన్నారు.

 

👉 కొత్తూరు మట్టిపాత్ర శాసనం ఎలమంచిలి తాలూకాలోని విశాఖపట్టణంలో గ్రామం లో

' తంబయ ధామం' అనే తొలి తెలుగు పదం అని 2006 లోపత్రికల ద్వార నిరూపించారు.

 

సేకరణ: ఎం రవీంద్ర నాయక్

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...