4.03.2021 గురువారం
చిత్ర కవనం 94
పై చిత్రానికి మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.
కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రమణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.
సీ"
సప్తాశ్వముల పద స్వర్ణ ఖురపు ధ్వని, పుల్గు కాహళముల పోరునందు
రథచక్ర ధావనా రవళి, లేగల చిరు గంటల సవ్వడి గతులయందు
ఝుళిపించు చర్కోల జులుము, సయ్యాటల గలగల సెలయేటి గళమునందు నుచ్చైశ్రవములిడు నుచ్ఛ్వాసనిశ్శ్వాస రుత, శైత్య మలయ మారుతములందు
నడచి యేమార్చి భాస్కరుండ రుగుదెంచు
సర్వకరములన్ జిందించి శక్తి నింప
జవము నందించ మేల్కొల్పు జగతినిటుల
చేతనంబిడు వేల్పుకు జోతలివియె
భావం: సూర్యుని ఏడు గుర్రాల బంగారు గిట్టల ధ్వని పక్షుల కువకువలలోనూ, రథచక్ర పరుగు శబ్ధం లేగదూడల మెడలో గంటల సవ్వడిలోనూ, కొరడా ఝులిపించిన శబ్దం సెలయేటి సడిలోనూ, గుఱ్ఱాల ఊపిరి శబ్ధం తూర్పు మలయ మారుతంలోనూ కలసిపోయి వినపడకుండా ఏమార్చి భాస్కరుడు వస్తాడు. ఆయన కిరణాలను చిందించి శక్తి నింపి, జగతిని మెల్కొల్పి, జవ సత్వములనిచ్చి, చేతన కల్గుచేయు దైవానికి నమస్సులు.
వాణిశ్రీ నైనాల
వీర నాయక నతడన్ వీర తనము
తోడ పోరును సలిపిన్ దొరక కుండ
శత్రు సేనకు మరలెను శాంత ముగను,
దాచె, చేతిని, బాధను తాను , వాని
నటన గొలుపుగ నెవరికి నైన బాధ
రాధ గోవుయు నెమలియు రంజి లగను
వేణు నాదము వినిపించు వేణు వూది
భక్త జనులకు పాలిట భక్త సులభ
సుంద రమగు,రూ పముతోడ శోభి లగను
రామలక్ష్మి
సన్నివేశం....
క్షతగాత్రుడై యింటికి వచ్చి కోలుకున్న కన్నతండ్రికి తీర ప్రాంతమున జరుగుచున్న యుద్ద సన్నాహాలలో పాల్గొనాలని ఆదేశాలు వచ్చిన తరుణంలో, తిరిగి యుద్ద రంగము వైపు వెళ్ళే సందర్భమున
వలదని ముద్దుల చిన్నారి కన్నీటి పర్యంతమై వారిస్తున్న దృశ్యం...
తేటగీతి
కన్న కూతురు , కన్నీట గాళ్లు కడగి
వలదు వలదని మొఱపెట్టె వారియర్ని ,
తీర భద్రతే ధ్యేయమై తెగువ జూపి
కన్న పేగును వీడుచు కదలి సాగె...
....................................................
వారియర్ ..యుద్ద రంగంలోని సైనికుడు అనే భావంలో ....
పి.ఎల్.నాగేశ్వరరావు
కదన రంగానికి కేగి తిరిగివచ్చిన
తండ్రిని చూచి సంబరమందగ
తన కోసమై బొమ్మలు
తెచ్చి కరమును
వెనక దాచుకొనె యనుచు
పరిగెత్తుకు రాగా
కనిన తండ్రి కరమును కోల్పోయి దాచుకుంటి నని అశ్రువులు రాల్చెన్.
దేవరశెట్టి నాగమణి
సీసము.
సైనిక ధర్మమే సర్వోత్త మంబని దేశ హద్దులయందు దీక్ష తోడ
అహరహరము కడు నప్రమత్తత నుండి దేశ రక్షణజేయు దివ్య పురుష !
యెప్పుడో యొకమారు యేక్షణంబో నీదు మాటలు వినుచుంటి మైమరపున
మానాన్న యెప్పుడు మంచి బట్టలు దెచ్చు? చాక్లెట్లు స్వీటులు చాలినన్ని !
తే.గీ.
వచ్చుచున్నాడు నేడని పరవశించి
కనును గారాల చిన్నది కమ్ర కలల
కుంటి చేతిని చూపగా క్రుందు ననుచు
చేయి దాచెను మరిపింప చిన్ని తండ్రి !
ఆదిభట్ల సత్యనారాయణ
కూతురమ్మ
అప్పుడు:
వచ్చారు నా నాన్న
ఏమేమి తెచ్చారో
ఎగబడి లాగాలా
నాన్న ఇచ్చేదాకా ఆగాలా
అంటూ ఆడిన నా చిట్టితల్లే
అలా
చిన్నప్పటి నుండి నాన్న ..నాన్న
అంటూ నా చుట్టూ తిరిగేది
బడి కెళ్లే రోజుల్లో పలక ,
బలపం,రాతబల్ల కొనిపెట్టా
నాన్న కూర్చో, నేను పాఠాలు
చెబుతా విను అని చెప్పేది కూడా
హఠాత్తుగా జరిగిన
నా ప్రమాదానికి రోజూ
ఆప్యాయత పంచుతూ
పెరుగుతూ స్నేహితురాల్లాగా
కబుర్లు చెబుతూ ,
కావలసినంత పని చేసి పెట్టేది .
కాపురానికి వెళ్ళింది .
ఇప్పుడు
నా కూతురే నా స్నేహితురాలు ,
పంతులమ్మ , అమ్మ , అత్తగారు కూడాను
నేను వెళ్లిన్నప్పుడల్లా మా అమ్మ, అత్తగారి లాగానే
రుచిగా, శుచిగా వంటలు చేసి వడ్డిస్తుంది ।
టాటాలు తీసు కెళ్తుంది
అడిగిన వన్నీ కొనిపెడుతుంది
కానీ
చేతిలో బెత్తం సిద్ధంగా పెట్టుకునేది
చూపుడు వేలు ఊపుతూ
సరైన ఆహారం వేళకి తిని
సమయానికి వ్యాయామం
చేయక పొతే
వీపు విమానం మోతే
అని గట్టిగా చెపుతుంది !
జి మురళీ మోహన రావు
వచనం,
నిన్న గాక మొన్నే వచ్చావు,
నాన్నా అప్పడే తిరిగి వెళ్ళిపోతావా,
చేతి దెబ్బ ఇంకా తగ్గనే లేదు గా నాన్నా,
వెళ్లక తప్పక పోతే, నీ చెయ్యి విరగ్గొట్టిన,
వాళ్ళ కాళ్ళు చేతులూ విరగ్గొట్టు....
చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి
తేటగీతి
కదన భూమిన పోరున కరము బోవ
కన్నబిడ్డను గనుటకు కదలి రాగ
తండ్రి కరమున దాచెను తాయిలంబె
అనెడి యూహ లోన తనయ యాశ తోడ
సంబరమును మోమున జూపె సంతసముగ.
హేమలత
తేటగీతి
సర్వమును మరిచి మనసు సంతసమందు
కళలనుసృజన గావించు కాలమందు
భావ లహరుల నాకట్టు బంధములను
విడిచి పెట్టి లక్ష్యమునకై వెతల నొంది
పురిటి నొప్పుల పడవలె పురుషుడైన
అవళూరు సీత
దొడ్డవాడౌ భరతమాత బిడ్డడితడు ,
కదనరంగాన నిర్భయ హృదయుడితడు !
కన్న తండ్రిగ పసిపాప కనులనీరు
చూడలేని కడు పిరికి వాడితండు !!
డా .నాగులపల్లి
తే.గీ.మా.
తాయిలమ్ము దెచ్చెననుచు తనయ, సంబ
రముగ నెదురేగ తండ్రికి, రణమునందు
తాను క్షతగాత్రుడైన చందము గని, మన
సెటులనొచ్చు నా బంగారు చిన్నితల్లి
యంచు, తలచిన యోధుని యడద బాధ
నిండ, హస్తము దాచిన నిరుపమాన
దృశ్యము, గనినవారు నిరుత్తరులగు
వారణాశి శ్రీలేఖ
ఉ ll
వీరజవాను త్యాగమది ! విక్రమరూపము స్ఫూర్తినీయగా
ధీరతతోడ గాయుచును ! స్థేమము, ధైర్యము చాటుచుండగన్!
క్రూరపు శత్రుమూకలను గూల్చెడి సేనకు భాగ్యమీయమా
వారల తేజముల్ యొసఁగి, భారతమాత పతాకకాంతివై
శూరవరేణ్యుడై నిలిచి క్షోణితలంబున శాంతిసౌఖ్యముల్
పేరిమి రాగముల్ నిలిపి ప్రేమని నిత్యము పంచుచుండగా
మ ll
అకటా ! ఎంతటి వేదనాభరిత దృశ్యంబో కదా ! గుండియల్
వికలమ్మైన మనంబుతో తనయకా ప్రేమార్ధ రాగమ్ములై
యొకసారైనను జూడఁగా ? మనసునే నొప్పించఁగా వీరుడే !
ప్రకటంబాయెను భారతీ ! హృదయముల్ భారంబులౌ చిత్రమై
కస్తూరి శివశంకర్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి